న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్ను కూడా సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత దీనిపై అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షాల వారు, ఇతర ప్రముఖులు స్పందించారు. కొంతమంది సానూకూలంగా మరికొందరు ప్రతికూలంగా స్పందించారు. ఒకసారి వాటిని పరిశీలిస్తే..
ప్రధాని నరేంద్రమోదీ
ఇది పేదరికాన్ని మరింత తగ్గించే ఉత్తమమైన బడ్జెట్. ఈ బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రికి నా అభినందనలు. మేం రైతులపైన, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిపైన దృష్టిసారించాం. అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఎక్స్లేటర్లాగా పనిచేస్తుంది. అన్ని రంగాలపై ఈ బడ్జెట్ దృష్టి పెట్టింది. జీవన నాణ్యత మరింత పెంపొందుతుంది. 2022నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తాం. రైల్వే సేఫ్టీపై కూడా మేం దృష్టిని సారించాం. అలాగే, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి గతంలో ఎవ్వరూ కేటాయించనన్ని నిధులు కేటాయించాం. ఈ బడ్జెట్ ఉద్యోగాలకు, ఉద్యోగాల కల్పనకు తెరతీస్తుంది.
సీ రంగరాజన్(ఆర్బీఐ మాజీ గవర్నర్)
ఇది ఫెయిర్లీ రొటీన్ బడ్జెట్. రెవెన్యూ విభాగంలో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్య లోటు 3.2శాతం మేరకు కొనసాగించగలగడాన్ని నేను ఆనందంగా భావిస్తున్నాను. ద్రవ్యలోటును 3కు తగ్గించాలని లక్ష్యంగా ఉంది.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
చప్పగా బడ్జెట్ ముగించారని రాహుల్ అంటున్నారు. కానీ, వాస్తవానికి రాహుల్ అసలు బడ్జెట్ ప్రసంగం వినలేదు. ఒక వేళ ఆయనకు ఈ వివరాలు ఎవరు చెప్పారో బహుషా వారు కూడా ఈ బడ్జెట్ వినలేదనుకుంట.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్ చాలా మంచింది. గ్రామాలకు కూడా ఇక అన్ని సౌకర్యాలు వస్తాయి. బ్యాంకింగ్, హౌసింగ్ సెక్టార్లు ఆర్థిక వ్యవస్థను, పన్ను ఆదాయాన్ని మరింత బలోపేతం చేస్తాయి.
కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్
ఈ బడ్జెట్ స్టార్టప్స్కు సహాయం చేస్తుంది. గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నదానికి ఆర్థికశాఖ సరిగ్గా స్పందించింది. ఇది చాలా సానుకూలమైన బడ్జెట్
కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కమల్నాథ్
ఈ బడ్జెట్లో రైతులకు, నిరుద్యోగులకు ఏమీ లేదు. ఇది ప్రజలను గందరగోళ పరిచే చర్య మాత్రమే. రాజకీయ విరాళాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం మాత్రం ఆహ్వానించదగింది. (ఇకపై పొలిటికల్ ఫండింగ్ చేయాలనుకునే వారు రూ.2000పైన అయితే, కచ్చితంగా బాండ్లతో ఇవ్వాలి. ఆ బాండ్లను కూడా చెక్లతోగానీ, కార్డులతోగానీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఎవరు ఎంతిచ్చారో తెలిసిపోతుంది. తాజా బడ్జెట్లో ఈ నిబంధన పెట్టారు)
రణదీప్ ఎస్ సుర్జీవాలా(కాంగ్రెస్ అధికార ప్రతినిధి)
ఈ బడ్జెట్ ఉద్యోగాల సృష్టి శూన్యం, తయారీ రంగానికి శూన్యం, వ్యవసాయంలో అభివృద్ధికి శూన్యం, విద్య, వైద్యంలో శూన్యం, సామాజిక రంగానికి శూన్యం.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
ఇది వివాదాస్పద బడ్జెట్. ఆధారాలు లేనిది, ఉపయోగం లేనిది, మిషన్లెస్, యాక్షన్ లెస్ బడ్జెట్ ఇది. భవిష్యత్కోసం ఈ బడ్జెట్లో రోడ్మ్యాప్ లేదు. బడ్జెట్కున్న క్రెడిట్ మొత్తం పోయింది. పన్ను చెల్లిస్తున్నవారు నగదు ఉపసంహరణకోసం ఇప్పటికీ పరిమితులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అన్ని పరిమితులు ఉపసంహరించండి.
సంబంధిత వార్తలకై చదవండి..
(పార్లమెంట్లో టపాసులు పేలతాయనుకున్నా..)
2017 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు
బడ్జెట్ లో రైల్వే హైలెట్స్...
గృహ రంగానికి గుడ్న్యూస్
పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు!