
కొత్త దారిలో మానససరోవర్ యాత్ర
జెండా ఊపి ప్రారంభించిన సుష్మ
న్యూఢిల్లీ: కొత్త మార్గంలో మొదటి బ్యాచ్ కైలాస్ మానససరోవర్ యాత్రను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. గత సెప్టెంబర్లో భారత్ పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ కొత్త మార్గాన్ని(వయా నాథులా పాస్) ప్రకటించారు. టిబెట్లోని మానససరోవర్ను బస్సులో చేరుకునేందుకు ఈ కొత్త రోడ్డు మార్గం వీలు కల్పిస్తుంది. దీంతో భారతీయ యాత్రికులు ముఖ్యంగా వయో వృద్ధులు మరింత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడింది.
ప్రస్తుతం యాత్రికులు ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్ మార్గంలో మానససరోవర్కు వెళుతున్నారు. వృద్ధులకు సైతం ఈ యాత్రను అందుబాటులోకి తీసుకువస్తానని గత ఏడాది తాను ఇచ్చిన హామీ నెరవేరినందుకు, యాత్రకు వెళుతున్నవారి ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని సుష్మ అన్నారు. కొత్త మార్గం ప్రారంభించనట్టైతే వీరు ఈ యాత్రను చేపట్టగలిగేవారు కాదన్నారు. సిక్కింలోని నాథులా పాస్ సముద్ర మట్టానికి 4 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఐపీఎస్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి సంబంధించిన వివాదంలో చిక్కుకున్న తర్వాత సుష్మ ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. వయా లిపులేఖ్ పాస్ మార్గంలో మానససరోవర్ యాత్రను ఆమె ఈ నెల 11న ప్రారంభించారు.