
సాక్షి, న్యూఢిల్లీ : కోల్కతాలో వైద్యులపై దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు చేపట్టిన ఆందోళనపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పందించారు. ఎయిమ్స్, సహా పలు ప్రముఖ ఆస్పత్రుల వైద్యులు శుక్రవారం మంత్రి హర్షవర్ధన్ను కలిశారు. వైద్యులు సురక్షిత వాతావరణంలో పనిచేసే పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందని, వైద్యులకు తగిన భద్రతను ఏర్పాటు చేస్తామని తనను కలిసిన వైద్యులకు ఆయన హామీ ఇచ్చారు.
వైద్యుల ఆందోళన అంశంలో ప్రతిష్టకు పోరాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. తమపై దాడిచేసిన వారిపై చర్యలు చేపట్టాలని, తమకు భద్రత కల్పించాలని వైద్యులు కోరుతుండగా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవేమీ చేయకుండా వైద్యులనే విధుల్లో చేరాలని హెచ్చరికలు పంపడంతో వైద్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని వివరించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన తీరు మార్చుకుంటే దేశవ్యాప్తంగా రోగుల ఇబ్బందులు తొలగిపోతాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఈ అంశంపై తాను మమతా బెనర్జీకి లేఖ రాయడంతో పాటు ఆమెతో మాట్లాడతానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment