
మీడియాతో మాట్లాడుతున్న ‘‘నేషనల్ కాన్ఫరెన్స్’’ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో జరగనున్న పంచాయతీ, స్థానిక ఎన్నికలను బహిష్కరించనున్నట్లు ‘‘నేషనల్ కాన్ఫరెన్స్’’ పార్టీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 35ఎ కొనసాగింపుపై తమ నిర్ణయాన్ని తెలిపేంత వరకు ఎన్నికలకు వెళ్లబోమని ఎన్సీ తేల్చిచెప్పింది. ఆర్టికల్ 35ఎ పై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇచ్చేవరకు ఎన్నికలకు వెళ్లేదిలేదని పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
బుధవారం జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టికల్ 35ఎ పై అనవసర జోక్యం చేసుకోవటం వల్ల చోటుచేసుకునే పరిణామాలను పట్టించుకోకుండా పంచాయతీ, స్థానిక ఎన్నికలపై హుటాహుటిన నిర్ణయం తీసుకుందని అన్నారు. రాష్ట్రంలో నాలుగు దశలలో పంచాయతీ, స్థానిక ఎన్నికలు జరగనున్నట్లు జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆగస్టు 30న ప్రకటించిన విషయం తెలిసిందే.