Medical Council of India (MCI)
-
నకిలీ వైద్యులపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉక్కుపాదం మోపుతోంది. మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మహేశ్ ఆధ్వర్యంలోని బృందం విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది. ఎంబీబీఎస్ డిగ్రీ లేకపోయినా నకిలీ సర్టిఫికెట్లతో ఆసుపత్రులు ప్రారంభించి వైద్యం చేస్తున్నవారిని గుర్తించి చర్యలు తీసుకుంటోంది. మెడికల్ కౌన్సిల్ లోని యాంటీ క్వాకరీ కమిటీ క్రియాశీలకంగా పనిచేస్తూ ఇప్పటివరకు ఏకంగా 400 ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. హైదరాబాద్లోనే 150కిపైగా ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. పదో తరగతితో డాక్టర్.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పదో తరగతి మాత్రమే అర్హత ఉన్నవాళ్లు కూడా వైద్యం చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. వీరు ఎలాంటి భయం లేకుండా దర్జాగా ఆసుపత్రులను నడుపుతూ.. రోగులకు చికిత్స అందించడం చూసి మెడికల్ కౌన్సిల్ సభ్యులే ఖంగుతింటున్నారు. పైగా నిపుణులైన వైద్యులు సూచించే యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు (అమికాసిన్), కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్లు (ప్రొజెస్టిరాన్, సెట్రోరెలిక్స్) వంటివి కూడా వీరి వద్ద పెద్దసంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. పలువురు ఆర్ఎంపీలు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకే విచ్చలవిడిగా హై ఎండ్ యాంటీబయాటిక్స్ను రోగులకు ఇస్తున్నారు. దీంతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరుగుతుందని మెడికల్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. కరోనాకన్నా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. వీటిని అధికంగా వాడితే భవిష్యత్తులో పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి యాంటీబయాటిక్స్ పనిచేయవని, దాంతో రోగి ప్రాణాల మీదికి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఉంటేనే ప్రాక్టీస్ చేయాలి.. ఎంబీబీఎస్ పట్టా పొంది, మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే అల్లోపతి వైద్యం చేయాల్సి ఉంటుంది. బీఏఎంఎస్, బీహెచ్ఎంస్, వేరే ఏ ఆయుష్ కోర్సులు చేసినవారు కూడా అల్లోపతి వైద్యం చేయడం చట్టరీత్యా నేరం. అలాగే ఒక రకం స్పెషలైజేషన్ చేసినవారు వేరే స్పెషలైజేషన్ ప్రాక్టీస్ చేసినా నేరమే అవుతుందని మెడికల్ కౌన్సిల్ అధికారులు చెబుతున్నారు. కొందరు కార్పొరేట్ ఆసుపత్రుల వాళ్లు బిజినెస్ పెంచుకునేందుకు స్థానిక ఆర్ఎంపీలకు కమీషన్లు ఇచ్చి పేషెంట్లను రిఫర్ చేయించుకుంటున్నారని, ఈ విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎంబీబీఎస్ పట్టా లేకుండా.. మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వైద్యం చేస్తూ పట్టుబడితే ఏడాది జైలు శిక్ష.. రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన చికిత్స రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 4,600 సబ్సెంటర్లు ఉన్నాయి. ప్రతి రెండు గ్రామాలకు ఒక సబ్సెంటర్ అందుబాటులో ఉంది. 890 పీహెచ్సీలు ఉన్నాయి. పల్లె దవాఖానలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆర్ఎంపీలపై ఆధారపడకుండా ఈ ఆసుపత్రులకు వెళ్లాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నకిలీ వైద్యులను సంప్రదించి లేనిపోని ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవద్దు. – డాక్టర్ గుండగాని శ్రీనివాస్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ -
ఆందోళనలో ‘విదేశీ’ వైద్య విద్యార్థులు
లబ్బీపేట (విజయవాడతూర్పు): విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారి సర్టిఫికెట్స్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు పాటిస్తున్నట్లు మెడికల్ కౌన్సిల్ అధికారులు చెబుతుండగా, రిజిస్ట్రేషన్లను జాప్యం చేయడం వలన తమ కాలం వృధా అవుతుందని విదేశీ వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్ ఏమిటో అర్ధం కావడం లేదంటూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఇటీవల ఆందోళనకు దిగారు. తమ పీఆర్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో విదేశాల్లో విద్యనభ్యసించామంటూ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్కు వచ్చిన వారి సర్టిఫికెట్స్ నకిలీవనీ నిర్ధారణ అయింది. ఈ విషయంపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పందించింది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్కు వస్తే, వారు చదువుకున్న యూనివర్సిటీల నుంచి జెన్యునిటీ నిర్ధారణ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్కు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన సుమారు 400 మంది విద్యార్థుల సర్టీఫికెట్స్ను ధ్రువీకరణ కోసం ఆయా దేశాల ఎంబసీకి పంపించారు. ఇప్పటి వరకూ వాటి విషయంలో ఎలాంటి ధ్రువీకరణ రాలేదు. ర్యాంకులొచ్చినా పీజీ చేయలేం.. విదేశాల్లో వైద్య విద్యనభ్యసించి, ఇక్కడ ఎన్ఎంసీ నిర్వహించే నీట్లో మెరిట్ ర్యాంకులు వచ్చినా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో పీజీలు చేయలేక పోతున్నట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు నీట్ నోటిఫికేట్ వచ్చిందని, తమ పరిస్థితి ఏమిటో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్ఎంసీ ఆదేశాల మేరకే..విదేశాల్లో వైద్య విద్య చదివిన వారి సర్టీఫికెట్లను జన్యునిటీ నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే పీఆర్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. వారి సూచనల మేరకు తమ వద్దకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి సర్టీఫికెట్స్ను ఆయా దేశాల ఎంబసీకి పంపిస్తున్నాం. యూనివర్సిటీల నుంచి జెన్యూన్ అని నిర్ధారిస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇప్పటి వరకూ 400 సర్టీఫికెట్స్ను అలా పంపించాం. – డాక్టర్ ఐ.రమేష్, రిజి్రస్టార్, ఏపీ మెడికల్ కౌన్సిల్ -
నకిలీ డాక్టర్లకు చెక్..
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకున్నా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా ఆసుపత్రులు నడుపుతున్నవారిపైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంసీ) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్లో అర్హత లేకున్నా ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఆసుపత్రు లకు ఇటీవలే ఎన్నికైన కొత్త మండలి నోటీసులు జారీ చేసింది. సదరు ఆసుపత్రుల్లో యాంటీబయా టిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్డ్ డ్రగ్స్ను గుర్తించి ఈ మేరకు వాటిపై కేసులు నమోదు చేసింది. ఇంకా అనేక చోట్ల నకిలీ వైద్యుల దందాపై దాడులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని మండలి హెచ్చరించింది. పేరుకు ముందు ‘డాక్టర్’ హోదా పెట్టుకున్నా, ఆసుపత్రి అని రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించినా, రోగులకు ప్రిస్క్రిప్షన్ రాసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్ఎంపీల ముసుగులో రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలు 30 వేల మంది వర కు ఉన్నారని ఓ అంచనా. ప్రతీ గ్రామంలో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణీ అవుతూ.. ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, అత్యధిక మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడం, చిన్న రోగాలకు కూడా అధికంగా మందులు రాస్తున్నారని మండలి గుర్తించింది. ఇటీవల నగరంలోని మలక్పేట్ ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ను కలిగి ఉన్న ఒక అర్హతలేని ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ను పరిశీలిస్తే, శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మెరోపెనెమ్ రాయడం చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సహజంగా శిశువులకు ఉపయోగించే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు పెద్దలకు ఉప యోగించేవి కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద లకు వాడే ఇంజెక్షన్లు శిశువుకు ప్రాణాంతకంగా మారతాయి. మలక్పేటలోని ఆ నకిలీ డాక్టర్ మాది రిగానే చాలామంది నకిలీ డాక్టర్లు మానసిక ఔష ధాల ప్రిస్క్రిప్షన్లోనూ ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారని తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీని ప్రదర్శించడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయ డం వంటి దృష్టాంతాలను మండలి తీవ్రంగా తీసు కుంది. మరోవైపు అడ్డగోలుగా అల్లోపతి మందు లను సూచిస్తున్న ఇద్దరు నకిలీ ఆయుష్ వైద్యులను గుర్తించి వారిపై ఆయుష్ శాఖకు లేఖ రాసింది. ఇక నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సాయాన్ని కూడా తీసుకోవాలని మండలి నిర్ణయించింది. నకిలీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా రోగులకు మందులు అందకుండా చేయాలని నిర్ణయించింది. -
విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: గతంలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి పొందిన, 2022 అక్టోబరు 21వ తేదీ లోపు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) గుర్తించిన విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆయా దేశాల్లోనే ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేస్తే దాన్ని ఈ ఒక్క ఏడాది వరకు గుర్తిస్తామని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏ దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా భారత్లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అనంతరం ఒక ఏడాది పాటు తప్పనిసరిగా ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంది. ఈ నిబంధన తాజాగా అమల్లోకి రావడంతో 2022 అక్టోబర్కు ముందే ఇంటర్న్షిప్ విదేశాల్లో పూర్తి చేసిన వారు మళ్లీ ఇక్కడ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అలాంటి అభ్యర్థులు ఈ నిబంధనను సడలించాలని ఎన్ఎంసీని కోరారు. దీన్ని పరిశీలించిన ఎన్ఎంసీ తాజాగా వెసులుబాటు కల్పించింది. తాము అనుమతించిన కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో గతేడాది అక్టోబర్ 21కు ముందు ఎంబీబీఎస్, తత్సమాన అర్హతతో వైద్య విద్య పూర్తి చేసి, ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేసినట్లయితే వారికి ఈ ఒక్క ఏడాదికి సడలింపిస్తామని ఉత్తర్వులు జారీచేశారు. (క్లిక్ చేయండి: 20 కోట్ల ఆఫర్ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..) -
మెడికల్ రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ రిజిస్ట్రేషన్ల ఫీజులను మెడికల్ కౌన్సిల్ భారీగా పెంచింది. వైద్య విద్య పూర్తి చేసినవారు కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే డాక్టర్గా పనిచేసేందుకు అర్హులు. అలాంటి వివిధ రకాల రిజిస్ట్రేషన్ల ఫీజులను సవరించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచే సవరించిన ఫీజులు అమలులోకి వస్తాయని కౌన్సిల్ వెల్లడించింది. అయితే 65 ఏళ్లు దాటినవారు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ తమ మెడికల్ పట్టా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఏడాది కాలానికి రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ ఫీజుకు జీఎస్టీ వసూలు విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. ఒకవేళ ఉండేట్లయితే 18 శాతం జీఎస్టీని అభ్యర్థులు చెల్లించాలి. కాగా, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇప్పటివరకు రూ. వెయ్యి ఉండగా, దాన్ని రెట్టింపు చేస్తూ రూ. 2 వేలకు పెంచింది. అలాగే ఇతర దేశాల్లో చదివి వచ్చిన వారికి ప్రొవిజనల్ ఫీజును రూ. వెయ్యి నుంచి ఏకంగా రూ.5 వేలకు పెంచింది. డూప్లికేట్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ను రూ. వెయ్యి నుంచి రూ. రెండు వేలకు పెంచారు. ఇక ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫీజును రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచారు. ఇతర దేశాల్లో చదివి వచ్చిన వారి ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫీజును రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. డూప్లికేట్ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫీజును రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచారు. కాగా, ఫీజుల పెంపును హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.మహేశ్కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుండగాని శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.కిరణ్కుమార్, బాలరాజు నాయుడు, సన్నీ దావిస్, మహ్మద్ జహంగీర్ ఒక ప్రకటనలో ఖండించారు. పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని వారు కౌన్సిల్కు విజ్ఞప్తి చేశారు. -
రోగులపై ప్రత్యక్ష ప్రయోగాలొద్దు
పీజీ వైద్య విద్యలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మరిన్ని సంస్కరణలను తీసుకొచ్చింది. 23 సంవత్సరాల తర్వాత పీజీ వైద్యవిద్యలో మార్పులకు శ్రీకారం చుట్టిన ఎన్ఎంసీ... 2022–23 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా తీసుకొచ్చిన విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పీజీ కోర్సులు చదువుతున్న వైద్య విద్యార్థులు పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలను నేర్చుకోవడంతోపాటు కోర్సు చివర్లో పరీక్షలు రాస్తున్నారు. దీంతో వైద్యులంతా ఒకే తరహా వైఖరికి అలవాటుపడుతున్నట్లు గుర్తించిన ఎన్ఎంసీ... తాజాగా ఆ విధానాలను సంస్కరించింది. పలు రకాల మార్పులు చేస్తూ సరికొత్త విధానాలను ప్రవేశపెట్టింది. కొత్తగా అమల్లో్లకి తెచ్చిన విధానంతో పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలే కాకుండా రోగితో మెలిగే తీరు, కేసులను నిర్వహించే పద్ధతులు, ప్రయోగాలు తదితరాలన్నింటా నూతన విధానాలను తీసుకొచ్చింది. – సాక్షి, హైదరాబాద్ వైద్యవిద్యలో చివరగా 1998 సంవత్సరంలో అప్పటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సంస్కరణలు వచ్చాయి. ఆ తర్వాత 2018లో మరిన్ని సంస్కరణలను ప్రభుత్వం తీసుకురాగా... వాటిని 2022’–23 సంవత్సరం నుంచి ఎన్ఎంసీ అమలు చేస్తోంది. పుస్తకాల్లోని సిలబస్ ఆధారంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకున్నప్పటికీ... అభ్యసన కార్యక్రమాలన్నీ నైపుణ్యంఆధారంగా చేపట్టేలా వైద్య విద్య సాగాలని ఎన్ఎంసీ ఆదేశించింది. ఈ మేరకు నైపుణ్య ఆధారిత పీజీ వైద్య విద్యను ప్రవేశపెట్టింది. ఆ మేరకు నిబంధనలు పొందుపరిచి అందుకు సంబంధించిన మార్గదర్శకాలను వైద్య విద్యాసంస్థలకు జారీ చేసింది. ఇప్పటివరకు పీజీ వైద్య విద్యార్థులు పాఠ్యాంశాన్ని వినడం (థియరీ), నిపుణుల సమక్షంలో రోగులపై ప్రయోగాలు చేయడం జరిగేది. థియరీ క్లాస్లో విజ్ఞానాన్ని సంపాదించడం, ప్రయోగాత్మకంగా చికిత్స అందించడం, పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించడం లాంటి మూడు పద్ధతులుండేవి. ఇకపై పీజీ వైద్య విద్యార్థి తాను చదువుతున్న స్పెషలైజేషన్ కోర్సుకు సంబంధించి పాఠ్యాంశాలను వినడంతోపాటు నేరుగా రోగులపై శిక్షణలో భాగంగా ప్రయోగాలు చేసే వీలు లేదు. ఎందుకంటే వైద్య విద్యార్థులు చేస్తున్న ప్రత్యక్ష ప్రయోగాలతో రోగులకు ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇవి వికటించడంతో ప్రాణాలు సైతం కోల్పోతున్న ఉదాహరణలున్నాయి. ఈ క్రమంలో ఇకపై విద్యార్థులు పాఠ్యాంశాన్ని అర్థం చేసుకున్నాక మనుషులను పోలిన మోడల్స్ (నమూనా)పై నిర్దిష్ట పద్ధతిలో ప్రయోగాలు జరపాలి. ఉదాహరణకు గైనకాలజిస్ట్ నేరుగా డెలివరీ చేయకుండా గర్భిణిగా ఉన్న మహిళ రూపాన్ని పోలిన బొమ్మపై నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రతి మెడికల్ కాలేజీలో స్కిల్ ల్యాబ్స్ తప్పకుండా ఉండాలని జాతీయ మెడికల్ కమిషన్ స్పష్టం చేసింది. స్కిల్ ల్యాబ్ నిర్వహణ ఆధారంగా కాలేజీలకు ర్యాంకింగ్ లు సైతం ఇవ్వనున్నట్లు తాజా మార్గదర్శకాల్లో పొందుప ర్చింది. స్కిల్ ల్యాబ్స్లో వైద్య విద్యార్థులు నైపుణ్యం ఆధారిత విజ్ఞానాన్ని పెంచుకుంటారు. ఇందులో అన్ని వైద్యశాస్త్రాలకు సంబం ధించిన అన్ని నమూనాలు, ఉదాహరణలతో సహా అందుబాటులో ఉంటాయి. స్కిల్ ల్యాబ్స్ ఆధారంగానే పీజీ సీట్ల కేటాయింపు ఉంటుంది. Ü పీజీ వైద్య విద్యా ర్థులు రోగితో ఎలా మాట్లాడాలి... వారితో ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి తదితర అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా ప్రతి మూడు నెలలకోసారి ప్రతి అంశంపైనా ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. పాఠ్యాంశ పరిజ్ఞానం, రోగితో మాట్లాడటం, ప్రయోగ పరీక్షలు చేసి చూపడంపై ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి మూడు నెలలకోసారి ప్రతి సబ్జెక్ట్పై కొన్ని లక్ష్యాలను చేరుకుంటూ కోర్సును ముందుకు తీసుకెళ్లాలి. పీజీ వైద్యవిద్యలో ప్రస్తుతం 77 సబ్జెక్టులు ఉన్నాయి. అందులో 30 ఎండీలు, 6 ఎంఎస్లు, 19 డిప్లొమాలు, 15 డీఎంలు, 7 ఎంసీహెచ్ల విభాగాలు ఉంటాయి. ప్రతి కోర్సుకు మూడు నెలలకోసారి ఏం సాధించాలో లక్ష్యాలు ఉంటాయి. రోగితో ఎలా వ్యవహరిస్తారన్న దానిపై ప్రతి మూడు నెలలకోసారి పరీక్ష ఉంటుంది. రోగితో ఎలా మాట్లాడాలన్న దానిపై శిక్షణ ఇస్తారు. కఠినంగా ఉంటే మార్పులు చేపట్టే అవకాశం ఉంటుంది. -
జగిత్యాల మెడికల్ కాలేజీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా వాసులకు తీపి కబురు అందింది. జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కల సాకారం కాబోతోంది. వచ్చే వైద్య విద్యా సంవత్సరానికి 150 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభించబోయే జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ కాలేజీ ప్రిన్సిపాల్కు లేఖ రాసింది. లేబొరేటరీ, లైబ్రరీ, ఫ్యాకల్టీ, నర్సింగ్, పారామెడికల్ స్టాఫ్, హాస్టళ్లు తదితర వసతి సౌకర్యాలు ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లా వాసులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. (క్లిక్: పూర్తి కావొచ్చిన సూర్యాపేట–ఖమ్మం రహదారి) -
వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారా?: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: నీట్ పీజీ–21 కౌన్సిలింగ్లో ఏకంగా 1456 సీట్లు ఖాళీగా మిగిలిపోవడంపై సుప్రీంకోర్టు విస్మయం వెలిబుచ్చింది. దేశమంతా డాక్టర్ల కొరతతో అల్లాడుతుంటే ఇదేం నిర్వాకమంటూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) తీరును తూర్పారబట్టింది. మెడికల్ పీజీ ఖాళీల భర్తీకి ప్రత్యేక కౌన్సిలింగ్ చేపట్టేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, అనిరుద్ధ బోస్లతో కూడిన వెకేషన్ బెంచ్ బుధవారం విచారించింది. ‘‘ఒక్క సీటు మిగిలినా దాన్ని ఖాళీగా పోనీయొద్దు. అది మెడికల్ కౌన్సిల్ బాధ్యత. కానీ ఏటా ఇదే సమస్య పునరావృతమవుతోంది. ఇన్ని సీట్లు ఖాళీగా మిగిలిపోతే ఎలా?’’ అంటూ తూర్పారబట్టింది. సీట్ల సంఖ్య, అడ్మిషన్ల సంఖ్య వెల్లడికి కటాఫ్ డేట్ ఉండాలని మేం గతంలోనే తీర్పు ఇచ్చాం. అయినా కౌన్సెలింగ్ మధ్యలో సీట్లను ఎందుకు జోడిస్తున్నారు? ఇలాంటి చర్యలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఎంతటి ఒత్తిడి పడుతుందో ఆలోచించారా? స్టూడెంట్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయమిది. అహర్నిశలూ పట్టుదలగా చదివి పరీక్ష రాయాలి. 99 శాతం తెచ్చుకున్నా చివరికిలా అడ్మిషన్ సమస్యలు! ఇలాంటి పరిస్థితి వారినెంతటి నరకంలోకి నెడుతుందో మీకు అర్థమవుతోందా?’’ అని ప్రశ్నించింది. కేంద్రం తరఫున వాదించాల్సిన అదనపు సొలిసిటర్ జనరల్ బల్బీర్సింగ్ వ్యక్తిగత సమస్యతో రాలేకపోయినందున వాయిదా ఇవ్వాలన్న విజ్ఞప్తికి తిరస్కరించింది. ‘‘ఇది వైద్య విద్యార్థుల హక్కులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం. పైగా సుప్రీంకోర్టులో కేంద్రానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఒక్క ఏఎస్జీ మాత్రమే లేరుగా!’’ అని పేర్కొంది. మొత్తం సీట్లు, ఖాళీలు, అందుకు కారణాలతో 24 గంటల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని, ఎంసీసీని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. అడ్మిషన్ల వ్యవహారాలు చూసే డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ గురువారం హాజరవాలని ఆదేశించింది. విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకుంటే వారికి పరిహారమివ్వాల్సిందిగా ఆదేశాలిస్తామని పేర్కొంది. చదవండి: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆహుతైన కార్లు, బైక్లు, రిక్షాలు, ఫొటోలు వైరల్ -
మెడికల్ కౌన్సిల్’ కేసులో ముగ్గురి అరెస్ట్
సాక్షి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) డేటాబేస్ ట్యాంపరింగ్ చేసి, అనర్హులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ కందుకూరి అనంతకుమార్ సూత్రధారిగా తేలింది. చైనాలో మెడిసిన్ పూర్తి చేసిన వారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పరీక్ష పాస్ అయితేనే రిజిస్ట్రేషన్కు ఆస్కారం ఉంటుందని, పాస్ కాని వారి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన కుమార్ సర్టిఫికెట్లు జారీ చేశాడని అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్, ఓఎస్డీ పి.రాధాకిషన్రావులతో కలిసి గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇబ్రహీంపట్నానికి చెందిన కసరమోని శివానంద్, కర్మన్ఘాట్ వాసి తోట దిలీప్ కుమార్ స్నేహితులు. వీరు చైనాలో ఎంబీబీఎస్ చదివారు. 2012లో సర్టిఫికెట్ పొంది తిరిగి వచ్చారు. ఇలా విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన వారు ఇక్కడ ప్రాక్టీసు చేయాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) ఉత్తీర్ణులు కావాలి. అత్యంత కఠినంగా ఉండే ఈ పరీక్షను ఎంసీఐ ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తుంది. ఈ ద్వయం 2012–14 మధ్య రెండుసార్లు పరీక్షకు హాజరైనా ఉత్తీర్ణులు కాలేదు. పాస్ అయితే కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదు. దీంతో వీళ్లిద్దరూ ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేషించారు. వీరికి ఓ స్నేహితుడు (ప్రస్తుతం దుబాయ్లో) ద్వారా టీఎస్ఎంసీలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న అనంతకుమార్తో పరిచయమైంది. 2017లో అతడిని కలిసి తమ అవసరాన్ని చెప్పారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన అనంతకుమార్ 2016లో రిజిస్టర్ చేసుకున్న వైద్యుల రిజిస్ట్రేషన్ నంబర్లు వీరికి కేటాయించాడు. ఈ మేరకు టీఎస్ఎంసీ డేటాబేస్లో మార్పుచేర్పులు చేసి, వీరిద్దరికీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించాడు. ఇటీవల అసలు వైద్యులు రెన్యువల్, అర్హతలు అప్డేట్ కోసం టీఎస్ఎంసీకి రావడంతో విషయం తెలిసింది. టీఎస్ఎంసీ ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుల కోసం నార్త్జోన్ టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని టీమ్ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకుంది. వీరి వద్ద నకిలీ టీఎస్ఎంసీ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ... ఎంసీఐ సర్వర్లో మాత్రం ఎంటర్ కాలేదు. దీంతో అందులో అసలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలే కనిపిస్తున్నాయి. చిక్కుతామని భయపడిన వీరు ప్రాక్టీసు చేయకుండా వైద్య సంబంధ ఉద్యోగాలు చేస్తున్నారు. అనంతకుమార్ వీరిద్దరితో పాటు శ్రీనివాస్, నాగమణిలకు ఈ తరహాలో సహకరించినట్లు అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వారి వివరాలు ఆరా తీస్తున్నామన్నారు. శివానందం 2012–16 మధ్య, దిలీప్ 2016 –18 మధ్య సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో డ్యూ టీ డాక్టర్లుగా పని చేశారు. టీఎస్ఎంసీ సర్టిఫికెట్ లేని శివానందంకు ఉద్యోగం ఎలా వచ్చిందనేది ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం వీరిలో ఒకరు మెడికల్ కంపెనీలో, మరొకరు వైద్యులకు అసిస్టెంట్గా పని చేస్తున్నారు. (చదవండి: తమ్ముడి ఇంట్లో తుపాకీ పెట్టాడు!) -
వేరియంట్లు కావవి..స్కేరియంట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ప్రతి ఇంటా వినిపిస్తున్న మాట ‘వేరియంట్’. శాస్త్రీయంగా దీని గురించి ప్రజలకు తెలియకపోయినా.. వారిని తీవ్రంగా భయపెడుతోంది. అందుకే దీన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు ‘స్కేరియంట్స్’ (భయపెట్టేవి)గా కొట్టిపారేస్తున్నారు. భారతీయ వైద్య నిపుణులు సైతం వేరియంట్స్ గురించి అతిగా ఆలోచించొద్దని సూచిస్తున్నారు. ప్రధాన వైరస్ రూపాంతరం వల్ల మారే వివిధ ఆకృతులన్నీ విభిన్న ప్రభావాలు చూపిస్తాయనే ఆందోళనకు శాస్త్రీయత లేదని చెబుతున్నారు. ఉదాహరణకు కర్నూలు కేంద్రంగా పుట్టిందని ప్రచారం చేస్తున్న ‘ఎన్–440కే’ వేరియంట్ ప్రమాదకరమైనదని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవు. దీనిపై పరిశోధనలు చేసేలోపే ఆ వేరియంట్ మాయమైంది. చాలా వేరియంట్స్ ఇలాగే ఉంటాయని వెల్లూరుకు చెందిన క్రిస్టియన్ వైద్య కళాశాల క్లినికల్ వైరాలజీ ప్రొఫెసర్ టి.జాకబ్జాన్ తెలిపారు. ఒకే వైరస్.. రూపాలే వేరు ఏ వైరస్ అయినా విస్తరించే కొద్దీ రకరకాలుగా ఉత్పరివర్తనం చెందుతుంది. ప్రతి పరిణామాన్ని గుర్తించి.. దానికి ఓ కోడ్ ఇవ్వడం జన్యు శాస్త్ర పరిశీలనలో భాగమంటున్నారు నిపుణులు. నిజానికి కరోనాకు సంబంధించి ఇంతవరకూ విస్తృతంగా ల్యాబొరేటరీ పరిశోధనలు పూర్తి చేసుకున్నవి మూడే. యూకేలో 2020 సెప్టెంబర్లో బ్రెజిల్ వేరియంట్ పి–1 గుర్తించారు. అక్టోబర్లో దక్షిణాఫ్రికా, డిసెంబర్లో బ్రెజిల్ వేరియంట్స్పై శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. వీటినుంచి పుట్టుకొచ్చిన వేరియంట్స్కు అనేక రకాలుగా కోడింగ్ ఇచ్చారు. వేరియంట్స్ ఎన్నయినా మూలం ఒకటే. యూకే వేరియంట్స్ శాఖోపశాఖలే వేరియంట్స్గా భారత్ను వణికిస్తోందని వైద్యులంటున్నారు. మూలం ఒకటే కాబట్టి, వేరియంట్ ఏదైనా వ్యాక్సిన్ అన్నింటినీ అడ్డుకుంటుందని భారత వైద్యమండలి స్పష్టం చేస్తోంది. ఏ వేషం వేసినా డీఎన్ఏ ద్వారా వ్యక్తిని గుర్తించి మందు ఇచ్చినట్టే కరోనాకు చెక్ పెట్టేందుకు వైద్య పరిశోధనలు సరిపోతాయని తెలిపారు. ఈ దిశగానే ఇప్పటికే అనేక మందులు అందుబాటులోకి వస్తున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా స్పష్టం చేస్తోంది. ఆందోళన అనవసరం జన్యు మార్పిడి వల్ల పుట్టుకొచ్చే రూపాంతరాల గురించి ప్రజలు అతిగా ఆలోచించకపోవడమే మంచిది. ప్రధాన వైరస్ను గుర్తించి వైద్యం చేస్తున్నప్పుడు, కట్టడికి వ్యాక్సిన్పై విస్తృత పరిశోధనలతో ముందుకెళ్తున్నప్పుడు ఏ శాస్త్రీయతా లేని వేరియంట్స్ గురించి ఆందోళన అనవసరం. – ముఖర్జీ, హృద్రోగ నిపుణులు అనవసర భయమే వేరియంట్స్ అంటే అసలు వైరస్ బిడ్డలే. కాకపోతే వీటి వేషం మారుతుందంతే. వైరస్ మ్యుటేషన్ చెంది, స్పైక్స్ బయటకు కన్పిస్తాయి. ఈ స్పైక్స్ ప్రొటీన్సే. అమినో ఆమ్లాన్నే ప్రొటీన్ అంటారు. ఏది ఉండకూడదు.. ఏది ఉండాలనేది జెనెటిక్ కోడ్ నిర్దేశిస్తుంది. కోడ్ మారితే అమినో ఆమ్లం మారుతుంది. ఫలితంగా ప్రోటీన్ ఆకృతి మారుతుంది. వైరస్ రకరకాల ఆకృతి తీసుకుంటుంది. ఇది ఏ రూపంలో ఉన్నా గుర్తించే ల్యా»ొరేటరీలు అభివృద్ధి చెబుతున్నాయి. కాబట్టి ఇదంతా అనవసర భయమే. – ప్రవీణ్కుమార్, మైక్రో బయాలజిస్ట్, విజయవాడ -
నెల్లూరు వైద్యకళాశాలకు ఎంసీఐ గుర్తింపు
సాక్షి, ఢిల్లీ : ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చొరవతో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలకు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నుంచి అనుమతులు లభించాయి. తాజాగా కేంద్రం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఫలితంగా ఐదేళ్ళ నిరీక్షణకు తెరపడినట్లయ్యింది. దీంతో కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రి వసతులు కూడా మెరుగుపడనున్నాయి.ఎంసీఐ అనుమతుల గురించి వెంకయ్యనాయుడు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రి హర్షవర్ధన్ సహా సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు దీనికి సంబంధించి మార్గం సుగమం అయింది. ఎంసీఐ అనుమతుల నేపథ్యంలో లాంఛనాలను త్వరితగతిన పూర్తిచేసి అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యేలా చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి కేంద్రమంత్రికి సూచించారు. (భారత్ బంద్ : 20 రైతు సంఘాల మద్దతు) డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల.. 2014-15 సంవత్సరంలో ప్రారంభమైనప్పటికీ వివిధ కారణాలతో భారతీయ వైద్యమండలి అనుమతులు ఆలస్యం అయ్యాయి. అయితే మొదటి బ్యాచ్ విద్యార్థుల శిక్షణాకాలం ముగుస్తున్న సమయంలో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు చొరవతీసుకొని వివిధ శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడారు. కాలేజీలో మౌలిక వసతులకు సంబంధించి కళాశాల యాజమాన్యం గతంలో ఇచ్చిన నివేదికలు, నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొంటూ భారతీయ వైద్య మండలి అనుమతులు నిరాకరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి చొరవతో మరోసారి జనవరి 30, 2020న ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో వసతులకు సంబంధించి ఎంసీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కేంద్ర బృందం పరిశీలించింది. సంతృప్తికరమైన నివేదిక ఇవ్వడంతో.. కాలేజీకి ఎంసీఐ గుర్తింపు లభించింది. (రెండేళ్ల బాలుడి మీద నుంచి వెళ్లిన రైలు.. అయినా!) -
సర్కార్ దవాఖానాకు మహర్దశ..
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆధ్వర్యంలోని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ పీజీలో ఎండీ, ఎంఎస్ చేసే విద్యార్థులు రెండో ఏడాది నుంచి జిల్లా ఆసుపత్రుల్లో శిక్షణ పొందాలని తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ (సవరణ) నిబంధనలు–2020’ విడుదల చేసింది. తద్వారా వీరికి క్షేత్రస్థాయి వ్యాధులపై అవగాహన వస్తుందని, శిక్షణ కూడా పొందుతారని తెలిపింది. మరోవైపు జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్టుల వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది. 100 పడకలకు తక్కువ కాకుండా ఉన్న జిల్లా ఆసుపత్రుల్లో వీరికి శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది పీజీలో చేరిన వారికి వచ్చే సంవత్సరం నుంచి ఈ శిక్షణ అమలుకానుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు పీజీ పూర్తయిన విద్యార్థులు బోధనాసుపత్రుల్లో శిక్షణ పొందుతున్నారు. జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్: ఎండీ లేదా ఎంఎస్ చేసే పీజీ మెడికల్ విద్యార్థులంతా 3 నెలలకోసారి రొటేషన్ పద్ధతిలో జిల్లా ఆసుపత్రుల్లో లేదా జిల్లా ఆరోగ్య వ్యవస్థల్లో పని చేయాలి. వారి కోర్సులో భాగంగా ఇది ఉం టుంది. 3, 4, 5 సెమిస్టర్లలో ఉన్న పీజీ విద్యార్థులు రొటేషన్ పద్ధతిలో పనిచేస్తారు. దాన్ని జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్(డీఆర్పీ) అంటా రు. సదరు విద్యార్థులను జిల్లా రెసిడెంట్లుగా పిలుస్తారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో వచ్చే వివిధ అనారోగ్య సమస్యలను తెలుసుకోవడం దీని ఉద్దేశాలు. విభిన్నమైన శిక్షణ పొందడం. అలాగే ప్రస్తుతమున్న స్పెషాలిటీ వైద్యులకు తోడుగా పీజీ వైద్య విద్యార్థులతో జిల్లా ఆరోగ్య వ్యవస్థ బలోపేతం కానుంది. ఇన్ పేషెంట్.. ఔట్పేషెంట్ సేవల్లోనూ.. ► జిల్లా రెసిడెంట్లుగా వెళ్లిన పీజీ విద్యార్థులు జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ (డీఆర్పీసీ) పర్యవేక్షణలో పని చేస్తారు. ► ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్, క్యాజువాలిటీ తదితర చోట్ల పనిచేస్తారు. నైట్ డ్యూటీలూ చేయాలి. ► అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీకి చెందిన పీజీ మెడికల్ విద్యార్థులు జిల్లా ఆరోగ్య అధికారి లేదా చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతారు. లేబొరేటరీ, ఫార్మసీ, ఫోరెన్సిక్ విద్యార్థులు సాధారణ క్లినికల్ విధుల్లో పనిచేస్తారు. ► జిల్లా రెసిడెంట్లకు స్టైఫెండ్ ఇస్తారు. వారానికో సెలవుతోపాటు ఇతర సెలవులు ఉంటాయి. ► రాష్ట్రస్థాయిలోనూ స్టీరింగ్ కమిటీ ఉంటుంది. వివిధ కేసులపై చర్చలు, సెమినార్లు వంటి వాటిల్లో పాల్గొనేలా చేయాలి. ► జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ జిల్లా రెసిడెంట్ల శిక్షణకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు. వారి పనితీరుపై మెడికల్ కాలేజీకి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ► జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాంను సమన్వయం లేదా పర్యవేక్షణ చేసేందుకు ప్రతి మెడికల్ కాలేజీ అకడమిక్ సెల్ కమిటీని ఏర్పాటు చేయాలి. ► జిల్లా రెసిడెన్సీ కార్యక్రమం అమలు మొదలైన ఏడాదికి సంబంధిత మెడికల్ కాలేజీ అదనపు పీజీ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని ఎంసీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ► జిల్లా రెసిడెన్సీ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు రాష్ట్రస్థాయిలో నోడల్ ఆఫీసర్ను నియమించాలి. -
మాస్క్తో రిస్క్
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న కొద్దీ మాస్కుల వినియోగం భారీగా పెరుగుతోంది. కరోనా కట్టడికి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ అధికారవర్గాలతోపాటు సాధారణ ప్రజలుమాస్కులను తప్పనిసరిగా ధరిస్తున్నారు. వీటిల్లో మెడికల్ మాస్కులు అయిన ఎన్95 మాస్కులు, సర్జికల్ మాస్కులతోపాటు పలు రకాలున్నాయి. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నెలకు దాదాపు 10 కోట్ల మాస్కులు వాడుతున్నారు. ► దేశంలో సగటున రోజుకు దాదాపు 25 లక్షల మెడికల్ మాస్కులు వినియోగిస్తున్నట్లు భారత వైద్య మండలి(ఎంసీఐ) అంచనా వేసింది. ► మన రాష్ట్రంలో రోజుకు దాదాపు 1.20 లక్షల మెడికల్ మాస్కులు వాడుతున్నారు. వందేళ్ల వరకు మట్టిలోనే.. ► మెడికల్ మాస్కులు సింథటిక్ రేసిన్తో తయారవుతాయి. వాటిలో పాలిస్టిరిన్, పాలికార్బనేట్, పాలిథిలియన్ వంటివి ఉంటాయి. ఆ మాస్కులు మట్టిలో కలసిపోకుండా వందేళ్ల వరకూ భూమిలోనే ఉంటాయి. పర్యావరణానికి తీవ్ర హానికరంగా మారతాయి. ► ఈ ఏడాది 130 బిలియన్ల మాస్కుల వ్యర్థాలు సముద్రంలో చేరతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండటం పరిస్థితి తీవ్రతకునిదర్శనం. అదే జరిగితే సముద్ర జలాల్లోజెల్లీఫిష్ల కంటే మాస్కుల వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ► 2030నాటికి సముద్ర జలాల్లోచేరతాయని అంచనా వేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు పదేళ్లు ముందుగానే 2020లోనే పోగుపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వ్యర్థాల నిర్వహణ ఇలా.. ► మాస్కుల వ్యర్థాలను సక్రమంగా నిర్వహించకుంటే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. దీనిపై డబ్ల్యూహెచ్వో, కేంద్ర ప్రభుత్వ సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు విధానాలు నిర్దేశించాయి. ► ఎన్95, సర్జికల్ మాస్కులను ఒకసారి మాత్రమే వాడాలి. ► వైద్యులు, వైద్య సిబ్బంది వాడిన మాస్కులను 850 డిగ్రీల సెల్సియస్ నుంచి 1100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్రత్యేక గ్యాస్ క్లీనింగ్ ఎక్విప్మెంట్తో కాల్చివేయాలి. ► సాధారణ ప్రజల వాడేసిన మాస్కులను ఇతర వ్యర్థ పదార్థాలతో కలపకూడదు. పారిశుధ్య సిబ్బంది వాటిని సేకరించి బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీతో కాల్చివేయాలి. లేదా పదడుగుల లోతున భూమిలో పాతిపెట్టాలి. కత్తిమీద సాము.. ► మాస్కుల వ్యర్థాల నిర్వహణ ప్రపంచవ్యాప్తంగా కత్తిమీద సాముగా మారింది. ఇంతగా మాస్కులు, మెడికల్ వ్యర్థాలు రోజూ పోగవుతాయని ఎవరూ ఊహించలేదు. వాడిన మాస్కులను ఎక్కడపడితే అక్కడ పారేస్తుండటంతో పరిస్థితి దిగజారుతోంది. ► ఢిల్లీలో ఆసుపత్రుల నుంచి సేకరించిన మెడికల్ వ్యర్థాలలో 70శాతం మాత్రమే శాస్త్రీయంగా నిర్వహిస్తుండగా 30 శాతం రోడ్లపక్కన, నీటివనరుల్లో పడి ఉంటున్నాయి. ఇతర దేశాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. ► కరోనా వైరస్ జన్మస్థలం చైనాలోని వూహాన్లో 1.10 కోట్ల జనాభా ఉంది. ఆ నగరంలో సగటున రోజుకు 200టన్నుల మెడికల్ వ్యర్థాలు పోగయ్యాయి. అందులో నాలుగో వంతు వ్యర్థాల నిర్వహణకు మాత్రమే అవసరమైన మౌలిక సదుపాయాలు అక్కడ ఉన్నాయి. చేపల్లో చేరి మళ్లీ మనుషుల్లోకి.. ► ఒక్కో మెడికల్ మాస్కులో దాదాపు 25 గ్రాముల వరకు పోలిపాలిథిన్ ఉంటుంది. దీనివల్ల చేపలతోపాటు 600 రకాల జీవజాతులకు ప్రమాదం పొంచి ఉంది. ఆ చేపలను తినడంతో మనుషులుకూడా అనారోగ్యసమస్యలకు గురవుతారు. ► జర్మనీలో నెలకు 1.70కోట్ల మాస్కులు వాడుతుండటంతో పర్యావరణంలోకి 850 టన్నుల కార్బన్ డయాక్సైడ్వదులుతున్నట్లేనని నిపుణులు అంచనా వేశారు. ఒక కారులో ప్రపంచం చుట్టూ 1,060సార్లు తిరిగితే విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్కు ఇది సమానమని తెలిపారు. రీసైక్లింగ్ సాధ్యమా? భారీ సంఖ్యలో వాడుతున్న మెడికల్ మాస్కులను రీసైక్లింగ్ చేయడం ఆచరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. వాడేసిన మాస్కులను సేకరించి వేరుచేసి రీసైకిల్ చేసి కొత్త మాస్కు తయారు చేయాలి. కానీ అందుకు అయ్యే ఖర్చు ఆ మాస్కు ధర కంటే ఎక్కువగా ఉంటుంది. మాస్కుల రీసైక్లింగ్ అచరణ సాధ్యంకాదని యూనివర్సిటీ ఆఫ్ లండన్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ► మెడికల్ మాస్కులతో పొంచి ఉన్న పర్యావరణ ముప్పును తప్పించాలంటే ప్రత్యామ్నాయ మాస్కుల వాడకాన్ని ప్రోత్సహించాలని, వైద్య సిబ్బంది మినహా మిగిలిన వర్గాలు కాటన్ మాస్కులను వాడాలని సూచిస్తున్నారు. ► కాటన్మాస్కులు డిటర్జెంట్/ డెట్టాల్తో ఉతికి ఎండలో ఆరవేసి మళ్లీ వాడుకోవచ్చు. పలు కంపెనీలు, కుటీర పరిశ్రమలు కాటన్తో చేసిన మాస్కులను తయారీ చేసి విక్రయిస్తున్నాయి. ఇళ్లల్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. ► ఫైబర్తో తయారైన రీయూజబుల్ మాస్కులు కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. -
ప్రతీ డాక్టర్కు ‘టెలిమెడిసిన్’!
సాక్షి, హైదరాబాద్: వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ఉపక్రమించింది. సాధారణంగా ఆరోగ్య సమస్యలొస్తే డాక్టర్ను నేరుగా సంప్రదించి సలహా తీ సుకోవాలి. కానీ డాక్టర్ను నేరుగా కలిసే అంశంలో ఎంసీఐ భారీ మార్పులు తీసుకువచ్చింది. డాక్టర్తో నేరుగా కాకుండా ఫోన్లో లేదా వీడియో లేదా చాట్ ఆధారంగా ఓపీ సేవలు పొందే వీలు కల్పిస్తోంది. ఈ మేరకు టెలిమెడిసిన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ విధానం ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. పెద్దగా ప్రాచుర్యంలో లేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రతి డాక్టర్కు టెలిమెడిసిన్ సర్టిఫికెట్ కోర్సు ను తప్పనిసరి చేస్తూ ఎంసీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. నీతి ఆయోగ్ ఆదేశాలకు అనుగుణంగా ఈ మార్గదర్శకాలను ఎంïసీఐ రూ పొందించగా.. కేంద్రం దీన్ని ఆమోదిస్తూ గెజిట్ విడుదల చేసింది. సులువుగా వైద్య సేవలు.. దేశంలో జనాభా నిష్పత్తికి తగినట్లు వైద్యులు అందుబాటులో లేరు. ఈక్రమంలో వైద్య సేవలను సామాన్యులకు అందించే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ కేంద్రం టెలిమెడిసిన్ను ప్రవేశపెట్టింది. కరోనా వైరస్ ప్ర భావంతో గత 3 నెలలుగా మెజారిటీ క్లినిక్లు మూతపడ్డాయి. కొన్నిచోట్ల డాక్టర్లు ఓపీ చూస్తున్నా.. పరిమితంగా సేవలు అందించడంతో చాలా మంది అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం టెలీమెడిసిన్ విధానాన్ని ప్రతి ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్)కి తప్పనిసరి చేసింది. వైద్య విద్య పూర్తి చేసి ప్రాక్టీస్ పెట్టుకున్న ప్రతి డాక్టర్ ఈ సర్టిఫికెట్ కోర్సు చేయాల్సిందే. ఈ సర్టిఫికెట్ ఆధారంగా రోగితో ఫోన్లో, వీడియోకాల్ ద్వారా లేదా సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ పద్ధతిలో కూడా వైద్య సేవ లు అందించొచ్చు. అలాగే ఆరోగ్య స్థితిని క్రమం తప్ప కుండా ఫాలోఅప్ చేయొచ్చు. ఈ పద్ధ తితో తక్కువ సమ యంలో ఎక్కువ మంది పేషంట్లను చూసే వీలుంటుంది. ఈ టెలిమెడిసిన్ కోర్సుకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ ఇస్తుంది. దాని ఆధారం గా ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహించి అర్హత ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో.. టెలిమెడిసిన్ సర్టిఫికెట్ కోర్సు పర్యవేక్షణకు సంబంధించి ఎంసీఐ ప్రత్యేకంగా స్టీరింగ్ కమిటీ ఏర్పాటుచేసింది. ఆరుగురు సభ్యులు న్న ఈ కమిటీకి డాక్టర్ బీఎన్ గంగాధర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. డాక్టర్ నిఖిల్ థండన్ ఉపాధ్యక్షుడిగా, డాక్టర్ మాధురి కనిత్కర్, డాక్టర్ కేఎస్ శర్మ, డాక్టర్ రాజీవ్ గార్డ్ సభ్యులుగా, డాక్టర్ ఆర్కే వాట్స్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ఈ టెలిమెడిసిన్ కోర్సు అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మరో 12 మంది నిపుణులను కూడా నియమించనుంది. ఈ దిశగా ఎంసీఐ ఆన్లైన్ కోర్సును అభివృద్ధి చేస్తోంది. టెలిమెడిసిన్ చికిత్స, నిర్వహణకు సంబంధించి ఎంసీఐ పలు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నో మార్గాలు.. టెలిమెడిసిన్ విధానంలో రోగులకు సౌకర్యాన్ని బట్టి చికిత్స, సమాచారం ఇవ్వొచ్చని కేంద్ర మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఫోన్, వీడియో, ఆడియో కాల్, వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ హ్యాంగౌట్, స్కైప్, ఈ–మెయిల్ తదితర మాధ్యమాలతో టెలిమెడిసిన్ చికిత్స అందించొచ్చు. టెలిమెడిసిన్ విధానానికి సాధారణ వైద్య సేవలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. -
జూలైలో ‘నీట్’?
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్’పరీక్షను వచ్చే జూలైలో నిర్వహించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల అర్హత పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇటు ఈ నెల 3న జరగాల్సిన నీట్ పరీక్ష కూడా వాయిదా పడింది. దీంతో నీట్ ఎప్పుడు నిర్వహిస్తారా అన్న దానిపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జూలై నాటికి పరిస్థితులు కుదుటపడితే ఆ నెలలో నీట్ నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల 16 రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య విశ్వవిద్యాలయాల వైస్చాన్స్లర్లతో ఎంసీఐ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. మరోవైపు కరోనా నేపథ్యంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్కు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ (ఏఐహెచ్ఎస్యూ) లేఖ రాసింది. చదవండి: ఈ ఏడాది చివరికల్లా టీకా! ఆన్లైన్ తరగతులు.. హాజరు సమస్య బోర్డు ఆఫ్ గవర్నర్కు రాసిన లేఖలో ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు, పరీక్షల నిర్వహణ కష్టతరంగా మారిందని ఏఐహెచ్ఎస్యూ తెలి పింది. విద్యా సంవత్సరం ప్రారం భం కాబోతుండటం, పరీక్షలు, తరగతుల నిర్వహణ ఎలా చేపట్టాలన్న దానిపై లేఖలో ప్రస్తావించారు. ప్రధానంగా ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నా హాజరు శాతాన్ని పర్యవేక్షించడం కష్టతరం అవుతోందని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్లో ఆన్లైన్ హాజరును కూడా పరి గణనలోకి తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఇది సుదీర్ఘకాలం సాగే ప్రక్రియ కాబట్టి క్లాసు రూం తరగతుల నిర్వహణలోని నిబంధనల్లో మార్పులు తెచ్చే విధంగా చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ కారణంగా యూజీ, పీజీ మెడికల్ పరీక్షల నిర్వహణకు అంతరాయం కలిగింది. దీంతో కొన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని విద్యార్థులు తమకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు పంపాలని డిమాండ్ చేస్తున్నారని ఎంసీఐ దృష్టికి తీసుకొచ్చారు. ఇక పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే పరిశీలకులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదని పేర్కొన్నారు. వీలైతే ఇతర యూనివర్సిటీల నుంచి, లేకుంటే యూనివర్సిటీ అనుబంధ కాలేజీల నుంచి, అది సాధ్యం కాకుంటే యూనివర్సిటీలోని ఇంటర్నల్ ఎగ్జామినర్లను అనుమతించాలని లేఖలో కోరారు. -
తెలంగాణకు కొత్తగా 54 పీజీ మెడికల్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి 54 పీజీ మెడికల్ సీట్లను మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఉత్తర్వులిచ్చింది. ఈ సీట్లన్నీ నిజామాబాద్ మెడికల్ కాలేజీకే దక్కడం విశేషం. ఎంసీఐ నుంచి నిజామాబాద్ వైద్య విద్య కళాశాలకు శాశ్వత గుర్తింపు లభించిన ఏడాదికి ఒకేసారి 54 పీజీ సీట్లు మంజూరు కావడంపై వైద్య విద్య ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీకి మంజూరైన పీజీ సీట్లలో జనరల్ మెడిసిన్ – 10, అనస్థీషియా – 6, గైనకాలజీ – 6, ఆర్థోపెడిక్స్ – 4, అనాటమీ – 4, ఈఎన్టీ – 3, ఫోరెన్సిక్ మెడిసిన్ – 3, ఫిజియాలజీ – 2, పీడియాట్రిక్ – 3, సైకియాట్రీ – 2, అప్తామాలజీ – 3, పాథాలజీ – 3, మైక్రోబయాలజీ – 3, బయో కెమిస్ట్రీ – 2 ఉన్నాయి. ఇదే కాలేజీకి గతేడాది 3 పీజీ ఫార్మాకాలజీ సీట్లను ఎంసీఐ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. నీట్ పీజీలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ ఏడాది మార్చి – ఏప్రిల్ నెలలో నిజామాబాద్ కాలేజీలో పీజీ అడ్మిషన్లు ఇస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 706 పీజీ సీట్లుండగా, 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 917 సీట్లున్నాయి. మొత్తం అన్నీ కలిపి 1,623 పీజీ సీట్లున్నాయి. కొత్తగా వచ్చిన 54 సీట్లతో కలపి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే 760 సీట్లు అవుతాయి. -
‘మెడికల్’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైద్య విద్యకు సంబంధించి అతిపెద్ద సంస్కరణగా ప్రభుత్వం అభివర్ణిస్తున్న ఈ బిల్లులో.. అవినీతికి ఆలవాలంగా మారిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పొందుపర్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతున్నారు. ఈ బిల్లును ‘ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956’కు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చారు. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా మూజువాణి ఓటుతో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. లోక్సభలో ఇప్పటికే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. తాజాగా రెండు సవరణలకు లోక్సభ ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ బిల్లు లోక్సభకు వెళ్లనుంది. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.. ‘నకిలీ వైద్యులకు అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లు ఉంది. తప్పుడు వైద్య విధానాలకు పాల్పడేవారికి సంవత్సరం జైలుశిక్షతో పాటు, రూ. 5 లక్షల జరిమానా విధించే ప్రతిపాదన బిల్లులో ఉంది. ఇప్పటివరకు అలాంటివారికి ఎంసీఐ నామమాత్రపు జరిమానా మాత్రమే విధించేది’ అని తెలిపారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చిన మూడేళ్లలో నెక్ట్స్(నేషనల్ ఎగ్జిట్ టెస్ట్)ను నిర్వహించడం ప్రారంభిస్తామన్నారు. ఎన్ఎంసీలో రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం లేదన్న ఎంపీల విమర్శలపై స్పందిస్తూ.. మొత్తం 25 మంది సభ్యుల్లో 11 మంది రాష్ట్రాల ప్రతినిధులేనన్నారు. నెక్ట్స్గ్ పరీక్షను మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షగా, అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసినవారికి స్క్రీనింగ్ పరీక్షగా పరిగణిస్తామన్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ల(సీహెచ్పీ) వ్యవస్థను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిందని, అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆ వ్యవస్థను అమలు చేస్తున్నాయని, భారత్ కూడా ఆ దిశగా వెళ్తోందని చెప్పారు. ఎన్ఎంసీలోని 25 మంది సభ్యుల్లో 21 మంది వైద్యులేనని, వారు సీహెచ్పీల అర్హతలను నిర్ణయిస్తారని హర్షవర్ధన్ వివరించారు. బిల్లును స్థాయీసంఘానికి పంపాలని తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. వైద్య విద్య అభ్యసించని 3.5 లక్షలమంది నాన్ మెడికల్ సిబ్బందికి ఆధునిక వైద్యం అందించే వైద్యులుగా లైసెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ వ్యతిరేకించారు. బిల్లులోని ముఖ్యాంశాలు ► ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎంసీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. వందమందికిపైగా సభ్యులు ఉండే ఇందులో 70 శాతం మందిని ఎన్నుకుంటారు. ఇక కొత్తగా వచ్చిన ఎన్ఎంసీలో 25 మందే సభ్యులుగా ఉంటారు. వారిలో అత్యధికుల్ని కేంద్రమే నామినేట్ చేస్తుంది. ► కేంద్రం నియమించిన ఏడుగురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఎన్ఎంసీ చైర్ పర్సన్ పేరుని, తాత్కాలిక సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది. ► కొత్త కమిషన్లో 8 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో నలుగురు వైద్య విద్యకు సంబంధించిన వివిధ బోర్డుల అధ్యక్షులు ఉంటారు. మరో ముగ్గురిని ఆరోగ్యం, ఫా ర్మా, హెచ్ఆర్డీ శాఖలే సిఫారసు చేస్తాయి. ► ఎంసీఐ సమావేశం కావాలంటే వందమందికిపైగా ఉన్న సభ్యుల్లో 15 మంది హాజరైతే సరిపోయేది. వారు తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేవి. జాతీయ వైద్య కమిషన్కు సంబంధించి 25 మందిలో 13 మంది హాజరైతేనే కీలక నిర్ణయాలు తీసుకోగలరు. ► ఎన్ఎంసీ సభ్యులందరూ విధిగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించాలి. ► ఎంసీఐ కాలపరిమితి అయిదేళ్లయితే ఎన్ఎంసీ కాలపరిమితి నాలుగేళ్లు. తాత్కాలిక సభ్యులు రెండేళ్లకి ఒకసారి మారతారు. ► కమిషన్ చైర్మన్ను, అందులో సభ్యుల్ని తొలగించే అధికారం పూర్తిగా కేంద్రానిదే. ► ఎంబీబీఎస్, మెడికల్ పీజీకి సంబంధించి అన్ని ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిట్లీ 50 శాతం సీట్లలో ఫీజుల నియంత్రణ కమిషన్ చేతుల్లోనే ఉంటుంది. ► వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి, మెడికల్ ప్రాక్టీస్ అనుమతికి సంబంధించి ఎంబీబీఎస్ చివరి ఏడాది నిర్వహించే పరీక్షనే అర్హతగా పరిగణిస్తారు. దీనిని నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) పేరుతో నిర్వహిస్తారు. విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన విద్యార్థులు భారత్లో ప్రాక్టీస్ చేయాలంటే స్క్రీనింగ్ టెస్ట్కి హాజరుకావాలి. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వైద్యవిద్యనభ్యసించాలంటే ఇకపై నీట్తో పాటు గా నెక్ట్స్ పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. ► దేశంలోని హోమియో, యునాని, ఆయుర్వేదం కోర్సులు చదివిన వారు కూడా ఒక బ్రిడ్జ్ కోర్సు ద్వారా అల్లోపతి వైద్యాన్ని చేయవచ్చు. -
58 పురాతన చట్టాల రద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం మరో 58 పురాతన, వాడుకలోలేని చట్టాలను రద్దు చేసింది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని రెండు (గత, ప్రస్తుత) ప్రభుత్వాలు కలిసి రద్దు చేసిన పురాతన చట్టాల సంఖ్య 1,824కు చేరింది. చట్టాల రద్దు, సవరణ బిల్లు–2019కు పార్లమెంటు ఆమోదం లభించడంతో త్వరలోనే మరో 137 పురాతన చట్టాలు రద్దు కానున్నాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులకు, ఈ పురాతన చట్టాలకు అసలు సంబంధమే లేదనీ, ఈ కాలానికి అవి పనికిరావని కేంద్రం చెబుతోంది. తాజాగా రద్దు అయిన 58 చట్టాలేవో ఇంకా తెలియరాలేదు. అయితే అవన్నీ ప్రధాన చట్టాలకు సవరణలు చేసేందుకు తీసుకొచ్చినవేనని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. వైద్య విద్యలో ‘నెక్ట్స్’కు ఆమోదం భారత వైద్య మండలి (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) స్థానంలో కొత్తగా జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ–నేషనల్ మెడికల్ కౌన్సిల్)ని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును కేంద్రం 2017 డిసెంబర్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ 16వ లోక్సభ గడువు ముగిసే నాటికి అది ఆమోదం పొందకపోవడం కారణంగా రద్దయింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షను అందరికీ ఉమ్మడిగా జాతీయ నిష్క్రమణ పరీక్ష (నెక్ట్స్–నేషనల్ ఎగ్జిట్ టెస్ట్) పేరిట నిర్వహించేలా బిల్లులో నిబంధనలున్నాయి. ఠి 15వ ఆర్థిక సంఘం తన నివేదికను సమర్పించేందుకు గడువును కేంద్రం మరో నెల రోజులు పొడిగించి నవంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. ఠి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ డిజైన్ చట్టం–2014ను సవరించేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును కేబినెట్ ఆమోదించింది. మరో నాలుగు ఎన్ఐడీలను ఈ చట్టం పరిధిలోకి తెచ్చి, వాటిని జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థలుగా ప్రకటించేందుకు ఈ సవరణను చేపడుతున్నారు. అమరావతి, భోపాల్, జొర్హాత్, కురుక్షేత్రల్లోని ఎన్ఐడీలను కొత్తగా ఈ చట్టం పరిధిలోకి తేనున్నారు. -
బయోమెట్రిక్ వేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యను మెరుగుపర్చేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఇకపై ప్రతి మెడికల్ కాలేజీ విధిగా బయోమెట్రిక్ అటెండెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. కాలేజీ సిబ్బంది అంతా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిందేనని స్పష్టం చేసింది. బయోమెట్రిక్ అటెండెన్స్ వివరాలను ప్రతి రోజూ కాలేజ్ వెబ్సైట్లో పొందుపర్చాలని పేర్కొంది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్కు సవరణలు చేసి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నూతన నిబంధనల ప్రకారం, ఎంసీఐ ఎప్పుడు అడిగినా మెడికల్ కాలేజీలు బయోమెట్రిక్ అటెండెన్స్ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ప్రతి కాలేజీ సొంతగా వెబ్సైట్ను కలిగి ఉండాలి. ‘ఇన్ఫర్మేషన్ అండర్ మినిమమ్ స్టాండర్ట్ రిక్వైర్మెంట్స్ క్లాజ్’పేరిట కాలేజీకి సంబంధించిన వివరాలను ప్రతి నెలా మొదటి వారం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. -
ఎంసీఐ, ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్లు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం గురువారం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. కుంభకోణాలతో అప్రతిష్ట మూట గట్టుకున్న భారత వైద్య మండలి (ఎంసీఐ – మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) పాలనా వ్యవహారాలు చూసేందుకు కమిటీని నియమిస్తూ గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ను కేంద్రం మరోసారి ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ చట్టం రూపం దాల్చాల్సి ఉండగా, అది పార్లమెంటులో పెండింగ్లో ఉంది. జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఎంసీఐ స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటవుతుంది. తక్షణ ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణిస్తూ సెప్టెంబర్లో ఇచ్చిన ఆర్డినెన్స్ గడువు మరో పది రోజుల్లో తీరిపోనుండటంతో, ఆ ఆర్డినెన్స్ను కేంద్రం మరోసారి ఇచ్చింది. -
దృష్టిలోపం ఉన్నవారికీ ఎంబీబీఎస్ చాన్స్
న్యూఢిల్లీ: దృష్టిలోపం ఉన్న అర్హులైన అభ్యర్థులు వైద్యవిద్య (ఎంబీబీఎస్)ను అభ్యసించేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2018 నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)లో పాసైనప్పటికీ దృష్టిలోపం ఉండటంతో అడ్మిషన్ కోల్పోయిన అశుతోశ్ అనే ఓ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం.. దివ్యాంగుల కోటాలో అశుతోశ్కు అడ్మిషన్ ఇవ్వాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)ను ఆదేశించింది. 2018–19 విద్యాసంవత్సరంలోనే ఆయనకు ఎంబీబీఎస్ చేసేందుకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై సీనియర్ కంటివైద్యులతో ఓ కమిటీని ఏర్పాటుచేసిన సుప్రీంకోర్టు వారిచ్చిన సూచనల ఆధారంగానే ఈ తీర్పునిచ్చింది. దివ్యాంగుల కోటా కింద అభ్యర్థి ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందేందుకు అర్హుడంది. గతేడాది ఇద్దరు వర్ణ అంధత్వం ఉన్న విద్యార్థులకు ఎంబీబీఎస్ సీటు నిరాకరించిన కేసులోనూ సుప్రీంకోర్టు ఇదే తీర్పును వెలువరించింది. కంటిచూపు సరిగాలేదనే కారణంతో అడ్మిషన్లను నిరాకరించలేమని స్పష్టం చేసింది. -
‘రిమ్స్’ అప్రతిష్టపాలు
సాక్షి, ఆదిలాబాద్: వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులకు వైద్య సదుపాయం కల్పించాలనే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆదిలాబాద్లో రిమ్స్ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. 2008లో ఈ వైద్య కళాశాల ప్రా రంభమైంది. అప్పట్లో మొదటి బ్యాచ్ పూర్తయ్యే వరకు ఎంసీఐ ప్రతి సంవత్సరం అనుమతులు ఇచ్చేందుకు రిమ్స్లో తనిఖీలు నిర్వహించింది. 2008 నుంచి 2013 మధ్యలో ప్రతి సంవత్సరం జరిగిన తనిఖీల్లో పలు ఏడాదిల్లో ఎంసీఐ అనుమతి నిరాకరించడం, దానికి సంబంధించి లోపాలను తెలియజేస్తూ వాటిని సరిదిద్దుకుంటే మళ్లీ అనుమతినివ్వడం జరుగుతూ వచ్చాయి. ఇలా అనేక ఒడిదుడుకులను దాటుతూ మొదటి బ్యాచ్ బయటకు వచ్చిన తర్వాత దీనికి పూర్తిస్థాయి గుర్తింపు లభించింది. ప్రతీ ఐదేళ్లకోసారి ఎంసీఐ బృందం వైద్య కళాశాలలో ఆయా ప్రమాణాలను కొనసాగిస్తున్నారా లేదా అనే పరిశీలన జరిపి మళ్లీ గుర్తింపునిస్తుంది. ఇప్పటికే రిమ్స్ నుంచి ఐదు ఎంబీబీఎస్ బ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. కాగా 2018 జూన్ 5న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం మరోసారి రిమ్స్లో ప్రమాణాలను పరిశీలించేందుకు వచ్చింది. దీంట్లో 22 లోపాలను గుర్తించి మరోసారి రిమ్స్కు అనుమతి నిరాకరించడంతో వైద్య కళాశాలలో విద్యార్థులు తమ భవితవ్యంపై ఆందోళనలో పడ్డారు. ప్రధానంగా ప్రస్తుతం హౌజ్సర్జన్ పూర్తిచేసిన వారు త్వరలో జరిగే పీజీ పరీక్షలు రాయాలంటే రిమ్స్కు ఎంసీఐ అనుమతినిస్తేనే సాధ్యమయ్యే పరిస్థితి. 2019లో రిమ్స్లో కొత్తగా ప్రవేశాలకు ఈ అనుమతితోనే ముడిపడి ఉంది. ఈ దృష్ట్యా విద్యార్థుల్లో డోలయామానం నెలకొంది. అనుమతి నిరాకరణ తర్వాత పలువురు హౌజ్సర్జన్లు రిమ్స్ డైరెక్టర్ అశోక్ను కలిసి ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతర్గత లోపాలు బహిర్గతం.. రిమ్స్లో అంతర్గత లోపాలు మరోసారి బహిర్గ తం అయ్యాయి. ప్రధానంగా ఎంసీఐ ఎత్తిచూపిన 22 అంశాల్లో కీలక పదవుల్లో ఉన్న లోపాలు, దాం తోపాటు ప్రొఫెసర్లు, ట్యూటర్ల పోస్టుల ఖాళీలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ అశోక్ ఆస్పత్రికి సంబంధించి కీలకమైన మెడికల్ సూపరింటెండెంట్ పోస్టు, వై ద్య కళాశాలకు సంబంధించి డైరెక్టర్ పోస్టును తన ఆదీనంలో ఉంచుకున్నారని నివేదికలు స్పష్టం చేయడం రిమ్స్లో ప్రధానంగా ఉన్నటువంటి లోపాన్ని ఎత్తిచూపింది. అసోసియేట్ ప్రొఫెసర్గా ఆయన తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు లేదని స్పష్టం చేయడం గమనార్హం. డాక్టర్ అశోక్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన ఈ పదవికి అర్హులు కాదని పలువురు ఈ విషయంలో ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయినా ఇటు అధికార యంత్రాంగం కాని, అటు పాలకులు కానీ పట్టించుకున్న పాపాన పోకపోవడంతో ఈ వ్యవహారం అలాగే కొనసాగుతూ వస్తోంది. కీలకమైన మెడికల్ సూపరింటెండెంట్ బాధ్యతలు నిర్వర్తిస్తూ అటు డైరెక్టర్గా కొనసాగుతూ ఇటు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు న్యాయం చేయడం లేదన్న అపవాదును ఆయన మూటగట్టుకున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా ఉలుకూపలుకు లేకపోవడం చోద్యమే. డీన్ పోస్టులో ఒకరున్నారని.. రిమ్స్ వైద్య కళాశాలలో డీన్ పోస్టు ప్రిన్సిపాల్ పోస్టువంటిది.. అలాంటి పోస్టులో ఓ మహిళా ప్రొఫెసర్ కొనసాగుతున్నారన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎంసీఐ నివేదికలో ఈ రహస్యాన్ని బట్టబయలు చేసింది. తమ తనిఖీలో డీన్ రెగ్యులర్గా డ్యూటీలకు అటెండ్ కావడం లేదని వారు పేర్కొన్నారు. అదే సమయంలో జూన్ 5న తాము తనిఖీకి వచ్చినప్పుడు మధ్యాహ్నం 3గంటల వరకు ఆమె అందుబాటులో లేరని తెలిపారు. డీన్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తే హైదరాబాద్ డీఎంఈఆర్ ఆఫీసులో మీటింగ్కు వెళ్లారని చెప్పారని, ఆ సమయంలో డీఎంఈఆర్ రిమ్స్లో 12గంటలకు తమతో ఉన్నారని ఎంసీఐ సభ్యులు తెలపడం రిమ్స్లో రహస్యంగా జరుగుతున్న అనేక వ్యవహారాలను తేటతెల్లం చేస్తోంది. అనేక డిక్లరేషన్ ఫారాలపై డీన్ సంతకం చేయాల్సి ఉండగా, వాటిపై సంతకాలు లేవని పేర్కొన్నారు. బయోకెమిస్ట్రి విభాగంలో ఆమె ప్రొఫెసర్గా కొనసాగుతున్న విషయం పలువురికి తెలియదని తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆదిలాబాద్ రిమ్స్లో మెడికల్ సూపరింటెండెంట్గా, డైరెక్టర్గా, డీన్గా ఒక్కరే ఉన్నారనే ప్రచారం ఉంది. దీంతో ఈ పోస్టులో మరొకరు ఉన్నారనే విషయం ఎంసీఐ నివేదికతోనే తేటతెల్లమైంది. ఓ ప్రొఫెసర్ పోస్టులో ఇంతటి రహస్యాలు దాచిపెట్టడం వెనుక ఆంతర్యమేమిటో వారికే తెలియాలి. ఫ్యాకల్టీలో ఖాళీలు.. రిమ్స్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి 35.84 శాతం ఖాళీలు ఉన్నట్లు ఎంసీఐ తన నివేదికలో పేర్కొంది. ప్రధానంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం వెనుక కొందరి ప్రయోజనం దాగివుందన్న విమర్శలు లేకపోలేదు. ప్రధానంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్లో సీనియర్ వ్యక్తులు వచ్చిన పక్షంలో డైరెక్టర్గా వారికి అవకాశం దక్కే పరిస్థితి ఉంటుంది. దీంతోనే ఆ పోస్టుల భర్తీలో ఏదో కోణం దాగివుందన్న ఆరోపణలు ఉన్నాయి. ట్యూటర్ పోస్టులు 80.64 శాతం ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఎంసీఐ తనిఖీకి వచ్చిన రోజు ఆస్పత్రిలో పనిచేసే 14 మంది రెగ్యులర్ వైద్యులు హాజరుకాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రెసిడెంట్ డాక్టర్ల విషయంలో పోస్టుల ఖాళీలు అధికంగా ఉన్నట్లు ఎంసీఐ నివేదిక చూపిస్తోంది. కీలక బాధ్యతలో ఉన్న వ్యక్తితో ఈ రెగ్యులర్ డాక్టర్లకు కొంతమందికి పొసగకపోవడంతోనే వారు ఆరోజు హాజరుకాలేదనే ప్రచారం లేకపోలేదు. వీటితోపాటు అనేక లోపాలు.. రిమ్స్లో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తుల లోపాలు, ఫ్యాకల్టీ ఖాళీలతోపాటు ఇతర లోపాలను కూడా ఎంసీఐ ఎత్తిచూపింది. ప్రధానంగా ఎంసీఐ తనిఖీకి బెడ్ ఆక్యుపెన్సి కేవలం 52.97 శాతం మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఓపీడీ రిజిస్ట్రేషన్ కౌంటర్ కంప్యూటరైజ్డ్ చేయలేదని స్పష్టం చేశారు. ఓజీ కోసం ప్రత్యేక క్యాజువాలిటీ లేదని తెలిపారు. సెంట్రల్ ఆక్సిజన్తోపాటు వాటిని పీల్చే పరికరాలు పనిచేయడం లేదని పేర్కొన్నారు. అనాటమిలో రెండు మృతదేహాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇతర విభాగాల్లోనూ లోపాలను చూపించారు. వీటన్నిటిని నెలరోజుల్లో రెక్టిఫికేషన్ చేసుకోవాలి స్పష్టం చేశారు. కాగా కేవలం ఫ్యాకల్టీ విషయంలోనే ఎంసీఐ లోపం ఎత్తిచూపుతూ మళ్లీ వచ్చేసరికి దీన్ని సరిచేస్తామని తేలికగా చెబుతూ ఎంసీఐ తనిఖీలు నిరంతరం కొనసాగేవే అన్నట్లు రిమ్స్ వర్గాలు వ్యవహరించడం నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. మళ్లీ తనిఖీ ఉంటుంది.. రిమ్స్లో మళ్లీ ఎంసీఐ తనిఖీ ఉంటుంది. ప్రధానంగా ఫ్యాకల్టీ లేరని ఎంసీఐ నివేదికలో చూపించింది. ఈ లోపాలను సరిచేసుకుంటాం. మళ్లీ రూ.3లక్షల ఫీజు చెల్లిస్తాం. తద్వారా మళ్లీ తనిఖీలకు బృందం వస్తుంది. ప్రధానంగా ప్రొఫెసర్ 14, అసోసియేట్ ప్రొఫెసర్ 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10శాతం కంటే తక్కువ పోస్టులు ఖాళీగా ఉంటే ఎంసీఐ పెద్దగా ప్రాధాన్యత తీసుకోదు. రిమ్స్లో 18 శాతం ఖాళీలు ఉండడంతోనే ఈ పరిస్థితి ఎదురైంది. వాటిని సరిదిద్దుతాం. గతంలో పోస్టులను భర్తీ చేసినప్పటికీ పలువురు సెలవుల్లో ఉన్నారు. మరికొంతమంది బదిలీపై వెళ్లడం జరిగింది. – రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ -
మరోసారి మొండి చేయి!
ఇందూరు నగరంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని ఇక్కడి అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదు. ఎక్కడ చూసినా సమస్యల కుప్పలే. అన్ని విభాగాల్లోనూ లోపాలే. ఫలితంగా ఎంసీఐ గుర్తింపునకు నోచుకోలేకపోయింది. ఐదేళ్ల బోధనకు అనుమతులున్నా చివరగా వచ్చే గుర్తింపు సాధించలేకపోయింది. ఈఏడాది మూడుసార్లు పరిశీలించిన ఎంసీఐ అన్నింట్లోనూ వైఫల్యమేనంటూ అనుమతికి నిరాకరించింది. దీంతో మెడికోలు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మరోసారి ఎంసీఐ షాక్ ఇచ్చింది. కళాశాలకు గుర్తింపు ఇవ్వలేదు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేస్తూ ఎంసీఐ వెబ్సైట్లో పేర్కొంది. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడమే ప్రధాన లోపం. కళాశాలకు గుర్తింపు కూడా చాలా ముఖ్యం. గుర్తింపు ఉంటేనే కళాశాల వైద్య విద్యకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటి వరకు కళాశాలకు ఐదేళ్ల వరకు అనుమతి లభించింది. ప్రస్తుతం కళాశాలకు పూర్తిస్థాయి గుర్తింపు ఇవ్వాలి. దీని కోసం ఎంసీఐ మూడుసార్లు పరిశీలించింది. అయినా సమస్యల కారణంతో మరోసారి అనుమతికి నిరాకరించింది. ఇప్పటికే మూడుసార్లు పరిశీలన.. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఎంసీఐ బృందం గుర్తింపు కోసం మూడుసార్లు పరిశీలించింది. ఈ యేడాది ఫిబ్రవరి 21, మార్చి 18, జూన్ 18వ తేదీల్లో ముగ్గురు సభ్యుల బృందం పరిశీలించింది. మూడుసార్లు పరిశీలన అనంతరం కూడా గుర్తింపునకు అనుమతి లభించలేదు. రెండుసార్లు పరిశీలన జరిగితే అనుమతి నిరాకరించినప్పుడు లోపాలను సరిదిద్ది మూడోసారి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉంది. అయితే మూడోసారి సైతం ఇదే పరిస్థితి ఏర్పడింది. ఎంసీఐ గుర్తింపును సాధించలేకపోయింది. పట్టాలకు గుర్తింపు తప్పనిసరి.. వైద్య విద్యకు ఎంసీఐ గుర్తింపు తప్పనిసరి. ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఐదేళ్ల వరకు అడ్మిషన్లకు వైద్య విద్య బోధనకు అనుమతి ఉంది. అయితే తర్వాత దీనికి ఎంసీఐ గుర్తింపు తప్పనిసరి. ఎంసీఐ గుర్తింపు ఉంటేనే వైద్యుల పట్టాలు చెల్లుబాటు అవుతాయి. కళాశాలకు అధికారిక గుర్తింపు ఉంటుంది. ఎంసీఐ మొదటి రెండు అనుమతుల అనంతరం గుర్తింపు కోసం పరిశీలన చేసి అనుమతులు ఇస్తుంది. ప్రస్తుతం ఈ అనుమతి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు రావాల్సి ఉంది. ఎంసీఐ లేవనెత్తిన లోపాలు.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పడక గదుల ఆక్యుపెన్సీ రేటు వందకుగాను కేవలం 60శాతమే ఉంది. 40శాతం ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉందని ఎంసీఐ పేర్కొంది. జనరల్ ఆస్పత్రిలో ఇస్టోపాథోలాజికల్ ల్యా బ్ పనిచేయడం లేదు. అత్యవసర వి భాగం ఆపరేషన్ థియేటర్లు పని చేయడం లేదు. ఆస్పత్రిలో ఎక్స్ రే మిషన్లు పని చేయడం లే దు. మెడికల్ కళాశాలలో లైబ్రరీలో ఏసీ అం దుబాటులో లేదు. కళాశాలలో ఎస్ఆర్ వైద్యులు అవసరమైన మేరకు అందుబాటులో లేరు. గైనిక్, చిన్న పిల్లల విభాగంలో రోగుల కేటా యింపు విధానం సక్రమంగా లేదు. ఇదే వి భాగంలో వైద్య సిబ్బంది కేటాయింపు సరిగ్గా లేదు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేక కిందిస్థాయి వరకు అదనపు బాధ్యతలు అప్పగిం చి కొనసాగిస్తున్నారు. దీంతో వైద్య విద్య బో ధన వీలు కాదని పేర్కొంది. వైద్య సిబ్బంది కేటాయింపు, రోగులకు అసౌకర్యాలు, అవుట్ పేషెంట్ విభాగంలో అసౌకర్యాలు ప్రధానంగా పేర్కొన్నారు. సిటీ స్కాన్, స్కానింగ్ సెంటర్ నిర్వహణ సక్రమంగా లేదు. అర్హులైన వైద్య సిబ్బంది పనిచేయడం లేదని పేర్కొంది. మెడికల్ కళాశాలలో వసతి కొరత సమస్యగా పేర్కొన్నారు. లోపాలను సవరిస్తాం.. మెడికల్ కళాశాలకు గుర్తింపు అనుమతి లభించకపోవడంపై ఉన్న లోపాలను సవరిస్తాం. సమస్యలు పరిష్కరించేందకు ప్రధానంగా దృష్టి సారిస్తాం. ఎంసీఐకి మరోసారి విన్నవిస్తాం. చిన్న చిన్న లోపాలను పూర్తిస్థాయిలో నివారిస్తాం. –రాములు, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఎంబీబీఎస్ సీట్లు.. 3,500
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య డిగ్రీ కోర్సుల భర్తీ ప్రక్రియకు కాళోజీ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ఏర్పాట్లు మొదలుపెట్టింది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు వచ్చే వారంలో వెల్లడి అవుతాయని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియను చేపట్టేలా కాళోజీ వర్సిటీ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని వైద్య విద్య సీట్ల విషయంలో ఈ ఏడాది మిశ్రమంగా ఉంది. కొత్తగా మూడు కాలేజీలకు అనుమతి వచ్చిందనేది విద్యార్థులకు సంతోషం కలిగిస్తుండగా... గత ఏడాది ఉన్న వాటిలో 150 సీట్లకు కోత పడటం ఆందోళన కలిగిస్తోంది. వైద్య విద్య కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియకు భారత వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి తప్పనిసరి. కాలేజీల్లోని వసతులు, బోధన సిబ్బంది, కాలేజీకి అనుబంధంగా ఉండే ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య వివరాలను పరిశీలించిన తర్వాతే ఈ అనుమతులు ఇస్తుంది. 2018–19 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలిపి మొత్తం 3,500 ఎంబీబీఎస్, 1,140 బీడీఎస్ సీట్లున్నాయి. ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి 8 ప్రభుత్వ కాలేజీల్లో 1,250 సీట్లు... 16 ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో 2,250 సీట్లు ఉన్నాయి. బీడీఎస్ సీట్లకు సంబంధించి ఏకైక ప్రభుత్వ కాలేజీలో వంద సీట్లు, 12 ప్రైవేట్ కాలేజీల్లో 1,040 సీట్లున్నాయి. కొత్తగా 450 సీట్లు... సిద్దిపేటలో ప్రభుత్వ వైద్య కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు, రంగారెడ్డి జిల్లా కనకమామిడిలో అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ కాలేజీలో 150 సీట్లకు ఎంసీఐ కొత్తగా అనుమతి ఇచ్చింది. సరైన వసతులు లేని కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆర్వీఎం కాలేజీకి వరుసగా రెండేళ్లు అనుమతి రద్దు చేస్తున్నట్లు ఎంసీఐ గత ఏడాది ప్రకటించింది. అయితే కాలేజీ యాజమాన్యం అనుమతి కోసం చేసిన ప్రయత్నం ఫలించడంతో ప్రస్తుత ఏడాదిలో 150 సీట్ల భర్తీకి ఎంసీఐ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 450 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 150 సీట్ల కోత... ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం వసతులు లేకపోవడం, బోధన సిబ్బంది, ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య నమోదులో లోపాల కారణంగా 3 కాలేజీలకు ఈ ఏడాది అనుమతి రాలేదు. 150 సీట్లున్న మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో 2018–19, 2019–20 విద్యా సంవత్సరాల్లో సీట్ల భర్తీకి అనుమతిని నిరాకరించింది. అలాగే గత సంవత్సరం అనుమతి నిరాకరించిన మల్లారెడ్డి మహిళా వైద్య కాలేజీ, మహావీర్ వైద్య కాలేజీలకు ఈ ఏడాది కూడా సీట్ల భర్తీకి అవకాశం రాలేదు. ఈ రెండు కాలేజీల్లో కలిపి మొత్తం 300 సీట్లున్నాయి. -
ఉరుకులు..పరుగులు
అనంతపురం న్యూసిటీ: ప్రీ పీజీ సీట్ల మంజూరులో భాగంగా భారత వైద్య మండలి (ఎంసీఐ) బృందం మంగళవారం అనంతపురం సర్వజనాస్పత్రి – వైద్య కళాశాలతోపాటు బుక్కరాయసముద్రం, ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసింది. లోపాలు బయటపడకుండా చూసుకునేందుకు వైద్యులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఎంసీఐ బృందంలో అనాటమీ ప్రొఫెసర్ (గౌహతి), ఫోరెన్సిక్ ప్రొఫెసర్ (సూరత్), సర్జరీ ప్రొఫెసర్ (బెంగళూరు) ఉన్నారు. సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఉండగానే ఆయన సీటులో అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ నవీన్ కుమార్ కూర్చుని ఉండటంతో వైద్యులు కంగుతిన్నారు. అనంతరం ఎంసీఐ బృందం ఆస్పత్రిలోని మెడిసిన్, చిన్నపిల్లలు, గైనిక్, సైకియాట్రీ తదితర ఓపీలను పరిశీలించారు. ఓపీ, ఐపీ పేషెంట్లు, డిజిటల్ రికార్డుల గురించి ప్రశ్నించారు. ఓపీ 1800 నుంచి 2000 మంది, ఐపీ వెయ్యి మంది ఉన్నారని అధికారులు సమాధానమిచ్చారు. గైనిక్ విభాగంలో గర్భిణులకు అందుతున్న సేవల గురించి ఎంసీఐ బృందం సభ్యులు డాక్టర్ నాగరాజు ఆరా తీశారు. రోజూ 25 నుంచి 30 దాకా ప్రసవాలు జరుగుతున్నాయని హెచ్ఓడీ డాక్టర్ శంషాద్బేగం వివరించారు. మెయిన్ ఆపరేషన్ థియేటర్ను పరిశీలించి పరికరాలు, సిబ్బంది కొరతకు సంబంధించి సమాచారాన్ని ఇవ్వాలని బృందం సభ్యులు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్, అకడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జేసీ రెడ్డి, సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రామస్వామి నాయక్ను కోరారు. 43 రోజులుగా ఒక్క స్కాన్ చేయలేదా? సర్వజనాస్పత్రి రేడియాలజీ విభాగంలోని ఆల్ట్రాసౌండ్ స్కాన్ సెంటర్లోకి వెళ్లిన బృందం సభ్యులకు అక్కడ వైద్యులు కన్పించలేదు. రికార్డులను పరిశీలించగా గత నెల తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు ఒక్క స్కానింగ్ కూడా తీసినట్టు నమోదు కాలేదు. 43 రోజులుగా ఒక్కసానింగ్ కూడా చేయలేదా అని ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అందుబాటులో ఉన్న ఒక్క వైద్యురాలు కంపల్సరీ సెలవులో వెళ్లిందని డాక్టర్ జేసీ రెడ్డి తెలియజేశారు. స్కాన్లు ఏవిధంగా చేస్తున్నారని డాక్టర్ నాగరాజ్ ఆరా తీస్తే అన్నీ ప్రైవేట్గా చేయిస్తున్నామని సమాధానం ఇచ్చారు. రేడియాలజీ బోర్డులో 15 మంది వైద్యులుండాల్సిన చోట ముగ్గురు మాత్రమే ఉన్నారని ఆయన నోట్ చేసుకున్నారు. సీటీ స్కాన్ సెంటర్లో ఎన్ని స్కాన్లు చేశారని ఆరా తీశారు. అందుకు అక్కడి సిబ్బంది 37 చేశామని చెప్పగా, రికార్డులో 20 మాత్రమే నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అనంతరం వైద్య కళాశాలలోని వివిధ విభాగాలతో పాటు, మైక్రోబయాలజీ, పెథాలజీ, ఫార్మకాలజీ ల్యాచ్లు, ఈ సెంటర్, లైబ్రరీ తదితర వాటిని పరిశీలించారు. వైద్య కళాశాలలో హెడ్కౌంట్ వైద్య కళాశాలలో మెడిసిన్, చిన్నపిల్లల విభాగం, ఆర్థో, సర్జరీ, గైనిక్, ఫోరెన్సిక్, ఆప్తమాలజీ, డర్మటాలజీ, అనస్తీషియా, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఈఎన్టీ, రేడియాలజీ, పెథాలజీ, ఎస్పీఎం, తదితర విభాగాలలో ఎంసీఐ బృందం హెడ్ కౌంట్ చేసింది. వైద్యుల ఆధార్తో పాటు వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను నిశితంగా పరిశీలించారు. ఎంసీఐ బృందం వెంట వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, హెచ్ఓడీలు డాక్టర్ రామస్వామి నాయక్, డాక్టర్ పల్లా శ్రీనివాసులు, డాక్టర్ శంషాద్బేగం తదితరులు ఉన్నారు. -
పీజీ మెడికల్కు నేషనల్ పూల్
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య పీజీ సీట్ల భర్తీలో నేషనల్ పూల్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం పీజీ వైద్య సీట్ల భర్తీ మార్గదర్శకాలు ఖరారు చేస్తూ మంగళవారం రెండు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం భారత వైద్య మండలి (ఎంసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా, జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేయనున్నారు. ఇందులో 50 శాతం సీట్లు నేషనల్ పూల్లోకి, మిగిలిన 50 శాతం సీట్లను స్థానిక కోటాగా పరిగణించనున్నారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేస్తారు. ప్రస్తుతం వైద్య ఉద్యోగంలో ఉన్న వారికి (ఇన్ సర్వీస్ అభ్యర్థులు).. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పని చేసే వారికి సర్వీస్ రిజర్వేషన్లకు బదులుగా నీట్లో వచ్చిన మార్కులకు అదనంగా వెయిటేజీ మార్కులు కలపనున్నారు. గిరిజన ప్రాంతాల్లో మూడేళ్ళు లేదా అంతకు మించి పని చేసిన అభ్యర్థులకు నీట్ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులకు అదనంగా 30 శాతం.. గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్ళు లేదా అంతకు మించి పని చేసిన అభ్యర్థులకు నీట్ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులకు అదనంగా 24 శాతం మార్కులు కలుపుతారు. అలాగే సర్వీస్ అభ్యర్థులకు డిప్లొమా చేసిన సబ్జెక్టులోనే పీజీ చేయాలనే నిబంధన తొలగించారు. త్వరలో నోటిఫికేషన్ భారత వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం వైద్య విద్య పీజీ సీట్ల భర్తీ జరుగుతుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ కరుణాకర్రెడ్డి తెలిపారు. పీజీ సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. -
‘నమో’ యాప్కు వైద్యుల ఫిర్యాదులు
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను నిరసిస్తూ వైద్యులంతా ప్రధాని నరేంద్ర మోదీ ‘నమో’ యాప్కు ఫిర్యాదులు పంపాలని నిర్ణయించారు. ఇందుకోసం వారు ‘నమో యాప్’ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ యాప్ ద్వారా దేశంలోని సుమారు 10 లక్షల మంది వైద్యులు తమ అభ్యంతరాలను ప్రధానికి పంపనున్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఏర్పాటును దేశవ్యాప్తంగా వైద్యులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. డాక్టర్ల వైఖరిని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిల్కు పంపింది. మరోవైపు ఎన్ఎంసీపై వైద్యులు ఆందోళనలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం వైద్య సంఘాల నేతలు, సీనియర్ వైద్యుల నేతృత్వంలో సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఎన్ఎంసీ బిల్లు ఆమోదం పొంది అమలులోకి వస్తే వైద్య రంగంలో అవినీతి మరింత పెరుగుతుందని వీరు చెబుతున్నారు. ఎన్ఎంసీలో ఉండే 25 మంది సభ్యుల్లో 20 మందిని వైద్యేతర రంగంలో ఉన్న వారిని ప్రభుత్వమే నామినేట్ చేసుకుంటుందని, ఐదుగురే వైద్యులుంటారని చెబుతున్నారు. మెజార్టీ సభ్యులు ప్రభుత్వం నామినేట్ చేసిన వారే కావడంతో ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారని, దీంతో వైద్యరంగంతో సంబంధం లేని వారి నిర్ణయాలే అమలవుతాయని పేర్కొంటున్నారు. మెడికల్ కాలేజీల తనిఖీకి అప్పటికప్పుడే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారని, ఇది కూడా అవినీతికి దారితీస్తుందంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఎంసీఐ విధానంలో లోపాలను సవరించాలని, లేదంటే ప్రక్షాళన చేయాలి తప్ప ఎన్ఎంసీకి ఆమోద్ర ముద్ర వేయడానికి వీల్లేదని తెగేసి చెబుతున్నారు. -
వైద్యుల మెడపై ఎన్ఎంసీ కత్తి
పశ్చిమగోదావరి, తణుకు: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)ను రద్దు చేసి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బిల్లును కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్ కమిటీకి పంపడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ చట్టం కార్యరూపం దాల్చితే నేషనల్ కమిషన్కు చైర్మన్ తోపాటు సభ్యులను ప్రభుత్వమే నా మినేట్ చేస్తుంది. ఈ బిల్లు ద్వారా గ్రాడ్యుయేషన్ వైద్య విద్యకు ఒక బోర్డు, పీజీ వైద్యవిద్యకు మరో బోర్డు వైద్య విద్యాసంస్థల గుర్తింపు, సమీక్షలకు మరో బోర్డు, వైద్యుల రిజిస్ట్రేషన్కు వేరొక బోర్డు ఇలా వేర్వేరుగా ఏర్పాటవుతాయి. అయితే కేంద్రం ప్రతిపాదిస్తున్న నేషనల్ మెడికల్ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించలేదని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు కాని వారితో మొత్తం కమిషన్ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని వారంటున్నారు. ఈ పరిస్థితుల్లో రోగులు, వైద్యుల ప్రయోజనాలు కాకుండా కార్పొరేట్ ఆసుపత్రుల ప్రయోజనాలకే పెద్ద పీట వేసినట్లు అవుతుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో.. దేశవ్యాప్తంగా రిజిస్టర్ మెడికల్ గ్రాడ్యుయేట్లుగా పిలువబడుతున్న వైద్యులంతా కలిసి సభ్యులను ఎన్నుకుని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తుంటారు. ఈ కౌన్సిల్ ద్వారా వైద్య విద్య, వైద్యుల రిజిస్ట్రేషన్ వంటివి పర్యవేక్షిస్తుంటుంది. అయితే ప్రస్తుతం ఈ విధానంలో లోపాలు ఎత్తిచూపుతూ రాజకీయ దురుద్దేశంతోనే ఎంసీఐను రద్దు చేసి ఆ స్థానంలో ఎన్ఎంసీ ఏర్పాటు చేయాలని కేంద్రం ఇటీవల బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ విధానంలో స్వయంప్రతిపత్తిని కోల్పోవడంతో పాటు పూర్తిస్థాయి అధికారాలు రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్లనున్నాయి. దీంతో వైద్య కళాశాల ఏర్పాటు, ఫీజుల వసూళ్లపై నియంత్రణ ఉండదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యవిద్యలో ప్రైవేట్ రంగంలో పెద్దఎత్తున ఫీజులపై నియంత్రణ ఎత్తివేసి తద్వారా ఎన్ఎంసీ సభ్యుల అవినీతి, స్వలాభాలకు గేట్లు తెరిచినట్లు అవుతుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బ్రిడ్జి కోర్సుల పేరుతో అర్హత లేనివారిచే వైద్యం చేయించి ప్రజా రోగ్యంతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని వారంటున్నారు. కనీస విద్యార్హత లేని ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ అంటూ ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతోందని విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని వైద్యులు ఆందోళనకు దిగారు. దశలవారీగా ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు ప్రణాళికలు చేపట్టారు. ఇందులో భాగంగానే మంగళవారం దేశవ్యాప్తంగా వైద్యసేవలు నిలిపివేసి తమ నిరసన తెలిపారు. రాబోయే రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పెరగనున్న ఫీజులు జిల్లాలోని ఏలూరు ఆశ్రం కాలేజీ ద్వారా ఏటా 150 మంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అంతేకాకుండా జిల్లాకు చెందిన సుమారు 1,500 మంది ఏటా మెరిట్ను బట్టి రాష్ట్రంలోని పలు వైద్యకళాశాలల ద్వారా ఎంబీబీఎస్ పట్టా పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని సుమారు 20 ఐఎంఏ శాఖల ద్వారా దాదాపు 1,200 మంది వైద్యులు ఆయా విభాగాల్లో వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు. ఈ చట్టం కార్యరూపం దాల్చితే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయా కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లలో 60 శాతం మేర కాలేజీ యాజమాన్యాలే అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఎంబీబీఎస్ పాసైన ప్రతి విద్యార్థి ప్రాక్టీస్ చేయాలంటే మరో పరీక్ష రాయాల్సి ఉంటుంది. వంద పరీక్షలు రాసి పాసైతే తప్ప ఎంబీబీఎస్ పట్టా చేతికి రాదు. మరో పరీక్ష రాయడమంటే అదనపు భారం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదని వైద్య విద్యార్థులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆయుర్వేదం, హోమియో చదివే విద్యార్థులు కొత్తగా ప్రవేశపెట్టే బిల్లుతో మోడ్రన్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. ఎన్ఎంసీ బిల్లు కార్యరూపం దాల్చితే వైద్యప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైద్య విద్య సామాన్యులకు అందకుండా పోతుందని వారంటున్నారు. వాపసు తీసుకోవాలి వైద్యరంగ ప్రాతినిధ్యాన్ని నామమాత్రం చేసేలా రూపకల్ప న చేసిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బిల్లును సత్వరమే వాపసు తీసుకోవాలి. దేశ ఆరోగ్య విధానాలు రూపకల్పనలో భారత వైద్య మండలి (ఎంసీఐ) వంటి సంస్థలను భాగస్వాములను చేయాలి. ఆయుర్వేదం, హోమియో వైద్యులంతా ఏడాది సాధారణ శిక్షణ పొంది అల్లోపతి వైద్యం (ఇంగ్లిష్ వైద్యం) చేసేందుకు అనుమతించడం నిబంధనలకు విరుద్ధం. దీని వల్ల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు దూరమవుతాయి. –డాక్టర్ జేవీవీఎన్ ప్రసాద్, కార్యదర్శి, ఐఎంఏ, తణుకు -
అంతా ఓకే.. కానీ!
పాలమూరు: ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం మాదిరిగానే పాలమూరులోని మెడికల్ కళాశాలలో నాలుగో సంవత్సరం తరగతుల నిర్వహణకు కూడా అనుమతి లభించే అవకాశముందని తెలుస్తోంది. ఎంసీఐ బృందం శుక్రవారం చేపట్టిన తనిఖీల అనంతరం అధికారులు వెల్లడించిన అభిప్రాయమిది. అయితే, అధికారులు మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలో కొన్ని సమస్యలను గుర్తించినా వాటిని సరి చేసుకుంటామని వారు చెబుతున్నారు. పాలమూరు మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రితో ఉన్న వసతులు, సౌకర్యాలను ఎంసీఐ బృందం శుక్రవారం పరిశీలించింది. ఎంసీఐ బృందం సభ్యులు డాక్టర్ సయ్యద్, డాక్టర్ అభయ్కుమార్, డాక్టర్ మమత రాగా, డీఎంఈ రమేష్రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్రెడ్డి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ వారి వెంట ఉండి ఇక్కడి సౌకర్యాలను వివరించారు. విడివిడిగా.. ఎంసీఐ బృందం సభ్యులు మొదట విడివిడిగా జనరల్ ఆస్పత్రిని, మెడికల్ కళాశాలలో అన్ని విభాగాలను క్షుణంగా పరిశీలించారు. బృందం సభ్యుల్లో ఒకరు వైద్య కళాశాల, మరొకరు ల్యాబ్లు, వసతి గృహాలను పరిశీలించగా.. ఇంకొకరు జనరల్ ఆస్పత్రిలో పరిశీలించారు. ఆ తర్వాత తాము గుర్తించిన అంశాలపై నివేదికలు రూపొందించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ థియేటర్, పిడియాట్రిక్, ఆర్థో, జనరల్ వార్డు, గైనిక్, లేబర్ రూం, డయాలసిస్, కంటి విభాగాలను తనిఖీ చేసిన వారు నూతన వైద్యుల పనితీరు, హాజరు, ల్యాబ్లు, తరగతి గదులు, ఇతర సౌకర్యాలపై ఆరా> తీశారు. ఆ తర్వాత సర్జికల్ వార్డులో గత పది రోజులుగా ఎన్ని కేసులు వచ్చాయి, ఎందరికి చికిత్స అందజేశారో తెలుసుకున్నారు. ఈక్రమంలోనే కేస్షీట్లు సక్రమంగా లేవని గుర్తించిన ఎంసీఐ బృందం అక్కడ విధుల్లో ఉన్న వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆనంతరం ఐసీయూ, చిన్న పిల్లల విభాగం, స్కానింగ్ సెంటర్లు, శిశు సంజీవని, రక్త పరీక్షల విభాగం, ల్యాబ్ను తనిఖీ చేశారు. జనరల్ వార్డులో పరిశీలన సందర్భంగా ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎందరు రోగులు ఉన్నారని అడిగితే సిబ్బంది సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇక కొన్ని వార్డుల దగ్గర నర్సులు లేకపోవడతో ఎంసీఐ బృందం సభ్యులు.. సరిపడా సిబ్బంది లేరా అని ప్రశ్నించారు. కేవలం ప్రసవాలేనా? జనరల్ ఆస్పత్రి పరిశీలన సందర్భంగా ఎంసీఐ బృందం సభ్యులు ఒక్కో వైద్యుడితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి వసతులు ఉన్నాయి. ఇంకా ఏమేం కావాలని చర్చించారు. ఆస్పత్రి పరిశీలన సందర్భంగా.. ఇక్కడ కేవలం ప్రసవాలే తప్ప ఇతర వ్యాధులకు చికిత్స అందించడం లేదని వారు గుర్తించారు. దీంతో ‘మీ సేవలు ఇంతేనా’ అని ప్రశ్నించినట్లు సమాచారం. ఇంత పెద్ద ఆస్పత్రి ఒక ముఖ్య శస్త్రచికిత్స కూడా జరగకపోవడం ఆశ్చర్యకంగా ఉందని పేర్కొంటూ.. సర్జికల్ వార్డులు ఉన్నా ముఖ్యమైన సర్జరీలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఆ తర్వాత వారు ఎదిర శివారులో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవనాలు, ఎదిర పీహెచ్సీతో పాటు రామయ్యబౌళి అర్బన్ హెల్త్ సెంటర్ను పరిశీలించారు. -
రాష్ట్రంలో మరో 200 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఏడాది వైద్య విద్య సీట్లు పెరగనున్నాయి. సిద్దిపేటలో ప్రభుత్వం నిర్మిస్తున్న వైద్య కాలేజీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. 200 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి వచ్చేలా ఈ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి భారత వైద్య మండలి (ఎంసీఐ) ఇప్పటికే ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేసింది. త్వరలోనే అడ్మిషన్లపై అధికారిక ప్రకటన చేయనుంది. ఇది ప్రభుత్వ కాలేజీ కావడంతో మొత్తం సీట్లను కన్వీనర్ (ఏ కేటగిరీ) కోటాలోనే భర్తీ చేస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,250 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో ఆరు ప్రభుత్వ కాలేజీల్లో కలిపి 1,000 సీట్లు ఉన్నాయి. సిద్దిపేట కాలేజీతో కలిపి ఈ సంఖ్య 1,200కు పెరగనుంది. ఇక బీడీఎస్ కోర్సులో రాష్ట్రవ్యాప్తంగా 1,140 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక జాతీయ స్థాయి అర్హత పరీక్ష (నీట్) ఆధారంగా వైద్య విద్య అడ్మిషన్లు చేపడతారు. వచ్చే ఏడాది మే 10న నీట్ పరీక్ష నిర్వహించాలని సీబీఎస్ఈ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. కన్వీనర్ కోటా పెంపు.. వైద్యవిద్య సీట్లపై ఉమ్మడి హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. వచ్చే ఏడాది సీట్ల భర్తీ స్వరూపం మారనుంది. మైనారిటీ అన్ఎయిడెడ్ కాలేజీల్లోని 60 శాతం సీట్లను కన్వీనర్ కోటాలోనే భర్తీ చేయనున్నారు. అయితే ఇంతకుముందు కూడా 60 శాతం కన్వీనర్కోటా ఉన్నా.. ప్రస్తుత విద్యా సంవత్సరం అడ్మిషన్లకు ముందు దీనిని 50 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కానీ ఆ ఉత్తర్వులను కోర్టు కొట్టివేయడంతో తిరిగి 60 శాతం కన్వీనర్ కోటా అమలుకానుంది. మిగతా సీట్లలో 25 శాతం బీ కేటగిరీలో, 15 శాతం సీ కేటగిరీలో భర్తీ చేస్తారు. రాష్ట్రంలో మూడు మైనారిటీ వైద్య కాలేజీలు, ఒక దంత వైద్య కాలేజీకి కలిపి 500 సీట్లు ఉన్నాయి. వాటిల్లో ప్రస్తుత ఏడాది 250 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయగా.. వచ్చే ఏడాది అవి 300కు పెరుగుతాయి. -
ఫాతిమా విద్యార్థుల ఆశలు ఆవిరి
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైద్య మండలి (ఎంసీఐ) చర్యతో అడ్మిషన్ కోల్పోయిన ఫాతిమా వైద్య కళాశాల 2015–16 బ్యాచ్ విద్యార్థులను ప్రస్తుత విద్యా సంవత్సరంలో సర్దుబాటు చేసేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ (మిస్లేనియస్ అప్లికేషన్)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, ఎంసీఐ అభిప్రాయాన్ని పరిశీలించిన అనంతరం.. ఈ కేసులో ఇంకా ముందుకు వెళ్లేందుకు ఏమీ లేనందున ఇంతటితో ముగిస్తున్నామని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ జిల్లా కడప సమీపంలోని రామరాజుపల్లిలో గల ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో 2015–16 బ్యాచ్లో వంద మంది విద్యార్థులు చేరారు. ఆ తర్వాతి సంవత్సరంలో ఈ కళాశాలకు ఎంసీఐ గుర్తింపు రద్దు చేయడంతో వీరి చదువు అర్ధంతరంగా ఆగిపోయింది. కళాశాల యాజమాన్యం, ఎంసీఐ నిర్వాకం వల్ల తమ భవిష్యత్తు అంధకారమయం అయిందని విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఈ విద్యార్థులను ప్రస్తుత విద్యా సంవత్సరంలో సర్దుబాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 22న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సెప్టెంబర్ 21లోగా స్పందించాలని ఆగస్టు 30న జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎంసీఐ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేసింది. విద్యార్థులను ఏయే కళాశాలల్లో సర్దుబాటు చేస్తారో సెప్టెంబరు 21లోగా ప్రతిపాదనలను సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. అయితే, తదుపరి విచారణలో.. ఏపీ ప్రభుత్వ సీట్ల సర్దుబాటు ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్టు ఎంసీఐ ధర్మాసనానికి నివేదించింది. దీంతో మరో ప్రతిపాదనతో వస్తామని, రెండు వారాల గడువు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంతో సుప్రీంకోర్టు సమ్మతించింది. ఏపీ తాజా ప్రతిపాదనకూ నో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆమోదంతో మెరిట్ లిస్టులో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు నష్టం వాటిల్లకూడదని, తర్వాత అనుమతులు తెచ్చుకోవడంలో ఫాతిమా కళాశాల వైఫల్యం కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొంటూ ఏపీ సర్కారు కొత్త ప్రతిపాదనను ధర్మాసనానికి నివేదించింది. ఇదే ఫాతిమా కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ విద్యార్థులను చేర్చుకుని, ఆ మేరకు వచ్చే విద్యా సంవత్సరంలో సీట్లను తగ్గించుకోవాలని ప్రతిపాదించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ కళాశాలలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయని, వీటికి అదనంగా అవసరమైన సీట్లను కేటాయించాలని శుక్రవారం విచారణ సందర్బంగా కోరింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘మీరు ఈ ఏడాది సీట్లు పెంచాలని అడుగుతున్నారు. వచ్చే ఏడాది సీట్లను రద్దు చేయాలని చెబుతున్నారు. మీ ప్రతిపాదనలు, ఎంసీఐ స్పందన పరిశీలించాం. ఇక ఈ కేసులో ముందుకు వెళ్లలేం.. ఇంతటితో కేసును ముగిస్తున్నాం..’ అని ధర్మాసనం స్పష్టీకరించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే.. కోర్టు తీర్పు వినగానే బయటకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఓ విద్యార్థి తండ్రి, పలువురు విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోయారు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోయిందని, తమకు ఆత్మహత్యలే మిగిలి ఉన్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అటు ఎంసీఐని, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయిందని కన్నీరు పెట్టుకున్నారు. -
తప్పెవరిది ?
-
వైద్యులకు ప్రత్యేక ఆధార్: ఎంసీఐ
సాక్షి, అమరావతి : డిజిటల్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్లో భాగంగా దేశ వ్యాప్తంగా వైద్యులకు ఆధార్ తరహాలో యునిక్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ (యూపీఆర్ఎన్) ఇవ్వాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లో వైద్య విద్య పూర్తి చేసిన వారు వైద్యులుగా ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇందువల్ల ఒక రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివిన వారికి ఆ రాష్ట్రంలో కేటాయించే నంబర్.. మరో రాష్ట్రంలో మరొకరికి కూడా ఉంటుంది. ఇలా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఒకే నంబర్పై పదుల సంఖ్యలో వైద్యులు ఉంటున్నారు. ఇందువల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఎంసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యులు ఎంసీఐ వెబ్సైట్లో లాగిన్ అయ్యి యూపీఆర్ఎన్ నంబర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. పీజీ, ఆపై ఉన్నత విద్య అభ్యసించాక కూడా ఇదే నంబర్పై అప్డేట్ చేసుకోవచ్చు. కాగా, ఈ విధానం వల్ల ప్రజలు ఇకపై ఏ వైద్యుడి వివరాలు అయినా తెలుసుకోవచ్చు. -
వర్ణాంధులకు వైద్యవిద్యలో ప్రవేశం: సుప్రీం
న్యూఢిల్లీ: వర్ణాంధత్వం (కొన్ని రంగులను గుర్తించలేకపోవడం)తో బాధపడుతున్న ఇద్దరు విద్యార్థులను ఎంబీబీఎస్ చదివేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. 2015 ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించినా వర్ణాంధత్వం కారణంగా త్రిపురకు చెందిన ఇద్దరు విద్యార్థులకు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) గతంలో ఎంబీబీఎస్ అడ్మిషన్ను నిరాకరించింది. వాస్తవానికి ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఎంబీబీఎస్ చదవకూడదని నిబంధనలు లేకున్నా, వివిధ కళాశాలలు, ఎంసీఐ వీరికి అడ్మిషన్ ఇవ్వలేదు. దీనిపై విద్యార్థులు తొలుత త్రిపుర హైకోర్టుకు వెళ్లినా వారికి నిరాశే ఎదురైంది. అనంతరం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం... 2018–19 విద్యా సంవత్సరంలో వీరికి ఓ కళాశాలలో సీట్లు కేటాయిస్తూ తీర్పు వెలువరించింది. అంతకుముందు... వర్ణాంధత్వం ఉన్నవారు వైద్యులుగా పనిచేసేందుకు అర్హులో కాదో తేల్చడానికి ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఓ కమిటీని కూడా నియమించింది. వర్ణాంధత్వం వల్ల డాక్టర్లకు వృత్తిలో ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవనీ, అయితే కేటగిరీ–1 లేదా అంతకన్నా ఎక్కువ వర్ణాంధత్వం ఉన్న వారిని వైద్యవిద్య చదివేందుకు అనుమతించకుండా నిబంధనలు తీసుకురావాలని కమిటీ సిఫారసు చేసింది. -
పుదుచ్చేరిలో 770 ఎంబీబీఎస్ అడ్మిషన్లు రద్దు
పుదుచ్చేరి: పుదుచ్చేరిలోని పలు డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని 770 ఎంబీబీఎస్ అడ్మిషన్లను మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రీకృత కౌన్సిలింగ్ నిర్వహించకపోవడమే గాకుండా గడువు ముగిసిన అనంతరం గతేడాది ప్రవేశాల ప్రక్రియ నిర్వహించారని ఎంసీఐ పేర్కొంది. 2016–17 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన మొత్తం 770 మంది ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అడ్మిషన్లను రద్దు చేయాలని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య సేవల విభాగం డైరెక్టర్కు సెప్టెంబర్ 7న ఎంసీఐ లేఖ రాసింది. -
‘ఫాతిమా’ కేసులో ఎంసీఐ, ఏపీకి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: కడప ఫాతిమా మెడికల్ కళాశాల కేసు విచారణ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఫాతిమా కాలేజీ విద్యార్థులను ఇతర కళాశాల్లోకి సర్దుబాటు చేసే పరిస్థితి ఉందా అని న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రశ్నించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది సమాధానం ఇస్తూ 13 ప్రభుత్వ, ప్రయివేట్ కాలేజీల్లో విద్యార్థులను సర్ధుబాటు చేస్తామని తెలిపారు. తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది. మరోవైపు సుప్రీంకోర్టు నోటీసులపై ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులను ఏవిధంగా రీ లోకేట్ చేసేది... వారం రోజుల్లో న్యాయస్థానానికి తెలుపుతామన్నారు. విద్యార్థులకు నష్టం లేకుండా చూస్తామని, అలాగే ఫాతిమా కాలేజీపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని తెలిపారు. కాగా కనీస వసతులు లేని కారణంగా ఫాతిమా ప్రైవేటు వైద్య కళాశాలకు అనుమతి ఇవ్వలేమని, 2014-15 బ్యాచ్కు చెందిన విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తున్నట్లు భారత వైద్య మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. కళాశాల యాజమాన్యం తప్పిదానికి తమ భవిష్యత్తును ఫణంగా పెట్టడం బాధాకరమని, తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
‘ఎంసీఐ’ కమిటీని మేమే నియమించాలా?
న్యూఢిల్లీ: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వ్యవహారాల పర్యవేక్షణకు వెంటనే కమిటీని నియమించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసి ఏడాది గడువిచ్చినా కేంద్రం సొంత కమిటీని నియమించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు వెంటనే కొత్త కమిటీని ఏర్పాటు చేయండి. ఇందులో సభ్యులుగా ఉండేందుకు దేశంలో ప్రతిభావంతులు చాలామంది ఉన్నారు’ అని సీజేఐ జస్టిస్ ఖేహర్, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ల ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ కేంద్రం కమిటీ ఏర్పాటుకు ముందుకు రాకుంటే తామే కమిటీని నియమిస్తామని సుప్రీం తేల్చిచెప్పింది. దీంతో కొత్త కమిటీ సభ్యుల జాబితాను మంగళవారం అందజేస్తామని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ కోర్టుకు తెలిపారు. -
ఈ సారీ.. నిరాశే!
► రిమ్స్కు లభించని ఎంసీఐ అనుమతులు ► 600 మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం ఒంగోలు సెంట్రల్ : ఆశ.. నిరాశే అయింది. ఈ సారి కూడా రిమ్స్కు ఎంసీఐ అనుమతులు రాలేదు. కొన్ని చిన్న, చిన్న కారణాలను ఎత్తిచూపుతూ భారతీయ వైద్యమండలి రిమ్స్కు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చేందుకు అంగీకారం తెలపలేదు. ఈ మేరకు ఆన్లైన్లో రిమ్స్కు గురువారం ఎంసీఐ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో 600 మంది వైద్య విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పూర్తిస్థాయి అనుమతులు వస్తేనే వైద్య విద్యార్థులకు ఇచ్చిన పట్టాలకు గుర్తింపు ఉంటుంది. లేకుంటే పీజీ ఎంట్రన్స్ రాయాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా అర్హత ఉండదు. పనికిరాని పట్టాలు.. ఇప్పటికే ఒక బ్యాచ్ వైద్య విద్యార్థులు హౌస్ సర్జన్ షిప్ను పూర్తి చేసుకున్నారు. వైద్య పట్టాలు పుచ్చుకుని కూడా ఏం చేయడానికి వీలు గాక ఖాళీగా ఉంటున్నారు. ఏప్రిల్ నుంచి మరో బ్యాచ్ ఎంబీబీఎస్ పరీక్షలను పూర్తి చేసుకుని హౌస్ సర్జన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మరో 400 మంది ప్రస్తుతం రిమ్స్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. రిమ్స్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కానీ, వైద్య విద్యను, వైద్యులను పర్యవేక్షించే భారతీయ వైద్య మండలి మాత్రం తగిన సౌకర్యాలు లేవని అనుమతులు ఇవ్వడం లేదు. ప్రజాధనం వృథా.. ఇప్పటి వరకూ మూడు నాలుగు సార్లు ఎంసీఐ పరిశీలనకు దరఖాస్తు చేసుకోవడంతో రూ. 10 లక్షలకు పైగా ప్రజాధనం వృథా అయింది. ఎంసీఐ పరిశీలించాలంటే వారికి దాదాపు రూ.3 లక్షలు ముందుగా చెల్లించాలి. ఇవి గాక వారు వచ్చినప్పుడు వసతి ఖర్చులు అదనం. ఇలా లక్షలాది రూపాయలు వృథా అయ్యాయి. సమస్యలు పరిష్కరించాం.. ఎంసీఐ అభ్యంతరాలను తాము పూర్తి చేశాం. వాటి ఫొటోలు తీసి ఎంసీఐకి పంపుతున్నాం. గతంలో రిమ్స్కు పూర్తిస్థాయిలో అనుమతులు రావడానికి రెండోసారి వచ్చిన సమయంలో లేవనెత్తిన అభ్యంతరాలను మూడో పర్యటనకు పరిష్కరించాం. అధికారులు వాటిని చూడకుండా కొత్తగా చిన్న, చిన్న కారణాలను ఎత్తిచూపుతూ అనుమతులు నిరాకరించారు. – డాక్టర్ వల్లీశ్వరి, రిమ్స్ డైరక్టర్ అభ్యంతరాలివీ.. ► రిమ్స్లో 600 ఎంఎ ఎక్స్కే విభాగంలో కిటికీలు ఉన్నాయి. ఎక్స్రే యంత్రం అమర్చిన గదిలో కిటికీలు ఉండకూడదు. ► లైబ్రరీలో 7,090 పుస్తకాలు ఉన్నప్పటికీ, వేరు, వేరు రచయితలవి లేవు. ► డెర్మటాలజీ విభాగంలో సీనియర్ రెసిడెంట్ వైద్యులు లేరు. ► ఇంటెన్సివ్ కరోనరీ కేర్ యూనిట్ (ఐసీసీ యూ)ను రిమ్స్లో ఏర్పాటు చేయలేదు. -
అణువణువూ పరిశీలన
అనంతపురం మెడికల్ : ప్రభుత్వ మెడికల్ కళాశాల, సర్వజనాస్పత్రిలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సభ్యులు అణువణువూ పరిశీలించారు. గురువారం ఉదయాన్నే ఎంసీఐ సభ్యులు ఆర్కే మహేశ్వరి (రాజస్థాన్), జిగ్నాదేవ్ (గుజరాత్), షర్మిలాపాల్ (కోల్కతా) కళాశాలకు చేరుకున్నారు. ముందుగా ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావును కలిశారు. ఆ తర్వాత ప్రిన్సిపల్తో పాటు వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ చిట్టి నరసమ్మ, డాక్టర్ జేసీ రెడ్డితో కలిసి వేర్వేరుగా పరిశీలన ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాల, ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గత ఏడాది కళాశాలలోని ఎనిమిది విభాగాలకు గాను 37 పీజీ సీట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గత సెప్టెంబర్లో న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎంసీఐ సభ్యులు మైక్రో బయాలజీ, పెథాలజీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాల్లో పీజీ సీట్ల మంజూరు కోసం తనిఖీ చేశారు. ఆ తర్వాత మైక్రో బయాలజీ విభాగానికి మాత్రమే కేవలం నాలుగు పీజీ సీట్లు మంజూరయ్యాయి. మిగిలిన విభాగాల్లో కొన్ని లోపాల కారణంగా సీట్లు మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఎంసీఐ సభ్యులు పర్యటించారు. ఎంసీఐ నిబంధనల మేరకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు ఉన్నారో, లేదో పరిశీలించారు. విభాగాల వారీగా ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్ల వివరాలను తెలుసుకున్నారు. పలు విభాగాల్లోని యంత్రాలు, డిజిటలైజేషన్పై ఆరా తీశారు. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉందని సభ్యులు సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మరిన్ని పీజీ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని కళాశాల యాజమాన్యం భావిస్తోంది. బృందం వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, పీడియాట్రిక్ హెచ్ఓడీ డాక్టర్ మల్లీశ్వరి, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మతో పాటు ఆయా విభాగాల హెచ్ఓడీలు, ఇతర వైద్యులు ఉన్నారు. -
రాత మారాల్సిందే..
► ప్రిస్కిప్షన్లలో స్పష్టతకు ఎంసీఐ ఆదేశాలు ► గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా బేఖాతర్ ► జనరిక్ మందులు రాయని వైద్యులు ► కమీషన్ల కోసమేనని ఆరోపణలు ఆదిలాబాద్: వైద్యులు పెద్ద అక్షరాలతో, జనరిక్ మందులనే ప్రిస్కిప్షన్లో రాయాలని ఇటీవలే ప్రధాని మోదీ పేర్కొన్నారు. జనరిక్ మందులనే రాయాలని గతంలోనే సుప్రీంకోర్టు వైద్యులకు సూచించింది. అయిప్పటికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావడం లేదు. ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి వైద్యులు తప్పనిసరిగా జనరిక్ మందులే రాయాలని, పెద్ద అక్షరాలతోనే అందరికీ అర్థమయ్యే రీతిలో రాయాలని ఆదేశించింది. నిబంధనలు పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉమ్మడి జిల్లాలోని ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పెద్ద అక్షరాలతో మందుల చీటీలు రాయడం లేదు. జనరిక్ మందులు కూడా రాయడం లేదు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో కొంతమందే జనరిక్ మందులు రాస్తున్నారు. మిగతావారు ప్రైవేట్ మందులు రాసిస్తున్నారు. ఎవరికీ అర్థంగాని రాత.. సాధారణంగా మనం జ్వరం లేదా ఏ అనారోగ్య సమస్యతో అయినా ఆస్పత్రికి వెళ్తే అక్కడ వారు ఇచ్చే కేషీట్ నుంచి మొదలు డిశ్చార్జ్ రిపోర్టు వచ్చేంతవరకు వారు రాసే ప్రిస్కిప్షన్ ఎవరికీ అర్థం కాదు. చదవడానికి ప్రయత్నించినా సమయం వృథా అవుతుంది. చాలా మంది వైద్యులు ఎవరికీ అర్థంకాని రీతిలో గొలుసుకట్టు రాత రాస్తున్నారు. ఇది వారి మందుల దుకాణం యజమానికే తెలుస్తుంది. చాలా ఆస్పత్రులు, క్లినిక్ల వద్ద ప్రత్యేకంగా మందుల దుకాణాలుంటాయి. సదరు వైద్యుడికి ఆ మెడికల్ షాపు కమీషన్ ఇస్తుంది. డాక్టర్లు రాసిచ్చే చిట్టీలు డాక్టర్కు సంబంధం ఉన్న మెడికల్ షాపులోనే తీసుకోవాలి. ఇతర షాపులకు వెళ్లినా ఈ చీటి వారికి అర్థం కాదు. చిట్టీలోని మొదటి అక్షరాన్ని గుర్తించి లేదా వారు ముందే అనుకున్న కోడ్ భాషను బట్టి మందులు ఇస్తున్నారు. కమీషన్ల కోసమే.. చాలామంది వైద్యులకు వారు రాసిన మందులపైనే మందుల దుకాణం యజమానులు కమీషన్లు ఇస్తుంటారు. ఎంత ఎక్కువ మొత్తంలో మందులు రాసి రోగి చేత ఎక్కువ మందులు కొనిపిస్తారో అంత ఎక్కువగా కమీషన్ వైద్యుడికి ఇస్తారు. ఈ కమీషన్ల కోసం కక్కుర్తి పడే కొందరు వైద్యులు రోగికి అవసరం లేకపోయినా అధికంగా మందులు రాస్తుంటారు. ఇది ప్రతీచోట జరుగుతున్న తంతు. ఒకవేళ రోగి తనకు ఐదు రోజుల మందులు మాత్రమే రాసివ్వండి అంటే వారిని బెదిరించి రోగం తగ్గాలా? వద్దా? అంటూ వైద్యులు భయపట్టించడం గమనార్హం. ఎలాగైనా ఈ విధానానికి చెక్ పెట్టాలనే ప్రభుత్వం అందరికీ సులువుగా అర్థమయ్యే భాషలో పెద్ద అక్షరాలతో మందుల చీటీలు రాయాలని ఆదేశించింది. క్రమశిక్షణ చర్యలు.. ఈ నిబంధనలు తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఎంసీఐ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు ఏమేరకు ఈ నిబంధనలు పాటిస్తారనేది ప్రశ్నార్థకమే. గతంలోనే సుప్రీంకోర్టు వైద్యుల చీటిరాతపై ఆదేశాలిచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. ఎంసీఐ సూచించినట్లుగా దీనిపై విస్తృతప్రచారం కల్పించాలనీ, ఈ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులను, వైద్యకళాశాలల డైరెక్టర్లకు ఎంసీఐ లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్యకళాశాలలో నిత్యం 1500 మంది రోగులు వస్తుంటారు. వీరికి మందుల చిట్టీలు అర్థంకాని రీతిలో వైద్యులు రాస్తుంటారు. రిమ్స్కు ఆనుకుని ఉన్న జనరిక్ ఔషధ కేంద్రంలో తక్కువ మందులు రాసి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో లభించే మందులే ఎక్కువగా రాస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా రాయడం ద్వారా వారికి కమీషన్లు వస్తున్నాయని వినిపిస్తోంది. ఎంసీఐ ఆదేశాలు ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి అమలయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడమే కాకుండా రోగులకు అర్థంకాని రీతిలో మందుల చీటీలు రాస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసర ఎంతైనా ఉంది. అనుకున్నట్లుగానే ఎంసీఐ నిబంధనలు అమలు చేస్తే ఇక రోగులకు వైద్యులు ఏ మందులు రాసిస్తున్నారో అర్థం చేసుకుంటారు. దీంతో వారు మోసపోయే అవకాశం కూడా ఉండదు. -
జనరిక్ మందులు రాయకుంటే చర్యలు
న్యూఢిల్లీ: ఇక వైద్యులు జనరిక్ మందులనే ప్రిస్క్రిప్షన్లో రాయాలని, అలా రాయని వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) హెచ్చరించింది. జనరిక్ మందులపై తాజాగా ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో చర్యలకు ఎంసీఐ నడుంబిగించింది. వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్లో మందుల పేర్లను పెద్దక్షరాలతోనే (కేపిటల్ లెటర్స్) రాయాలని ఆదేశించింది. 2016లోనే ఈ ఆదేశాలు జారీ చేసినా సరిగా అమలు కాకపోవడంతో.. ఇకపై చర్యలకు ఉపక్రమించనున్నట్లు పేర్కొంది. -
300 ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణ
♦ రద్దు చేసిన సీట్ల భర్తీకి ఎంసీఐ ఆమోదం ♦ 2017–18 అడ్మిషన్లలో ఆ మూడు కాలేజీ సీట్లు యథాతథం ♦ కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన 50 సీట్లపై సందిగ్ధత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనుమతి నిరాకరించిన 300 ఎంబీబీఎస్ సీట్లను పునరుద్ధరిం చడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) ఎట్టకేలకు అంగీకరించింది. నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పిస్తామం టూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన హామీపత్రంతో సీట్ల పునరుద్ధరణకు ఎంసీఐ అంగీకరించింది. దీంతో ఉస్మానియా మెడికల్ కాలేజీలోని 50, నిజామాబాద్ మెడికల్ కాలేజీలోని 100, మహబూబ్నగర్ మెడికల్ కాలేజీకి చెందిన 150 సీట్లను యథా విధిగా ఈ ఏడాది భర్తీ చేసుకోవడానికి అవకాశం చిక్కిం ది. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన 50 ఎంబీబీఎస్ సీట్లను పునరుద్ధరించే విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి ఎంసీఐ సమావేశంలో కాకతీయ మెడికల్ కాలేజీ సీట్లపై నిర్ణయం తీసుకుంటారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో ఆ సీట్లపై సందిగ్ధత కొనసాగుతోంది. సిబ్బంది కొరతే కారణం.. ప్రతీ ఏటా ఎంసీఐ తనిఖీలు నిర్వహిస్తుంటుం ది. మౌలిక సదుపాయాలు, ఇతరత్రా వసతులు లేకపోవడంతో అనేక సందర్భాల్లో సీట్ల రద్దు జరుగుతోంది. అందులో భాగంగానే పై 4 కాలేజీల సీట్ల భర్తీకి ఎంసీఐ నిరాకరించింది. ఎంసీఐ తనిఖీల్లో కాకతీయ మెడికల్ కాలేజీలో 19.06 శాతం బోధనా సిబ్బంది కొరత ఉన్నట్లు గుర్తించారు. వార్డుల్లో వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు గదుల్లేవు. కేంద్ర ప్రయోగశాల లేదు. 150 మంది విద్యార్థులు పరీక్ష రాసే సామర్థ్యమున్న గదుల్లో 250 మందిని కూర్చోబెడుతున్నారు. ఇక మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలో 30.85 శాతం బోధనా సిబ్బంది కొరత ఉందని తేల్చారు. 17.02 శాతం రెసిడెం ట్ వైద్యుల కొరత ఉంది. నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరత 10.15 శాతం ఉంది. ఐదేళ్ల అనుభవమున్న వారినే మెడికల్ సూపరింటెం డెంట్గా నియమించారు. రెండుచోట్లా బోధన సిబ్బందికి నివాస సదుపాయం పూర్తిస్థాయిలో లేదు. ఉస్మానియా, నిజామాబాద్ మెడికల్ కాలేజీల్లోనూ లేబొరేటరీ, లైబ్రరీ, సిబ్బంది, మౌలిక సదుపాయాల వంటివి లేవు. సీట్ల రెన్యువల్ సమయంలో ఎంసీఐ తనిఖీలకు వచ్చినప్పుడు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బం ది సగానికి మించి ఉండటం లేదన్న విమర్శలు న్నాయి. ఎంసీఐ తనిఖీలకు వచ్చినప్పుడు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సహా అధ్యాపక సిబ్బందిని తాత్కాలికంగా తీసుకొచ్చి ఎం సీఐని పక్కదారి పట్టిస్తున్న స్థితి ఉందన్న ఆరో పణలున్నాయి. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను కాపాడుకోవడం వైద్య ఆరోగ్య శాఖకు దినదినగండంగా మారిం ది. ఏటా ఎంసీఐ తనిఖీలకు రావడం.. పలు లోపాల కారణంగా సీట్ల పునరుద్ధరణకు తిరస్కరించడం పరిపాటిగా మారింది. -
మెడికల్ పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్!
వచ్చేవారంలో ఔట్ సోర్సింగ్లో ఉద్యోగాలు మెడికల్ కళాశాలలో భర్తీకి ప్రభుత్వం అనుమతి ఎంసీఐ పుణ్యమాని మెడికల్ కళాశాలలో పోస్టుల భర్తీ కొలిక్కి వచ్చింది. రెగ్యులర్ భర్తీని కాకుండా తక్షణమే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టుల భర్తీని చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏదీ ఏమైనా ఖాళీల కొరత కొంత మేరకు తగ్గనుంది. పోస్టుల భర్తీకి సంబంధించి కళాశాల అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద సమావేశాలు నిర్వహించి కొలిక్కి తీసుకొచ్చారు. – నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ అర్బన్ : ఐదో సంవత్సరానికి రద్దయిన 100 సీట్లను పొందేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమైన పోస్టుల భర్తీపై దృష్టిసారించింది. ఇదివరకే ఎంసీఐ లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించిన అధికారులు పోస్టుల భర్తీపై పడ్డారు. వీటిని జనవరిలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమైన ఖాళీలను తక్షణమే భర్తీ చేయనున్నారు. గతంలో ప్రకటించిన 150 జీవో ప్రకారం 880 పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయాల్సి ఉండేది. ఇది తక్షణమే సాధ్యం కాకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేపట్టాలని నిర్ణయించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఇందిర, జనరల్ ఆస్పత్రి సూపరింటిండెంట్ రాములు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విన్నవించారు. వారం రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులతో సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విన్నవించారు. అనంతరం సీఎం ఆమోదం కోసం ఫైల్ పంపగా ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రశేఖర్రావు అనుమతి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలు ఉంది. గత శుక్ర, శనివారం కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర, డీఎంఈ రమణిలు కలువగా ఈ విషయంను ఉన్నతాధికారులు వెల్లడించినట్లు తెలిసింది. కాగా ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో 150 పోస్టులు తక్షణమే భర్తీచేయాలని కళాశాల అధికారులు విన్నవించారు. కానీ.. ఇందులో ఎన్ని పోస్టులు ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తారన్నది ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసి రెండో వారంలో పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరి, మార్చిలో ఎంసీఐ పర్యటన ఉన్నందున ఈ పోస్టుల భర్తీపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో పారామెడికల్ సిబ్బంది, ఆస్పత్రికి సంబంధించి వైద్యసిబ్బంది, స్టాఫ్నర్సులు, ఏఎన్ఎంలు, నాలుగో తరగతి ఉద్యోగులు ఉన్నారు. వీరందరిని ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన నియమించనున్నారు. రెగ్యులర్ ఉద్యోగాలు ఇంకా ఆలస్యం మెడికల్ కళాశాల ఏర్పడగానే 2012 సంవత్సరంలో 150 జీవోను పోస్టుల భర్తీకి సంబంధించి నాటి ప్రభుత్వం విడుదల చేసింది. 880 పోస్టులను భర్తీచేసేందుకు నిర్ణయించారు. ఇందులో డాక్టర్లు, స్టాఫ్నర్సులు, పరిపాలన విభాగంలోని జూనియర్, సీనియర్, సూపరింటెండెంట్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, ఆస్పత్రి విభాగంలో నాలుగో తరగతి ఉద్యోగులు, టెక్నికల్ ఉద్యోగులు, ఎక్స్రే, రేడియేషన్, అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్టెక్నిషన్లు, ఫార్మాసిస్టులు, డ్రైవర్లు, దోబీలు, సెన్నో, లైబ్రేరియన్, పారామెడికల్ సిబ్బంది తదితర పోస్టులను మంజూరు చేశారు. వీటిని రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు నాలుగేళ్లు గడుస్తున్న ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తెరపైకి రావడంతో రెగ్యులర్ ఉద్యోగాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తక్షణ కొరతను తీర్చేందుకు ఔట్ సోర్సింగ్ను తెరపైకి తేవడంతో దీనినే కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తుంది. కొన్నెళ్లుగా రెగ్యులర్ ఉద్యోగాల కోసం ఎందరో నిరుద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నవారు సక్రమంగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ పోస్టులు పడితే పరిస్థితి మారుతుందని వారు ఆలోచనలో ఉన్నారు. వీరు కూడా నిరాశ చెందుతున్నారు. జనవరిలో నియామకాలు.. మెడికల్ కళాశాలలో తక్షణమే అవసరమైన పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకం చేపడుతాం. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పోస్టుల అవసరాన్ని తెలియజేశాం, అనుమతి వచ్చింది. ఎన్ని పోస్టుల భర్తీ, ఎప్పుడు అన్నది మరో వారం రోజుల్లో అధికారికంగా తెలుస్తుంది. జనవరి మొదటి వారంలో ఔట్ సోర్సింగ్ నియామకాలు జరిగే అవకాశం ఉంది. – ఇందిర, కళాశాల ప్రిన్సిపల్. -
ఎంసీ‘ఐ’
- సర్వజనాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంసీఐ బృందం - వివిధ విభాగాలను నిశితంగా పరిశీలించిన సభ్యులు అనంతపురం న్యూసిటీ : ‘‘ కొన్ని విభాగాల్లో ప్రొఫెసర్ల కొరత స్పష్టంగా కన్పిస్తోంది. సిబ్బంది పూర్తీ స్థాయిలో లేరు.. ఇంకా మెరుగుపడాలి’’ అని ఎంసీఐ బృందం పేర్కొంది. వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల రెన్యూవల్కు సంబంధించి గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం ఇక్కడ పర్యటించింది. అప్పుడు పలు లోటుపాట్లను గుర్తించినా సీట్ల రెన్యూవల్కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ లోటుపాట్లు సరిదిద్దారా..? లేదా అన్న విషయాలు తెలుసుకునేందుకు శుక్రవారం ప్రొఫెసర్లు డాక్టర్ జ్యోతికృష్ణ (బీహార్), డాక్టర్ రామకృష్ణారెడ్డి (కర్నాటక), బసవరాజు (బళ్లారి) బృందం ప్రభుత్వ సర్వజనాస్పత్రి, వైద్య కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. వీరు మూడు బృందాలుగా ఏర్పడి ఆస్పత్రిలోని మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్, లేబర్, బ్లడ్ బ్యాంక్, సర్జరీ, ఆప్తమాలజీ, డెర్మటాలజీ, క్యాజువాలిటీ, వైద్య కళాశాలలోని వివిధ విభాగాలతో పాటు ఓపీ కౌంటర్ను నిశితంగా పరిశీలించారు. రోజూ ఓపీకి ఎంత మంది రోగులు వస్తున్నారని ఆరా తీశారు. అందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ రోజూ 1200 ఓపీ, 800 ఇన్పేషంట్లున్నారని సమాధానమిచ్చారు. సర్జరీ విభాగంలోని ఎంఎస్ –1, ఎంఎస్–2, ఆపరేషన్ థియేటర్ను కూడా పరిశీలించారు. హెచ్ఓడీ డాక్టర్ రామస్వామినాయక్తో గత కొన్నేళ్లుగా ఏ మేరకు శస్త్ర చికిత్సలు చేశారో వాటి వివరాలను సేకరించారు. అనంతరం సర్జరీ విభాగం వైద్యులతో వారు ఎటువంటి సర్జరీలు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. డెంగీ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం ఏర్పాటు చేసిన చిన్న పిల్లల ప్రత్యేక వార్డును పరిశీలించారు. మెయిన్ ఆపరేషన్ థియేటర్, ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో ఎటువంటి సదుపాయాలున్నాయో చూశారు. సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ ఏవిధంగా పని చేస్తోందో ఆరా తీశారు. రోజూ డెలివరీలు ఏమాత్రం జరుగుతాయని గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్ బేగంను ఆరా తీశారు. మెటర్నిటీ సెలవును మాత్రమే పరిగణిస్తాం ఇద్దరు, ముగ్గురు వైద్యులు క్యాజువల్ లీవ్లో ఉండటాన్ని కూడా ఎంసీఐ బృంద సభ్యులు ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం క్యాజువల్ లీవ్ (సీఎల్)ను పరిగణలోకి తీసుకోం కదా.. దాన్నే కారణంగా చూపితే ఎలా అని గైనిక్ విభాగంలో ఉన్న వారిని అడగ్గా... వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. వైద్య కళాశాలలో ఎంసీఐ బృందం అన్ని విభాగాల హెడ్కౌంట్ను పరిశీలించారు. కొంత మంది వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వారు అలాగే నివేదికలో పొందుపరుస్తామని తేల్చి చెప్పారు. ఈఎన్టీలో ఛాతివైద్య నిపుణుడా..? ఏం సార్ ఇది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈఎన్టీ విభాగంలో ఛాతివైద్య నిపుణుడిని ఉంచితే ఎలా..? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అన్ని విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వివరాలను రికార్డు చేసుకున్నారు. -
ఒక డాక్టర్.. ఒకే నంబర్
దేశవ్యాప్తంగా డాక్టర్లకు ప్రత్యేక గుర్తింపు నంబర్లు ఈ విధానాన్ని అమల్లోకి తేనున్న భారతీయ వైద్యమండలి వైద్యకళాశాలల్లో బోధనా సిబ్బంది కొరతను అధిగమించేందుకే.. ఇకపై హాజరు శాతాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఒక డాక్టర్ ఒకే నంబర్ తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలని భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) భావిస్తోంది. దీనివల్ల ఏ వైద్యుడు ఎక్కడ పనిచేస్తున్నాడో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతోంది. డిజిటల్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ (డీఎంఎంపీ)లో భాగంగా ఈ విధానాన్ని అమల్లోకి తేనుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలు మొత్తం 500కు పైగా ఉన్నాయి. 53వేల మందికి పైగా వైద్యులు ఉన్నారు. అయితే ఇప్పటికీ అటు ప్రైవేటు గానీ, ఇటు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గానీ తగినంత మంది అధ్యాపక సిబ్బంది లేరు. ఎంసీఐ తనిఖీలకు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఎక్కడో చోట బయటనుంచి వైద్యులను తీసుకురావడం, పబ్బం గడుపుకోవడం ఆ తర్వాత వారిని పంపించడం ఇదే జరుగుతోంది. దీనివల్ల ఎంబీబీఎస్ లేదా పీజీ చదువుతున్న వైద్యులకు సరైన బోధన అందడం లేదు. దీనిపై పలు ఫిర్యాదులు వచ్చినా భారతీయ వైద్యమండలి చర్యలు తీసుకోలేకపోతోంది. దీనికి ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. శాశ్వత యునిక్ ఐడీ నంబర్ కేటాయింపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైద్యమండలి రిజిస్ట్రేషన్ నంబర్లే వైద్యులకు ప్రాతిపదికగా ఉన్నారుు. ఏ రాష్ట్రంలో నమోదు చేసుకుంటే ఆ రాష్ట్రంలో నంబరు ఇస్తారు. ఇప్పుడలా కాకుండా దేశవ్యాప్తంగా యునిక్ ఐడెంటిటీ నంబర్ కేటారుుస్తారు. ఈ నంబరు కేటారుుంచిన తర్వాత డాక్టరు పేరు, స్పెషాలిటీ, పనిచేస్తున్న చోటు తదితర వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఒకవేళ వృత్తిపరంగా ఏదైనా సంస్థ మారినా, నర్సింగ్హోంలు, సూపర్స్పెషాలిటీ ఆస్పత్రులు సొంతంగా నిర్వహించుకున్నా వివరాలన్నీ ఆన్లైన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రైవేటు వైద్య కళాశాలల్లో గానీ, ప్రభుత్వ వైద్య కళాశాలల్లోగానీ పనిచేసే వారి విషయంలో మరింత కచ్చితత్వం వస్తుంది. ఒక డాక్టరుకు ఒకే యునిక్ నంబరు ఉంటే, మరో సంస్థలో పనిచేయడం కుదరదు. దీనివల్ల బోధనా సిబ్బంది కొరతను అధిగమించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్యకళాశాలల్లో హాజరు పట్టికను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే అవకాశం ఉంటుందని ఎంసీఐ యోచన. ఈ విధానం గనుక అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో కనీసం వెయి మంది అధ్యాపకులను ప్రభుత్వం తక్షణమే నియమించాల్సి వస్తుంది. లేదంటే ఉన్న సీట్లన్నీ గల్లంతయ్యే అవకాశం ఉంది. -
ముహూర్తం ఎప్పుడో?
– మొదటి సంవత్సర తరగతులకు అనుమతి – మెడికల్ కళాశాల, ఆస్పత్రి వైద్యాధికారులు సిద్ధం – ఎంసీఐ మూడో విజిట్ కోసం ఎదురుచూపులు వారంరోజుల నుంచి ఈరోజు.. రేపు అంటూ ఒక్కటే ఉత్కంఠ.. ఎంసీఐ విజిట్ కోసం మెడికల్ కళాశాల అధికారులు.. జిల్లా ఆస్పత్రి వైద్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. మరోవైపు ఎంబీబీఎస్ మొదటి సంవత్సర తరగతుల నిర్వహణకు అనుమతి లభించింది. మమబూబ్నగర్ క్రైం : ఎంసీఐ విజిట్ కోసం అవసరమైన ఏర్పాట్లతో పాటు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చారు. కళాశాల నిర్వహణకు ఒకవైపు వైద్యులతోపాటు సిబ్బంది రిక్రూట్మెంట్ చేశారు. మరోవైపు ల్యాబ్ పరికరాలు, ఫర్నిచర్, పుస్తకాలు ఇలా ప్రతి ఒక్కటీ కళాశాలకు చేరుకున్నాయి. అయితే మెడికల్ కళాశాలను విజిట్ చేసి అనుమతి మంజూరు చేయాల్సిన ఎంసీఐ బందం మాత్రం రావడంలేదు. గత నెల 28నుంచి 31వ తేదీ మధ్య వస్తున్నారని ప్రచారం జరిగింది. ఇంతవరకు వారు రాకపోవడంతో అసలు ఎప్పుడు వస్తారోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏ సమయంలోనైనా కళాశాలను ఆకస్మికంగా విజిట్ చేస్తారనే ఉద్దేశంతో స్థానికంగా పనిచేసే వైద్యుల నుంచి సిబ్బంది వరకు ప్రతిరోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు పరిశీలన ఇప్పటికే రెండుసార్లు పరిశీలించిన బందం చివరగా మూడోసారి వచ్చి కళాశాల నిర్వహణకు ముఖ్యమైన సౌకర్యాలు కల్పించారో.. లేదో చూడాల్సి ఉంది. గతంలో నిర్వహించిన ఎంసెట్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం వల్ల పాలమూరు మెడికల్ కళాశాల ప్రారంభానికి ఆలస్యమైంది. అయితే ఇప్పటికే ఎంసీఐ నుంచి జిల్లా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతి లభించింది. ప్రస్తుతం ఎంసెట్ పరీక్ష నిర్వహించి వాటి ఫలితాలు వచ్చిన తర్వాత కానీ కళాశాల ప్రారంభమయ్యే అవకాశం కనిపించడంలేదు. దీనికి రెండు నెలల సమయం పట్టే అవకాశముంది. వైద్యులు, సిబ్బంది నియామకం పాలమూరు వైద్య కళాశాల కోసం 462పోస్టులను మంజూరు చేశారు. దీంట్లో 75మంది వైద్యులను ఎంపిక చేశారు. దీంట్లో 200మంది వైద్యులు, 200నర్సింగ్ సిబ్బంది, 64మంది పారామెడికల్ సిబ్బంది ఉంటారు. ఇటీవల జూనియర్, సీనియర్ వైద్యులు, టూటర్స్ కలుపుకొని మొత్తం 60మందిని నియమించారు. ఈ జిల్లాకు ఐదునెలల క్రితమే మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాల భవన నిర్మాణానికి రూ.450కోట్లు మంజూరు చేయగా ఎదిర శివారులో 75ఎకరాలను కేటాయించింది. అయితే ఆగస్టు నుంచే విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి వంద పడకల భవనంలో అన్ని సౌకర్యాలు కల్పించారు. మెడికల్ కళాశాలలో సౌకర్యాలు మెడికల్ కళాశాలలో అత్యంత ముఖ్యమైన ల్యాబ్లకు సంబంధించిన పరికరాలు ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. ప్రస్తుతం అనాటమీ, మైక్రోబయాలజీ, ఇతర ల్యాబ్ పరికరాలు వచ్చాయి. వాటన్నింటినీ స్థానిక గదుల్లో భద్రంగా ఉంచారు. విద్యార్థులకు తరగతులు బోధన చేయడానికి అవసరమైన బెంచీలు, టేబుళ్లు, కుర్చీలు తీసుకొచ్చారు. మొత్తం 150మంది విద్యార్థులకు ఐదు గదులను ఏర్పాటుచేశారు. విద్యార్థులకు ప్రాక్టికల్గా చూపించడానికి వైద్యులు మానవ అస్థిపంజరాలను అందుబాటులో ఉంచారు. ల్యాబ్ నిర్వహణకు కొత్త పరికరాలతోపాటు మిషన్లు ఏర్పాటుచేశారు. వారం రోజుల్లో రావచ్చు మెడికల్ కళాశాలను విజిట్ చేయడానికి వారం రోజుల్లో ఎంసీఐ బందం రావచ్చు. వారి కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. బందం వచ్చి వెళ్లిన తర్వాత ఎంసెట్ పూర్తిన వెంటనే ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభిస్తాం. – అశోక్రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ -
ఎంసీఐ విస్తృత తనిఖీలు
నెల్లూరు(అర్బన్) : దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెండో రోజు బుధవారం ఎంసీఐ విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఎంసీఐ టీం చైర్మన్, పాట్నా మెడికల్ కళాశాల ఫిజియాలజీ హెచ్ఓడీ ప్రొఫెసర్ ఎస్ఎన్శర్మ ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించారు. ల్యాబ్, ఎక్స్రే, థియేటర్, ఎమర్జెన్సీ విభాగాలను పరిశీలించారు. ప్రిన్సిపల్, డాక్టర్లతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. మెడికల్ కళాశాల అభివృద్ధికి చేపట్టిన చర్యలు గురించి ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు ఎంసీఐ బృందానికి వివరించారు. సంగం పీహెచ్సీలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా హౌస్ సర్జన్ కోసం నిర్మిస్తున్న భవనాలను పరిశీలించారు. ప్రిన్సిపల్ రవి ప్రభు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన నెల్లూరు మెడికల్ కళాశాల వసతులపై ఎంసీఐ బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపారు. ఎంసీఐ తనిఖీ బృందంలో రాయపూర్కు చెందిన జేఎన్ఎం మెడికల్ కళాశాల గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నళినిమిశ్రా, తమిళనాడు సేలం జిల్లాకు చెందిన మోహన్కుమార్మంగళం మెడికల్ కళాశాల పెథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ తెన్మాజి ఉన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవిప్రభు, పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, డాక్టర్ నిర్మల, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సీకే లక్ష్మీదేవి(అడ్మిన్), వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాధాకృష్ణరాజు(అకడమిక్) తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాల్లో ఎంసీఐ ఆకస్మిక తనిఖీ
డాక్టర్ల సర్టిఫికెట్ల పరిశీలన నెల్లూరు(అర్బన్): దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంగళవారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఎంబీబీఎస్ కోర్సులో రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగిడుతున్న విద్యార్థులకు వసతులు పరిశీలించి సీట్లు మంజూరు చేసేందుకు ఎంసీఐ బృందం తనిఖీలు చేపట్టింది. ముందస్తు సమాచారం లేకుండా ఎంసీఐ సభ్యులు మెడికల్ కళాశాలకు తనిఖీకి రావడంతో వి«ధుల్లో లేని, సెలవుపై వెళ్లిన డాక్టర్లు, ప్రొఫెసర్లను ప్రిన్సిఫల్ రవిప్రభు హడావుడిగా పిలిపించారు. పాట్నా మెడికల్ కళాశాల నుంచి వచ్చిన ఎంసీఐ టీం చైర్మన్, ఫిజియాలజీ హెడ్ డాక్టర్ ఎస్.ఎన్.శర్మ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కళాశాలలో ఫ్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తగినంతమంది ఉన్నారా.. లేరా అని ఆరా తీశారు. విద్యార్థులకు సరిపడా భవనాలు, ల్యాబొరేటరీలు, వసతిగృహాలు, నర్సింగ్ కళాశాల, వివిధ డిపార్ట్మెంట్లను తనిఖీ చేశారు. రాత్రి వరకు డాక్టర్ల సర్టిఫికెట్లను పరిశీలించారు. బుధవారం ఉదయం మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రి విభాగాలను పరిశీలించనున్నారు. అనంతరం ప్రిన్సిపల్, అధికారులతో ఎంసీఐ బృందం ప్రత్యేక సమావేశమైంది. ఈ కార్యక్రమంలో ఎంసీఐ టీం చైర్మన్ ఎస్.ఎన్.శర్మ, రాయ్పూర్కి చెందిన జేఎన్ఎం మెడికల్ కళాశాల గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నళినిమిశ్రా, సేలంకు చెందిన మోహన్కుమార్మంగళం, మెడికల్ కళాశాల పథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.తెన్మాజి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాధాకృష్ణరాజు(అకడమిక్). వైఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ సీకే.లక్ష్మీదేవి(అడ్మిన్), పెద్దాస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ భారతి పాల్గొన్నారు. -
వైద్యకళాశాలల అధ్యాపకుల హాజరుపై నిఘా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది హాజరును ప్రతీ రోజు ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా డిజిటైషన్ ప్రక్రియను ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. బోధనా సిబ్బంది విషయంలో కళాశాలల మోసాన్ని బయటపెట్టడం, పారదర్శకత కోసం ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. డిజిటల్ మిషన్ మోడ్ ప్రాజెక్టు(డీఎంఎంపీ)లో భాగంగా మొత్తం 439 వైద్య కళాశాలల్లో హాజరును బయోమెట్రిక్ వ్యవస్థతో ఎంసీఐ పర్యక్షిస్తుంది. ‘ఒక దేశం ఒక రిజిస్ట్రేషన్’ కింద డాక్టర్లకు ఎలక్ట్రానిక్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐటెంటిఫికేషన్(ఆర్ ఎఫ్ఐడీ) రిజిస్ట్రేషన్ కార్డులు ఐఎంసీఐ ఇవ్వనుంది. వీటి ద్వారా డాక్టర్ల కార్యకలాపాలను పర్యవేక్షించనుంది. -
జీజీహెచ్లో ఎంసీఐ తనిఖీలు
గుంటూరు మెడికల్ : గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి, ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో సోమవారం భారత వైద్య మండలి (ఎంసీఐ) ఇన్స్పెక్టర్లు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తనిఖీలు జరిగాయి. ప్రస్తుతం వైద్య కళాశాలలో 97 పీజీ సీట్లు ఉండగా అదనంగా 45 సీట్లు కావాలని గుంటూరు వైద్య కళాశాల అధికారులు ఎంసీఐని కోరారు. పీజీ సీట్లు పెంచేందుకు నిబంధనల ప్రకారం వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య సౌకర్యాలు, వైద్య పరికరాలు తదితరాలను తనిఖీచేసి ఎంసీఐ ఇన్స్పెక్టర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా సీట్లు పెరగటం జరుగుతుంది. అందులో భాగంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్, పిల్లల వైద్య విభాగం, పల్మనరీ డిపార్ట్మెంట్, పెథాలజీ, ఎస్పిఎం, మానసిక వ్యాధుల వైద్య విభాగాల్లో తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేశారు. ఆస్పత్రిలోని ఓపీ వైద్య విభాగాలు, ఇన్పేషెంట్ విభాగాలు, ల్యాబ్లు, క్యాజువాలిటీ, కళాశాలలోని గ్యాలరీలు, సిబ్బంది హాజరు పట్టీలు తనిఖీ చేశారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ మెండా ఫర్నికుమార్, డాక్టర్ నల్లూరి మురళీకృష్ణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజు నాయుడు, ఆయా వైద్య విభాగాధిపతులు వారికి వైద్య సౌకర్యాలు చూపించి, వారు అడిగిన సమాచారాన్ని అందించారు. -
వైద్య అడ్మిషన్ల గడువు పెంచాలి!
► సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల గడువును మరింత పొడిగించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తోంది. సెప్టెంబర్ 11న ఎంసెట్-3 నిర్వహించనున్న ప్రభుత్వం అదే నెల 20కల్లా ర్యాంకులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే వైద్య ప్రవేశాల ప్రక్రియను దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికి ఈ సమయం ఏమాత్రం సరిపోదు. ర్యాంకులు ప్రకటించాక సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్ తదితర ప్రక్రియకు దాదాపు నెల సమయం పట్టనుంది. అందువల్ల అక్టోబర్ 20 వరకు ప్రవేశాల గడువు పెంచాల్సి ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు అంచనా వేస్తున్నారు.ఆ సమయం సరిపోతుందా లేదా అనే అంశంపై ఎంసీఐ తర్జనభర్జన పడుతోంది. ఒకవేళ ఎంసీఐ కొంత గడువు పెంచితే ఆ సమయంలో రాష్ట్రంలో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియను ముగించవచ్చా? లేకుంటే ఇంకా అదనపు సమయం కోరాలా? అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమయం సరిపోకపోతే గడువు పెంచాలంటూ ముందుగా ఎంసీఐకి విన్నవించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు భావిస్తున్నారు. అయితే ఎంసీఐ ఒప్పుకునే అవకాశాలుండవని... సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని చెబుతున్నారు. ‘సెప్టెంబర్ 30కల్లా అడ్మిషన్ల ప్రక్రియ ముగించాల్సి ఉంది. నీట్-1, 2 నిర్వహించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ ఏడాదికి సంబంధించి అడ్మిషన్ల ముగింపు గడువు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ తేదీ ప్రకటించాక మనకు సమయం సరిపోతుందో లేదో చూడాలి. ఆ తర్వాతే దీనిపై ఎలా వ్యవహరించాలో పరిశీలిస్తాం’ అని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. -
ఎంసీఐ స్థానంలో ఎన్ఎంసీ
న్యూఢిల్లీ: వైద్య విద్య నియంత్రణ సంస్థ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ)ను రద్దు చేయాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదించింది. దాని స్థానంలో జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఏర్పాటు చేయాలని సూచించింది. లోపభూయిష్ట ఎంసీఐ పనితీరును కమిటీ అధ్యయనం చేసింది. యూజీసీ, ఏఐసీటీఈల పునర్వ్యవస్థీకరణకు కూడా రోడ్ మ్యాపు సిద్ధం చేయాలని కేంద్రం నీతి ఆయోగ్ను ఆదేశించింది. -
ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు
కేంద్ర మంత్రి దత్తాత్రేయ * 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎంసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడి * ఇందులో 35 శాతం సీట్లు కార్మికుల పిల్లలకే సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే సనత్నగర్లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో ప్రవేశాలు చేపట్టనున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. వందసీట్లలో ప్రవేశాలకు ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) నుంచి గురువారం గ్రీన్సిగ్నల్ వచ్చినట్లు తెలిపారు. ఎంసీఐ నుంచి అన్ని అనుమతులు వచ్చేలా కృషి చేసినందుకు మంత్రి దత్తాత్రేయ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ శ్రీనివాస్ను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలో 35% సీట్లను కార్మికుల పిల్లలకే కేటాయిస్తామన్నారు. వంద సీట్లలో 10% ఆలిం డియా కోటాకు, 35% తెలంగాణ కార్మికుల పిల్లలకు, 55% రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తామని వివరించారు. కార్మిక కోటాలో సీట్లు భర్తీకాకపోతే వాటినీ తెలంగాణ విద్యార్థులకే చెందే లా ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తామన్నారు. అత్యాధునిక సాంకేతిక వసతులతో కూడిన సనత్నగర్ మెడికల్ కాలేజీ దేశానికే తలమానికంగా నిలవనుందన్నారు. ఉద్యోగంకోసం 3.60 కోట్లమంది నిరీక్షణ దేశంలో ఉద్యోగ అవకాశాల కోసం దాదాపు 3.60 కోట్ల మంది నిరీక్షిస్తున్నారని దత్తాత్రేయ వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉద్యోగాల కోసం నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్కు వీరు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అలాగే 9.29 లక్షల కంపెనీలూ ఉద్యోగాలను ఈ పోర్టల్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 100 మోడల్ కెరీర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఓయూలో ఉన్న ఉపాధి కల్పన కార్యాలయానికి ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. జూలై మూడో వారంలో సీఐఐ సహకారంతో మెగా జాబ్మేళా నిర్విహ స్తామన్నారు. కేంద్రంపై నిందలు సరికాదు రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రంపై నిందలు వేయడం సమంజసం కాదని దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్లో ‘ఐటీఐఆర్’కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక (డీపీఆర్) ఎందుకు తయారు చేయలేకపోయిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. డీపీఆర్ను కేంద్రానికి అందజేస్తే పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సెంటిమెంట్ ఎల్లకాలం పనిచేయదనే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తించాలన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. -
విదేశీ వైద్యవిద్యకు అనుమతి తప్పనిసరి
- ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందే - ఎంబీబీఎస్ కోర్సు కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఎంసీఐ స్పష్టీకరణ - అలా చేయకపోతే ఆ సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ చేయలేమని వెల్లడి - తాజాగా అన్ని రాష్ట్రాలకూ ఎంసీఐ ఆదేశాలు హైదరాబాద్ : ఏటా వేలాదిమంది విద్యార్థులు కన్సల్టెన్సీల మాటలు నమ్మి విదేశాలకు వైద్య విద్య కోసం వెళ్తున్నారు. వీళ్లందరూ కోర్సు పూర్తిచేసుకుని తిరిగొచ్చాక సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా అన్ని రాష్ట్రాలకు ఎంసీఐ ఆదేశాలు జారీచేసింది. భారతదేశం నుంచి ఎవరైనా విదేశాలకు ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లాలనుకుంటే దేశం విడిచి వెళ్లేముందే భారతీయ వైద్యమండలి నుంచి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ (అర్హత ధ్రువపత్రం) తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 ప్రకారం ఈ సర్టిఫికెట్ తీసుకుని వెళ్తేనే విదేశాల్లో చేసిన ఎంబీబీఎస్ డిగ్రీని అనుమతిస్తామని పేర్కొంది. ఈ చట్టం చేయాలని 2014 జనవరిలోనే సమీక్ష నిర్వహించారని, 2016-17 నుంచి అమల్లోకి తెచ్చామని ఎంసీఐ పేర్కొంది. అయినా చాలామంది అభ్యర్థులు ఉక్రెయిన్, రష్యా, చైనా, ఫిలిప్పీన్ తదితర దేశాలకు వెళ్లి ఎంబీబీఎస్ డిగ్రీలు చేస్తున్నారని, ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటి డిగ్రీలకు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేది లేదని తేల్చిచెప్పింది. విదేశాల్లో ఏ యూనివర్సిటీగానీ, ఏదైనా ఇన్స్టిట్యూషన్లోగానీ చదవడానికి వెళ్లేముందు ఎంసీఐ రూపొందించిన ప్రత్యేక దరఖాస్తు పూర్తి చేసి, అందులో వివరాలు పొందుపరిస్తే దానికి సంబంధించి అనుమతి లభిస్తుందని, అలా చెయ్యకపోతే అభ్యర్థులు నష్టపోతారని ఎంసీఐ సూచించింది. ఎంబీబీఎస్ కోర్సుకు విదేశాలకు వెళ్లే విద్యార్థులు తీసుకునే అర్హత సర్టిఫికెట్కు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుందని, దీనికి నిర్ణయించిన మేరకు ఫీజు చెల్లించాలన్నారు. దీనికోసం వెబ్సైట్లో దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేసుకుని ఢిల్లీలోని ఎంసీఐ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఇదిలా ఉండగా చాలామంది అభ్యర్థులు ఇప్పటికీ అర్హత సర్టిఫికెట్లు తీసుకోకుండా కన్సల్టెన్సీల మాటలు నమ్మి నేరుగా విదేశాలకు వెళుతున్నారు. అలాంటి వాళ్లు కోర్సు పూర్తి చేసుకున్నా ఎంసీఐ వారి సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ చెయ్యకపోవడంతో అటు ఉద్యోగాలకు, ఇటు ప్రాక్టీస్కు దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది. పీజీ వైద్య విద్యకు మాత్రం ఇప్పటికీ ఎంసీఐ చైనా, రష్యా, ఉక్రెయిన్ తదితర దేశాల కోర్సులను గుర్తించడం లేదని స్పష్టం చేసింది. కేవలం అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకే దేశాల్లో అనుమతి ఉన్న యూనివర్సిటీల్లో చదివితేనే వారి సర్టిఫికెట్లను భారతీయ వైద్యమండలిలో నమోదు చేస్తున్నట్టు ఎంసీఐ అధికారులు చెబుతున్నారు. -
వసతులు లేకున్నా వైద్య కళాశాల!
