జాట్ కోటా అమలుపై హైకోర్టు స్టే
న్యూఢిల్లీః బీసీ(సీ) కేటగిరీ కింద జాట్లు, ఐదు ఇతర కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్ననిర్ణయం రాజ్యాంగ చెల్లుబాటును పంజాబ్ హర్యానా హైకోర్టు సమర్ధించినా దాని అమలుపై స్టే విధించింది. జాట్ కోటాపై దాఖలైన పిటిషన్ను కోర్టు జాతీయ బీసీ కమిషన్కు నివేదించింది. 2018, మార్చి 31న కమిషన్ తన నివేదికను సమర్పించనుంది. అప్పటివరకూ జాట్లు, ఇతర ఐదు కులాలకు రిజర్వేషన్ల నిర్ణయం అమలును నిలిపివేసింది. గతంలో 2016, మే 26న హైకోర్టు డివిజన్ బెంచ్ జాట్లు, ఇతర కులాలకు రిజర్వేషన్లపై స్టే విధించింది.
ఈ నిర్ణయం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై డివిజన్ బెంచ్ స్టే ఉత్తర్వులు జారీ చేసింది.అయితే దేశంలో భిన్న భౌగోళిక, సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వేషన్ విధానాల్లో సారూప్యత ఉండాల్సిన అవసరం లేదని హర్యానా ప్రభుత్వం వాదించింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఏ కులానికైనా రిజర్వేషన్లు కల్పించవచ్చని కొన్ని కేసుల్లో సుప్రీం కోర్టు పేర్కొన్న ఉదంతాలను ప్రస్తావించింది.