
ఉదయం 10.30 గంటలకు వచ్చిన ఆమె రాత్రి 7.30 గంటలకు తిరిగి వెళ్లారు.
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. శివకుమార్ ఈడీ కస్టడీ మరో రోజులో ముగుస్తుందనగా ఈడీ అధికారులు ఐశ్వర్యను ప్రశ్నించారు. ఏడు గంటలుపైగా ఆమెను ఈడీ అధికారులు విచారించారు. బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ చేసిన ఐశ్వర్య ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కొచ్చారు. ఉదయం 10.30 గంటలకు వచ్చిన ఆమె రాత్రి 7.30 గంటలకు తిరిగి వెళ్లారు.
ఐశ్వర్య పేరు మీదే ట్రస్ట్ ఫండ్ ఏర్పాటవడంతో పాటుగా 2013–18 మధ్య ఆమె ఆస్తిపాస్తులు విపరీతంగా పెరిగాయి. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐశ్వర్యకు 108 కోట్లు ఉన్నట్టుగా ప్రకటించారు. 2013లో ఆమె ఆస్తుల విలువ రూ.1.09 కోట్లు మాత్రమే. కాగా, 9 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో నేడు శివకుమార్ను స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు.