
తిరువనంతపురం : వివాదాస్పద జగడాలమారి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మద్దతు తెలిపారు. అమెరికా ఒత్తిడిని ఉత్తరకొరియా సమర్థంగా తట్టుకుంటోందని, తిప్పికొడుతోందని ఆయన అన్నారు. కొద్దిరోజుల క్రితం సీపీఎం పార్టీ ఫ్లెక్సీలో కిమ్ జాంగ్ ఉన్ ఫొటో కనిపించిన విషయం విదితమే.
ఈసారి ఏకంగా ముఖ్యమంత్రే కిమ్ను వెనుకేసుకొస్తూ మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సామ్రాజ్యవాద శక్తులను అడ్డుకోవడంలో చైనా కంటే మెరుగ్గా ఉత్తర కొరియా పనిచేస్తోందని ఆయన ప్రశంసలు కురిపించారు. కోజికోడ్లో సీపీఎం జిల్లా పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామ్రాజ్యవాద శక్తులపై చైనా పోరాటం ప్రజల అంచనాలకు తగినట్లుగా లేదన్నారు.
అమెరికా వైఖరికి తగ్గట్టుగా ఉత్తర కొరియా కఠిన వైఖరితో వ్యవహరిస్తోందని, సామ్రాజ్యవాద శక్తులతో ఎలా పోరాడాలో ఆ దేశమే ఉదాహరణ అని అన్నారు. కేరళ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ కూడా గతంలో ఉత్తరకొరియాపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఆ దేశ తన ఆయుధ సంపత్తిని పెంపొందించుకొని అణు సామర్థ్యం గల దేశంగా అవతరించిందని పొగిడారు.
Comments
Please login to add a commentAdd a comment