
ఎమ్మెల్యే సోదరుల కిరాతకం
లక్నో: తమ వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని ఎమ్మెల్యే సోదరులు కాల్చిచంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. అధికార సమాజ్ వాదీ పార్టీ కి చెందిన బలరాంపూర్ సాదర్ నియోజకర్గ ఎమ్మెల్యే జగ్ రామ్ పాశ్వాన్ సోదరులు అన్ను పాశ్వాన్, సాధు పాశ్వాన్ ఈ కిరాతకానికి పాల్పడ్డారు. మృతుడిని జైరామ్ యాదవ్ గా గుర్తించారు. ధనేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తరియపూర్వా గ్రామంలో పెళ్లికి హాజరై జైరామ్ తిరిగొస్తుండగా ఈ దారుణం జరిగింది.
కాల్పులు జరిపిన తర్వాత ఘటనా స్థలం నుంచి ఎమ్మెల్యే సోదరులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన అధికార సమాజ్ వాదీ పార్టీని ఇరుకున పడేసింది.