Telangana Election Result 2018
-
ఎవరా ఇద్దరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో ఉండే ఇద్దరు మహిళలు ఎవరనే అంచనాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ తరఫున ఎం.పద్మాదేవేందర్రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆకుల లలిత ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ ఖరారు చేసిన అభ్యర్థుల్లో సత్యవతి రాథోడ్ ఉన్నారు. మొత్తం ఐదుగురు సభ్యుల్లో ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా పని చేసిన పద్మాదేవేందర్రెడ్డి తాజా విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఈసారి పదవి లభించపోవడంతో తదుపరి విస్తరణలో అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో విప్గా పని చేసిన గొంగిడి సునీత సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు బీసీల్లోని ప్రధాన సామాజికవర్గమైన మున్నూరు కాపుల నుంచి మంత్రివర్గంలో ఎవరికీ అవకాశం దక్కలేదు. ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ వర్గం వారే కావడంతో ఈ కోటాలో సీఎం గుర్తిస్తారని భావిస్తున్నారు. మరోవైపు 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన సత్యవతి రాథోడ్ డోర్నకల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డి.ఎస్. రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. అనంతరం రెడ్యానాయక్ టీఆర్ఎస్లో చేరినా సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్లోనే కొనసాగుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్లో చేరిన సమయంలోనే ఆమెకు మంత్రి పదవి హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం కాకుండా 17 మంది మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 11 మంది (సీఎం కాకుండా) మంత్రులు ఉన్నారు. వారిలో ఎస్టీ వర్గానికి, మహిళకు చోటు దక్కలేదు. సత్యవతి రాథోడ్కు మంత్రిగా అవకాశం కల్పిస్తే ఆ రెండు కోటాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యవతి రాథోడ్కు మంత్రిగా అవకాశం దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు గత ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు వచ్చాయి. ఇదే లెక్కన తదుపరి విస్తరణలో తనకు అవకాశం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ భావిస్తున్నారు. -
కేబినెట్లోకి ఇద్దరు మహిళలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రిమండలిలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు వెల్లడించారు. మంత్రివర్గంలోకి గరిష్టంగా 17 మందిని తీసుకోవచ్చని, రాబోయే రోజుల్లో ఇంకా ఆరుగురిని (సీఎం కాకుండా ప్రస్తుతం 11 మంది మంత్రులు ఉన్నారు) తీసుకునేది ఉందన్నారు. అందులో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. తాము మహిళలను నిర్లక్ష్యం చేయబోమని... వారిపట్ల గౌరవం ఉందన్నారు. తమకు మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారని.. వారి మద్దతే లేకపోతే తాము అధికారంలోకి రాగలిగేవారం కాదన్నారు. తాజాగా ప్రకటించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలోనూ ఒక మహిళకు స్థానం కల్పించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కేబినెట్లో మహిళలకు చోటు కల్పించాలంటూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ సందర్భంగా శనివారం శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేసిన సూచనకు సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ఈ మేరకు బదులిచ్చారు. అలాగే వివిధ అంశాలపై సమాధానమిచ్చారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... రైతులకు రుణమాఫీ చెక్కులు... కేంద్రం పీఎం–కిసాన్ పథకం కింద ఐదెకరాల్లోపు రైతులకు ఏటా ఇచ్చే రూ.6వేల నగదుతో సంబం ధం లేకుండానే రైతుబందు కింద రైతులకు ఎకరాకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తాం. రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు అందజేసే ఆలోచన చేస్తున్నాం. రైతులకు వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు ఇస్తాం. రైతులకు 4–5 దఫాలుగా రుణమాఫీ చేస్తాం. ఈ విషయంలో రైతులు ఆందోళనకు గురికావద్దు. ఒకవేళ కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఏర్పడితే ముందుగానే మాఫీ చేస్తాం. ఈ విషయంపై రైతులకు నేనే లేఖ రాస్తా. కిందటిసారి తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడు బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టారు. రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ కాగానే లబ్ధిదారుల నుంచి బ్యాంకర్లు వడ్డీ కట్ చేసుకున్న సంఘటనలు కొన్నిచోట్ల జరిగాయి. మరోసారి రైతులకు అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు అందజేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రూ. 1.60 లక్షలలోపు రుణాలపై రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. ధరణి వెబ్సైట్ చూసి రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశిస్తాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ భూములను ఆక్రమించిన వారిలో అనర్హులనే ఖాళీ చేయిస్తాం. రైతులకు ఇంకొకరి అజమాయిషీ ఉండనీయం. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వలేం... కౌలు రైతులకు రైతుబంధు పథకం అమలు చేయడం సాధ్యం కాదు. రైతుబంధు సొమ్ము తీసుకునే రైతులే ఉదారంగా కౌలు రైతులకు ఎంతో కొంత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. పాత పాస్బుక్కుల్లో ఉన్న 33 అనవసర కాలమ్లను ఎత్తివేశాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వచ్చే ఆరు నెలల్లో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తాం. భూముల విషయంలో అటవీ, రెవెన్యూ అధికారుల మధ్య సమస్యలు ఉన్నాయి. పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. రెండు, మూడు నెలల్లో ధరణి వెబ్సైట్ను అందుబాటులోకి తెస్తాం. గంట గంటకు రికార్డులు అప్డేట్ అవుతాయి. భూపాలపల్లిలో ఒక రైతు కుటుంబం ఎమ్మార్వోకు లంచం కోసం భిక్షాటన చేయడం చూసి వెంటనే చర్య తీసుకున్నాం. అమెరికా అప్పులున్న దేశం కూడా! ప్రపంచంలో ఏదైనా అత్యంత ధనిక దేశం ఉందంటే అది అమెరికానే. అదే సమయంలో అత్యంత అప్పులున్న దేశం కూడా అదే. అటువంటి అమెరికా తెలివిలేక అప్పులు చేసిందా? మన కంటే పెద్ద దేశమైన చైనా జీఎస్డీపీ మన కంటే తక్కువ. 1980 వరకు చైనా మనకంటే పేదరికంలో ఉండేది. చైనాలో కరువు వస్తే ఒకేసారి 7–10 లక్షల మంది చనిపోయారు. అక్కడి పాలకుల విధానాల వల్ల 2, 3 దశాబ్దాల కాలంలోనే చైనా మన కంటే వేగంగా అభివృద్ధి చెందింది. జపాన్ జీఎస్డీపీ కంటే 300 శాతం అధికంగా అప్పులు తీసుకుంటుంది. అప్పులు తెచ్చేది తినడానికి కాదు.. అభివృద్ధి కోసం, ప్రాజెక్టులు కట్టడం కోసమే. రాష్ట్రానికి చెందిన 25 సంవత్సరాల బాండ్లు కూడా హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. తెలంగాణ బాండ్లను బ్యాంకులు పోటీపడి కొన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల కోసమే అప్పులు చేస్తున్నాం. వాటిని తీర్చే సత్తా తెలంగాణ రాష్ట్రానికి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిని ఎక్కడా దాటలేదు. అప్పుల విషయంలో ఆర్బీఐ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ప్రభుత్వాలు చేసే అప్పులు ప్రైవేటు అప్పుల్లా ఉండవు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే సంస్థలు అప్పులు ఇస్తాయి. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన ఐదారు రోజుల్లోనే రూ. 15 వేల కోట్ల అప్పు ఇస్తామని పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. రూరల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 50 వేల కోట్ల వరకు రుణం ఇస్తామని చెప్పింది. కాళేశ్వరం చివరి దశలో ఉన్నందున దానికి అప్పు ఇవ్వాలని కోరాం. దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి... రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.50 వేల కోట్లకుపైగా నిధులు పోతున్నా రాష్ట్రానికి రూ. 24 వేల కోట్లే తిరిగి వస్తున్నాయి. మిగిలిన రూ. 26 వేల కోట్లు కేంద్రమే ఉపయోగించుకుంటోంది. దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను గుప్పిట్లో పెట్టుకుంది. రాష్ట్రాల పరిధిలోని అనేక శాఖల అధికారాలు కేంద్రానికి ఇచ్చారు. రాష్ట్రాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాల గురించి కేంద్రం నిర్ణయం తీసుకోవాలా? రోజువారీ కూలీకి ఢిల్లీ నుంచి అనుమతి కావాలా? ప్రధాని మోదీ చెబుతున్న సహకార సమాఖ్య ఎక్కడా లేదు. నదీ జలాల వాటాపై తేల్చాలని ప్రధాని మోదీకి స్వయంగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. ఉమ్మడి జాబితాలోని అంశాలతో సమస్యలు తలెత్తుతున్నాయి. దళితులు, గిరిజనులు ఇప్పటికీ అభివృద్ధికి దూరంగానే ఉన్నారు. రెడ్డి, వైశ్యులు, వెలమలు కూడా కార్పొరేషన్లు కోరుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో కేంద్రం నుంచి ప్రతి నెలా ఒకటో తేదీకి నిధులు వచ్చేవి. మోదీ వచ్చాక అవి ఆలస్యమవుతూ 15వ తేదీకి వచ్చే పరిస్థితి నెలకొంది. కేంద్రం నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రాజెక్టులు కడుతున్నాం. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వచ్చాయి. రాష్ట్రం కోసం ప్రొటోకాల్ తక్కువ ఉన్న మంత్రులను కూడా స్వయంగా కలిశా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాకు నీరందిస్తాం. ఈ ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రుణాల రీ షెడ్యూల్కు ఆర్బీఐ అవకాశం ఇచ్చింది. అసెంబ్లీ తర్వాత రుణాల రీ షెడ్యూల్ చేయాలని ఆదేశాలు ఇస్తాం. లోక్సభ ఎన్నికల తర్వాతైనా కేంద్రంలో గుణాత్మక ప్రభుత్వం ఏర్పడాలి. ఎవరితోనూ రాజీపడాల్సిన అవసరం మాకు లేదు. వచ్చే పదేళ్లలో తెలంగాణ ఖర్చు పెట్టబోయే బడ్జెట్ రూ. 30 లక్షల కోట్లు. త్వరలో కొత్త మున్సిపల్ చట్టం... మనిషి కులం మారదు. అయినా ప్రజలు పలుమార్లు కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండటం శోచనీయం. ఈ పరిస్థితి మారాలి. రాబోయే కొన్ని నెలల్లోనే పలు సంస్కరణలు అమలు కాబోతున్నాయి. పుట్టిన వెంటనే కుల ధ్రువీకరణ పత్రం జారీ చేస్తాం. సర్టిఫికెట్ల జారీలో ఉన్న లొసుగులను సరిచేస్తాం. మున్సిపాలిటీల్లో లంచం ఇవ్వకుండా పనులు జరిగే రోజులు రావాలన్నారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తాం. త్వరలోనే కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ప్రతినెలా పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేస్తాం. కంక్లూజివ్ టైటిల్ను తీసుకొస్తాం. దీనివల్ల ఆక్రమణలు జరగవు. ప్రజల ఆస్తులకు ప్రభుత్వం బాధ్యత వహించి రక్షణగా ఉంటుంది. ప్రభుత్వ శాఖల భూములను కూడా గుర్తిస్తాం. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు రాని వారు లక్ష మంది ఉన్నారు. వారందరికీ పట్టాలు ఇస్తాం. మొదటి విడతలోనే ఎన్నికలు పెట్టాలని కోరాం... లోక్సభ ఎన్నికలను రాష్ట్రంలో మొదటి విడతలో పెట్టాలని కోరాం. ఎందుకంటే ఎప్పుడో చివరి దశలో ఎన్నికలు పెడితే అప్పటివరకు ఎన్నికల కోడ్ వల్ల పనులేవీ చేయకుండా కూర్చోవాల్సి వస్తుంది. ముందే ఎన్నికలు పెడితే మున్సిపాలిటీలు, జెడ్పీ, మండల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల కోసం 4–5 వేల సిబ్బందిని భర్తీ చేసి వాటిని పరిపుష్టం చేస్తాం. ప్రతి జిల్లాలో సెషన్ కోర్టులు అవసరం. ఈ విషయంపై సీజేతో మాట్లాడతా. దేశంలో ఆరు పెద్ద నగరాలకు కేంద్రం ఏటా రూ. 5 వేల కోట్లు కేటాయించి అంతే మొత్తంలో ఆయా రాష్ట్రాలు కూడా కేటాయింపులు చేస్తే రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయి. ఈ విషయాన్ని ప్రధానికి కూడా చెప్పా. చైనాలోని బీజింగ్లో ఐదు ఔటర్ రింగ్రోడ్డులు ఉన్నాయి. మరొకటి కూడా కడుతున్నారు. అయినా అక్కడ ట్రాఫిక్జాం అవడానికి ప్రధాన కారణం బీజింగ్లో 70 లక్షల కార్లు ఉండటమే. ఢిల్లీలోనూ కాలుష్యం పెరుగుతోంది. హైదరాబాద్ ఇందిరా పార్కు లాంటి చోట్ల ఆక్సిజన్ సెల్లింగ్ సెంటర్లు వచ్చే పరిస్థితి నెలకొంది. ఒక పరిమితి దాటితే ప్రజలను పట్టణాలకు వలస రానీయకూడదా అన్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ విషయంలో మనం జాగ్రత్త పడాల్సి ఉంది. ప్రతిపక్షాల నుంచి ఆశించిన సూచనలేవీ? ప్రతిపక్షాల నుంచి ఆశించిన సూచనలు, సలహాలు రాలేదు. నాలుగేళ్లుగా చెబుతున్నవే మరోసారి చెప్పాయి. రూ. 80,200 కోట్లను సభ మంజూరు చేయాల్సి ఉంది. బడ్జెట్ను గుణాత్మకంగా చూడాలి.. గణాత్మకంగా కాదు. 31 మార్చి తర్వాతే ఎకనామిక్ సర్వే పెడతారు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం వస్తే అప్పటి పరిస్థితినిబట్టి జూన్–జూలైలలో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడతాం. విపక్షాలు కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నాయి. ముందుస్తు ఎన్నికలపై శ్రీధర్బాబు వ్యాఖ్యలు వాస్తవం కాదు. నా అంచనా ప్రకారం గత జూలై–ఆగస్టులలోనే ఎన్నికలు జరగాల్సింది. ఎన్నికల సంఘం మాకు సహకరించలేదు. కాంగ్రెస్ పార్టీ రూ. 2 లక్షలు రుణమాఫీ అని చెప్పింది. మేము మాత్రం నాలుగు విడతల్లో రూ. లక్ష మాత్రమే మాఫీ చేస్తామని చెప్పాం. దానికి ఆమోదంగానే ప్రజలు మమ్మల్ని గెలిపించారు. రాజీవ్ స్వగృహకు సంబంధించి రుణాలను మాఫీ చేస్తానని నేను చెప్పలేదు. రాజీవ్ గృహకల్పకు సంబంధించి రూ. 4 వేల కోట్లు మాఫీ చేశాం. రైతు అంటే ఎవరు? ముఖ్యమంత్రి ప్రసంగం ముగిశాక కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్బాబు మాట్లాడుతూ కౌలు రైతుకు రైతుబంధు సొమ్ము ఇవ్వడానికి సాంకేతిక సమస్య ఉందంటున్న ప్రభుత్వం భూమి ఉన్నవాడే రైతా? పంట సాగు చేసే వాడు రైతా? నిర్వచనం చెప్పాలని కోరారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ వ్యవసాయ భూమిని పట్టాగా హక్కున్న వాడే రైతు అన్నారు. భూటాన్ దేశంలో నేచురల్ హ్యాపినెస్ అంటూ శ్రీధర్బాబు అంటున్నారనీ, పక్క రాష్ట్రం వారు కూడా ఏదేదో చేశారంటూ ఎద్దేవా చేశారు. రెండు బిల్లులకు ఆమోదం... శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై జరిగిన చర్చ ఆమోదంతో ముగిసింది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. 2018–19 సవరించిన అంచనాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. -
ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్ తెలంగాణ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అహ్మద్ ఖాన్తో బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ.. చార్మినార్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ను సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్గా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. జనవరి 17 నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. (ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన చాన్స్.. కేసీఆర్కు ఒవైసీ థాంక్స్) కాగా, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ రేపు (గురువారం) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముందు ఉదయం 11 గంటలకు గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు. రేపు స్పీకర్ ఎన్నికల షెడ్యుల్ ప్రకటన విడుదల చేస్తారు. ఎల్లుండి స్పీకర్ను ఎన్నుకుంటారు. 19వ తేదీన తెలంగాణ అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగంపై 20 తేదీన అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. -
కుట్రల వల్లే ఓటమి: మాజీ మంత్రి
అశ్వారావుపేటరూరల్: స్వార్థ రాజకీయాలు, కొన్ని కుట్రల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిందని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఈ రెండింటినీ సమానంగా చూడాలని, ఉభయ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి తానే బాధ్యత వహిస్తానని, వేరే వాళ్లను నిందించవద్దని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వినాయకపురం గ్రామంలో ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గ విసృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో నష్టపోవడంపై తమతోపాటు సీఎం కేసీఆర్ గుండెల్లో కుడా బాధ నెలకొందన్నారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన సత్తుపల్లి నియోజకవర్గంలో గెలుస్తామని ఆశపడ్డానని, అలాగే అశ్వారావుపేట అసెంబ్లీ సీటు మొదట గెలవాల్సిన స్థానమని, ఇలాంటి చోట స్వార్థ రాజకీయాల కోసం బలి పెట్టుకున్నారని, ఓడిపోయినందుకు చాలా బాధగా ఉందని చెప్పారు. ఈ స్థానాన్ని చేజేతులారా పొగట్టుకున్నామని, ఇప్పుడు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదని, జరిగింది మనస్సులో పెట్టుకోవద్దని, జరగాల్సినది చూడాలని సూచించారు. జిల్లాలో అభివృద్ధి కొనసాగే బాధ్యత తనదేనని, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి గడిచిన నాలుగేళ్లలో మిగిలిన జిల్లాల కంటే అధిక ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు. జిల్లాలో ఇప్పటికే 800 మెగావాట్లతో కేటీపీఎస్ను, 12వందల మెగావాట్లతో భద్రాద్రి పవర్ ప్లాంట్లను పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో కలిసి పని చేయాలని, కొట్లాడుకొని వేరే పార్టీల వద్ద చులకన కావద్దని కోరారు. త్వరలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ అంతా సిద్ధం కావాలని, సర్పంచ్ టికెట్ల కోసం పొట్లాడుకోవద్దన్నారు. గ్రామ నాయకులు ఏకతాటిపైకి వచ్చి అభ్యర్థులను ఎంపిక చేసుకొని గెలిపించుకోవాలని కోరారు. అన్ని సర్పంచ్ స్థానాలనూ గెలిపించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పును సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ నూకల నరేష్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ రవీందర్, మండలాధ్యక్షుడు బండి పుల్లారావు, నాగమణి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, రైతు సమన్వయ కమిటీ బాధ్యులు జూపల్లి రమేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తుమ్మలకు మళ్లీ మంత్రి పదవి రావాలి: తాటి నియోజకవర్గస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మె ల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల పార్టీకి నష్టం జరిగిందన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మరోసారి అవకాశం ఇవ్వాలని, ఆయనకు మంత్రి పదవి వస్తేనే జిల్లా లో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. సస్పెండ్ డిమాండ్తో రసాభాస టీఆర్ఎస్ అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి సమావేశంలో పార్టీ ఇన్చార్జ్ రవీందర్ ప్రసంగిస్తున్న క్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే వర్గీయులు, ఖమ్మం ఎంపీ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీకి ద్రోహం చేసిన వారిని సస్పెంచ్ చేయాలంటూ.. ఎమ్మెల్యే వర్గీయులు డిమాండ్ చేశారు. ఒకరినొకరు నెట్టుకుంటున్న క్రమంలో స్థానిక నేత జూపల్లి రమేష్ ఇరువర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించినా వినలేదు. 10 నిమిషాలపాటు సభలో గందరగోళం నెలకొంది. తోపులాట, మాటల యుద్ధం సాగింది. పార్టీ ఇన్చార్జ్ హెచ్చరించడంతో వారంతా శాంతించారు. -
‘టీడీపీతో లాభం లేదు.. మరోసారి పొత్తు వద్దు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఆపార్టీ నేతలతో సమావేశమైయ్యారు. ఆదివారం గండిపేటలోని ఆమె ఫాంహౌజ్లో జరిగిన ఈ సమావేశాంలో భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డితో సహా పలువురు కీలక నేతలు హాజరైయ్యారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కేవలం కొన్ని జిల్లాల్లోనే ప్రభావం చూపిందని అన్నారు. అన్ని జిల్లాల్లో పొత్తు ఉపయోగం ఉండదని తాము ముందు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని ఆమె వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లోక్సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. తాను లోక్సభకు పోటీచేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అరుణ తెలిపారు. ఓడిపోవడానికి అనేక కారణాల్లో టీడీపీతో పొత్తు కూడా ప్రధానమన్నారు. టీఆర్ఎస్ ఒక్కొక్క నేతను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ను ఓడించిందని, పాలమూరులో ఓటమిపై అనేక అనుమనాలున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, రాజగోపాల్ రెడ్డి, హరిప్రియానాయక్, హర్షవర్ధన్, జానారెడ్డి, దామోదర, సునీతా లక్ష్మారెడ్డి పొన్నాల తదితరులు హాజరైయ్యారు. -
ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే.. రాజాసింగ్ తీవ్ర నిర్ణయం
-
ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే.. రాజాసింగ్ తీవ్ర నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలతో కరడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడిన ఆయన.. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణం స్వీకారం చేయరాదని నిర్ణయించారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ఎంఐఎం సీనియర్ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ను ప్రొటెం స్పీకర్గా నియమించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఐఎం హిందూధర్మానికి వ్యతిరేకమైన పార్టీ అని, అందుకే ఆ పార్టీ నేత ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయరాదని నిర్ణయించానని ఆయన ఒక వీడియోలో తెలిపారు. అవసరమైతే ఈ విషయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవడానికీ సిద్ధంగా ఉన్నానన్నారు. కొత్త స్పీకర్ ఎన్నికైన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేస్తానని రాజాసింగ్ తెలిపారు. -
‘ఓటరు ఆలోచన మారింది..పార్టీ థింకింగ్ కూడా మారాలి’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ లైన్ ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అభిప్రాయపడ్డారు. ఓటర్ల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని, దానికి అనుగుణంగా పార్టీ తీరు కూడా మారాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభావంపై గాంధీభవన్లో సమీక్షా సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సమావేశంలో దామోదర మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధానంగా మూడు, నాలుగు కారణాలున్నాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అధికార దుర్వినియోగంతో పాటు ఎన్నికల సంఘం తీరుపై అనేక అనుమానాలున్నాయని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువగా ఉందని, ఈసీ నిర్ణయాలు కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి పూర్తిస్థాయిలో తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, ప్రజాసమస్యలపై పోరాటం చేయ్యలేకపోయ్యామని దామోదర తెలియజేశారు. అభివృద్ధికి ఓట్లకు సంబంధంలేదని, చివరి ఇరవై రోజులు ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు. -
ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జనవరి 17 నుంచి 20 వరకు నూతనంగా ఏర్పడిన సభ తొలిసారి సమావేశం కానుంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా శాసనసభ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం నేత, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్కు నియమితులుకానున్నారు. జనవరి 16న సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో ఆయనచే గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మర్నాడే (జనవరి 17న) నూతనంగా ఎన్నికైన సభ్యులతో అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం జూబ్లీహాల్లో సభ్యులకు విందు కార్యక్రమం ఉంటుంది. అదే రోజున శాసనసభ స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ స్వీకరణ కార్యక్రమాలు జరుగుతాయి. జనవరి 18న సభ్యులు శాసనసభ స్పీకర్ను ఎన్నుకుంటారు. ఎన్నిక అనంతరం నూతన స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు సాగుతాయి. అనంతరం స్పీకర్ బీఎసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. జనవరి 19న నూతనంగా ఏర్పడిన సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ మర్నాడే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం కార్యక్రమం జరుగుతుంది. కాగా డిసెంబర్ 11న వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 13న కేసీఆర్ రెండోసారి సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. వివిధ కారణాల వల్లన శాసన సభ్యుల ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. -
ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన చాన్స్.. కేసీఆర్కు ఒవైసీ థాంక్స్
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్కు అరుదైన గౌరవం దక్కనుంది. తెలంగాణ అసెంబ్లీలో ఆయన ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అంతేకాకుండా కొత్త స్పీకర్ ఎన్నికయ్యేవరకు ప్రొటెం స్పీకర్ సభను నిర్వహిస్తారు. సాధారణంగా సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్గా నియమించడం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ.. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ను సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్గా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్లో ధ్రువీకరించారు. ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారని, ఇందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞుడినై ఉంటానని ఆయన ట్విట్ చేశారు. -
ఏడాదంతా రాజకీయ రికార్డులే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ముందస్తు’ ఎన్నికల నగారాకు మన జిల్లానే వేదికగా నిలిచింది. జైత్రయాత్రకు ఇక్కడే అంకురార్పణ చేసిన గులాబీ నాయకత్వం.. ఊహకందని విజయాలను సాధించి చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో బలీయశక్తిగా ఎదిగింది. గతంలో కేవలం షాద్నగర్ సీటుకే పరిమితమైన ఆ పార్టీ.. తాజాగా ఆరు సీట్లలో విజయం సాధించి ఆజేయశక్తిగా ఆవతరించింది. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఏఐసీసీ దూతలపైనే అవినీతి ఆరోపణాస్త్రాలు సంధించి పార్టీకి దూరమవగా.. ఎల్బీనగర్ సీటు అడిగితే ఇవ్వకుండా ఇబ్రహీంపట్నం కట్టబెట్టడంతో సామ రంగారెడ్డి ఏకంగా తెలంగాణ టీడీపీ పెద్దలపై విరుచుకుపడ్డారు. దాదాపు టికెట్ ఖాయమైందని భావించిన బీజేపీ సారథి బొక్క నర్సింహారెడ్డికి చివరి నిమిషంలో టీఆర్ఎస్ జైత్రయాత్రకు జిల్లాలోనే అంకురార్పణనిరాశే మిగలడం ఈ ఏడాది పొలిటికల్ రౌండప్లో కొసమెరుపు. ‘ముందస్తు’ కుదుపు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్న తరుణంలో గులాబీ దళపతి మాత్రం ముందస్తు ఎన్నికలకు ముందడుగు వేసి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఆగస్టులో మొదలైన ఈ ప్రచారంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సెప్టెంబర్ 2న కొంగరకలాన్లో ‘ప్రగతి నివేదన సభ’ దేశ రాజకీయాల్లో కీలక మార్పునకు నాంది పలికింది. లక్షలాది మంది తరలివచ్చిన ఈ బహిరంగసభలోనే ముందస్తుకు శంఖారావం పూరించిన గులాబీ బాస్ కేసీఆర్.. సెప్టెంబర్ ఆరో తేదీన శాసనసభను ఆర్థాంతరంగా రద్దు చేసి సమరానికి సై అన్నారు. అదే రోజు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి రికార్డు సృష్టించారు. శాసనసభ రద్దుతో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్, టీడీపీలు అప్రమత్తమైనా అభ్యర్థుల ఖరారులో ఎడతెగని జాప్యం పాటించాయి. ప్రజాకూటమిగా జతకట్టి ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నాయి. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం స్థానాలను టీడీపీకి సర్దుబాటు చేసిన ఒక్కచోట కూడా బోణీ కొట్టకుండానే బొక్కబోర్లా పడింది. ఇక కాంగ్రెస్ మాత్రం ఎల్బీనగర్, మహేశ్వరం సీట్లను గెలుచుకొని బతుకుజీవుడా అంటూ ఊపిరిపీల్చుకుంది. ఇక బీజేపీ ఖాతా తెరవకుండానే వెనుదిరగగా.. తొలిసారి బలమైన అభ్యర్థులో బరిలో దిగిన బీఎస్పీ మాత్రం షాద్నగర్, ఇబ్రహీంపట్నంలో గణనీయ ఓటు బ్యాంకు సాధించి ఔరా! అనిపించింది. కొండా తిరుగుబాటు ఈసారి జిల్లా రాజకీయాల్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి రాజీనామా హాట్ టాపిక్గా మారింది. అధిష్టానంపై ధిక్కారస్వరం వినిపించిన కొండా.. టీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. మాజీ మంత్రి మహేందర్రెడ్డి వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఆయన ఎన్నికల వేళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ను ఓడించాలని కసితో పనిచేసిన ఆయనకు అది సాధ్యపడలేదు కానీ, తాను విభేదించే మహేందర్రెడ్డి ఓడిపోవడం.. అదీ తన సన్నిహితుడు రోహిత్రెడ్డి చేతిలో మంత్రి చావుదెబ్బ తినడం సంతోష పరిచింది. అదే సమయంలో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం చేదు గుళికగా మారింది. ఇక కొండాను అనుసరించిన యాదవరెడ్డికి ఈ ఏడాదే ఖేదాన్నే మిగిల్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే గంపెడాశతో సొంతగూటికి చేరిన ఆయనకు నిరాశే మిగిలింది. దీనికితోడు ఫిరాయింపు చట్టం కింద ఆయనపై వేటు కత్తి వేలాడుతుండడం యాదవరెడ్డి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారింది. ఇక టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరిన రేవంత్రెడ్డిని అనుసరించిన జెడ్పీటీసీ సభ్యులకు కూడా ఈ సారి అంతగా కలిసిరాలేదు. కాంగ్రెస్లో ముడుపుల కల్లోలం అంతర్గత కలహాలు కాంగ్రెస్ను నట్టేట ముంచాయి. టికెట్లను అమ్ముకున్నారంటూ ఏకంగా డీసీసీ సారథి క్యామ మల్లేశ్ ఆడియో టేపులను విడుదల చేయడం కలకలం రేపింది. అంతేగాకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నారని బహిరంగ విమర్శలకు దిగడంతో ఆయనపై వేటు పడింది. ఈ పరిణామంతో మల్లేశ్ కాస్తా కారెక్కగా.. ఇబ్రహీంపట్నం రాజకీయం మాత్రం ఆధ్యంతం రక్తి కట్టించింది. పొత్తులో ఈ సీటును టీడీపీకి కేటాయించడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగిన మల్రెడ్డి రంగారెడ్డి నామినేషన్ల రోజున కాంగ్రెస్ బీ–ఫారం ఇచ్చిందని ఆర్భాటం ప్రదర్శించి.. చివరకు బీఎస్పీ తరఫున నామినేషన్ వేయడం చర్చకు దారితీసింది. ప్రచారం చివరి రోజున మెట్టుదిగిన కాంగ్రెస్ అధిష్టానం మల్రెడ్డికి బహిరంగ మద్దతు ప్రకటించినా ఆయన మాత్రం గెలుపు వాకిట బొల్తా పడ్డారు. అగ్రనేతల రాకపోకలతో జిల్లాలో ప్రచారపర్వం తారాస్థాయికి చేరినా టీఆర్ఎస్ గెలుపును మాత్రం ఆపలేకపోయారు. ఆరంభం నుంచే హడావుడి ఈ ఏడాదంతా ఎన్నికల హడావుడే కొనసాగింది. తొలి త్రైమాసికంలోనే గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ఏర్పాట్లను కూడా చేసింది. అయితే, బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆక్షింతలు వేయడంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో ఆగస్టు 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొలువుదీరింది. ఇక ఫిబ్రవరితో కాలపరిమితి ముగిసిన సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించని ప్రభుత్వం.. పాత కమిటీలను కొనసాగిస్తూ వస్తోంది. వివిధ కారణాలతో పంచాయతీ, సొసైటీ ఎన్నికలపై కేసీఆర్ సర్కారు వెనుకడుగు వేసింది. -
కాంగ్రెస్కు దాసోహమంటారా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కూటమిలో భాగంగా కేవలం మూడు సీట్లకే పరిమితమై పోటీచేయడం పార్టీ బలాన్ని ప్రతిబింబించలేదని సోమవారం సీపీఐ కౌన్సిల్ భేటీలో పలువురు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కూటమిలో చేరడం తప్ప గత్యంతరం లేదన్న విధంగా నాయకత్వం తొందరపాటుగా వ్యవహరించడం వల్ల నష్టం జరిగిందని కొందరు నాయకులు అభిప్రాయపడినట్టు తెలిసింది. పొత్తులో మూడుసీట్లకే పరిమితం కాకుండా పార్టీకి బలమున్న 20–25 సీట్లలో సొంతంగా పోటీచేసి ఉంటే పార్టీ విస్తరణకు అవకాశముండేదని అన్నట్టుగా సమాచారం. రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహించే కార్యదర్శి ఎన్నికల బరిలో దిగడం, తాను పోటీచేస్తున్న సీటుకే పరిమితం కావడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్తో పొత్తు పార్టీకి నష్టం కలిగించినందున భవిష్యత్లో సొంత బలం పెంచుకుని, తదనుగుణంగా సొంతంగా పోటీకి సిద్ధం కావాలనే సూచనలొచ్చాయి. స్థానిక ఎన్నికలతోసహా లోక్సభ ఎన్నికల వరకు ఇదే వైఖరితో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఆదివారం మొదట రాష్ట్ర కార్యదర్శివర్గ భేటీలో, ఆ తర్వాత రాత్రి పొద్దుపోయేవరకు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికల్లో ఓటమి, కేవలం మూడుసీట్లలోనే పోటీ, కాంగ్రెస్కు దాసోహమన్నట్టుగా నాయకత్వం వ్యవహరించిన తీరుపై కొందరు నాయకులు తీవ్ర విమర్శలు సంధించారు. దీంతో మనస్తాపం చెందిన చాడ వెంకటరెడ్డి తనపదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే సందర్భంలో చాడతోపాటు కూనంనేని, తదితరులు కూడా రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం. ఆ తర్వాత మొత్తం కార్యవర్గం రాజీనామాలు వద్దంటూ సర్దిచెప్పింది. ఈ రాజీనామాల అంశాన్ని కార్యవర్గ భేటీకే పరిమితం చేసి, రాష్ట్ర సమితి సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాకుండా చూడాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి కూడా ఓటమికి కుంగిపోవద్దని, పార్టీ నిర్మాణం, సొంతబలం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తీర్మానాలు... స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కల వివరాలు అందించకపోవడంవల్ల, కుంటిసాకులతో 34 శాతమున్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించడం బీసీలకు అన్యాయం చేయడమేనని పేర్కొంది. బీసీల హక్కులు అణగదొక్కే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో జారీచేసిన ఆర్డినెన్స్ను ఉపసంహరించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్.బాలమల్లేశ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష భేటీలో చర్చించాలని ప్రభుత్వాన్ని సీపీఐ డిమాండ్ చేసింది. స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి: చాడ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. త్వరలోనే జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలు మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ సహకార ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో సంసిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీచేసిన స్థానాలతో పాటు మిగతా చోట్ల గెలుపోటములకు కారణాలను అన్వేషిస్తూ సమీక్షలు నిర్వహించాలన్నారు. -
నిజమైన పని ఇప్పుడే మొదలైంది : హరీశ్
సాక్షి, సిద్దిపేట: ‘ఎన్నికలు వచ్చాయంటే డబ్బు, మద్యంతో ప్రలోభాలు ఉంటాయి.. అయితే ఇవేమీ సిద్దిపేట నియోజకవర్గంలో పనిచేయలేదు. మీ వద్దకు నేను ఓట్లు అడగడం కోసం కూడా రాలేదు. అయినా నాకు ఘనవిజయం తెచ్చిపెట్టారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేశాను. పార్టీ అప్పగిం చిన పనిని విజయవంతంగా నిర్వర్తించాను’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పత్తిమార్కెట్ యార్డులో సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేం దుకు ఏర్పాటు చేసిన సభలో హరీశ్రావు మాట్లాడా రు. కొడంగల్, కొల్లాపూర్, అలంపూర్ తదితర నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిం చేందుకు ప్రచారం చేశానని చెప్పారు. తనతోపాటు సిద్దిపేట నియోజకవర్గంలోని పలువురు ముఖ్య కార్యకర్తలు కూడా వివిధ నియోజకవర్గాల్లో పనిచేశారని, అక్కడి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలో పాలుపంచుకున్నారని తెలిపారు. తాను ఇతర నియోజకవర్గాల పర్యటనలో ఉన్నా, సిద్దిపేట నియోజకవర్గం కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని.. చరి త్రను తిరగరాసేలా గెలుపు సాధించి పెట్టారన్నారు. ఈ విజయం తన ఒక్కడిది కాదని, ఇది ప్రజల విజయమన్నారు. సిద్దిపేట నియోజకవర్గం ప్రజలు తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించారని, అందుకోసమే దేవుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ప్రజల కోసం వినియోగిస్తానని, ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవచేస్తానని చెప్పారు. ఎవరికి కష్టం వచ్చినా అది తన కుటుంబ సభ్యులకు వచ్చినట్లే అనుకుంటానని అన్నారు. నాయకులంటే ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వస్తారని, కానీ తాను ఎప్పుడూ మీ వెంటే ఉన్నానని, మీకు సేవ చేయడంలో ఉన్న తృప్తి మరెక్కడా లేదని పేర్కొన్నారు. ఇంత మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. నిజమైన పని ఇప్పుడే మొదలైంది.. నిజమైన పని ఇప్పుడే మొదలైందని, తన బాధ్యత మరింత పెరిగిందని హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుంచామని చెప్పారు. ఆకుపచ్చ తెలంగాణగా రూపుదిద్దేందుకు ప్రారంభించిన ప్రాజెక్టుల పనులు వేగవంతంగా సాగుతున్నాయని వివరించారు. నిరుద్యోగ సమస్య తీరాలంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తయితే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వెలుస్తాయని అన్నారు. దీంతో యువతకు ఉపాధి మార్గాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని దేశ, విదేశాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి పరిశీలించడం, ఇక్కడి పనులను వారి ప్రాంతాల్లో అమలు చేసేందుకు వివరాలు తీసుకువెళ్లడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. ఈ ప్రాంతం ప్రజాప్రతినిధిగా ఇంతకన్నా గౌరవం ఏముంటుందన్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, దీంతో ప్రతీ గ్రామానికి రూ.10 లక్షల పురస్కారంతోపాటు, గౌరవం కూడా పెరుగుతుందని అన్నారు. భేషజాలకు పోయి డబ్బులు, సమయం వృథా చేసుకోవద్దని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతీ కార్యకర్తను కాపాడుకునే బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణ శర్మ, కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ సంపత్, ఎంపీపీ మాణిక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కౌన్సిల్ గులాబీమయం.. కాంగ్రెస్ ఖాళీ!
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి రెండోసారి అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్... శాసనమండలిలో పూర్తిస్థాయి ఆధిక్యం దిశగా వేసిన రాజకీయ వ్యూహం విజయవంతమైంది. కాంగ్రెస్కు చెందిన మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు టీఆర్ఎస్లో విలీనం కావాలని నిర్ణయించుకోవడంతో ఒక్క రోజులోనే శాసనమండలిలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా సైతం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్కు ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎం.ఎస్. ప్రభాకర్, కూచుకుళ్ల దామోదర్రెడ్డి గతంలోనే టీఆర్ఎస్లో చేరారు. ఇదే పార్టీకి చెందిన ఆకుల లలిత, టి.సంతోష్ కుమార్ గురువారం సీఎం కేసీఆర్ను కలవడంతో వారు టీఆర్ఎస్లో చేరడం ఖాయమైపోయింది. కాంగ్రెస్కు ఉన్న ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు టీఆర్ఎస్ వైపు రావడంతో అధికార పార్టీ వెంటనే వ్యూహం సిద్ధం చేసింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకే శాసనమండలికి చేరుకున్నారు. శాసనమండలి చైర్మన్ వి. స్వామిగౌడ్ కార్యాలయానికి రాగానే ఆయ నను కలసి కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ శాసనమండలి పక్షంలో విలీనం చేయాలని కోరుతూ లేఖ సమర్పించారు. ‘శాసనమండలి ఆవరణలో మేము నలుగురం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించుకున్నాం. కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ పక్షంలో విలీనం చేయాలని ఈ భేటీలో నిర్ణయించుకున్నాం. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని నాలుగో పేరా ప్రకారం మా వినతిని పరిశీలించగలరు’అని కోరుతూ నలుగురు ఎమ్మెల్సీల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. ఒక పార్టీ తరఫునన గెలిచిన చట్టసభ్యులలో మెజారిటీ సంఖ్యలో ఉన్న వారు వేరే పార్టీలో విలీనం అయితే వారిపై అనర్హత వేటు పడదనే నిబంధన ప్రకారం నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నాలుగో పేరా పేర్కొంటోందని వివరించారు. అనంతరం నలుగురు ఎమ్మెల్సీల లేఖను శాసనమండలి చైర్మన్ వి. స్వామిగౌడ్ పరిశీలించారు. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్ శాసనమండలిపక్షంలో విలీనం చేస్తూ సాయంత్రం ఆరు గంటలకు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, ఆకుల లలిత, టి. సంతోష్ కుమార్, కె. దామోదర్రెడ్డిలను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యలు వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయంతో శాసనమండలిలో కాంగ్రెస్ తరఫున మహమ్మద్ షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డి మిలిగారు. ఇద్దరు సభ్యులే ఉండటంతో శాసనమండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఎమ్మెల్యేలూ జంప్ చేస్తే మండలిలో కాంగ్రెస్ సున్నాయే... శాసనమండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. తాజా పరిణామాల అనంతరం టీఆర్ఎస్కు 31 మంది, కాంగ్రెస్కు ఇద్దరు, స్వతంత్రులు ఇద్దరు... మజ్లిస్, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి రాజీనామాలతో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది. దైవార్షిక ఎన్నికల్లో భాగంగా వచ్చే ఫిబ్రవరి, మార్చిలో శాసనమండలికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియలో దాదాపు 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాలు ఆరు ఖాళీ అవుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కె. యాదవరెడ్డిపై వేటు వేస్తే ఈ సంఖ్య ఏడుకు చేరుతుంది. అసెంబ్లీలో కాంగ్రెస్కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే కోటా ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలోనే ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కు ఒక స్థానం వస్తుంది. అయితే ఎన్నికల నాటికి సమీకరణలు మారి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యలో మార్పులు జరిగితే ఆ ఒక్క సీటూ హస్తం పార్టీకి దక్కే అవకాశం ఉండదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే శాసనమండలిలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం సైతం లేకుండా పోయే పరిస్థితి ఉండనుంది. రాజ్యాంగం ప్రకారమే నిర్ణయం: ఎం.ఎస్.ప్రభాకర్ కాంగ్రెస్కు ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. నలుగురం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం కావాలని ముందుకొచ్చాం. రాజ్యాంగం ప్రకారం మూడింట రెండోవంతు మంది సభ్యులు ఇలా నిర్ణయం తీసుకోవచ్చు. నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు. కాంగ్రెస్లో మాకు ఎన్నో అవమానాలు జరిగాయి. టీడీపీతో పొత్తు ముంచింది: టి. సంతోష్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ కొంపముంచింది. మా ఎవరితో చెప్పకుండా పొత్తు ఎలా పెట్టుకున్నారు? కాంగ్రెస్లో నాయకత్వ లేమి ఉంది. అందుకే టీఆర్ఎస్లో విలీనం కావాలని నిర్ణయం తీసుకున్నాం. మేము ప్రజల వైపు: ఆకుల లలిత మేము ప్రజలవైపు ఉండాలనుకుంటున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు తగిన గౌరవం ఇస్తారని భావిస్తున్నాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తాం. నేడు కొండా మురళీ రాజీనామా... ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు శనివారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. శుక్రవారమే మురళీ రాజీనామా చేయాల్సి ఉంది. అయితే శానసమండలి చైర్మన్ కార్యాలయం శనివారం సమయం ఇచ్చినందున మురళీ రాజీనామా నిర్ణయం వాయిదా పడినట్లు తెలిసింది. కొండా మురళీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. -
మంత్రివర్గ విస్తరణ: ముహూర్తం కుదిరేనా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు దాటుతున్నా ఈ వ్యవహారంపై ఇంకా సందిగ్ధత నెలకొనడంతో ఆశావహుల్లో టెన్షన్ అధికమవుతోంది. మంత్రిపదవులు ఆశిస్తున్నవారంతా ముహూర్తపు లెక్కలు చూసుకుంటున్నారు. సంక్రాంతిలోపు మంచి రోజులున్నాయా? ఉంటే ఎప్పుడు? ఒకవేళ సంక్రాంతిలోపు ముహూర్తాలు లేకుంటే తర్వాత ఎప్పుడున్నాయి వంటి వివరాలను ఆరా తీస్తున్నారు. రాజకీయ నేతలతోపాటు అధికార వర్గాల్లో ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ సాగుతోంది. సాధారణంగా సంక్రాంతికి ముందు నెల రోజులు మంచి రోజులు ఉండవనే చర్చ నడుస్తోంది. అయితే, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈసారి సంక్రాంతికి పది రోజుల ముందు వరకు మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్గశిర అధిక మాసం వచ్చిందని, అందువల్ల జనవరి 4 వరకు మంచి రోజులు ఉన్నాయని వివరిస్తున్నారు. ఆ తర్వాత పుష్యమాసం మొదలై ఫిబ్రవరి 7 వరకు ఉంటుంది. ఆ రోజులలో ముహూర్తాలు ఉండవు. ఈ నేపథ్యంలో జనవరి 4వ తేదీలోపే మంత్రివర్గ విస్తరణ జరపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలోపు జరగకపోతే ఫిబ్రవరి 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వీలుపడదు. కాంగ్రెస్ నుంచి చేరికలున్నాయా? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకుని భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన లావుడ్య రాములునాయక్ టీఆర్ఎస్లో చేరడంతో పార్టీ బలం 90కి చేరింది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేరే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి చేరికల తర్వాత ఉండే జిల్లాల సమీకరణాల ఆధారంగా కేబినెట్ కూర్పు ఉంటుందని సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంప్రదాయం ప్రకారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలవాల్సి ఉంటుంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 21న శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హైదరాబాద్కు రానున్నారు. మూడు రోజుల బస అనంతరం 24న తిరిగి ఢిల్లీ వెళ్తారు. రాష్ట్రపతి పాల్గొనే కొన్ని కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉంటుంది. ఇలా పలు కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరులో నాలుగు రోజులు, జనవరి మొదటి వారంలో నాలుగు రోజులు మాత్రమే మంత్రివర్గ విస్తరణ చేయడానికి అనువుగా కనిపిస్తున్నాయి. 4న పంచాయతీ నోటిఫికేషన్? హైకోర్టు తీర్పు నేపథ్యంలో జనవరి 10వ తేదీలోపు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం జనవరి 4న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే అప్పటి నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. ఇక అది ముగిసే వరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి వీలుండదు. అంటే ఎలా చూసినా, జనవరి 4లోపు మాత్రమే కేబినెట్ విస్తరణకు అవకాశం కనిపిస్తోంది. కాగా, ఫిబ్రవరిలో ఎలాగూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని, వాటి కోసం అనివార్యంగా కేబినెట్ విస్తరణ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తమ్మీద మరో రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ అధిష్టానం వర్గాలు చెబుతున్నాయి. తొలి విడతలో ఆరుగురు లేదా ఎనిమిది మందిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. -
వేగంగా హామీల అమలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ప్రకటించిన హామీలను వేగంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో ఇచ్చిన హామీ ల వివరాలను అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా పొందుపరచాలని పార్టీ ప్రధాన కార్యదర్శులను కేటీఆర్ ఆదేశించారు. మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 24 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జనవరి మొదటి వారంలో అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణాలు మొదలుపెట్టాలన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో అనేక చోట్ల ఓట్లు గల్లంతుపై అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చాయి. ఓట్ల గల్లంతుతో టీఆర్ఎస్ అభ్యర్థులకు రావాల్సిన మెజారిటీ కొంత మేరకు తగ్గింది. కొన్ని చోట్ల ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నా ఓట్లు వేయలేక బాధపడిన వారు ఉన్నారు. ఇలాంటి సమస్యలను టీఆర్ఎస్ తరఫున పరిష్కరించేందుకు ప్రయత్నిం చాలి. ఎన్నికల ప్రధానాధికారిని కలసి ఈ అంశాలపై విజ్ఞప్తి చేయాలి. క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిం చాలి. ఒక్క ఓటరు పేరు కూడా గల్లంతు కాకుండా చర్యలు తీసుకోవాలి. అర్హతగల ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలి. టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ కార్యదర్శి ఎం.శ్రీనివాస్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, సోమ భరత్కుమార్లతో కూడిన కమి టీ ఓటరు నమోదు అంశాలను సమన్వయం చేస్తుం ది. ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో కారణా లను తెలుసుకుని అవసరమైన చర్యలు ఏమిటనేది కమిటీ ద్వారా పార్టీ శ్రేణులకు మార్గదర్శకాలు జారీ ఇస్తాం. ఈ నెల 26 నుంచి జనవరి 6 వరకు కొత్త ఓటర్ల నమోదు, మార్పుచేర్పుల కార్యక్రమం ఉంది. ప్రతి ఓటరు పేరు నమోదు లక్ష్యంగా పని చేయాలి. ఓటరు నమోదు కార్యక్రమం కోసం ఈ నెల 22 నుం చి 24 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిం చాలి. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టడం లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణాలు వేగంగా పూర్తి కావాలి. ఎకరానికి తక్కువ విస్తీర్ణం కాకుండా స్థలాలను ఎం పిక చేయాలి. సమావేశాలు నిర్వహించుకునేలా ఈ స్థలాలు ఉండాలి. ఇప్పటికే ఎంపిక చేసిన స్థలం ఎకరం విస్తీర్ణంకంటే తక్కువగా ఉంటే వేరే వాటిని పరి శీలించాలి. పార్టీ జిల్లా కార్యాలయాల స్థలాలు అనువుగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని వెంటనే కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి. కార్యాలయ భవనాల నమూనాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమోదిస్తారు. వెంటనే నిర్మాణాలను ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేయాలి. జనవరి మొదటి వారం నుంచి అన్ని జిల్లాల్లో కార్యాలయ నిర్మాణాలు మొదలుకావాలి. టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నుంచి జిల్లాలకు ఇన్చార్జీలుగా గతంలో నియమించిన వారే కొనసాగుతారు. రాష్ట్ర కమిటీ నుంచి వైదొలగిన వారి స్థానాల్లో కొత్త వారిని త్వరలో నియమిస్తాం. కేసీఆర్ అనుమతితో దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుంది. అన్ని అంశాలపై చర్చించేందుకు ఎప్పటికప్పుడు సమావేశమవుదాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. నేడు సిరిసిల్లకు... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మొదటిసారి బుధవారం సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ నేతలు భారీ స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేశారు. భారీ ర్యాలీతో ఈ కార్యక్రమం ఉండనుంది. అనంతరం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో టీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించనున్నారు. కేటీఆర్ సిరిసిల్ల పర్యటన మంగళవారమే జరగాల్సి ఉన్నప్పటికీ బుధవారానికి వాయిదా పడింది. -
గొంతు కోసుకోవడంపై స్పందించిన బండ్ల గణేష్
సాక్షి, తిరుపతి : కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది బండ్ల గణేశ్ ఎట్టకేలకు మౌనం వీడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హడావుడి చేసిన ఈ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషియన్.. ఫలితాలనంతరం మీడియా ముందుకు రాకుండా ఉండిపోయారు. జనసేన అధినేత, పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేశ్ సరిగ్గా ఎన్నికల ముందు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. పార్టీలో చేరేదే ఆలస్యం టీవీ చానళ్ల చుట్టూ తిరుగుతూ హల్చల్ చేశారు. పలు టీవీ చానెళ్ల ఇంటర్వ్యూల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి రాకుంటే గొంతు కోసుకుంటానని సవాల్ కూడా విసిరారు. అయితే ఎన్నికల ఫలితాలు భిన్నంగా రావడంతో సదరు టీవీచానెళ్లు బండ్ల గణేశ్ను సంప్రదించే ప్రయత్నం చేశాయి. కానీ అతను మీడియా కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చిన ఆయన దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. ‘అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను అజ్ఞాతంలో లేను. మా పార్టీ గెలుస్తుందని ఎన్నో ఊహించుకున్నాం. కానీ ప్రజలు మా పార్టీని తిరస్కరించారు. టీఆర్ఎస్కు పట్టం కట్టారు. మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని మౌనంగా ఉండాల్సి వచ్చింది. అరే కోపంలో వంద అంటాం సార్.! అవన్నీ నిజం అవుతాయా! మీరు కోసుకోమంటే కోసుకుంటా. చాలా అంటాం ఇవన్నీ మాములే. ఉరికే మావాళ్ల ఉత్సాహం కోసం అలా మాట్లాడాను. ఇప్పుడేం చేయమంటారు. కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది దానికి ఏం చెబుతాం.’ అని గొంతు కోసుకోవడంపై తనదైన శైలిలో స్పందించారు. అంతేకాకుండా ఓటమి రేపు విజయానికి పునాదని చెప్పుకొచ్చారు. -
అరే కోపంలో వంద అంటాం సార్.!
-
లెక్క తేలుతోంది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వెలువడ్డాయి. మరి జిల్లావ్యాప్తంగా తనిఖీల్లో పట్టుబడిన సొమ్మంతా ఎక్కడికి పోతుంది? ఎవరి అధీనంలో ఉంటుంది? తిరిగి బాధితులకు అందజేస్తారా? లేక ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారా? సామాన్యుల్లో ఈ తరహా ప్రశ్నలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ లెక్కలు తేలుతున్నాయి. తాజాగా ముగిసిన శాసనసభ ఎన్నికల్లో నోట్ల కట్టలు స్వైర విహారం చేసిన విషయం తెలిసిందే. ఓట్లు దండుకోవడానికి ఆయా పార్టీల నేతలు పోటీపడి మరీ కోట్ల రూపాయలు గుమ్మరించారు. ఇందుకోసం ఎన్నికల సంఘం సూచించిన నిర్దేశిత మొత్తానికి మించి ఎటువంటి ఆధారాలు లేకుండా వివిధ మార్గాల్లో.. పలు రూపాల్లో డబ్బును రాజకీయ నాయకులు తరలించారు. విస్తృతంగా తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు, స్టాటిక్ సర్వీలేన్స్ బృందాలు (ఎస్ఎస్టీ) పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నాయి. కొన్ని కేసులు వీగిపోగా.. మరికొన్నింటిపై విచారణ జరగాల్సి ఉంది. ఇంకొన్ని కేసులు ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వెళ్లాయి. వీగిన కేసులు 13 రూ.10 లక్షలు లోబడి స్వాధీనం చేసుకున్న సొమ్మును జిల్లా ట్రెజరీ అధికారి (డీటీఓ) వద్ద భద్రపరిచారు. ఇటువంటి కేసులు జిల్లావ్యాప్తంగా 26 నమోదయ్యాయి. రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) ఎండార్స్ చేసిన పత్రం, పంచనామా, ఎన్నికల సంఘానికి వివరాలు అప్లోడ్ చేసిన ధ్రువపత్రాన్ని కూడా డీటీఓకు అందజేశారు. డబ్బు వ్యవహారంపై డీఆర్ఓ అధ్యక్షతన ఏర్పడిన ప్రత్యేక కమిటీ చర్చించనుంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికే తరలిస్తున్నారా? ఇతర అవసరాలకు తీసుకెళ్తున్నారా? అని ఆరా తీస్తుంది. వ్యక్తిగత సొమ్మే అని తేలితే.. సదరు కేసులను అక్కడితో మూసేస్తారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 13 కేసులు వీగిపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇవన్నీ వ్యక్తగత, వ్యాపార లావాదేవీల నిమిత్తం నగదు తరలిస్తున్నట్లు అధికారుల విచారణలో స్పష్టమైంది. మిగిలిన కేసులపై త్వరలో విచారణ జరగనుంది. రూ.పది లక్షలకు పైబడి పట్టుబడిన కేసులన్నీ ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వెళ్తాయి. పదుల సంఖ్యలో నమోదైన ఈ తరహా కేసులను ఆ శాఖ అధికారులకు అప్పగించడంతో విచారణ చేపడుతున్నారు. ఆ నగదుకు సంబంధించి గతంలో పన్ను చెల్లించారా? లేదా హవాలా మార్గంలో వచ్చిందా? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు. నిబంధనల ప్రకారం ఉంటే డబ్బును యజమాని తీసుకోవచ్చు. లేకపోతే సర్కారు ఖజానాలో జమచేస్తారు. భారీగా నగదు స్వాధీనం.. ఎన్నికలు పూర్తయ్యే నాటికి జిల్లావ్యాప్తంగా రూ.3.84 కోట్లను సీజ్ చేసినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలు చేయడంతోపాటు ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్క్వాడ్లు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. సివిల్ పోలీసులూ ఎక్కడికక్కడ సోదాలు చేసి పెద్దమొత్తంలో డబ్బులను సీజ్ చేశారు. ఎన్నికల సమయంలో రూ. 40 వేలు, ఆపైబడి మొత్తం ఎవరి వద్దనైనా లభ్యమైతే అందుకు సంబంధించిన లెక్కలు చూపడంతోపాటు తగిన ఆధారాలను సైతం అందజేయాలి. ఈ ఉల్లంఘనను అతిక్రమించి నగదు తరలిస్తున్న వారిని అదుపులోకి డబ్బును సీజ్ చేశారు. -
కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై ఆ పార్టీ చీఫ్ విప్, మిగతా విప్లు సోమవారం మండలి చైర్మన్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. టీఆర్ఎస్లో ఎమ్మెల్సీలుగా ఉన్న యాదవరెడ్డి, రాములు నాయక్, కొండా మురళి, భూపతిరెడ్డిలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని అధికార పార్టీ మండలి చైర్మన్కు ఫిర్యాదు చేయనుంది. అయితే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న నాగర్కర్నూల్కు చెందిన దామోదర్రెడ్డి ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరారు. అయితే చర్యలు తీసుకోవాల్సి వస్తే దామోదర్రెడ్డిపై ముందు తీసుకుంటారా? లేకా ఈ నలుగురిపై తీసుకుంటారా అన్న దానిపై ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. -
బ్యాలెట్ ద్వారానే ఎంపీ ఎన్నికలు జరపాలి
నల్లగొండ: వచ్చే పార్లమెంటు ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొం డలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో పెద్దఎత్తున ట్యాంపరింగ్ జరిగిందని సోషల్ మీడియాతో పాటు బహిరంగం గా చర్చించుకుంటున్న విషయం తెలిసిందేనని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా జిల్లాలో 84 శాతం పోలింగ్ జరగడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. నల్లగొండ, తుంగతుర్తి తదితర ప్రాంతాల్లో పోలైన ఓట్లకు, ఈవీఎంలలో నమోదైన ఓట్లకు వేలల్లో తేడా ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ సర్వేలు నిర్వహించినా గట్టి పోటీ ఉంటుందని తేలిందని, కానీ టీఆర్ఎస్ వాళ్లంతా 50 నుంచి 70 వేల మెజార్టీతో గెలిచారంటే.. ట్యాంపరింగ్ జరి గినట్లు అనుమానం కలుగుతోందన్నారు. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిపై గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్రెడ్డికి ప్రజలతో సంబంధాలు లేవని, అలాంటిది ఆయన 50 వేల మెజార్టీతో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శ్రీనివాస్గౌడ్కు ప్రజ ల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో తేలిందని, ఆయన కూడా 50 వేల మెజార్టీతో గెలిచారంటే అనుమానం మరింత పెరుగుతోందన్నారు. కొండా సురేఖ, డీకే అరుణ తప్పక గెలుస్తారని సర్వేల్లో తేలితే ఫలితాల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు పెట్టకపోవడానికి కారణమేంటని నిలదీశారు. వీటిపై ఇప్పటికే పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేశామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో గోల్మాల్ చేసి గెలిచారనే అనుమానం తమకు కలుగుతోందని, అందుకే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర్రెడ్డి సహకారంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాను నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కనగల్ జెడ్పీటీసీ శ్రీనివాస్గౌడ్, బండమీది అంజయ్య, భిక్షంయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ పథకాలు కాంగ్రెస్వే: జానారెడ్డి
గుర్రంపోడు: టీఆర్ఎస్ అమలు చేస్తున్నవి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలేనని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో నిర్వహిం చిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం రూపాయి కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ లాంటి పథకాలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినవేనని, ఇప్పుడు కేసీఆర్ కొత్తగా చేసిందేమి లేదన్నారు. ఈ పథకాలు తీసేసే ధైర్యం ఎవరకీ లేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందని ఎవరూ అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. తమ ఎన్నికల హామీలను టీఆర్ఎస్ కాపీ కొట్టిందని ఆరోపించారు. -
ఆద్యంతం ధన ప్రవాహమే
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం డబ్బు, మద్యం పంపిణీ చుట్టూనే తిరిగిందని తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక పేర్కొంది. పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని తెలిపింది. అధికారుల తనిఖీల్లోనూ రికార్డు స్థాయిలో నగదు దొరికిందని, ఇంత పెద్దమొత్తంలో ధన ప్రవాహం ఇప్పటివరకూ జరగలేదని వ్యాఖ్యానించింది. ఈ అక్రమాలను అరికట్టడంలో ఎన్నికల సంఘం సైతం పూర్తిగా విఫలమైందని నిఘా వేదిక అభిప్రాయపడింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం జరిగిన తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్లు ఎం.పద్మనాభ రెడ్డి, డాక్టర్ రావు చెలికాని, బండారు రామ్మోహన్రావు, బి.శ్రీనివాస్రెడ్డి, వై.రాజేంద్రప్రసాద్ పాల్గొని తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరిశీలించిన అంశాలను జిల్లాల వారీగా నివేదించారు. ఓటరు జాబితాలో భారీగా అక్రమాలు ఓటరు జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని, కొత్తగా ఓటర్లు నమోదై స్లిప్పులు పొందినప్పటికీ చివరి నిమిషంలో వారి ఓట్లు గల్లంతయ్యాయని నిఘా వేదిక సభ్యులు తెలిపారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తే సీఈఓ రజత్కుమార్ క్షమాపణ చెప్పి చేతులెత్తేశారన్నారు. చాలాచోట్ల కొత్త ఓటర్లు నమోదు కాగా...పాత ఓటర్లు భారీగా తొలగించబడ్డారని, కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు కనిపించిందన్నారు. నగదు, మద్యం పంపిణీ, ఓటరు జాబితాలో అవకతవకలపై కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితాను ఆన్లైన్లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పెడితే డ్యూయల్ ఓట్లు తగ్గిపోతాయని, ఓటరు కార్డును ఆధార్ నంబర్తో అనుసంధానం చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల ఖర్చుపై సీలింగ్ విధించాలని, నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు. త్వరలో గ్రామ పంచాయతీ, పార్లమెంటు, సహకార, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం పక్కాగా పనిచేయాలని కోరారు. త్వరలో జరిగే ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని, ఓటర్లలో అవగాహన పెంచడంతో పాటు ఓటు వేసేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ నివేదిక ప్రతులను త్వరలో జిల్లా కలెక్టర్లకు అందజేయనున్నట్లు తెలిపారు. -
అన్ని ‘పంచాయతీ’లను గెలవాలి
ప్రత్యేక చాంబర్... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కె.తారక రామారావు సోమవారం ఉదయం 11.56 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. కేటీఆర్ కోసం తెలంగాణభవన్లో ప్రత్యేకంగా చాంబర్ను ఏర్పాటు చేశారు. వచ్చే ఆరేడు నెలల్లో గ్రామపంచాయతీ, సహకార, లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా ఉన్న నేపథ్యంలో తెలంగాణభవన్ కేంద్రంగా కేటీఆర్ పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండువారాల్లో అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర సమితి గురి పెట్టింది. అన్ని గ్రామపంచాయతీలను గెలిచేలా వ్యూహం రచిస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, బాధ్యులకు స్పష్టం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ప్రతి గ్రామపంచాయతీకి రూ.పది లక్షల గ్రాంట్ వస్తుందని, వీలైనన్ని పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా ప్రయత్నించాలని సూచించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తొలిసారి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం తెలంగాణ భవన్లో జరిగింది. టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియపై కేటీఆర్ ఈ సమావేశంలో ప్రసంగిం చారు. 2006 నుంచి ఇప్పటిదాకా టీఆర్ఎస్లో తన రాజకీయ అనుభవాలను వివరించారు. డిసెంబర్ 26 నుండి జనవరి 6వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రస్థాయి నేతలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఈ ప్రక్రియకు పదిరోజుల గడువున్న నేపథ్యంలో అందరూ గట్టిగా పనిచేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఫిబ్రవరిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, బీమా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. మార్చి నుంచి లోక్సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి లోక్సభస్థానానికి ఒక ప్రధాన కార్యదర్శిని, ముగ్గురు కార్యదర్శులను ఇన్చార్జీలుగా నియమిస్తామని, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు ఇన్చార్జీలు గా ఉంటారని తెలిపారు. జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. తెలంగాణభవన్లో ప్రజల ఫిర్యాదు విభాగం(పబ్లిక్ గ్రీవెన్స్ సెల్)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ విభాగం పనిచేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ముఠా గోపాల్, సుంకే రవిశంకర్, మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డిలను టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి పదవుల నుంచి ఉపసం హరిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్లో వైరా ఎమ్మెల్యే చేరిక వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావుడ్య రాములునాయక్ శనివారం టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిశారు. అనంతరం రాములునాయక్ తన అనుచరులతో కలసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణభవన్లో టీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ గులాబీ కండువా కప్పి రాములునాయక్ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం వైరా నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ‘ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో మొదటి చేరిక వైరా నుంచి కావడం ఆనందంగా ఉంది. వైరా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తా. తెలంగాణ అంతటా అనుకూల పవనాలు వీచినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫలితాలు నిరాశ కలిగించాయి. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసి జిల్లావ్యాప్తంగా గులాబీ జెండా ఎగురవేస్తాం. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి బీడు భూములను సస్యశ్యామలం చేస్తాం. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలు పూర్తయితే టీఆర్ఎస్ అజేయశక్తిగా మారుతుంది. లోక్సభ ఎన్నికల్లో పదహారు సీట్లు గెలిచి టీఆర్ఎస్ సత్తా చాటుదాం. ఖమ్మం లోక్సభ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకునేలా కార్యకర్తలు శ్రమించాలి. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలనేది టీఆర్ఎస్ శాసించాలి. మనం చెబితే ఏర్పడే ప్రభుత్వం ఢిల్లీలో కావాలంటే టీఆర్ఎస్ 16 సీట్లు గెలవాలి. యాచించే స్థితి నుంచి ఢిల్లీలో శాసించే స్థితికి తెలంగాణ ఎదగాలి. బీజేపీకి సంఖ్యాబలం ఉండబట్టే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను పెడచెవిన బెట్టింది. కేంద్రంలో మనకు అనుకూల ప్రభుత్వం ఏర్పడితే బయ్యారం లాంటి వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఖమ్మంలో అన్ని నియోజక వర్గాలను అభివృద్ధి చేస్తాం. బంగారు తెలంగాణ దిశగా చిత్తశుద్ధితో పని చేస్తాం’అన్నారు. రాములు నాయక్ను కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్. చిత్రంలో పొంగులేటి -
‘హస్త’వాసి మారేనా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకున్నా భవిష్యత్తు మీద గంపెడాశలు పెట్టుకుంది. ముఖ్యంగా త్వరలోనే జరగనున్న గ్రామ పంచాయతీ, మున్సిపల్, సహకార, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీని పరుగులు పెట్టించాలని యోచిస్తోంది. ఈ అన్ని ఎన్నికల్లో ఎంతోకొంత మెరుగైన ఫలితాలు సాధిస్తేనే లోక్సభ పోరులో టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇవ్వగలమన్న భావనతో ఉన్న పార్టీ అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో పడింది. టీడీపీతోనా.. ఒంటరిగానా.. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి కోలుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ మునిగింది. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా ఓటమే ఎదురైన నేపథ్యంలో పొత్తులపై పునరాలోచన చేయాలని భావిస్తోంది. ఇప్పటికే టీడీపీతో పొత్తు పార్టీకి చేటు కల్గించిందని పార్టీ అంతర్గత సమావేశాల్లో నేతలు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారంలోకి అడుగుపెట్టగానే ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ను రాజేశారని, పరాయి రాష్ట్రనేతల పాలన అవసరమా? అంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టడంతో ఆ ప్రభావం పార్టీపై పడిందని ఇటీవల జరిగిన పార్టీ పోస్టుమార్టమ్ సమావేశాల్లో నేతలు స్పష్టం చేశారు. ఇక, పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగానే ముందుకెళ్తామని ఇటీవల టీజేఎస్ సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాము సైతం ఒంటరిగా వెళ్లాలన్న భావన ఎక్కువమంది కాంగ్రెస్ నేతల్లో ఉన్నా, హైకమాండ్ సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని కాంగ్రెస్పెద్దలు వ్యాఖ్యానిస్తున్నా రు. పంచాయతీ ఎన్నికలపై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకుగానూ త్వరలోనే కీలకనేతలతో పీసీసీ పెద్దలు సమావేశం కానున్నారు. -
ఒక్క సీటూ రాలేదు.. ఉన్న ఓట్లూ దక్కలేదు!
సాక్షి, హైదరాబాద్ : తాజా అసెంబ్లీ ఎన్నికలు సీపీఎంను అంతర్మథనంలోకి నెట్టేసింది. తమ పార్టీకి సంప్రదాయకంగా పడే ఓట్లూ రాకపోగా, ఉన్న కాస్త ఓట్లు కూడా చెదిరిపోవడంతో ఇప్పుడా పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీగా గత ఎన్నికల్లో ఓటర్లు వ్యతిరేకించినప్పటి స్థితి కంటే ఈ ఎన్నికల్లో తాము దిగజారిపోవడంతో ఆ పార్టీ నేతలు కలవర పడుతున్నారు. రాష్ట్ర రాజకీయ వాతావరణంలో వచ్చిన మార్పు,చేర్పుల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందా ? లేక కిందిస్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలహీనపడిందా అన్న సందేహాలు వారిలో వ్యక్తమవున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ చెదిరిపోవడం, ఆశించిన మేర సీట్లు రాకపోయినా ఓటింగ్ పెంచుకుంటామన్న అంచనా కుదేలవ్వడంతో పార్టీ నాయకుల్లో నిరాశా, నిస్పృహలు అలుముకున్నాయి. ఒక్క సీటయినా గెలవకపోగా, అధికశాతం నియోజకవర్గాల్లో సీపీఎం–బీఎల్ఎఫ్ అభ్యర్థులకు నామమాత్రం ఓట్లు పోలు కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కిందివాళ్లు రాలేదు..పై వాళ్లు దూరమయ్యారు...! రాష్ట్రంలో 90 శాతానికి పైగా ఉన్న బహుజనులకు (ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలు, మహిళలు) ప్రాధాన్యం పెంచేందుకు, సామాజిక న్యాయం చేకూర్చేందుకు ఎజెండాను ముందుకు తీసుకెళ్లినా ఈ వర్గాల నుంచే తగిన సహకారం అందలేదని సీపీఎం– బీఎల్ఎఫ్ నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో తాము చేసిన కొత్త ప్రయోగానికి కిందిస్థాయిలోని ఆయా వర్గాలు కలిసి రాకపోగా, ఈ ఎజెండా కారణంగా ఇప్పటివరకు మద్దతుగా ఉన్న పై కులాలు, వర్గాలు కూడా పార్టీకి దూరమయ్యాయని అంచనా వేస్తున్నారు. అధికార టీఆర్ఎస్– విపక్ష కాంగ్రెస్ కూటమి మధ్యలోనే ప్రధాన పోటీ ఉండడంతో ఓటర్లు తమను పట్టించుకోలేదని సీపీఎం నాయకులు విశ్లేషిస్తున్నారు. అసలు ఈ ఎజెండాను ఎవరి కోసం చేపట్టామో దానిని కిందిస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలకు బలంగా వివరించడంలో తమ వైఫల్యం ఉందని వారు అంగీకరిస్తున్నారు. కలసి రాని తమ్మినేని పాదయాత్ర వాస్తవానికి 2019 ఎన్నికలపై ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా 2016–2017 మధ్యలో దాదాపు ఆరునెలల పాటు పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర కూడా ఇప్పుడు సీపీఎంకు ఆశించిన ఫలితాలు చేకూర్చక పోవడం వారిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ పాదయాత్ర అనంతరం ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు–సామాజికన్యాయం సాధనకు ‘లాల్–నీల్’ (కమ్యూనిస్టులు, బహుజనులు) పేరిట చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలివ్వడంతో ఎన్నికలకు ముందు ‘ సీపీఎం– బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ (బీఎల్ఎఫ్) ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వివిధ వామపక్షాలు, కుల, సామాజిక సంఘాలు, సంస్థలను బీఎల్ఎఫ్లోకి తెచ్చే ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా విస్తృత వేదిక ఏర్పాటు సాధ్యం కాలేదు. మరో వైపు బీఎల్ఎఫ్పై సీపీఎం ముద్ర బలంగా ఉన్న కారణంగానే సీపీఐ, ఇతర కమ్యూనిస్టుపార్టీలు, సామాజికసంస్థలు కలసి రాలేదనే అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తంచేస్తున్నారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 26 సీట్లలో పోటీచేసిన సీపీఎంకు మొత్తం 88,733 ఓట్లు (0.4 శాతం), 81 స్థానాల్లో బరిలో నిలచిన బీఎల్ఎఫ్కు 1,41,119 ఓట్లు (0.7శాతం) మాత్రమే వచ్చాయి. -
ఇవేం ఫలితాలు..!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజ్మెంట్ను అంచనా వేయడంలో విఫలం కావడం వల్లే రాష్ట్రంలో పార్టీకి ప్రస్తుత పరిస్థితి ఎదురైందనే చర్చ కమలనాథుల్లో సాగుతోంది. పార్టీ విస్తరణకు తగ్గట్టుగానే గెలిచే సీట్లు, మద్దతుదారుల ప్రభావం ఎక్కడెక్కడ అధికంగా ఉంది.. ప్రభావం చూపే అంశాలేమిటీ.. పార్టీపరంగా అనుసరించాల్సిన ప్రత్యేక వ్యూహాలేమిటీ.. అనే అంశాలను లోతుగా పరిశీలించి సరైన కార్యాచరణను సిద్ధం చేసుకోకపోవడం వల్లే నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ కమిటీ నుంచి సహాయ, సహకారాలు, మద్దతు అందినా వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయామనే భావన వ్యక్తమవుతోంది. దాదాపు పది సీట్ల వరకు గెలుచుకోలేకపోయినా, గతంలో గెలిచిన ఐదు స్థానాల్లోనైనా నిలబెట్టుకోలేక, చివరకు ఒక్క సీటుకే పరిమితం కావడాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి మద్దతుగా ఉన్న వర్గాలు కూడా ఫలితాల పట్ల తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా బీజేపీ గెలిచే స్థానాలు గణనీయంగా తగ్గిపోగా, ప్రత్యర్థి పార్టీగా పరిగణించే ఎంఐఎం గతంలోని ఏడుసీట్లను మళ్లీ నిలబెట్టుకోవడం బీజేపీ మద్దతుదారులకు కొరుకుడు పడడంలేదు. క్షేత్రస్థాయిల్లోని రాజకీయ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి తదనుగుణంగా పావులు కదపడంలో పార్టీ నాయకులు విఫలమయ్యారనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రధానమైన ఎన్నికల అంశాలన్నీ పక్కకు పోవడం, చంద్రబాబు ప్రచారంతో తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ చర్చనీయాంశం చేయడం, అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపడం వంటి వాటిని ముందే ఊహించలేకపోయినట్టు ఆ పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. 1983లోనూ ఇలాంటి స్థితే... ఈ ఎన్నికల్లో 118 స్థానాల్లో (భువనగిరి సీట్లో మినహా) పోటీ చేసి 103 చోట్ల అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడటాన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీట్లు గెలవకపోయినా ఓట్ల శాతం అయినా పెరుగుతుందనే ఆశలు సైతం నెరవేరకపోవడం వారిని మరింతగా బాధిస్తోంది. రాజకీయపార్టీగా బీజేపీ ఏర్పడి ఉమ్మడి ఏపీలో సొంతంగా ఎదుగుతున్న క్రమంలో 1983లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎదురైన పరిస్థితులను ఇప్పుడు కొందరు నేతలు ప్రస్తావిస్తున్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ మంచి ప్రదర్శన చూపుతుందని, మంచి సంఖ్యలోనే సీట్లు గెలుస్తుందని నాయకులతోపాటు అభిమానులు ఆశించారు. అయితే, ఫలితాలు భిన్నంగా వచ్చి మూడు సీట్లకే బీజేపీ పరిమితమైంది. బీజేపీకి తక్కువ సీట్లు రాగా ఆ ఎన్నికల్లోనే ఏఐఎంఐఎం ఏకంగా ఐదుసీట్లను గెలుచుకోవడం మద్దతుదారులకు మింగుడుపడటంలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ గెలిచే సీట్లు పెరగడానికి అప్పుడున్న రాజకీయ పరిస్థితులతోపాటు అభిమానుల మద్దతు కూడా కారణమని చెబుతున్నారు. మళ్లీ అలాంటి పరిణామాలు పునరావృతమయ్యేలా పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
బదిలీ కాని ఓటు.. అంచనాలు తలకిందులు.!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మహా కూటమి మంత్రం పారలేదు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు కలిస్తే గణనీయమైన ఓట్లు వస్తాయని, తేలిగ్గా విజయం సాధిస్తామని భావించిన కాంగ్రెస్ నాయకత్వం అంచనాలు తలకిందులయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ ఒక జట్టుగా.., టీడీపీ, బీజేపీ మరో జట్టుగా.. టీఆర్ఎస్ ఒంటరిగా పోటీచేశాయి. ఈసారి ఎన్నికల్లో మహా కూటమి పేర కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ చేతులు కలిపాయి. గత ఎన్నికల్లో ఈ పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లన్నీ కలిపితే.. ఈసారి మహాకూటమి అభ్యర్థులకు తేలికైన విజయాలు దక్కాలి. కానీ, వాస్తవంలో అలా జరగకపోవడం, నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పరాజయం పాలుకావడంతో కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ కాలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లును కలిపితే, గెలుపోటములతో సంబంధం లేకుండా దాదాపు అన్ని స్థానాల్లో మహా కూటమికి ఖాతాలోనే ఎక్కువ ఓట్లు కనిపిస్తున్నా యి. అయితే.. ఈ ఎన్నికల్లో ఆ ఓట్లన్నీ కూటమి అభ్యర్థులకు (కూటమి పక్షనా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ చేశారు) గంప గుత్తగా పడతాయని ఆశించిన కాంగ్రెస్ నాయకత్వానికి ఆశాభంగం జరగగా, టీఆర్ఎస్ అభ్యర్థులకు గణనీయమైన ఓట్లు పోలయ్యాయి. బలపడిన టీఆర్ఎస్ గత ఎన్నికల్లో దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాల్లో మూడు స్థానంలో, నాగార్జునసాగర్, మిర్యాలగూడలో రెండో స్థానంలో నిలవగా, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ, ఈసారి నకిరేకల్, మునుగోడు స్థానాలను కోల్పోయి, గత ఎన్నికల్లో ఓటమి పాలైన నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఐదేళ్లుగా జరిగిన మార్పులు, చేర్పులు, చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ చాలా చోట్ల బలపడింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దేవరకొండ నియోజకవర్గంలో రెండో స్థానంలో నల్లగొండలో టీడీపీ రెబల్ రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరికి వచ్చిన ఓట్లు ఈ సారి కూటమికి బదిలీ కాలేదన్న అంశం తాజా ఓట్ల గణాంకాలు స్ప ష్టం చేస్తున్నాయి. నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కూటమి భా గస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐల ఓట్లు బదిలీ కాకపోగా, ఆ తేడా భారీగా కనిపిస్తోంది. పక్కాగా ఓటు బదిలీ జరిగి ఉం టే నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు అవకాశం దక్కేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నియోజకవర్గాల్లో ఇలా.. నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 7,771 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ, ఇక్కడ కూటమి ఓట్లన్నీ కలిస్తే (2014 గణాంకాలు)నే బదిలీ కాకుండా పోయిన ఓట్లు 21,658. గతం కన్నా ఈ సారి ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. అంటే కూటమి బదిలీ అయి ఉంటే జానారెడ్డి ఓటమి కోరల నుంచి తప్పించుకునే అవకాశం ఉండేదంటున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి 23,698 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ, ఈ నియోజకవర్గంలో 35,907ఓట్లు కూటమి బదిలీ కాలేదు. దీంతో ఆయనకూ ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన (బీజేపీ, టీడీపీ ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి)4523 ఓట్లును ఈ సారి మినహాయించినా కూటమికి బదిలీకాకుండా పోయిన ఓట్లు 31,384. ఈ లెక్కన చూసినా, కాంగ్రెస్కు అవకాశం ఉందేం టున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో కాం గ్రెస్తో జతకట్టిన టీడీపీ, సీపీఐ తదితర పార్టీల కూటమి పక్షాల ఓట్లు కాంగ్రెస్కు బదిలీకాకపోవడం ఆ పార్టీ అభ్యర్థుల ఓటమిలో ప్రధాన పాత్ర పోషించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
కోర్టుల్లో పోరాడతాం
ప్రస్తుత ఎన్నికల్లో ఈవీఎంలలో జరిగిన మోసాలు, ఎన్నికల అధికారుల తీరుపై పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ తెలిపారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. రిట ర్నింగ్ అధికారులు, పోలీసులు కుమ్మక్కయ్యి పోలింగ్ ఏజెంట్లను కూడా సెంటర్లలోకి రానివ్వకుండా టీఆర్ఎస్కు సహకరించారన్నారు. ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. ‘బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్’ఉద్యమం హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తామన్నారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ పోరాడతామన్నారు. -
కేసీఆర్కు కేతిరెడ్డి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖర్రావుకు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం ప్రగతిభవన్లో సీఎంను ఆయన కలిశారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్నారు. తెలుగు వారి భాషా సంస్కృతులను కాపాడటంలో ఒక తెలుగు నేతగా ముందుండాలని కోరారు. -
24న నగరానికి అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఘోర పరాజ యం పాలవ్వడంపై రాష్ట్ర కార్యవర్గంతో అంతర్గత సమీక్ష, వచ్చే పార్లమెంటు ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 24న హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశంలో అమిత్ షా పర్యటన ఖరారైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష, వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉనికిని చాటుకునేలా వ్యూహరచన చేసి రాష్ట్ర నాయకత్వానికి అమిత్షా దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో పొందిన సీట్లను కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోవడంపై తెలంగాణ బీజేపీ నేతలపై షా తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనీస ప్రభావం చూపించలేకపోవడంపై రాష్ట్ర నేతల పనితీరుపై షా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ వైఫల్యానికి కారణాలు గుర్తించి వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు షా తన పర్యటనలో మార్గదర్శనం చేయనున్నట్టు సమాచారం. అలాగే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీకి ఉన్న లక్ష్యాలను వివరించి క్లస్టర్ల వారీగా విభజించిన లోక్సభ స్థానాలపై సమీక్షలు జరపనున్నట్లు తెలుస్తోం ది.రాష్ట్ర కార్యవర్గంలో పలు మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా పర్యటన అనంతరం ఈ నెలాఖరున లేదా జనవరి తొలి వారంలో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది. సెంటిమెంట్ ప్రభావం అధికంగా ఉంది.. తెలంగాణ ఎన్నికల్లో సెంటిమెంట్ ప్రభావం అధికంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విశ్లేషించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పోటీ చేయడం, ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారంలో పాల్గొనడంతో ఈ ఎన్నికలు తెలంగాణ వాదులు, వ్యతిరేకుల మధ్య పోటీగా మారిందని, దీని వల్ల ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారని అన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం, డబ్బు ప్రభావం, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల ఓటమిపాలయ్యామని ఆయన విశ్లేషించారు. పార్టీ వైఫల్యాలను గుర్తించి వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకొని సత్తాచాటుతామని ఆయన తెలిపారు. -
ఇంకా తేరుకోని కూటమి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బతో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజా ఫ్రంట్ కూటమి తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. ఫలితాలు వెలువడి మూడు రోజులు దాటినా ఇంకా వాటిని సమీక్షించే సాహసం కూడా చేయడం లేదు. ఇంతవరకు కూటమి భాగస్వామ్యపక్షాల ముఖ్యనేతలు కనీసం పలకరించుకున్న దాఖలాలూ లేవు. టీడీపీతో కుదుర్చుకున్న పొత్తే ఆత్మహత్యా సదృశం గా మారడంతో ఓటమికి కారణాల విశ్లేషణే ముం దుకు కదలడం లేదు. టీడీపీతో పొత్తు కారణంగా ప్రస్తుతం రాజకీయంగా తలెత్తిన విపత్కర పరిస్థితులపై అంతర్మథనం కొనసాగుతోంది. ఫలితాల సరళి, తీరుపై సమీక్షకు రాష్ట్ర టీడీపీ నాయకులను పిలిపిం చాలంటేనే భాగస్వామ్యపక్షాలు జంకుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో సమావేశానికి చొరవ తీసుకోకపోవడంతో కనీసం సీపీఐ, టీజేఎస్ నేతలు కలుసుకుని ప్రాథమిక సమీక్ష జరపాలని భావించినా ఆ ప్రయత్నాలు కూడా సఫలం కానట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో వరుసగా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు ఉండటంతో కూటమిగా కొనసాగాలా లేక విడివిడిగా పోటీచేస్తేనే మంచిదా అనే మీమాంసలో కూటమి నేతలున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై అతిగా అంచనాలు... ప్రజల మనోభావాలకు భిన్నంగా టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడం, కూటమి ఎన్నికల ప్రచార సంధానకర్తగా చంద్రబాబుకు పూర్తి బాధ్యతలు అప్పగించడం కూటమి ఓటమికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నేల విడిచి సాము చేస్తున్న చంద్రబాబు, తెలంగాణలో ఎలాంటి గుణాత్మక మార్పు తేగలుగుతారన్న దాని పై కూటమి నేతలు సరిగా అంచనా వేయలేకపోవడం ప్రతికూలంగా మారిందని అంటున్నారు. అప్రజాస్వామిక విధానాలు, నియంతృత్వ ధోరణితో ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న చంద్రబాబును తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ముఖ చిత్రంగా మార్చేయడం కూటమిని దెబ్బతీసిందనే అభిప్రాయంతో పలువురు నాయకులున్నారు. దీంతోపాటు టీఆర్ఎస్పై ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత పతాకస్థాయికి చేరాయన్న అతిఅంచనాలు కూటమి అవకాశాలను దెబ్బతీశాయని భావిస్తున్నా రు. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో కూటమి విఫలం కావడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్లు కూటమిగా ఏర్పడగానే ఇక అధికారానికి వచ్చేసినట్లేననే అతివిశ్వాసం ప్రతికూలంగా మారిం దన్న అంచనాల్లో ఆయా పార్టీల నాయకులున్నారు. తమ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కారణంగానే టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిందనే ప్రాథమిక అంచనాపైనే కూటమి రాజకీయ వ్యూహా న్ని ఖరారు చేసుకోవడం వ్యూహాత్మక తప్పిదంగా భావిస్తున్నారు. ప్రజలు, గ్రామీణుల మనోభావాలకు భిన్నంగా పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగులు, నిరుద్యో గ యువత భావాలు, అభిప్రాయాలనే కూటమి నేత లు ప్రామాణికంగా తీసుకోవడం కూడా దెబ్బతీసిందంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమకు అందుతున్న ప్రయోజ నాలపట్ల ఎలాంటి అభిప్రాయం, వైఖరితో ఉన్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం కూడా భారీ ఓటమికి కారణమైందనే అభిప్రాయం ప్రజాఫ్రంట్ నేతల్లో వ్యక్తమవుతోంది. -
సీఈసీ ముందు పరేడ్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం మోసాలు, ఎన్నికల అధికారుల తీరును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)దృష్టికి తీసుకెళ్లాలని టీపీసీసీ నిర్ణయించింది. అవసరమైతే ఎన్నికల్లో పోటీ చేసిన తమ అభ్యర్థులందరినీ ఢిల్లీ తీసుకెళ్లి సీఈసీకి ఫిర్యాదు చేయించాలని యోచిస్తోంది. ప్రభుత్వం రద్దయిన నాటి నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా పక్షపాతంగా వ్యవహరించిందని, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై విన్నవించినా పట్టించుకోలేదని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాలనే నిర్ణయానికొచ్చింది. శుక్రవారం గాంధీభవన్లో ఎన్నికల ఓటమిపై కాంగ్రెస్ సమీక్షించింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, నేతలు జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, జీవన్రెడ్డి, దాసోజు శ్రవణ్, ప్రేమ్సాగర్రావు, ఆరేపల్లి మోహన్, రమేశ్ రాథోడ్, తాహెర్బిన్, ఆత్రం సక్కు, అద్దంకి దయాకర్ తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మూడు దశలుగా సమీక్షించారు. ఈవీఎంల ట్యాంపరింగ్తో పాటు ఇతర అంశాలపైనా నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. తన నియోజకవర్గం మంచిర్యాలలో 4 గంటలకే పోలింగ్ పూర్తి చేశారని, ఆ సమయంలో జరిగిన పోలింగ్ కన్నా కౌంటింగ్ సమయంలో చూపిన ఓట్ల శాతం ఎక్కువగా ఉందని ప్రేమ్సాగర్రావు వివరించారు. త్రిసభ్య కమిటీతో అధ్యయనం.. ఎన్నికల్లో ఈవీఎం మోసాలపై తేల్చేందుకు త్రిసభ్య కమిటీని నియమించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, సీనియర్ నేత ప్రేమ్సాగర్రావులతో కమిటీని ఏర్పాటు చేశారు. ధర్మపురి, కోదాడ, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, మంచిర్యాల స్థానాల్లో పోలింగ్ స్టేషన్ల వారీగా నమోదైన ఓట్లు, కౌంటింగ్ నివేదికలను ఈ కమిటీ తెప్పించుకుని అధ్యయనం చేయనుంది. ఇక్కడ పరిశీలనలోకి వచ్చే అంశాలతో అవసరాన్ని బట్టి కోర్టులకు వెళ్లాలని నిర్ణయించింది. పోటీ చేసిన అభ్యర్థులందరితో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి, న్యాయం చేసేలా ఒత్తిడి తేవాలని నేతలు భేటీలో నిర్ణయించారు. ఓట్ల గల్లంతుపైస్పందన కరువు... నర్సాపూర్ నియోజకవర్గంలో మధ్యాహ్నం సమయానికి 8.83 శాతం పోలింగ్ జరగ్గా, సాయంత్రానికి 70 శాతం పోలింగ్ అయినట్లు చూపారని, ఒక్కో ఓటు వేయాలంటే కనీసం నిమిషం సమయం పట్టినా, అంత తక్కువ సమయంలో ఓటింగ్ శాతం ఎలా పెరిగిందో అర్థం కావట్లేదని సునీతా లక్ష్మారెడ్డి వివరించారు. హైదరాబాద్లో 22 లక్షల ఓట్ల గల్లంతుపై ఎంత పోరాడినా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదని, చివరికి క్షమాపణతో సరిపెట్టిందని వివరించారు. 40 నుంచి 50 నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థులపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఉందని, వారెక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజలు అడ్డగించారని, అలాంటి నేతలకే 30 నుంచి 40వేల మెజారిటీలు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. తక్కువ మెజార్టీతో ఓడిన తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, ధర్మపురి వంటి నియోజకవర్గాల్లో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరినా పట్టించుకోలేదన్న అభిప్రాయాలను వెలిబుచ్చారు. -
‘బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్ ఉద్యమం ప్రారంభిస్తాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి దారి తీసిన పరిస్థితులు, ఎన్నికల్లో వ్యవహరించిన తీరుపై గాంధీభవన్లో సుమారు మూడు గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం టీపీసీసీ నేత దాసోజు శ్రవణ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 22 లక్షలు ఓట్లు నిర్ధాక్షణంగా తొలగించిన విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికలకు సంబంధించిన కేసు కోర్టులో ఉండగా ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రధాన అధికారి(ఈసీ) రజత్ కుమార్, ఇతర అధికారులు టీఆర్ఎస్ పార్టీకి పేరోల్ క్రింద ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వచ్చే పార్టమెంట్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని అని వెల్లడించారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరుతామని తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు కుమ్మకైయి పోలింగ్ ఏజెంట్లను కూడా సెంటర్లోకి రానివ్వకుండా అధికార పార్టీకి సహకరించారని ఆయన ఆరోపించారు. నర్సాపూర్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 8.8 శాతం ఉన్న పోలింగ్ సాయంత్రం 5 గంటలకు 70 శాతం దాటిందని, ఆపై తెల్లారా 90 శాతంగా ఈసీ ప్రకటించని ఈ సందర్భంగా ప్రస్తావించారు. చిప్లు, ట్యాంపరింగ్ సమాచారం సేకరించి సరియైన సమయంలో వాటి గురించి బయట పెడుతామన్నారు. బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్ ఉద్యమాన్ని హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తామని, ఈ విషయం పై హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా పోరాడుతామని దాసోజ్ చెప్పారు. ఇది మిషన్ మాండేటరీ తప్ప పీపుల్స్ మాండేటరీ కాదన్నారు. రాష్ట్రంలో 40 నుంచి 50 నియోజకవర్గాల్లో ప్రజలు, టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రచారానకి రాకుండా అడ్డుకున్నా వాళ్లే వేలాది ఓట్ల మోజారిటీతో గెలిస్తే ఇక ఏం చెప్పాలో మాకు అర్థం కావడం లేదని దాసోజ్ చెప్పారు. -
తెలంగాణలో టీడీపీ బలంగా లేదు : చినరాజప్ప
సాక్షి, అమరావతి : తెలంగాణలో టీడీపీ బలంగా లేకపోవడంతోనే 13 స్థానాల్లో పోటీ చేశామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తొలిసారి ఆయన స్పందించారు. ప్రజలు మంచోళ్లు, తెలివైన వాళ్లు కాబట్టే అభివృద్ధికి ఓటేశారని వ్యాఖ్యానించారు. ఏపీలో కూడా ప్రజలు అదే విధంగా తీర్పును ఇస్తారని అభిప్రాయపడ్డారు. కాగా తెలంగాణ ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే. -
మహిళ మహిమ..
రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేసి అఖండ విజయం నమోదు చేసిన టీఆర్ఎస్ పార్టీ విజయం వెనుక జిల్లా మహిళల పాత్ర కీలకంగా ఉందనేది ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం. మిగిలిన గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో కూడా పురుషులతో సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారు. దీంతోపాటు పోలింగ్లో కూడా పురుషుల కన్నా అధికంగా మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహిళలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన కారణంగానే టీఆర్ఎస్ సునాయసంగా విజయం సాధించడంతోపాటు చాలాచోట్ల ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతు చేసిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. – సాక్షి, సిద్దిపేట మహిళా ఓటర్లు కారుకు.. కేసీఆర్కు జై కొట్టినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. జల్లా వ్యాప్తంగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో మొత్తం 8,55,453 ఓట్లు ఉన్నాయి. ఇందులో 4,25,463 ఓట్లు పురుషులవి ఉండగా.. వీరి కన్నా 3,982 ఓట్లు అధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే ప్రభుత్వం ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సఖి పేరుతో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు, అధికారులు, అక్కడ సహాయ సహకారాలు అందించే సిబ్బంది కూడా మహిళలనే నియమించారు. ఇలా జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో మొత్తం 3827 ఓటర్లు ఉండగా.. ఇందులో 2801 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 66.5 శాతం అంటే 1850 మంది మహిళలు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓట్లలో 65శాతం ఓట్లు టీఆర్ఎస్కు పోల్ కావడం మహిళలు టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా ఉన్నారని స్పష్టం అవుతుంది. కాగా మహిళలు.. పురుషులకన్నా 1.5 శాతం ఎక్కువగా టీఆర్ఎస్కు వేయడం గమనార్హం. సంక్షేమ పథకాల ప్రభావం.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మహిళా ఓటర్లను అత్యధికంగా ఆకట్టుకున్నాయని, అదే అభ్యర్థులకు శ్రీరామ రక్షగా నిలిచి భారీ మెజార్టీకి దారులు సుగమనం చేసిందని జిల్లాలోని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా మహిళల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, కళ్యాణ లక్ష్మీ వంటి పథకాలు మహిళలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పథకాల పుణ్యమా అని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు పెరిగాయి. వసతులు పెరిగాయి. దీని మూలంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు కూడా పెరిగాయి. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆపరేషన్ లేనిదే ప్రసవం కానిరోజుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు అధికం కావడం విశేషం. దీంతో ప్రసూతి ఖర్చులు తగ్గాయి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆడపిల్ల పెళ్లికి రూ.1,0116 అందచేసిన ప్రభుత్వం తీరును పేదింటి ఆడపిల్ల తల్లిదండ్రుల భారం తగ్గింది. అది కూడా ఆడపిల్ల తల్లి పేరిట చెక్కులు పంపిణీ చేసిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అదేవిధంగా వృద్ధ మహిళలు, వితంతులు, ఒంటరి మహిళలతోపాటు, బీడీ కార్మికుల పెన్షన్లు కూడా ఇవ్వడంతో సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటి తలుపు కొట్టిందని మహిళలు చెబుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావుతోపాటు, దుబ్బాక, హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థులు సోలిపేట రామలింగారెడ్డి, వొడితల సతీష్కుమార్లు ప్రతీ సభ, సమావేశం, రోడ్షోలతోపాటు, పది మంది మహిళలు ఎక్కడ కన్పిస్తే అక్కడ ఈ పథకాల గురించే వివరించిన తీరు మహిళా ఓటర్లపై ప్రభావితం చూపింది. పథకాలను ఆదరించారు మొదటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికే పెద్దపీట వేసింది. మహిళా సాధికారత కోసం ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధానంగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, ఆసరా, ఒంటరి మహిలా, బీడీ కార్మికుల పెన్షన్లు మహిళలకు అందాయి. గతంలో ఏ ప్రభుత్వం చెయ్యని తీరుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చింది. అందుకోసమే మహిళలు టీఆర్కు పట్టం కట్టారు. – కొత్త ప్రభాకర్రెడ్డి, ఎంపీ, మెదక్ పథకాలకు ఆకర్షితులయ్యారు హుస్నాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా మహిళా ఓటర్లే అధికం. ఇందులో అత్యధిక శాతం మంది టీఆర్ఎస్కు ఓటు వేశారు. కేసీఆర్ సీఎంగా ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయనే విశ్వాసం మహిళల్లో బలంగా ఉంది. ముఖ్యంగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, పాలపై లీటర్కు రూ.4 సబ్సిడీ, సబ్సిడీతో బర్రెల పంపిణీ, ఆసరా పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయి. నాకు భారీ మెజార్టీ రావడంలోనూ మహిళా ఓటర్లే కారణం. – వొడితెల సతీష్కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్ నా మెజార్టీలో మహిళా ఓటర్లే కీలకం మహిళలు తలుచుకుంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి.. ఆగ్రహిస్తే కూలిపోతాయి. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు మహిళలు టీఆర్ఎస్కు అండగా ఉన్నారు. గత 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటులో కూడా మహిళల పాత్ర చాలా కీలకం. తాజాగా విడుదలైన అసెంబ్లీ ఫలితాల్లోనూ టీఆర్ఎస్కు మహిళలే అండగా నిలిచారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్కు మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. నా మెజారిటీలోనూ వారి ఓట్లే కీలకం. – సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్యే దుబ్బాక -
ఉమ్మడి ఆదిలాబాద్లో నోటాకు పెరిగిన ఓట్లు
మంచిర్యాలటౌన్: ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఓటు ఆయుధమైతే.. అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చేందుకు ‘నోటా’తో అవకాశం కలిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 20,255 మంది ‘నోటా’ నొక్కి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తమకు ఎవరూ నచ్చలేదని స్పష్టం చేయడం విశేషం. గతంలో ఎన్నికల్లో గెలిచిన వారిలో ఎవరు మనకు సేవ చేస్తారో, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తారో వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉండేది. అప్పుడు ఎన్నికల్లో పోటీచేసే వారు ప్రజల మధ్య నుంచి వచ్చినవారే ఉండడంతో దానిపై ప్రజలు అంతగా పట్టించుకోలేదు. ఇక రోజులు మారుతున్న కొద్దీ చాలా మంది రాజకీయాల్లోకి రావడం, ఎన్నికల్లో పోటీ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఓ వైపు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చక ఎవరికి ఓటు వేయాలో తెలియని పరిస్థితిలో ఎవరో ఒకరికి ఓటు వేసే సంస్కృతికి ఎన్నికల సంఘం స్వస్తి పలికింది. దీంతో 2014లో జరిగిన ఎన్నికల్లో నోటా (నన్ ఆప్ ది ఎబోవ్)ను ప్రవేశపెట్టింది. ‘పైన తెలిపిన అభ్యర్థులు ఎవరూ నాకు నచ్చలేదు’ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని ఓటర్లకు కల్పించింది. దీంతో ప్రజల్లోనూ తమకు నచ్చని అభ్యర్థికి ఇక తాము ఓటు వేయాల్సిన అవసరం లేదని, ఎవరూ నచ్చలేదని ‘నోటా’కు వేసే అవకాశం కలగడంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నారు. స్వతంత్రులు, పలు పార్టీల నేతలకు నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం. గతం కంటే పెరిగిన నోటా ఓట్లు మన దేశంలో నోటాను తొలిసారిగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చలేదని తెలిపేందుకు ప్రవేశపెట్టిన నోటాను ప్రజలు ఆదరించారు. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో నోటాకు ప్రజలు పట్టం కట్టారు. ప్రధాన పార్టీలు, స్వతంత్రులు, చిన్న పార్టీల నాయకులకు కనీసం రాని ఓట్లు నోటాకు వచ్చాయంటే, నోటా ప్రభావం ఏమేర చూపిందో అర్థమవుతోంది. నోటా వల్ల ఓటింగ్ శాతం పెరిగినట్లుగా కనబడుతున్నా, అభ్యర్థులకు వచ్చే ఓట్లు మాత్రం తగ్గిపోతున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నోటాకు 2,715 ఓట్లు మొన్నటి ఎన్నికల్లో వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు చేతిలో కేవలం 171 ఓట్లతో ఓడిపోయారు. నోటాకు వచ్చిన ఓట్లలో కొన్నింటిని కోవ లక్ష్మి సాధించినా విజయం వరించేదేమో! 2014లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు 17,905 నోటాకు రాగా, 2018లో 20,255 ఓట్లు నోటాకు వచ్చాయి. గత ఎన్నికల కంటే 3,160 ఓట్లు నోటాకు పెరిగాయి. ఉద్యోగస్తులు సైతం పోస్టల్ బ్యాలెట్లో వారికి ఏ అభ్యర్థి నచ్చలేదంటూ 2014 ఎన్నికల్లో నోటాకు 67 మంది ఓటు వేయగా, ఈసారి ఎన్నికల్లో 187 మంది నోటాను వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో వచ్చిన నోటా ఓట్లు నియోజకవర్గం 2014లో 2018లో సిర్పూర్ 1,752 1,579 చెన్నూరు 1,609 2,135 బెల్లంపల్లి 769 2,598 మంచిర్యాల 1,472 1,394 ఆసిఫాబాద్ 2,829 2,715 ఖానాపూర్ 2,421 2,776 ఆదిలాబాద్ 850 1,149 బోథ్ 2,242 2,275 నిర్మల్ 1,360 1,367 ముథోల్ 1,791 2,267 మొత్తం 17,095 20,255 -
గెలిచారు.. ఓడారు..
సాక్షి, కొత్తగూడెం: ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలోని అధికార, ప్రతిపక్షాల్లో ఒకవైపు మోదం, మరోవైపు ఖేదం నెలకొంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం సగమే అయింది. జిల్లాలోని ఐదు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కాంగ్రెస్ కూటమి జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి రావడంతో తీవ్ర మథనంలో పడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర అన్ని జిల్లాల్లో అధికార టీఆర్ఎస్ దాదాపు స్వీప్ చేసినట్టుగా ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే భద్రాద్రి జిల్లాలో మాత్రం సీన్ పూర్తి రివర్స్ అయింది. ఇక్కడ టీఆర్ఎస్ అసలు ఖాతానే తెరవలేదు. కాంగ్రెస్ పార్టీ నాలుగు, టీడీపీ ఒక స్థానంలో గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే టీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లో మాత్రమే ‘కారు’కు డిపాజిట్ దక్కింది. ఉమ్మడి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ధరావత్తు కోల్పోయింది. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పినపాక, అశ్వారావుపేట, వైరా స్థానాల్లో గెలిచింది. ఇల్లెందు, పాలేరు, మధిర, ఖమ్మం సీట్లలో కాంగ్రెస్, సత్తుపల్లిలో టీడీపీ, భద్రాచలంలో సీపీఎం అభ్యర్థులు విజయం సాధించారు. తర్వాత కాలంలో వైరాలో గెలిచిన మదన్లాల్, అశ్వారావుపేట నుంచి గెలిచిన తాటి వెంకటేశ్వర్లు, పినపాకలో గెలిచిన పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందులో గెలిచిన కోరం కనకయ్య, ఖమ్మంలో గెలిచిన పువ్వాడ అజయ్కుమార్ టీఆర్ఎస్లో చేరారు. పాలేరు నుంచి గెలిచిన రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్కు ఏడు స్థానాల్లో ప్రాతినిధ్యం లభించి జిల్లాలో మంచి బలమైన శక్తిగా ఆవిర్భవించింది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచింది. చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ కూటమిని తిరస్కరించారు. కాంగ్రెస్, టీడీపీకి చెందిన మహా మహా నాయకులు ప్రజాతీర్పుతో మట్టికరిచారు. అయితే జిల్లాలో మాత్రం తీర్పు ఇందుకు భిన్నంగా వచ్చింది. టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఆయా నియోజకవర్గాల్లో ఓటమిపాలైంది. పినపాక, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల స్వయంకృతాపరాధమే ఓటమి పాలు చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇల్లెందు, కొత్తగూడెం, మధిర నియోజకవర్గాల్లో మాత్రం హోరాహోరీ పోటీ నడిచింది. ఈ మూడు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు సమీపానికి వచ్చి ఓటమి చెందారు. సిట్టింగ్లకు నో చాన్స్.. జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు గెలిచిన వారందరూ కొత్తవారే. అయితే కొత్తగూడెంలో గెలిచిన వనమా వెంకటేశ్వరరావు, పినపాకలో గెలిచిన రేగా కాంతారావు గతంలో ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించినవారే. ఇల్లెందు నుంచి గెలుపొందిన బాణోత్ హరిప్రియ, అశ్వారావుపేట నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. హరిప్రియ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి పరాజయం కాగా, ఈసారి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. మెచ్చా నాగేశ్వరారవు గతంలో టీడీపీ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా అదే పార్టీ నుంచి గెలుపొందారు. భద్రాచలం నుంచి గెలిచిన పొదెం వీరయ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండుసార్లు ప్రాతినిథ్యం వహించారు. ఈ సారి భద్రాచలం నుంచి ఎన్నికయ్యారు. ములుగు టికెట్ సీతక్కకు ఇవ్వడంతో చివరి నిమిషంలో భద్రాచలం వచ్చిన వీరయ్య.. వారం రోజుల ప్రచారంతోనే విజయం సాధించడం విశేషం. మోదం.. ఖేదం.. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం వీయగా, జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. దీంతో రెండు పక్షాల్లోనూ మోదం, ఖేదం కలిగింది. ఓడినప్పటికీ ప్రభుత్వం అండతో నియోజకవర్గాల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని టీఆర్ఎస్ నుంచి ఓడిపోయిన అభ్యర్థులు చెపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడుతామని అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక వాతావరణం నెలకొంది. మరో నాలుగు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగనుండడంతో రాజకీయ సమీకరణలు ఎలా మారతాయోనని జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. -
ఖమ్మంలో.. నోటాకు మూడో స్థానం
ఖమ్మం, మయూరిసెంటర్: ఖమ్మం నియోజకవర్గంలో ఓటర్లు ఈ ఎన్నికల్లో భిన్నంగా ఆలోచించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను సైతం కాదని నోటా వైపు మొగ్గు చూపారు. ఖమ్మం నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్కుమార్, టీడీపీ నుంచి నామ నాగేశ్వరరావు, బీజేపీ నుంచి ఉప్పల శారద, బీఎల్పీ నుంచి పాల్వంచ రామారావు పోటీ చేయగా పోటీ అంతా టీఆర్ఎస్, టీడీపీల మధ్యనే జరిగింది. నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలో పోలైన ఓట్లు 2,06,428. మొదటి నుంచి గట్టి పోటీదారులుగా ఉన్న పువ్వాడ అజయ్కుమార్ 1,02,760 ఓట్లు సాధించగా, నామ నాగేశ్వరరావు 91,769 ఓట్లు సాధించారు. వీరిద్దరు మినహా ఇతర పార్టీల అభ్యర్థులు కనీస ఓట్లను కూడా సాధించలేకపోయారు. మిగిలిన ప్రధాన పార్టీల అభ్యర్థులను వెనక్కి నెట్టి నోటా నియోజకవర్గంలో మూడవ స్థానంలో నిలిచింది. నోటా దెబ్బకి బీజేపీ, బీఎల్పీ అభ్యర్థులు 4, 6 స్థానాలల్లో నిలిచారు. ఇక బీఎస్పీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీల అభ్యర్థులు సైతం కనీస ఓట్లను పొందలేకపోయారు. అయితే నోటాకు ఖమ్మం నియోజకవర్గంలో గతం కంటే ఈ దపా ఓట్లు పెరిగాయి. 2014 ఎన్నికల్లో 1,408 మంది పోటీలో ఉన్న అభ్యర్థులు సరైనవారు కాదని నోటాకు ఓటు వేయగా, ఈసారి 3,513 మంది నోటాను నొక్కి పోటీలో ఉన్న అభ్యర్థులు సరైన వారు కాదని భావించారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు పలువురు నోటాను ఎంచుకున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 19 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నోటాకు పోలయ్యాయి. దీంతో ఎన్నిక ఎన్నికకు నోటాకు ఆదరణ పెరుగుతుంది. నోటాకు ఉన్న ఆదరణ ప్రధాన పార్టీల అభ్యర్థులకు కూడా దక్కడం లేదని నియోజకవర్గ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. -
ఇంకెవరు?
సాక్షి,సిటీబ్యూరో: సీఎం కేసీఆర్ నూతన కేబినెట్లో నగరం నుంచి నలుగురికి చోటు కల్పించనున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం వారెవరు అన్నది సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. గురువారం సీనియర్ నేత మహమూద్ అలీతో మంత్రిగా ప్రమాణం చేయించి పూర్తి స్థాయి మంత్రిమండలి ఏర్పాటుకు మరో నాలుగు రోజులుందని కేసీఆర్ సంకేతాలిచ్చారు. దీంతో కేబినెట్లో చోటు కోసం నేతలు ఎవరికి వారుగా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. రద్దయిన కేబినెట్లో నగరం నుంచి మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్యాదవ్తో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్రెడ్డికి స్థానం కల్పించారు. తాజా కేబినెట్లో రంగారెడ్డితో కలుపుకుని ఇంకా నాలుగు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దీంతో రంగారెడ్డిఉమ్మడి జిల్లా కోటాలో మేడ్చల్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన చామకూర మల్లారెడ్డికి అవకాశం కల్పించే అంశంపై చర్చ సాగుతోంది. ఎంపీగా ఉన్న ఆయనతో ఎమ్మెల్యేగా పోటీ చేయించడం కూడా సీఎం కేసీఆర్ ముందస్తు నిర్ణయమేనని ప్రచారం జరగుతోంది. మల్లారెడ్డికి సీఎం కేసీఆర్తో పాటు యువనాయుడు కేటీఆర్తోనూ సన్నిహిత సంబంధాలు ఉండడం కలిసివచ్చే అంశం. ఇక సిటీకి చెందిన నాయిని నర్సింహారెడ్డిని మళ్లీ క్యాబినెట్లో కొనసాగించే అంశం సస్పెన్స్గా ఉంది. నాయినికి ఎమ్మెల్సీ కాలపరిమితి ఇంకా రెండేళ్లు ఉంది. కొత్త క్యాబినెట్లోనూ స్థానం దక్కుతుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. ఒకవేళ నాయినిని తప్పిస్తే పార్టీ బాధ్యతలు లేదా శాసనమండలిలో ఏదైనా కీలక పదవి ఆయనకు అప్పగించే అవకాశం లేకపోలేదని సన్నిహితులు భావిస్తున్నారు. మరోపక్క సికింద్రాబాద్, సనత్నగర్ల నుంచి విజయం సాధించిన పద్మారావు, తలసాని సైతం తమకు క్యాబినెట్లో చోటు ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. వీరిలో ఒకరిని వచ్చే లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించే ఆలోచన అధినేతకు ఉంటే క్యాబినెట్లో చోటు దక్కకపోవచ్చు. ఒకవేళ సీనియర్లు అందరినీ తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన వస్తే సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఆమేరకు ఖైరతాబాద్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్గౌడ్, వివేకానంద్గౌడ్, అరికెపూడి గాంధీ పేర్లను కూడా పరిశీలించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
పంచాయతీ’ పోరుపై టీజేఎస్ గురి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి త్వరగా కోలుకునేందుకు తెలంగాణ జన సమితి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా పరాభవమే ఎదురవ్వడంతో జవసత్వాలు కూడగట్టుకుని పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు యోచిస్తోంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగాలని టీజేఎస్ భావిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో స్థానిక అంశాలు, అభ్యర్థులే ఫలితాలను నిర్ణయించే అవకాశముండటంతో క్షేత్రస్థాయిలో మంచి పేరున్న వారిని పోటీలో నిలపాలనుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, కూటమితో కలసివెళ్లే ఆలోచన తమకు లేదని టీజేఎస్ నేతలు చెబుతున్నారు. కచ్చితంగా తమ సొంత బలంతోనే పంచాయతీ ఎన్నికల్లో పోరాడతామని, గ్రామాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని వారంటున్నారు. అయితే, దీనిపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మూడ్రోజుల్లో కీలక భేటీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకుగానూ టీజేఎస్ త్వరలోనే సమావేశం కానుంది. రెండు లేదా మూడ్రోజుల్లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీకి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను కూడా ఆహ్వానించనున్నారు. ఇందులో పార్టీ భవిష్యత్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల ఫలితాలతో టీజేఎస్ ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో జరగబోయే సమావేశంలో ఏం నిర్ణయిస్తారన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలే ప్రామాణికం కాదు: కోదండరాం రెండు, మూడ్రోజుల్లో టీజేఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటుందని, అందులో చర్చించి పంచాయతీ ఎన్నికలపై అధికారిక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమిని అంగీకరిస్తున్నామని, అన్ని అంశాలను సమీక్షించుకుని పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అన్నింటికీ ప్రామాణికం కాదన్నారు. టీజేఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని వస్తున్న వాదనలను కొట్టిపారేశారు. ప్రజా సంక్షేమం, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే తాము పార్టీ పెట్టినట్లు చెప్పారు. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన కార్యాచరణపై భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. -
అసెంబ్లీలో తగ్గిన ‘యువ’ ప్రాతినిథ్యం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభలో యువతకు ప్రాతినిధ్యం తగ్గింది. 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసుగల ఎమ్మెల్యేలు 2014 సభలో 12 మంది ఉండ గా, కొత్త శాసనసభలో వీరి సంఖ్య 5కు తగ్గింది. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఈ మేరకు గురువారం ఒక నివేదిక విడుదల చేసింది. ఐదు రాష్ట్రాలకు కొత్త శాసనసభలు కొలువుదీరనున్న నేపథ్యంలో ఆయా గణాంకాలు విశ్లేషించింది. 61 శాతం ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికయ్యారని వివరించింది. గత సభలోని వారు 73 మంది తిరిగి ఎన్నికవగా 46 మంది కొత్తగా ఎన్నికయ్యారని తెలిపింది. 2014లో 9 మంది మహిళలు ఎన్నికవగా ఈసారి ఆ సంఖ్య 5 మాత్రమే. ఇక 41–55 మధ్య వయస్కుల్లో 2014లో 67 మంది ఎన్నికవగా.. ఈ సభలోనూ 67 మంది ఎమ్మెల్యేలు ఇదే కేటగి రీలో ఉన్నారు. 56–70 మధ్య వయస్కులు పాత సభలో 40 మంది ఉండగా, ఈసారి 45 మంది ఉన్నారు. 71 ఏళ్ల వయసు పైబడినవారు గత సభలో ఎవరూ లేరు. ఈసారి ఇద్దరు ఉన్నారు. విద్యకు సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆపైన విద్యార్హత ఉన్న వారి సంఖ్య 19 నుంచి 26కు పెరి గింది. డిగ్రీ విద్యార్హత కలిగిన వారి సంఖ్య 60 నుంచి 43కు తగ్గింది. 12వ తరగతి వరకు విద్యార్హత కలిగిన వారి సంఖ్య 37 నుంచి 45కు పెరిగింది. ఛత్తీస్గఢ్లో 25–40 మధ్య వయçస్కుల్లో గత సభలో కేవలం ఆరుగురు ఉండగా.. ఈసారి 25కు పెరిగింది. ఛత్తీస్గఢ్లో మహిళల ప్రాతినిధ్యం 10 నుంచి 13కు పెరి గింది. 90 స్థానాలకు 13 మంది మహిళల ప్రాతిని థ్యం ఉండటం విశేషం. మిజోరంలో మాత్రం గత సభలో ఒక మహిళా సభ్యురాలు ఉండగా ఈసారి ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. -
బాబు జోక్యంతోనే ప్రతికూల ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన ప్రచారం ప్రజా కూటమిపై ప్రతికూల ప్రభావం చూపిందని సీపీఎం విశ్లేషించింది. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మళ్లీ జోక్యం చేసుకోవడం ఇక్కడి ప్రజలకు రుచించలేదని, టీఆర్ఎస్ అనుకూల సెంటిమెంట్ ఏర్పడేందుకు కేసీఆర్ నిర్వహించిన ప్రచారం ఉపయోగపడిందని అభిప్రాయపడింది. గురువారం ఎంబీ భవన్లో జరిగిన సమావేశంలో ఎన్నికల ఫలితాలు, ప్రభావం, సీపీఎం–బీఎల్ఎఫ్ పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలు, తదితర అంశాలను సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సమీక్షించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేసిన ప్రసంగాలు, కూటమికి తానే సంధానకర్తగా వ్యవహరించిన తీరు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడానికి కారణమైందని విశ్లేషించింది. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో లోపాలున్నా అవి అధికార పార్టీకి సానుకూల ఓటింగ్కు పనికొచ్చాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇక ముందూ కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఓట్ల సాధనలో బీఎల్ఎఫ్ విఫలం... ప్రత్యామ్నాయ విధానాలు, సామాజిక న్యాయం నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఎం–బీఎల్ఎఫ్ ఆశించిన మేర ఓట్ల సాధనలో విఫలం కావడాన్ని సీపీఎం అంగీకరించింది. బీఎల్ఎఫ్ ప్రయోగం, ఎజెండా తెలంగాణకు అవసరమని, రాబోయే రోజుల్లోనూ ఇదే వైఖరితో ముందుకు సాగాలనే అభిప్రాయం వ్యక్తమైంది. బీఎల్ఎఫ్ ప్రత్యామ్నాయ విధానాలకు మద్దతు తెలిపిన సీపీఐ, టీజేఎస్, ప్రజాగాయకుడు గద్దర్, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆ తర్వాత కాంగ్రెస్తో కలవడంతో నష్టం జరిగిందని అభిప్రాయపడింది. -
సీఎం కేసీఆర్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నికైన కేసీఆర్ గురువారం మధ్యాహ్నం రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్కు శుభాకాంకలు తెలిపిన మోదీ.. ఆయన పరిపాలన చక్కగా సాగాలని ఆకాంక్షించారు. -
‘ఈవీఎంలపై డౌట్స్.. కేటీఆర్కు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్పై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన తాజా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్లు గురువారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురైనట్టు ఆరోపించారు. కేటీఆర్కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. పొంతన లేని ఫలితాలు వచ్చాయి ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. పోలింగ్ సరళిని దగ్గరుండి గమనించినట్టు తెలిపారు. ప్రచారం అప్పటికీ.. పోలింగ్ డే రోజుకి ఏ మాత్రం పొంతన లేని ఫలితాలు వచ్చాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలు కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్టు అనుమానం ఉందన్నారు. 2009 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు కేసీఆర్ అప్పట్లో చెప్పినట్టు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, కవిత వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్లతో పాటు ఫోన్ నంబర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపితే అందుకు కావాల్సిన ఆధారాలు తానే ఇస్తానని అన్నారు. కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్కు సిద్దమైతే వాస్తవాలను నిరూపిస్తానని తెలిపారు. 2014లో తాము ఓడిపోయినప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయలేదని గుర్తుచేశారు. ఎగ్ న్యాక్ కంపెనీకి తెలంగాణ ప్రజల ఓట్లను పంపించి ట్యాప్ చేశారని ఆరోపించారు. రజత్ కుమార్కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు పునాది లాంటివని అన్నారు. రాజ్యంగ బద్దమైన ఎన్నికలకు టీఆర్ఎస్ తూట్లు పొడించదని విమర్శించారు. ఎన్నికల కమిషన్ పాలక వర్గానికి పాలేరులా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పు జరగలేదని సుప్రీం కోర్టు, హైకోర్టులలో చెప్పిన తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్.. 22 లక్షల ఓట్లను తీసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రజత్ కుమార్కు లై డిటెక్టర్ టెస్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వారికి కావాల్సిన వారిని గెలిపించుకుని మిగతా వారిని ఓడించారని ఆరోపించారు. ఈవీఎంలు మోరాయించిన అధికారులు పట్టించుకోలేదని అన్నారు. కౌటింగ్ ఫామ్లో ఓ లెక్క.. చివరగా తమకిచ్చిన పేపర్లలో వేరే లెక్కలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన చోట జామర్లు పెట్టమంటే ఎన్నికల అధికారులు నిరాకరించారని తెలిపారు. తెలంగాణను అసెంబ్లీగా చేసుకుని పోరాడుతాం అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ప్రజా క్షేత్రంలో ఫెయిల్ అయ్యామని కాంగ్రెస్ కాళ్లు పట్టుకుంటే తామే టీఆర్ఎస్కు అధికారం ఇచ్చే వాళ్లమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోల్ అయిన ఓట్ల కంటే 1056 ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చిన్న తమ్ముడని.. ఆయన పేరు కేడీఆర్ అని విమర్శించారు. 19 ఈవీఎంలను రీ కౌంటింగ్ పెట్టాలని కోరిన ఎన్నికల అధికారులు వినలేదని తెలిపారు. ప్రజలు మా వైపు ఉన్నారని.. ఈవీఎంలు టీఆర్ఎస్ వైపు ఉన్నాయని వ్యాఖ్యానించారు. భారతదేశంలోనే అతి ఖరీదయిన ట్యాంపరింగ్ తెలంగాణ ఎన్నికల్లో జరిగిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని పేర్కొన్నారు. తెలంగాణను అసెంబ్లీలాగా చేసుకుని తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. -
‘కేసీఆర్ను ఏ పార్టీలు విశ్వసించవు’
సాక్షి, హైదరాబాద్ : ‘కేసీఆర్కు ఇదే ఆఖరి ప్రమాణ స్వీకారం.. టీఆర్ఎస్కు ఇదే చివరి ప్రభుత్వం’ అంటూ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావ్ విమర్శలు గుప్పించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యాఖ్యలు, నిర్వాకం చూస్తే ఆయ ఏ మాత్రం మారలేదనే విషయం అర్థమవుతోందన్నారు. తాడు, బొంగరం లేని కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఏం చేయగలరని ప్రశ్నించారు. కేసీఆర్ని ఏ పార్టీలు విశ్వసించవన్నారు. మజ్లీస్ను పట్టుకుని ఊరుగేదామని కేసీఆర్ కలలు కంటున్నారని ఆరోపించారు. మజ్లీస్ని జాతీయ పార్టీగా మారుస్తానని కేసీఆర్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయని కేసీఆర్ నీళ్లను ఎలా ఉపయోగించుకోవాలో చెప్పడం విడ్డూరమని విమర్శించారు. దేశానికి ఒక సుప్రీం కోర్టు కాకపోతే.. రాష్ట్రానికి ఒకటి ఉంటుందా అని ప్రశ్నించారు. 2019లో రెండు జాతీయ కూటముల మధ్యే యుద్ధం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికలు 2019కి ఎలాంటి గీటురాయి కావని వివరించారు. -
కాంగ్రెస్ నేతల మౌనం
-
అందరివాడు
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో కారు జోరుమీద పరుగులు పెట్టింది. ఇక్కడ నివసిస్తున్న విభిన్న వర్గాలు ప్రజలూ కేసీఆర్కే జైకొట్టారు. సీమాంధ్రుల నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన తమిళులు, మలయాళీలు, బెంగాలీలు, రాజస్థానీలు, మైనార్టీలు..ఇలా అన్ని ప్రాంతాలకు చెందిన ఓటర్లు టీఆర్ఎస్కు ఓట్లేసి తమ మద్దతు ప్రకటించారు. దీని ఫలితంగానే అభ్యర్థులు సైతం ఊహించని రీతిలో మెజార్టీలు దక్కించుకున్నారు. ప్రజా భద్రత, అభివృద్ధి, సంక్షేమం తదితర అంశాల్లో వీరిని టీఆర్ఎస్ ప్రభుత్వం మెప్పించగలిగింది. అందుకే వీరంతా ఈ ఎన్నికల్లో తమ అభిమానాన్ని చాటుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల ఫలితాలు, సామాజిక కోణంలో విశ్లేషణలు చేసిన అనంతరం శివారు నియోజక వర్గాలన్నీ తమవైపు ఉంటాయని తెలుగుదేశం, కాంగ్రెస్పార్టీలు భావించాయి. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఓటర్లు తీర్పునిచ్చారు. వారు నమ్ముకు న్న ఒకటి రెండు సామాజిక వర్గాలు తప్పితే మిగతా వారంతా కేసీఆర్ వైపే మొగ్గుచూపినట్లు ఓటింగ్ సరళిని చూసిన పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీటీడీపీకి పూర్తి ప్రాబల్యం ఉందని భావించి నందమూరి సుహాసినిని బరిలోకి దించితే...టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు ఏకంగా 41,049 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇందులో టీఆర్ఎస్ రెబల్గా బీఎస్పీ నుండి పోటీ చేసి హరీష్రెడ్డి సాధించిన 12,761 ఓట్లు కూడా కలిపితే మెజారిటీ భారీగా పెరిగిపోయింది. కూకట్పల్లిలో నందమూరి సుహాసినికి సామాజిక వ ర్గం బలంగా ఉన్న ఒక్క డివిజన్లో తప్పితే..మిగిలిన ఏ డివిజన్లోనూ ఓట్లు రాకపోవటం విశేషం. కుత్బుల్లాపూర్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూన వివేకానంద్కు సైతం 41,509 ఓట్ల మెజారిటీ వచ్చింది. శేరిలింగంపల్లిలోనూ అదే తీరు... శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ స్థానికులతో పాటు మెజారిటీ సీమాంధ్రులు, ఉత్తర, దక్షిణ భారతీయలు టీఆర్ఎస్కే జై కొట్టారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరికెపూడి గాంధీకి 44,295 ఓట్ల మెజారిటీ సాధ్యమైంది. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన నియోకజవర్గాల్లో ఇది కూడా ఒకటి. టీడీపీ అభ్యర్థి ఆనంద్ ప్రసాద్కు చందానగర్ డివిజన్లోనే ఆధిక్యత రాగా, మియాపూర్ డివిజన్ ఓట్లకు సంబంధించిన ఒక్క రౌండ్లో స్వల్ప ఆధిక్యత వచ్చింది. మిగిలిన డివిజన్లలో మెజారిటీ ఓటర్లు టీఆర్ఎస్ వైపే నిలిచారు. కారు వైపే ఇతర రాష్ట్రాల వాసులు మల్కాజిగిరి నియోజకవర్గంలో స్థిరపడ్డ తమిళ, మలయాళీ ఓటర్లు సైతం టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి వెంట నడిచారు. ఈ నియోజకవర్గంలో మైనంపల్లి హన్మంతరావుకు 73,398 ఓట్ల మెజారిటీ వచ్చింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీకి మద్దతిచ్చిన ఓటర్లు సైతం తాజాగా టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు. ఇక కోర్సిటీకి వస్తే అంబర్పేట నియోజకవర్గం అనూహ్యంగా టీఆర్ఎస్ ఖాతాలో పడటం ద్వారా బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంక్కు గండిపడినట్లయింది. కాచిగూడ, గోల్నాక తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్కు భారీ ఓట్లు పోలయ్యాయి. ఇక ఉప్పల్ నియోజకవర్గంలోనూ కాప్రా సర్కిల్లో స్థిరపడ్డ సీమాంధ్రులు సైతం టీఆర్ఎస్కే మొగ్గుచూపినట్లు ఓటింగ్ సరళి తేల్చింది. కుత్బుల్లాపూర్లో భిన్నమైన తీర్పు.. కుత్బుల్లాపూర్లో సీమాంధ్రులు అధికంగా ఉంటారని, మహాకూటమి తరపున టీడీపీ అధినేత చంద్రబాబు, సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేసినా భిన్నమైన రీతిలో ఇక్కడి ప్రజలు తీర్పునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాచుపల్లి మండల పరిధిలోని నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి గ్రామాల్లో 21,294 ఓట్లు కా>ంగ్రెస్కు పోల్ కాగా, టీఆర్ఎస్కు 20,223 ఓట్లు పడ్డాయి. దీంతో ఈ మండలంలో 1071 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ సాధించినట్లైంది. అయితే ఇక్కడ అతిగా ఆశపెట్టుకున్న మహాకూటమి నేతలకు ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. సరిసమానంగా నువ్వా.. నేనా..అన్నట్లుగా దూసుకు రావడంతో ఫలితంపై తీవ్ర ప్రభావం చూపింది. అలాగే కొంపల్లి గ్రామంలో మహాకూటమికి స్వల్ప మెజార్టీ వచ్చింది. ఈ నాలుగు ప్రాంతాల్లో సీమాంధ్రులు ఎక్కువగా ఉండడం 90 వేల పైచిలుకు ఓట్లల్లో అధికంగా కాంగ్రెస్ రాబట్టుకోవడంలో విఫలమైందనే చెప్పుకోవచ్చు. 8 డివిజన్లలో అన్ని వర్గాల వారు టీఆర్ఎస్ను ఆదరించడంతో ఏకంగా 1,13,238 ఓట్లు పోల్ కాగా, మహాకూటమికి 75,512 మాత్రమే ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద్ 41,500 ఓట్ల మెజార్టీతో విజయం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించారు. బస్తీల్లో సత్తా చాటిన టీఆర్ఎస్ బంజారాహిల్స్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు 30 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ స్వల్పంగా పెరిగినా అది టీఆర్ఎస్కే లాభించింది. ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో గణనీయమైన ప్రభావాన్ని చూపా యని ఫలితాల సరళి స్పష్టం చేసింది. నియోజకవర్గంలోని బస్తీల్లో ప్రభుత్వం నుంచి లబ్ధి పొం దుతున్న లబ్ధిదారులు దాదాపు 50 నుంచి 60 వేలకుపైగా ఉండటంతో టీఆర్ఎస్కు లాభించింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల కు తోడుగా గతంలో మంత్రిగా పని చేసి, మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉండటంతో దానం నాగేందర్కు జనం పట్టంకట్టారు. పకడ్బందీ వ్యూహం.. కాంగ్రెస్, టీడీపీ అగ్రనేతలు రాహుల్తో పాటు చంద్రబాబు, సీపీఐ నారాయణ, కోదండరాం, తదితరులు మహాకూటమి తరపున దాసోజు శ్రవణ్కు మద్దతుగా ప్రచారం చేసి టీఆర్ఎస్ను అడ్డుకోవాలని యత్నించారు. దీనికి ధీటుగా టీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేసింది. నాగేందర్కు ప్రతి వీధిలోను పరిచయాలు ఉండటం, ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అడిగారు. సమయం చాలా తక్కువగా ఉన్నా అలుపు లేకుండా ప్రచారం నిర్వహించారు. పార్టీ తరపున కేటీఆర్ ఒక్కరే ప్రచారానికి రాగా ఆ ఒక్క ప్రచారమే నాగేందర్ను గట్టెక్కిందని చెప్పాలి. జరగని ఓట్ల బదిలీ.. ఖైరతాబాద్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఓట్లు ప్రభావితం చేస్తారని అంతా భయపడ్డారు. వీరికి తోడు సీపీఐ, టీజేఎస్ కూడా ఉండటం అవతల బీజేపీ మరింత బలంగా ఉండటంతో టీఆర్ఎస్కు గడ్డుకాలమేనని భావించారు. తీరా టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో సహజంగానే టీడీపీ ఓట్లు కాంగ్రెస్కు బదిలీ అవుతాయేమోనని ఆ పార్టీ వర్గాలు భావించాయి. ఎక్కడా ఈ ఓట్ల బదిలీ కాలేదని తాజాగా వెలువడిన ఫలితాలతో తేట తెల్లమైంది. బస్తీల్లో ప్రజాకూటమికి అనుకున్నన్ని ఓట్లు పడలేదని సమాచారం. -
బీజేపీలో సంజయ్కి అత్యధిక ఓట్లు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు 14,50,456 (7 శాతం) మంది ప్రజలు ఓట్లు వేశారు. పార్టీ తరఫును 118 స్థానాల్లో పోటీ చేస్తే అందులో ఒక్క గోషామహల్లో 61,854 ఓట్లతో రాజాసింగ్ గెలుపొందారు. పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో ఆయనకంటే ఎక్కువ ఓట్లు వచ్చినా, రెండో స్థానానికే పరిమితమయిన అభ్యర్థులు ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఉండి అత్యధిక ఓట్లు లభించిన అభ్యర్థుల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ మొదటి వరుసలో ఉన్నారు. ఆయనకు 66,009 ఓట్లు రాగా, అంబర్పేట్ నుంచి పోటీ చేసిన కిషన్రెడ్డికి 60,542 ఓట్లు వచ్చాయి. కల్వకుర్తిలో తల్లోజు ఆచారికి 59,445 ఓట్లు, ఆదిలాబాద్లో పాయ ల్ శంకర్కు 47,444 ఓట్లు, ముథోల్లో రమాదేవికి 40,602 ఓట్లు, కార్వాన్లో అమర్సిం గ్కు 35,709 ఓట్లు, ఖైరతాబాద్లో చింతల రామచంద్రారెడ్డికి 34,666 ఓట్లు, మల్కాజిగి రిలో రాంచందర్రావుకు 22,932 ఓట్లు వచ్చా యి. ముషీరాబాద్లో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు 30,813 ఓట్లు వచ్చాయి. -
ఫ్యాన్సీ.. సీరియల్.. సేమ్!
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో అనేక చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఫ్యాన్సీ నెంబర్లతో కూడిన ఓట్లు వచ్చాయి. మరికొందరికి ఆరోహణ, అవరోహణ క్రమాల్లో సీరియల్గా వచ్చినట్లు తేలింది. ఒకే సంఖ్యలో ఓట్లు వచ్చిన అభ్యర్థులు సైతం ఉన్నారు. ఈ మూడు కేటగిరీలకు చెందిన వారిలో అత్యధికులు చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లే ఉన్నారు. ఆయా నియోజకవర్గాల వారీగా ఇలా.. ఖైరతాబాద్: బీజేపీ తరఫున పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డికి 34,666 ఓట్లు వచ్చాయి. జాతీయ మహిళా పార్టీ అభ్యర్థిని దాన లక్ష్మికి 99 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి కె.నవీన్కుమార్కు 77 ఓట్లు, న్యూ ఇండియా పార్టీకి చెందిన అమృత్రాజ్కు 66 ఓట్లు వచ్చాయి. కార్వాన్: బీఎస్పీ అభ్యర్థి సయ్యద్ రహిముద్దీన్కు 363, తెలంగాణ ఇంటి పార్టీకి చెందిన నర్సింగ్రావుకు 200 ఓట్లు వచ్చాయి. అలానే సోషలిస్ట్ పార్టీకి చెందిన సార్వత్కు 155, లోక్ తాంత్రిక్ సర్వజన్ సమాజ్ పార్టీకి చెందిన ఖతీజాకు 154 చొప్పున పోలయ్యాయి. ఎల్బీనగర్: ఇండిపెండెంట్లు జగన్మోహన్ పోలే, అనుగు సాయికృష్ణలకు 74, 73 చొప్పున, రాంబాబురెడ్డి, ప్రవీణ్గౌడ్లకు 61, 60 చొప్పున, దేవ, శ్రీనివాసాచారిలకు 59 చొప్పున ఓట్లు వచ్చాయి. మలక్పేట: అన్నా వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేసిన సయ్యద్ అన్వర్, బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థి వెంకట రమణలకు 118, 117 ఓట్లు, ఆప్ అభ్యర్థి చిన్న లింగానికి 100, ఇండిపెండెంట్లు గోపాల్, రమేష్లకు 80 చొప్పున ఓట్లు వచ్చాయి. మేడ్చల్: స్వర్ణ్ భారత్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులు రాహుల్ పండిట్, దుర్గా ప్రసాద్లకు 140 చొప్పున, ఇండిపెండెంట్లు వేద్, నారాయణలకు 137, 136 ఓట్లు, దీపక్, కాంతారెడ్డిలకు 134, 133 చొప్పున, సతీష్కుమార్కు 100 ఓట్లు నమోదయ్యాయి. ముషీరాబాద్: యువ పార్టీ, ఇండియా ప్రజా బంధు పార్టీలకు చెందిన చందు, రాజ్కుమార్లకు 147, 146, అన్నా వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఫాతిమా భానుకు 100, న్యూ ఇండియా పార్టీకి చెందిన మహబూబ్ అలీకి 77, బహుజన రాష్ట్ర సమితి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్కు చెందిన ప్రవీణ్కుమార్, నాగేందర్లకు 76 ఓట్లు చొప్పున వచ్చాయి. ఇండిపెండెంట్ సోమయాజులు, జన వాహిని పార్టీ అభ్యర్థి నవాబ్లకు 53 ఓట్ల చొప్పున వచ్చాయి. నాంపల్లి: బీజేపీ అభ్యర్థి డి.కరుణాకర్కు 11,622 ఓట్లు పడ్డాయి. సీపీఐఎం అభ్యర్థి లక్ష్మీకుమార్కు 400, ఇండిపెండెంట్ అజీమ్కు 88, స్వతంత్ర అభ్యర్థులు సంతోష్, యూసుఫ్లకు 82 చొప్పున ఓట్లు నమోదయ్యాయి. కుత్బుల్లాపూర్: టీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద్కు 1,54,500 ఓట్లు, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీశైలం గౌడ్కు 1,13000 ఓట్లు పడ్డాయి. ఇండిపెండెంట్లు బిక్షపతికి 727, భూపాల్, రాములుకు 338, 337 చొప్పున, మరో స్వతంత్ర అభ్యర్థి రాఘవకు 101 ఓట్లు లెక్క తేలాయి. సనత్నగర్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు 66464 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ దేవేందర్కు 200, బహుజన రాష్ట్ర సమితి అభ్యర్థి అశోక్ కుమార్కు 66 ఓట్లు వచ్చాయి. సికింద్రాబాద్: సీపీఐఎం అభ్యర్థి అనిల్కుమార్కు 555, ఇండిపెండెంట్ రజనికి 444, మోహన్కు 232, అంబేడ్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ఆర్కు 88 చొప్పున ఓట్లు నమోదయ్యాయి. కంటోన్మెంట్: స్వతంత్ర అభ్యర్థి బి.రాజుకు 88 ఓట్లు పడ్డాయి. శేరిలింగంపల్లి: శివసేన, అన్నా వైఎస్సార్ సీపీల తరఫున పోటీ చేసిన కేశవులు ఖాలీద్లకు 212 చొప్పున, దళిత్ బహుజన్ పార్టీ అభ్యర్థి కల్పన, ఇండిపెండెంట్ శివప్రసాద్లకు 211 చొప్పున, అంబేడ్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజుకు 151 ఓట్లు వచ్చాయి. ఉప్పల్: బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి వై.పరమేశ్వర్కు 1211, ది ఫ్యూచర్ ఇండియా పార్టీ అభ్యర్థి అనిల్కు 343 వచ్చాయి. ఆలిండియా సమత పార్టీకి చెందిన ప్రకాష్, ఇండిపెండెంట్ మహేందర్ కుమార్లకు 114 చొప్పున, న్యూ ఇండియా పార్టీ, జై మహాభారత్ పార్టీల అభ్యర్థులు బాలరాజు, యుగంధర్లకు 106 చొప్పున ఓట్లు పడ్డాయి. యాకుత్పురా: ఎంబీటీ అభ్యర్థి ఫర్హత్ ఖాన్కు 21222 ఓట్లు, శివసేన అభ్యర్థి మహేష్కుమార్కు 323 ఓట్లు, ఎంసీపీఐ అభ్యర్థి హాజీ పాషాకు 131, తెలంగాణ లేబర్ పార్టీ అభ్యర్థి ఉస్మాన్కు 121, ఇండిపెండెంట్ సుదర్శన్కు 99 నమోదయ్యాయి. గోషామహల్: అఖిల భారతీయ ముస్లిం లీగ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులు ఖాజా ఖాన్, రాజులకు 103, 102 చొప్పున, అంబేడ్కర్ నేషనల్ పార్టీ అభ్యర్థి అభిమన్యు యాదవ్కు 99, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి రియాజుద్దీన్కు 88 ఓట్లు నమోదయ్యాయి. -
సగం ఓట్లు టీఆర్ఎస్కే
సాక్షి,మేడ్చల్ జిల్లా: మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 22,25,04 ఓట్లు ఉండగా, 12,40,441 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ ప్రజాకూటమి, బీజేపీ, బీఎస్పీ చెందిన 17 మంది అభ్యర్థులకు 11,81,665 ఓట్లు వచ్చాయి. జిల్లాలో మిగిలిన çస్వతంత్రులు, ఇతర చిన్న పార్టీలకు చెందిన 115 అభ్యర్థులకు 58,776 ఓట్లు పడ్డాయి. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి 6,63,774 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన ప్రజాకూటమి (కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ )కి 3,65,245 ఓట్లు వచ్చాయి. కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులకు 1,92,334 ఓట్లు రాగా, ఉప్పల్, కూకట్పల్లి నుంచి పోటీ చేసిన టీడీపీకి 1,39,165 ఓట్లు, మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన టీజేఎస్కు 34,219 ఓట్లు వచ్చాయి. ఐదు స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 1,12,024 ఓట్లు సాధించింది. మేడ్చల్, కూకట్పల్లి నుంచి బరిలో నిలిచిన బీఎస్పీకి 38,590 ఓట్లు రాగా, మేడ్చల్ నుంచి బరిలోకి దిగిన నక్క ప్రభాకర్గౌడ్ 25,829 ఓట్లు పొంది మూడవ స్థానంలో నిలిచారు. కూకట్పల్లి నుంచి బరిలో నిలిచిన హరీష్ చందర్ రెడ్డికి 12,761 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఇద్దరూ టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన వారే కావటం గమనార్హం. జిల్లాలో ఐదు నియోజకవర్గాల పరిధిలో 132 మంది అభ్యర్థులు పోటీ చేయగా, ఇందులో ప్రధాన పార్టీలకు చెందిన 17 మంది మినహా, మిగిలిన 115 మంది స్వతంత్ర, ఇతర చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. అయితే జిల్లాలో నోటాకు 14,682 ఓట్లు పోలవడం గమనార్హం. ఇందులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా 163 ఉన్నాయి. నియోజకవర్గాల వారిగా ప్రధాన పార్టీలు పొందిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. -
ఏం గిఫ్టిస్తారో..!
సాక్షి, అమరావతి: ‘నాకేదో గిఫ్ట్ ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడికైనా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు. టీడీపీ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ. తెలుగువారు ఎక్కడున్నా వెళ్లి పనిచేశా. ప్రజల కోసం పనిచేస్తున్న నాపై విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ఏం గిఫ్ట్ ఇస్తారో చూస్తా...!’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తెలంగాణకు వచ్చి చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గురువారం ఒంగోలులో నిర్వహించిన జ్ఞానభేరి సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రతిస్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఘోర పరాజయంపై చంద్రబాబు బయటకు వచ్చి చేసిన ప్రకటన ఇదొక్కటే కావడం గమనార్హం. కూటమి దారుణంగా ఓడిపోయినా చంద్రబాబు మౌనముద్ర దాల్చారు. అనుకూలమైతే హడావుడి... లేదంటే పచ్చమీడియాకు లీకులిచ్చి గప్చుప్ తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమి పాలు కావడంపై తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌనం దాల్చడం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకపోయినా, కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపు ఇవ్వకపోయినా వారి విజయాన్ని తనకు ఆపాదించుకొని చంద్రబాబు ప్రచారం చేసుకోవడంపై అంతా విస్తుపోవడం తెలిసిందే. వారి విజయానికి చంద్రబాబే కారణమంటూ మంత్రులు, టీడీపీ నేతలు ప్రకటనలు గుప్పించిన విషయాన్ని కూడా ఎవరూ మర్చిపోలేదు. కానీ... తెలంగాణలో కాంగ్రెస్ అధినేతతో కలిసి బహిరంగ సభల్లో పాల్గొన్నా... హైదరాబాద్లో వ్యక్తిగతంగా రోడ్డు షోలు నిర్వహించినా... కూటమి అభ్యర్థులకు పెద్ద ఎత్తున ‘నగదు’ సమకూర్చినా... ఘోరంగా ఓటమి చెందడంపై చంద్రబాబు నోరు విప్పకపోవడం పట్ల టీడీపీ శ్రేణుల్లో అంతర్మధనం మొదలైంది. రాజకీయాల్లో అత్యంత సీనియర్ అని చెప్పుకొనే చంద్రబాబు హుందాగా ఓటమిని ఒప్పుకొని ఓటర్ల మనోగతాన్ని ఆహ్వానించకపోవడంపై నాయకుల్లో చర్చ జరుగుతోంది. బాబును తిరస్కరించిన తెలంగాణ ప్రజలు చంద్రబాబు తాను స్వయంగా ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ ఎన్నికల విషయాన్ని విస్మరించి ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుపై ప్రకటనలు చేయడంపైనా విశ్లేషకుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో తాను మునిగి అధఃపాతాళానికి పడిపోవడమే కాకుండా ‘మహాకూటమి పార్టీలనూ చంద్రబాబు నిండా ముంచేశారు. కూటమికి రూ.వందల కోట్ల ఆర్థిక వనరులను సమకూర్చడంతోపాటు ఈ ఎన్నికల్లో వారం రోజులకు పైగా తెలంగాణాలోనే ఉండి, కూటమికి స్టార్ క్యాంపయినర్గా వ్యవహరించి చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. దాదాపు రూ.1,200 కోట్ల వరకు ఏపీ నుంచి తెచ్చిన మొత్తాన్ని తెలంగాణ ఎన్నికల్లో బాబు వెదజల్లారన్న ఆరోపణలున్నాయి. ప్రజాకూటమి గెలిస్తే అది చంద్రబాబు గెలుపే అన్నట్లుగా పచ్చమీడియా ప్రచారం చేసింది. లగడపాటిని రంగంలోకి దించి కూటమికి 75 స్థానాలు వస్తాయని, అదంతా కాంగ్రెస్ చంద్రబాబుతో కలవడం వల్లేనని దొంగ సర్వేలను తెరపైకి తెచ్చారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న చంద్రబాబును, ఆయనతో జతకట్టిన కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు ఛీత్కరించారు. ఈ పరిణామాలన్నిటికీ కారణం తానే అయినా అదేదీ తనకు సంబంధం లేనట్లుగా చంద్రబాబు ఇపుడు వ్యూహాత్మకంగా మౌనం దాల్చారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ తాను ఎక్కడా ప్రచారం చేయని రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును తన ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఓటమిపై ప్రజాతీర్పును తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందని ముక్తసరిగా పేర్కొన్నారు. కర్నాటకఎన్నికల్లో ఎంతో హడావుడి కర్నాటకలో ఇంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తరఫున కానీ ఇతర పార్టీల తరఫున కానీ ప్రచారం నిర్వహించలేదు. అక్కడి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్లు హోరాహోరీ పోరాటం చేశాయి. ఏ పార్టీకీ మెజార్టీ రాని పరిస్థితుల్లో బీజేపీ, జేడీఎస్లు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా పరిణామాలు ఉత్పన్నమయ్యాయి. చివరిలో కాంగ్రెస్ సీఎం పదవిని ఆఫర్ చేయడంతో జేడీఎస్ అటువైపు మొగ్గి ఆ పార్టీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబునాయుడు కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు తన వల్లనే అయిందని, తన పిలుపు వల్లనే బీజేపీని అక్కడి ప్రజలు ఓడించారని ప్రెస్మీట్లు పెట్టి చెప్పడమే కాకుండా పచ్చమీడియా ద్వారా ఊదరగొట్టించారు. తనకు సంబంధం లేని కర్నాటక ఎన్నికలపై తెగ హడావుడి చేసిన చంద్రబాబు తాను స్వయంగా ప్రచారంలో పాల్గొన్న తెలంగాణలో ఓటమిపై పార్టీలో విశ్లేషణ చేయించడం కానీ, ఎందుకు ఇలా అయిందనే అంశంపై కనీసం చర్చించడం కూడా చేయకపోవడంపై పార్టీ నేతలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు బేలచూపులు చూడడంపై పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ శ్రేణుల్లో చర్చోపచర్చలు తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపైనా తప్పకుండా ఉంటుందనే చర్చ టీడీపీ నేతలు, కార్యకర్తల్లో సాగుతోంది. ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతింటుందనే అంతర్మథనం పార్టీ నేతల్లో కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభు త్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, తెలంగాణ ఎన్నికల్లో అదే అంశం ప్రతిబింబించిందని అంతర్గతంగా వారు అంగీకరి స్తున్నారు. తెలంగాణలో ప్రజాకూటమి ఓటమి చెందడంపై ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు పండగ చేసుకున్నంత పని చేశారని, పలుచోట్ల బహిరంగంగానే బాణసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారని గుర్తు చేస్తున్నారు. ఇది తెలుగుదేశంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని, ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణ ఫలితమే పునరావృతం అవుతుందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులతో పాటు టీడీపీలోని సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
‘సైలెంట్ సపోర్ట్’ను గుర్తించలేకపోయాయి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ‘సైలెంట్ సపోర్ట్’ను విపక్షాలు సరిగ్గా గుర్తించలేకపోయాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. అనేక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలున్నా సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్కు ఎన్నికల్లో విజయం సాధించడానికి దోహదపడ్డాయన్నారు. ఎన్నడూ లేనివిధంగా డబ్బు ఖర్చు చేయడం, మద్యం పంపిణీ తదితర అంశాలన్నీ కలిసి కేసీఆర్ గెలుపునకు కారణమయ్యాయని బుధవారం ఆయన ‘సాక్షి’కి చెప్పారు. పింఛన్లు, రైతుబంధు, గొర్రె ల పంపిణీ తదితర పథకాలు కాంగ్రెస్ అనుకూల ఓటింగ్కు గండికొట్టాయని అభిప్రాయపడ్డారు. కూటమి సీట్ల సర్దుబాటు ఆలస్యం కావడం, కూటమి విధానాలు, తదితర అంశాలపై ప్రచారానికి 10– 15 రోజుల సమయం లేకపోవడం కూటమి ఓటమి కారణాలుగా చెప్పారు. ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాని మోదీ హవా తగ్గిపోవడం స్పష్టంగా కనిపించిందన్నారు. ‘ఫలితాలను అంచనా వేయలేకపోయాం’ సాక్షి, న్యూఢిల్లీ: తెలం గాణ ఎన్నికల ఫలితాలను తాము అంచనా వేయలేకపోయామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయ ణ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్కి తెలంగాణ సెంటిమెంట్, పలు సంక్షేమ పథకాలు లాభించడంతో కేసీఆర్ ఈ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించగలిగారన్నారు. అందుకే గతంకంటే టీఆర్ఎస్కు ఓట్లు, సీట్లు అధికంగా వచ్చాయన్నారు. కూటమి ఏర్పాటులో ఆలస్యం కావడం, కూటమి కుదిరినా పై స్థాయిలో నాయకులు కలసినట్టు కింది స్థాయిలో ప్రజలు కలవలేకపోయారన్నారు. కూటమిలో ఎక్కడ తప్పులు జరిగాయో పరిశీలించుకొని ముందుకెళ్తామన్నారు. -
ఎందుకీ పరిస్థితి... మారదా ఈ స్థితి
సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రయత్నం చేసినా అంత దారుణంగా దెబ్బతినడానికి గల కారణాలపై బీజేపీ ఆలోచనల్లో పడింది. హైదరాబాద్తోపాటు జిల్లాల్లోనూ ఈసారి మరిన్ని స్థానాలను గెలుచుకోవాలని భావించినా ఫలితం అందుకు విరుద్ధంగా రావడంతో పార్టీ మొత్తం గందరగోళంలో పడింది. హైదరాబాద్లోని ఒక్క గోషామహల్ మినహా ఖైరతాబాద్, అంబర్పేట్, ముషీరాబాద్, ఉప్పల్ స్థానాలను కూడా దక్కించుకోలేని పరిస్థితికి గల కారణాలను పార్టీ వర్గాలు అన్వేషిస్తున్నాయి. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అనేక మంది ప్రచారం చేసినా కేవలం ఒకే ఒక్క స్థానానికి ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందో విశ్లేషిస్తున్నాయి. పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు అనేక అవకాశాలు ఉన్నా.. వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం, క్షేత్రస్థాయిలోకి వెళ్లకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు అధ్యక్షుడిగా ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారన్న అపవాదు పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. మరోవైపు పార్టీ అభ్యర్థుల ఖరారు ఆలస్యం కావడం, చివరి క్షణంలో టికెట్లు ఇచ్చినా ప్రచారానికి సమయం సరిపోలేదన్న వాదన వ్యక్తమవుతోంది. అయితే పార్టీ ముఖ్య నేతలు మాత్రం ఈ అంశాలను కొట్టిపారేస్తున్నారు. ఈ ఎన్నికలు కేవలం తెలంగాణ సెంటిమెంట్పైనే జరిగాయని, ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయడం, కూటమిలో ఆయన పార్టీ ఉన్న కారణంగా ప్రజల్లో మళ్లీ చంద్రబాబు పెత్తనం ఏంటన్న అభిప్రాయం వచ్చిందని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్సహా ముఖ్యనేతలంతా విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలు కావడంతో బుధవారం పార్టీ ముఖ్యనేతలు పార్టీ కార్యాలయానికి వెళ్లకపోవడంతో కార్యాలయం బోసిపోయినట్లు అయింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ రాజీనామా చేస్తారన్న వదంతులు వచ్చాయి. అయితే వాటిని పార్టీ ముఖ్య నేత ఒకరు కొట్టిపారేశారు. అలాంటిదేమీ ఉండదన్నారు. స్థానాలను పెంచుకోకపోగా, ఉన్న స్థానాలను కాపాడుకోలేని పరిస్థితి వల్ల ఐసీయూలోకి వెళ్లినట్లు అయిందని, దానినుంచి బయటకు రావాలంటే కొంత సమయం పడుతుం దని ఓ నేత వ్యాఖ్యానించడం కొసమెరుపు. బీజేపీలో సంజయ్కి అత్యధిక ఓట్లు సాక్షి, హైదరాబాద్: బీజేపీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు 14,50,456 (7 శాతం) మంది ప్రజలు ఓట్లు వేశారు. పార్టీ తరఫును 118 స్థానాల్లో పోటీ చేస్తే అందులో ఒక్క గోషామహల్లో 61,854 ఓట్లతో రాజాసింగ్ గెలుపొందారు. పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో ఆయనకంటే ఎక్కువ ఓట్లు వచ్చినా, రెండో స్థానానికే పరిమితమయిన అభ్యర్థులు ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఉండి అత్యధిక ఓట్లు లభించిన అభ్యర్థుల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ మొదటి వరుసలో ఉన్నారు. ఆయనకు 66,009 ఓట్లు రాగా, అంబర్పేట్ నుంచి పోటీ చేసిన కిషన్రెడ్డికి 60,542 ఓట్లు వచ్చాయి. కల్వకుర్తిలో తల్లోజు ఆచారికి 59,445 ఓట్లు, ఆదిలాబాద్లో పాయ ల్ శంకర్కు 47,444 ఓట్లు, ముథోల్లో రమాదేవికి 40,602 ఓట్లు, కార్వాన్లో అమర్సిం గ్కు 35,709 ఓట్లు, ఖైరతాబాద్లో చింతల రామచంద్రారెడ్డికి 34,666 ఓట్లు, మల్కాజిగి రిలో రాంచందర్రావుకు 22,932 ఓట్లు వచ్చా యి. ముషీరాబాద్లో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు 30,813 ఓట్లు వచ్చాయి. ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు: కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితుల్లో కూడా బీజేపీకి ఓటు వేసి ఆదరించిన రాష్ట్ర ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు నిరంతరం కృషి చేస్తూ.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో రెండుసార్లు ముషీరాబాద్ నుంచి గెలిపించి ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూ, ముషీరాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానన్నారు. -
