
సాక్షి, హైదరాబాద్: కొన్ని విద్యాసంస్థల అధిపతు లు టీడీపీ నేతలతో కలసి రాజకీయాలు చేస్తున్నారని.. ఇది సరికాదని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. తెలంగాణలో టీడీపీ నేతల ఆటలు ఇక సాగబోవన్నారు. తెలంగాణభవన్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేజీ టు పీజీ విద్య విషయంలో మహాకూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ‘కార్పొరేట్ విద్యాసంస్థలు టీడీపీకి అనుబంధంగా టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కరపత్రాలు విడుదల చేశాయి. ప్రతి ప్రభుత్వ స్కూల్ లో టాయిలెట్లు కట్టించాం.
1.68 లక్షల మంది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరారు. బీసీల కోసం వసతి గృహాలు పెట్టించినందుకు ఆర్.కృష్ణయ్య సైతం కేసీఆర్ను పొగిడారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే విశ్వవిద్యాలయాలను భ్రష్టు పట్టించాయి. ప్రభుత్వ విద్యావ్యవస్థను గాడిలో పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. బోధన, ఫలితా ల్లో నాణ్యత పెంపొందించాలని విద్యాసంస్థలను అడగొద్దా.. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏ కార్పొరేట్ కళాశాల ఏర్పాటుకు అనుమతినివ్వలేదు. కొత్త వర్సిటీలను రానివ్వబోమని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చెబుతున్నారు. అసలు నిబంధనలు పెట్టకుండా విద్యా వ్యవస్థ ఎలా నడుస్తుందో వారే చెప్పాలి...’అని పల్లా వ్యాఖ్యానించారు.