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రి లేదు, వైద్యులు లేరు, రోగులు లేరు.. అయినా అక్కడ వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతిచ్చారు! ఎలాంటి వసతులు లేకపోయినా ప్రభుత్వమే ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ మంజూరు చేసింది! రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 కళాశాలలకు ఇలా ఆయా ప్రభుత్వాలు ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లు మంజూరు చేయడంపై భారతీయ వైద్యమండలి(ఎంసీఐ) ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీచేసిన విషయం విదితమే. కొన్నిచోట్ల చిన్న గది కూడా లేకపోయినా ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ మంజూరు చేశారు. అలా మంజూరు చేసిన వాటిలో ఆంధ్రప్రదేశ్లో అపోలో ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(చిత్తూరు), శ్రీనివాస ఎడ్యుకేషనల్ అకాడమీ(చిత్తూరు), నిమ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ(జూపూడి), గాయత్రీ విద్యాపరిషత్ సొసైటీ(విశాఖపట్నం) ఉన్నాయి. తెలంగాణలో ఈఎస్ఐ మెడికల్ కళాశాలతోపాటు సెయింట్ అగస్టీన్ ఎడ్యుకేషనల్ సొసైటీ (పటాన్చెరు), ఆలేటి సునీత ఎడ్యుకేషనల్ సొసైటీ(మెదక్), బీఎంఎంటీ ఇన్స్టిట్యూట్(వికారాబాద్), ఆయాన్ మెడికల్ కళాశాల ఉన్నాయి. -
నరకయాతనలో నిఖిల్
♦ నొప్పులకు తాళలేక దీనంగా మత్తు కోసం వేడుకోలు ♦ వాచిపోయిన రెండు కాళ్లు ♦ వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు ♦ ఆపరేషన్ చేసిన వైద్యుడికి ఎంసీఐ నోటీసులు ♦ వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ సాక్షి, హైదరాబాద్: ఎత్తు పెరిగేందుకు ఆపరేషన్ చేయించుకుని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిఖిల్రెడ్డి (22)నొప్పులకు తట్టుకోలేక నరకయాతన పడుతున్నాడు. రెండు కాళ్లు లావుగా వాచిపోయాయి. ఎటూ కదల్లేక పడి ఉన్నాడు. ‘నొప్పిని భరించలేక పోతున్నా.. మత్తు మందు ఇప్పించండి..’ అంటూ పరామర్శకు వెళ్లిన వారిని నిఖిల్ వేడుకోవడం కలచివేస్తోంది. మరోవైపు ఆపరేషన్ తర్వాత నొప్పి సహజమేనని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి చేసే అవ కాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఎత్తు పెంచేందుకు ఆపరేషన్ చేయడంపై భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) ఆసుపత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిఖిల్కు శస్త్రచికిత్స చేసిన వైద్యుడు డాక్టర్ చంద్రభూషన్కు నోటీసులు జారీ చేసింది. ఐదడుగుల కంటే తక్కువ ఎత్తు ఉన్న వారికే ఎత్తు పెంచే శస్త్రచికిత్స చేయాలని నిబంధన ఉన్నా.. 5.7 అడుగుల ఎత్తున్న నిఖిల్కు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. సభ్యుల ముందు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఎంసీఐ చైర్మన్ డాక్టర్ రవీందర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎవరికి ఆపరేషన్ చేయొచ్చు? నిజానికి బోన్ క్యాన్సర్, పోలియో, ఫ్లోరైడ్ వల్ల కాళ్లు వంకర్లు పోవడం, ఏదైనా ప్రమాదంలో ఎముకలు విరిగి నుజ్జునుజై పోయిన వారికి ఈ తరహా చికిత్సలు చేయవచ్చు. ఎంసీఐ ప్రకారం ఐదడుగుల కంటె తక్కువ ఎత్తు, ఒక కాలు పొడవు, మరొక కాలు పొట్టిగా ఉన్న వారికి ఈ ఆపరేషన్ చేసి రెండు నుంచి మూడు అంగుళాల వరకు ఎత్తుపెంచుకునే అవకాశం ఉంది. అంతకు మించి ఎత్తు పెంచితే కండరాలు, నరాలు బిగుసుకు పోతాయి. మోకాళ్ల పనితీరు దెబ్బతింటుంది. రోగి కోలుకోవాలంటే తొమ్మిది మాసాలు పడుతుంది. బెడ్రెస్ట్, వీల్ చైర్కే పరిమితం కావాల్సి ఉంది. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వల్ల శస్త్రచికిత్స చేయించుకున్న భాగాన్ని పూర్తిగా కోల్పోవాల్సి ఉంటుందని పలువురు సీనియర్ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శస్త్రచికిత్సలో ఉన్న రిస్క్, తర్వాత తలెత్తే పరిణామాలను ముందే రోగి సహా బంధువులకు వివరించాలి. కానీ సదరు వైద్యుడు ఇవేవీ పట్టించుకోకుండా శస్త్రచికిత్స చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నాడు ఘన కీర్తి.. నేడు అపకీర్తి
పద్మశ్రీలు పొందిన జీజీహెచ్ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు క్రమేణా నిర్లక్ష్యంతో వైభవం కోల్పోతున్న వైద్య కళాశాల యూరాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగానికి గుర్తింపు నిరాకరణ వైద్యుల రిజిస్ట్రేషన్కు తిరస్కరించిన ఏపీ మెడికల్ కౌన్సిల్ గుంటూరు: అనేక దేశాల్లో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న ఎందరో వైద్యులను అందించిన ఘన చరిత్ర గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ప్రతిభావంతులను ప్రభుత్వం పద్మశ్రీలతో సత్కరించింది. కొందరు ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ప్రముఖ వైద్యులుగా, రాజకీయ నాయకులుగా రాణించారు. జీజీహెచ్లో సరైన సౌకర్యాలు లేనప్పుడే..అప్పటి అధికారులు ఉన్నత విద్యా ప్రమాణాలు పాటించారు. ఇప్పుడు పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. అత్యున్నత వైద్య పరికరాలు, వసతులు ఉన్నప్పటికీ గతంలో మాదిరిగా విద్యార్థులను తీర్చిదిద్దలేకపోతున్నారు. ప్రభుత్వం, వైద్య విద్య ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎంసీఐ ఆదేశాలు బేఖాతరు వైద్య కళాశాల, జీజీహెచ్లో తనిఖీలు నిర్వహించిన ప్రతిసారీ భారత వైద్య మండలి (ఎంసీఐ) అక్కడి వసతులు, వైద్య పరికరాల లేమి, సిబ్బంది కొరత వంటివి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావు ఆ పోస్టుకు అర్హులు కాదని, గత తనిఖీల్లో తేల్చి చెప్పింది. కానీ ఈ ఏడాది తనిఖీల సమయంలో అర్హులను ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఆ ఒక్కరోజు ఎంసీఐ అధికారుల కళ్లకు గంతలు కట్టారు. గతేడాది సూచనలు పాటించలేదంటూ ఎంసీఐ ఏకంగా 50 ఎంబీబీఎస్ సీట్లకు కోత విధించడంతో రాష్ట్ర స్థాయి అధికారులు, మంత్రులు రంగంలో దిగి బతిమాలుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆ తరువాతా గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు లేవు. నిన్న మొన్నటి వరకు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా పని చేసిన డాక్టర్ వేణుగోపాలరావు, ప్రస్తుతం డీఎంఈగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, జీజీహెచ్లోని సమస్యలపై పూర్తి స్థాయి అవగాహన ఉన్నా పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదు. రోడ్డున పడిన యూరాలజీ సూపర్ స్పెషాలిటీ వైద్యులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఇటీవల యూరాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్సు పూర్తి చేసిన వైద్యులు రోడ్లపై తిరగాల్సిన దుస్థితి దాపురించింది. ఈ విభాగంలో సరైన వసతులు, వైద్య పరికరాలు లేవనే కారణంతో ఎంసీఐ గుర్తింపు ఇవ్వలేదు. దీంతో కోర్సు పూర్తి చేసిన వైద్యులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఎంసీఐ గుర్తింపు లేకపోవడంతో రిజిస్ట్రేషన్కు ఏపీ మెడికల్ కౌన్సిల్ తిరస్కరించింది. యూరాలజీ విభాగాధిపతిగా కొనసాగుతున్న డాక్టర్ సూర్యకుమారి నాలుగేళ్లుగా విజయవాడ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్గా డిప్యూటేషన్పై బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో వేతనం తీసుకుంటూ విజయవాడలో పని చేస్తున్నారు. ఎంసీఐ తనిఖీలు, పీజీ పరీక్షలు జరుగుతున్న సమయంలో మాత్రం ఇక్కడ హెచ్ఓడీగా ప్రత్యక్షమవుతున్నారు. గుంటూరు వైద్య కళాశాల్లో చదివిన పూర్వ విద్యార్థులు డాక్టర్ సీఎం హబీబుల్లా, డాక్టర్ గొల్లపల్లి ఎన్ రావు, డాక్టర్ బీ సోమరాజు, డాక్టర్ డీ ప్రసాదరావు, డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్ నాయుడమ్మ, డాక్టర్ గోపీచంద్ వంటివారు పద్మశ్రీ అవార్డులు తీసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రస్తుత విద్యార్థులు రోడ్డున పడుతున్నారు. -
నాన్ క్లినికల్ పీజీపై అనాసక్తి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వైద్య విద్యా సంవత్సరంలో తెలంగాణ, ఏపీల్లో కలిపి 200 పీజీ వైద్య సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. నాన్ క్లినికల్ పీజీ వైద్య సీట్లపై విద్యార్థుల్లో ఆసక్తి లేకపోవడం ప్రధాన కారణం కాగా... కొందరు విద్యార్థులకు జాతీయస్థాయి వైద్యవిద్యా సంస్థల్లో సీట్లు రావడంతో 37 క్లినికల్ సీట్లూ ఖాళీ అయినట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కొందరు విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది సోమవారం కోర్టు ముందుకు రాగా. గురువారానికి విచారణ వాయిదా పడినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. అవకాశాలు లేకే: ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో సుమారు రెండున్నర వేల వరకు పీజీ వైద్య సీట్లు ఉన్నాయి. ఇందులో క్లినికల్ సీట్లకు తీవ్ర పోటీ ఉంటే.. నాన్ క్లినికల్పై విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల ఏటా సుమారు 200 పీజీ సీట్లు మిగిలిపోతున్నట్లు సమాచారం. సాధారణంగా క్లినికల్ విభాగంలో పీజీ చేసినవారికి ప్రైవేటు ఆస్పత్రుల నుంచి భారీగా డిమాండ్ ఉంది. ప్రభుత్వ సర్వీస్లో చేరినవారు ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకునే అవకాశమూ ఉంటుంది. కానీ నాన్ క్లినికల్ విభాగంలోని వారికి పెద్దగా డిమాండ్ ఉండదు. ఇందులోని పాథాలజీ, మైక్రోబయోలజీ, అనాటమీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫార్మకాలజీ, ఫిజియోలజీ తదితర కోర్సులు కేవలం మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులుగా పనిచేయడానికేనన్న పరిస్థితి ఏర్పడింది. దీంతో నాన్ క్లినికల్ పీజీపై విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు పీజీ వైద్య విద్యలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయాలని కోరుతూ నెలన్నర కింద తెలంగాణ ప్రభుత్వం ఎంసీఐకి లేఖ రాసింది. ఇటీవలే పలువురు విద్యార్థులు కూడా దీనిపై సుప్రీంను ఆశ్రయించారు. ఎంతో విలువైన పీజీ సీట్లు ఖాళీగా ఉండకుండా కౌన్సెలింగ్ చేసేందుకు ఎంసీఐని, ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీని ఆదేశించాలని వారు కోరుతున్నారు. మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహిస్తే... తెలంగాణలోని 8 సీట్లతోపాటు, ఏపీలోని 28 సీట్లలో 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాలో కూడా తెలంగాణ విద్యార్థులు పీజీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉంటుందని జూడా కన్వీనర్ శ్రీనివాస్ చెప్పారు. -
20 తర్వాత మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూల్
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: జూలై 20వ తేదీ తర్వాత మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఈ విషయంపై మంగళవారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్చందా, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ పాపిరెడ్డి, వైద్య విద్య సంచాలకులు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తదితరులు హాజరయ్యారు. వచ్చేనెల 15 వరకు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) కొత్త కాలేజీలు, సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చేందుకు సమయం ఉన్నందున కౌన్సెలింగ్ షెడ్యూల్ను 20వ తేదీ తర్వాతే విడుదల చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సహకారంతో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్లో రెండు, వరంగల్, విజయవాడల్లో ఒక్కో కేంద్రం చొప్పున 4 కేంద్రాల్లో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ప్రైవేటు వైద్య కళాశాలలు ప్రత్యేకంగా నిర్వహించిన ఎం-సెట్ కౌన్సెలింగ్ను పారదర్శకంగా జరిపేందుకు ప్రభుత్వం ఒక ప్రతినిధిని నియమించిందన్నారు. ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్ను ప్రతినిధిగా నియమించనున్నట్లు తెలిసింది. -
700 ఎంబీబీఎస్ సీట్లు హుష్కాకి!
తెలంగాణలో 350, ఏపీలో 350 సీట్లకు కోత ♦ మల్లారెడ్డి రెండు కళాశాలలకూ సీట్ల నిరాకరణ ♦ ఈఎస్ఐ వైద్య కళాశాలకు అనుమతి తిరస్కరణ ♦ తొలిసారి ఏపీలో ‘గీతం’కు అటానమస్ హోదా ♦ భారతీయ వైద్యమండలి నిర్ణయం ♦ అటానమస్ హోదాపై ఏపీ జూడాల సంఘం ఆందోళన సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లకు భారీగా కోత విధిస్తూ భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిర్ణయం తీసుకొంది. మరికొద్ది రోజుల్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జరగనున్న నేపథ్యంలో సీట్ల కోతతో అటు యాజమాన్యాలకే కాదు కన్వీనర్ కోటా కింద అడ్మిషన్లు పొందే మెరిట్ విద్యార్థులకూ తీవ్ర నష్టం జరగనుంది. తెలంగాణలో మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్లకు 300 సీట్లు కోత వేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని విశ్వభారతి, ఎన్ఆర్ఐ విశాఖపట్నం కళాశాలల నుంచి 300 సీట్లు కోత వేశారు. మొత్తంగా రెండు రాష్ట్రాల్లోనూ 350 సీట్ల చొప్పున 700 సీట్లకు కోత పడింది. హైదరాబాద్లోని ఈఎస్ఐ (ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్) వైద్య కళాశాలకు భారతీయ వైద్యమండలి అనుమతి తిరస్కరించింది. 200 సీట్ల ప్రతిపాదనతో ఎంసీఐకి దరఖాస్తు చేసిన ఈ కళాశాలకు సరైన వసతులు లేని కారణంగా అనుమతివ్వలేదు. ఏపీలో తొలిసారి డీమ్డ్ కళాశాల ఏపీలో తొలిసారి అటానమస్ (డీమ్డ్) కళాశాలకు అనుమతిచ్చారు. విశాఖ లోని గీతం(గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్) కళాశాలకు 150 సీట్లతో అటానమస్ హోదా ఇచ్చారు. ఈమేరకు ఎంసీఐ అనుమతించింది. అటానమస్ అనుమతికి రాష్ట్రప్రభుత్వం అంగీకరించినట్టు తెలి సింది. అటానమస్లో అడ్మిషన్ల నుంచి ఫీజుల వరకూ అన్నీ యాజమాన్యమే నిర్ణయిస్తుంది. కన్వీనర్ కోటా సీట్లు ఉండవు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పరిధిలోకి రాదు. గీతంకు అనుమతి వచ్చిన నేపథ్యంలో మరికొన్ని ప్రైవేటు కళాశాలలు డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేయనున్నాయి. దీనివల్ల కన్వీనర్ కోటా సీట్లు కోల్పోతారు. విద్యార్థులకు తీవ్రంగా నష్టం ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్లో అటానమస్ సంస్కృతి లేదు. ఇప్పుడు గీతంకు ఇచ్చారు. దీనివల్ల ప్రతిభకలిగిన పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. ఇక రాష్ట్రంలో అన్ని ప్రైవేటు కళాశాలలు అటానమస్వైపు వెళతాయి. అప్పుడు కన్వీనర్ కోటా సీట్లుండవు. లక్షలు పోసి సీట్లు కొనుక్కోవాల్సి వస్తుంది. వైద్యవిద్యకు భారీగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. జూనియర్ వైద్యులందరం దీనిపై ఆందోళన చేస్తాం. -డా.పవన్కుమార్, ప్రధాన కార్యదర్శి, ఏపీ జూనియర్ వైద్యుల సంఘం -
వైద్య కళాశాలకు ఎంసీఐ ఫీవర్
సౌకర్యాలపై తనిఖీలకు రానున్న ఎంసీఐ బృందం ఇప్పటికే ఎంబీబీఎస్ 50 సీట్లకు అనుమతి నిరాకరణ పీజీ సీట్లకూ పొంచివున్న ముప్పు లబ్బీపేట : ‘ఏ సమయంలోనైనా ఎంసీఐ బృందం తనిఖీలకు రావచ్చు. అందరూ అప్రమత్తంగా ఉండండి. హెచ్వోడీలు, ప్రొఫెసర్లు సెలవులకు వెళ్లకుండా సమయానికి విధులకు రావాలి.’ ఇవీ వారం పది రోజులుగా సిద్ధార్థ వైద్య కళాశాలలో అధికారులు, ప్రొఫెసర్లు, విభాగాధిపతులకు ఇస్తున్న ఆదేశాలు. రోజూ ఎంసీఐ బృందం వచ్చేస్తోందంటూ హడావుడి చేస్తూ మధ్యాహ్నం 12 గంటలు దాటే వరకూ వేచి చూసి, ‘హమ్మయ్య ఈ రోజు రాదులే’ అని ఊపిరి పీల్చుకోవడం నిత్యకృత్యంగా మారింది. యూజీ సీట్ల సౌకర్యాలపై తనిఖీలు గత ఏడాది పెంచిన 50 ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి సౌకర్యాలను పరిశీలించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం ఆకస్మికంగా తనిఖీలకు రానుంది. దీంతో పది రోజులుగా వైద్యులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అలెర్ట్గా ఉండాలంటూ ఇప్పటికే వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రొఫెసర్లు, హెచ్వోడీలకు సెలవులు సైతం పరిమితంగా ఇస్తున్నారు. ఎంసీఐ బృం దం ఎప్పుడు వచ్చినా అడిగిన సమాచారం అం దించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆయా డిపార్ట్మెంట్లకు సం బంధించి పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో సిద్ధం చేయాలని ప్రిన్సిపాల్ ఆదేశించినట్లు తెలిసింది. సీట్లు ఉండేనా...ఊడేనా ? సిద్ధార్థ వైద్య కళాశాలలో వంద ఎంబీబీఎస్ సీట్లకు సరిపడా సౌకర్యాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని నవంబర్లో ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంసీఐ బృందం నివేదిక రూపొందించింది. పెంచిన 50 సీట్లకు సంబంధించి సౌకర్యాలు అందుబాటులో లేవని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ సీట్లు ఉంటాయో, ఊడతాయో తెలియని పరిస్థితి నెలకంది. గత అనుభవాలతోనే.. నవంబర్లో ఎంసీఐ బృందం వైద్య కళాశాలకు ఉదయం 8 గంటలకు చేరుకోగా, అప్పటికి ప్రిన్సిపాల్తో పాటు, వైద్యులెవరూ అందుబాటులో లేరు. ఎంసీఐ బృందం వచ్చిందని తెలుసుకుని అరగంటలో చేరుకున్నారు. అనంతరం పలు విభాగాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. అంతకు ముందు ఎంసీఐ బృందం వచ్చేవరకూ ఒక విభాగం తలుపులు తీయకపోవడంతో ఆ విభాగాన్ని వాడటంలేదని త నిఖీ బృందం రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం సిద్ధార్థ వైద్య కళాశాలలో 50 అదనపు సీట్లు సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసినా చేసిందేకానీ, అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేదు. సీట్ల మంజూరు సమయంలో ఎంసీఐకి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చనందునే ప్రస్తుతం సీట్లు కోల్పోవాల్సిన దుస్థితి నెల కొందని సీనియర్ ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు. ప్రతి విభాగంలో యూనిట్లు పెంచాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ అప్పట్లో లేఖ రాసినా పట్టిం చుకోకుండా పక్కన పెట్టడం, సౌకర్యాల విషయంలో నిధులు కేటాయించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెపుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. గతంలో ఏమి పేర్కొందంటే... నిబంధనల ప్రకారం యూనిట్లను చూపుతున్నా, అందుకు అనుగుణంగా పడకలు అందుబాటులో లేవు. కనీసం ఎక్స్రే కూడా అందుబాటులో లేదు. నిబంధనల ప్రకారం రోజూ ఎక్స్రేలను తీయలేక పోతున్నారు. బ్లడ్ బ్యాంక్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. టీచింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి రెసిడెన్షియల్ క్వార్టర్లు అందుబాటులో లేవు. పూర్తిస్థాయిలోగ్రంథాలయం లేదు. ఆడిటోరియం రిపేరులో ఉంది. వ్యాధి నిర్ధారణ విభాగం సైతం అస్తవ్యస్తంగా మారింది. ఈ నివేదిక ఆధారంగా అదనంగా 50 సీట్లు అడ్మిషన్లకు ఈ ఏడాది అనుమతి ఇవ్వలేమని ఎంసీఐ పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సదుపాయాలను పరిశీలించాలని చేసిన వినతి మేరకు ఎంసీఐ బృందం ఆకస్మిక తనిఖీలకు రానుంది. -
ఒంగోలు రిమ్స్లో 100 సీట్లు కోత
రాష్ట్రానికి ఎంసీఐ లేఖ కాలేజీల్లో వసతుల కల్పనకు ఆర్నెల్లు సమయమిచ్చినా ఫలితం సున్నా మెడికల్ కాలేజీలను నవంబర్లో తనిఖీ చేసిన ఎంసీఐ అధికారులు మరికొన్ని కళాశాలలకూ సీట్ల కోత తప్పదు.. త్వరలో నివేదిక ఇవ్వనున్న ఎంసీఐ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లపై కోతల కాలం మొదలైంది. ‘మీకు మరో అవకాశమిస్తున్నాం, ఆరు మాసాల్లో వసతులు పునరుద్ధరణ చేసి సీట్లు నిలుపుకోండి’ అంటూ భారతీయ వైద్యమండలి ఇచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలుపుకోలేక పోయింది. దీంతో ఎంసీఐ కోతలు వేసేందుకు సిద్ధమైంది. ఒంగోలు రిమ్స్ కళాశాలకు చెందిన 100 ఎంబీబీఎస్ సీట్లను వచ్చే ఏడాదికి ఇవ్వలేమంటూ రెండు రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఒంగోలు రిమ్స్కు ఈ సీట్లు అదనంగా ఇచ్చినవి కావు. ఉన్నవే పోతున్నాయంటే ఆ కళాశాల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. 2015-16 సంవత్సరానికి ఒంగోలు రిమ్స్కు సంబంధించి 100 సీట్లు ఇవ్వకపోతే అసలు అడ్మిషన్లే ఉండవు. గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాదీ ఇదే పరిస్థితి. చివరి నిమిషంలో ఎంసీఐని బతిమాలుకోవడం, అనుమతి తెచ్చుకోవడం జరుగుతోంది. ఈ దఫా మాత్రం కరాఖండీగా సీట్లు ఇవ్వలేమని ఎంసీఐ తేల్చి చెప్పింది. ఇప్పటికీ వసతులు కల్పించలేకపోయారు 2014 జూన్లో రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు సుమారు 300 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా కల్పించారు. ఈ సీట్లకు సంబంధించి అదనంగా కావాల్సిన వసతులన్నీ 2014 నవంబర్లోగా కల్పించాలని ఆదేశించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిలు రాతపూర్వక హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎంసీఐ అధికారులు నవంబర్లో రాష్ట్రంలోని వైద్య కళాశాలలను తనిఖీ చేశారు. కొత్తగా కేటాయించిన సీట్లకు సంబంధించి ఎలాంటి వసతులూ ఏర్పాటు చేయలేదని తనిఖీల్లో తేలింది. దీంతో ఎంసీఐ తొలి వేటు ఒంగోలు రిమ్స్పై వేసింది. అదే బాటలో మరికొన్ని కళాశాలలు తొలివేటు ఒంగోలు రిమ్స్కు వేశారుగానీ.. అదే బాటలో మరికొన్ని కళాశాలలపైనా కోత పడే అవకాశం లేకపోలేదని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులే చెప్తున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ, ఎస్వీఆర్ మెడికల్ కాలేజీ (తిరుపతి), రంగరాయ మెడికల్ కాలేజీ (కాకినాడ), సిద్ధార్థ మెడికల్ కాలేజీ (విజయవాడ), గుంటూరు మెడికల్ కాలేజీ (గుంటూరు) తదితర కళాశాలల్లో 50 సీట్ల చొప్పున కోల్పోయే ప్రమాదమున్నట్టు తెలిసింది. ఇప్పటికే వీటిలో తనిఖీలు పూర్తయ్యాయని, ఈ కళాశాలల్లో సీట్లకు సంబంధించిన నివేదిక వారం రోజుల్లో ఇవ్వనున్నామని ఎంసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. అంతేకాదు 2014-15కు సంబంధించి నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు 150 ఎంబీబీఎస్ సీట్లు అనుమతిచ్చారు. వచ్చే ఏడాది దీనికి తగ్గ వసతులు లేకపోతే అక్కడ కూడా సీట్లు పోయే పరిస్థితి ఉంటుందని, ఇప్పటికీ అక్కడ పరిస్థితి బాగోలేదని ఎంసీఐ దృష్టికి వచ్చింది. -
ముగిసిన ఎంసీఐ తనిఖీలు
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ మెడికల్ కళాశాలలో రెండు రోజులపాటు కొనసాగిన ఎం సీఐ తనిఖీలు గురువారంతో ముగిసాయి. ప్రొఫెసర్ అనిల్కుమార్, ప్రొఫెసర్ అనురాగ్ అగర్వాల్ ఆస్పత్రిని, కళాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మూడవ సంవత్సరం తరగతులకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, ల్యాబ్లు, గ్రంథాలయాలు, వివిధ విభాగాలకు సంబంధించి సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో వసతులు ఎలా ఉన్నాయి, రోజుకు ఔట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారు? ఇన్ పేషెంట్లు ఎంతమంది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాలలో రోగులకు వైద్య సేవలు ఎలా అందుతున్నాయో, అత్యవసర సేవలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పరిశీలించారు. వీరి వెంట కళాశాల ప్రిన్సిపాల్ జిజియాబాయి తదితరులు ఉన్నారు. అనంతరం నవీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాలపల్లి అర్బన్ హెల్త్సెంటర్ను తనిఖీ చేశారు. క్లినికల్ టెన్సింగ్లో భాగంగా క్షేత్ర స్థాయిలో వైద్యసేవల గురించి వైద్యులకు సూచనలు చేశారు. తరువాత వారు తిరుగు పయనమయ్యారు. -
ఏం.. తమాషానా..?
► వైద్య కళాశాలల్లో ఎంసీఐ తనిఖీల తీరుపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం ► వైద్యసేవల్లో ఏకీకృత ఫీజు అమలు చేయాలని సూచన సాక్షి, హైదరాబాద్: ‘వైద్య కళాశాలల పట్ల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) తీరు సరిగా లేదు. కళాశాల ప్రారంభసమయంలో తనిఖీలు చేసి అన్ని సవ్యంగా ఉన్నాయని కోర్సుల ఏర్పాటుకు అనుమతి ఇస్తుంది. తీరా అడ్మిషన్లు పూర్తైతరగ తులు ప్రారంభమైన తర్వాత మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ సరిగా లేదని, ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, ల్యాబ్ల్లో వైద్య పరికరాలు లేవని కోర్సుల గుర్తింపు రద్దు చేస్తుంది. ఏం.. తమాషానా..?’ అని ఎంసీఐ తీరుపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో బుధవారం ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ 59వ వార్షిక సదస్సును గవర్నర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు డాక్టర్ డిగ్రీల ను మార్కెట్లో వస్తువుల్లా అమ్ముకుంటున్నాయని విమర్శించా రు. రూ.కోట్లు కుమ్మరించి డిగ్రీలు సంపాదించిన వారు తర్వాత సంపాదనే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. రోగులకు చికిత్స చేసే విషయంలో వైద్యుల ఆలోచన దృక్పథంలో మార్పు రావాలన్నారు. దేశంలో 50 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని, ఎక్కువ శాతం కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారని తెలిపారు. వీరికి వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత ఆర్థోపెడిక్స్పై ఉందన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ఏకీకృత ఫీజుల విధానం అమలు చేయాలని సూచిం చారు. ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కే జైన్ మాట్లాడుతూ 50 ఏళ్లు పైబడిన వారిలో 90 శాతం మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ ఎస్ఎస్ యాదవ్, డాక్టర్లు విజయ్చందర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జున్జున్వాలా, సుధీర్కపూర్లతో పాటు 20 రాష్ట్రాలకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఎముకల వైద్య నిపుణుడు ప్రీతీపాల్సింగ్ మైనీని జీవితసాఫల్య పురస్కారంతో సత్కరించారు. -
సార్లు మెచ్చేనా?
నిజామాబాద్ అర్బన్ : జిల్లాలోని వైద్య కళాశాలకు మంగళవారం ఎంసీఐ బృందం రానుంది. మూడో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి కోసం కళాశాలను పరి శీలించనుంది. ఈ బృందం ఆదివారమే రావాల్సి ఉంది. అయితే హైదరాబాద్లో ఇతర కళాశాలల పరిశీలన వల్ల పర్యటన మంగళవారానికి వాయిదా పడింది. ఈ విషయమై మెడికల్ కళాశాల అధికారులు కలెక్టర్ను కలిసి సమాచారం అందించారు. అనుమతిపై ఉత్కంఠ మెడికల్ కళాశాలకు ఎంసీఐ బృందం రాక నేపథ్యంలో అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. కళాశాలలో మూడో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి లభిస్తుందా అన్న విషయమై ఆందోళన కొనసాగుతోంది. గతంలో మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతికోసం ఎంసీఐ బృందం పరి శీలనకు వచ్చింది. మూడుసార్లు పరిశీలించి వెళ్లినా.. తరగతుల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు ఫలించి కళాశాలలో మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి లభించింది. రెండో సంవత్సరంలోనూ అదే పరిస్థితి కొనసాగింది. ఇద్దరు సభ్యుల ఎంసీఐ బృందం రెండుసార్లు కళాశాలకు వచ్చి వసతులను పరిశీలించింది. అయినా సంతృప్తి వ్యక్తం చేయలేదు. మూడోసారి పరిశీలన అనంతరం రెండో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కళాశాలలో వంద సీట్లున్నాయి. మూడో సంవత్సరం తరగతుల అనుమతికోసం కళాశాలను పరిశీలించడానికి ఎంసీఐ బృందం మంగళవారం జిల్లాకు వస్తోంది. దీంతో ఎంసీఐ బృందం ఎలా స్పందిస్తుందోనని అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎంసీఐ బృందం కళాశాలను సందర్శించినప్పుడు కళాశాలకు ఆసుపత్రిని అనుసంధానం చేయాలని, ప్రొఫెసర్ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని, పారామెడికల్ సిబ్బంది, పరిపాలన సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలని, సరిపోయేంత స్థలం, ఆటస్థలం కేటాయించాలని, ఆధునిక లైబ్రరీ ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే ఇవేవీ నేటికీ పూర్తికాలేదు. మరోవైపు ప్రొఫెసర్లను నియమించినా వారు ఆసుపత్రికి రావడం లేదు. తరచుగా 40 నుంచి 50 మంది ప్రొఫెసర్లు విధులకు గైర్హాజరవుతున్నారు. ఈ అంశం కూడా కళాశాలలో మూడో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎంసీఐ బృందం ఎలా స్పందిస్తుంది అన్న విషయమై అందరిలో ఆసక్తి నెలకొంది. -
బ్లూమింగ్టన్లో ఘనంగా కైట్ ఫెస్టివల్!
ఇల్లినాయిస్ రాష్ట్రంలోని బ్లూమింగ్టన్లో ఆదివారం కైట్ ఫెస్టివల్ ఘనం గా జరిగింది. 'ఫర్ ఏ బెటర్ టుమారో' అనే స్వచ్చంద సంస్థ, మెక్లీన్ కౌంటీ ఇండియన్ అసోసియేషన్(ఎంసిఐఏ) సంయుక్తంగా గ్రోవ్ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లల కోసం ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. "ఆకాశానికి రంగులు వేద్దాం-చిన్నారులకు చేయూత నిద్దాం" అన్న భావనతో ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన ఈ పతంగుల పండుగలో పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై గాలి పటాలు ఎగుర వేశారు. ఆటలతో పాటలతో పసందైన భోజన ఏర్పాట్లతో ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకొన్నారు. 300 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పండుగ ద్వారా వచ్చిన మిగులు నిధులను వివిధ పథకాల ద్వారా అనాధ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగిస్తారు . ఈ సందర్బంగా ఫెస్టివల్ డైరెక్టర్ మండవ రావు మాట్లాడుతూ సంఘ సేవపై ఆసక్తి గల దేశ విదేశాల్లో వున్న ప్రవాస భారతీయులను ఒక త్రాటిపై తీసుకు వచ్చి వారి ద్వారా అనాధ పిల్లలకు చేయూత నిచ్చే సంస్థలకు ఆర్దికంగా సహాయం చేయడమే బెటర్ టుమారో సంస్థ లక్ష్యం అన్నారు. -
మెడికల్ కళాశాలకు ఎట్టకేలకు అనుమతి
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల చింత ఎట్టకేలకు తీరింది. ఎంబీ బీఎస్ రెండవ సంవత్సరం తరగతుల నిర్వహణకు ఎంసీఐ అనుమతి లభించడంతో ఇటు విద్యార్థులు, అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వంద సీట్లు మంజూరు కావడంతో ఆనందం వ్యక్తమవుతోంది. ఏడాదిగా రెండవ సంవత్సరం అనుమతి విషయంలో స్తంభన నెలకొంది. సౌకర్యాలు లేవంటూ ఎంసీఐ పలుమార్లు అనుమతిని నిరాకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18, 19 తేదీలలో ఇద్దరు సభ్యుల ఎంసీఐ బృందం కళాశాల ను పరిశీలించింది. ప్రొఫెసర్ల కొరత, గ్రంథాలయం, వసతి భవనాలు సక్రమంగా లేవంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో అధికారులు లోపాలను సరి దిద్దేందుకు నడుం బిగించారు. గత నెల మొదటివారం లో ఎంసీఐ బృందం తిరిగి కళాశాలను పరిశీలించింది. సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసి, అనుమతి కోసం సిఫారసు చేసింది. విస్తరించనున్న వైద్యసేవలు తెలంగాణ నవ నిర్మాణంలో భాగంగా జిల్లాలోని ప్రభు త్వ మెడికల్ కళాశాల మరింత పటిష్టం కానుంది. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ఈ జిల్లా వెనుకబడిన ప్రాంతంగా కళాశాల అనుమతి నివేదికలో రాష్ట్ర ప్ర భుత్వమే పేర్కొంది. కనుక అధిక నిధులు కేటాయించి అవకాశం మెండుగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కళాశాలకు రూ. 164 కోట్లను మంజూరు చేసింది. మొదటి విడత 100 కోట్లు, రెండవ విడత 64 కో ట్లను విడుదల చేసింది. ఇప్పుడిక అన్ని సౌకర్యాలతో మహారాష్ట్ర, ఆదిలాబాద్, కరీం నగర్ ప్రాంతాల రోగులకు కూడా ముఖ్యమైన ఆస్పతిగా మారనుంది. వైఎస్ఆర్ చలవతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చలవతోనే జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైంది. 2008 అక్టోబర్ లో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ షష్ఠి పూర్తి కార్యక్రమం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించా రు. 2009లో కళాశాలకు ప్రభుత్వం ని ధులను మంజూరు చేసింది. 2013 మే లో ఎంసీఐ బృందం తొలిసారిగా పరిశీ లనకు వచ్చింది. జులై 24న మొదటి ఏడాది తరగతులకు 100 సీట్లతో అనుమతి లభించింది. అదే ఏడాది ఆగస్టు ఐదున తరగతులు ప్రారంభమయ్యాయి. డీఎంఈ చొరవతో డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ) మెరుగైన వైద్యసేవల కోసం ఈ కళాశాలపై దృష్టి సారించింది. ఇం దులో భాగంగానే 121 మంది ప్రొఫెసర్లు, 92 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల ను నియమించింది. ఆయా విభాగాల లో నిపుణులైన వైద్యులు ఇందులో ఉ న్నారు. న్యూరాలాజీ, కార్డియాలజీతోపాటు, ఇతర ముఖ్య సేవలు అం దు బాటులోకి వచ్చాయి. ఎంఆర్ఐ స్కాన్, సీటీస్కాన్, డిజిటల్ ఎక్స్రేలు, ఆధుని క ఆపరేషన్ థియేటర్లు, చిన్నపిల్లలకు సంబంధించిన ఎన్ఐసీ తదితర సౌకర్యాలను కల్పించనున్నారు. ఎనిమిదంతస్తుల భవనంలో వెయ్యి పడకల ఆ స్పత్రి అందుబాటులో ఉంది. పీజీ కోర్సులకూ అనుమతి కళాశాల ఏర్పాటైన మొదటి ఏడాదే పీ జీ కోర్సులు అందుబాటులోకి వచ్చా యి. ఈ ఏడాది నుంచి డీఎన్బీ (డిప్లొ మా ఇన్ నేషనల్ బోర్డు)కు చెందిన పీజీ కోర్సులకు అనుమతి లభించింది. మూ డేళ్ల వ్యవధి గల మెడిసిల్, సర్జరీ, గైనిక్, ఫిజిషియన్, అనస్థీషియన్ కోర్సులకూ అవకాశం వచ్చింది. ఒక్కో కోర్సులో నాలుగు చొప్పున మొత్తం 20 సీట్లు మంజూరు కానున్నాయి. చిన్నపిల్లలకు మేలు చిన్నపిల్లలకు మెరుగైన వైద్య చికిత్స లభించే అవకాశం ఉంది. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు దీర్ఘకాలిక వ్యా ధులు, మానసిక సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించి, వారికి మెరుగైన వైద్యసేవలు అందించడానికి అత్యాధునిక వైద్యసేవలతో, నిపుణులైన వైద్యులతో ప్రత్యేక విభాగం నెలకొల్పాలని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిష న్ నిర్ణయించింది. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దీనిని ఏర్పాటు చేస్తున్నా రు. ఎన్ఆర్హెచ్ఎం అధికారి అరుణ్సింగ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ సహానీ గత ఫిబ్రవరి ఏడున మెడికల్ కళాశాలను సందర్శించారు. రూ. 13 కోట్ల రూపాయల తో ఈ విభాగాన్ని ఏర్పాటు చేసేందు కు అంగీకరించారు. యువతకు ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ కళాశాలలో ప్రభుత్వం 812 ఉద్యోగాలు భర్తీకి జీవో నం.50ని విడుదల చేసింది. ఇందులో పారామెడికల్ సిబ్బందితో పాటు పరిపాలన వి భాగం, వైద్యులు ఉన్నారు. 217 మంది స్టాఫ్ నర్సులు, 202 మంది నాల్గవ తరగతి ఉద్యోగులు, పరిపాలన విభాగాని కి సంబంధించి 50 మంది, సూపరిం డెంట్ పరిధిలో 189 మంది, పారా మె డికల్ సిబ్బంది నియామకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
తెలంగాణకు అదనంగా 200 మెడికల్ సీట్లు
తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 200 మెడికల్ సీట్లను ఎంసీఐ కేటాయించిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు 600 నుంచి 800కి పెరిగాయని చెప్పారు. ఈ ఏడాది ఎంబీబీఎస్ ఫీజులు పెరిగేది లేదని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీని ప్రక్షాళన చేసి సమర్ధవంగా అమలుచేస్తామని, ఈ పథకం పరిధిలోకి మరిన్ని వైద్యసేవలను చేరుస్తామని రాజయ్య అన్నారు. ప్రభుత్వాస్పత్రులలో ఆరోగ్యశ్రీ చికిత్సలు ఎక్కువగా అందిస్తామని, ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. -
350 ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణ
భారతీయ వైద్య మండలి నిర్ణయం ఏపీలో 200, తెలంగాణలో 150 సీట్ల పునరుద్ధరణ ఏపీలో కొత్తగా అందుబాటులో 600 సీట్లు హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్ల విషయంలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయూలు తీసుకుంది. ఉభయ రాష్ట్రాల్లోని మొత్తం ఎనిమిది ప్రభుత్వ కళాశాలలు వసతుల లేమి కారణంగా ఇటీవల 500 సీట్లు కోల్పోగా.. వీటిలో మూడు కళాశాలలకు మినహా మిగతా అన్ని కళాశాలల్లో కోల్పోయిన 350 సీట్లను పునరుద్ధరిస్తూ మంగళవారం నిర్వహించిన కార్యవర్గ కమిటీ సమావేశంలో ఎంసీఐ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు రెండు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు సీట్ల కేటాయింపునకు అనుమతించింది. దీనితో పాటు కర్నూలు జిల్లాలోని ఓ కొత్త ప్రైవేటు కాలేజీకి సీట్లు కేటారుుంచారు. ఇప్పటికే నడుస్తున్న కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలకు సైతం అదనపు సీట్లను కేటాయించారు. 2014-15 సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి 6,500 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయని అంచనా. వసతులు, అధ్యాపకులు లేని కారణంగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు కొన్ని నెలల క్రితం 500 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. తెలంగాణలోని నిజామాబాద్ కళాశాల 100, గాంధీ వైద్య కళాశాల 50 సీట్లు కోల్పోయూరుు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విశాఖపట్నం ఏఎంసీ, కాకినాడ రంగరాయ, విజయవాడ సిద్ధార్థ, తిరుపతి ఎస్వీ కళాశాలలు ఒక్కొక్కటి 50 చొప్పున కోల్పోగా, ఒంగోలు రిమ్స్ 100 సీట్లు నష్టపోరుుంది. మంగళవారం జరిగిన ఎంసీఐ ఈసీ మీటింగ్లో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, ఏఎంసీ, సిద్ధార్థ కళాశాలలు మినహా మిగతా అన్ని కళాశాలలకూ కోల్పోరుున సీట్లు తిరిగి లభించారుు. ఐదొందల సీట్లు కోల్పోగా అందులో 350 సీట్లను పునరుద్ధరించారు. ఏపీ కోల్పోరుున 200 సీట్లు, తెలంగాణ కోల్పోరుున 150 సీట్లను పునరుద్ధరించినట్టరుుంది. ఏపీకి కొత్తగా 600 సీట్లు ఆంధ్రప్రదేశ్లోని కొత్త ప్రభుత్వ కళాశాలల్లో ఈ ఏడాది 300 ఎంబీబీఎస్ సీట్లు కేటారుుంచారు. నెల్లూరులో నిర్మించిన వైద్య కళాశాలకు 150 సీట్లు, తిరుపతిలోని పద్మావతి కళాశాలకు 150 సీట్ల చొప్పున మొత్తం 300 సీట్లకు అనుమతి లభించింది. మరోవైపు ప్రైవేటు కళాశాలల్లోనూ 300 సీట్లు పెరిగాయి. ఈ ఏడాది కర్నూలులో కొత్తగా నిర్మించిన విశ్వభారతి మెడికల్ కళాశాలకు 150 సీట్లు కేటాయించారు. -
రాష్ట్రానికి అదనంగా 450 మెడికల్ సీట్లు
హైదరాబాద్ : ఈ విద్యా సంవత్సరం రాష్ట్రానికి 450 మెడికల్ సీట్లు అదనంగా వచ్చాయని వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అదనంగా కేటాయించిన సీట్లలో తిరుపతి స్విమ్స్కు 150 సీట్లు మంజూరు అయినట్లు కామినేని వెల్లడించారు. మిగిలిన 300 సీట్లను ప్రయివేట్ కళాశాలలకు కేటాయించినట్లు చెప్పారు. ఎంసీఐ రద్దు చేసిన 350 సీట్లను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కామనేని శ్రీనివాస్ తెలిపారు. ఎంసీఐని మళ్లీ రాష్ట్రంలో తనిఖీలు చేయమని కోరతామని మంత్రి పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్రానికి ఆ సీట్లు తిరిగి వచ్చే అవకాశం ఉందని అన్నారు. మెడికల్ కళాశాలల్లో ఫీజు విధానాన్ని ఈరోజు సాయంత్రం ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీని ఎలా కొనసాగించాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. -
వైద్య కళాశాలల్లో అరువుకు అధ్యాపకులు!
* ఎంసీఐ తనిఖీలకు తాత్కాలిక సిబ్బంది * ఎంబీబీఎస్ విద్యార్థుల కలవరం సాక్షి, హైదరాబాద్: సర్కారీ వైద్య కళాశాలల్లో అధ్యాపకులను అరువుకు తెచ్చుకుంటున్నారు. దీంతో సరిగా పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. భారతీయ వైద్య మండలి అధికారులు వసతులు, అధ్యాపకులపై తనిఖీలు చేసే సమయంలో ఇలా కొద్ది మంది వైద్యులను వారం రోజులకు నియమించుకోవడం, అనంతరం వారిని యథాస్థానాలకు పంపిస్తున్నారు. ఫలితంగా ఎంబీబీఎస్ విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారు. కొన్నేళ్లుగా నియామకాలు చేపట్టకుండా పోవడంతో సర్కారీ వైద్య కళాశాలల్లో సీట్లు కోత పడుతున్నాయి. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న గాంధీ ఆస్పత్రి, కొత్తగా ఏర్పాటు చేసిన నిజామాబాద్ వైద్య కళాశాలల్లో సీట్లు పోవడమే ఇందుకు నిదర్శనం. విచిత్రమేమంటే పీహెచ్సీలలో పనిచేస్తున్న ఎంబీబీఎస్ డాక్టర్లను కూడా అధ్యాపకులుగా చూపిస్తున్నారు. ప్రధాన విభాగాల్లోనే కొరత ఎంబీబీఎస్లో చేరిన విద్యార్థులకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. ఎంబీబీఎస్లో అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ, పథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అనేవి కీలకమైనవి. ముఖ్యంగా అనాటమీ (శరీరధర్మశాస్త్రం) అనేది కీలకమైనది. ఇందులోనే చదువు చెప్పేవారు లేరు. దీనివల్ల ఎంబీబీఎస్లో తొలి ఏడాది విద్యార్థులు చాలా మంది ఫెయిలవుతున్న సంఘటనలూ ఉన్నాయి. రేయింబవళ్లు కష్టపడి చదివి ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకుని ఎంబీబీఎస్లో చేరే విద్యార్థులు వైద్య కళాశాలల్లో ఉన్న పరిస్థితి చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్లో 30 శాతం వైద్యుల కొరత ఉంది. అదే నిజామాబాద్లో అయితే వైద్యులు లేక, వసతులు లేక ఏకంగా 100 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. వరంగల్లోనూ ప్రస్తుతం ఎంసీఐ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా యాభై సీట్లు కోల్పోయే పరిస్థితి ఉందని అధికారులు అంటున్నారు. -
నూతన వైద్య కళాశాలలకు త్వరలో ఎంసీఐ బృందం
రాయచూరు రూరల్, న్యూస్లైన్ : రాయచూరు, గుల్బర్గ, కొప్పళ జిల్లాలలోని నూతన ైవైద్య కళాశాలలను త్వరలో ఎంసీఐ బృందం సందర్శిస్తుందని జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర ైవైద్య విద్యా శాఖ మంత్రి శరణుప్రకాష్ పాటిల్ తెలిపారు. ఆయన శనివారం నగరంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ైవైద్య కళాశాలలో విద్యార్థుల ప్రవేశానికి అనుమతి కోరుతామన్నారు. బీదర్ వైద్య కళాశాలలో జరిగిన అవీనితిపై విచారణ జరిపిస్తామన్నారు. ఓపెక్ ఆస్పత్రి నిర్వహణకు సంబంధించి స్వయం ప్రతిపత్తితో వ్యవవహరించే కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకుచర్యలు చేపట్టామన్నారు. విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు ప్రతాప్ గౌడ పాటిల్, హంపనగౌడ, వెంకటేశ నాయక్, రాయచూరు డీసీసీ అధ్యక్షుడు వసంతకుమార్, పార్టీ నాయకుడు బివి.నాయక్ ఉన్నారు -
కేఎంసీలో సీట్లు భద్రమేనా?
వరంగల్ సిటీ, న్యూస్లైన్ : వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో అంతకుముందు ఉన్న 150 సీట్లకు అదనంగా మరో 50 సీట్లు గత సంవత్సరం మంజూరయ్యాయి. అయితే ఈ సంవత్సరం 200 సీట్లు ఉంటాయా లేదా 150 సీట్లనే కొనసాగిస్తారా అనేది సంది గ్ధంగా మారింది.గత సంవత్సరం ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) 50 సీట్లు మంజూరు చేసినప్పుడు కళాశాలలో సిబ్బం దిని నియమించాలని, వసతులను కల్పిం చాలని సూచించింది. కానీ, ఇప్పటివరకూ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు, ఉద్యోగులను నియమించలేదు. దీంతో ఈసారి ఎంసీఐ బృందం తనిఖీ నిర్వహిస్తే కచ్చితంగా 50 సీట్లు రద్దయ్యే అవకాశం ఉందని పలువురు ప్రొఫెసర్లు చెబుతున్నా రు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు మెడికల్ కళాశాలల్లో ఎంసీఐ బృందం తనిఖీలు నిర్వహించి.. నాలుగు కళాశాలల్లో సీట్లను రద్దు చేసింది. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో తనిఖీ నిర్వహించిన ఎంసీఐ బృందం సరైన సౌకర్యాలు లేవంటూ 100 సీట్లను రద్దు చేసినట్లు తెలిసింది. ఏదేమైనా ఎంసీఐ బృందం తనిఖీకి వచ్చిన తర్వాతే కేఎంసీలో ఎన్ని సీట్లు ఉంటాయో తేలనుంది. -
‘ఎంబీబీఎస్’లో మూలకణ మార్పిడి పద్ధతులు
న్యూఢిల్లీ: వైద్య విద్యార్థులకు మూలకణ చికిత్సపై అవగాహన కలిగించేందుకుగాను ఎంబీబీఎస్ అకడమిక్ కరికులంలో మూలకణ మార్పిడి అధ్యాయాన్ని ప్రవేశపెట్టాలని భారత వైద్య మండలి(ఎంసీఐ) యోచిస్తోంది. ఈ మేరకు కొత్త అధ్యాయాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రతి పాదనను ఎంసీఐ పరిశీలిస్తోంది. ప్రతిపాదన ప్రకారం... మూలకణ మార్పిడి చికిత్సల పద్ధతులు, ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రత్యేక అధ్యాయం రూపొందిస్తారు. ముఖ్యంగా రక్తం సంబంధిత సమస్యలకు చేసే మూలకణ మార్పిడి చికిత్సలకు ప్రాధాన్యం ఉంటుందని ఆదివారమిక్కడ అతర్జాతీయ ఎముక మజ్జ మార్పిడి సదస్సులో ప్రసంగిస్తూ ఎంసీఐ సభ్యుడు నవీన్ దాంగ్ తెలిపారు. దేశంలో మూలకణ దానం, మార్పిడిపై అవగాహన తక్కువగా ఉందని, సిలబస్లో కొత్త అధ్యాయం వల్ల వైద్య డిగ్రీ పట్టభద్రుల్లో దీనిపై అవగాహన కల్పించవచ్చన్నారు. -
ఎంసీఐలో రిజిస్ట్రేషన్ స్కాం
న్యూఢిల్లీ: జాతీయ వైద్య మండలి (ఎంసీఐ)లో ‘రిజిస్ట్రేషన్’ కుంభకోణం బయటపడింది. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించినవారికి దేశంలో ప్రాక్టీసు చేయడానికి అనుమతికోసం రిజిస్ట్రేషన్ నెంబర్లను సృష్టించిన అధికారులు.. వాటితో నకిలీ పత్రాలను సృష్టించి అభ్యర్థులకు అందజేశారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ. 20 లక్షలు వసూలు చేశారు. మీరట్కు చెందిన ఒక వైద్యుడు ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఈ అక్రమాలపై సమాచారం అందుకున్న సీబీఐ.. ఒక ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టింది. గురువారం దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు చేసి... తప్పుడు సర్టిఫికెట్లతో వైద్యులుగా చెలామణీ అవుతున్న ఆరుగురిని అరెస్టు చేసింది. పలువురు ఎంసీఐ అధికారులు, వైద్యులపై కేసులు నమోదు చేసింది. కాగా, మరోవారం రోజుల్లో పెళ్లి జరుగనున్న నేపథ్యంలో తను అరెస్టు కావడంతో పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్కు చెందిన వైద్యుడు ఆత్మహత్యాయత్నం చేశారు. తప్పుడు మార్గంలో ఎంసీఐ రిజిస్ట్రేషన్ పొందిన అభ్యర్థుల నివాసాలపై.. ఎంసీఐ అధికారులకు, అభ్యర్థులకు మధ్యవర్తిగా వ్యవహరించిన మీరట్కు చెందిన వైద్యుడి నివాసంలో సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఈ ఆపరేషన్లో గుజరాత్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్ల్లో పనిచేస్తున్న ముగ్గురు ప్రభుత్వ వైద్యులు సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అయితే, మరొకరిని కూడా అరెస్టు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. రిజిస్ట్రేషన్ కోసం ఒక్కొక్కరు 20 లక్షలు లంచంగా ఇచ్చినట్లు నిందితులు చెప్పారన్నాయి. -
ఈ సారి ఏమవుతుందో!
మెడికల్ కళాశాల పరిశీలన కోసం జిల్లాకు రానున్న ఎంసీఐ బృందం నివేదికలు సిద్ధం చేస్తున్న వైద్యాధికారులు రెండవ సంవత్సరం అనుమతి లభించేనా మొదటి ఏడాదే షరతులతో మంజూరు అందుబాటులో లేని ప్రొఫెసర్లు కనీస వసతులు కూడా కరువే బోధనలో తీవ్ర అంతరాయం కళాశాలను వీడుతున్న విద్యార్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం త్వరలో జిల్లాకు రానుంది. మెడికల్ కళాశాలలో రెండవ సంవత్సరం తరగతులకు అనుమతినిచ్చే విషయాన్ని పరిశీలించనుంది. ఇందుకు సంబంధించి కళాశాల అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. వసతులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఎంసీఐ బృందం సికింద్రాబాద్ గాంధీ ఆ స్పత్రిలో ఉంది. అక్కడ పరిశీలన సక్రమంగా పూర్తి అయితే ఈ నెల రెండున లేదంటే ఐదున జిల్లాకు వస్తుందని తెలుస్తోంది. నిజామాబాద్ అర్బన్, న్యూస్లైన్: మెడికల్ కళాశాల అధికారుల కు ఎంసీఐ బృందం పరిశీలన భ యం పట్టుకుంది. గత ఏడాది మొ దటి సంవత్సరానికి సంబంధించిన ఏర్పాట్లు, ప్రొఫెసర్ల నియామకం స క్రమంగా జరిగినా ఎంసీఐ మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. కళాశాలకు మొదట అనుమతి నిరాకరించి, ఆ తరువాత షరతులతో కూడిన అనుమతిని మం జూరు చేసింది. రెండవ సంవత్సరానికి సంబంధించి సమస్యలూ అదే విధంగా ఉన్నాయి. కళాశాలకు కేటాయించిన 116 మంది ఫ్రొఫెసర్లు నేటికీ పూర్తి స్థాయిలో అందుబాటులో లేరు. 38 మంది ఉన్నా,కళాశాలకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేక తరగతుల నిర్వహణ పూర్తిగా జరగలేదు. ఐదుగురు ప్రొఫెసర్లు మాత్రమే విద్యాబోధన చేపట్టారు. ఆగస్టులో ప్రారంభం కావల్సిన శవపరీక్ష బోధన డిసెంబ ర్లో ప్రారంభమైంది. ఇంటర్నల్ పరీక్షలు అయిపోయిన తరువాత దీనిని ప్రారంభించారు. దీంతో విద్యార్థులు పలుమార్లు ప్రిన్సిపాల్ను కలిసి తగిన చర్యలు తీసుకో వాలని విన్నవించారు. ఏడుగురు విద్యార్థులు అడ్మిషన్ రద్దు చేసుకొని ఇతర కళాశాలలకు వెళ్లిపోయారు. అయినా పూర్తి స్థాయి విద్యాబోధన, ఏర్పాట్లు జరుగడం లేదు. కేటాయించిన ప్రొఫెసర్లు కళాశాల వైపు కన్నెత్తి చూడలేదు. వారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటేనే రెండవ సంవత్సరానికి అనుమతి వచ్చే అవకాశం ఉంది. మొ దటి సంవత్సరం విద్యార్థులకు స్టడీ మెటీరియల్, గ్రంథాలయం అందుబాటులో లేదు. విద్యార్థులు కోరితే తాత్కాలిక ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారు. ఇంకా మారని ఆస్పత్రి మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జిల్లా ఆస్పత్రి మారలేదు. సగం విద్యా సంవత్సరం ముగిసినా ఆస్పత్రి మాత్రం కళాశాల పరిధిలోకి వెళ్లలేదు. గతంలో ఎం సీఐ పరిశీలనలో ఆస్పత్రిని మెడికల్ కళాశాల అనుబంధంగా చూపించారు. త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇస్తుందని తెలిపారు. కాని నేటి వరకు ఆస్పత్రి మా ర్పు జరుగలేదు. ఆస్పత్రిలో వివిధ వార్డుల ఏర్పాటు అస్తవ్యస్తంగా ఉందని, తక్షణమే వైద్యపరీక్షల నిర్వహణ, వికలాంగులకు గదులు మొదటి అంతస్తులో ఏర్పాటు చేయాలని ఎంసీఐ బృందం సూచించింది. అది ఇంకా అమలు కాలేదు. ఆస్పత్రి వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉండడంతో మెడికల్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రావడం లేదు. వీరు ఈ విషయాన్నే ఎంసీఐ బృందం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిసింది. కళాశాలకు ఇటీవలే ప్రభుత్వం 810 పోస్టులను మంజూ రు చేసింది. నియమకాలు మాత్రం చేపట్టలేదు. పరిపాలన విభాగం, నాల్గవ తరగతి ఉద్యోగులు, సిబ్బంది, పారామెడికల్ ఉద్యోగుల నియామకాలూ జరుగలేదు. కొనసాగుతున్న ఏర్పాట్లు వీటన్నింటినీ ప్రస్తుతం ఎంసీఐ బృందం పరిశీలించే అవకాశం ఉంది. నియామకాలను అక్టోబరులోనే పూర్తి చేయాలని అధికారులు భావించారు. వివిధ కారణాలతో అది సాధ్యం కాలేదు. రెండవ సంవత్సరానికి సంబంధించిన భవనాల నిర్మాణం పూర్తి అయ్యాయి. బోధనకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నివేదికలు సిద్ధం చేస్తున్నాం ఎంసీఐ బృందం ఫిబ్రవరి రెం డున లేదా ఐదున వచ్చే అవకా శం ఉంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం. నివేదికలు సిద్ధం చేస్తున్నాం. రెండవ సంవత్సరం అ నుమతి కోసం అవసరమైన పనులన్నింటిని పూ ర్తి చేస్తున్నాం. -జిజియాబాయి, ప్రిన్సిపాల్ -
రిమ్స్లో ఎంసీఐ బృందం పరిశీలన
రిమ్స్క్యాంపస్, న్యూస్లైన్ : రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్స్ సెన్సైస్(రిమ్స్) వైద్య కళాశాల, ఆస్పత్రులను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) బృందం సోమవారం పరిశీలించింది. రిమ్స్లో పీజీ కోర్సుల ప్రారంభానికి అవసరమైన సౌకర్యాలు ఉన్నదీ లేనిదీ పరిశీలించేందుకు ఈ బృందం వచ్చింది. 13 విభాగాల్లో పీజీ కోర్సు ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ రిమ్స్ అధికారులు ప్రతిపాదనలు పంపగా మొదటి విడత మూడు విభాగాల్లో సౌకర్యాలను ఎంసీఐ బృందం సభ్యులు పరిశీలించారు. ఆప్తమాలజీ విభాగాన్ని డాక్టర్ రేణుక దేశాయ్(పాండిచ్చేరి), సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగాన్ని డాక్టర్ మల్లిక్(రోహ్తక్), బయో కెమిస్ట్రీ విభాగాన్నిడాక్టర్ భట్టాచార్య(అసోం) పరిశీలించారు. రోజుకు ఎన్ని కేసులు వస్తున్నాయి, ఏయే సేవలు అందుతున్నాయి, ఏయే పరికరాలు ఉన్నాయి, ఏయే శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయనే అంశాలను తెలుసుకున్నారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారని ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికలు, రికార్డులను పరిశీలించారు. వీరివెంట రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ టి.జయరాజ్, సూపరింటెండెంట్ అరవింద్, ఆర్ఎంవో లూకలాపు ప్రసన్నకుమార్, ఏఆర్ఎంవో బి.సీహెచ్.అప్పలనాయుడు, రిమ్స్ ఆరోగ్యశ్రీ కోఅర్డినేటర్ డాక్టర్ సంపత్కుమార్ ఉన్నారు.