
మూడేళ్లలో.. 99
ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం, నాబార్డు, ఎన్డబ్ల్యూడీఏ మధ్య కుదిరిన ఒప్పందం
పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో 76.03 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యం
తన వాటాగా రూ. 31,342 కోట్లను సమకూర్చనున్న కేంద్రం
రాష్ట్రాల వాటా నిధుల కోసం నాబార్డు ద్వారా రుణ సదుపాయం
జాబితాలో తెలంగాణ నుంచి 11, ఏపీ నుంచి ఎనిమిది ప్రాజెక్టులు
ఒప్పందం కొత్త శకానికి నాంది: హరీశ్రావు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై) కింద దేశవ్యాప్తంగా కేంద్రం గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్ర జల వనరుల శాఖ, నాబార్డు, జాతీయ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా, కేంద్ర సహాయ మంత్రి సంజీవ్ కుమార్, ఏఐబీపీ అమలు టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్, ఛత్తీస్గఢ్ మంత్రి బ్రిజ్మోహన్, సభ్యులు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు, మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరి సమక్షంలో అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
99 ప్రాజెక్టులకు..
దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 సాగునీటి ప్రాజెక్టులను గుర్తించిన కేంద్రం.. నాబార్డ్ నిధుల ద్వారా 2019-20లోపు వాటిని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ ప్రాజెక్టుల ద్వారా 76.03 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తొలి దశలో 2016-17 నాటికి 23 ప్రాజెక్టులు, రెండో దశలో 2017-18 నాటికి 31 ప్రాజెక్టులు, మూడో దశలో 2019 డిసెంబర్ నాటికి మిగతా 45 ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయించింది. వీటన్నింటికీ కలిపి రూ.77,595 కోట్లు అవసరమని అంచనా వేయగా... ఇందులో రూ.31,342 కోట్లను కేంద్రం పీఎంకేఎస్వై కింద తన వంతు సాయంగా ఆయా రాష్ట్రాలకు అందజేస్తుంది.
మిగతా రూ.46,253 కోట్లను రాష్ట్రాలు తమ వాటాగా భరించాల్సి ఉంటుంది. అయితే ఈ నిధులను కూడా ఆయా రాష్ట్రాలు నాబార్డ్ నుంచి రుణంగా పొందే వెసులుబాటు తాజా ఒప్పందంతో కలుగుతుంది. కేంద్రం ఎంపిక చేసిన 99 ప్రాజెక్టుల్లో తెలంగాణ నుంచి దేవాదుల, కొమురం భీం, గొల్లవాగు, ర్యాలీ వాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎర్ర కాలువ జలాశయం, తాడిపూడి ఎత్తిపోతల, పుష్కర ఎత్తిపోతల, గుండ్లకమ్మ, తోటపల్లి, తారకరామ తీర్థసాగర్, ముసురుమిల్లి తదితర ప్రాజెక్టులు ఉన్నాయి.
రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం: హరీశ్రావు
సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్ర జల వనరుల శాఖ, నాబార్డు, జాతీయ వాటర్ డెవలప్మెంట్ అథారిటీల మధ్య ఒప్పందం కొత్త శకానికి నాంది పలికిందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గతంలో కేంద్రంలో ప్రాజెక్టులను రూపకల్పన చేసి అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించేవారని చెప్పారు. కానీ మొదటిసారిగా కేంద్ర మంత్రి ఉమాభారతి చొరవ తీసుకుని.. రాష్ట్రాల అవసరాలేమిటి, ప్రాజెక్టులను ఎలా చేపడితే బాగుంటుందనే అంశంపై మూడు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు.
దేశవ్యాప్తంగా 99 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి 76 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాధించే లక్ష్యంతో ముందుకు పోతున్నారని హరీశ్ వెల్లడించారు. ‘‘గతంలో ఏఐబీపీ కింద కేంద్రం తక్కువ మొత్తంలో నిధులు ఇచ్చేది. ఇప్పుడు కేంద్రం తన వాటా నిధులను గ్రాంటు రూపంలో ఇవ్వడమే కాకుండా.. సదరు ప్రాజెక్టు పూర్తయ్యేందుకు అవసరమైన నిధుల కోసం నాబార్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్రైపాక్షిక ఒప్పందం చేసుకునేందుకు వీలు కలిగిస్తోంది. నాబార్డుతో కేంద్రం కుదుర్చుకున్న ఈ ఒప్పందం దేశంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి తోడ్పడుతుంది. కేంద్రం ఎంపిక చేసిన 99 ప్రాజెక్టుల్లో తెలంగాణ నుంచి 11 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది చాలా సంతోషకరం.
రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని 11 ప్రాజెక్టుల పూర్తికి రూ.7 వేల కోట్లతో ప్రతిపాదనలు పంపాం. రూ.2 వేల కోట్లు గ్రాంట్గా, రూ.5 వేల కోట్లు రుణంగా ఇవ్వాలని కోరాం. సెప్టెంబర్ చివరికల్లా నిధులు విడుదల చేస్తామని ఉమాభారతి హామీ ఇచ్చారు. ఇప్పటికే దేవాదుల ప్రాజెక్టుకు రూ. 3 వేల కోట్లు కేటాయించారు..’’ అని హరీశ్ తెలిపారు.