మమ్మల్ని నమ్మండి.. అన్నీ చేస్తాం | On Migrant Crisis, Centre Tells Supreme Court to Trust the Government | Sakshi
Sakshi News home page

పేదలు, వలస కూలీలను ఆదుకుంటున్నాం

Apr 16 2020 10:41 AM | Updated on Apr 16 2020 10:43 AM

 On Migrant Crisis, Centre Tells Supreme Court to Trust the Government - Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో పేదలు, వలస కూలీలు ఇబ్బందులకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ విషయంలో తమను విశ్వసించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పుడు పేద ప్రజలు, నిరాశ్రయులు, కూలీలను అన్నివిధాలా ఆదుకోవాలని, ఆ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై(పిల్‌) సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపింది. కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. మెహతా వాదనలను పరిగణనలోకి తీసుకుని అగ్నివేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కాలినడకన స్వస్థలాలకు వెళుతున్న వలస కార్మికులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, మంచినీరుతో పాటు విశ్రమించడానికి సదుపాయాలు కల్పిస్తున్నామని కోర్టుకు సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు. కాగా, ఆకలి బాధలు తట్టుకోలేక దేశంలోని వివిధ ప్రాంతాల్లో వలస కార్మికులు ఆందోళనలకు దిగుతున్నారు. తిండి గింజల కోసం పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో బెర్హంపూర్‌-కరీంపూర్‌ జాతీయ రహదారిపై స్థానికులు బుధవారం బైఠాయించారు. (శ్మ‌శానంలో కుళ్లిన అర‌టిపండ్ల‌ను తింటున్న కూలీలు)

నర్సుల సమస్యల పరిష్కారానికి..
తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ యునైటెడ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌(యూఎన్‌ఏ), ఇతర ఆరోగ్య కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లనపై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. నర్సుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వేతనాల్లో కోత, ఆలస్యంగా వేతనాలు ఇవ్వడం, వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. మరోవైపు, దేశంలో పారిశుధ్య కార్మికులకు రక్షణ పరికరాలను అందజేస్తున్నామని, కరోనా నియంత్రణ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని కేంద్ర సర్కారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 

చదవండి: మరింత పటిష్టంగా లాక్‌డౌన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement