
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు : చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన ఐపీఎస్ అధికారులు తమవరకూ వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారు. కర్ణాటకలో 45 ఐపీఎస్ అధికారులు ఆస్తి వివరాలు వెల్లడించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. 2018 ఆఖరు నుంచి ఈ ఏడాది జనవరి ఆఖరిలోగా ఐపీఎస్ అధికారులు తమ తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలి. కానీ ఇంతవరకు 45 మంది ఐపీఎస్ అధికారులు వాటిని సమర్పించలేదు. వీరిలో ఎస్పీల నుంచి అదనపు డీజీపీ స్థాయివరకూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు నిర్లక్ష ధోరణి అవలంబిస్తుండటంపై రాష్ట్ర హోంశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ.. డీజీపీ నీలమణిరాజుకు లేఖ రాశారు. ప్రతి ఏడాది ఐపీఎస్ అధికారులు తమ, తమ కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు తెలియజేయాలనే నిబంధన ఉంది. ఈ సమాచారాన్ని నమోదు చేయడానికి ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ అధికారులు అది తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. స్థిర, చరాస్తుల వివరాలు అందించడానికి ఐపీఎస్లు వెనుకంజ వేస్తున్నారని, దీనిపై డీజీపీ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని లేఖలో సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment