union-budget-2017
-
తప్పిదాలకు ప్రతిబింబం
రెండో మాట బడా కోటీశ్వరుల నుంచి బ్యాంకులకు చేరవలసిన లక్షల కోట్ల బకాయిలు వసూళ్లు కావు. అయితే ఈ నెపాన్ని పాలకులు బ్యాంకర్ల మీదకి నెడుతున్నారు. బ్యాంకర్లు అవినీతిపరులైన రాజకీయనాయకుల మీదకూ, పాలనా వ్యవస్థ మీదకూ నెడుతున్నారు. దేశంలో దారిద్య్రాన్ని, పేదలను గుర్తించడానికి పంచవర్ష ప్రణాళికలు చాలడం లేదు. అందుకేనేమో, అసలు ప్రణాళికా విధానానికే స్వస్తి చెప్పి, ముక్కూ మొహం లేని నీతి ఆయోగ్ అనే నిర్వీర్యపు వ్యవస్థను ఆవిష్కరించారు బీజేపీ పాలకులు. ‘2017–2018 కేంద్ర బడ్జెట్ అసంఘటిత రంగంలోని కోట్లాదిమంది కార్మికులకు సహాయంగా, వెన్నుదన్నుగా నిలబడడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వం ఆకస్మికంగా పెద్ద నోట్లు రద్దు చేయడంతో వీరు ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడి వాటాలను తెగనమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పైగా విదేశీ పెట్టుబడుల నియంత్రణ బోర్డును రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మరింత విస్మయం కలిగించింది. అన్నింటికీ మించి కార్మిక చట్టాలను సవరించే ప్రతిపాదన కోసం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఇది మరింత అసమంజస చర్య. పైగా ఏ దేశ ప్రజలంతా నోట్ల రద్దు చర్యను సమర్థించారని ప్రభుత్వం చెబుతోందో, ఆ పేదలే ఆ కార్మికవర్గాలే నోట్ల రద్దు భారాన్నీ, బాధలనీ అనుభవించాల్సి వచ్చిందని మరువరాదు.’- విరజేశ్ ఉపాధ్యాయ (ఆరెస్సెస్–బీజేపీ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి, 4–2–2017) వివాదాస్పద ప్రకటనలకు, అధికారంలో ఉన్నా లేకున్నా పెక్కుసార్లు సమాజంలో అశాంతి పరిస్థితులకు కేంద్రంగా ఉండే ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న కార్మిక సంఘం నుంచి వెలువడిన ప్రకటన ఇది. దీనిని ప్రజలు నమ్మవచ్చా? కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంస్థలు కూడా గతంలోనూ ఇప్పుడూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాంటి ప్రకటనలు గుప్పించడం, వాటితో ప్రమేయం లేనట్టు యథా ప్రకారం పార్టీ ఎన్నికల హామీలను చెత్తబుట్టలోకి విసరడమూ ప్రజాబాహుళ్యానికి అనుభవమే. పాలకపక్షాలకు అనుబంధ సంస్థలుగా వర్ధిల్లుతున్న కుహనా ‘కార్మిక, కిసాన్’ సంఘాల లక్ష్యం కూడా రాజకీయ పార్టీల, వాటి నాయకుల ఉనికిని కాపాడేందుకే. అంతేతప్ప, స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన త్యాగాలను గౌరవించడానికి, వలస దోపిడీ అవలక్షణాలను తుడిచిపెట్టగల సామాజిక వ్యవస్థను పాదుకొల్పడానికి మాత్రం కాదు. మన పాలకులు కూడా వలస పాలన అవశేషాలను వీడి ప్రజానుకూలమైన పాలనా వ్యవస్థను ఆశ్రయించడానికి సిద్ధపడలేక ప్రజల ముందు నిలబడలేకపోతున్నారు. తప్పు వెంట తప్పు ఈ పరిణామక్రమంలోనే తమ పాలకపక్షాన్ని రక్షించుకునేందుకు బీజేపీ అనుబంధ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి హోదాలో విరజేశ్ ఉపాధ్యాయ ఇలాంటి ప్రకటన చేయక తప్పలేదు. పెద్ద నోట్ల రద్దు వల్ల పేద ప్రజలకు, కార్మికులకు, మొత్తం ఆర్థిక వ్యవస్థకు వాటిల్లిన అపకారాన్ని గుర్తు చేయక తప్పలేదు కూడా. కాబట్టి నోట్ల రద్దును ప్రజలంతా స్వాగతించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం అంటే, ఒక తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి పది తప్పులు చేయడమే. నోట్ల రద్దును విదేశీయులు కూడా మెచ్చుకుంటున్నారని చెప్పి, మోదీ తప్పు మీద తప్పు చేశారు. ఈ చర్య తరువాత బ్యాంకులు, ఏటీఎంల దగ్గర బారులు తీరిన జనాల ఇక్కట్లను, సంభవించిన దుర్మరణాలను ఇంకా ఎవరూ మరచిపోలేదు. అయితే ఇలాంటి వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పే సంస్కారాన్ని కూడా ప్రభుత్వం ప్రదర్శించలేకపోయింది. అంతేకాదు, నోట్ల రద్దు కర్మకాండ తరువాత ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో కూడా అధికారంలోకి వచ్చే ఉద్దేశంతో ఎన్నికలలో ఇచ్చిన హామీలను బీజేపీ పక్కన పెట్టింది. మోదీ, ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ పాలనను తూర్పార పడుతూ చేసిన ప్రకటనలు కూడా రూటు మార్చుకున్నాయి. ఆధార్ ప్రక్రియను పౌర సేవలకు వినియోగించడానికి వీలులేదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా బీజేపీ ప్రభుత్వం గౌరవించలేదు. పైగా ఆ ప్రక్రియను మరింత విస్తృతం చేసింది. ఇలాంటి అవకతవక నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి. బడ్జెట్ కూడా ఇందుకు ఒక ఉదాహరణ. బడ్జెట్ను ప్రవేశపెట్టే పనిని నెలరోజులు ముందుకు తెచ్చింది. ఫిబ్రవరి–మార్చిలోగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరగనున్నందున బడ్జెట్ ప్రతిపాదనల ప్రభావాన్ని తమకు సానుకూలంగా మలుచుకునేందుకే, ఓటర్లను ప్రభావితం చేసేందుకే బీజేపీ ఈ చర్యకు ఉపక్రమించింది. ఎప్పుడూ ప్రత్యేకంగా ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్ను కూడా సాధారణ బడ్జెట్లో విలీనం చేయడం కూడా ఇందుకే. బడ్జెట్ ప్రతిపాదనలకు అవసరమైన ఆదాయ వనరుల లోటు, ద్రవ్య వనరుల లోటు ముమ్మరిస్తున్నందునే ఈ సాకు వెనుక దాగవలసి వచ్చింది. ప్రత్యక్ష పన్నుల మీద రాయితీ ప్రకటించి, ప్రజా బాహుళ్యం మీద విధించే పరోక్ష పన్నులు పెంచే పద్ధతిని ఆలోచించారు. ఇందుకు ఫెడరల్ వ్యవస్థ స్వభావాన్ని మార్చి, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా రాష్ట్రాల అధికారాలను కుంచింప చేశారు. పన్నులు పెంచడానికి కూడా వెసులుబాటు కల్పించుకున్నారు. ఉన్నంతలో తక్కువ సాలుసరి ఆదాయం పొందేవారికి రూ. 5 లక్షల లోపు ఆదాయం మీద ప్రస్తుతం విధిస్తున్న 10 శాతం పన్నును ఐదు శాతానికి తగ్గించడమొక్కటే బీజేపీ సర్కారు చేసిన మేలు. త్రిశంకు స్వర్గంలో ఉన్న టెక్ నిపుణులు ఇక కార్పొరేట్లు, బడా కంపెనీలు గంప గుత్తగా సాధించే లాభాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కూ, మన పాలకులకూ పెద్ద తేడాలేదు. భారత ఐటీ కంపెనీల ఉనికి పూర్తిగా అమెరికా పాలకుల దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉన్నందున ప్రస్తుత వాతావరణంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారో, అవి ఎలాంటి ఏర్పాట్లో తెలియని అయోమయ స్థితిలో మన టెక్ నిపుణులు తేలియాడుతున్నారు. వీటి మీద ఇప్పటిదాకా ఆశలు పెట్టుకుని ఉన్న మన నిపుణులు అక్షరాలా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. కానీ ఈ అంశం మీద పాలకులకు విధాన నిర్ణయమేదీ లేదన్నది వాస్తవం. మోదీ ఒక పక్క నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజామోదం ఉందన్నారు. మరోసారి ఈ నిర్ణయం తరువాత తనను చంపినా చంపవచ్చునంటూ మాట్లాడారు. దేశంలో అవినీతినీ, నల్లధనాన్నీ రూపుమాపేందుకు సంకల్పించిన తనను చంపే అవకాశం ఉందని ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ప్రకటించిన మోదీ, నోట్ల రద్దు ద్వారా అవినీతి, నల్లధనం ఏ మేరకు అదుపులోనికి వచ్చాయో మాత్రం వెల్లడించలేదు. రిజర్వు బ్యాంకు కూడా అంతే. స్విస్ బ్యాంకులలోను, పనామా పత్రాల వెల్లడితోనూ బయటపడిన రూ. 24 లక్షల కోట్ల గుప్తధనాన్ని ఇంతవరకు ఎందుకు వెనక్కి రప్పించలేకపోయారో కూడా ప్రభుత్వం చెప్పలేదు. నిరుపేద కుటుంబాల కోసమని మోదీ ఆదిలో తెరిపించిన జన్ధన్ ఖాతాల ప్రస్తుత పరిస్థితి ఏమిటో కూడా తెలియదు. ఇంతకీ ఎన్నికల కోసమని ప్రకటించిన నల్లధనం మీద దండోరా ఫలితం– దొంగచాటుగా బ్యాంకు ఖాతాలలో జమపడిన డబ్బు, జన్ధన్ ఖాతాలలోకే చేరినందున అదంతా పేదలదేనని నాయకులు ఉచిత ప్రకటనలు చేయడమే. అయితే ఈ ఉచిత ప్రకటనలు కూడా మోసమే. బ్యాంకులకు చేరినవన్నీ రద్దయిన నోట్లనీ, అవి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని నాయకులే చెప్పిన మాటలు వాస్తవాలని ప్రజలకు క్రమంగా గాని తెలిసిరాదు. ఈలోగా, ప్రాణం నిలుపుకోవడానికి అవసరమైన కనీస ఆదాయాన్ని ప్రతి పౌరుడికీ కల్పించడం అవసరమని బీజేపీ పాలకులు తమ ఆదర్శంగా ప్రకటన అయితే చేశారు. ఇంకేముంది? ఫ్రెంచ్ వాడు ప్రతిపాదించిన ఈ ప్రచార చొరవను పేదసాదలకు, రైతులకు, వృత్తి పనివారికి ఉద్దేశించిన సబ్సిడీలను ప్రపంచ బ్యాంక్ సంస్కరణల పుణ్యమా అని రద్దు చేసేందుకు వర్ధమాన దేశాల పాలకులు అవకాశంగా మలుచుకున్నారు. కనుకనే కాంగ్రెస్ పాలకులతో ప్రారంభమైన పబ్లిక్ రంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలు, సబ్సిడీల కోత వయా వాజ్పేయి హయాం మీదుగా మోదీ దాకా కొనసాగుతున్నాయి. యూబీఐ పగటి కల సార్వత్రిక ప్రాథమిక ఆదాయం (యూబీఐ) ఒక కొత్త కల. వర్ధమాన దేశాలు ఎదిగేవరకు వర్తింప చేయవలసిన సబ్సిడీలను క్రమంగా తొలగించడానికి ఉద్దేశించినదే ఈ పగటి కల. మోదీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం దృష్టిలో యూబీఐ ‘విప్లవాత్మక ఆలోచన’ కావడం కూడా ఇందుకే. దారిద్య్ర నిర్మూలను అవసరమైన సబ్సిడీకి యూబీఐ సరైన ప్రత్యామ్నాయం కూడా అయిపోయింది. కానీ ఆర్థిక నిపుణుల దృష్టిలో ఈ యూబీఐ ప్రకారం పేదలలో ప్రతి వ్యక్తికి ఏడాదికి బేసిక్ ఆదాయ వనరుగా రూ. 14,000 సమకూర్చే హామీ ఇవ్వాలంటే (లేదా నెలకు రూ. 1,200 ఏర్పాటు కావాలంటే) జనాభాలో నాలుగో వంతు పేదలకు మాత్రమే ఆ మేరకు అవకాశం వస్తుంది. ఈ లెక్కన సార్వత్రిక ప్రాథమిక ఆదాయ వనరు పేద జనాభాకు అందించాలంటే ఏడాదికి మొత్తం రూ. 6,93,000 వేలు అవసరమవుతుంది. అంటే 2017–18 సంవత్సరపు వ్యయం కాగల బడ్జెట్లో ఈ మొత్తం 35 శాతంగా ఉండాలి. అయితే బడ్జెట్లో ఎక్కువ వాటా బడా కార్పొరేట్లను సాకడానికి వ్యయ మవుతున్నందున పేదలకు బడ్జెట్ ద్వారా అందేది నామమాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. మభ్యపరిచే రాజకీయాలు మనకు వద్దు. బడా కోటీశ్వరుల నుంచి బ్యాంకులకు చేరవలసిన లక్షల కోట్ల బకాయిలు వసూళ్లు కావు. అయితే ఈ నెపాన్ని పాలకులు బ్యాంకర్ల మీదకి నెడుతున్నారు. బ్యాంకర్లు అవినీతిపరులైన రాజకీయనాయకుల మీదకూ, పాలనా వ్యవస్థ మీదకూ నెడుతున్నారు. దేశంలో దారిద్య్రాన్ని, పేదలను గుర్తించడానికి పంచవర్ష ప్రణాళికలు చాలడం లేదు. అందుకేనేమో, అసలు ప్రణాళికా విధానానికే స్వస్తి చెప్పి, ముక్కూ మొహం లేని నీతి ఆయోగ్ అనే నిర్వీర్యపు వ్యవస్థను ఆవిష్కరించారు బీజేపీ పాలకులు. చివరకు ప్రణాళికా వ్యవస్థ ద్వారా కార్మికులు, వ్యవసాయ కార్మికులకు ఉద్దేశించిన చట్టాలను కూడా చాప చుట్టేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా – దేశంలోనే ఉత్పత్తి జరగాలన్న నినాదం, శ్రమయేవ జయతే నినాదంతో పాటు శ్రమ సువిధ పేరిట వెబ్ను పెట్టారే గాని, ఆచరణ మాత్రం పక్కదారి పట్టింది. పరిశ్రమలలో తనిఖీ పద్ధతి ఎత్తివేసి యాజమాన్యాలే ఆన్లైన్ లావాదేవీల ద్వారా తమకు తామే స్వయంగా కితాబులు ఇచ్చుకునే అవకాశాన్ని కూడా మోదీ పాలన కల్పించింది. స్వయం ఉపాధి అంటే ఇదేనేమో! అందుకే పేదరికం బాధను అనుభవించి పలవరించిన యువకవి అలిసెట్టి అన్నాడు, ‘‘అన్నం మెతుకునీ/ ఆగర్భ శ్రీమంతుణ్ణి / వేరు చేస్తే శ్రమ విలువేదో తెలిసిపోదూ!’ అని. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రెండో ఇంటికి రూ.2 లక్షలే
‘పన్ను’ మినహాయింపుపై కేంద్రం న్యూఢిల్లీ: రుణంపై రెండో ఇల్లు కొని, దానికి కడుతున్న వడ్డీ, వస్తున్న అద్దెల మధ్య వ్యత్యాసం (నష్టం)పై పొందుతున్న ఆదాయపు పన్ను మినహాయింపును రూ.2 లక్షలకు పరిమితం చేస్తూ తెచ్చిన నిబంధనను వెనక్కు తీసుకునే ఉద్దేశం తమకు లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొందరు రుణంపై రెండో ఇల్లు కొన్నాక దానిని అద్దెకు ఇస్తుంటారు. బ్యాంకులకు కడుతున్న వడ్డీ కన్నా వస్తున్న అద్దె తక్కుగా ఉన్నట్లు చూపించి వాటి వ్యత్యాసాన్ని నష్టంగా పేర్కొంటారు. ఇలా ఎంత మొత్తం నష్టం వచ్చిందో అంత మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు లభించేది. ఇక నుంచి నష్టంగా పేర్కొన్న మొత్తంలో గరిష్టంగా రూ.2 లక్షలకు మాత్రమే పన్ను మినహాయింపు ఇస్తారు. -
మీరు కట్టాల్సిన పన్ను ఎంత?
ఈ సారి బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి పెద్ద మార్పులేవీ చేయకపోయినా... దిగువ మధ్య తరగతి వారికి కొంత ఊరటనివ్వటం.... ఏడాదికి రూ.50 లక్షల పైబడి సంపాదించేవారిపై కొంత సర్చార్జీ వేయటం వంటివి జరిగాయి. ఈ మార్పుల వలన ఎవరికెంత పన్ను భారం పడుతుంది? ఎవరికి ఎంత లాభం చేకూరుతుంది? పన్నును తగ్గించుకోవటానికి ఉన్న మినహాయింపులేంటి? ఆ మినహాయింపుల కోసం ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఇలాంటి వివరాలన్నీ తెలియజేసేదే ఈ ప్రత్యేక కథనం... సెక్షన్ 80సీ.. ఇంకా మరిన్ని ఆదాయపు పన్ను మినహాయింపులన్నిటిలోకీ అన్నివర్గాలకూ ఎక్కువ మినహాయిం పునిస్తున్నది సెక్షన్ 80సీ మాత్రమేనని చెప్పాలి. ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా రూ.1.50 లక్షలను మినహాయించుకునే అవకాశముంది. ఈ సెక్షన్ పరిధిలోకి వచ్చే మినహాయింపులేంటంటే... ప్రావిడెంట్ ఫండ్కు చెల్లించిన మొత్తం ∙మీరు తీసుకున్న గృహ రుణంపై అసలు (ప్రిన్సిపల్) కింద చెల్లించిన మొత్తం ∙పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో (పీపీఎఫ్) చేసే ఇన్వెస్ట్మెంట్. ఇది ఏడాదికి రూ.500 నుంచి 1.5 లక్షల వరకూ చేయొచ్చు. ∙మీ పిల్లల స్కూలు ఫీజు. దీన్లో ట్యూషన్ ఫీజుగా పేర్కొనే మొత్తాన్నే మినహాయిస్తారు. అదీ ఇద్దరు పిల్లల వరకే. ∙మీ పేరిట, భార్య, పిల్లల పేరిట చెల్లించే బీమా ప్రీమియం లు. ∙మీ పేరిట, భార్య, పిల్లల పేరిట చెల్లించే యూలిప్ ప్రీమియంలు. ∙పోస్టాఫీసుల్లో ఎన్ఎస్సీ సర్టిఫికెట్ల కొనుగోలుకు వెచ్చించే మొత్తం. ∙బ్యాంకుల్లో గానీ, పో స్టాఫీసుల్లో గానీ ఐదేళ్ల కాలానికి చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు ∙గమనించాల్సిందేంటంటే ఈ మొత్తం అంశాల్లో దేన్లో ఎంత ఇన్వెస్ట్ చేసినా గరిష్ఠంగా ఒక ఏడాదికి రూ.1.50 లక్షలు మాత్రమే పన్ను మినహాయింపునకు క్లెయిమ్ చేసుకునే అవకాశముంది. పన్ను మినహాయింపునిచ్చే ఇతర పొదుపు పథకాలు న్యూ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్): ఈ పథకం కింద ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని గతంలో సెక్షన్ 80సీలో భాగంగానే చూసేవారు. కానీ గడిచిన ఏడాది నుంచీ ఈ పథకం కింద ఇన్వెస్ట్ చేసే మొత్తంలో రూ.50,000 వరకూ సెక్షన్ 80సీకి అదనంగా చూపించుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం చట్టంలో 80 సీసీడీ పేరిట కొత్త సబ్సెక్షన్ తెచ్చారు. గృహ రుణంపై వడ్డీ: మీరు గృహ రుణం తీసుకుని... అదే ఇంట్లో గనుక ఉంటే, మీరు చెల్లించే వడ్డీలో గరిష్ఠంగా ఏడాదికి రూ.2 లక్షల వరకూ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. విద్యా రుణంపై చెల్లిస్తున్న వడ్డీ: దీనికి పరిమితేమీ లేదు. ఎంత వడ్డీ చెల్లిస్తే అంతా క్లెయిమ్ చేసుకోవచ్చు. వైద్య బీమా ప్రీమియం: మీతో పాటు మీ భార్య, పిల్లల వైద్య బీమాకు చెల్లించే ప్రీమియంలో రూ.25,000 వరకూ మినహాయింపు క్లెయిమ్ చేయొచ్చు. మీరు గనుక 60 ఏళ్లు దాటినవారైతే ఈ మినహాయింపు 30,000 దాకా ఉంటుంది. మీ తల్లిదండ్రులకు గనుక బీమా చేయిస్తే అదనంగా మరో రూ.25,000 క్లెయిమ్ చేసుకునే అవకాశముంది. విరాళాలు: నోటిఫైడ్ సంస్థలు, రాజకీయ పార్టీలకిచ్చే విరాళాల్లో ఆయా సంస్థల్ని బట్టి పూర్తిగా గానీ, 50 శాతం మొత్తాన్ని గానీ మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకునే అవకాశముంది. తాజా బడ్జెట్ ప్రకారం ఇలాంటి విరాళాలు చెక్కు, లేదా డిజిటల్ రూపంలో చెల్లించాలి. రూ.2,000 వరకూ మాత్రమే నగదు రూపంలో చెల్లించవచ్చు. వ్యాధుల ఖర్చు: ఎయిడ్స్, కొన్ని రకాల కేన్సర్ల వంటి వ్యాధుల చిక్సిత కోసం అసెసీ సొంతంగా కానీ, తనపై ఆధారపడ్డ వారికిగానీ పెట్టే ఖర్చులో రూ.40,000 వరకూ క్లెయిమ్ చేయొచ్చు. ఈ మినహాయింపు పరిమితి రోగి వయసు 60 ఏళ్లు దాటితే రూ.60,000గా, 80 ఏళ్లు దా టితే రూ.80,000గా ఉంది. వైకల్యం ఖర్చు: అసెసీ లేదా తనపై ఆధారపడ్డవారు అంగవైకల్యం బారిన పడితే వారి వైద్య ఖర్చులు, శిక్షణ కోసం చెల్లించే మొత్తంలో రూ.75,000 వరకూ మినహాయింపు లభిస్తుంది. తీవ్ర అంగవైకల్యమైతే ఇది రూ.1.25 లక్షల వరకూ ఉంది. ఇవండీ మినహాయింపులు: ఇవి కాక మీకు వచ్చే హెచ్ఆర్ఏ గానీ, మీరు చెల్లించే ఇంటద్దె గానీ, ఆఫీసు మీకు చెల్లించే కొన్ని రకాల అలవెన్సులుగానీ... ఇవన్నీ మినహాయింపుల పరిధిలోవే. మీ మొత్తం జీతంలో వీటన్నిటినీ మినహాయించాక మిగిలేదే ట్యాక్సబుల్ ఇన్కమ్. అందులో బేసిక్ లిమిట్ను తీసేసి... మిగిలిన మొత్తంపై ఆయా శ్లాబుల్ని అనుసరించి పన్ను విధిస్తారు. ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటే ? మీకు జీతం రూపంలో వచ్చేది మీ ఆదాయం మాత్రమే. అదంతా పన్ను చెల్లించాల్సిన ఆదాయం (ట్యాక్సబుల్ ఇన్కమ్) మాత్రం కాదు. ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టంలో వివిధ సెక్షన్ల కింద వివిధ రకాల మినహాయింపులున్నాయి. మనం చేసే పొదుపు నుంచి, మనం కట్టే ఇంటద్దె వరకూ చాలా ఖర్చుల్ని మినహాయించుకునే వీలుంది. ఇవన్నీ మినహాయించాక నికరంగా మిగిలేదే ట్యాక్సబుల్ ఇన్కమ్. 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఇది గనక రూ.3 లక్షల లోపు ఉంటే రిబేట్ సాయంతో రూపాయి కూడా పన్ను కట్టాల్సిన పని ఉండదు. దాటితే రూ.5 లక్షల వరకు 5 శాతం, 5–10 లక్షల మధ్య ఉండే మొత్తానికి 20 శాతం, 10–50 లక్షల మధ్య ఉండే మొత్తానికి 30 శాతం పన్ను చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 50 లక్షలు దాటినవారికి ఈ బడ్జెట్లో కొత్తగా 10 శాతం సర్చార్జి విధించారు. రూ.కోటి ఆదాయం దాటినవారికి గతేడాది బడ్జెట్లోనే 15 శాతం సర్చార్జి వడ్డించారు. -
కాంగ్రెస్కు అవినీతిపై మాట్లాడే హక్కు లేదు
బీజేఎల్పీ నేత కిషన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక సంస్కరణలు అమ లుచేసే దిశలో కేంద్ర బడ్జెట్ ఉందని బీజే ఎల్పీ నేత జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనరంజకమైన ఈ బడ్జెట్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై కేంద్రం సాహసోపేత నిర్ణయం తీసుకుందన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం అవినీతి నిర్మూలన కోసం చేపడుతున్న చర్యలకు కాంగ్రెస్ నాయకులు సహకరించాలని లేదా ఏమీ మాట్లాడకుండా ఉండాలన్నారు. -
'ప్రత్యేక హోదా, రైల్వే జోన్ల ప్రస్తావన లేదు'
విజయవాడ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్కు దిశానిర్దేశం లేదని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఇది బడ్జెట్లా గాక బిజినెస్ మోడల్లా ఉందని విమర్శించారు. గురువారం విజయవాడలో పార్థసారథి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అరుణ్ జైట్లీ తీవ్ర నిరాశ కలిగించారని అన్నారు. బడ్జెట్ బాగుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరమని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖపట్నం రైల్వే జోన్ల ప్రస్తావన లేదని, అమరావతికి రైల్వే కనెక్షన్ ఏదని నిలదీశారు. ఏపీ ప్రజలకు న్యాయం జరగకపోయినా చంద్రబాబు, టీడీపీ నేతలు స్వీట్లు పంచుకున్నారని విమర్శించారు. యువత జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని, ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రజలకు భ్రమలు కల్పించడం మానుకోవాలని పార్థసారథి హితవు పలికారు. -
'ప్రత్యేక హోదా, రైల్వే జోన్ల ప్రస్తావన లేదు'
-
వచ్చే ఎన్నికల్లో మోదీ చెల్లని నోటే: సీపీఐ నారాయణ
పెద్దనోట్ల రద్దు, బడ్జెట్ తదితర అంశాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2019 ఎన్నికల నాటికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెల్లని నోటుగానే మిగిలిపోతారని విమర్శించారు. మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య లాంటి ఇద్దరు గొర్రెలు దొరికారని, నోట్లరద్దుపై 50 రోజులు ఓపిక పడితే ప్రజల జీవితాన్ని మార్చేస్తానంటే నమ్మారని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం నల్లడబ్బు ఉన్నవారంతా తెల్లదొరలుగా మారారని ఎద్దేవా చేశారు. జంతర్ మంతర్ జైట్లీ బడ్జెట్ ఫెయిల్ అయిందని, ట్రంప్ ఏ చర్యలు తీసుకున్నా తామున్నామనే హామీని జైట్లీ తన బడ్జెట్లో ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఆయన కేవలం హరికథా కాలక్షేపంతో బతికేస్తున్నారని మండిపడ్డారు. ఎన్డీయే రాజకీయంగా ఫెయిల్ కావడం వల్లే మతసామరస్యాలను రెచ్చగొడుతోందని, ఆ పార్టీకి తమిళులు జల్లికట్టు ఉద్యమంతో బుద్ధి చెప్పారని అన్నారు. యూపీలో ప్రస్తుతం బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని, ఆ పార్టీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. అమరావతి రైతులకి క్యాపిటల్ గెయిన్స్ రద్దు చేసినట్లే, పోలవరం రైతులకు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చేతనైతే పోరాడాలి, లేకుంటే ఊరుకోవాలని అన్నారు. ప్రజల్ని మోసం చేయడంలో వెంకయ్య, చంద్రబాబులను మించినవారు దేశంలో లేరని విమర్శించారు. ముందుగా బీజేపి నాయకుల ఆస్తులు, అకౌంట్లు ప్రకటించాలని, ఆ తర్వాత పార్టీల విరాళాల గురించి మాట్లాడాలని సూచించారు. -
ఏపీకి రిక్తహస్తం
-
‘పన్ను’లూడేది ఉద్యోగులకేనా?
-
బడ్జెట్లో కానరాని తెలంగాణ
-
రైతులకు ఆర్థిక మంత్రి జైట్లీ వరాలు
-
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం
-
హోం శాఖకు రూ.83 వేల కోట్లు
గత ఏడాది కన్నా 11 శాతం ఎక్కువ సీఆర్పీఎఫ్కు అత్యధికంగా రూ.17,868 కోట్లు న్యూఢిల్లీ: ఈసారి బడ్జెట్లో కేంద్ర హోంశాఖకు భారీగా కేటాయింపులు చేశారు. పోలీసు బలగాలను ఆధునీకరించడంపై దృష్టిపెట్టి ఈసారి రూ.83 వేల కోట్లు కేటాయించారు. 2016–17లో ఇచ్చిన దానికంటే ఇది ఈసారి 11.24 శాతం ఎక్కువ. గత ఏడాది రూ.75,355.48 కోట్లు ఇవ్వగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.83,823.30 కోట్లు కేటాయించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కు రూ.1,577.07 కోట్లు కేటాయింపులు చేశారు. తాజా బడ్జెట్లో హోంశాఖ అధీనంలోని ఏడు పారామిలిటరీ దళాలకు 54,985.11 కోట్లు ప్రతిపాదించారు. ఇది గత బడ్జెట్లో రూ.52,443 కోట్లుగా ఉంది. అంతర్గత భద్రతకు, మావోయిస్టులు, మిలిటెంట్ల ఆపరేషన్లు నిర్వహించే సీఆర్పీఎఫ్కు అత్యధికంగా రూ.17,868.53 కోట్లు దక్కింది. భారత్–పాక్, భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులోని బీఎస్ఎఫ్కు రూ.15,569.11 కోట్లు ఇచ్చారు. సీఐఎస్ఎఫ్కు రూ.6,686.25 కోట్లు కేటాయించారు. ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ)కి రూ.4,824.31 కోట్లు, అస్సాం రైఫిల్స్కు రూ.4,801.84 కోట్లు కేటాయించారు. సశస్త్రసీమా బల్ (ఎస్ఎస్బీ)కు రూ.4,320.67 కోట్లు, ఉగ్రవాద నిరోధక చర్యల్లో పాలుపంచుకునే జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ)కి రూ.816.10 కోట్లు కేటాయించారు. కేంద్ర హోంశాఖ అధీనంలో పనిచేసే ఢిల్లీ పోలీస్కు బడ్జెట్లో రూ.5,910.28 కోట్లు ఇచ్చారు. పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ముళ్లకంచె ఏర్పాటుకు, రోడ్ల నిర్మాణానికి, నిఘా పరికరాల ఏర్పాటుకు బడ్జెట్లో రూ.2,355.68 కోట్లు ఇచ్చారు. సీఏపీఎఫ్, కేంద్ర పోలీసు సంస్థల భవనాల ప్రాజెక్టులకు గత ఏడాది కంటే 33 శాతం అధికంగా రూ.4,008,06 కోట్లు, ఎస్పీజీకి రూ.389.25 కోట్లు, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్కు రూ.45.57 కోట్లు, ఐవీఆర్ఎఫ్టీకు రూ.66 కోట్లు, హోం శాఖలో పరిశోధనల ప్రోత్సాహకాలకు రూ.2,983 కోట్లు, మహిళల భద్రతకు ఉద్దేశించిన నిర్భయ నిధికి రూ.50 కోట్లు కేటాయించారు. -
‘రక్షణ’కు 2.74 లక్షల కోట్లు
మొత్తం బడ్జెట్లో ఇది 12.77% 2016–17తో పోల్చుకుంటే 6.2% పెరుగుదల పింఛన్లకు అదనంగా రూ.85,737 కోట్లు ఆధునికీకరణ కార్యక్రమాలకు పెద్దపీట న్యూఢిల్లీ: రక్షణ రంగానికి 2017–18 బడ్జెట్లో రూ.2.74 లక్షల కోట్లు కేటాయిం చారు. మొత్తం బడ్జెట్లో ఇది 12.77%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చు కుంటే ఇది 6.2% ఎక్కువ. త్రివిధ దళాలు.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆధునీకరణ ప్రక్రియలో ముందుకుసాగు తున్న సమయంలో అందుకనుగుణంగానే వాటికి మూలధన కేటాయింపులో 10.05 పెరుగుదల చోటు చేసుకుంది. కొత్త పరికరాలు, ఆయుధాలు, ఎయిర్ క్రాప్ట్లు, యుద్ధనౌకలు తదితర సైనిక వాహనాల కొనుగోలు వంటి ఆధునీ కరణ కార్యక్రమాల నిమిత్తం మూడు దళాలకు కలిపి రూ.86,488 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ మొత్తం రూ.78,586 కోట్లుగా ఉంది. ప్రస్తుత సంవత్సరానికి సవరించిన మూలధన కేటాయింపు రూ.71,700 కోట్లని బడ్జెట్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే మిగతా రూ.6,886 కోట్ల బడ్జెట్ను రక్షణ మంత్రిత్వ శాఖ ఖర్చు పెట్టలేకపోయిందా? లేక పొదుపు ఏమైనా చేశారా? అనేది తెలియడం లేదు. ఇలావుండగా రక్షణ రంగ పింఛన్ల నిమిత్తం రూ.85,737 కోట్ల బడ్జెట్ కేటాయించారు. సవరించిన అంచనాల తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పింఛన్ల బడ్జెట్ రూ.85,624 కోట్లకు చేరింది. మూలధన కేటాయింపు రూ.86,488 కోట్లతో కలిపి రక్షణ రంగానికి రూ.2,74,114 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు జైట్లీ బుధవారం లోక్ సభకు తెలిపారు. ఇందులో పింఛన్ల మొత్తం లేదన్నారు. రక్షణ సిబ్బంది సులభమైన ప్రయా ణానికి వీలుగా కేంద్రీకృత రక్షణ యాన విధా నాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ విధానంలో సైనికులు, అధికారులు తమ ప్రయాణ టిక్కె ట్లను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చని జైట్లీ తెలిపారు. రక్షణ రంగానికి చెందిన పింఛనుదారుల కోసం సమగ్ర వెబ్ ఆధారిత పింఛను పంపిణీ (ఇంటరాక్టివ్) విధానాన్ని నెలకొల్పనున్నట్లు కూడా జైట్లీ వెల్లడించారు. రక్షణ బడ్జెట్పై మిశ్రమ స్పందన వ్యక్తమయ్యింది. బడ్జెట్ను స్వాగతించిన రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే.. మూలధన కేటాయింపులో 9.3% పెరుగుదల చోటు చేసుకుం దంటూ ట్వీట్ చేశారు. మూలధన కేటాయింపు పెంపును రక్షణ పరిశ్రమ కూడా స్వాగ తించింది. స్వదేశీకరణపై ప్రభుత్వ చిత్తశుద్ధిని ఇది ప్రతిబింబిస్తోందని శామ్టెల్ ఏవి యోనిక్స్ ఎమ్డీ పునీత్ కౌరా అన్నారు. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియాకు ఇది ఊతం ఇస్తుందన్నారు. ఆధునీకరణ అవసరాలకు ఈ పెంపు సరిపోదని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్) వైస్ ప్రెసిడెంట్ అంకుర్ గుప్తా పేర్కొన్నారు. -
సబ్సిడీల్లో 3% పెంపు
పెరిగిన ఆహారం.. తగ్గిన పెట్రోలియం ∙ఎరువుల సబ్సిడీలో మార్పులేదు న్యూఢిల్లీ: 2017–18 ఆర్థిక సంవత్సరానికి సబ్సిడీ అంచనా రూ. 2,40,338 కోట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ పేర్కొన్నారు. గతేడాది బడ్జెట్తో పోలిస్తే 3% పెరుగుదల కనిపించింది. ఇందులో ఆహార సబ్సిడీ రూ.1,45,338 కోట్లు. నవంబర్ 2016 నుంచి దేశవ్యాప్తంగా జాతీయ ఆహార భద్రత చట్టం అమలవుతుండటంతో (80 కోట్ల మందికి పైగా ఆహార సబ్సిడీ అందుతోంది) ఈ అంచనా పెరగొచ్చు. కాగా, ఎరువుల సబ్సిడీలో ఏ మార్పూ లేదు. గత బడ్జెట్ మాదిరిగానే ఈసారీ రూ.70 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వనుంది. ఇందులో రూ.49,768 కోట్లు యూరియాకు, రూ.20,232 కోట్లు ఫాస్పారిక్, పొటాసిక్ ఎరువులకు ఇవ్వనున్నారు. అయితే పెట్రోలియం సబ్సిడీని తగ్గించారు. గతేడాది రూ. 27,531.71 కోట్ల సబ్సిడీ ఉండగా.. ఈ ఏడాది దీన్ని రూ. 25వేల కోట్లకు తగ్గించారు. ఇందులో ఎల్పీజీకి రూ.16,076.13 కోట్లు, మిగిలింది కిరోసిన్కు వర్తిస్తుంది. చక్కెరపై సబ్సిడీని ఎత్తివేసిన కేంద్రం చక్కెరపై సబ్సిడీలకు కేంద్రం చెల్లుచీటి రాసింది. కిలోపై ఇప్పటిదాకా రాష్ట్రాలకు ఇస్తున్న రూ. 18.50 సబ్సిడీ వచ్చే ఆర్థిక సంవత్పరం నుంచి ఉండదు. జైట్లీ బుధవారం బడ్జెట్లో చక్కెర సబ్సిడీల బకాయిల చెల్లింపు నిమిత్తం రూ. 200 కోట్లే ఇచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేటాయింపులేమీ చేయలేదు. దేశవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా ఏటా 27 లక్షల టన్నుల చక్కెరను 40 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు సరఫరా చేస్తున్నారు. రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే చక్కెరను ఓపెన్ మార్కెట్లో రాష్ట్రాలు సేకరిస్తున్నాయి. ఇలా సేకరించే చక్కెరపై కేంద్రం కిలోకు రూ.18.50 సబ్సిడీ ఇస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తెల్ల కార్డులపై ఒక్కో కుటుంబానికి అరకేజి చక్కెరను సబ్సిడీపై అందిస్తున్నారు. ఈసారి కేటాయింపులు లేవు కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రాలే ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది. అధికారుల శిక్షణకు 180 కోట్లు న్యూఢిల్లీ: తాజా బడ్జెట్ కేటాయింపుల్లో సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ. 180 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని అధికారులకు శిక్షణనిచ్చేందుకు వినియోగి స్తారు. ఇందులో రూ.60.61 కోట్లు ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్కు, ముస్సోరీలోని లాల్బహదూర్ నేషనల్ అకా డమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ)లలో నిర్మాణ ఖర్చులకు వినియో గించనున్నారు. మిగిలిన రూ.119.37 కోట్లు ఎల్బీఎస్ఎన్ఏఏలో అధికారుల శిక్షణ తదితరాలకు కేటాయించారు. గతేడాది ఇందుకోసం 179.17 కోట్లను కేటాయించారు. కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ), పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ)లకోసం రూ.25.42 కోట్లు కేటాయిం చారు. గతేడాది ఈ కేటాయింపులు రూ. 28 కోట్లు. దీనికి తోడు సీఐసీకి నూతన భవన నిర్మాణానికి రూ.25.47 కోట్లు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)కు రూ.105.81 కోట్లు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ)కు రూ. 197.32 కోట్ల కేటాయింపులు జరిగాయి. -
శాస్త్ర, సాంకేతికానికి.. నామమాత్రమే!
ఈ రంగాలకు కేటాయింపులు రూ.37,435 కోట్లు న్యూఢిల్లీ: శాస్త్రసాంకేతిక రంగాల మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.37,435 కోట్లను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేటాయించారు. ఇందులో అంతరిక్ష పరిశోధన విభాగాని(డీఓఎస్)కి అదనంగా రూ.1,000 కోట్ల కేటాయింపులు జరిపినట్టు జైట్లీ తెలిపారు. గతేడాది డీఓఎస్– అణు శక్తి (డీఏఈ), శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖలు రెండింటికీ కలిపి కేటాయించిన మొత్తం రూ.32,030.72 కోట్లు. ► డీఓఎస్కు ప్రకటించిన రూ.9,093 కోట్లలో 4,155 కోట్లు మూలధన వ్యయం కింద కేటాయింపులు జరిగాయి. ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్ –2 వంటి ప్రాజెక్టుల కోసం ఈ నిధులను ఖర్చు చేస్తారు. గతేడాది (2016–17) బడ్జెట్లో డీఓఎస్కు రూ.8,045 కోట్లు, 2015–16లో రూ.6,920 కోట్లు ఇచ్చారు. ► అదేవిధంగా డీఏఈకి రూ.124.61 కోట్లు కేటాయించారు. ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్బీఆర్)తో పాటు రాజస్తాన్ అణు విద్యుత్ ప్రాజెక్టు (ఆర్ఏపీఎస్ 7, 8), కుడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టు (3, 4 యూనిట్లు) తదితర ప్రాజెక్టుల కోసం ఈ నిధులు వినియోగిస్తారు. ► అలాగే డీఏఈ పరిధిలోని బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్), ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం (ఐజీసీఏఆర్), రాజారమణ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్లకు రూ.3,062 కోట్లు (గతేడాదితో పోలిస్తే రూ.814.42 కోట్లు అదనం) కేటాయించారు. ► శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ది కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు రూ.4,446 కోట్లు (గతేడాది రూ.4,062 కోట్లు) ఇచ్చారు. ► సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ విభాగాలకు వరుసగా రూ.4,817.27, రూ.2,222.11 కోట్ల కేటాయింపులు జరిగాయి. ► భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు రూ.1,719.48 కోట్లు (గతేడాది రూ.1,576.14 కోట్లు) ఇచ్చారు. కనీసం ఒక శాతం నిధులుంటేనే.. భారత్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు కేటా యింపులు నామమాత్రమే అన్నది గత బడ్జెట్లను చూస్తే స్పష్టమవుతుంది. స్థూల జాతీయోత్పత్తి (జీఎస్పీ)లో కనీసం ఒక శాతం నిధులు కేటాయి స్తేనే దేశాన్ని నాలెడ్జ్ సొసైటీగా మార్చాలన్న లక్ష్యం నెరవేరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నేళ్లుగా ఈ రంగాలకు కేటాయింపులు గరిష్టంగా జీఎస్పీలో 0.88 శాతమే ఉండటం గమనార్హం. దక్షిణ కొరియా, అమెరికా, చైనాలు ఈ రంగాలకు భారీగా నిధులిస్తుండడంతో ఆ దేశాల నుంచి కొత్త ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానం వస్తున్నాయి. వారు తీసుకుంటున్న పేటెంట్లను చూస్తే ఇది తెలు స్తుంది. దక్షిణ కొరియాలో ప్రతి పది లక్షల జనాభా కు దాదాపు 4,451 పేటెంట్లు నమోదవుతోంటే.. భారత్లో ఈ సంఖ్య 17 మాత్రమే! -
రూ.3 లక్షలు మించొద్దు
అంతకు మించిన నగదు లావాదేవీలపై నిషేధం నల్లధనం కట్టడికి సిట్ చేసిన సిఫార్సుకు ఆమోదం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.. బడ్జెట్లో ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన ఎవరైనా రూ. 3 లక్షలకు మించి తీసుకుంటే జరిమానా బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం నల్లధనంపై కొరడా ఝుళిపించింది. ఇందులోభాగంగా నగదు లావాదేవీలపై పరిమితి విధించింది. అన్ని రకాల లావాదేవీల్లో నగదు రూ.3 లక్షలకు మించకూడదని ఆంక్షలు విధించింది. ఇది వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. నగదు లావాదేవీలపై పరిమితి విధించాలంటూ నల్లధనంపై సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నిర్ణయం ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదించారు. ‘రూ.3 లక్షలకు మించిన నగదు లావాదేవీలు పూర్తిగా నిషిద్ధం’ అని జైట్లీ ప్రకటించారు. సిట్ సిఫార్సును ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అవినీతి, పన్ను ఎగవేత నియంత్రణకు ఈ చర్య ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు. – న్యూఢిల్లీ పరిమితి మించితే పరేషాన్.. నల్లధనం చలామణిని నియంత్రించి స్వల్ప నగదు ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు ఉద్దేశించిన ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సెక్షన్ 269ఎస్టీని ఆదాయ పన్ను చట్టంలో పొందుపరచాలని జైట్లీ బడ్జెట్లో ప్రతిపాదించారు. దీనిప్రకారం ఏ వ్యక్తి కూడా నగదు రూపంలో రూ. 3 లక్షలు, అంతకుమించి తీసుకోకూడదు. పరిమితులు ఎలాగంటే.. ఎ) ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి ఏక మొత్తంలో తీసుకోకూడదు; బి) ఒక లావాదేవీలో తీసుకోకూడదు; సి) ఒక వ్యక్తికి సంబంధించిన ఒక ఈవెంట్ లావాదేవీల్లో తీసుకోకూడదు. ఈ ప్రతిపాదిత పరిమితులు ప్రభుత్వానికి, బ్యాంకింగ్ కంపెనీలకు, పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్లకు వర్తించవు. ఎవరైనా వ్యక్తి మూడు లక్షల రూపాయలకు మించి ఎవరి నుంచైనా తీసుకుంటే అతడికి జరిమానా విధించాలని కూడా బడ్జెట్లో ప్రతిపాదించారు. నిర్దేశిత లావాదేవీ ఎంత మొత్తంలో జరిపితే ఆ విలువకు సమాన మొత్తంలో జరిమానా వేయాలని పేర్కొన్నారు. ఇలాంటి జరిమానాలను విధించే అధికారం ఆదాయపు పన్ను కమిషనర్కు ఉంటుందని చెప్పారు. భారీగా లెక్కల్లో చూపని సంపద నల్లధనం కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ అత్యున్నత కమిటీ అయిన సిట్ తన ఐదో నివేదికను గత జూలైలో సుప్రీంకోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. దేశంలో లెక్కల్లో చూపని సంపద, నగదు భారీగా పోగుబడి ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ‘నగదు లావాదేవీలపై ప్రస్తుతం వివిధ దేశాల్లో అమల్లో ఉన్న నిబంధనలు, వివిధ నివేదికలు, కోర్టులు చెప్పిన అంశాలను పరిశీలించాక నగదు లావాదేవీలపై గరిష్ట పరిమితి విధించాల్సిన అవసరం ఉందని సిట్ భావించింది’అని అందులో చెప్పింది. అందువల్ల రూ. 3 లక్షలు, అంతకుమించి జరిపే నగదు లావాదేవీలపై నిషేధం విధించాలని, ఈదిశగా చట్టం చేసి ఆమేరకు అలాంటి లావాదేవీలను అక్రమంగా ప్రకటించాలని సిఫార్సు చేసింది. చట్టప్రకారం వాటిపై శిక్ష విధించాలని పేర్కొంది. నిషేధం మంచిదే: సిట్ నగదు లావాదేవీలపై రూ. 3 లక్షలు మించకుండా నిషేధం విధించాలంటూ తమ సిఫార్సును బడ్జెట్లో ప్రకటించడంపై సిట్ హర్షం వ్యక్తంచేసింది. దీనిపై సిట్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎంబీ షా మాట్లాడుతూ.. ‘ఇది (రూ.3 లక్షల నగదు లావాదేవీలపై నిషేధం) చాలా అవసరం. మంచి నిర్ణయం కూడా. ఇది చాలా దేశాల్లో అమల్లో ఉందన్న విషయాన్ని గతంలో సమర్పించిన మా నివేదికలో చెప్పాం. గత ఏడాదే దీనిపై మేము సిఫార్సు చేశాం. ఆమోదం పొందడానికి చాలా కాలం పట్టింది’అని అన్నారు. అయితే ఒక్కో వ్యక్తి వద్ద నగదు రూ. 15 లక్షలకు మించకుండా పరిమితులు విధించాలంటూ తాము చేసిన మరో సిఫార్సు కూడా అవినీతి కట్టడికి బాగా ఉపకరిస్తుందని చెప్పింది. ఈ సిఫార్సును ప్రభుత్వం ఆమోదించకపోవడంపై బాధగా ఉందా అన్న ప్రశ్నకు.. తమ సిఫార్సులను అమలుచేయడం, చేయకపోవడమనేది ప్రభుత్వ ఇష్టమన్నారు. అక్రమ, లెక్కల్లో చూపని సంపదను నియంత్రించడానికి మరిన్ని కఠిన చర్యలు అవసరమన్నారు. ఆర్థిక నేరస్తుల ఆస్తుల జప్తు దేశం విడిచి వెళ్లినవారి ఆస్తుల జప్తునకు ప్రత్యేక చట్టం: జైట్లీ న్యూఢిల్లీ: లిక్కర్ టైకూన్ విజయ్మాల్యా బ్యాంకు లకు చెల్లించాల్సిన బకాయిల వసూలుకు చేసిన ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో మాల్యా లాంటి దేశం విడిచి వెళ్లిన ఆర్థిక నేరస్తుల ఆస్తు లను జప్తు చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. ‘‘చట్టాన్ని తప్పించుకుని కొందరు ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు తరలి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి వారి ఆస్తులను జప్తు చేసే కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు యోచిస్తోంది’’అని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన వెల్లడించారు. ట్రిబ్యునల్స్ కుదింపు గత కొన్నేళ్లుగా అనేక ట్రిబ్యునల్స్ పని ఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అందువల్ల వాటి సంఖ్యను హేతుబద్ధీకరించాలని నిర్ణయిం చామని, అవకాశం ఉన్న ట్రిబ్యునల్స్ను విలీనం చేయాలని భావిస్తున్నామని జైట్లీ చెప్పారు. -
‘పార్టీ’ టైమ్ కాదులెండి బాబూ!!
పార్టీల ఖాతాల్లో కోట్లకు కోట్లు పడతాయి. కానీ లెక్కలుండవు. ఎవరిచ్చారండీ... అని చూస్తే రూ.20వేలకన్నా ఎక్కువ ఇచ్చిన వారి పేర్లే నమోదవుతాయి. చాలామంది అంతకన్నా తక్కువే ఇస్తారు. ఈ రహస్యాన్ని జైట్లీ ‘హ్యాక్’ చేసినట్టున్నారు. లిమిట్ను ఏకంగా రూ.2,000కు తగ్గించేశారు. అంతకు మించి ఎవరిచ్చినా... చెక్కో, డిజిటలో!! కాకుంటే ఆర్బీఐ బాండ్లు కూడా కొని పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చట. దీనర్థం... రూ.2,000కు మించి ఎవరెంత ఇచ్చినా ఊరూ పేరూ ఉంటుంది మరి!!. కాకపోతే మనది అనంతకోటి ఉపాయాల భారతం. రూ.2000 చొప్పున లక్షల మంది ‘క్యాష్ కరో’ అనేసినా ఆశ్చర్యంలేదు. దేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు : 1,703 (2015 ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం) -
చిన్న, మధ్యతరహా కంపెనీలకూ ఊరట
వీటి కార్పొరేట్ ట్యాక్స్ 30 నుంచి 25 శాతానికి తగ్గింపు పద్దులు రాయని చిన్న సంస్థలు 6 శాతం లాభం లెక్కిస్తే చాలు బడా కార్పొరేట్లకు ఏమాత్రం ఊరటనివ్వని కేంద్ర బడ్జెట్ సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి పెద్ద కంపెనీలకు పూర్తిగా నిరాశ మిగిల్చినా... చిన్న, మధ్య స్థాయి కంపెనీలపై బాగానే ప్రేమ చూపించారు. గతేడాది బడ్జెట్లో కార్పొరేట్ ట్యాక్స్ను దశలవారీగా 30% (సెస్లతో కలిపి 34.6 శాతం) నుంచి 25 శాతానికి తీసుకు వస్తానని ప్రకటించిన జైట్లీ... ఈసారి బడ్జెట్లో ఒకేసారి 25 శాతానికి తగ్గించేశారు. సెస్లతో కలిపి ఇది 28.84 శాతం అవుతుంది. కాకపోతే దీన్ని కేవలం మధ్య, చిన్నతరహా (ఎంఎఎస్ఎంఈ) పరిశ్రమలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే పన్ను చెల్లిస్తున్న కంపెనీల్లో 96 శాతం కంపెనీలు ఈ కేటగిరీలోనే ఉండటంతో తాజా నిర్ణయం చాలా కంపెనీలకు లాభదాయకమని అంచనా వేస్తున్నారు. కంపెనీలకు నాలుగు డబ్బులు మిగిలితే వారు మరింత మంది ఉద్యోగుల్ని తీసుకోవటానికి, ఆ లాభాన్ని కస్టమర్లకు బదిలీ చేయటానికి ప్రయ త్నాలు చేస్తారని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం... ► రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలకు పన్నుని 30% నుంచి 25% తగ్గిస్తున్నట్లు ప్రక టించారు. మొత్తం పన్ను చెల్లిస్తున్న కంపెనీల్లో ఈ కేటగిరీలోనివే 96% ఉన్నాయి. దీంతో 96% కంపె నీలకు లాభం కలుగుతుందని జైట్లీ చెప్పారు. ► 2015–16లో 6.94 లక్షల కంపెనీలు రిటర్నులు దాఖలు చేయగా రూ.50 కోట్ల టర్నోవర్ పరిధిలో 6.67 లక్షల కంపెనీలున్నాయని, ఈ నిర్ణయం వల్ల కేంద్రం రూ.7,200 కోట్ల ఆదాయాన్ని కోల్పోనుందని జైట్లీ చెప్పారు. ► రూ.2 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలు ఎలాంటి పద్దులూ నిర్వహించాల్సిన అవసరం లేదు. కాకపోతే వారు తమ టర్నోవర్లో 8 శాతాన్ని లాభంగా ఊహించుకుని దానిపై పన్ను చెల్లించాల్సి వచ్చేది. దీన్ని తగ్గించారు. ఇలా ఖాతాలూ నిర్వహించకుండా ఉండే రూ.2 కోట్ల లోపు టర్నోవర్ కంపె నీలు ఇకపై తమ లాభాన్ని 6% ఊహించుకుని దానిపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ నిర్ణయా న్ని అమలు చేస్తామని జైట్లీ స్పష్టం చేశారు. ► దీనివల్ల ఏం జరుగుతుందంటే.. ఉదాహరణకు ఇదివరకు ఓ సంస్థ గనక తన టర్నోవర్ రూ.1.5 కోట్లుంటుందని భావించి, దానిపై 8 శాతం... అంటే 12 లక్షలపై 30 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇపుడు అది రూ.9 కోట్లపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. ► స్టార్టప్ కంపెనీలు మినిమమ్ ఆల్టర్నేట్ ట్యాక్స్ (మ్యాట్) తొలగించాలని కోరినా ఆర్థిక మంత్రి అంగీకరించలేదు. కానీ మ్యాట్ క్రెడిట్ను 15 ఏళ్ల వరకు చూపించుకోవడానికి అనుమతించారు. ఇది ఇప్పటి వరకు 10 ఏళ్లుగా ఉండేది. అదే విధంగా స్టార్టప్స్ నష్టాలను భవిష్యత్తు లెక్కల్లో చూపించుకోవడానికి ఉన్న నిబంధనల్లో స్వల్ప మార్పులు చేశారు. గతంలో ఓటింగ్ రైట్స్ 51 శాతం ఉంటేనే నష్టాలను మిగిలిన సంవత్సరాల్లో కూడా చూపించుకోవడానికి అనుమతించేవారు. ఇప్పుడు ప్రమోటర్కు వాటా ఉంటే చాలు తప్ప 51 శాతం వాటా ఉండాల్సిన అవసరం లేదు. అన్ని కంపెనీలకూ కార్పొరేట్ ట్యాక్స్ కనీసం ఒక శాతమైనా తగ్గిస్తారని అంతా ఊహించారు. దీనికి భిన్నంగా ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఈ తగ్గింపును పరిమితం చేయడంతో పెద్ద కంపెనీలు నిరాశ వ్యక్తం చేశాయి. -
పర్యావరణానికి 19% పెంపు
కేటాయింపులపై పెదవి విరిచిన పర్యావరణ సంస్థలు న్యూఢిల్లీ: ఇటీవల వివాదాస్పదంగా మారిన పర్యావరణ అంశంపైనా కేంద్రం దృష్టి పెట్టింది. 2017–18 బడ్జెట్లో పర్యావరణ శాఖకు రూ.2,250.34 కోట్లను కేటాయించింది. ఇది గతేడాదికన్నా సుమారు 19 శాతం ఎక్కువ. ఇక పులుల సంతతిని సంరక్షించేందుకు చేపట్టిన ‘ది ప్రాజెక్ట్ టైగర్’కార్యక్రమానికి గతేడాదికన్నా రూ.30 కోట్లు తక్కువగా రూ.345 కోట్లు కేటాయించారు. ఇక ఏనుగుల సంరక్షణకు ఉద్దేశించిన ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’కు కూడా గతేడాదికన్నా రెండున్నర కోట్లు ఎక్కువగా రూ.27.5 కోట్లు ఇచ్చారు. తాజా బడ్జెట్లో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు రూ.74.3 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనిపై పర్యావరణ సంస్థలు మండిపడ్డాయి. ‘‘దేశంలో పెరిగిపోతున్న కాలుష్యం సమస్యను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదు. బడ్జెట్లో సరైన కేటాయింపులు లేవు. దీనిని బట్టి ప్రభుత్వం పర్యావరణ అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అర్థమవుతోంది..’’అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నిపుణులు పేర్కొన్నారు. ఇక పునరుత్పాదక ఇంధన వనరులు, ఇంధన సామర్థ్యం పెంపు వంటి లక్ష్యాలను అడ్డుకునేదిగా తాజా బడ్జెట్ ఉందని ది ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (టెరి) సంస్థ వ్యాఖ్యానించింది. పర్యావరణ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉందని పేర్కొంది. -
భవితకు భరోసా!
ఐదు రాష్ట్రాల ఎన్నికలున్నా ఆర్భాటం చూపని ఆర్థికమంత్రి మూడు నెలల కిందట అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు.. మరో 4 నెలల్లో అమలులోకి రానున్న వస్తుసేవల పన్ను.. అత్యంత కీలకమైన రెండు భారీ ఆర్థిక సంస్కరణల మధ్య కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంతేకాదు.. 92 ఏళ్లుగా వేరుగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్ను కూడా కలిపేయడం, బడ్జెట్ తేదీలను నెల రోజులు ముందుకు జరిపి ప్రవేశపెట్టడం ఈ సాధారణ బడ్జెట్ను చరిత్రాత్మకం చేస్తోంది. మరో నెల రోజుల్లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు ప్రతిష్టాత్మకమైనది. అంతేకాదు.. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిన పెద్ద నోట్ల రద్దు అనంతరం చేపడుతున్న బడ్జెట్ కనుక.. అంచనాలూ భారీగా పెరిగాయి. అయితే.. 21,46,735 కోట్ల రూపాయలతో 2017–18 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టినా.. హంగూ ఆర్భాటాల జోలికి వెళ్లలేదు. ఆదాయ పన్ను చెల్లింపుల విషయంలో నిజాయితీపరులైన వారికి ప్రోత్సాహకం అంటూ.. వేతన జీవులకు కింది స్లాబు పన్ను రేటును సగానికి తగ్గించి ఊరట కల్పించారు. చిన్న కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటును ఐదు శాతం తగ్గించడం ద్వారా చేయూతనిచ్చారు. న్యూఢిల్లీ : వసంత పంచమి రోజున తాను బడ్జెట్ ప్రవేశపెడుతున్నానంటూ బుధవారం ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రసంగం ప్రారంభించిన అరుణ్ జైట్లీ... దేశంలో ‘పాలనా విధానంలో మార్పు’తీసుకురావడం కోసం తమ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా చేసిన కృషిని వివరించారు. ఆ క్రమంలో ‘గత’ప్రభుత్వాలపై పరోక్ష విమర్శలూ గుప్పించారు. వివక్షా పూరిత పరిపాలన నుంచి విధాన ఆధారిత పరిపాలనకు, ఆశ్రిత పక్షపాతం నుంచి పారదర్శకతకు, లోపభూయిష్ట పథకాల నుండి లక్షిత అమలుకు, అనధికార ఆర్థికవ్యవస్థ నుంచి క్రమబద్ధమైన ఆర్థికవ్యవస్థకు పయనించినట్లు చెప్పారు. రెండంకెల్లో ఉన్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించామని, మందకొడిగా ఉన్న వృద్ధిని అధిక వృద్ధితో భర్తీచేశామని పేర్కొన్నారు. నల్లధనంపై భారీ యుద్ధం ప్రారంభించామని.. ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రజా ధనానికి నమ్మకమైన కాపలాదారుగా చూస్తున్నారన్నారు. అభివృద్ధి ఫలాలు రైతులు, కార్మికులు, పేదలు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, మహిళలతో పాటు సమాజంలోని అణగారిన వర్గాలకు అందేలా చూడటానికి తాము ఇంకా మరిన్ని చర్యలను చేపట్టడం కొనసాగిస్తామని జైట్లీ చెప్పారు. అభివృద్ధి, ఉపాధి ఫలాలను అందుకునేలా యువతను శక్తివంతం చేయడంపై తమ దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. సవాళ్లున్నా ఉజ్వలమే... ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి రేటు మెరుగుపడుతుందన్న అంచనాలు.. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆశావహంగా ఉంటుందనేందుకు సానుకూల సంకేతాలన్నారు. అయితే.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు మూడు సవాళ్లున్నాయన్నారు. మొదటిది– అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుత ద్రవ్య విధానం కారణంగా పెట్టుబడుల రాక తగ్గడం, పోక పెరగడం జరగవచ్చని చెప్పారు. రెండోది– నిత్యావసరాల ధరల, ప్రత్యేకించి ముడి చమురు ధర అనిశ్చితి ద్రవ్య పరిస్థితిపై ప్రభావం చూపుతుందన్నారు. మూడోది– ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో స్వీయ రక్షణ కోసం ఒత్తిళ్లు పెరగడంతో.. వస్తువులు, సేవలు, ప్రజల ప్రపంచీకరణ నుంచి వెనుదిరగడం పెరుగుతోందని పరోక్షంగా అమెరికాలో ట్రంప్ విధానాల గురించి ప్రస్తావించారు. ఇది ఎగుమతులపై ప్రభావం చూప గలదన్నారు. వీటన్నిటి మధ్యా భారత దేశం ప్రపంచ ఆర్థిక వేదికపై ఉజ్వలంగా నిలుస్తోందంటూ ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక వేదిక తదితర అంతర్జాతీయ సంస్థల నివేదికలను ఉటంకించారు. ఇంతకుముందు తయారీ దేశాల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు ఆరో స్థానానికి ఎగబాకిందని చెప్పారు. అంతర్జాతీయ వృద్ధికి భారత్ను చోదక శక్తిగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. నోట్ల రద్దుతో దీర్ఘకాల ప్రయోజనాలు.. తమ ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణల కొనసాగింపుగా పెద్ద నోట్ల రద్దు చేపట్టడం జరిగిందన్నారు. ‘అది సాహసోపేతమైన, నిర్ణయాత్మక చర్య’అని అభివర్ణించారు. పన్ను ఎగవేత అనేది దశాబ్దాలుగా చాలా మందికి జీవన విధానంగా మారిందని.. దీనివల్ల విస్తృత ప్రజాప్రయోజనాలపై రాజీ పడాల్సివస్తోందని పేర్కొన్నారు. అది సమాంతర ఆర్థికవ్యవస్థను పెంచిపోషించిందన్నారు. జీడీపీ మరింత అధికంగా, స్వచ్ఛంగా, వాస్తవికంగా ఉండేందుకు పెద్ద నోట్ల రద్దు దోహదం చేస్తుందని చెప్పారు. అన్ని సంస్కరణల తరహాలోనే ఈ చర్య కూడా అవాంతరాలను కలిగించేదేనన్నారు. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త నోట్లను మార్కెట్లోకి సరఫరా చేసే కాలంలో ఆర్థిక లావాదేవీలు తగ్గడం.. ఆర్థిక వ్యవస్థపై కేవలం తాత్కాలిక ప్రభావం మాత్రమే చూపుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా.. ‘ఒక సరైన కారణం ఎన్నడూ విఫలం కాదు’అంటూ మహాత్మా గాంధీ సూక్తిని ఉటంకిస్తూ ప్రభుత్వ చర్యను సమర్థించుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ఫలితంగా.. అవినీతి తగ్గుముఖం, ఆర్థిక వ్యవస్థ డిజిటైజేషన్ పెరగడం, ఆర్థిక పొదుపుల ప్రవాహం పెరగడం, ఆర్థిక వ్యవస్థ మరింతగా క్రమబద్ధం కావడం వంటి దీర్ఘ కాల ప్రయోజనాలు లభిస్తాయని.. వీటన్నిటివల్లా జీడీపీ వృద్ధి, పన్ను ఆదాయాలు అధికమవుతాయని వివరించారు. మౌలికం, గ్రామీణానికి ప్రాధాన్యం... ఇక దేశ ఆర్థిక వ్యవస్థను డిజిటల్ బాట పట్టించేందుకు పలు చర్యలు ప్రకటించిన జైట్లీ.. మౌలికవసతుల పథకాలకు రికార్డు స్థాయిలో రూ. 3,96,135 కోట్లు కేటాయించారు. ఈ భారీ పెట్టుబ డులు.. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆర్థిక కార్యక లాపాలను సృష్టిస్తాయని, మరిన్ని ఉద్యోగ అవకా శాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. రైల్వేలకు రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయం, జాతీయ రహదారులకు మరో రూ. 64,000 కోట్లు ఇచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రైతులకు రికార్డు స్థాయిలో రూ. 10 లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులను రూ. 48,000 కోట్లకు పెంచారు. కోటి కుటుంబాలకు పేదరికం నుంచి విముక్తి కల్పించాలని లక్ష్యంగా ప్రకటించారు. 2019 నాటికి ఇళ్లులేని వారికి కోటి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా గ్రామీణ, వ్యవసాయ, అనుబంధ రంగాలకు కలిపి రూ. 1,87, 223 కోట్లు కేటాయింపులు చేశారు. ఇది ప్రస్తుత ఏడాది కన్నా 24 శాతం అధికం. ఇక రక్షణ రంగానికి, పెన్షన్లను మినహాయించి రూ. 2,74,114 కోట్లు కేటాయించారు. అందులో రూ. 89,488 కోట్లు పెట్టుబడిగా పేర్కొన్నారు. అలాగే.. ప్రభుత్వ బ్యాం కులకు రూ. 10,000 కోట్లు పెట్టుబడులుగా అందిం చనున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 25,000 కోట్లు ఇలా అందించారు. జైట్లీ బడ్జెట్ షాయరీలివీ.. బడ్జెట్ ప్రవేశపెడుతూ 2 గంటల పాటు ప్రసంగించిన జైట్లీ.. మధ్యలో సందర్భానుసారం షాయరీలతో సభ్యులందరినీ ఆకట్టుకున్నారు. ‘ఇస్ మోడ్ పర్ న ఘబ్రా కర్ థమ్ జాయియే ఆప్.. జో బాత్ నయీ హై ఉసే అప్నాయియే ఆప్.. (ఈ మలుపులో మీరు ఆందోళన చెంది ఆగిపోవద్దు.. ఏది కొత్త విషయమో దానిని మీరు స్వీకరించండి)’ ‘డర్తే హై నయీ రాహ్ పే క్యూ చల్నే సె.. హమ్ ఆగే ఆగే చల్తే హై ఆయియే ఆప్... (కొత్త దారిలో నడవడానికి మీకెందుకు భయం.. నేను ముందు నడుస్తా మీరు నా వెంట రండి) ‘నయీ దునియా హై.. నయా దౌర్ హై.. నయీ హై ఉమంగ్.. కుచ్ థే పెహలే కే తరీకే.. తొ కుచ్ హై ఆజ్ కె రంగ్ ధంగ్.. (కొత్త ప్రపంచం.. కొత్త ప్రయాణం.. కొత్త ఆశలు.. కొన్ని పాతవే.. మరికొన్ని ఈనాటివి)’ ‘రోష్నీ జో యె నికల్ ఆయీ హై.. కాలే ధన్ కో భీ బదల్నా పడా ఆజ్ అప్నా రంగ్.. (దూసుకొచ్చిన ఈ వెలుగు వల్ల.. నల్ల ధనం కూడా తన రంగు మార్చుకోవాల్సి వచ్చింది)’ జీడీపీ పెరుగుతుంది... నల్లధనాన్ని నిర్మూలించి, స్వచ్ఛ లావాదేవీలను ప్రవేశపెట్టే ఉద్దేశంతో అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు అనంతరం.. కొత్త నోట్ల విడుదల వేగం పుంజుకుందని, త్వరలో సౌకర్యవంతమైన స్థాయికి చేరుకుంటుందని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. నోట్ల రద్దు ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరంలోకి విస్తరించదని ఆశిస్తున్నట్లు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చి చేరిన అదనపు ద్రవ్య నిల్వల వల్ల.. వడ్డీ భారం తగ్గుతుందని, రుణాల అందుబాటు పెరుగుతుందని వివరించారు. నోట్ల రద్దు కాలంలో బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడం.. పన్ను పరిధిని విస్తరించడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలుకల్పిస్తుందన్నారు. అలాగే.. రూ. 3 లక్షలకు మించిన మొత్తంలో నగదు లావాదేవీలను ఈ బడ్జెట్లో నిషేధించారు. రాజకీయ పార్టీల నిధుల విషయంలో పారదర్శకత పెంపు లక్ష్యంగా.. పార్టీలు ఒక్కో దాత నుంచి నగదు రూపంలో స్వీకరించగల విరాళం మొత్తాన్ని రూ. 20,000 నుంచి ఏకంగా రూ. 2,000 కు తగ్గించారు. ఇటు కోత.. అటు మోత.. వేతనజీవులకు ఊరటనిస్తూ.. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల స్లాబుపై ఆదాయ పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన జైట్లీ.. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయంపై 10 శాతం సర్ చార్జ్ విధించారు. కోటి రూపాయలు దాటిన ఆదాయంపై 15 శాతం సర్చార్జీని కొనసాగించారు. అలాగే.. టర్నోవర్ రూ. 50 కోట్లకు తక్కువగా ఉన్న కంపెనీలపై కార్పొరేట్ పన్నును ప్రస్తుతమున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) త్వరలో అమలులోకి వస్తున్నందున.. పరోక్ష పన్నులను పెద్దగా కదిలించలేదు. అయితే.. పొగాకు ఉత్పత్తులు, సోలార్ ప్యానెళ్లు, మొబైల్ ఫోన్లలో వాడే సర్క్యూట్లపై సుంకాలను కొద్దిగా పెంచారు. పెరిగిన ద్రవ్యలోటు.. తగ్గిన రెవెన్యూ లోటు బడ్జెట్ కేటాయింపులను ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయంగా వేరుచేయడాన్ని విడనాడడం ద్వారా.. ఇప్పుడు పెట్టుబడి, రెవెన్యూ వ్యయాలపై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుత ఏడాది కన్నా తాజా బడ్జెట్లో పెట్టుబడి వ్యయాన్ని 25.4 శాతం పెంచానని, ఇది అధిక వృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు జీడీపీలో 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా 3.5 శాతంగా ఉన్నట్లు చెప్పారు. అయితే.. 2019 మార్చి నాటికి ఇది 3 శాతానికి తగ్గుతుందని చెప్పారు. అలాగే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో 2.3 శాతంగా ఉన్న రెవెన్యూ లోటు.. సవరించిన అంచనాల్లో 2.1 శాతానికి తగ్గిందని జైట్లీ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ లోటు 1.9 శాతంగా ఉంటుందన్నారు. -
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం
దళితులకు 35 శాతం పెంపు ∙గిరిజన సంక్షేమానికి 31,920 కోట్లు న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి ఈ బడ్జెట్లోనూ కేంద్రం పెద్దపీట వేసింది. దళితుల సంక్షేమానికి 2016–17లో కేటాయించిన రూ.38,833 కోట్లను ఈసారి రూ.52,393కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. గతంతో పోలిస్తే ఇది 35 శాతం అదనం. తాజా బడ్జెట్లో గిరిజన సంక్షేమ శాఖకు గతేడాదితో పోలిస్తే అదనంగా రూ.5,329 కోట్లు (10 శాతం అదనం) కేటాయించారు. 2016–17 బడ్జెట్ లో ఈ శాఖకు రూ. 24,005కోట్లు కేటాయించగా.. ఈసారి దీన్ని రూ.31, 920 కోట్లకు పెంచారు. ఈ విభాగాల్లో సరైన ఫలితాలు వచ్చేందుకు నీతి ఆయోగ్ ద్వారా వ్యయ సమీక్ష జరపాలని కేంద్రం భావిస్తోంది. మైనారిటీల కోటాకు 10 శాతం అదనం ఎన్డీఏ ప్రభుత్వం మైనారిటీలను విస్మరిస్తోం దంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలనుంచి తప్పించుకునేందుకు మైనారిటీ సంక్షేమ శాఖకు కేంద్రం గతేడాదికన్నా దాదాపు 10 శాతం నిధులను అదనంగా ఇచ్చింది. తాజా బడ్జెట్లో మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.4,195 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.2,053.54 కోట్లు మైనారిటీల్లో విద్యా సాధికారత పెంచేందుకు, రూ.1200 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు, రూ.634.95 కోట్లను నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ‘చాలా ఏళ్ల తర్వాత మైనారిటీల బడ్జెట్ రూ.368 కోట్లు పెరిగింది. ఇది మైనారిటీల సాధికారితకు బాటలు వేస్తుంది’ అని మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ‘తోలు’కు చేయూత న్యూఢిల్లీ: జౌళి, చేనేత రంగానికి అమలు చేస్తున్న తరహాలోనే తోలు, పాదరక్షల పరిశ్రమ కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెడతా మని అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే తోళ్ల శుద్ధికి వాడే వెజిటబుల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకం 7.5 నుంచి 2.5కు తగ్గించారు. జూన్, 2016లో చేనేత, జౌళి రంగానికి ప్రభుత్వం రూ.6వేల కోట్లు కేటాయించింది. మూడేళ్లలో కొత్త ఉద్యోగాలు కల్పించడంతో పాటు దాదాపు రూ. 74,800 కోట్ల పెట్టుబడుల్ని ఆక్షరించడం పథకం ప్రధాన లక్ష్యం. అలాగే రూ.2,04,000 కోట్ల ఎగుమతుల్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలాంటి పథకమే తోలు, పాదరక్షల పరిశ్రమకు వర్తింపచేస్తే... రూ.కోటి పెట్టుబ డికి 250 మంది ఉపాధి పొందుతారు. ప్రస్తుతం ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా 30లక్షల మంది ఆధారపడుతున్నారు. ప్రస్తుతము న్న రూ. 47,600 కోట్ల పెట్టుబడుల్ని కూడా 2020 నాటికి రూ.1,02,000 కోట్లకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పన్నుల రద్దుతో చేనేతకు సాయం: స్మృతి ఇరానీ బడ్జెట్లో చేనేత రంగానికి సంబంధించి రూ. 1,555 కోట్ల మేర రాష్ట్ర పన్నుల రద్దు వస్త్ర రంగంలో ఎగుమతులకు ఎంతో ఉపకరిస్తుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. చేనేత, జౌళి శాఖకు రూ.6,226.50 కోట్లు కేటాయించినందుకు ట్వీటర్ లో ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మొదటిసారిగా ప్రధానమంత్రి పరిధాన్ రోజ్గార్ యోజన కింద వస్త్ర రంగంలో ఉపాధి కల్పనకు రూ. 200 కోట్ల కేటాయించారంటూ ట్వీట్ చేశారు. వృద్ధులకు గుడ్డిలో మెల్ల... దేశంలో వృద్ధులు : 10.39 కోట్లు (2011జనాభా లెక్కల ప్రకారం) మార్కెట్లో ఎన్ని యాప్లున్నా... మన మొబైల్లో మెమొరీ ఉండాలి కదా!! పెట్టుబడికి ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ పథకాలున్నా రాబడికి గ్యారంటీ ఉండాలి కదా!! పైపెచ్చు ఉద్యోగం చేసినన్నాళ్లూ దాచుకున్న సేవింగ్స్పై తగిన వడ్డీ వస్తేనే జీవితం సాఫీగా వెళుతుంది. ఎందుకంటే మన దగ్గర పెన్షన్గానీ, సామాజిక భద్రతగానీ లేని వృద్ధులే మెజారిటీ. అందుకే 8 శాతం రాబడి తప్పనిసరిగా వచ్చేలా వారికి ఎల్ఐసీ ద్వారా ప్రత్యేక పథకం తెస్తానన్నారు. ఇది పెద్దలందరికీ సంతోషకరమే!! వృద్ధులకు ఆరోగ్య వివరాలన్నీ నమోదు చేసిన ఆధార్ ఆధారిత స్మార్ట్ కార్డులిస్తామని కూడా హామీనిచ్చారు జైట్లీ. కార్డులు సరే!! సరైన వైద్యం అందాలి కదా? -
లక్ష్యం బాటలోనే ద్రవ్యలోటు...
2017–18లో లక్ష్యం 3.2% అటు తర్వాతి ఏడాది 3 శాతానికి కట్టడి ప్రభుత్వ ఆదాయం–వ్యయానికి మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు లక్ష్యాల బాటకు కట్టుబడి ఉన్నట్లు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. 2017–18 స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని వివరించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో దీనిని 3 శాతంగా కొనసాగిస్తామనీ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వ్యయాల విషయంలో రాజీపడకుండానే ఈ లక్ష్యాల సాధనకు కట్టుబడి ఉన్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు బడ్జెట్ లక్ష్యం 3.5 శాతం. రెవెన్యూ లోటు ఇలా... ఇక రెవెన్యూ లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం 2.3 శాతం నుంచి 2.1 శాతానికి తగ్గితే, దీనిని 2017–18లో 1.9 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. ఎఫ్ఆర్బీఎం ప్యానల్ చెప్పిందేమిటి? వచ్చే మూడేళ్లలో 3 శాతం ద్రవ్యలోటు లక్ష్యం ఉండాలని మాజీ రెవెన్యూ కార్యదర్శి ఎన్కే సింగ్ నేతృత్వంలోని ఎఫ్ఆర్బీఎం సమీక్షా సంఘం సూచించింది. రెవెన్యూలోటు విషయంలో ఈ లక్ష్యం 2 శాతంగా ఉంది. మార్కెట్ రుణ సమీకరణ విధమిది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నికర మార్కెట్ రుణ సమీకరణలు రూ. 4.25 లక్షల కోట్లుకాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం దీనిని రూ. 3.48 లక్షల కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఇది దాదాపు రూ.75,000 తక్కువ. ఇక స్థూల రుణ సమీకరణల విషయానికి వస్తే– ఈ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 6 లక్షల కోట్ల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.5.8 లక్షల కోట్లకు బడ్జెట్ తగ్గించింది. స్థూల రుణాల పద్దులో గత రుణాల పునఃచెల్లింపులు, వడ్డీలు కూడా కలిసి ఉంటాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత రుణాలపై రీపేమెంట్లను రూ.1.5 లక్షలుగా బడ్జెట్ నిర్ణయించింది. మార్కెట్ స్థిరీకరణ పథకం (ఎంఎస్ఎస్) పథకం కింద ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 1.01 లక్షల కోట్ల బాండ్లను జారీ చేస్తే... ఈ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి లక్ష కోట్లుగా బడ్జెట్ నిర్దేశించింది. ఎంఎస్ఎస్ ఫ్లోటింగ్ బాండ్ల రుణాన్ని మార్కెట్లో ద్రవ్యలభ్యత నిర్వహణకు వినియోగిస్తారు. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఈ మొత్తాన్ని రూ.20,000 కోట్లుగానే అంచనావేయడం జరిగింది. అయితే పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మార్కెట్లో అదనపు లిక్విడిటీ (ద్రవ్యలభ్యత)ని పెంపొందించడానికి ఈ పరిమితిని రూ.1.01 లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచింది. -
కేటాయింపులు 26% పెంపు
మహిళా శిశు సంక్షేమం గర్భిణులకు రూ.6 వేలు నేరుగా వారి ఖాతాల్లో జమ గతేడాది రూ.17,640 కోట్లు ఈ ఏడాది రూ.22,095 కోట్లు న్యూఢిల్లీ: 2017–18 బడ్జెట్లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు 26శాతం నిధులు పెంచారు. గతేడాది రూ.17,640 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.22,095 కోట్లకు పెంచారు. ఇందిరా గాంధీ మంత్రిత్వ సహయోగ్ యోజనకు 2016–17 లో రూ.634 కోట్ల నిధులుండగా, ఈసారి నాలుగు రెట్లు పెంచి రూ.2,700 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద కాన్పు, టీకాల ఖర్చుల నిమిత్తం గర్భిణులకు రూ.6వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతా ల్లో జమ చేస్తారు. ఇదివరకున్న ప్రసూతి లబ్ధి పథకం స్థానంలో కొత్తగా ఈ కార్యక్రమం అమలవుతుంది. ఈ పథకం గతంలో దేశవ్యాప్తంగా 53 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా.. కొత్తగా గ్రామీణ స్థాయిలో ‘మహిళా శక్తి కేంద్రాలు’ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 14 లక్షల ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాలకు రూ.500 కోట్ల నిధులు కేటాయించారు. ప్రధాని మోదీ మానస పుత్రిక ‘బేటీ బచావో–బేటీ పఢావో’ పథకానికి ఈ బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఇది గతేడాదితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ. నిర్భయ నిధికి గతేడాదిలాగే ఈసారి కూడా రూ.500 కోట్లు ఇచ్చారు. 2013లో ప్రారంభమైన ఈ ఫండ్కు ఇప్పటిదాకా రూ.3 వేల కోట్లు మంజూరయ్యాయి. శిశు సంరక్షణ పథకానికి గతేడాది రూ.400 కోట్లుండగా, ఈసారి సమగ్ర శిశు వికాస పథకం కింద ఈ కార్యక్రమాన్ని కలిపేసి మొత్తంగా రూ.648 కోట్లు కేటాయించారు. అన్ని మంత్రిత్వ శాఖలలో మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి 2016–17లో రూ.1,56,528 కోట్లుగా ఉన్న నిధులను 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.1,84,632 కోట్లకు పెంచినట్లు అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. -
మహిళా శక్తి... మాటలకేనా?
ఈ ఫేస్బుక్, వాట్సాప్ యుగంలో మెజారిటీ జనం సూక్తులు చెప్పేవారే!!. సమాజ వికాసం ఆడపిల్లలతోను, మహిళలతోనే మొదలవుతుందని జైట్లీ కూడా చెప్పారు. మరి వారికోసం ఏం చేశారు? 14 లక్షల ఐసీడీఎస్ అంగన్వాడీలలో మహిళా శక్తి కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామంటూ దానికి రూ.500 కోట్లిచ్చారు. ఒకో కేంద్రానికి రూ.4వేలకన్నా తక్కువే. దీంతో మహిళల సాధికారత, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, డిజిటల్ అక్షరాస్యత, ఆరోగ్యం, పౌష్ఠికాహారం అన్నీ సాధ్యమవుతాయట!! గర్భిణీ స్త్రీలకు రూ.6 వేలిచ్చే పథకానికి అధికారిక ట్యాగ్ వేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో 48 శాతంగా ఉన్న మహిళల భాగస్వామ్యం ఇపుడు 55కు చేరిందట. దీన్ని పురోగతిగా అనొచ్చా? దేశంలో మహిళలు : 58.6 కోట్లు (2011జనాభా లెక్కల ప్రకారం) -
బడ్జెట్ తయారీ ఇలా...
బడ్జెట్.. అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు! కానీ ఈ మూడక్షరాల వెనుక 6 నెలల కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. అదేంటో మీరే ఓ లుక్కేయండి!! సెప్టెంబర్ చివర్లో.. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్కు కేటాయిస్తుంది. అక్టోబర్ చివర్లో.. తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు. డిసెంబర్.. ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి. జనవరి.. పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధు లు ఆర్థికమంత్రిని కలిసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు. ముద్రణ ప్రక్రియ.. బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది. అందరిపై నిఘా ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు. అంతా ‘ప్రత్యేకం’ బడ్జెట్ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్ ప్రెస్’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. నీడలా వెన్నంటే.. ముద్రణ విభాగం సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు. ముందస్తుగా.. సాధారణంగా ఫిబ్రవరి చివర్లో పెట్టే బడ్జెట్ను ఈసారి 1వ తేదీనే ప్రవేశ పెట్టారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానికి బడ్జెట్ గురించి ఆర్థిక మంత్రి వివరిస్తారు. -
స్పెషల్ వైద్యం
వైద్య రంగానికి రూ. 47,352 కోట్లు న్యూఢిల్లీ: దేశంలో స్పెషలిస్టు వైద్యుల సంఖ్యను గణనీయంగా పెంచాలని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ తెలిపారు. ద్వితీయ, తృతీయ స్థాయిల్లో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు తగినంత మంది స్పెషలిస్టు వైద్యుల అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఏటా అదనంగా 5 వేల పీజీ సీట్లను సృష్టించనున్నట్లు తెలిపారు. 2017–18లో మొత్తంగా వైద్య రంగానికి రూ. 47,352.51 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2016–17లో ఈ రంగానికి కేటాయించిన రూ. 37,061.55 కోట్లకన్నా తాజా కేటాయింపు 27.76 శాతం అధికమన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఆయుష్ మంత్రిత్వశాఖకు రూ. 1,428.65 కోట్లు, వైద్య పరిశోధన విభాగానికి రూ. 1,500 కోట్లు (గతేడాది కేటాయింపులు రూ. 1,144.80 కోట్లు) కేటాయిస్తున్నామన్నారు. జిల్లా ఆస్పత్రుల్లో డీఎన్బీ కోర్సులు... పెద్ద జిల్లా ఆస్పత్రుల్లో డీఎన్బీ కోర్సులను ప్రవేశపెడతామని, ఎంపిక చేసిన ఈఎస్ఐ, మున్సిపల్ కార్పొరేషన్ ఆస్పత్రుల్లో పీజీ బోధనను బలోపేతం చేస్తామని, పేరుగాంచిన ప్రైవేటు ఆస్పత్రులు డీఎన్బీ కోర్సులు ప్రారంభించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. సరసమైన ధరల్లో మందులు... దేశంలో జెనరిక్ మందులను ప్రోత్సహించేందుకు, ఔషధాలన్నీ సరసమైన ధరల్లో ఉండేలా చూసేందుకు ఔషధాలు, సౌందర్య సాధనాల నిబంధనలను సవరిస్తామని జైట్లీ తెలిపారు. వైద్య పరికరాల నియంత్రణకు కొత్త నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఈ ఏడాదిలోగా బోదకాలు వ్యాధి నిర్మూలన దేశం నుంచి కాలా–అజర్, బోదకాలు, కుష్టు, తట్టు వ్యాధులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. 2017కల్లా కాలా–అజర్, బోదకాలు వ్యాధులను, 2018కల్లా కుష్టు, 2020కల్లా తట్టును, అలాగే 2025 నాటికి క్షయను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో జైట్ల చెప్పారు. శిశు, బాలింత మరణాల తగ్గుదలకు ప్రణాళిక 2014లో ప్రతి వెయ్యి జననాలకు 39గా ఉన్న శిశు మరణాల రేటును 2019కల్లా 28కి తగ్గించేందుకు, 2011–13 కాలానికి ప్రతి లక్ష శిశు జననాలకు 167గా నమోదైన బాలింతల మరణాల రేటును 2018–20కల్లా 100కు తగ్గించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసిందని జైట్లీ చెప్పారు. ఆరోగ్య ఉప కేంద్రాలను వెల్నెస్ సెంటర్లుగా మారుస్తామన్నారు. -
ప్రవేశ పరీక్షలకు ఒకే సంస్థ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు యూజీసీలో సంస్కరణలకు శ్రీకారం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారి కోసం డిజిటల్ లైబ్రరీ నాణ్యమైన విద్యతోనే యువత సాధికారత సాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నొక్కి చెప్పారు. దేశంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులకు తెరతీసే చర్యలను ఆయన బుధవారం బడ్జెట్లో ప్రకటించారు. ఈ సంస్కరణల్లో అత్యంత కీలకమైంది.. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం అన్ని రకాల ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు స్వయం ప్రతిపత్తి గల ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ఏర్పాటు. ఈ ఏజెన్సీ రాకతో సీబీఎస్ఈ, ఏఐసీటీఈ వంటి సంస్థలకు పరీక్ష నిర్వహణ బాధ్యతల నుంచి వెసులుబాటు కలుగుతుందని జైట్లీ చెప్పారు. బడ్జెట్లో పాఠశాల విద్య, అక్షరాస్యతకు రూ.46,356 కోట్లు, ఉన్నత విద్యకు రూ.33,329 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. – న్యూఢిల్లీ ‘స్వయం’ ద్వారా 350 ఆన్లైన్ కోర్సులు మన దేశంలో పాఠశాలలు సాధిస్తున్న వార్షిక ఫలితాలను కచ్చితంగా తెలుసుకునేందుకు ఒక పటిష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఉందని జైట్లీ చెప్పారు. శాస్త్రీయ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా సరళమైన కోర్సులను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యలో నాణ్యతను పెంచేందుకు, మన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యనందించేందుకు ‘ఇన్నోవేటివ్ ఫండ్’ను ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో విద్యాపరంగా వెనుకబడ్డ 3,479 ప్రాంతాలపై ఇకపై మరింత దృష్టి పెడతామన్నారు. ఐసీటీ ద్వారా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ‘స్వయం’వేదిక ద్వారా అత్యుత్తమ నాణ్యతతో కూడిన 350 ఆన్లైన్ కోర్సులను అందిస్తామన్నారు. డీటీహెచ్ చానళ్లలోనూ ఆన్లైన్ కోర్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. యూజీసీలో సంస్కరణలకు శ్రీకారం చుడతామని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అక్రిడిటేషన్, ర్యాంకింగ్ల ఆధారంగా విద్యాసంస్థలకు గుర్తింపు, స్వయం పాలిత(అటానమస్) హోదా ఇవ్వనున్నట్లు తెలిపారు. 110 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు జార్ఖండ్, గుజరాత్లోఎయిమ్స్లు ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారు. మెడికల్ సైన్సెస్లో పీజీ సీట్లను పెంచుతామన్నారు. దేశవ్యాప్తంగా 600కుపైగా జిల్లాల్లో ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలను విస్తరింపజేస్తామని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందగోరే యువతకు సహకరించేందుకు 110 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. వొకేషనల్ విద్యకు రూ.2,200 కోట్లు కేటాయించారు. రూ.4,000 కోట్లతో స్కిల్ అక్విజిషన్, నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ ప్రోగ్రామ్(సంకల్ప్)ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తోలు, పాదరక్షల పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 10 ప్రపంచస్థాయి విద్యాసంస్థలు జాతీయస్థాయిలో డిజిటల్ లైబ్రరీని అభివృద్ధిపర్చాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యామిషన్లో భాగంగా ఐసీటీ కింద ఈ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, పరిశోధకులకు ఇది కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనివర్సిటీలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ హిమాలయన్ స్టడీస్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో 10 ప్రపంచస్థాయి విద్యాసంస్థలను నెలకొల్పనున్నారు. పరిశోధనలు చేసే ప్రొఫెసర్ల కోసం ప్రత్యేక కేటాయింపులు చేశారు. బడ్జెట్ హైలైట్స్ ► ‘టెక్ (టీఈసీ–ట్రాన్స్ఫామ్, ఎనరై్జస్,క్లీన్ ఇండియా)’ఎజెండాతో బడ్జెట్ ► రూ.2.5 లక్షలు–రూ.5 లక్షల మధ్య ఆదాయంపై పన్ను 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు ► రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఆదాయంపై 10 శాతం సర్చార్జీ విధింపు ► ఎల్ఎన్జీపై కస్టమ్స్ పన్ను 2.5 శాతానికి తగ్గింపు ► రాజకీయ పార్టీలకు రూ.2 వేలకు పైబడిన నగదు విరాళాలపై నిషేధం. కేవలం చెక్కులు, ఇతర డిజిటల్ రూపాల్లోనే స్వీకరించాలి ► ఆర్బీఐ ఆధ్వర్యంలో ఎలక్టోరల్ బాండ్ల జారీ ► వయోవృద్ధులకు ఆధార్ ఆధారిత ఆరోగ్య కార్డులు, కనీసం 8 శాతం రాబడినిచ్చే పథకం ► ఎఫ్డీఐలను ప్రోత్సహించేందుకు ‘ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ)’ రద్దు ► రైల్వే అనుబంధ సంస్థలైన ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీ, ఐఆర్సీఓఎన్లు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ ► డిజిటల్ పేమెంట్ల పర్యవేక్షణకు ‘పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు’ ఏర్పాటు ► ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రైల్వే భద్రతా నిధి ఏర్పాటు. ► రైల్వేల్లో అభివృద్ధి పనులకు రూ.1.31 లక్షల కోట్లు. ఇందులో కేంద్ర నుంచి రూ.55 వేల కోట్లు. ► స్థిరాస్తులపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను గడువు మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు ► ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.72,000 కోట్లు.. డిజిటల్ పేమెంట్లకు ప్రోత్సాహమిచ్చేలా పీవోఎస్ యంత్రాలు, ఐరిస్ రీడర్లపై పన్ను మినహాయింపు ► వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15.8 శాతం, పరోక్ష పన్నుల వసూళ్లు 8.3 శాతం పెరుగుతాయని అంచనా. ► మౌలిక సదుపాయాలపై పెట్టుబడి రూ.3.96 లక్షల కోట్లకు పెంపు.. రూ.2 వేల కోట్ల కార్ఫస్ ఫండ్తో డెయిరీ ప్రాసెసింగ్ ఫండ్ ఏర్పాటు ► మహిళా, శిశు సంక్షేమ పథకాలకు రూ.1.84 లక్షల కోట్లు.. గ్రామీణ, వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.87 లక్షల కోట్లు ► పేదలకు 2019 నాటికి కోటి గృహాల నిర్మాణం ► ఎస్టీలకు రూ.31,920 కోట్లు, మైనారిటీ వ్యవహారాలకు రూ.4,195 కోట్లు ► రైలు, రోడ్డు, నౌకాయాన రంగాలకు రూ.2.41 లక్షల కోట్లు ► దేశంలో బ్రాడ్బ్యాండ్ కవరేజీ విస్తృతి కోసం ‘భారత్ నెట్’ప్రాజెక్టుకు రూ.10,000 కోట్లు -
అడ్డగోలు విరాళాలకు ‘చెక్’
రాజకీయ పార్టీల విరాళాలపై కఠిన ఆంక్షలు రూ.2 వేలు దాటితే చెక్కు లేదా డిజిటల్ రూపంలో ఇవ్వాల్సిందే రిటర్న్స్ పత్రాల దాఖలు తప్పనిసరి తెరపైకి కొత్తగా ఎలక్టోరల్ బాండ్లు దాతలు బ్యాంకుల ద్వారా వాటిని కొనుగోలు చేసి.. పార్టీలకు ఇవ్వొచ్చు పార్టీకి, దాతకు ఐటీ నుంచి మినహాయింపు.. పారదర్శకత, జవాబుదారీతనం కోసమే: జైట్లీ న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇకపై ఇష్టారాజ్యంగా విరాళాలు తీసుకోవడం కుదరదు! రూ.2 వేలు దాటిన ప్రతి విరాళం ఇక ‘లెక్క’లోకి రానుంది. అంతకుమించితే కచ్చితంగా చెక్కు, డిజిటల్ రూపంలో లేదా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇవ్వా ల్సి ఉంటుంది. అలాగే ప్రతి పార్టీ ట్యాక్స్ రిటర్న్స్ పత్రాలు దాఖలు చేయడం తప్పనిసరి కానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం పార్లమెంట్కు సమర్పించిన బడ్జెట్లో ప్రకటించారు. పార్టీ విరాళాల్లో పారదర్శకత, నల్లధనం నిరోధానికి ఆయన ఈ చర్యలను ప్రతిపాదించారు. కొత్తగా ‘ఎలక్టోరల్ బాండ్స్’ను తెరపైకి తెచ్చారు. బ్యాంకుల ద్వారా బాండ్లు ‘‘ప్రస్తుతం ఒక వ్యక్తి రూ.20 వేల వరకు పార్టీకి విరాళంగా ఇవ్వొచ్చు. అయితే దీన్ని రూ.2 వేలకే పరిమితం చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. రూ.2 వేలకు మించితే దాతలు ఇకపై కచ్చితంగా చెక్కు లేదా డిజిటల్ రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది’’ అని జైట్లీ వివరించారు. ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసేందుకు కొత్త పథకం తెస్తామని, ఇందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టానికి సవరణలు చేస్తామని తెలిపారు. ‘‘పార్టీలకు విరాళం ఇవ్వాలనుకునే దాతలు చెక్కు లేదా డిజిటల్ రూపంలో బ్యాంకుకు సొమ్మును చెల్లించి ఈ ఎలక్టోరల్ బాండ్లను కొనుక్కోవాలి. ఈ సమయంలో వారిచ్చే సొమ్ము వైట్మనీ, క్లీన్మనీ అవుతుంది. ర్వాత వారు ఆ బాండ్లను రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చుకోవచ్చు. నిర్దిష్ట సమయంలోగా పార్టీలు వాటిని బ్యాంకులకు సమర్పించి తమ ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేసుకోవచ్చు’’ అని జైట్లీ వివరించారు. ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చామనే వివరాలు బయటకి పొక్కితే లేనిపోని తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తమ వివరాలు గోప్యంగా ఉంచుకోవాలనుకునే వారికి ఈ బాండ్లు ఒక ఉపకరణంగా ఉపయోగపడతాయి. తమ వివరాలు బయటకు తెలిసినా నష్టం లేదనుకునేవారు నేరుగా చెక్కు, డిజిటల్ పేమెంట్ల రూపంలో పార్టీలకు విరాళాలు చెల్లించవచ్చు. ‘‘ఎలక్టోరల్ బాండ్లపై దాత పేరు ఉండదు. విరాళం పొందిన పార్టీతోపాటు దాతకూ మినహాయింపు వర్తిస్తుంది. టాక్స్ రిటర్న్ దాఖలు చేసే సమయంలో ఈ మినహాయింపును పొందవచ్చు. పార్టీలు తమకు బాండ్లు ఎవరిచ్చారు? ఎన్ని బాండ్లు వచ్చాయన్న వివరాలను ఆ పత్రాల్లో పొందుపరచాలి. అప్పుడే పన్ను మినహాయింపు వర్తిస్తుంది’’ అని జైట్లీ స్పష్టంచేశారు. కొత్త విధానంతో ‘క్లీన్’ మనీ ఈ కొత్త విధానంతో రాజకీయ పార్టీల విరాళాల్లో పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందని, బ్లాక్మనీ నిరోధానికి కూడా తోడ్పడుతుందని జైట్లీ చెప్పారు. ఇప్పటిదాకా పార్టీలకు నగదు రూపంలోనే విరాళాలు అందుతున్నాయని, అందులో పారదర్శకత లోపించిందని చెప్పారు. తాజా విధానంలో దాతలు ఇచ్చే సొమ్ము, పార్టీలకు అందే సొమ్ము క్లీన్గా ఉంటుందన్నారు. లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారా జరుగుతాయి కాబట్టి అవన్నీ పారదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు. -
మోదీ గ్రామీన మంత్రం !
నోట్ల రద్దు (డీమోనిటైజేషన్)తో అల్లాడిన పల్లెవాసులను ప్రధాని నరేంద్ర మోదీ బడ్జెట్లో కనికరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడం కోసం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. కీలకమైన ‘ఫ్లాగ్షిప్’ పథకాలకు నిధుల కేటాయింపులను భారీగా పెంచారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి ఇదివరకెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నిధులను కేటాయించడం నోట్ల రద్దు ప్రభావం గ్రామీణ భారతావనిపై తీవ్రంగా ఉందన్న వాస్తవాన్ని తేటతెల్లం చేసింది. ఇక మోదీ ప్రతిష్టాత్మక పథకం.. స్వచ్ఛభారత్పై మరింత దృష్టిసారించారు. గ్రామీణ విద్యుదీకరణను వేగవంతం చేయడం... కోటి పక్కా ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం... రోడ్ల నిర్మాణాన్ని పరుగులు పెట్టించడం... వంటి చర్యల ద్వారా పల్లె వాసులను నోట్ల రద్దు ప్రభావం నుంచి గట్టెక్కించేందుకు బడ్జెట్లో ఆర్థిక మంత్రి జైట్లీ తీవ్రంగానే ప్రయత్నించారు. మొత్తంమీద 2019 నాటికి కోటి కుటుంబాలను దారిద్య్రరేఖ నుంచి పైకి తీసుకురావడం, 50,000 గ్రామ పంచాయతీలను పేదరిక రహితంగా మార్చేయడం తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణాభివృద్ధి శాఖకు మొత్తం కేటాయింపులు 2016–17లో రూ.97,760 కోట్ల నుంచి వచ్చే ఏడాదికిగాను రూ.1,07,758 కోట్లకు పెంచారు. 25 శాతం పెంపు ఉపాధికి ‘ధీమా’.. 2017–18 కేటాయింపులు 48,000 (రూ. కోట్లలో) 2016–17 కేటాయింపులు 38,500 (రూ. కోట్లలో) యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ కీలక పథకానికి మోదీ సర్కారు ఈ సారి నిధుల వర్షాన్ని కురిపించింది. 2016–17లో కేటాయించిన మొత్తాన్ని పూర్తిగా ఖర్చు చేయడమే కాకుండా.. 2017–18 ఏడాదికి ఏకంగా 25 శాతం కేటాయిపులు పెంచి... రికార్డు స్థాయిలో రూ.48,000 కోట్లకు చేర్చారు. నోట్ల రద్దు కారణంగా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్న పేదలకు ఇది కచ్చితంగా వరదాయకమే. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2005లో దీనికోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) కార్యరూపం దాల్చింది. 2008 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో ఇది అమలవుతోంది. గ్రామాల్లో మౌలిక వసతుల పెంపునకు ఈ పథకాన్ని మరింత సమర్ధంగా వినియోగించుకునే దిశగా క్రీడా ప్రాంగణాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం వంటివాటిని కూడా మోదీ ప్రభుత్వం దీనిలోకి చేర్చింది. ♦ ఈ స్కీమ్ ద్వారా వర్షాలపైనే ఆధారపడిన ప్రాంతాల్లో 5 లక్షల వ్యవసాయ చెరువులు, బావుల తవ్వకంతో పాటు సేంద్రియ ఎరువుల తయారీ కోసం 10 లక్షల కంపోస్టు గుంతలను ఏర్పాటు చేయడం వంటి లక్ష్యాలను మోదీ∙సర్కారు నిర్దేశించింది. ♦ అయితే, మార్చి 2017 నాటికి 10 లక్షల చెరువులను పూర్తిచేయనున్నామని.. 2017–18లో మరో 5 లక్షల వ్యవసాయ చెరువుల తవ్వకాన్ని చేపట్టనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ♦ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళల సంఖ్య 48 శాతం నుంచి ఇప్పుడు 55 శాతానికి చేరిందని చెప్పారు. ‘స్వచ్ఛ భారత్’కు దన్ను.. 55 శాతం పెంపు 2017–18 కేటాయింపులు 13,948 (రూ. కోట్లలో) 2016–17 కేటాయింపులు 9,000 (రూ. కోట్లలో) భారత్ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మోదీ 2014 అక్టోబర్ 2న ఈ స్వచ్ఛ భారత్ అభియాన్(ఏబీఏ) కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కోసం నిధులను సమకూర్చేందుకుగాను అర శాతం స్వచ్ఛ భారత్ సెస్తో పాటు... క్లీన్ ఎన్విరాన్మెంట్ సెస్ను కూడా వసూలు చేస్తున్నారు. ఈ పథకానికి కేటాయింపులు ఈసారీ 55 శాతం పెరిగాయి. ఇందులో రూ.1,395 కోట్లను ఈశాన్య రాష్ట్రాలు–సిక్కింలకు, రూ.3,069 కోట్లను దళితులకు(ఎస్సీ), రూ.1,395 కోట్లను గిరిజనులకు(ఎస్టీ)లకు కేటాయించనున్నారు. ♦ 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పారిశుధ్యాన్ని(సెప్టిక్ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం. ♦ దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఎస్బీఏ ప్రాజెక్టులో మొత్తం 9 కోట్ల టాయిలెట్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం. ♦ 2016–17లో 1.5 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 2016 డిసెంబర్ నాటికి 1.12 కోట్లు నిర్మితమయ్యాయి. రూ.6,917 కోట్లను ఖర్చు చేశారు. ♦ డిసెంబర్ నాటికి 66 జిల్లా, 702 బ్లాకులు, 56,769 గ్రామ పంచాయతీలు, 1,26,900 పల్లెల్లోని కుటుంబాలన్నీ సెప్టిక్ లెట్రిన్లనే ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ♦ గ్రామీణ భారత్లో పారిశుధ్య కవరేజీ 2014 అక్టోబర్లో 42 శాతంకాగా.. ఇప్పుడిది 60 శాతానికి పెరిగినట్లు జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన 2017–18 కేటాయింపులు 10,635 (రూ. కోట్లలో) 2016–17 కేటాయింపులు 8,500 (రూ. కోట్లలో) విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు... బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది. 2015 ఏప్రిల్ 1 నాటికి దేశంలో ఇంకా 18,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం మోదీ సర్కారు లెక్కగట్టింది. 2018 మే 1 నాటికల్లా దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైట్లీ ప్రకటించారు. తాజా బడ్జెట్లో గ్రామీణ విద్యుదీకరణకు రూ.4,814 కోట్లు... ఉచిత విద్యుత్ కనెక్షన్లు, ఫీడర్లను వేరుచేయడం వంటి స్కీమ్స్(ఐపీడీఎస్)కు రూ.5,821 కోట్లు చొప్పున కేటాయించారు. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్ఆర్డీడబ్ల్యూపీ) 2017–18 కేటాయింపులు 6,050 (రూ. కోట్లలో) 2016–17 కేటాయింపులు 5,000 (రూ. కోట్లలో) భారత్ నిర్మాణ్ ప్రోగ్రామ్లో భాగమైన ఈ పథకానికి మోదీ ప్రభుత్వం నిధులను అంతకంతకూ పెంచుతోంది. దేశంలో తాగునీటి సౌకర్యం లేని(అన్కవర్డ్) అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని(హ్యాండ్ పంపులు, పైపులు ఇతరత్రా మార్గాల్లో) అందించాలనేది ఈ పథకం లక్ష్యం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొన్ని నిధులు మంజూరవుతాయి. మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు వెచ్చించాలి. కాగా, నాలుగేళ్లలో 28,000 ఆర్సినిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనేది కూడా ఈ పథకంలో భాగంగా మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై). 53.3 శాతం పెంపు 2017–18 కేటాయింపులు 23,000 (రూ. కోట్లలో) 2016–17 కేటాయింపులు 15,000 (రూ. కోట్లలో) 2022 కల్లా దేశంలో అందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామంటున్న మోదీ సర్కారు.. ఈ బడ్జెట్లో చౌక గృహనిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2019 నాటికి ఇళ్లులేనివాళ్లు, పూరిళ్లలో ఉంటున్న వారికి ఒక కోటి పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబా లు, ఎస్సీ/ఎస్టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారి టీలు ఈ పథకంలో లబ్దిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి. మైదాన ప్రాంతాల్లో పేదలకు ఒక్కో ఇంటికి రూ.1.2 లక్షలు..., కొండ ప్రాంతాలు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రూ.1.3 లక్షల చొప్పున సాయాన్ని ఇస్తున్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా ప్రతి ఇంటికీ సెప్టిక్ మరుగుదొడ్డి నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు. పీఎంఏవై కిందకు రాని గ్రామీణ కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం, ఆధునీకరణకు తీసుకునే రుణాల్లో రూ.2 లక్షల వరకూ మొత్తంపై 3 శాతం వడ్డీ రాయితీని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్వై) 2017–18 కేటాయింపులు 19,000 (రూ. కోట్లలో) పెంపు లేదు 2016–17 కేటాయింపులు 19,000 (రూ. కోట్లలో) ♦ గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో అప్పటి వాజ్పేయి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పథకం ఇది. ♦ 2011–14 మధ్య రోజుకు సగటు రోడ్డు నిర్మాణం 73 కిలోమీటర్లు కాగా, 2016–17లో ఇది 133 కిలోమీటర్లకు జోరందుకుందని జైట్లీ పేర్కొన్నారు. ♦ 2021 నాటికి మిగిలిన 65,000 అర్హత గల గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించేందుకు దాదాపు 2.3 లక్షల కి.మీ. మేర రోడ్లను నిర్మించాలన్నదే లక్ష్యం దీన్ని 2019 నాటికే పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ♦ 2105–16; 16–17లో 10,894 రోడ్లను, 723 బ్రిడ్జ్లను(మొత్తం 44,947 కి.మీ) మంజూరు చేశారు. దీనికి అంచనా వ్యయం రూ.26,421 కోట్లు. ♦ ప్రస్తుతం 56,943 గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి ఎంపిక చేయగా.. 12,599 ప్రాంతాలకు ఇంకా నిధులు మంజూరు కావాల్సి ఉంది. 44,344 ప్రాంతాలకు నిధులు మంజూరయ్యాయి.. అనుసంధాన పక్రియ కొనసాగుతోంది. మొత్తం లక్ష్యంలో ఇంకా 1,77,523 కి.మీ. రోడ్లను నిర్మించాల్సి ఉంది. ♦ అయితే, తాజా బడ్జెట్లో దీనికి నిధుల కేటాయింపులను పెంచలేదు. అయితే, రాష్ట్రాల వాటాతో కలిపితే మొత్తం నిధులు రూ.27,000 కోట్లుగా జైట్లీ పేర్కొన్నారు. గ్రామీణ టెలిఫోనీ.. ♦ భారత్ నెట్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ (జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్–ఎన్ఓఎఫ్ఎన్) ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా గ్రామాల్లో మొబైల్స్ వినియోగాన్ని పెంచడం. 2017 నాటికి టెలీ డెన్సిటీని 70 శాతానికి చేర్చాలన్నది లక్ష్యం. ♦ టెలికం శాఖకు చెందిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిధి(యూఎస్ఓఎఫ్) నుంచి ఈ స్కీమ్కు ఫండ్స్ను అందిస్తున్నారు. ♦ ఈ ఏడాది ఒక్క భారత్ నెట్ కోసమే రూ.10,000 కోట్లను కేటాయించడం గమనార్హం. ♦ 2017–18 చివరినాటికి 1.5లక్షల గ్రామ పంచాయతీలకు ఓఎఫ్ఎన్ కింద హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని జైట్లీ పేర్కొన్నారు. ♦ డిజిటల్ టెక్నాలజీ ద్వారా టెలీ మెడిసిన్, విద్య, నైపుణ్యాల కల్పన కోసం ‘డిజిగావ్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. డిజిటల్ సేవల కోసం తక్కువ టారిఫ్లతో వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేయనున్నారు. 322 శాతం పెంపు 2017–18 కేటాయింపులు 11,636 (రూ. కోట్లలో) 2016–17 కేటాయింపులు 2,755 (రూ. కోట్లలో) గ్రామీణాభివృద్ధికి జోష్! న్యూఢిల్లీ దేశంలోని కోటి కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేయడమే లక్ష్యంగా తాజా బడ్జెట్లో గ్రామీణ రంగానికి కేంద్రం పెద్ద పీట వేసింది. 2019 నాటికి దేశంలోని 50 వేల గ్రామ పంచాయతీలను పేదరిక రహితంగా మార్చుతామని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన నాణ్యతను పెంచడమనేది రాజీ లేని ఎజెండా అని అరుణ్జైట్లీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా గ్రామీణ రంగానికి గణనీయ స్థాయిలో నిధులు పెంచడంతోపాటు వ్యవసాయం, ఉపాధి హామీ, గ్రామీణ రహదారులు, ఇళ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు, కీలక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారీగా నిధుల కేటాయింపు 2017–18 బడ్జెట్లో మొత్తంగా గ్రామీణ రంగానికి రూ.1,87,200 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 24 శాతం అధికం కావడం గమనార్హం. దేశ చరిత్రలో గ్రామీణ రంగానికి ఇదే అత్యధిక కేటాయింపు కూడా. ఇందులో ఒక్క గ్రామీణాభివృద్ధి శాఖకే రూ. 1,07,758 కోట్లు ఇచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రికార్డు స్థాయిలో రూ.48,000 కోట్లు కేటాయించారు. ఉపాధి హామీ పనులతో ఉత్పత్తికి తోడ్పడే ఆస్తుల కల్పన జరగాలని.. వ్యవసాయ ఉత్ప త్తులు, రైతుల ఆదాయం పెరగడానికి అది తోడ్పడాలని జైట్లీ పేర్కొన్నారు. 2019 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 2.23 లక్షల కిలోమీటర్ల రహదారులను నిర్మించి.. 65 వేల నివాస ప్రాంతాలను అనుసంధానిస్తామని ప్రకటించారు. గ్రామీణ మహిళల్లో సాధికారతను పెంపొందించడానికి మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పేదల కోసం 2019 నాటికి కోటి ఇళ్లను నిర్మిస్తామని జైట్లీ తెలిపారు. పీఎంఏవై ఇళ్ల పథకానికి కేటాయింపులను రూ.15 వేల కోట్ల నుంచి రూ.23 వేల కోట్లకు పెంచడంతోపాటు.. దీని కింద ఇచ్చిన రుణాల తిరిగి చెల్లింపు గడువును 15 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆర్సెనిక్, ఫ్లోరైడ్ బాధిత 28 వేల నివాస ప్రాంతాలకు వచ్చే నాలుగేళ్లలో సురక్షిత మంచినీటిని అందజేస్తామని వెల్లడించారు. 2022 నాటికి ఐదు లక్షల మందికి తాపీ పనిలో శిక్షణ ఇస్తామని అందులో.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే 20 వేల మందికి శిక్షణ ఇస్తామని జైట్లీ ప్రకటించారు. -
దండిగా వ్యవ'సాయం'
రైతులకు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ వరాలు అన్నదాతా... ఐదేళ్లాగాలా? ఏదైనా ఓకే! తిండిని డౌన్లోడ్ చెయ్యలేం కదా!! దాన్ని రైతు పండించాల్సిందే!! ఇది తెలిసే రైతు వాలెట్లో రెట్టింపు ఆదాయం వేస్తానన్నారు జైట్లీ. దానికి ఐదేళ్ళు కావాలన్నారు. మరి తొలి ఏడాదేం చేశారు? రుణాల లక్ష్యం 9 నుంచి 10 లక్షల కోట్లకు పెంచారు. కానీ ఇవ్వాల్సింది బ్యాంకులు కదా? సహకార సంఘాల నుంచి తీసుకునే రుణాలకు 60 రోజుల వడ్డీ రాయితీని అధికారికం చేశారు. ఇది ఏమాత్రం సరిపోతుందన్నది ప్రశ్నే. పంటల బీమా కింద కవరేజీ పెంచినా... బీమా సొమ్ము సకాలంలో అందుతుందా? భూసార పరీక్షలకు మినీ ల్యాబ్లు, సాగు నిధి, మైక్రో ఇరిగేషన్ నిధి... ఇవన్నీ అంది రైతు లాభపడాలంటే ఐదేళ్లు ఆగాల్సిందేనా? దేశంలోని రైతులు: 1 1.88 కోట్లు (రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 లెక్కల ప్రకారం) రైతులకు రూ.10 లక్షల కోట్ల రుణాలు వ్యవసాయం,అనుబంధ రంగాలకు రూ.58,663 కోట్లు ప్రధాని పంటల బీమా పథకానికి రూ.9 వేల కోట్లు సూక్ష్మ సేద్యానికి రూ.5,000 కోట్లు ఐదేళ్లలో అన్నదాతల ఆదాయం రెట్టింపు వ్యవసాయ రంగం వృద్ధిరేటు 4.1 శాతంగా అంచనా న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, అందుకు 2017–18లో అన్నదాతలకు రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. 2016–17 బడ్జెట్తో పోలిస్తే వ్యవసాయ రుణాలను రూ.లక్ష కోట్ల మేర పెంచినట్లు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను వ్యవసాయ, అనుబంధ రంగాలకు మొత్తంగా రూ.58,663 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. 2016–17లో ఇది రూ.52,821 కోట్లుగా ఉంది. వ్యవసాయ రుణాల్లో వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూకశ్మీర్లో ప్రత్యేక చర్యలు చేపడతామని జైట్లీ పేర్కొన్నారు. ఈసారి విస్తారంగా వర్షాలు కురవడంతో దేశంలో వ్యవసాయం పరిస్థితి ఆశాజనకంగానే ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం వృద్ధిరేటు 4.1 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఖరీఫ్, రబీలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. సాగుకు ఇంకేం ఇచ్చారంటే.. ► కిందటేడాది ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకానికి రూ.9 వేల కోట్లు కేటాయించారు. 2016–17లో ఈ పథకానికి రూ.13,240 కోట్లు కేటాయించడం గమనార్హం. పథకం పరిధిలోకి 2016–17లో 40% పంట భూములను, 2017–18కల్లా 50 శాతం పంట భూములను తెస్తామని జైట్లీ ప్రకటించారు ► రైతులకు సబ్సిడీ వడ్డీపై అందించే స్వల్పకాలిక రుణాలకు రూ.15 వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు ► సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు నాబార్డులో రూ.5 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు. నాబార్డులో ఇప్పటికే ఏర్పాటు చేసిన దీర్ఘకాలిక ఇరిగేషన్ ఫండ్ 20 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంపు ► పాడి పరిశ్రమకు ఊతమిచ్చేందుకు చర్యలు తీసుకుంటామని జైట్లీ చెప్పారు. డెయిరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్కు వచ్చే మూడేళ్లకుగాను రూ.8 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ► చిన్న, సన్నకారు రైతులు తేలిగ్గా రుణాలు పొందేందుకు వీలుగా 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్)ను జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ)కోర్ బ్యాకింగ్ వ్యవస్థతో అను సంధానిస్తామని జైట్లీ తెలిపారు. ఇందుకు మూడేళ్లలో రూ.1,900 కోట్లు వెచ్చించనున్నారు ► ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ–నామ్) వ్యవస్థ ప్రస్తుతం 250 మార్కెట్లలో అందుబాటులో ఉంది. దీన్ని 585 మార్కెట్లకు విస్తరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు జైట్లీ చెప్పారు. వీటిల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక్కో మార్కెట్కు రూ.75 లక్షల సాయం అందజేస్తామన్నారు. ► భూసార పరీక్షల కోసం దేశంలోని 648 కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో మినీ ల్యాబ్ల ఏర్పాటు. వీటికి అదనంగా.. స్థానికంగా ఉండే నిపుణులతో మరో వెయ్యి మినీ ల్యాబ్ల ఏర్పాటుకు చర్యలు ► పళ్లు, కూరగాయల సాగులో ‘కాంట్రాక్ట్ వ్యవసాయం’పై నమూ నా చట్టం తెస్తామని చెప్పారు. దీనిపై రాష్ట్రాల అభిప్రాయం కోరతామన్నారు ► ధరల స్థిరీకరణ నిధి(పీఎస్ఎఫ్)కి రూ.3,500 కోట్లు ► పంటలకు గిట్టుబాటు ధర దక్కని సమయంలో మార్కెట్ ధరల్లో జోక్యం చేసుకునేందుకు ఉద్దేశించిన పథకానికి రూ.200 కోట్లు ► విదేశాల నుంచి దిగుమతి అయ్యే ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి దేశీయ ఆహార పరిశ్రమను కాపాడేందుకు.. జీడిపప్పు(రోస్టెడ్ అండ్ సాల్ట్) దిగుమతిపై 30 శాతం ఉన్న కస్టమ్ డ్యూటీని 45 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ తెలిపారు గ్రామీణం, వ్యవసాయ రంగంపై బడ్జెట్లో ఫోకస్ పెరిగింది. ఇది మంచి పరిణామం. డిజిటైజేషన్, కొత్త సంస్కరణలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ లక్ష్యాన్ని సాధించేందుకు సూక్ష్మ సేద్యానికి రూ.5 వేల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించారు. మరింత భూమిని సాగుకు యోగ్యంగా మలిచేందుకు ఇది తోడ్పడుతుంది. – హర్ష కుమార్ భన్వాలా, నాబార్డ్ చైర్మన్ బడ్జెట్ స్థూలంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ, వ్యయపట్టిక. సర్కారు ఆర్థిక, విధాన పత్రం. ప్రజల నుంచి పన్నుల రూపేణా వసూలు చేసిన ధనాన్ని వారికోసం ఎలా వినియోగించబోతున్నారో వివరించే కార్యాచరణ ప్రణాళిక. మూలధన బడ్జెట్ మూలధన ఆదాయ, వ్యయ పట్టికగా చెప్పుకోవచ్చు. వార్షిక బడ్జెట్లో మూలధన బడ్జెట్తోపాటు రెవెన్యూ బడ్జెట్ కూడా ఉంటుంది. ప్రభుత్వానికి మూలధన ఖాతాలో వసూలయ్యే ఆదాయం, ఖర్చులు మూలధన బడ్జెట్లో ఉంటాయి. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ వసూళ్లు, ఖర్చులకు సంబంధించిన వివరాలు రెవెన్యూ బడ్జెట్లో ఉంటాయి. క్యాపిటల్ పద్దు (ప్రణాళికా వ్యయం) ప్రభుత్వం ఆదాయ వనరులను, ఆస్తులను సృష్టించుకునేందుకు చేసే వ్యయం ఇది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రణాళికలకు చేసే కేటాయింపులు ఇందులో ఉంటాయి. రెవెన్యూ పద్దు (ప్రణాళికేతర వ్యయం) ఉద్యోగుల జీతభత్యాలు, రక్షణ, పోలీసు వ్యవస్థల నిర్వహణ, ఎన్నికలు, కళలు, క్రీడలు, కుటుంబ సంక్షేమం, సమాచార ప్రసార, పర్యాటకం, కార్మిక సంక్షేమం, వ్యవసాయ రంగాలకు వెచ్చించే నిధులు, వడ్డీలు, రుణ చెల్లింపులు ఈ పద్దులోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ప్రణాళికేతర గ్రాంటులు కూడా ఈ ఖాతాలోనే ఉంటాయి. సంచిత నిధి అన్ని రకాల వసూళ్లు, ఆదాయాలు, రుణాల ద్వారా వచ్చిన సొమ్ము ఈ నిధి కింద జమ అవుతుంది. ఈ నిధి నుంచి ఖర్చు చేయడానికి పార్లమెంటు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో రెండు పద్దులుంటాయి. 1. రెవెన్యూ వసూళ్లు–రెవెన్యూ వ్యయం. 2. మూలధన వసూళ్లు–మూలధన వ్యయం. ప్రభుత్వ ఖాతా సంచిత నిధిలో జమయ్యే వసూళ్లు మినహా ప్రభుత్వం వద్దకు వచ్చే ఇతర అన్ని రకాల నిధులు ఈ ఖాతాలో జమ అవుతాయి. రిజర్వ్ బ్యాంకు నుంచి, పీఎఫ్ నుంచి తీసుకునే రుణాలను ఈ ఖాతా కింద ఖర్చు చేస్తారు. ఈ సొమ్మును మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది. రెవెన్యూ వసూళ్లు పన్నులు, సుంకాల ద్వారా వసూలయ్యే ఆదాయమే రెవెన్యూ వసూళ్లు. ఎగుమతి, దిగుమతి సుంకాలు (కస్టమ్స్), ఎక్సైజ్ డ్యూటీ, కార్పొరేట్ ట్యాక్స్, ఇతరత్రా పన్నుల రూపంలో వచ్చే సొమ్మంతా ఈ ఖాతాలోకే చేరుతుంది. ప్రభుత్వ పెట్టుబడులపై వడ్డీలు, డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం, ప్రభుత్వ సేవలపై వసూ లు చేసే చార్జీలు వీటి కిందకే వస్తాయి. రెవెన్యూ వ్యయం ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, బదిలీలపై చేసే ఖర్చును రెవెన్యూ వ్యయంగా పేర్కొంటారు. ఇది ప్రభుత్వానికి ఆస్తులను సృష్టించదు. రెవెన్యూ లోటు (REVENUE DEFICIT) రెవెన్యూ వసూళ్లు, వ్యయానికి మధ్య తేడా. ప్రత్యక్ష పన్నులు ప్రభుత్వానికి మనం నేరుగా చెల్లించే పన్నులు ఇవి. ఆదాయ పన్ను, సంపద పన్ను, ఫ్రింజ్ బెని ఫిట్ ట్యాక్స్ మొదలైనవన్నీ ఈ కోవలోకే వస్తాయి. పరోక్ష పన్నులు (REVENUE DEFICIT): మనం చేసే వ్యయాలపై పరోక్షంగా విధించే పన్ను. కస్టమ్స్,ఎక్సైజ్, సర్వీస్ టాక్స్లన్నీ దీని పరిధిలోకే వస్తాయి. స్వల్పంగా పెరిగిన సీబీఐ బడ్జెట్ న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 695.62 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే 8.31 శాతం పెంచింది. గత బడ్జెట్లో రూ. 727.75 కోట్లు కేటాయించగా.. సవరించిన అంచనాల్లో దానిని రూ. 642.24 కోట్లకు తగ్గించింది. ఈ మొత్తానికి మరో రూ. 53.38 కోట్లు ఎక్కువగా ఈసారి బడ్జెట్లో అరుణ్ జైట్లీ కేటాయించారు. -
తెలంగాణపై బడ్జెట్ ఎఫెక్ట్...
‘ఉపాధి’కి ఊతం ‘ఉపాధి’వేతన చెల్లింపులకు రూ.3,500 కోట్లు మంజూరయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకానికి కేంద్రం తాజా బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం రాష్ట్రంలో ఉపాధి పనులకు మరింత ఉత్సాహాన్నిచ్చేలా ఉంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లను కేంద్రం ప్రతిపాదించింది. గతేడాది కన్నా రూ.10 వేల కోట్లు అధికంగా కేటాయించడం పట్ల గ్రామీణాభివృద్ధి శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది. తాజా కేటాయింపుల నేపథ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుందని ఆ శాఖ సిబ్బంది చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీల వేతనాలకు రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తుండగా, వచ్చే ఏడాది రూ.3 వేల కోట్ల నుంచి రూ3,500 కోట్ల దాకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపాధి పనులను అధికంగా చేసే రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ 5వ స్థానంలో ఉన్నందున కేటాయింపులు అధికంగా రావొచ్చని చెబుతున్నారు. పనిదినాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఉపాధి హామీ పనుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచించడం గమనార్హం. నీటి సంరక్షణపైనే ఫోకస్! వచ్చే ఆర్థిక సంవత్సరంలో నీటి సంరక్షణపై ప్రధానంగా దృష్టి సారించి ఉపాధి హామీ పనులు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. వ్యవసాయ కుంటలు, కాంటూర్ ట్యాంక్స్, చెరువుల పూడికతీత.. తదితర నీటి సంరక్షణ చర్యలు చేపట్టనుంది. శాశ్వత ఆస్తుల కల్పనలో భాగంగా అంగన్ వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, సిమెంట్రోడ్డు, పాఠశాలల్లో కిచెన్ షెడ్స్, మరుగుదొడ్ల నిర్మాణ పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. – బి.సైదులు, జాయింట్ కమిషనర్ (ఉపాధిహామీ) సాగు ప్రాజెక్టుల రుణాలకు వెసులుబాటు కార్పస్ ఫండ్ పెంపుతో తగిన స్థాయిలో రుణాలు అందే అవకాశం సాక్షి, హైదరాబాద్: కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ సాగునీటి ప్రాజెక్టులకు చేయూత నిచ్చేలా ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. నాబార్డు కింద ఏర్పాటు చేసిన కార్పస్ ఫండ్ను రూ.20 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచనుండడంతో ఆ మేరకు రాష్ట్రాలకు రుణ వెసులుబాటు కలుగుతుందని పేర్కొంటున్నాయి. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై) కింద కేంద్రం గుర్తించిన 11 తెలంగాణ ప్రాజెక్టుల కోసం తగినన్ని రుణాలు తెచ్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నాయి. వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడం కోసం కేంద్రం గతేడాదే దీర్ఘకాలిక సాగునీటి నిధి (ఎల్టీఐఎఫ్) కింద రూ.20 వేల కోట్లతో కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేసింది. కానీ దేవాదుల, రాజీవ్ భీమా, ఎస్ఆర్ఎస్పీ రెండోదశ, నీల్వాయి, ర్యాలివాగు, మత్తడి వాగు, పాలెం వాగు, కొమ్రం భీమ్, జగన్నాథపూర్, పెద్దవాగు, గొల్లవాగు, వరద కాలువలకు ఎలాంటి రుణాలూ దక్కలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను కాళేశ్వరం కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చింది. ఈ కార్పొరేషన్ కు ఎఫ్ఆర్బీఎం పరిమితితో సంబంధం లేకుండా రూ.7,900 కోట్లు రుణాలు ఇవ్వాలని కోరగా.. నాబార్డు అంగీకరించింది కూడా. తాజాగా కార్పస్ ఫండ్ను పెంచడంతో కాళేశ్వరం కార్పొరేషన్ కింద రుణాలు తీసుకునే వెసులుబాటు దొరకనుంది. పీఎంకేఎస్వై కమిటీలో మంత్రి హరీశ్రావు సభ్యుడిగా ఉండటం సైతం రాష్ట్రానికి కలిసిరానుంది. హైదరాబాద్ ఐఐటీకి 75 కోట్లు గిరిజన వర్సిటీకి రూ.10 కోట్లు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఐఐటీకి ఎంప్లాయి అసిస్టెన్స్ ప్రోగ్రాం కింద రూ. 75 కోట్లు కేంద్రం బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించింది. విభజన చట్టం హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ట్రైబల్ యూనివర్సిటీ కోసం రూ. 10 కోట్లు కేటాయించింది. ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్లకు (ఈబీబీ) కేటాయించే ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా రాష్ట్రంలోని 317 ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మండలాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎ్ టీఏ) ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలను కూడా జేఈఈ మెయిన్ పరీక్ష ద్వారా చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారానే నిర్వహించనున్నారు. గర్భిణులకు రూ.15 వేల ప్రోత్సాహకం రాష్ట్ర ప్రభుత్వం యోచన.. కేంద్ర బడ్జెట్లో రూ.6 వేలు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకుంటే రూ.15 వేలు ప్రోత్సా హకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు రూపొందిస్తున్నాయి. బుధవారం కేంద్రం తన బడ్జెట్లో గర్భిణులకు రూ. 6 వేలు కేటాయించింది. అంటే కేంద్రం నుంచి రూ.6వేలు వస్తే... రాష్ట్రం రూ.9 వేలు కేటాయిస్తే సరిపోతుంది. గర్భిణులకు ఇంత భారీగా ప్రోత్సాహకం అందించే రాష్ట్రం మనదే కానుండటం గమనార్హం. ఇప్పటి వరకు రాష్ట్రంలో గర్భిణులకు రూ. వెయ్యి ప్రోత్సాహకంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా 347 డెలివరీ పాయింట్లు... రాష్ట్రంలో గుర్తించిన 347 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లో ప్రత్యేకంగా కాన్పు కోసం డెలివరీ పాయింట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని 24 గంటలూ పనిచేసే ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతారు. ముగ్గురు వైద్యులు, ఆరుగురు నర్సులు, ప్రత్యేక డెలివరీ గదులను అందుబాటులోకి తీసుకొస్తారు. తద్వారా గర్భిణులను ప్రభుత్వాసుపత్రులకు వచ్చేలా కృషి చేయాలని నిర్ణయించారు. ఉపకారానికి చేయూత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమానికి నిధులు సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్డెట్లో విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వనున్నట్లు ప్రకటిం చారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పాఠశాల (ప్రీమెట్రిక్) విద్యార్థులకు సైతం ఉపకార వేతనాలు అందనున్నాయి. మోదీ ప్రభుత్వం తొలిసారిగా గిరిజన పాఠశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తోంది. ఇందులో భాగంగా 2017–18 వార్షిక బడ్జెట్లో నిధుల కేటాయింపులను రెట్టింపు చేసింది. ఉపకార వేతనాల కింద మైనార్టీ సంక్షేమానికి రూ.1500 కోట్లు, ఎస్సీ సంక్షేమం కింద రూ.3,397 కోట్లు, బీసీ విద్యార్థుల కోసం 1,027 కోట్లు, గిరిజన సంక్షేమం కింద రూ.1,612.07 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో బీసీ విద్యార్థులకు పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు ఉపకారవేతనాలు దక్కనున్నాయి. -
ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఏదీ?
కేంద్ర బడ్జెట్పై వైఎస్ఆర్సీపీ నేత కొలుసు పార్థసారథి మండిపాటు సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన 2017–18 కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను పూర్తిగా నిరాశ పరిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థ సారథి విమర్శించారు. జార్ఖండ్, బిహార్ గురించి మాట్లాడిన జైట్లీ.. హోదా కోసం ఉద్యమించిన ఏపీ ప్రస్తావన తేకపోవడం దారుణమని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించక పోవడం దారుణమన్నారు. అమరావతికి రైల్వే లైన్ల విషయం కూడా లేదన్నారు. రైతులకు వడ్డీలేని రుణాలు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా పావలా వడ్డీకే రుణా లు ఇస్తామని చెప్పక పోవడం దురదృష్టకరమన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచినా, రాష్ట్రంలో ఈ పథకం దుర్వినియోగం అవుతోందన్నారు. అంకెల గారడీ..: మోదీ ప్రధాని అయ్యే నాటికి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 183.5గా ఉంటే నవంబర్ 2016 నాటికి 181.2కు పడిపోయిందని పార్థసారథి వివరించారు. 2015–16లో రూ.35.41 లక్షల కోట్లు ఉన్న గ్రాస్ ఫిక్స్డ్ కేపిటల్ ఫార్మేషన్ 2016–17లో రూ.35.30 లక్షల కోట్లకు తగ్గిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో జీడీపీ 7.1 శాతం నమోదు అయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది కేవలం అంకెల గారడీగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారన్నా రు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పతనం కావ డం వల్ల 17 శాతం రెవెన్యూ పెరిగిందే తప్ప అది ప్రభుత్వ గొప్పదనం కాదని చెప్పారు. బడ్జెట్ బాగుందని బల్లలు చరిచిన టీడీపీ నేతలకు ఏం కనిపించిందో అర్థం కావడం లేదన్నారు. వీరి వల్లే ప్రత్యేక హాదాకు బ్రేక్ పడిందన్నారు. -
దేశాన్ని నవ్యపథంలో నడిపిస్తుంది
కేంద్ర బడ్జెట్ను స్వాగతించిన ఏపీ సీఎం సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్ దేశాన్ని నవ్య పథంలో నడిపిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలు అతిపెద్ద ఆర్థిక సంస్కరణలని, అవి దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతాయని చెప్పారు. దేశానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా బడ్జెట్ను రూపొందించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను ఆయన అభినందించారు. బుధవారం రాత్రి విజయవాడలోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో భూసమీకరణ విధానంలో 35 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు రెండేళ్లపాటు కేపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపును ఇచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీతోనే ప్రయోజనం ప్రత్యేక హోదాతో సమానమైన ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని.. అందుకే స్వాగతించానని చెప్పారు. కొందరు ప్రత్యేక హోదా వల్ల ఏదో ఒనగూరుతుందని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించేలా మంత్రివర్గంలో తీర్మానం చేసి, విభాగాల వారీగా జీవోలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు. దేశంలో బ్రిటిషు వాళ్లు వేగంగా రైల్వే మార్గాలు వేస్తే.. ఇండియన్ రైల్వే నినాదాలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. పార్టీలను అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నారు.. దేశంలో కొన్ని రాజకీయపార్టీలను పార్టీ ఫండ్ల కోసమే ఏర్పాటు చేశారని.. వాటిని అడ్డంపెట్టుకుని దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ సభ్యత్వాల ద్వారా నిధులు సేకరిస్తుందన్నారు. పోలవరానికి ప్రత్యేకంగా నిధులివ్వలేదు కేంద్ర బడ్జెట్లో పోలవరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని, అయితే నాబార్డు ద్వారా ఇప్పటికే రూ.1,981 కోట్ల రుణం మంజూరు చేశారన్నారు. -
బడ్జెట్లో క్రీడలకు రూ. 1,943 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో క్రీడలకు కాస్త ప్రాధాన్యతను పెంచింది. బుధవారం ప్రకటించిన బడ్జెట్లో 2017–18 ఆర్థిక సంవత్సరానికి క్రీడల అభివృద్ధి కోసం రూ. 1,943 కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్తో పోలిస్తే ఇది రూ. 350 కోట్లు ఎక్కువ కావడం విశేషం. ఇందులో జాతీయ స్థాయి శిక్షణ శిబిరాల నిర్వహణకు రూ. 481 కోట్లు, క్రీడా సమాఖ్యలకు రూ. 302 కోట్లు ఇస్తారు. ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి కూడా భారీగా రూ. 350 కోట్లు కేటాయించారు. అయితే మరికొన్ని కీలక అంశాలకు ప్రభుత్వం చాలా తక్కువ మొత్తం కేటాయించింది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ క్రీడల అభివృద్ధి పథకానికి నిధులను రూ. 5 కోట్ల నుంచి తగ్గించి రూ. 2 కోట్లే ఇవ్వగా... దేశంలో క్రీడా ప్రతిభను గుర్తించి, తీర్చిదిద్దేందుకు అధమంగా కేవలం రూ. 50 లక్షలు మాత్రం ప్రభుత్వం ఇవ్వనుంది. -
ఏపీకి రిక్త హస్తమే!
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం విభజనచట్టంలోని హామీల ప్రస్తావనేదీ? రాజధాని నిర్మాణానికి నిధులు సున్నా బడ్జెట్ ప్రసంగాన్ని బల్లలు చరిచి స్వాగతించిన టీడీపీ ఎంపీలు సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం భారీ రెవెన్యూ లోటులో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలాంటి ఊరట కలిగించలేదు. అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇక రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీల ప్రస్తావన అసలే లేదు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయడం, రెవెన్యూ లోటు భర్తీ వంటి ముఖ్యమైన హామీలను సైతం ఈ బడ్జెట్లో విస్మరించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల ఏర్పాటుకు నిర్దిష్ట కేటాయింపులు జరపలేదు. మిగిలిన మెట్రోల్లో కలిపి కేటాయింపులు చూపారు. బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగినా అధికార టీడీపీ ఎంపీలు ఒక్కరు కూడా నిరసన తెలిపిన దాఖలాలు లేవు. పైపెచ్చు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ బల్లలు చరచడం పట్ల వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి కొత్త సంస్థలేవీ? కనీసం అప్పులు చేసేందుకు కూడా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం(ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను సడలించలేదు. అలాగే 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రూ.16,000 కోట్ల రెవెన్యూ లోటులో ఇప్పటివరకు కేవలం రూ.4,000 కోట్ల మాత్రమే కేంద్రం భర్తీ చేసింది. మిగతా రూ.12 వేల కోట్ల లోటు భర్తీపై కేంద్ర బడ్జెట్లో ప్రస్తావిస్తారని ఆశించినప్పటికీ నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కొత్తగా సంస్థలను, ఆర్థిక సాయాన్ని ప్రకటించలేదు. పన్ను రాయితీలు, ప్రోత్సాహకాల పరిధిని పెంచాలన్న డిమాండ్పై బడ్జెట్లో పరిష్కారం చూపలేదు. జాతీయస్థాయి విద్యాసంస్థల నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు కావాల్సి ఉన్నప్పటికీ అరకొరగా నిధులు విదిల్చారు. ప్రత్యేక హోదాకు మంగళం! కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. పదేళ్లు కావాల్సిందేనని బీజేపీ నేతలు, పదిహేనేళ్లు ఇవ్వాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. తాము వస్తే అలా ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ప్రత్యేక హోదా మాత్రం పత్తా లేకుండా పోయింది. హోదా సాధన కోసం రాష్ట్రంలో ప్రజా పోరాటాలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో దాని గురించి ఏదైనా ప్రకటన చేస్తారని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. అయినా టీడీపీ నాయకులు నోరుమెదపక పోవడం గమనార్హం. ఏపీకి హోదా కంటే ప్యాకేజీ మేలన్న చంద్రబాబు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో కేంద్రం దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కనిపించని ‘ప్రత్యేక ప్యాకేజీ’ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు పూర్తిగా సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నిధులు మాత్రం ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. ఈ బడ్జెట్లో రాజధాని నిర్మాణం ఊసే లేకుండా జాగ్రత్తపడ్డారు. రాష్ట్ర ప్రజలు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న విశాఖ రైల్వే జోన్ ఊసూ లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావనే కనిపించలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నిధుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. -
ఒకింత మోదం.. మరింత ఖేదం
అరుణ్ జైట్లీ ఆశల బడ్జెట్ గ్రేటర్ సిటీజన్లకు ఒకింత మోదం.. మరింత ఖేదం మిగిల్చింది. బుధవారం నాటి కేంద్ర బడ్జెట్ వేతనజీవుల అంచనాలను పూర్తిగా నిజం చేయలేకపోయింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచుతారనుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. తాజా బడ్జెట్తో మహానగరంలో ఇక విందు, వినోదం, విమానయానం భారంగా పరిణమించనుంది. స్మార్ట్ ఫోన్లు, కార్లు, బైకుల ధరలు పెరిగే అవకాశం ఉండడంకుర్రకారుతోపాటు మధ్యతరగతికి ఇబ్బందిగా మారింది. ఇక ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారీ సిగరెట్లు, పాన్మసాలాలు, పొగాకు ఉత్పత్తులు, మద్యం ధరలు పెరగడం పెద్దగా ఆశ్చర్యపర్చలేదు. ఐటీ రంగంతోపాటు..స్టార్టప్లు..సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పలు రాయితీలు ప్రకటించడంతో ఆయా సంస్థలు సిటీకి వెల్లువెత్తనున్నాయి. ఎన్నో ఆశించిన నగరవాసిని అరుణ్జైట్లీ బడ్జెట్ నిరాశ పరిచింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచుతారనుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు జల్లింది. మూడు నుంచి ఐదు లక్షల మధ్య ఆదాయం ఉండే వారికి కేవలం ఐదుశాతం పన్నుతో సరిపెట్టడం గుడ్డిలో మెల్ల. కాస్మొపాలిటన్ నగరంగా మారిన మహానగరంలో తాజా బడ్జెట్తో విందు, వినోదం, విమానయానం భారం కానుంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, స్మార్ట్ఫోన్ల ధరలు ప్రియం కానుండడం యువత జేబులకు చిల్లులు పడడం తథ్యమన్న సంకేతాలు వెలువడ్డాయి. కార్లు, బైక్ల ధరలు పెరగడం మధ్యతరగతి వర్గానికి చేదువార్త. ఔషధాలు, మెడికల్ ఉపకరణాల ధరలు తగ్గడంతో అందరికీ వైద్యం అందుబాటులోకి రానుండడం ఆనందిచదగ్గ విషయం. సిగరెట్లు, పాన్ మసాలాలు, పొగాకు ఉత్పత్తులు, మద్యం ధరలు పెరగడం పొగ, మందుబాబుల జేబుకు చిల్లు తప్పదు. ఐటీరంగంతో పాటు.. స్టార్టప్లు.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రాయితీలు ప్రకటించడంతో కొత్త పరిశ్రమలకు గ్రేటర్ నగరం కేరాఫ్ అడ్రస్గా మారనుంది. సీసీటీవీల ధరలు దిగిరానుండడంతో నగరంలో ప్రతి ఇల్లు, కార్యాలయం ఆవరణలో నిఘాకు మార్గం సుగమమైంది. ఇక కుర్రకారు అమితంగా ఇష్టపడే వై–ఫై సేవలందించే రూటర్ల ధరలు తగ్గే అవకాశాలుండడంతో ఆన్లైన్, ఇంటర్నెట్, సోషల్ మాధ్యమాలు వినియోగించేవారిలో జోష్ పెంచింది. మరోవైపు బ్రాండెడ్ దుస్తులు, కాస్మోటిక్స్ ధరలు పెరగడం మింగుడు పడని అంశం. చిన్న గృహాలకు తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీలు ప్రకటించడం వేతనజీవులు, మధ్యతరగతి వర్గానికి ఊరటనిచ్చే అంశం. – సాక్షి, సిటీబ్యూరో ► జైట్లీ బడ్జెట్ నగరవాసి ఆశలపై నీళ్లు ► కార్లు, బైక్లు, ఫోన్లు ప్రియం ► విందు వినోదం భారం ► దిగిరానున్న ఔషధ ధరలు -
వ్యవ‘సాయం’ అంతంతే
- వేరుశనగకు వర్తించని ఫసల్బీమా.. రైతుల్లో నిరాశ – కంప్యూటరీకరణతో సొసైటీల్లో పారదర్శక సేవలు – కేవీకేలో ల్యాబ్ల ద్వారా మట్టి, నీటి పరీక్షలు మేలు – 60 రోజుల్లో రుణాలు చెల్లించడం జిల్లాలో కష్టసాధ్యమే – జిల్లాకు సూక్ష్మసాగు విస్తరణ అవసరమంటున్న రైతులు ---------------------------- అనంతపురం అగ్రికల్చర్ : కేంద్ర బడ్జెట్ ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి కలిగే మేలు అంతంత మాత్రమేనని విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర బడ్జెట్లో ఫసల్బీమా యోజనను 30 నుంచి 40 శాతానికి పెంచినప్పటికీ దీనివల్ల జిల్లాకు పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. జిల్లాలో వేరుశనగకు వర్తింపజేయకపోవడమే ఇందుకు కారణం. జిల్లాలో ఏటా 6 నుంచి 7 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ సాగవుతోంది. ఖరీఫ్లో 90 శాతం విస్తీర్ణం కేవలం వేరుశనగ వేస్తున్నారు. ఏటా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట 80 నుంచి 90 శాతం తుడిచిపెట్టుకుపోతోంది. పెట్టిన పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి. జిల్లా రైతులు వేరుశనగ సాగువల్ల రూ.3 వేల నుంచి రూ.3,500 కోట్ల వరకు నష్టపోతున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో గ్రామం యూనిట్గా అమలు చేసిన పంటల బీమా పథకం ద్వారా రైతులకు ప్రయోజనం కలిగింది. పంట నష్టం జరిగిన ప్రతీ సంవత్సరం పారదర్శకంగా నష్టపరిహారం అందినట్లు నివేదికలు చెబుతున్నాయి. కేవలం 2008 ఖరీఫ్కు సంబంధించి పంట దారుణంగా నష్టపోగా... రూ.640 కోట్ల వరకు పంట నష్ట పరిహారం ఇవ్వడంతో రైతులకు న్యాయం జరిగింది. అయితే త్రెష్హోల్ట్ఈల్డ్, ఇండెమ్నిటీ అనే నిబంధనలు పరిహారానికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయని 2011లో గ్రాయం యూనిట్గా అమలు చేస్తున్న పంటల బీమా పథకాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో కొత్తగా వర్షాధార వాతావరణ బీమా పథకాన్ని అమలులోకి తెచ్చారు. 2011 నుంచి ఏటా పంట దారుణంగా నష్టపోతున్నా ఒక్క సంవత్సరం కూడా రైతులకు న్యాయం జరగలేదు. అడ్డగోలు నిబంధనలు, సవాలక్ష షరతుల వల్ల వాతావరణ బీమా ద్వారా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2016 ఖరీఫ్ నుంచి కొత్తగా ప్రధానమంత్రి ఫసల్బీమా యోజనాను అమలులోకి తెచ్చింది. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వేస్తున్న వేరుశనగ పంటకు వర్తింపజేయలేదు. ఈ క్రమంలో ఫసల్బీమా ద్వారా జిల్లాలో కనీసం వేయి మంది రైతులకు కూడా ప్రయోజనం దక్కడం లేదు. ఈ ఏడాదైనా ఫసల్బీమా వర్తింపజేస్తారని ఆశించినా కేంద్ర ఆర్థిక మంత్రి అడియాసలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ------------------ డెయిరీపై ఆశలు లేనట్లే! రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఏపీ డెయిరీ)పై చంద్రబాబు సర్కారు శీతకన్ను వేయడంతో జిల్లాలో ప్రభుత్వ డెయిరీ నిర్వీర్య దశకు చేరుకుని నష్టాల్లో పయనిస్తోంది. అనంతపురం, హిందూపురంలో లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నా... ఇపుడు రోజుకు 30 నుంచి 32 వేల లీటర్లు మాత్రమే సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రైవేట్ డెయిరీలను ప్రోత్సహిస్తుండడంతో రైతులు వాటిపై మొగ్గు చూపుతున్నారు. 2013, 2014 సంవత్సరం జనవరి నెలల్లో ప్రభుత్వ డెయిరీ రోజు వారీ 65 వేల లీటర్ల వరకు పాలు సేకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. టీడీపీ సర్కారు వచ్చిన తర్వాత పాల సేకరణ తగ్గింది. 20 వేల మంది రైతుల సంఖ్య ప్రస్తుతం 9 వేల మందికి పడిపోయింది. గతంలో ప్రతి 15 రోజులకోసారి క్రమం తప్పకుండా రూ.3 కోట్లకు పైగా పాల బట్వాడా చేస్తుండగా ఇపుడు నెలల తరబడి బకాయిలు పేరుకుపోతున్నాయి. ------- 60 రోజుల్లో రుణాల చెల్లింపు కష్టమే ‘అనంత’లో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి 60 రోజుల్లోపు చెల్లించి వడ్డీ రాయితీ పొందడం అనేది అసాధ్యంగానే కనిపిస్తోంది. ఖరీఫ్, రబీ పంటలు దారుణంగా దెబ్బతింటూ అప్పుల్లో కూరుకుపోతున్న రైతులు పంట రుణాలు ఏడాది లోపు చెల్లించడమే భారంగా పరిణమిస్తోంది. కనీసం వడ్డీ కూడా చెల్లించలేక, రుణాలను రెన్యువల్ కూడా చేసుకోలేని దయనీయ పరిస్థితి. బంగారు నగలు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేక వాటిని వేలాలకు వదిలేస్తున్నారు. కేవలం 60 రోజుల్లో చెల్లించడం అనేది ‘అనంత’ రైతులకు తలకు మించిన భారమే. కనీసం ఆరు నెలల గడువు ఇచ్చినా కొందరికైనా కొంత ప్రయోజనం కలిగేఽది. ------ పంట రుణాల పెంపుతో కొంత లబ్ధి పంట రుణాల పంపిణీకి పెద్దపీట వేసినట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించడంతో కరువు జిల్లా రైతులకు కొంత ఊరట కలిగే అంశం. సన్న, చిన్న కారు రైతుల్లో 40 శాతం మందికి రుణాలు అందడం గగనంగా మారింది. ఈ ఖరీఫ్లో 5.70 లక్షల మంది రైతులకు రూ.4,404 కోట్లు పంట రుణాలు పంపిణీ చేశారు. రబీలో 1.05 లక్షల మందికి రూ.750 కోట్లు పంట రుణాలు ఇవ్వాల్సివుండగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రూ.200 కోట్లుకు మించి ఇవ్వలేదు. చాలా మంది చిన్న సన్న కారు రైతులకు రుణాలు అందకపోవడం, వారు బంగారు నగలు తాకట్టు పెట్టి రుణాలు ఎక్కువ తీసుకుంటున్న నేపథ్యంలో... పంట రుణాలకు కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వడంతో కొంత వరకు న్యాయం జరగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ----------------------- కేవీకేల్లో మినీల్యాబ్లు లాభం జిల్లా కేంద్రంలో ఒకటి, పెనుకొండ, ధర్మవరం లలో రెండు మాత్రమే పరీక్షా కేంద్రాలు ఉండడంతో మట్టి, నీటి పరీక్షలు చేయించుకోవడం లక్షలాది మంది రైతులకు కష్టంగా మారింది. కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకే)లో మినీల్యాబ్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్లో పేర్కొనడం రైతులకు లాభించే అంశఽం. జిల్లాలో బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి, కళ్యాణదుర్గంలో ఉన్న కేవీకేలలో మినీల్యాబ్లు ఏర్పాటు చేస్తే రైతులకు ఉపయోగం ------------------- కంప్యూటరీకరణతో సొసైటీల్లో సత్వర సేవలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ను కంప్యూటరీకరణ చేస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటించడంతో జిల్లాలో కొంత మెరుగైన సేవలు అందవచ్చు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలో 104 సొసైటీలు ఉండగా... మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిధిలో 16 సీడెడ్ సొసైటీలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో కణేకల్లు, కనగానపల్లి, మడకశిర, రుద్రంపేట సొసైటీల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అందజేస్తున్న కంప్యూటరీకరణ సేవలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు డీసీసీబీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ------------------- సూక్ష్మసాగు విస్తరణ అత్యవసరం వర్షాభావ పరిస్థితులు, భూగర్భాజలాలు అడుగంటి రుబావులు ఎండిపోవడంతో జిల్లా వ్యాప్తంగా పట్టు, పండ్లతోటలతో పాటు వ్యవసాయ పంటలు కూడా దెబ్బతినే పరిస్థితి. చీనీ, మామిడి, దానిమ్మ, సపోటా, ద్రాక్ష లాంటి దీర్ఘకాలిక పండ్లతోటలు ఉండటంతో భూగర్భజలాలు అడుగంటిపోతే రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది. డ్రిప్, స్ప్రింక్లర్లు సకాలంలో అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సూక్ష్మసాగుకు ప్రాధాన్యత ఇవ్వడంతో కొంత ప్రయోజనం కలిగే పరిస్థితి నెలకొంది. -
మొదటిసారి మనకు కేపిటల్ గెయిన్స్ ఇచ్చారు
-
బడ్జెట్ పై బాలీవుడ్ ఏమంది?
ముంబై: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన 2017-18 ఆర్థిక బడ్జెట్ పై బాలీవుడ్ నెగిటివ్ గా స్పందించింది. ప్రస్తుత ఆర్థిక బడ్జెట్ లో ఎలాంటి చిత్రపరిశ్రమకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడాన్ని తప్పుబట్టింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా, భారీ ఉద్యోగాల కల్పించే కీలకరంగంగా ఉన్న బాలీవుడ్ ను పట్టించుకోలేదని విమర్శించారు. బడ్జెట్ పై స్పందించిన బీ టౌన్ ప్రముఖులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఏడాది బడ్జెట్ నుంచి బాలీవుడ్ ను పక్కన పెట్టినట్టుగా భావించారు. తమ రంగానికి ఎలాంటి సహాయం. భారీ పన్నులనుంచి సడలింపు లేకుండానే ముగిసిందని వ్యాఖ్యానించారు ముఖ్యంగా ప్రముఖ నిర్మాత ముఖేష్ భట్ దీనిపై విచారం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ గురించి కనీస ప్రస్తావనకూడా లేకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పైరసీ భూతంపై మాట్లాడకపోవడం తమను బాధించిందన్నారు. మరో నిర్మాత కునాల్ కోహ్లీ ముఖేష్ కు మద్దతుగా నిలిచారు. బడ్జెట్ లో చలన చిత్ర రంగాన్ని చేర్చకపోవడం విచారంగా ఉందన్నారు. అంగీకరించారు.పార్లమెంటు లో సభ్యులుగా సినీరంగ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంటు లోను ప్రభుత్వంలోను తమకు ప్రతినిధులుగా ఉన్న సభ్యులు దీనిపై మాట్లాడాలన్నారు. చిత్రపరిశ్రమ ప్రధాన ఆదాయ వనరుగా ఉందనీ, ఉద్యోగాల కల్పనలో ను కీలక పాత్ర పోషిస్తోందని ఆయన గుర్తు చేశారు. వినోద పన్నువిధింపులో రాష్ట్నానికి మధ్య రాష్ట్రానికి మధ్య తేడాలున్నాయనీ, మొత్తం చలన చిత్రపరిశ్రమకు యూనిఫారం టాక్స్ సిస్టం ఉండాలని అభిప్రాయపడ్డారు. అలాగే మిగిలిన దేశాలు ఇస్తున్నట్టుగా విదేశాల్లో షూటింగ్ నిమిత్తం కేంద్రం కూడా సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి సబ్సిడీ ఇస్తోందని తన ట్విట్ లో పేర్కొన్నారు. మరోవైపు గాయకుడు, సంగీత దర్వకుడు విశాల్ దొడ్లాని బడ్జెట్ పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వ చర్య ఆకట్టుకుందన్నారు. వరుస ట్వీట్లను చేసిన ఆయన ఎగువ మధ్య తరగతి పన్ను మినహాయింపులేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇదేం బడ్జెట్!
-
బడ్జెట్పై వామపక్షాలు గరంగరం
-
బడ్జెట్పై శివసేన స్పందన
ముంబై: 2017-18 ఆర్థిక బడ్జెట్ పై శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్ పై స్పందించిన బీజేపీ సోదర సంస్థ శివసేన అధినేత ఉధ్దవ్ థాకరే మరోసారి మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఈ ఆర్థిక బడ్జెట్ లో ప్రజల ఆకాంక్షలను కేంద్రం అందుకోలేకపోయిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినపుడు అచ్ఛే దిన్ తీసుకొస్తామని వాగ్దానం చేశారని.. కానీ. ఎక్కడ ఆ అచ్ఛే దిన్ అని థాకరే ప్రశ్నించారు. చ్ఛే దిన్ గురించి ప్రభుత్వం ఇపుడు ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజలకు అనేక కష్టాలనెదుర్కొన్నారని థాకరే మండిపడ్డారు. డీమానిటైజేషన్ తరువాత ఉగ్రదాడులు తగ్గుముఖం పడతాయని కేంద్రం చెప్పిందనీ, అయితే టెర్రరిస్టుల దాడులు తగ్గకపోగా ..మరింత పెరిగాయని ఆయన ఆరోపించారు. అలాగే కేంద్ర మంత్రి మనోహరి పారికర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించిన థాకరే వాస్తవాలను వాస్తవాలుగానే చూడాలన్నారు. ఏ రుజువు లేకుండా ఎవరూ అలాంటి విషయాలను చెప్పరని వ్యాఖ్యానించారు. బుధవారం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. -
‘రైల్వేలో మనకు మంచి వాటా దక్కింది’
హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన బడ్జెట్లో రైల్వేలకు చేసిన కేటాయింపుల్లో దక్షిణ మధ్య రైల్వేకు వాటాలు పెరిగాయని జీఎం వినోద్ కుమార్ చెప్పారు. పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఆయన బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ వివరాలు తెలియజేస్తూ 2017-18దక్షిణ మధ్య రైల్వే-తెలంగాణ బడ్జెట్ రూ.1,729 కోట్లు అని, అలాగే, ఏపీ బడ్జెట్ రూ.3,406కోట్లు అని తెలిపారు. బల్లార్షా-కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్ ఏర్పాటు చేయనున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. యాత్రికులు, పర్యాటకులకోసం ప్రత్యేక రైళ్లు ఉంటాయని చెప్పారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణలతో దక్షిణ మధ్య రైల్వే జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తామని, వచ్చే ఏడాది సికింద్రాబాద్, విజయవాడ స్టేషన్లు మరింత ఆధునీకరిస్తామని చెప్పారు. 20 స్టేషన్లలో 34 లిఫ్ట్లు, ఎస్కలేటర్లను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్లో కోచ్ మిత్ర సదుపాయాలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో చెత్త శుద్ధి కేంద్రం పెడతామన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2ను 2018కల్లా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తిరుపతి నుంచి జమ్ము వరకు హమ్ సఫర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఉంటుందని, విశాఖ నుంచి విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్ ప్రెస్ నడుస్తాయని చెప్పారు. వెయిట్ లిస్టింగ్ ప్యాసింజర్ల కోసం వికల్ప్ సదుపాయం ఉంటుందన్నారు. సికింద్రాబాద్-న్యూఢిల్లీ మధ్య నడిచే మూడు రైళ్లకు వికల్ప్ సదుపాయం, సికింద్రాబాద్ స్టేషన్లో ఎస్ఎంఎస్ చేస్తే కోచ్ పరిశుభ్రం చేసే సౌకర్యం ఏర్పడనుందని తెలిపారు. -
ఆ విషయంలో మోదీ, ట్రంప్ ఒక్కటే..
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనదైన శైలిలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు సంధించారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అహ్మద్ మరణించినందుకు సంతాప సూచకంగా పార్లమెంట్ సమావేశాలను రేపటికి వాయిదా వేయకుండా, బుధవారం సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టడాన్ని తప్పుపడుతూ, ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో పోల్చారు. ప్రధాని మోదీని ఇండియన్ ట్రంప్గా అభివర్ణిస్తూ, ఇద్దరూ సమస్యలను సృషిస్తారని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే ట్రంప్ నియంతృత్వ విధానాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కోవడాన్ని లాలు ప్రస్తావించారు. ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఎంత మొత్తంలో నల్లధనాన్ని వెలికితీశారు? దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపింది? వంటి విషయాలను బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని లాలు ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంట్లో అస్వస్థతకు గురైన ఎంపీ అహ్మద్ బుధవారం మరణించారు. సాధారణంగా పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలు మరణిస్తే సభను ఒకరోజు వాయిదా వేస్తారని, మోదీ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని కాలరాసిందని లాలు విమర్శించారు. సభను రేపటికి వాయిదా వేయకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారని, మోదీ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని లాలు మండిపడ్డారు. -
జనరల్ బడ్జెట్లో తానొవ్వక, నొప్పించక..
న్యూఢిల్లీ: ‘నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అన్న చందంగా ఉంది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వార్షిక సాధారణ బడ్జెట్. ఏ రంగానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఏ రంగాన్ని పూర్తిగా విస్మరించకుండా, ఏ రంగంపైనా అధిక పన్నుల భారం మోపకుండా. అన్ని రంగాలకు అంతో ఇంతో అందుబాటులో ఉన్న నిధులను సర్దుబాటు చేస్తూ వచ్చారు అరుణ్ జైట్లీ. పెద్ద నోట్ల రద్దుతో పోయిన నరేంద్ర మోదీ ప్రతిష్టను పునరుద్ధరించేందుకు, మరో పక్క ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈసారి బడ్జెట్లో భారీ రాయితీలు ఉంటాయని అన్ని వర్గాల ప్రజలు భావించారు. మధ్యతరగతివారు ముఖ్యంగా వేతన జీవులు ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల రూపాయల నుంచి ఐదులక్షల రూపాయల వరకు పెంచుతారని ఆశించారు. అయితే అరుణ్ జైట్లీ పరిమితిని పెంచకుండా ఈ స్లాబ్లో ఉండే పది శాతం ఆదాయం పన్నును ఐదు శాతానికి తగ్గించి కొంత ఊరట కల్పించారు. ఆ మేరకు పడే ఆర్థిక భారాన్ని 50 లక్షల నుంచి కోటి రూపాయలు సంపాదించేవారిపై పది శాతం సర్చార్జి విధించడం ద్వారా భర్తీ చేసుకున్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం యూపీఏ ప్రభుత్వం శిలాఫలకంగా చరిత్రలో మిగిలిపోతుందని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించినప్పటికీ ఆ పథకానికే ఆర్థిక మంత్రి మున్నెన్నడు లేనివిధంగా 48 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఈసారి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఊతమిస్తున్నామని చెప్పిన జైట్లీ ఉపాధి హామీకి ఇన్ని రేట్లు కేటాయించిన కారణంగా తమకు వ్యవసాయ కూలీలు దొరక్క నష్టపోతామని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో మౌలిక సౌకర్యాలకు కాస్త కేటాయింపులు పెంచడం కార్పొరేట్ రంగానికి ఊతమివ్వడానికే. ఆ మేరకు కార్లపై మౌలిక సౌకర్యాల సెస్ను విధించడం వల్ల రాబడుతోంది. దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, అవినీతిపై ఆయుధమని ప్రశంసించినా అరుణ్ జైట్లీ పెద్ద నోట్ల రద్దు ఫలితాలేమిటో వివరించలేక పోయారు. అవినీతిపై పోరులో భాగంగా మూడు లక్షల రూపాయలకు మించి నగదు లావా దేవీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకే ఈ చర్య తీసుకున్నారు. రాజకీయ పార్టీలకిచ్చే విరాళాలలో నల్లడబ్బును అరికట్టేందుకు 20 వేల లోపు విరాళాలకు దాతల పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదన్న పరిమితిని రెండువేల రూపాయలకు కుదించినట్లు వెల్లడించారు. 20 వేల నిబంధన ఉన్నప్పుడు కూడా రాజకీయ పార్టీల్లోకి నల్ల డబ్బు ప్రవాహాన్ని అరికట్టలేని ప్రభుత్వాలు ఇప్పుడు అరికడతాయనుకుంటే అత్యాశే అవుతోంది. ఓటర్ల జాబితాల్లో ఉన్న పేర్లు, చిరునామాలనుబట్టి విరాళాల దాతల పేర్లు రాసుకునే రాజకీయ పార్టీలు తమ రంగును మార్చుకుంటాయా? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో భారత ఐటీ కంపెనీలు కుదేలవుతున్న పరిస్థితుల్లో వాటిని ఆదుకునేందుకు బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడం శోచనీయం. ఎప్పటిలాగే ఈసారి కూడా బడ్జెట్లో ప్రాథమిక విద్యారంగానికి ప్రభుత్వం అన్యాయమే చేసింది. ఉన్నత విద్యారంగానికి అంతో ఇంతో ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం ప్రాథమిక విద్యారంగాన్ని మాత్రం ఎప్పుడూ విస్మరిస్తూనే ఉంది. 2030 సంవత్సరం నాటికి ప్రపంచంలోనే ఎదురులేని యువ శక్తిగా భారత్ ఎదుగుతోందని భారత్ అంచనావేస్తోంది. ఆ యువతే ఇప్పుడు ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తోంది. ప్రాథమిక విద్యలో చేరిన విద్యార్థుల్లో 20 శాతం మంది విద్యార్థులు మాధ్యమిక విద్యలోకి, వారిలో 34 శాతం మంది ఉన్నత విద్యలో ప్రవేశించడం లేదు. సరైన సౌకర్యాలు, ప్రోత్సాహం లేకపోవడమే అందుకు కారణం. ద్రవ్యోల్బణాన్ని మూడుశాతానికి మించకుండా చూస్తానని సవాల్ చేసిన అరుణ్ జైట్లీ ఈ బడ్జెట్లో దాన్ని 3.2గా సవరించుకున్నారు. వచ్చే ఏడాది మాత్రం మూడు శాతానికి మించికుండా చూస్తానని హామీ ఇచ్చారు. స్థూల జాతీయ వద్ధి రేటును రెండేళ్లలో 8 నుంచి 10 శాతానికి తీసుకెళతామని తొలి బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం వద్ధి రేటు అంచనాలను కూడా ఏడు శాతానికి తీసుకెళ్లే స్థితిలో లేదు. పెద్ద నోట్ల రద్దుతో వచ్చే ఏడాది వద్ధి రేటు ఎంత తగ్గుతుందో కూడా తెలియదు. ఈ పరిస్థితుల్లో, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని ఆర్థిక వనరులను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సర్ది చూపించారు. (సంబంధిత వార్తలు..) గృహ రంగానికి గుడ్న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే.. ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు ఆదాయపన్ను రేట్లు ఇలా.. తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ మన విద్యా సంస్థలకు అంతంతమాత్రమే! -
మోదీని కేసీఆర్ ప్రసన్నం చేసుకున్నా లాభం లేదు
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న సామాన్యుల ఆశలు తీర్చటంలో కేంద్ర బడ్జెట్ విఫలమయిందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రైతులు, పేదలు, సామాన్యులు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిందేమిటని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో రైతు ఆత్మహత్యలు రెట్టింపయ్యాయే తప్ప ఆదాయం ఏమాత్రం పెరగలేదని విమర్శించారు. నోట్ల రద్దును సమర్ధిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకున్నా, కేంద్రం మాత్రం బడ్జెట్ లో తెలంగాణను విస్మరించిందని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని హామీలైన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి అంశాలను బడ్జెట్లో ప్రస్తావించలేదని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. -
బడ్జెట్లో మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. విదేశీ పెట్టుబడులను మరింత ప్రోత్సహించేలా భారీ సంస్కరణ చేపట్టారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డిఐ) ప్రతిపాదనలను పరిశీలించే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపిబి) రద్దు చేస్తున్నట్టు ప్రకటించి మరో సంచలనం సృష్టించారు. విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు(ఎఫ్ఐపిబి) నుండి అనుమతులు పొందడానికి, నిబంధనలు సైతం ఉల్లంఘించి డైరెక్ట్ పెట్టుబడులను సాధిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాలను సరళీకరిస్తామని ఆయన చెప్పారు. ఎఫ్ఐపీబీ మార్గదర్శకాలు రాబోయే సంవత్సరంలో మరింత సరళంగా ఉండనున్నట్టు చెప్పారు. మేకిన్ ఇండియాలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుడులను భారీగా ఆహ్వానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గత ఏడాది భారతదేశం పౌరవిమానయాన నుండి ఫార్మాస్యూటికల్స్ వరకు రంగాల్లో విదేశీ పెట్టుబడును మరింత సులభతరం చేశారు. ప్రపంచంలో భారతదేశం అత్యంత ఓపెన్ ఆర్థిక వ్యవస్థగా తయారు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. భారతదేశం లో కొన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ఆటోమేటిక్ ఎఫ్ఐపిబి ద్వారా అనుమతి లభించేది. ప్రభుత్వం లేదా భారతదేశం యొక్క రిజర్వు బ్యాంకు నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే 100శాతం విదేశీ పెట్టుబడిదారులు పూర్తిగా సొంతదారు కావడానికి అనుమతి ఉంది. ఉదాహరణకు దేశంలో యాపిల్ ఫోన్ల తయారీలో రూ.5వేల కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులకు ఎఫ్ఐపిబి అనుతినిచ్చింది. దీనిపై వివాదం నెలకొన్న సంగతి విదితమే. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ముఖ్యంగా బ్యాంకింగ్, రక్షణ మరియు పౌర విమానయాన రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి. కాగా 1990ల కాలంలో ఆర్థిక సరళీకరణలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసింది. పీఎంవో కింద పనిచేసేలా దీన్ని రూపొందించారు. అయితే 2013 లో ఆర్థిక శాఖకు దీన్ని బదిలీ చేశారు. -
'బడ్జెట్.. చేదుమాత్రకు షుగర్ కోటింగ్'
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. చేదు మాత్రకు చక్కెర పూతలా కేటాయింపులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రైతు రుణాలు మాఫీ అవుతాయన్న ఆశలు నెరవేరలేదని తెలిపారు. రైతు ఆదాయం రెట్టింపు ఎలా అవుతుందో ప్రభుత్వం చెప్పలేదని ఆరోపించారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు రైతు రుణాలు గతంలో సగం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీని పూర్తిగా సమర్ధిస్తున్న సీఎం కేసీఆర్ విభజన హామీలను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బడ్జెట్ వాస్తవ విరుద్దమని కేటాయింపుల్లో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. -
తెలుగు రాష్ట్రాలకు నిరాశ మిగిల్చిన బడ్జెట్
-
లోక్సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
-
బడ్జెట్పై ఎవరేమన్నారంటే..?
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్ను కూడా సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత దీనిపై అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షాల వారు, ఇతర ప్రముఖులు స్పందించారు. కొంతమంది సానూకూలంగా మరికొందరు ప్రతికూలంగా స్పందించారు. ఒకసారి వాటిని పరిశీలిస్తే.. ప్రధాని నరేంద్రమోదీ ఇది పేదరికాన్ని మరింత తగ్గించే ఉత్తమమైన బడ్జెట్. ఈ బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రికి నా అభినందనలు. మేం రైతులపైన, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిపైన దృష్టిసారించాం. అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఎక్స్లేటర్లాగా పనిచేస్తుంది. అన్ని రంగాలపై ఈ బడ్జెట్ దృష్టి పెట్టింది. జీవన నాణ్యత మరింత పెంపొందుతుంది. 2022నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తాం. రైల్వే సేఫ్టీపై కూడా మేం దృష్టిని సారించాం. అలాగే, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి గతంలో ఎవ్వరూ కేటాయించనన్ని నిధులు కేటాయించాం. ఈ బడ్జెట్ ఉద్యోగాలకు, ఉద్యోగాల కల్పనకు తెరతీస్తుంది. సీ రంగరాజన్(ఆర్బీఐ మాజీ గవర్నర్) ఇది ఫెయిర్లీ రొటీన్ బడ్జెట్. రెవెన్యూ విభాగంలో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్య లోటు 3.2శాతం మేరకు కొనసాగించగలగడాన్ని నేను ఆనందంగా భావిస్తున్నాను. ద్రవ్యలోటును 3కు తగ్గించాలని లక్ష్యంగా ఉంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చప్పగా బడ్జెట్ ముగించారని రాహుల్ అంటున్నారు. కానీ, వాస్తవానికి రాహుల్ అసలు బడ్జెట్ ప్రసంగం వినలేదు. ఒక వేళ ఆయనకు ఈ వివరాలు ఎవరు చెప్పారో బహుషా వారు కూడా ఈ బడ్జెట్ వినలేదనుకుంట. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్ చాలా మంచింది. గ్రామాలకు కూడా ఇక అన్ని సౌకర్యాలు వస్తాయి. బ్యాంకింగ్, హౌసింగ్ సెక్టార్లు ఆర్థిక వ్యవస్థను, పన్ను ఆదాయాన్ని మరింత బలోపేతం చేస్తాయి. కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ స్టార్టప్స్కు సహాయం చేస్తుంది. గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నదానికి ఆర్థికశాఖ సరిగ్గా స్పందించింది. ఇది చాలా సానుకూలమైన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కమల్నాథ్ ఈ బడ్జెట్లో రైతులకు, నిరుద్యోగులకు ఏమీ లేదు. ఇది ప్రజలను గందరగోళ పరిచే చర్య మాత్రమే. రాజకీయ విరాళాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం మాత్రం ఆహ్వానించదగింది. (ఇకపై పొలిటికల్ ఫండింగ్ చేయాలనుకునే వారు రూ.2000పైన అయితే, కచ్చితంగా బాండ్లతో ఇవ్వాలి. ఆ బాండ్లను కూడా చెక్లతోగానీ, కార్డులతోగానీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఎవరు ఎంతిచ్చారో తెలిసిపోతుంది. తాజా బడ్జెట్లో ఈ నిబంధన పెట్టారు) రణదీప్ ఎస్ సుర్జీవాలా(కాంగ్రెస్ అధికార ప్రతినిధి) ఈ బడ్జెట్ ఉద్యోగాల సృష్టి శూన్యం, తయారీ రంగానికి శూన్యం, వ్యవసాయంలో అభివృద్ధికి శూన్యం, విద్య, వైద్యంలో శూన్యం, సామాజిక రంగానికి శూన్యం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇది వివాదాస్పద బడ్జెట్. ఆధారాలు లేనిది, ఉపయోగం లేనిది, మిషన్లెస్, యాక్షన్ లెస్ బడ్జెట్ ఇది. భవిష్యత్కోసం ఈ బడ్జెట్లో రోడ్మ్యాప్ లేదు. బడ్జెట్కున్న క్రెడిట్ మొత్తం పోయింది. పన్ను చెల్లిస్తున్నవారు నగదు ఉపసంహరణకోసం ఇప్పటికీ పరిమితులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అన్ని పరిమితులు ఉపసంహరించండి. సంబంధిత వార్తలకై చదవండి.. (పార్లమెంట్లో టపాసులు పేలతాయనుకున్నా..) 2017 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... గృహ రంగానికి గుడ్న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! -
బడ్జెట్ ప్రసంగంలో మాల్యా ఎఫెక్ట్
న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లధనం వెలికి తీతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్న జైట్లీ బిగ్ టైం అఫెండర్స్ ఆస్తులను జప్తు చేయాలనే ప్రతిపాదను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. దీంతో వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు పరోక్షంగా గట్టి హెచ్చరికనే చేశారు. ఆర్థిక నేరస్తులకు శిక్ష తప్పదనే సంకేతాలిచ్చారు. ఈ మేరకు వారి ఆస్థులను స్వాధీనంకోసం కొత్త చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. భారతదేశం విదేశాల్లో వున్న అక్రమ ధనాన్ని వెనక్కి రప్పించేందుకు కేంద్రం అనేక క్షమాభిక్ష పథకాలు అమలు చేసింది. అయితే ఈ కొత్త ప్రతిపాదన ఆర్థిక నేరస్థులపై మరింత ఒత్తిడి పెంచనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే స్విట్జర్లాండ్, సింగపూర్ బ్యాంకుల్లో దాగి వున్న అప్రకటిత ఆదాయం, ఆభరణాల, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులపై పెట్టుబడుల ద్వారా పన్ను ఎగవేస్తున్నవారిపై విమర్శకులు, నిపుణులు ప్రశ్నించారు. కాగా లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా రూ.6,000 కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్ కు చెక్కేసిన సంగతి విదితమే. మరో వైపు సీబీఐ కూడా మాల్యా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అతడిని స్వదేశం రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఐడీబీఐ లోన్ డిఫాల్ట్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేయడంతోపాటు, ఐడీబీఐ అధికారులను, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సిబ్బందిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో అఫిడవిల్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. దీంతో మంగళవారం మాల్యా మరోసారి నాన్ బెయలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబు ఇప్పటికైనా పట్టించుకోవాలి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 2017-18 ఏడాదికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలుగు ప్రజలను నిరాశ పరిచిందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఆంధ్రప్రదేశ్ను పట్టించుకోవాలన్న ఉద్దేశం ఎన్డీయే ప్రభుత్వానికి లేదని అర్థమైందని చెప్పారు. రైతుల చెవుల్లో పూలు పెట్టారని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం దారుణమని పార్థసారథి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా పట్టించుకోవాలని సూచించారు. రైల్వే జోన్, అమరావతి కనెక్టవిటీ గురించి ప్రస్తావన లేదని, విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని అన్నారు. -
పన్నులలో మరికొన్ని మినహాయింపులు ఇలా..
-
ఆ కంపెనీలకు పన్ను తగ్గిందోచ్!
-
బడ్జెట్ లో రైల్వే హైలెట్స్...
-
రాజకీయ విరాళాలకు బ్రేక్
-
2017 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు
-
మన విద్యా సంస్థలకు అంతంతమాత్రమే!
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలలోని ఉన్నత విద్యాసంస్థలకు అంతంత మాత్రంగానే కేటాయింపులు లభించాయి. ఇంకా ఏర్పాటు కావల్సిన వాటికి కూడా ఎంగిలి మెతుకులు మాత్రమే విదిల్చారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేటు కళాశాల వారు ఉచితంగా ఇచ్చిన భవనంలో కొనసాగుతున్న ఎన్ఐటీకి ఇంకా శాశ్వత భవనం ఏర్పాటుచేయాల్సి ఉండగా.. దానికి వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. వాస్తవానికి ఈ పది కోట్లు ప్రహరీ నిర్మాణానికి కూడా సరిపోవు. ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి అక్కడ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంకా శాశ్వత భవన నిర్మాణం ఎప్పుడు చేస్తారో, అప్పటివరకు ఎన్ని సంవత్సరాలలో ఈ నిధులు ఇస్తారో తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ విద్యా సంస్థలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి.. సెంట్రల్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ -10 కోట్లు ఏపీ, తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీలు - 20 కోట్లు ఐఐటీ, ఆంధ్రప్రదేశ్ - 50 కోట్లు ఐఐటీ హైదరాబాద్ - 75 కోట్లు ఐఐఎం, ఆంధ్రప్రదేశ్ - 40 కోట్లు ఎన్ఐటీ, ఆంధ్రప్రదేశ్ - 10 కోట్లు ఐఐఎస్ఈఆర్, ఆంధ్రప్రదేశ్ - 50 కోట్లు ఐఐఐటీ, ఆంధ్రప్రదేశ్ - 30 కోట్లు (సంబంధిత వార్తలు..) గృహ రంగానికి గుడ్న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే.. ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు ఆదాయపన్ను రేట్లు ఇలా.. తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ మోతెక్కనున్న కార్ల ధరలు సిగరెట్లు..సెల్ ఫోన్ల ధరలు ఇక భగ భగ బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... -
తగ్గేవి.. పెరిగేవి..
న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక బడ్జెట్ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలు తన ప్రతిపాదనలతో ఖజానాకు ఎటువంటి నష్టం లేదా లాభం రాదని చెప్పారు. ముఖ్యంగా త్వరలోనే జీఎస్ టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎక్సైజ్ & సర్వీస్ టాక్స్ ప్రస్తుత విధానంలో పెద్దగా మార్పులు చేయలేదని తెలిపారు. సిల్వర్ కాయిన్స్ పై 12.5 శాతం దిగుమతి సుంకం విధించారు. ఎక్సైజ్ & సర్వీస్ టాక్స్ లో స్వల్ప మార్పుల కారణగా ధరలు పెరిగేవి, తగ్గేవి ఈ విధంగా ఉన్నాయి. తగ్గేవి ఎల్ ఈడీ దీపాలు సౌర ఫలకాలు( సోలార్ ప్యానల్స్) మైక్రో ఎటీఎంలు ఫింగర్ ప్రింట్ యంత్రాలు, ఐరిస్ స్కానర్లు రైల్వే టిక్కెట్ల ఆన్లైన్ బుకింగ్ ఎల్ఎన్జి(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ఫ్యూయల్ సెల్ బేస్డ్ జనరేటర్లు లెదర్ ఉత్పత్తుల తయారీకి వాడే కూరగాయల ఉత్పత్తులు రక్షణ రంగంలో గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు పెరిగేవి సెల్ ఫోన్లు, వెండి నాణేలు, సిగరెట్లు, పొగాకు, బీడీలు, పాన్ మసాలా ఉత్పత్తులు అల్యూమినియం ఉత్పత్తులు పార్సిల్ ద్వారా దిగుమతి అయ్యే ఇతర వస్తువులు, వాటర్ ఫిల్టర్స్ పరికరాలు, జీడిపప్పు ప్రియం కానున్నాయి -
లోక్సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ లను ప్రకటించనందుకు నిరసనగా లోక్సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్ చేసింది. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 ఏడాదికిగాను బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ప్రకటించనందుకు వైఎస్ఆర్ సీపీ ఎంపీలు నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేశారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆశలను కేంద్ర ప్రభుత్వం వమ్ము చేసిందని విమర్శించారు. కేపిటల్ గెయిన్స్ పన్ను రద్దు వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు ట్యాక్స్ గెయిన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
భారత్లో ఏకైక ప్రైవేట్ రైల్వే ‘శకుంతల’
మహాకవి కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ సంస్కృత నాటకం గురించి, అందులోని శకుంతల పాత్ర గురించి బహూశ భారతీయులందరికీ తెలిసే ఉంటుంది. కానీ శకుంతల పేరిట ఓ రైల్వే లైనుందని, అది భారతీయ రైల్వేలో భాగం కాదని, ఆ రైల్వే లైన్పై శకుంతల ఎక్స్ప్రెస్ రైలు ఇప్పటికీ నడుస్తోందని, అది ఓ బ్రిటిష్ కంపెనీకి సొంతమని ఎంతమందికి తెలుసో తెలియదు. బ్రిటిష్ పాలకుల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీని బ్రేక్ చేసి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ శకుంతల రైల్వేలైన్ను కూడా భారతీయ రైల్వేలో కలిపేందుకు చర్యలు తీసుకుంటే బాగుండేదేమో. మహారాష్ట్రలోని ముర్తాజాపూర్, యవత్మల్ మధ్య 190 కిలోమీటరు దూరం మధ్య శకుంతల ఎక్స్ప్రెస్ రైలు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఇప్పటికీ నడుస్తోంది. ఈ రైలు గ్రామీణ ప్రాంతాలకు జీవనాధారం. కిల్లిక్ నిక్సన్ అనే బ్రిటిష్ కంపెనీ భారత్లోని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంతో కలసి 1910లో ‘సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే లైన్ కంపెనీ’ (సీపీఆర్ఎల్)ని ఏర్పాటు చేసి విదర్భ నుంచి పత్తిని రవాణా చేసేందుకు శకుంతల రైల్వే లైన్ను ఏర్పాటుచేసింది. 1916 నుంచి ఈ లైన్పై పత్తి రవాణాకు రైళ్లు నడిచాయి. ఆ తర్వాత ప్రయాణికుల రైళ్లు నడిచాయి. ఆ తర్వాత భారతీయ రైల్వే లైన్కు ఈ లైన్ అనుసంధానమైంది. దీంతో అప్పటి సెంట్రల్ ఇండియా ఆధ్వర్యంలోని గ్రేట్ ఇండియాలోని పెనిన్సులార్ రైల్వే (జీఐపీఆర్)కు చెందిన పలు రైళ్లు కూడా ఈ రైల్వేలైన్ మీదుగా నడిచేవి. దేశ స్వాతంత్య్రం అనంతరం 1952లో భారత ప్రభుత్వం జీఐపీఆర్ సహా దేశంలోని అన్ని రైల్వేలైన్లను జాతీయం చేసింది. ఒక్క కిల్లిక్ నిక్సన్ కంపెనీ ఆధ్వర్యంలోని సీపీఆర్ మాత్రం అలా కాలేదు. ఈ కంపెనీని జాతీయం చేయకుండా ఎందుకు భారత ప్రభుత్వం మరచిపోయిందో తెలియదు. ఆ తర్వాత కిల్లిక్ నిక్సన్ కంపెనీ బ్రిటన్ నుంచి భారత్కు తరలివచ్చినా దానినుంచి శకుంతల రైల్వేలైన్ను స్వాధీనం చేసుకునేందుకు భారత్ ఎందుకు ప్రయత్నించలేదో కూడా అర్థం కాదు. భారతీయ రైల్వే ఈ ప్రైవేటు శకుంతల రైల్వే లైన్ను వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లిస్తూ వస్తోంది. పదేళ్లకోసారి ఈ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తోంది. అలా ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆరుసార్లు ఒప్పందాన్ని పునరుద్ధరించింది. ఈ లైన్పై 1921లో మాంచెస్టర్లో తయారైన ఇంజన్తో శకుంతల ఎక్స్ప్రెస్ నడిచేది. దీన్ని 1994, ఏప్రిల్ 15వ తేదీన పాత ఇంజన్ను తీసేసి డీజిల్ ఇంజన్ను ఏర్పాటుచేశారు. న్యారోలైన్పై నడిచే ఈ రైలు ప్రయాణికులు ఎక్కడుంటే అక్కడ ఆగి వారిని ఎక్కించుకుంటుంది. టిక్కెట్ ధర కూడా భారతీయ రైళ్లకన్నా ఎంతో చౌక. అందుకని ఈ ప్రాంతంలోని గ్రామీణ ప్రజలు ఈ రైలు ఎక్కేందుకే ఎక్కువ ఇష్టపడతారు. ఈ న్యారో రైల్వేలైన్ను బ్రాడ్గేజ్గా మార్చాలని గత బడ్జెట్లోనే రైల్వేశాఖ ప్రతిపాదించింది. అది పూర్తయితే శకుంతల ఎక్స్ప్రెస్ కూడా బ్రాడ్గేజ్కు మారుతుందా, ఈ లోగా భారతీయ రైల్వేలో విలీనం అవుతుందా.. చూడాలి! -
దూసుకెళ్లిన రియాల్టీ: భారీ లాభాల్లో మార్కెట్లు
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో గృహరంగానికి ఊతమిచ్చేలా ప్రకటనలు వెలువడంతో రియాల్టీ ఇండెక్స్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. బీఎస్ఈలో 4.2 శాతం ఎగిసిన రియాల్టీ సూచీ, ప్రస్తుతం 3.38 శాతం వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. రియాల్టీ ఇండెక్స్లో మేజర్ షేర్లుగా ఉన్న డీఎల్ఎఫ్(5.74 శాతం), గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్(4.04 శాతం), ఒబేరాయ్ రియాల్టీ లిమిటెడ్(4.24 శాతం), ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్(3.19 శాతం), సోబా(2.64 శాతం), యూనిటెక్(3.31 శాతం), హెచ్డీఐఎల్(3.36 శాతం), ఇండియా బుల్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్(0.80 శాతం) శాతం పెరిగాయి. హౌసింగ్ పరిశ్రమకు మేలు చేకూరేలా ఇండస్ట్రి వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సరసమైన గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్ను జైట్లీ ఈ బడ్జెట్లో కల్పించారు. దీన్ని ద్వారా డెవలపర్లకు ధరలు తగ్గనున్నాయి. అంతేకాక, ప్రధాని ఆవాస్ యోజన పథకానికి రూ.23వేల కోట్లు కేటాయించనున్నట్టు జైట్లీ తెలిపారు. నేషనల్ హౌసింగ్ బ్యాంకు ద్వారా రూ.20వేల కోట్ల గృహరుణాలను అందించనున్నట్టు హామీ ఇచ్చారు. ఈ ప్రకటనలన్నీ రియాల్టీకి మంచి బూమ్ ఇచ్చాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిమాండ్ కుదేలై పడిపోయిన రియాల్టీ ఇండెక్స్, జైట్లీ ప్రసంగం తర్వాత పుంజుకుంది. రియాల్టీకి ఊతమిచ్చేలా జైట్లీ పలు ప్రకటనలు చేస్తారని ముందునుంచి మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. అంచనాలకు అనుగుణంగా రియాల్టీకి ఆయన గుడ్ న్యూస్ అందించారు. బడ్జెట్ స్పీచ్ అనంతరం 300 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన మార్కెట్లు, ప్రస్తుతం మరింత లాభాల్లోకి దూసుకెళ్లాయి. 406.86 పాయింట్ల లాభంలో 28,062 వద్ద సెన్సెక్స్ ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 125.35 పాయింట్ల లాభంలో 8,686 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, పీఎస్యూ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు సైతం లాభాల్లో నడుస్తున్నాయి. గృహరంగానికి అందించిన ప్రోత్సహకాలు : ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం ఇళ్ల నిర్మాణంలో ఉద్యోగవకాశాలు కల్పించడం 2016 జూన్, 2019 మార్చి మధ్యలో అనుమతిచ్చే ఫ్లాట్స్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో నాలుగు మెట్రోసిటీల్లో 30 చదరపు మీటర్లు, ఇతర మెట్రో సిటీల్లో 60 చదరపు మీటర్ల వరకు కనీస ప్రత్యామ్నాయ పన్ను. మొదటిసారి గృహ కొనుగోలుదారులు తీసుకునే రూ.35 లక్షల వరకు రుణాల్లో అదనంగా రూ.50వేలపై వేసే వడ్డీరేట్ల నుంచి మినహాయింపు. వచ్చే ఏడాది నుంచి ఇది అమలు. పీపీపీ స్కీమ్ లాంటి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆఫర్ చేసే స్కీమ్ల కింద 60 చదరపు మీటర్లలో ఇళ్ల నిర్మాణాలకు సర్వీసు పన్ను తొలగింపు ఎక్స్చేంజ్ డ్యూటీ నుంచి కూడా మినహాయింపు -
మోతెక్కనున్న కార్ల ధరలు
దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. వ్యక్తిగత వాహనాల సంఖ్య ఎక్కువ కావడంతో ఇటు కాలుష్యంతో పాటు అటు ట్రాఫిక్ సమస్య పెరగడం కూడా పలు నగరాల్లో కనిపిస్తోంది. ఈ పరిణామాన్ని గమనించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వాహనాల ధరలు పెరిగేలా కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఒకదాన్ని విధించారు. చిన్న పెట్రోలు, ఎల్పీజీ, సీఎన్జీ కార్ల మీద ఒక శాతం, డీజిల్ కార్ల మీద 2.5 శాతం విధించారు. ఇక ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన వాహనాలు, ఎస్యూవీల మీద అయితే 4 శాతం వరకు ఈ సెస్ విధించారు. దాంతో ఆ మేరకు వాహనాల ధరలు కచ్చితంగా పెరుగుతాయి. -
సిగరెట్లు..సెల్ ఫోన్ల ధరలు ఇక భగ భగ
ముంబై: 2016-17 ఆర్థిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్ సభ లో ప్రవేశపెట్టారు. డీమానిటైజేషన్, అయిదు రాష్ట్రాల ఎన్నికలు నేపథ్యంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ యూనియన్ బడ్జెట్ లో అనేక మెరుపులు, వరాలు కురిపించారు ఆర్ధికమంత్రి. గ్రామీణ యువత, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వెనుకబడిన వర్గాలపై అనేక వరాలు గుప్పించారు. అయితే సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని 6 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో సెల్ ఫోన్లు,సిగరెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా దలాల్ స్ట్రీట్ అంచనాలకనుగుణంగానే సిగరెట్లపై పన్ను మోత మోగింది. అటు కనీసం 10 శాతం పెంపును అంచనావేసిన ట్రేడర్లు దీంతో సిగరెట్ తయారీ కంపెనీల కౌంటర్లలో మదుపర్లు దృష్టిసారించారు. అలాగే సెల్ ఫోన్ కూడా కస్టమ్స్ లెవీ కారణంగా 1శాతం ధరలు పెరగనున్నాయి. సెల్ ఫోన్ విడిభాగాల పై విధించిన పన్నుకారణంగా ఈ ధరలు పెరగనున్నాయి. పెరిగిన పన్ను వివరాలు వెయ్యి సిగరెట్లపై పన్ను రూ.215 నుంచి 311కు పెంపు పాన్ మసాలాపై 6నుంచి 9 శాతం దిగుమతి చేసుకున్న అల్యూమినియంపై 30 శాతం పన్ను సెల్ ఫోన్లలో వాడే సర్క్యూట్ బోర్డ్ (పీసీబీ) లపై 2 శాతం మరోవైపు తాజా బడ్జెట్లో వ్యవసాయ రంగం 4.1 శాతం వృద్ధిని సాధించగలదని వేసిన అంచనాతో ఎఫ్ఎంసీజీ రంగం బాగా పుంజుకోనుంది. గ్రామీణాభివృద్ధి, పేదలకు కనీస ఆదాయ కల్పన, నీటిపారుదల సౌకర్యాలకు ప్రాధాన్యం వంటి అంశాలు కూడా ఇందుకు తోడ్పడతాయని నిపుణులు పేర్కొన్నారు. (సంబంధిత వార్తలు..) గృహ రంగానికి గుడ్న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే.. ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు ఆదాయపన్ను రేట్లు ఇలా.. తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ మన విద్యా సంస్థలకు అంతంతమాత్రమే! మోతెక్కనున్న కార్ల ధరలు బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... -
‘ఈ బడ్జెట్ మన భవిష్యత్తు’
-
రాజకీయ విరాళాలకు బ్రేక్
వరుసపెట్టి ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. వివిద రాజకీయ పార్టీలు ఇంతకుముందు ఎడా పెడా విరాళాలు తీసుకునేవి. అయితే ఇక మీదట నగదు రూపంలో కేవలం 2వేలకు మించి ఎవరి వద్దా విరాళాలు తీసుకోడానికి వీల్లేదని జైట్లీ స్పష్టం చేశారు. 2వేల రూపాయలకు మించి ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే అందుకు బాండ్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. వాటిని కూడా చెక్కులు లేదా డెబిట్/క్రెడిట్ కార్డులతో కొనాల్సి ఉంటుంది. ఆయా బాండ్లను కేవలం రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు మాత్రమే నగదుగా మార్చుకోడానికి వీలుంటుంది. దీన్నిబట్టి.. రాజకీయ విరాళాలు ఇచ్చేవారు ఎవరన్న విషయం కూడా స్పష్టంగా తేలిపోతుంది. తద్వారా పార్టీల నిధుల విషయంలో కొంతవరకు పారదర్శకత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రకటన చేయడానికి ముందు.. ఇది మనందరికీ సంబంధించిన విషయం కాబట్టి కాస్తంత జాగ్రత్తగా వినాలంటూ జైట్లీ ఒకింత చెప్పి మరీ ప్రకటన చేశారు. -
‘విప్లవాత్మకం.. కాదు ఆడంబరం’
-
తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ
బడ్జెట్ ప్రసంగం చేసే సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రెండు మూడు సందర్భాలలో కొంత తడబడి తప్పులు చదివారు. ఒకటి రెండు సందర్భాల్లో వేరే సభ్యులు, స్పీకర్ వాటిని సవరించినా ఒకటి రెండు మాత్రం అలాగే దొర్లిపోయాయి. ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్యను చెప్పేటప్పుడు 1.71 లక్షల మంది అనడానికి 1.71 లక్షల రూపాయలు అని చదివారు. అలాగే భరించదగ్గ గృహనిర్మాణ పథకం విషయంలో 30 చదరపు మీటర్లు అనడానికి బదులు 30 చదరపు కిలోమీటర్లుగా చెప్పారు. మరో సందర్భంలో కూడా జైట్లీ ఇలాగే తడబడ్డారు గానీ, దాన్ని స్పీకర్ సరిచేయడంతో ఆయన మళ్లీ సవరించుకున్నారు. ఇలా దాదాపు మూడు నాలుగు సందర్భాల్లో జైట్లీ తడబడ్డారు. మొదటి నుంచి కూర్చునే.. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగాన్ని అరుణ్ జైట్లీ కూర్చునే చదివారు. గతంలో రెండు సందర్భాల్లో ఆయన తొలుత నిలబడి ప్రసంగం ప్రారంభించి, కాసేపటి తర్వాత కూర్చునేవారు. నడుం నొప్పితో బాధపడుతున్న జైట్లీకి.. కూర్చుని చదివే అవకాశాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ కల్పించారు. ఈసారి మొత్తం మొదటినుంచి చివరి వరకు ఆయన కూర్చునే బడ్జెట్ ప్రసంగం ఇచ్చారు. (సంబంధిత వార్తలు..) గృహ రంగానికి గుడ్న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే.. ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు ఆదాయపన్ను రేట్లు ఇలా.. మన విద్యా సంస్థలకు అంతంతమాత్రమే! మోతెక్కనున్న కార్ల ధరలు సిగరెట్లు..సెల్ ఫోన్ల ధరలు ఇక భగ భగ బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... -
నాన్నది ఫ్రెండ్లీ బడ్జెట్: సోనాలి జైట్లీ
న్యూఢిల్లీ: దశాబ్దాల సంప్రదాయానికి విరుద్ధంగా నెల రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై భిన్న స్పందనలు వెలువడుతున్నాయి. అధికార బీజేపీ సభ్యులు సహజంగానే ‘ఆహా.. ఓహో.. ’అంటుండగా, విపక్షాలు మాత్రం ‘ఇందులో ఏమీ లేదు’అని పెదవి విరుస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూతురి స్పందనపై ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ ప్రకటన ముగిన తర్వాత పార్లమెంట్ బయటకు వచ్చిన సోనాలీ జైట్లీ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ‘ఇది చాలా మంచి బడ్జెట్. నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేశారు. ఆడపడుచుల కోసం ఎన్నెన్నో పథకాలు ప్రకటించారు. ఇది మహిళా అనుకూల బడ్జెట్ కూడా’ అని సోనాలి అన్నారు. బడ్జెట్ ప్రకటన సందర్భంగా బుధవారం పార్లమెంట్కు వచ్చిన జైట్లీ కుటుంబసభ్యులు విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని బడ్జెట్ ను ఆసక్తిగా విన్నారు. -
పార్లమెంట్లో టపాసులు పేలతాయనుకున్నా..
-
‘ఈ బడ్జెట్ మన భవిష్యత్తు’
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉత్తమ బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. పేదల అభ్యున్నతిని మెరుగు పరిచేందుకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందన్నారు. గత రెండున్నరేళ్లుగా తాము తీసుకున్న చర్యలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఉద్యోగాల కల్పనలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధి బడ్జెట్ లో కనిపిస్తోందన్నారు. రైతులు, గ్రామీణులు బలహీన వర్గాల కోసం బడ్జెట్ లో ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రైతుల ఆదాయం రెండింతలు చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. అసంఘటిత కార్మికులను సంఘటిత రంగంవైపు మళ్లించే ప్రయత్నం చేశామని వెల్లడించారు. వ్యక్తిగత ట్యాక్స్ ను తగ్గించే నిర్ణయం సాహసోపేతమైందన్నారు. అవినీతి, నల్లధనం నిర్మూలనపై తాము చేపట్టిన చర్యలు బడ్జెట్ లో ప్రతిఫలించాయని చెప్పారు. ఈ బడ్జెట్ మన భవిష్యత్తు అని పేర్కొన్నారు. సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను విలీనం చేయడంతో రవాణా రంగం ఊపంచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
పన్నులలో మరికొన్ని మినహాయింపులు ఇలా..
సంవత్సరానికి 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను రేటును కొంతవరకు తగ్గించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. మరికొన్ని రకాల మినహాయింపులను కూడా ప్రకటించారు. అవి ఇలా ఉన్నాయి... 5 లక్షల రూపాయల వార్షికాదాయం దాటని వ్యక్తులకు సెక్షన్ 87 ఎ కింద పన్ను మినహాయింపు ప్రస్తుతం రూ. 2వేలు మాత్రమే ఉండగా, దాన్ని ఇప్పుడు 5 వేలకు పెంచారు. దాంతో దాదాపు 2 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఒక్కొక్కరికి రూ. 3వేల చొప్పున ఊరట లభిస్తుంది. సొంత ఇళ్లు ఉన్నవారికి గృహరుణాల మీద చెల్లించే అసలు, వడ్డీకి ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ సొంత ఇళ్లు లేకుండా అద్దె ఇళ్లలో ఉండేవారికి వారు ఏడాదికి చెల్లించే అద్దె మీద పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80జిజి కింద ఇప్పటివరకు ఏడాదికి 24 వేల రూపాయల వరకు కట్టే అద్దె మీద పన్ను మినహాయించేవారు. ఈ పరిమితిని ఇప్పుడు రూ. 60 వేలకు పెంచారు. ఇప్పటివరకు కోటి రూపాయల వార్షిక టర్నోవర్ దాటని చిన్న, మధ్యతరహా నాన్ కార్పొరేట్ వ్యాపారులకు సెక్షన్ 44ఎడి కింద ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీం అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం 33 లక్షల మంది చిన్న వ్యాపారులు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే, వాళ్లు ఖాతా పుస్తకాలను వివరంగా నిర్వహించాల్సి రావడం, ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ టర్నోవర్ పరిమితిని ఇప్పుడు 2 కోట్ల రూపాయలకు పెంచారు. దాంతో మరింతమంది వ్యాపారులు ఎంఎస్ఎంఈ విభాగంలోకి వస్తారు. 50 లక్షల రూపాయల వరకు స్థూల ఆదాయం వచ్చే వృత్తి నిపుణులకు కూడా ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీంను అందుబాటులోకి తెచ్చారు. -
ఒక్కసారిగా పైకి జంప్ చేసిన మార్కెట్లు
ముంబై : కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బడ్జెట్ పార్లమెంట్ ముందుకు వచ్చేసింది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దీన్ని ప్రవేశపెట్టారు. రెండు గంటల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగ నేపథ్యంలో స్వల్పంగా లాభపడుతూ వచ్చిన మార్కెట్లు, కొద్ది సేపట్లో బడ్జెట్ ప్రసంగం ముగుస్తుందనగా ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి.. సెన్సెక్స్ ఒక్కసారిగా 300 పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 255.58 పాయింట్ల లాభంలో 27,911 వద్ద, నిఫ్టీ 66.10 పాయింట్ల లాభంలో 8,627 వద్ద ట్రేడవుతున్నాయి. ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో స్టాక్ మార్కెట్లు, ఇన్వెస్టర్లు ఊపిరిపీల్చుకున్నాయి. ఎస్టీటీ, ఇతర పన్నులను ఆయన టచ్ చేయలేదు. ప్రస్తుతం లిస్టెడ్ సెక్యూరిటీ విక్రయాలకు సంబంధించిన 'దీర్ఘకాలిక మూలధన లాభాలు' (ఎల్టీసీజీ) పన్ను మినహాయింపు పరిధిలో ఉన్నాయి. ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం వాటాలను తమ పరిధిలో ఉంచుకొని ఆ తరువాత విక్రయించడం ద్వారా వచ్చే లాభాలను ఇంత కాలం ఎల్టీసీజీగా పరిగణిస్తూ వస్తున్నారు. మరోవైపు 12 నెలల కంటే తక్కువ కాలంలోనే విక్రయించే స్టాక్ లాభాలపై 15 శాతం వరకు పన్నును విధిస్తూ వస్తున్నారు. దీనిని 'స్వల్పకాలిక మూలధన లాభాలు' (ఎస్టీసీజీ)గా పరిగణిస్తున్నారు. హౌసింగ్ పరిశ్రమకు మేలు చేకూరేలా ఇండస్ట్రి వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సరసమైన గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్ తీసుకురావడంతో బీఎస్ఈలో రియాల్టీ ఇండెక్స్ దూసుకెళ్తోంది. 3.33 శాతం మేర ఈ సూచీ జంప్ చేసింది. బ్యాంకింగ్, పీఎస్యూ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు సైతం లాభాల్లో నడుస్తున్నాయి. ఐటీ ఇండెక్స్ మాత్రం నష్టాల్లోనే కొనసాగుతోంది. సెన్సెక్స్లో టాప్ గెయినర్లుగా ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, గెయిల్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీలున్నాయి. -
‘విప్లవాత్మకం.. కాదు ఆడంబరం’
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పగా ఉందని అధికార బీజేపీ నాయకులు ప్రశంసించగా, చప్పగా ఉందని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. బుధవారం లోక్ సభలో జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 సాధారణ బడ్జెట్ పై అధికార, విపక్ష నాయకులు భిన్నంగా స్పందించారు. కేంద్ర మంత్రులు... సురేశ్ ప్రభు: మూసధోరణిని బద్దలుకొట్టిన బడ్జెట్. దీంతో కొత్త యుగం ఆరంభమవుతుంది అనంతకుమార్: విప్లవాత్మక, రూపాంతరీకరణ బడ్జెట్. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా ముందడుగు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ: రైతు, పేదలకు అనుకూలంగా బడ్జెట్ ఉంది కాంగ్రెస్ నాయకులు... మనీష్ తివారి: ఆడంబర బడ్జెట్, ఉపాధి కల్పన గురించి పెద్దగా పట్టించుకోలేదు. రైల్వేకు ఒరిగిందేం లేదు. మల్లిఖార్జున్ ఖర్గే: కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ ఉంది -
పార్లమెంట్లో టపాసులు పేలతాయనుకున్నా..
న్యూఢిల్లీ: ‘రైలు ప్రమాదాల్లో వందల సంఖ్యలో జనం చనిపోతున్నారు. గిట్టుబాటుధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యువతను నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోంది. దేశంలో ఇన్ని సమస్యలతొ కొట్టుమిట్టాడుతుండగా వీటిలో కనీసం ఒకదానిగురించైనా నేటి బడ్జెట్లో మాట్లాడారా?’అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. బడ్జెట్ ప్రసంగం పూర్తైన తర్వాత పార్లమెంట్ వెలుపల రాహుల్ మీడియాతో మాట్లాడారు. మోదీ సర్కారు కీలకమైన సమస్యలను గాలికొదిలేసి, చలోక్తులు, చతురులతో కూడిన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని విమర్శించారు. ‘ప్రధాని మోదీ, ఆయన కేబినెట్ సహచరులు కొంతకాలంగా మాట్లాడిన మాటలు వింటే, బడ్జెట్ లో అద్భుతాలు ఉంటాయని, పార్లమెంట్లోనే టపాసులు పేలతాయని అనుకున్నాం. కానీ పేలని బాంబులాగా తుస్సుమనిపించారు. మోదీ గొప్పగా చెప్పుకున్న బుల్లెట్ రైళ్ల ప్రస్తావన బడ్జెట్లో రానేలేదు. రైతాంగ సమస్యలకు పరిష్కారాలు చూపలేదు’అని రాహుల్ అన్నారు. తమ పథకాలతో నిరుద్యోగ సమస్య తీరుదుందని గొప్పలు చెప్పుకున్న మోదీ సర్కారు.. గత ఏడాది దేశవ్యాప్తంగా కేవలం 1.5 లక్షల మందికి మాత్రమే కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిందని, ఇందుకు ప్రధాని సిగ్గుపడాలని రాహుల్ విమర్శించారు. రక్షణ రంగం ఊసేది?: రేణుకా చౌదరి కీలకమైన రక్షణ రంగానికి సంబంధించిన అంశాలేవీ బడ్జెట్లో పేర్కొనకపోవడం ఆశ్చర్యం కలిగించిందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. రాజకీయ పార్టీలకు రూ.2 వేలకు మించిన విరాళాలు ఇకపై డిజిటల్ రూపంలో జరగాలన్న బడ్జెట్ ప్రతిపాదనపైనా ఆమె మాట్లాడారు. ‘యూపీ ఎన్నికల్లో వాళ్లెలా పోరాడతారు? డొనేషన్లను చెక్కుల రూపంలో తీసుకుంటారా? లేక డిజిటల్ రూపంలో తీసుకుంటారా? అని వ్యగ్యధోరణిలో విమర్శించారు. -
బడ్జెట్: ఏపీ ‘రాజధాని’పై కీలక ప్రకటన
-
2017 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్ను కూడా సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్కు సంబంధించిన ముఖ్య అంశాలు : మొత్తం బడ్జెట్ కేటాయింపు రూ.21 లక్షల 47వేల కోట్లు ద్రవ్యలోటు జీడీపీలో 3.2 శాతం, రెవెన్యూ లోటు 2.1 శాతం వేతన జీవులకు పన్ను చెల్లింపులో ఊరట 2.5-5 లక్షల వరకు 5 శాతం పన్నురేటు మాత్రమే వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారికి ఎలాంటి పన్నులేదు రూ.50 లక్షల నుంచి కోటి ఉంటే టాక్స్ 10 శాతం రూ.కోటి మించి ఆదాయం ఉంటే టాక్స్ 15 శాతం రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో ఆంక్షలు నగదులో కేవలం రూ.2వేలు వరకే రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వొచ్చు చెక్ లేదా డిజిటల్ రూపంలో ఎంతైనా రాజకీయ విరాళం అపార్ట్మెంట్ నిర్మాణ రంగంలో రియల్ ఎస్టేట్ కు శుభవార్త బిల్డప్ ఏరియా స్థానంలో ఇకపై కార్పెట్ ఏరియా విలువకే రిజిస్ట్రేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత నుంచి పన్ను మొదలు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ పరిమితిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు ఆర్థిక వ్యవస్థ నుంచి బ్లాక్ మనీని తొలగిస్తాం సహేతుకంగా పన్నుల వ్యవస్థ నోట్ల రద్దు వల్ల వ్యక్తిగత ఆదాయ వివరాలు వెల్లడించారు ఇన్కం ట్యాక్స్ చెల్లింపుల శాతం 34.85కు చేరింది బ్లాక్ మనీ వెలికితీతకు సిట్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తున్నాం రూ.3 లక్షలకు మించితే నగదు చెల్లింపులు ఉండవు అమరావతి రైతులకు శుభవార్త, క్యాపిటల్ గెయిన్స్ రద్దు రాజధాని ప్రాంతంలో భూములు విక్రయించినవారికి పన్ను మినహాయింపు రాష్ట్రం ఏర్పాటు అయిన 2014 నుంచి క్యాపిటల్ గెయిన్స్ రద్దు ల్యాండ్ పూలింగ్లో ఉన్నవారికి మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ పన్ను రద్దు పన్ను ఎగవేతదారులపై చర్యలు కోసం కఠిన చట్టం ఆర్థిక నేరాలకు పాల్పడేవారిపై ప్రత్యేక చట్టం రక్షణ రంగానికి రూ.2లక్షల 74వేల 114 కోట్లు ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్నుల నిష్పత్తి సామాజిక న్యాయం చేసేదిగా లేదు 6లక్షల కంపెనీలు మాత్రమే రిటర్న్ సమర్పించాయి మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీ ప్లాంట్లకు ప్రోత్సహకాలు మొబైల్ పరిశ్రమ మౌలిక సదుపాయాలకు రూ.745కోట్లు చండీఘడ్ సహా హర్యానాలోని 8 జిల్లాలు ఇక కిరోసిన్ రహిత జిల్లాలు ఢిల్లీ, జైపూర్ లలో 5 మురుగు శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,96,134 కోట్లు నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు రూ.20వేల కోట్లు గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయి జాతీయ రహదారుల నిర్వహణ, కొత్తరోడ్ల నిర్మాణానికి రూ.64వేల కోట్లు చిన్న నగరాల్లో పబ్లిక్, ప్రయివేట్ భాగస్వామ్య పద్ధతిలో ఎయిర్ పోర్టుల నిర్మాణం లక్షన్నర గ్రామ పంచాయితీలకు స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ఆధార్ ఆధారిత పేమెంట్లు త్వరలో ప్రారంభం మొబైల్, డెబిట్ కార్డులు లేకున్నా ఆధార్తోనే పేమెంట్ చేయవచ్చు సెప్టెంబర్ 2017 నాటికి 20 లక్షల ఆధార్ బేస్డ్ చెల్లింపు కేంద్రాలు వచ్చే ఏడాది రెండున్నర వేల కోట్ల నగదు రహిత లావాదేవీల లక్ష్యం భీమ్ యాప్ ను 125 లక్షలమంది డౌన్ లోడ్ చేసుకున్నారు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎఫ్ఐపీబీ విధానం రద్దు సామాన్యులకు డిజిటల్ లావాదేవీల వల్ల మేలు బ్యాంకులు 10 లక్షల పీఓఎస్లను సమకూరుస్తాయి పోస్టాఫీసుల ద్వారా పాస్పోర్టులు జారీ సీనియర్ సిటిజన్ల హెల్త్ రికార్డు ఆథార్ తో అనుసందానం లక్షన్నర ఆరోగ్య కేంద్రాలు వెల్నెస్ సెంటర్లుగా మార్పు ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో రూ.లక్ష 67వేలకోట్ల పెట్టుబడులతో 250 ప్రతిపాదనలు మౌలిక రంగానికి రూ.3 లక్షల 96 వేలకోట్లు కేటాయింపు ఆర్థిక రంగంలో సంస్కరణల అజెండా కొనసాగుతుంది కొత్తగా ఎఫ్డీఐ పాలసీ సవరింపు టెలికం ఫైబర్ యాక్టీవిటీ కనెక్టివిటీ కోసం రూ.5వేలకోట్లు 2017-18 రైల్వే బడ్జెట్ రూ.1,31,000 కోట్లు వికలాంగులకు అనుకూలంగా ఉండేలా 500 రైల్వే స్టేషన్లు ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసే రైల్వే టికెట్లకు సర్వీస్ ట్యాక్స్ లేదు రైల్వేలో ప్రయాణికుల భద్రతకు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు రైల్వేలు, రోడ్లు, విమానయానానికి రూ.లక్షా 31వేల కోట్లు 2019 నాటికి అన్ని రైల్వేల్లో బయో టాయ్లెట్స్ 7వేల రైల్వే స్టేషన్లలో సోలార్ పవర్ ఏర్పాటు కొత్తగా 3,500 కిలోమీటర్లు రైల్వే లైన్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి రూ.52 వేల 393 కోట్లు రూ.500 కోట్లతో గ్రామాల్లో మహిళ శక్తి కేంద్రాలు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రూ.20వేల కోట్ల గృహ రుణాలు వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి రంగాలకు రూ.లక్షా 87 వేల కోట్లు జార్ఖండ్, గుజరాత్ లో రెండు ఎయిమ్స్ ల ఏర్పాటు విద్యారంగానికి ప్రాధాన్యత, యూజీసీలో సంస్కరణలు విద్యార్థులకు ప్రయోగాత్మకంగా 350 ఆన్లైన్ క్లాసులు ఉన్నత విద్యలో ప్రవేశ పరీక్ష కోసం కొత్త విధానం యువతలో నైపుణ్యాన్ని పెంచే సంకల్ప్ స్కీమ్ కు రూ.4వేల కోట్లు ప్రధాని ఆవాస్ యోజన పథకానికి రూ.23 వేలకోట్లు స్వచ్ఛ భారత్ మిషన్ మంచి ఫలితాలు ఇచ్చింది ప్రధానమంత్రి సడక్ యోజనకు రూ.19వేల కోట్లు గ్రామీణ నిరుపేదలకు కోటి పక్కా ఇళ్లు జాతీయ ఉపాధిహామీ పథకంలో మహిళలకు భాగస్వామ్యం పెంపు జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి రూ.8వేల కోట్లతో డెయిరీ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్ మైక్రో ఇరిగేషన్ కోసం రూ.5వేల కోట్లు పేదలకు సామాజిక భద్రత, గృహనిర్మాణం, ఉపాధి కల్పన ఆర్థిక సంస్థల బలోపేతం, డిజిటల్ వ్యవస్థ భూసార పరీక్షల కోసం కృషి విజ్ఞాన కేంద్రల్లో మినీ ల్యాబ్లు 63 వేల ప్రాథమిక సహకార సంఘాల కంప్యూటీకరణ రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు నాబార్డ్ తో వ్యవసాయ సహకార సంఘాల అనుసంధానం 60 రోజుల్లోపు రుణాలు చెల్లిస్తే రైతులకు పూర్తి వడ్డీ రాయితీ వచ్చే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్ ను ఎక్కువ ఖర్చు చేస్తాం పేదరిక నిర్మూలనే మా ప్రధాన లక్ష్యం ఈ బడ్జెట్ లో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నాం బడ్జెట్ ను ముందుగానే ప్రవేశపెట్టాం రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలపడం చారిత్రాత్మకం ప్రణాళికేతర, ప్రణాళిక వ్యయంపై స్పష్టత ఇచ్చాం ఈ బడ్జెట్ లో గ్రామీణ ప్రాంతాలు, పేదరిక నిర్మూలనకు పెద్దపీట మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత బ్లాక్ మనీపై పోరాటం చేశాం, మా చర్యలకు ప్రజలు మద్దతు తెలిపారు పారదర్శకత, ఖచ్చితత్వాన్ని పాటించాం గడిచిన రెండేళ్లుగా అహర్నిశలు కష్టపడుతున్నాం ప్రజలు మాపై ఎన్నో ఆశలు పెట్టుకుని, మమ్మల్ని గెలిపించారు రెండంకెల ద్రవ్యోల్బణం అమల్లోకి వచ్చింది ప్రజా ధనానికి మేము రక్షకులుగా ఉంటాం వృద్ధిరేటును ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నాం పారదర్శకత, అవినీతి లేని సుపరిపాలన కోసం గట్టిగా పని చేస్తున్నాం నల్లధనంపై యుద్ధం ప్రకటించాం, పెద్దనోట్లను రద్దు చేశాం వ్యవస్థీకృతంగా ఉన్న లోపభూయిష్ట విధానాలకు స్వస్తి చెప్పాం పరోక్ష పన్నులపై పార్లమెంట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది ప్రపంచ జీడీపీ ఈ ఏడాది పెరుగుతుందని ఐఎమ్ఎఫ్ అంచనా వేసింది సరైన నిర్ణయం ఎప్పటికీ విఫలం కాదని మహత్ముడి ఉద్బోధ నోట్ల రద్దు అన్నిరకాలుగా మేలు చేసింది నోట్ల రద్దు, జీఎస్టీ రెండు కీలక నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి తోడ్పుడుతాయి వచ్చే ఆర్థిక ఏడాదిలో జీడీపీ పెరుగుతుంది (సంబంధిత వార్తలు..) గృహ రంగానికి గుడ్న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే.. ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు ఆదాయపన్ను రేట్లు ఇలా.. తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ మన విద్యా సంస్థలకు అంతంతమాత్రమే! మోతెక్కనున్న కార్ల ధరలు సిగరెట్లు..సెల్ ఫోన్ల ధరలు ఇక భగ భగ బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... -
ఎంట్రెన్స్ పరీక్షలపై కీలక ప్రతిపాదన