
హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన వ్యూహాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పార్టీ నేత భూపీందర్ సింగ్ హుడా సమావేశం కానున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ మేజిక్ ఫిగర్కు 6 సీట్ల దూరంలో ఉండటంతో బీజేపీయేతర పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సన్నాహాలు ముమ్మరం చేసింది. 90 మంది సభ్యులు కలిగిన హరియాణా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది సభ్యులు అవసరం కాగా బీజేపీ 40 స్ధానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ మెరుగైన సామర్ధ్యం కనబరిచి 31 స్ధానాల్లో గెలుపొందింది. ఇక పది స్ధానాలు గెలుచుకున్న దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ కింగ్మేకర్గా మారింది. మరో ఏడు స్ధానాల్లో గెలుపొందిన స్వతంత్రులు సైతం కీలకంగా మారారు. వీరి మద్దతు కూడగట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్లు ప్రయత్నిస్తున్నాయి. హరియాణా వ్యవహారాలపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించేందుకు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా ఢిల్లీ చేరుకున్నారు. రోహ్తక్ జిల్లా గర్హి సంప్లా-కిలోల్ నియోజకవర్గం నుంచి హుడా గెలుపొందారు. ఇండిపెండెట్లతో పాటు జేజేపీ మద్దతు కూడగట్టేందుకు హుడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.