
న్యూఢిల్లీ: ఇన్ఫాంట్రీ డే సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం ఆర్మీకి శుభాకాంక్షలు తెలిపారు. 1947, అక్టోబర్ 27న పాక్ సైన్యం మద్దతుతో జమ్మూకశ్మీర్లో ప్రవేశించిన గిరిజన దళాలను తరిమివేసేందుకు సిక్కు రెజిమెంట్కు చెందిన మొదటి బెటాలియన్ సైనికులు తొలిసారిగా విమానాల ద్వారా శ్రీనగర్లో దిగారు. భారత సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్కు గుర్తుగా ప్రతి ఏటా అక్టోబర్ 27న ఇన్ఫాంట్రీ డేగా జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ..‘ ఇన్ఫాంట్రీ డే వేళ పదాతిదళ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. మన పదాతిదళం ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలు, దేశానికి అందించిన సేవలపై మేం ఎంతో గర్వపడుతున్నాం’ అని ట్వీట్ చేశారు. ‘దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇన్ఫాంట్రీ వీరులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారి వీరోచిత త్యాగాలను రాబోయే భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకుంటాయి’ అని మరో ట్వీట్లో తెలిపారు.