
సాక్షి, హైదరాబాద్ : కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్ జగన్ నివాసంలో ఈ భేటీ జరిగింది. అనంతరం కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ... వైఎస్ జగన్తో ఏకాభిప్రాయం కుదిరింది. నరసాపురం కార్యకర్తల సమక్షంలో నా నిర్ణయం ప్రకటిస్తా. మేము మాట్లాడుకున్న విషయాలను కార్యకర్తల మధ్యలో చెబితేనే బాగుటుంది. మా నియోజకవర్గంలో మా కార్యకర్తలు, నాయకులకు సమక్షంలో తెలియచేస్తాను’ అని తెలిపారు. కాగా కొత్తపల్లి సుబ్బారాయుడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... నరసాపురం అసెంబ్లీ టికెట్ ఇస్తానని చివరి వరకూ నమ్మించి మోసం చేశారు. దీంతో ఆయన కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు, టీడీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్తో కొత్తపల్లి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు వైఎస్సార్ సీపీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, గిరిజన నాయకుడు శంకర్ నాయక్, మచిలీపట్నంకు చెందిన మాధవిలతా తదితరులు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.