
సాక్షి, ముంబై: రత్నగిరి జిల్లాలో తివరే డ్యాం ఆనకట్ట తెగిపోవడానికి పీతలే ప్రధాన కారణమని వ్యాఖ్యలు చేసిన జలవనరుల శాఖ మంత్రి తానాజీ సావంత్కు ఎన్సీపీ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. మంగళవారం ఉదయం ఎన్సీపీ కార్యకర్తలు గుంపులుగా వచ్చి సావంత్ ఇంటి ప్రాంగణంలో గంపలో పీతలు తీసుకొచ్చి పోసి నిరసన తెలిపారు. తివరే డ్యాం ఆనకట్ట తెగిపోవడానికి ప్రధాన కారణం పీతలేనని ఇటీవల తానాజీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహానికి గురైన ఎన్సీపీ కార్యకర్తలు మంత్రి ఇంటి ముందు పీతలు పోశారు. మరోవైపు అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు తివరే ఆనకట్టకు గండిపడి దిగువన ఉన్న గ్రామాలు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 19మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment