
టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఒక్కరికీ కూడా పద్మ అవార్డులు ఇవ్వకపోవడంపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మ అవార్డుల ఎంపికలో కొన్ని రాష్ట్రాలకే పెద్దపీట వేస్తూ తెలంగాణ సహా పలు రాష్ట్రాలను పట్టించుకోకపోవడంపై వినోద్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పద్మ అవార్డులకు నిర్దేశించిన మార్గదర్శకాలకు తగ్గ ప్రతిభ తెలంగాణలో చాలా మంది కవులు కళాకారులకు ఉన్నా వారిలో ఒక్కరు కూడా ఆ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొన్ని రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో అవార్డులు లభించి ఇంకొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోతే అది మంచి సంప్రదాయం అనిపించుకోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా వాటిని ఎంపిక కమిటీ పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని వినోద్ అన్నారు. ఇకపై పద్మ అవార్డుల ఎంపికలో సమ తుల్యత ఉండేలా అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తన లేఖలో ప్రధానిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment