పాకిస్థాన్ ప్రముఖ గజల్ మ్యాస్ట్రో గులాం అలీ మాట మార్చారు. తను పెట్టుకున్న షరతును తానే రద్దు చేసుకున్నారు.
కరాచీ: పాకిస్థాన్ ప్రముఖ గజల్ మ్యాస్ట్రో గులాం అలీ మాట మార్చారు. తను పెట్టుకున్న షరతును తానే రద్దు చేసుకున్నారు. భారత్ పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తాను భారత్లో ఎలాంటి సంగీత కచేరీలు నిర్వహించబోనని, ఇప్పటికే ఒప్పుకున్న కార్యక్రమాలు కూడా రద్దు చేసుకుంటున్నానని ప్రకటించిన ఆయన తిరిగి ఆ కార్యక్రమాలను కొనసాగించేందుకు వస్తున్నట్లు తెలిసింది. డిసెంబర్ 3న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ కచేరి కార్యక్రమానికి వస్తున్నట్లు కీలక వర్గాల సమాచారం.
ఇటీవల ముంబై, ఢిల్లీలో నిర్వహించాల్సిన సంగీత కచేరి కార్యక్రమాలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోబోనని, అయితే, భారత రాజకీయాలు తనను అమితంగా గాయపరిచాయని, తనను వివాదంలోకి లాగి కొన్ని రాజకీయ పార్టీలు లబ్దిపొందాలని చూస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఇరు దేశాలమధ్య సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తాను కచేరిలు భారత్లో నిర్వహించబోనని చెప్పిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఆయన తన మనసు మార్చుకోవడం గమనార్హం.