క్షేమంగా చేరే ‘దారి’ లేదా? | how to go to safe from home? | Sakshi
Sakshi News home page

క్షేమంగా చేరే ‘దారి’ లేదా?

Jul 2 2014 1:26 AM | Updated on Apr 3 2019 7:53 PM

క్షేమంగా చేరే ‘దారి’ లేదా? - Sakshi

క్షేమంగా చేరే ‘దారి’ లేదా?

మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలను నడపడం, హెల్మెట్లు, సీటు బెల్టులు ధరించకపోవడం వంటి కారణాలతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం రోడ్ల లోపాలు, వాహనాల ఇంజన్లలో తలెత్తే సమస్యల కారణంగా జరిగే ప్రమాదాలు స్వల్

మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలను నడపడం, హెల్మెట్లు, సీటు బెల్టులు ధరించకపోవడం వంటి కారణాలతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం రోడ్ల లోపాలు, వాహనాల ఇంజన్లలో తలెత్తే సమస్యల కారణంగా జరిగే ప్రమాదాలు స్వల్పం.
 
తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో రోడ్లు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో చెప్పడానికి ఓ రెండు దుర్ఘటనలు చాలు. మహబూబ్‌నగర్ జిల్లా, పాలెం గ్రామంలో జరిగిన (అక్టోబర్ 30, 2013) వోల్వో బస్సు దహనం,  వైఎస్‌ఆర్‌సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డిని బలి తీసుకున్న కారు ప్రమాదం (ఏప్రిల్ 24, 2014) మన అధ్వాన రహదారులు మిగిల్చిన పెను విషాదాలు. ఈ నేపథ్యంలో రోడ్ల గురించి అధ్యయనం చేస్తే ఒళ్లు జలదరించే వాస్తవాలు తెలుస్తాయి.

రహదారుల చరిత్ర రక్తసిక్తం

భారత రహదారుల భద్రతా వ్యవస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 39,344 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాటిలో 14,966 మంది దుర్మరణం పాలైనారు. ఇక క్షతగాత్రులైతే దాదాపు 60,000 మంది అని రహదారుల భద్రతా వ్యవస్థ చెబుతోంది. దేశం మొత్తం మీద జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలు ఇంకాస్త కలవర పెడుతున్నాయి. 2011 సంవత్సరంలో 1,21,618 రోడ్డు ప్రమాదాలు దేశవ్యాప్తంగా జరిగాయి. 1,42,485 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరంతా పత్రికలలో పేర్కొన్నట్టు ‘అక్కడికక్కడే’ మరణించినవారు.  గాయాలతో, వైద్యం అందక తరువాత మరణించిన వారి వివరాలు ఇందులో లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన లెక్కల ప్రకారం 2010లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో, ప్రయాణాలలో మరణించిన వారి సంఖ్య 12 లక్షల 40 వేలు. అంటే, ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో రోజుకు 3,242 మంది చనిపోతున్నారు. ఏటా రెండు నుంచి ఐదు కోట్ల మంది వాటితో వికలాంగులుగా మిగులుతున్నారు. ప్రపంచ దేశాలలో ప్రతి లక్ష మందిలో సగటున 18 మంది రోడ్డు ప్రమాదాలకు గురౌతుండగా, మన దేశంలో ప్రతి లక్ష మందిలో 18.9 మంది వాటి బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి లక్ష వాహనాలలో సగటున 93. 3  రోడ్డు ప్రమాదాలకు గురౌతుండగా, భారత్‌లో ఆ వాహనాల సంఖ్య 100 అని తేలింది. ప్రపంచంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో 6 శాతం భారతదేశంలో జరుగుతున్నాయి. కానీ ప్రపంచ దేశాలలో ఉన్న వాహనాలలో మన వాటా ఒక్క శాతమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారమైతే మన దేశంలో ప్రతి వెయ్యి వాహనాలలో 35 ప్రమాదానికి గురౌతున్నాయి. రోడ్డు రవాణా సంస్థ నివేదిక ప్రకారం (ఫిట్జెరాల్డ్ , 2006) ప్రతి 10,000 వాహనాలలో 25.3 ప్రమాదానికి గురౌతున్నాయి. దేశంలో రోడ్డు ప్రమాదాలలో మృతుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. 2002 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయిన వారు 9,532. దేశం మొత్తం మీద జరిగిన ప్రమాదాలలో చనిపోయిన వారు 84, 674.
 

ఇంకా జాప్యం తగదు

ఇకనైనా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి మరణాలను నిరోధించాలి. ఈ ప్రమా దాలలో 85శాతం నిరోధించే అవకాశం ఉన్నవే. వాటి కారణంగా సంభవిస్తున్న చావులలో 75శాతం నిలువరించవచ్చు. ఎక్కువ ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయి. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలను నడ పడం, హెల్మెట్లు, సీటు బెల్టులు ధరించకపోవడం వంటి కారణాలతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం రోడ్ల లోపాలు, వాహనాల ఇంజన్లలో తలెత్తే సమస్యల కారణంగా జరిగే ప్రమాదాలు స్వల్పం. డ్రైవింగ్ లెసైన్స్‌ను మంజూరు చేయడానికి నిర్వహించే పరీక్షను కఠినతరం చేయడం, వాహనదారు లను నిబంధనలను పాటించేటట్టు చేసే చట్టాలను పటిష్టం చేయడం వల్ల చాలా వరకు ప్రమాదాలను తగ్గించవచ్చు. కానీ, ఏ రోడ్డు మీద ఏ వాహనం ఏ వేగంతో వెళ్లాలి అన్న కీలక అంశం మీద కూడా ఇంతవరకు ప్రభుత్వం దృష్టి పెట్టలేదు.

హెల్మెట్, సీటుబెల్ట్‌లే శ్రీరామరక్ష

రోడ్డు ప్రమాదాలు, పరిణామాల మీద విదేశాలలో విస్తృతమైన అధ్యయనం జరిగింది. హెల్మెట్ ధరించి ఉండగా ప్రమాదానికి గురైన ద్విచక్రవాహనదారు కంటె, అది లేకుండా ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన వారికి చావు ముప్పు ఇరవై రెట్లు అధికం. సీటు బెల్టు ధరించి కారులో ప్రయాణిస్తున్న వారు ప్రమాదానికి గురైతే ప్రాణాంతక గాయాల ముప్పు 40 నుంచి 60 శాతం తప్పే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన అధ్యయనం తేల్చింది.

ఆలస్యమే ప్రాణాలను హరిస్తుంది

పెద్ద ప్రమాదాలు జరిగిన  సందర్భాలలో మరణాలు 24 నుంచి 40 శాతం ఉంటాయి. ఈ మరణాలను నిరోధించడం దాదాపు సాధ్యం కాదు. అతిగా మద్యం సేవించి వాహనం నడపడం, విశ్రాంతి లేకుండా రాత్రీపగలూ పని చేయడం వంటి కారణాలతో ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతాయి.  భారీ వాహనాలను కూడా అర్ధరాత్రి లెసైన్సులు లేని వారు నడిపే ప్రమాదం ఉంటుంది. జాతీయ రహదారుల మీద వాహనాలను ఆపి లెసైన్సులను తనిఖీ చేయడంతో పాటు, మద్యం సేవిస్తే పట్టుకోవడానికి వీలు కల్పించే బ్రీత్ ఎనలైజర్ పరీక్షను కూడా నిర్వహించాలి. ఇలాంటి చర్యలు చేపట్టడానికి పెద్ద సమయం అక్కరలేదు. ప్రమాదం జరిగిన నాలుగు గంటలలోపు గాయపడిన వారికి వైద్యం అందిస్తే 20 శాతం మరణాలను నిరోధించే అవకాశం ఉంది.  అయితే సకాలంలో ఆస్పత్రికి తరలించినప్పటికీ గాయాల తీవ్రత వల్ల నోసో కామియల్ ఇన్ఫెక్షన్, లోపలి అవయవాలు మూకుమ్మడిగా వైఫల్యం చెందడం వంటి కారణాలతో కొందరు మరణిస్తారు. అంటే, ప్రమాదం సంభవించిన తరువాత దానికి గురైన వారిని క్షణాలలో ఆస్పత్రులకు తరలించడం మీదే అంతా ఆధారపడి ఉంది. ప్రభుత్వాలకు అర్థం కావలసిన అంశం ఇదే.

గమనించవలసిన వాస్తవం

2005 నుంచి రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ సంవత్సరంలో మన రోడ్ల మీద నమోదైన మరణాల సంఖ్య రోజుకు 30. ఈ సంఖ్య 2012కు 41కి చేరుకుంది. మరి 108 సేవ ఏమైనట్టు? ఆ సేవలు పూర్తిగా అవసరమైన చోటికి చేరలేదు. ఇక్కడ 65,714 కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. వీటిలో జాతీయ రహదారులు 4,472 కిలోమీటర్లు, రాష్ట్రాలవి 8,271 కిలోమీటర్ల రహదారులు. మిగిలినవి ఇతర రహదారులు. అయితే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజూ రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నది (సగటున) ఒక్కరే. కానీ మిగిలిన 40 మంది జాతీయ రహదారుల మీద, ఇతర  రహదారుల మీద జరిగిన ప్రమాదాలలోనే చనిపోతున్నారు. అక్కడ 108 అంబులెన్స్ సేవలు లేవనే చెప్పా లి. ఉన్నా ఒకటీ అరా మాత్రమే. దేశం మొత్తం రోడ్ నెట్‌వర్క్‌లో ఆంధ్రప్రదేశ్ వాటా రెండు శాతమే. అయితే దేశం మొత్తం మీద జరుగుతున్న రోడ్డు ప్రమా దాలలో మన వాటా మాత్రం 11.6 శాతం. ఇది దేశంలోనే చాలా ఎక్కువ.

ప్రమాదాలలో గాయపడిన వారికి సేవలు అందించేందుకు ప్రత్యేక్ష శిక్షణ ఇవ్వడం ప్రారంభించిన తరువాత సత్ఫలితాలు వచ్చినట్టు విదేశాలలో గమనిం చారు. మన రాష్ట్రంలో గాంధీ మెడికల్ కాలేజీ (హైదరాబాద్)లో ఇలాంటి ప్రత్యేక శిక్షణ ప్రవేశపెట్టారు. పెద్ద ప్రమాదాలలో గాయపడిన వారికి అన్ని ఆస్పత్రులు సేవలు అందించలేవు. ఇలాంటి వైద్యం అందించగల ఆస్పత్రిని ఎంచుకోవడం కూడా సవాలే. కాబట్టి ఆరోగ్యశ్రీలో అత్యవసర వైద్య సేవలను కూడా చేర్చాలి. గాయపడి కోలుకున్న వారికి పునరావాసం కల్పించడం మీద మన ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. ఇది దుష్పరిణమాలకు దారి తీస్తుంది. ఈ వ్యాసకర్త నిమ్స్ డెరైక్టర్‌గా ఉన్నపుడు ప్రమాదాలలో వెన్ను విరిగిన వారికి అవసరమయ్యే దీర్ఘకాల చికిత్సను ఉచితంగా అందించడానికి ఏర్పాటు ఉండేది. తరువాత ఈ సదుపాయం ఎత్తేశారు. ఇది ఘోరం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి. పొరుగున ఉన్న కర్ణాటక చాలా వరకు మెలకువలు నేర్చుకుంది. అదైనా గమనించాలి.

 (వ్యాసకర్త నిమ్స్ మాజీ డెరైక్టర్)  -  డాక్టర్  డి. రాజారెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement