‘అచ్ఛేదిన్కు అడుగడుగునా గండాలే’
Published Mon, Sep 18 2017 4:34 PM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM
సాక్షి,ముంబయిః అధిక ధరలు, పెట్రో ఉత్పత్తులు భారమవడంపై బీజేపీ మిత్రపక్షం శివసేన మోదీ సర్కార్పై విరుచుకుపడింది. అచ్ఛేదిన్ నిత్యం ప్రభుత్వంచే హత్యకు గురవుతున్నాయని తీవ్రంగా విమర్శించింది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడాన్ని కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్ సమర్ధించడాన్ని తప్పుపట్టింది. కేంద్ర మంత్రి తన జేబు నుంచి ఎప్పుడూ ఖర్చు చేయరు కాబట్టే ఇంధన ధరలు పెరిగినా ఆయన సమర్ధిస్తున్నారని వ్యాఖ్యానించింది.
కాంగ్రెస్ పాలనలోనూ ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రకటనతో పేదలను బాధించలేదని పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్లో శివసేన పేర్కొంది. కాంగ్రెస్ హయాంలో పెట్రో ధరలను పెంచినప్పుడు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, స్మృతీ ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్ వంటి బీజేపీ నేతలు ఖాళీ సిలిండర్లతో వీధుల్లో నిరసనలు చేపట్టడాన్ని వారు మర్చిపోయారా అని నిలదీసింది. అధికారంలోకి రాగానే ఆల్ఫోన్స్ వంటి మంత్రులు తమ వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదారిపట్టిస్తున్నారని శివసేన వ్యాఖ్యానించింది.
Advertisement
Advertisement