
పరువు నష్టం కేసులో కోర్టుకు రాహుల్
భివండీ: ఆరెస్సెస్ కార్యకర్త వేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం మహారాష్ట్ర భివండీలోని స్థానిక కోర్టుకు హాజరయ్యారు. ’ఆరెస్సెస్ వాళ్లే మహాత్మా గాంధీని చంపారు’ అని రాహుల్ భివండీలో 2014 మార్చి 6న అన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు.
మార్చి 3న రాహుల్ వాదనను నమోదు చేస్తామని తెలిపిన కోర్టు అప్పటివరకు కేసు విచారణను వాయిదా వేసింది. కోర్టుకు హాజరైన అనంతరం రాహుల్ మాట్లాడుతూ ‘మహాత్మా గాంధీని చంపిన సిద్ధాంతానికి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. ఖాదీ కేలండర్ నుంచి గాంధీ బొమ్మను తొలగించిన సిద్ధాంతంపైనే నా పోరాటం’అని పేర్కొన్నారు.