
సాక్షి, గోరఖ్పూర్ : ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అన్నట్లు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా.. గోరఖ్పూర్ ఆలయానికి మాత్రం ప్రధానార్చకుడే అన్నట్లుంది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యవహారశైలి. తాజాగా దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గోరఖ్పూర్ మఠ్లో ప్రధానార్చకుడిగా ఆయన విధులు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గోరఖ్పూర్ మఠానికి మంగళవారం వచ్చిన ఆదిత్యనాథ్.. అక్కడే ఐదురోజుల పాటు ఉండనున్నారు. దసరా సందర్భంగా మఠం ఏర్పడ్డప్పటినుంచి ఆచరిస్తున్న పద్దతులను కొనసాగించేందుకు ఆదిత్యనాథ్ మఠాధిపతిగా గోరఖ్పూర్ వచ్చినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దుర్గా ఆరాధనలో భాగంగా నిర్వహించే శోభాయాత్ర, ఆయుధ పూజల్లో ఆదిత్యనాథ్ పాల్గొంటారని మఠాధికారులు ప్రకటించారు.
గోరఖ్పూర్ అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్కు ప్రొటోకాల్ ప్రకారం భద్రత కల్పించినట్లు ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ (ఐజీ) హరిరామ్ ప్రకటించారు. అల్లర్లకు అవకాశముందని నిఘా వర్గాలు తెలపడంతో ఆదిత్యనాథ్కు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ప్రొవెన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్స్, స్థానిక పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఆయన ఐజీ హరిరామ్ తెలిపారు.