
సాక్షి, న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రవాసీ భారతీయులకు సామాజిక భద్రత కల్పించే అంశంపై అమెరికా ద్వంద్వ విధానం అవలంభిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌధరి వెల్లడించారు. అమెరికాలో పనిచేస్తూ సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ కింద బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నప్పటికీ వారు ఆ ప్రయోజనాలు పొందడానికి అనర్హులవుతున్న విషయం వాస్తవమా, కాదా అని బుధవారం రాజ్యసభలో ఎంపీ వి. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సుదీర్ఘ సమాధానమిచ్చారు.
భారతీయులతో సహా ప్రవాసీ ఉద్యోగులు ఎవరైనా 40 క్వార్టర్లు లేదా 10ఏళ్లు పూర్తిగా సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ చెల్లించిన తర్వాతే వాటి ప్రయోజనాలు పొందడానికి అర్హులన్నది అమెరికా ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. అలాగే హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై పనిచేసే ప్రవాసీలు అమెరికాలో గరిష్టంగా 7ఏళ్లకు మించి నివసించడానికి వీల్లేదన్నది కూడా ఆ ప్రభుత్వ విధానమని మంత్రి పేర్కొన్నారు.
ఈ రెండు విధానాల మధ్య ఉన్న వైరుధ్యాల కారణంగా ఆయా వీసాలపై పని చేస్తూ సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ చెల్లిస్తున్న వారు దాని ప్రయోజనాలు పొందడానికి అనర్హులని మంత్రి తెలిపారు. ఇదే అంశాన్ని అమెరికా ప్రభుత్వంతో మంత్రిత్వ స్థాయిలో చర్చలు జరిపినప్పటికీ చట్టం అంగీకరించదంటూ అమెరికా వాదిస్తోందని మంత్రి సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment