
అమ్మ కోసం.. ఎయిమ్స్ వైద్య బృందం!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందించేందుకు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ముగ్గురు వైద్యులతో కూడిన ప్రత్యేక బృందం ఒకటి చెన్నై అపోలో ఆస్పత్రికి చేరుకుంది. పల్మనాలజిస్టు డాక్టర్ జీసీ ఖిల్నాని, కార్డియాలజిస్టు డాక్టర్ నితీష్ నాయక్, అనస్థటిస్టు డాక్టర్ అంజన్ ట్రిఖాలతో కూడిన బృందం గురువారం ఉదయమే చెన్నై చేరుకుంది. వైద్యులు జయలలితను పరీక్షించిన తర్వాతే ఏ విషయమైనా చెప్పగలమని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుండటంతో మద్రాస్ హైకోర్టుకు అపోలో వైద్య బృందం, తమిళనాడు ప్రభుత్వం కూడా వివరించనున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీన తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఇప్పుడు కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, మరికొంత కాలం ఆస్పత్రిలోని ఉండాల్సి ఉంటుందని అన్నారు. లండన్లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్ స్పెషలిస్టు అయిన డాక్టర్ రిచర్డ్ బీలే కూడా ఇప్పటికే అమ్మ చికిత్సను పర్యవేక్షిస్తున్నారు.