
బాలియా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సభలో ఓ ముస్లిం మహిళా కార్యకర్తకు చేదు అనుభవం ఎదురైంది. సభకు హాజరైన ఆ మహిళ బుర్ఖాను తొలగించాలని పోలీసులు ఆదేశించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఈఘటనపై బాలియా ఎస్పీ అనిల్ కుమార్ స్పందించారు. అయితే మహిళను బుర్ఖా తొలగించించాలన్న ఈ ఘటనకు సంబంధించి తమకు సమాచారం అందలేదన్నారు. అయితే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సభలో ఎవరూ నల్లటి వస్త్రాలు చూపరాదన్న ఆదేశాలు ఉన్నాయని మాత్రం తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి సరైన చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు బుర్ఖాను ఎందుకు తొలగించాలని పోలీసులు...ఎందుకు ఆదేశించారో తనను తెలియదని ఆ ముస్లి మహిళ పేర్కొంది. అయితే ఆ మహిళతో పాటు ఆమె భర్త కూడా బీజేపీ కార్యకర్తలే కావడం గమనార్హం. కాగా ఆదివారం మీరట్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సభలో కొందరు సీఎం యోగికి వ్యతిరేకంగా నల్ల జెండాలను చూపించారు. అయితే ఆ ఆందోళన కారులను ... బీజేపీ కార్యకర్తలు చితకబాదారు. మళ్లీ అలాంటి ఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ముస్లిం మహిళను బుర్ఖా తొలగించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment