
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన వరుణ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గత ఏడాదిన్నరగా అన్ని గ్రామాల్లో తాను పర్యటించానని కాంగ్రెస్ సర్కార్ పనితీరు పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్లో దేవాలయాల సందర్శనపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
కర్ణాటకలో పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందునే ఓటర్లను ఆకట్టుకునేందుకు మోదీ నేపాల్లో దేవాలయాల చుట్టూ తిరిగారని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.
ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఆలయాల సందర్శనకు మోదీ ఈ రోజే ఎందుకు ఎంచుకున్నారని ఆయన ప్రశ్నించారు. కాగా, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును మే 15న చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.