వారిని ప్రజలే తరిమి కొడతారు | Minister harish rao fires on congress leaders | Sakshi
Sakshi News home page

వారిని ప్రజలే తరిమి కొడతారు

Published Thu, Feb 1 2018 3:18 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Minister harish rao fires on congress leaders - Sakshi

సాక్షి, సిద్దిపేట: ‘కరువు ప్రాంతానికి గోదావరి నీళ్లు తరలించి బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతోంది. ఇది చూసి సంతోషిం చాల్సిన కాంగ్రెస్‌ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారు. అలాంటి వారిని ప్రజలే తరిమి కొడతారు’అని భారీ నీటి పారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

దౌల్తాబాద్‌ మండలం దొమ్మాటలో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ పనులను ప్రారంభించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ పనులు, ఉపరితల కాల్వల పనులను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ, ప్రాజెక్టులతో భారీ ప్రయోజనం ఉంటుందని, ఇలాంటి పరిస్థితిలో కొందరు భూమిని త్యాగం చేయక తప్పదన్నారు. భూములు, గ్రామాలు త్యాగం చేసిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు.

కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఏనాడూ ప్రాజెక్టుల గురించి ఆలోచించలేదన్నారు. కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ పనులు వేగవంతం గా జరుగుతున్నాయన్నారు. మట్టి తీసే పనులు 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఉపరితల కాలువల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి మాట్లాడకుండా ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుల శాశ్వత కష్టాలు తీర్చే ప్రాజెక్టులు కడుతున్న టీఆర్‌ఎస్‌ను విమర్శించడం శోచనీయం అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement