లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని...
పింప్రి, న్యూస్లైన్ : లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలు బహిరంగంగా ప్రచారం చేసినప్పటికీ ఆచరణలో వివక్ష చూపించాయి. ప్రస్తు తం పుణే జిల్లాలోని 21 అసెంబ్లీ నియోజక వర్గాలకు అన్ని పార్టీలు కలిపి 9 మంది మహిళలను మాత్రమే బరిలోకి దింపాయి.
ఇందులో బీజేపీ నుం చి మాధూరి మిసల్ (పర్వతి నియోజక వర్గం ), మేధా కూల్కర్ణి (కోత్రోడ్), సంగీతా రాజే నింబాల్కర్ (పుంధర్) బరిలో ఉన్నారు. శివసేన నుంచి ఆశాబుచక్ (జున్నర్), సులభా ఉభాలే (బోసిరి), బీజేపీ -ఆర్పీఐ నుంచి చంద్రకాంత్ సోనాకాంబ్లే (పింప్రి), కాంగ్రెస్ నుంచి వందనా సాత్పుత్ (ఖేడ్-ఆలంది), ఎన్సీపీ నుంచి సంధ్యా బేనకే (ఆంబేగావ్), ఎమ్మెన్నెస్ నుంచి శ్రద్ధా సోన్వాణే (జున్నర్)ల నుంచి బరిలోకి దిగారు.
రాష్ట్రవ్యాప్తంగా కేటాయించిన స్థానాలు ..
రాష్ర్ట వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 27 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. తర్వాత ఎన్సీపీ 16 మంది, బీజేపీ-21, శివసేన-10 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చాయి. ఎన్సీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ స్థానాల కేటాయింపులో అంత ప్రాధాన్యం ఇవ్వలేదు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ 174 మంది స్థానాల్లో 12 స్థానాల్లోనే మహిళా అభ్యర్థులకు టిక్కెట్టు ఇచ్చింది. గతంలో కంటే ఈ సారి ఎక్కువ మంది మహిళలను పోటీలో ఉంచింది. అసలు మహిళలకు పెద్ద పీట వేయ్యాలి అంటూ ఉపన్యాసాలకే పరిమితమవుతున్నాయి. గెలిచే చోట కాకుండా ఓడిపోయే నియోజక వర్గాల లో టిక్కెట్ ఇస్తున్నారని పలువురు మహిళా నాయకులు నిర్మోహమాటంగా చెబుతున్నారు.
కాంగ్రెస్, బీజేపీలోనూ బంధుగణమే
కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యధికంగా 27 మందికి సీట్లి ఇచ్చింది. అందులో పార్టీ నాయకులు బంధుగణమే ఎక్కువగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ భార్య అమితి చౌహాన్ (బోకర్ ), మాజీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిందే కుమార్తె ప్రణతి షిందే (షోలాపూర్ సెంట్రల్), మహిళా, శిశుసంక్షేమ మంత్రి వర్షా గైక్వాడ్ (దారావి, ముంబై), ఎమ్మెల్యే యశోమతి ఠాకూర్ (తివ సా అమరావతి), నిర్మలా గావిత్ (ఇగత్ పూరి), ఏనీ శేఖర్ (కొలాబా) మహిళా అభ్యర్థులు ఉన్నారు. అలాగే మాజీ పర్యావరణ మంత్రి సంజయ్ దేవతలే బదులుగా అసావరి దేవతలేకు పార్టీ టిక్కెట్ ఇచ్చింది. పార్టీలో కొత్తగా ముంబై మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శీతల్ మాత్రేకు దహిసర్ నుంచి, రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు సుశీబెన్ షాహా మలబార్ హిల్ నుంచి టికెట్ దక్కింది.
ఎన్సీపీ-బీజేపీ నుంచి
ఎన్సీపీ నుంచి బరిలోకి దిగిన మహిళా అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.. నాగ్పూర్ (సెంట్రల్) నుంచి ప్రగతి పాటిల్, హింగణా నుంచి కుందా రావుత్ బరిలోకి దిగారు. బీజేపీ మహిళా అభ్యర్థుల్లో దివంగత బీజేపీ నేత గోపినాథ్ ముండే కూతురు పంకజా ముండే (పర్లీ), మనీషా చౌదరి (దహిసర్-ముంబై), భారతీ లవేకర్ (వర్సోవ-ముంబై) లవేకర్ ఎన్సీపీ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఎన్సీపీకి చెందిన మరో మహిళా నేత బీజేపీ నుంచి (బేలాపూర్ ముంబై) పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎక్కువగా సీనియర్ పార్టీ నాయకుల బంధుగణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి, సీనియర్ నాయకులకు ప్రచార బాధ్యతలను చేపట్టి అభ్యర్థులను గెలిపించాలని పార్టీలు ఆదేశించాయి.
కొన్ని స్థానాల్లో పోటాపోటీ
కొన్ని నియోజకవర్గాల్లో పోటాపోటీగా మహిళా అభ్యర్థులు తలపడనున్నారు. ఇందులో కాంగ్రెస్ మాజీ మంత్రి వర్షా గైక్వాడ్కు పోటీగా బీజేపీ దివ్యావోలే పోటీ పడుతున్నారు. అమరావతి జిల్లా తివసా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా యశోమతి ఠాకూర్కు పోటీగా బీజేపీకి చెందిన నివేదితా చౌదరి నిల బడింది. షోలాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రణతి షిందేకు పోటీగా బీజేపీ నుంచి మోహిని వత్కిలు ఈ ఎన్నికల్లో హోరాహోరీ తలపడనున్నారు.
ముంబైలోని దహిసర్ నుంచి కాంగ్రెస్, బీజేపీ , ఎమ్మెన్నెస్ పార్టీలకు పోటీగా సిట్టింగ్ ఎమ్మెల్యే శివసేనకు చెందిన వినోద్ ఘోసాల్కర్ గట్టి పోటీ ఎదుర్కోనున్నారు. కాంగ్రెస్ నుంచి శీతల్ మాత్రే, శుభారావుల్ (ఎమ్మెన్నెస్), మనీషా చౌదరి (బీజేపీ) అందరూ మహిళా అభ్యర్థులే.
బీడ్ జిల్లాలో ఆసక్తికరం
బీడ్ జిల్లాలో కేజ్ అసెంబ్లీ మహిళా అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంది. ఈ నియోజక వర్గం నుంచి బీజేపీకి చెందిన సంగీతా టోంబరే, ఎన్సీపీ నుంచి నమితా ముందడా, శివసేన నుంచి కల్పనా నరహీరే బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీలకు కలిపి మొత్తంగా 3,559 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందులో 11 మంది మహిళలు మాత్రమే గెలిచి అసెంబ్లీలో కాలు పెట్టగా, 2004లో 12, 1999లో 12 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.