వ్యర్థాల నియంత్రణలో భాగంగా పుణేలో దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో కొత్త డంపింగ్యుర్డు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
పింప్రి, న్యూస్లైన్: వ్యర్థాల నియంత్రణలో భాగంగా పుణేలో దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో కొత్త డంపింగ్యుర్డు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్రరూపం దాల్చిన చెత్త డిపో సమస్య ప్రస్తుతం కొలిక్కి వచ్చినట్లు ఉప- ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా పొగవుతున్న చెత్తను ఉరులి దేవాచి గ్రామానికి తరలిస్తున్నారు. వ్యర్థాల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఉరులి గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నారు. అంతేగాక బాధితులు తరచూ అనారోగ్యం బారినపడుతున్నారు.
ఇక్కడి నుంచి చెత్త డిపోను మరో చోటికి తరలించాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గ్రామంలో చెత్తను పోగు చేయడాన్ని అడ్డుకుంటున్నారు. దీంతో వ్యర్థాల భారీ ఎత్తున పోగవుతున్నాయి. గత బుధవారం నుంచి నగరంలోని చెత్త కుప్పలు తెప్పలుగా పడి చుట్టు పక్కల దుర్గంధం వెదజల్లుతోంది. గత బుధవారం నుంచి నగరంలో ప్రస్తుతం సుమారు 4.5 వేల టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి. అనేక చోట్ల చెత్త రోడ్లపైకి వచ్చి చేరింది.
ఈ విషయంపై ప్రజలు కార్పోరేషన్కు ఎన్ని ఫిర్యాదులు చేసినా ‘ముఖ్యమంత్రిని సంప్రదించండి’ అంటూ కార్పొరేషన్ సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ఈ సమస్య గురించి ఎవరికి విన్నవించుకోవాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఉరులి గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంపై స్పందించిన పవార్, చెత్త డిపోను శివారుకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేవించారు. అక్కడ 300 ఎకరాల్లో వ్యర్థాల గుంతను నిర్మిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నందున ఈ విషయమై ప్రకటన చేయలేదని పవార్ వివరణ ఇచ్చారు.