![Congress has won only four seats in the 21 constituencies witch won last time - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/12/GANDHI-BHAVAN-8.jpg.webp?itok=xSzZIy7D)
2014 ఎన్నికల్లో గెలిచిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి నాలుగు చోట్ల మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది.హుజూర్నగర్, పాలేరు, ఇల్లందు, మధిర నియోజకవర్గాలను మళ్లీ నిలబెట్టుకుంది. 2014లో గెలిచిన ముథోల్, జగిత్యాల, జహీరాబాద్, వనపర్తి, అలంపూర్, గద్వాల, నల్లగొండ, నాగార్జునసాగర్, కోదాడ, డోర్నకల్, ఖమ్మం, కల్వకుర్తి, చేవెళ్ల, నారాయణ్ఖేడ్, మిర్యాలగూడ, పరిగి, మక్తల్ స్థానాల్లో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అయితే, గత ఎన్నికలలో ఓడిపోయిన 15 స్థానాల్లో కాంగ్రెస్ ఈసారి గెలిచింది. ఎల్లారెడ్డి, కొల్లాపూర్, సంగారెడ్డి, మంథని, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మునుగోడు, నకిరేకల్, మహేశ్వరం, భద్రాచలం, పినపాక, వైరా, తాండూరు, ఎల్బీ నగర్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
‘ఏజెన్సీలు’ హస్తగతం
గిరిపుత్రులు హస్తానికే మొగ్గు చూపారు. తాజా ఎన్నికల ఫలితాల్లో కారు జోరు మీద ఉన్నా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఓటర్లు మాత్రం కాంగ్రెస్వైపే ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో మూడు, ఏటూరు–నాగారం పరిధిలో రెండు, భద్రాచలం పరిధిలో 5 రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి. పది నియోజకవర్గాల్లో ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో కూటమి తరపున కాంగ్రెస్ బలపర్చిన టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో లంబాడాలు, ఆదివాసీలకు మధ్య నెలకొన్న వివాదంలో ప్రభుత్వం సైతం పెద్దగా జోక్యం చేసుకోకపోవడంతో ఆదివాసీలు కాంగ్రెస్ వెపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment