ఎంసీఐ వ్యవహారాల పర్యవేక్షణకు వెంటనే కమిటీని నియమించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
న్యూఢిల్లీ: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వ్యవహారాల పర్యవేక్షణకు వెంటనే కమిటీని నియమించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసి ఏడాది గడువిచ్చినా కేంద్రం సొంత కమిటీని నియమించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘మీరు వెంటనే కొత్త కమిటీని ఏర్పాటు చేయండి. ఇందులో సభ్యులుగా ఉండేందుకు దేశంలో ప్రతిభావంతులు చాలామంది ఉన్నారు’ అని సీజేఐ జస్టిస్ ఖేహర్, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ల ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ కేంద్రం కమిటీ ఏర్పాటుకు ముందుకు రాకుంటే తామే కమిటీని నియమిస్తామని సుప్రీం తేల్చిచెప్పింది. దీంతో కొత్త కమిటీ సభ్యుల జాబితాను మంగళవారం అందజేస్తామని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ కోర్టుకు తెలిపారు.