
కదులుతున్న రైలులో మహిళా ఎన్ఆర్ఐ..
సూరత్: గుజరాత్లో కదులుతున్న రైలులో ఓ ఎన్ఆర్ఐ మహిళ నిలువు దోపిడీకి గురైంది. ఆనంద్, నడియాద్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత మహళ సూరత్ నుంచి సురేందర్నగర్ వస్తుండగా గుర్తుతెలియని దుండగులు ఆమెను అటకాయించి రూ 13.17 లక్షల విలువైన నగదు, ఆభరణాలను దోచుకున్నారు. ఈ పెనుగులాటలో స్వల్పంగా గాయపడ్డ మహిళను సూరత్లోని న్యూ సివిల్ ఆస్పత్రికి తరలించారు. లండన్లో నివసిస్తున్న వీణా దినేష్ దీపాలా ఓ వివాహానికి హాజరయ్యేందుకు జులై 17న భారత్ వచ్చారు.
నగరంలోని సోదరి వద్ద ఉంటూ సురేందర్నగర్లో వివాహ కార్యక్రమానికి సోదరితో కలిసి వెళ్లారు. జామ్నగర్ -తిరునల్వేలి ఎక్స్ప్రెస్లో తిరుగు ప్రయాణమయ్యారు. రైలు నడియాద్ స్టేషన్ చేరుకున్న కొద్దిసేపటికి ఇద్దరు దుండగులు కోచ్లో ప్రవేశించి దీపాలాను కత్తులతో బెదిరించి ఆమె పర్సును బలవంతంగా లాక్కున్నారు. తర్వాతి స్టేషన్కు రైలు చేరుకునే సమయంలో దుండగులు పరారయ్యారు. పర్సులో ఇండియన్ కరెన్సీతో పాటు పౌండ్లు, ఆభరణాలు ఉన్నాయని బాధితురాలు పేర్కొన్నారు.చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినా తొలుత వారు సరిగ్గా స్పందించలేదని ఆమె చెప్పారు.