
నగదు పంపిణీని అడ్డుకునేందుకు ఈసీ చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రలోభాలు, అక్రమ నగదు పంపిణీని అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ మంగళవారం అత్యున్నత స్దాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆర్థిక, భద్రతా ఏజెన్సీల అధిపతులకు చోటు కల్పించారు. ఎన్నికల నిఘాపై బహుళ శాఖల కమిటీగా పిలిచే ఈ అత్యున్నత కమిటీలో సీబీడీటీ, ఈడీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వంటి సంస్థల ఉన్నతాధికారుల భాగస్వామ్యం ఉండేలా ఈసీ చర్యలు చేపట్టింది.
ఇక బీఎస్ఎఫ్ డీజీ రజనీకాంత్ మిశ్రా, సీఆర్పీఎఫ్ డీజీ రాజీవ్ భట్నాగర్, సీఐఎస్ఎఫ్ డీజీ రాజేష్ రంజన్, సహస్త్త్ర సీమా బల్ డీజీ ఎస్ దేశ్వాల్,నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డీజీ అభయ్ కుమార, ఆర్పీఎఫ్ డీజీ అరుణ్ కుమార్, పౌరవిమానయాన భద్రతా బ్యూరో డీజీ రాకేష్ ఆస్ధానా ఈ కమిటీలో ఆహ్వానితులుగా ఉంటారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నల్లధన ప్రభావం, నగదు ప్రవాహాలను అడ్డుకునేందుకు ఈసీ ఈ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది.