
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ గాలి దుమారం వణికించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గంటకు 70 కి.మీ. వేగంతో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. ఆ తీవ్రతకు ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు, గురుగ్రామ్, నోయిడాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నేడు అన్ని సాయంత్రపు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఆరుబయట ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని హెచ్చరించింది.
మరోవైపు ఉత్తర భారతదేశంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకూ తుపానులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. రాజస్తాన్లో ఇసుక తుపానులు, ఆరు రాష్ట్రాల్లో గాలి దుమారంతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం గంటకు 50–70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంది.
Comments
Please login to add a commentAdd a comment