
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను తెలుగుదేశం పార్టీ(టీడీపీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లు మోసం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. బీజేపీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా లాలూచీ పడ్డారని ఆరోపించారు. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిలదీస్తే ఆయన చిత్తశుద్ధి ప్రజలకు తెలిసివుండేదని చెప్పారు.
నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించిన అంశాలను అధికార పార్టీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దుబారా ఖర్చుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తోందని దుయ్యబట్టారు. న్యాయం కోసం సచివాలయానికి వచ్చిన నాయి బ్రాహ్మణులను బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదా? అని నిలదీశారు.
బలహీన వర్గాలపై చంద్రబాబుకు గౌరవం లేదని బొత్స మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై ఈ నెల 30వ తేదీన అనంతపురంలో నయవంచన దీక్ష చేపట్టనున్నట్లు బొత్స ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment