
సాక్షి, శ్రీనగర్ : జమ్ముకశ్మీర్-పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రాంతానికి నడిచే బస్సును సోమవారం నుంచి పునరుద్ధరించనున్నారు. పూంచ్-రావల్కోట్ రోడ్డు మార్గంలో సరిహద్దు రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఈ బస్సు ప్రయాణిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ బస్సు సర్వీసును గత నాలుగు నెలలుగా నిలిపివేశారు. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ వైపు నుంచి పదే పదే కాల్పులు, మోర్టార్ల ప్రయోగం కారణంగా జూలై 10న ఈ బస్సును నిలిపివేశారు.
అప్పటినుంచి చకన్-దా-బాగ్ వైపు నుంచి సరిహద్దు రేఖ దాటి బస్సు నడవలేదు. అయితే సరిహద్దు రేఖ వద్ద శుక్రవారం జరిగిన సమావేశంలో బస్సు ప్రయాణం, వ్యాపారాలను కొనసాగించాలని రెండు దేశాల సీనియర్ అధికారులు నిర్ణయించారు. వారానికొకసారి ఎల్ఓసీని దాటే ఈ బస్సు రేపటినుంచి పునరుద్ధరణ జరగవచ్చని భావిస్తున్నట్లు పూంచ్ సెక్టార్ ఎల్ఓసీ నియంత్రణాధికారి మొహమ్మద్ తన్వీర్ చెప్పారు. జమ్ముకశ్మీర్-పీఓకే ప్రాంతాల్లో విభజిత కుటుంబాల ప్రయాణ, వ్యాపార అవసరాల నిమిత్తం ఈ బస్సును శ్రీనగర్-ముజఫరాబాద్ రోడ్డు వరకు నడిచేలా 2005 ఏప్రిల్లో ప్రారంభించారు. పూంచ్-రావల్కోట్ మార్గంలో 2006 జూన్ 20న ప్రారంభించారు.