
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్లో ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నిక హోరాహోరీగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదనన్ బరిలోకి దిగుతుండగా డీఎంకే నుంచి మరుదు గణేశ్, శశికళ వర్గం నుంచి టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు.
జయలలిత నియోజకవర్గంలో గెలిచి.. ఆమె వారసులం తామేనని నిరూపించుకోవాలని ఇటు అధికా అన్నాడీఎంకే, అటు శశికళ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. డీఎంకే కూడా ఈ ఎన్నికలో గట్టి పోటీ ఇచ్చి.. ప్రత్యర్థులకు షాక్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 21న జరిగే ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.