
ఆవులకు ‘రాజ’స్థానం..
నిరుపేదల సంక్షేమానికి నిధులు వెచ్చించడానికి ఆలోచించే సర్కారు.. ఇలా గోవులకు మాత్రం భారీ మొత్తంలో నిధులు ధారపోస్తోందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే, సంరక్షణ లేక వేలాది ఆవులు చనిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన సమావేశంలో రోజుకు ఆవుకు రూ.32, దూడకు రూ.16 చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. అయితే గత నెల జరిగిన భేటీలో దాన్ని దాదాపు రెట్టింపు చేశారు. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి వివిధ రకాల లావాదేవీలపై 10 శాతం చొప్పున ఆవు పన్నును కూడా విధించారు. ఈ మొత్తం సరిగ్గా వినియోగమవుతుందా లేదా అన్నది చూసేందుకు గోశాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిధులను ఆవుల ఆహారం నిమిత్తం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆవుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రం రాజస్తానే కావడం విశేషం.