
యోగి ఆదిత్యనాథ్పై గిరిజన మహిళ కేసు
బిస్వనాథ్(అస్సాం): తనను వివస్త్రను చేసి కొందరు కొడుతున్న చిత్రాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం లోక్సభ ఎంపీ రాం ప్రసాద్ సర్మాలు సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆరోపిస్తూ.. అస్సాంకు చెందిన గిరిజన మహిళ లక్ష్మీ ఒరాంగ్ కోర్టును ఆశ్రయించారు. ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద బిస్వనాథ్లోని సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. నవంబర్ 24, 2007న ఆల్ ఆదివాసీ స్టూడెంట్స్ అసోషియేషన్ ఆఫ్ అస్సాం ఆందోళన సందర్భంగా కొందరు ఆమెను వివస్త్రగా చేసి దాడికి పాల్పడ్డారు. అయితే ఆ ఫొటోను అస్పష్టంగా మార్చకుండానే జూన్ 13న ఆదిత్యనాథ్ తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేశారని ఆమె ఆరోపించారు.
సర్మా కూడా ఆ చిత్రాన్ని పోస్టు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన మేజిస్ట్రేట్ తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేశారు. కోర్టు వెలుపల ఒరాంగ్ మాట్లాడుతూ.. బీజేపీ తరఫున ఆందోళనలో పాల్గొన్నందుకు కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారని సోషల్ మీడియాలో పోస్టులో ఆదిత్యనాథ్ పేర్కొన్న విషయం నిజం కాదని.. తాను ఏ పార్టీ తరఫున ఆందోళనలో పాల్గొనలేదని చెప్పారు.