అవకాశం కోల్పోయాం...‘అధ్యక్షా’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ చవిచూడని పరిస్థితి ఈ మారు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు చవిచూశాయి. గత 66 ఏళ్ల చరిత్రలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క సభ్యుడినైనా చట్టసభకు పంపుకోలేని దుస్థితిలో అవి పడ్డాయి.దీంతో తొలిసారిగా వామపక్షపార్టీల గళం వినిపించని కొత్త శాసనసభ ఏర్పడబోతోంది. 2014లో జరిగిన ఏపీ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టుపార్టీలు ఖాతా తెరవకపోవడంతో ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల శాసనసభల్లో ఈ పార్టీలకు ఉనికి లేకుండా పోయింది. పొత్తుల ఎత్తుల్లో ఏదోలా లబ్ధి... వామ పక్షాలు మారిన రాజకీయ ఎత్తుగడలకు అనుగుణంగా వివిధ పార్టీలతో పొత్తులు కుదుర్చుకొని ఎన్నికలకు దిగినప్పుడు కాస్తా లాభపడ్డాయి. ఒకసారి టీడీపీతో మరోసారి కాంగ్రెస్తో, ఇంకోమారు టీడీపీ, టీఆర్ఎస్లతో ఇలా రాష్ట్రంలో ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో ఉభయ కమ్యూనిస్టుపార్టీలు గతంలో పొత్తులు కుదుర్చుకున్నాయి. అందుకు భిన్నంగా ఈ సారి తెలంగాణలో సీపీఐ ఏకంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్లతో సీట్ల సర్దుబాటు చేసుకుంది. సీపీఎం మాత్రం విడిగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్తో కలిసి పోటీచేయడం ద్వారా రాష్ట్రంలో కొత్త ప్రయోగానికి తెరతీయాలని ప్రయత్నించింది. 1983 నుంచి మారిన పరిస్థితి... 1983 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టుపార్టీలతో టీడీపీ సీట్ల సర్దుబాటు ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో 28చోట్ల పోటీచేసిన సీపీఎం ఐదుచోట్ల, 48 స్థానాల్లో పోటీచేసిన సీపీఐ నాలుగుస్థానాల్లో గెలిచాయి. 1985 మధ్యంతర ఎన్నికల్లో సీపీఐ,సీపీఎం, మరోవైపు జనతాపార్టీ, బీజేపీలతో టీడీపీ పొత్తు కుదుర్చుకుంది. ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు చెరో 11 స్థానాలు దక్కించుకున్నాయి. 1989లో టీడీపీ పొత్తుతో సీపీఎం ఆరు, సీపీఐ ఐదు సీట్లలో గెలుపొందాయి. 1994లో టీడీపీతో పొత్తులో సీపీఐ 19, సీపీఎం 15 సీట్లు గెలిచాయి. 1999లో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీచేసినపుడు సీపీఎంకు రెండుసీట్లు దక్కగా సీపీఐకి ఒక్కసీటుకూడా రాలేదు. మళ్లీ 2004లో కాంగ్రెస్తో పొత్తులో సీపీఎం 9, సీపీఐ 6 స్థానాల్లో గెలిచాయి. మళ్లీ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు కుదుర్చుకున్నపుడు సీపీఐ 4 స్థానాలు, సీపీఎం ఒక సీటు గెలిచాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో వామపక్షాలు చెరోస్థానానికే పరిమితమయ్యాయి. -
90కి చేరిన టీఆర్ఎస్ బలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ బుధవారం కేటీఆర్ను కలిసి టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో కోరుకంటి చందర్ రామగుండంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై గెలిచారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సోమారపు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోరుకుంటి చందర్పై గెలుపొందారు. అనంతరం సత్యనారాయణ టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు కోరుకంటి చందర్ విషయంలోనూ ఇదే జరిగింది. వైరా నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కపోవడంతో రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అసెంబ్లీ రద్దుకు ముందు టీఆర్ఎస్ పార్టీకి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకోవడంతో ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరింది. కేసీఆర్ మా నాయకుడు: చందర్ ‘ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పీడీ యాక్టులతో ఇబ్బంది పెట్టిన వెనకడుగు వేయలేదు. నాటి నుంచి నేటి వరకు మా నాయకుడు కేసీఆరే.. నాకు రాజకీయ జన్మనిచ్చింది కేసీఆరే. నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేటీఆర్ను కలిసి నా మద్దతు తెలిపా. టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా’అని చందర్ అన్నారు. -
టీజేఎస్లో ‘పంచాయతీ’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆలోచనల్లో పడింది. కొత్తగా ఏర్పాటు చేసుకున్న పార్టీని సొంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ప్రజాకూటమి పేరుతో వెళ్లడం, పార్టీకి ఒక్కసీటు రాకపోగా, పోటీ చేసిన 8 స్థానాల్లోనూ డిపాజిట్ దక్కని పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న పంచాయతీ ఎన్నికల విషయంలో పార్టీ ఎలా ముందుకు సాగాలన్న ఆలోచనల్లో పడింది. పంచాయతీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలా? వద్దా? అన్న గందరగోళం నెలకొంది. సొంతంగా పోటీ చేస్తే ఎంతమేరకు నెగ్గుకురాగలుగుతాం, సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలోపేతం లేని పార్టీని ఎలా ప్రజల వద్దకు చేర్చాలన్న దానిపైనే ప్రధాన దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో పార్టీని నడపడం కంటే కాంగ్రెస్లో విలీనం చేస్తే సరిపోతుందన్న వాదనలను కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. రేపు పంచాయతీ ఎన్నికల్లోనూ బోర్లా పడితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొంటున్నారు. అయితే పార్టీ ముఖ్య నేతలు కొందరు మాత్రం పంచాయతీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయడం ద్వారానే పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లవచ్చన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. ప్రజాకూటమి పేరుతో కాంగ్రెస్తో కలిసినా సరిపోయేదని, అందులోకి టీడీపీ రావడం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితుల కారణంగా ఎన్నికల్లో దారుణమైన దెబ్బ తినాల్సి వచ్చిందన్న భావనను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొంటున్నారు. పార్టీ పోటీ చేసిన 8 స్థానాల్లో కనీసం ఒక్క స్థానంలో అయినా తమకు ప్రజలు అనుకూలంగా తీర్పునిచ్చే అవకాశం ఉండేదన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. కనీసం అసెంబ్లీలో ఒక్క సీటు అయినా ఉంటే అది టీజేఎస్కు ఎంతో బలంగా ఉండేదని, దాంతో పంచాయతీ ఎన్నికలకు వెళితే పార్టీ బలోపేతం అయ్యేదన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా టీజేఎస్ ఎలా ముందుకు సాగాలన్న భవిష్యత్తు కార్యాచరణపై మరో వారంలో స్పష్టత వస్తుందని ఆ వర్గాలు అంటున్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే పార్టీ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని కోదండరాం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
‘లోక్సభా’ టీఆర్ఎస్దే!
సాక్షి, హైదరాబాద్: తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే లోక్సభ ఎన్నికలలోనూ కారు జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గానూ.. 14 స్థానాల పరిధిలో టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం లభించగా, ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ (కూటమి) స్వల్ప ముందంజలో ఉంది. ఇక, యథావిధిగా హైదరాబాద్ లోక్సభ పరిధిలో 4.5 లక్షల పైచిలుకు ఓట్లతో మజ్లిస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే, జాతీయ పార్టీగా బీజేపీ పరిస్థితిని ఈ ఎన్నికలు పాతాళంలోకి నెట్టాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే ఏ ఒక్క పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఆ పార్టీ కనీసం పోటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిం చడం లేదు. అయితే, జాతీయ అంశాల ఆధారంగా జరిగే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంటుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అద్భుతం జరిగితే తప్ప 14 చోట్ల టీఆర్ఎస్, 1–2 చోట్ల కాంగ్రెస్, 1 స్థానంలో మజ్లిస్ గెలుపు దిశగా పయనిస్తాయని అసెంబ్లీ ఫలితాలు చెబుతున్నాయి. రెండంటే రెండే! అసెంబ్లీ ఎన్నికలలో పేలవ ప్రదర్శన చూపిన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి పోలయిన ఓట్లను పార్లమెంటు స్థానాల వారీగా పరిశీలిస్తే ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అది కూడా గుడ్డిలో మెల్ల అనే రీతిలో ఖమ్మంలో 38వేలు, మహబూబాబాద్లో 9వేల ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ కన్నా ఎక్కువ పోలయ్యాయి. ఇక, కొంత మెరుగ్గా భువనగిరిలో 58 వేలు, పెద్దపల్లిలో 88వేలు, నల్లగొండ లోక్సభ పరిధిలో లక్ష ఓట్లు టీఆర్ఎస్ కన్నా వెనుకంజలో ఉంది. ఏ లెక్కన చూసినా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ ఐదు స్థానాల్లో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా కనీసం టీఆర్ఎస్కు పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో కూడా టీఆర్ఎస్ మరింత మెరుగైన ప్రదర్శన కనపర్చింది. ఈ రెండు చోట్లా.. కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్కే ఎక్కువ ఓట్లే పోలయ్యాయి. పాపం.. బీజేపీ బీజేపీ విషయానికి వస్తే రాష్ట్రంలోని ఏ ఒక్క లోక్సభ స్థానం పరిధిలో ఆ పార్టీ కనీస పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ల కన్నా తక్కువగా కేవలం 1.72లక్షల ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పోలయ్యాయి. మిగిలిన స్థానాల్లో పరిశీలిస్తే ఆదిలాబాద్, చేవెళ్ల, హైదరాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరి స్థానాల్లో మాత్రమే లక్ష ఓట్ల కన్నా ఎక్కువ బీజేపీకి పోలయ్యాయి. ఇక, అత్యల్పంగా ఖమ్మం లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కలిపి బీజేపీకి 9,764 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. -
దేశమంతా రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే దిశగా సాహసోపేతంగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త ఫ్రంట్ అధికారంలోకి రాగానే.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసి.. రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేలా వ్యూహాలు రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన అనంతరం.. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని రైతులు, పేదలు, మైనారిటీలు అన్ని వర్గాల వారి స్థితిగతులను మార్చే లక్ష్యంతోనే జాతీయ రాజకీయాల్లో కొత్త శక్తిని ప్రారంభించనున్నామని.. ఈ ప్రయత్నం కచ్చితంగా విజయవంతం అవుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆదాయం బాగానే ఉందని.. అందువల్ల వీలైనంత త్వరగా రూ.2.3 లక్షల కోట్ల అప్పు తీర్చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పనులు కొనసాగుతున్న దుమ్ముగూడెం. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులతోపాటు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కూడా త్వరలోనే పూర్తిచేసి సాగునీటిని అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధి ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ పతార (పరపతి) పెరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం మంచిదేనని.. అయితే ఈ కార్యక్రమం అమలును మధ్యలోనే ఆపేయడం వల్ల అసలు లక్ష్యం నెరవేరలేదన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. గెలిస్తే.. దేశవ్యాప్తంగా రైతుబంధు ‘రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోంది. రాష్ట్రాల పరిస్థితి దిగజారుతోంది. చిన్న చిన్న అంశాల్లోనూ కేంద్రానికిదే అధికారం. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలు కేంద్రం వద్ద ఉండాల్సిన అవసరం లేదు. ఐఐటీ వంటి పరిశోధన సంస్థలు కేంద్రం పరిధిలో ఉంటే పర్వాలేదు. కేంద్రం వద్ద పరిధికి మంచిన అధికారాలు ఉన్నాయి. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకేతీరుగా వ్యవహరిస్తున్నాయి. ప్రధాని మోదీ సహకార సమాఖ్య అంటున్నారు. కానీ చేతల్లో మాత్రం వికేంద్రీకరణను మరింత కేంద్రీకృతం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాల ఫ్యూడల్ పద్ధతి నశించాలి. అప్పుడే దేశంలో గుణాత్మక మార్పు వస్తుంది. నాకు ధైర్యం ఉంది. నేను అలాంటి మార్పును తీసుకొస్తా. ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తాం. దీని కోసం ఏటా మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. నా దగ్గర అజెండా ఉంది. లెక్కలున్నాయి. రైతుల పరిస్థితి మారుస్తాం’ చెవ్స్ పండించలేకపోయా! ‘దేశంలో కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానాలు రావాలి. పంటలను అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేదు. పురుగు మందులు అని, ఇంకోటని మెలికపెట్టి తిరస్కరిస్తారు. కట్ ఫ్లవర్ పంటలో ప్రపంచవ్యాప్తంగా 90% ఇజ్రాయిల్లోనే సాగు చేస్తున్నారు. చెవ్స్ పంట పండిద్దామనుకున్నా. అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోలేమని తెలిసింది. దేశంలో అన్ని ఉన్నా రైతుల ఆత్మహత్యలు ఆగడంలేదు. రాహుల్గాంధీ ఏదో రాష్ట్రానికి వెళ్లి క్వింటాల్ ధాన్యానికి రూ.2500 అన్నారు. కనీస మద్దతు ధర దేశమంతా ఒకేలా ఉండాలి. లేకుంటే తక్కువ ధర రాష్ట్రంలోనే వ్యాపారులు ఎక్కువ కొంటారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అంటారు. రాష్ట్రానికో విధానం చెబుతారు. ఓట్లు ఉంటే ఒక రకంగా లేకుంటే మరో రకంగా మాట్లాడుతారు. సీపీఎస్పై ద్వంద్వ విధానం జాతీయ పార్టీలు పచ్చి రాజకీయ అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగుల సీపీఎస్ విధానం తెచ్చింది యూపీఏ ప్రభుత్వం. ఇక్కడ అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వాళ్లే తీసేయాలి అని డిమాండ్ చేస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సీపీఎస్ను రద్దు చేయదు. ఇక్కడ బీజేపీ వాళ్లు రద్దు చేయాలని అంటారు. జాతీయ పార్టీల వైఫల్యాలకు వ్యతిరేకంగా ఎవరో ఒకరు నడుంబిగించాలి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తా. నేను ప్రాణానికి తెగించి ముందుకు సాగుతున్నా. కేంద్ర ప్రభుత్వాలవి చెత్త విధానాలు. యూపీఏ ప్రభుత్వం మోడల్ స్కూళ్లను తీసుకొచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది. అలా మధ్యలో వదిలేస్తే ఎలా? అందుకే వీటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి వచ్చింది’ మేనిఫెస్టో 100% అమలుచేస్తాం ‘నాలుగున్నరేళ్లలో మేనిఫెస్టోను 100% అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్. రైతుబంధు, రైతుబీమా పథకాలను మేం మేనిఫెస్టోలో పెట్టలేదు. రైతు బీమాతో ఎలాంటి పైరవీలు లేకుండానే పేద రైతులకు సాయం వస్తోంది. ప్రజల అవసరాన్ని బట్టి ఇలాంటి 76 అంశాలను అమలు చేస్తున్నాం. కంటి వెలుగు కార్యక్రమంలో కోటి మంది పరీక్షలు చేయించుకున్నారు. అమ్మ ఒడికి మంచి పేరు వచ్చింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. కాన్పుకు అయ్యే రూ.30 వేల ఖర్చు తప్పుతోంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటున్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో బాల్య వివాహాలు లేకుండాపోయాయి. ఆర్థిక వ్యవస్థ పెరిగింది. సంక్షేమ పథకాలను అమలు చేశాం. ఎరువులకు రైతులు ఇబ్బందిపడే రోజులు పోయాయి. గోదాములు లేక ఈ సమస్య అని గుర్తించాం. నాలుగు లక్షల టన్నుల సామర్థ్యం నుంచి 25 లక్షల టన్నుల సామర్థ్యం పెంచాం. అన్ని రంగాలలో నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. మా పనితీరు, సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు మాకు 88 స్థానాల్లో విజయం కట్టబెట్టారు. ఉద్యమ పార్టీగా గత ఎన్నికలలో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సరిగా చేసి చూపినం. ప్రజలు అన్ని చూసి తీర్పు ఇచ్చారు’ టీఎస్పీఎస్సీతో మైనస్ ‘మాకన్నా ముందు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయి? విపక్షాలు పచ్చి అబద్దాలు చెప్పి యువతను పక్కదోవ పట్టిస్తున్నాయి. అనవసరంగా నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు. ఇంటికో ఉద్యోగం అని ఎప్పుడూ చెప్పలేదు. నిరుద్యోగులను రెచ్చగొంటేందుకు కొందరు డ్రామాలు చేశారు. ఏటా లక్ష ఉద్యోగాల భర్తీ అంటే ఎలా? టీడీపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న 60 ఏళ్లు ఇలాగే చేసుంటే.. 60 లక్షల ఉద్యోగాలు అయ్యేవి. ఇదో ఎన్నికల నినాదంగా మారింది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన పార్టీలే అధికారం పోయాక ధర్నాలు చేస్తాయి. మేం అలా కాదు. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను 100% భర్తీ చేస్తాం. ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు విస్తృతమయ్యేలా కృషి చేస్తాం. టీఎస్పీఎస్సీ మాకు మైనస్ అయ్యింది. పనికిమాలిన పనులు ముందు పెట్టుకుని ఉద్యోగాల భర్తీలో జాప్యం చేసింది. అందుకే చివరికి కొన్ని పోస్టులను తీసి ఆయా శాఖలే భర్తీ చేసుకునేలా నిర్ణయాలు తీసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఒక శాతం కంటే తక్కువే ఉంటుంది. ప్రైవేటులోనూ ఎక్కువ ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం’ 33 జిల్లాలు చేస్తాం ‘టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్వీయ పన్నుల ఆదాయం వృద్ధిరేటు 29.90%గా ఉంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ దీంట్లో సగం కూడా లేదు. అప్పులు ఎలా చెల్లించాలో మాకు తెలుసు. సాధారణంగా పెరిగేవి తప్ప ప్రత్యేకంగా పన్నులు పెంచం. వచ్చే నాలుగేళ్లలో రూ.10 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. రుణాల కింద రూ.2.30 లక్షల కోట్లు చెల్లిస్తాం. దీని వల్ల అదనంగా రూ.1.30 లక్షల కోట్ల రుణం పొందే అర్హత వస్తుంది. అన్నింటిపైనా అవగాహన ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు రూ.70 వేల కోట్లు అవసరమవుతాయి. ఖమ్మం జిల్లాలో మాకు సీట్లు రాకపోయినా.. అక్కడ దుమ్ముగూడెం ప్రాజెక్టుతో వచ్చే జులైలో నీళ్ళు అందిస్తాం. 18 నెలల్లో కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. అప్పటికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు 90%పూర్తవుతుంది. ప్రాజెక్టుల వద్దకు నేనే స్వయంగా వెళ్లి పరిశీలిస్తా. తెలంగాణ అన్ని రాంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి, సుస్థిర ప్రభుత్వంతో రాష్ట్ర పతార (పరపతి)పెరిగింది. రూ.15 వేల కోట్లను అప్పుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్ఈసీ చైర్మన్ ఫోన్ చేశారు. తాజా తీర్పుతో ప్రజలు ఈ పతారను మరింత పెంచారు. ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు పెరుగుతుంది’ క్రమంగా అధికారాల బదిలీ ‘స్థానిక సంస్థలను బలోపేతం చేసి క్రమంగా అధికారాలను వికేంద్రీకరిస్తాం. గత ప్రభుత్వాలు ఈ సంస్థల అధికారాలను ఒకొక్కటిగా వెనక్కి తీసుకున్నాయి. పంచాయతీ సమితి పరిధిలోనే అన్ని జరిగేవి. ప్రాథమిక పాఠశాలలో టీచర్లను, ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని నియమించే అధికారాలు బీడీవోలకు ఉండేవి. బీడీవోలను తొలగించారు. అన్ని ఆధికారాలను తీసుకున్నారు. ఇప్పుడు ఆర్థిక సంఘం నిధులు వస్తేనే జిల్లా పరిషత్లకు పనులు. వాటి పరిస్థితి దయనీయంగా ఉంది. నిర్మాణాత్మక మార్పులు రావాలి’ 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగభృతిని చెల్లిస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉంది. ఈలోపు వరుసగా పంచాయతీ, లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. మధ్యలో అమలు చేయడం వీలు కాదు. నిరుద్యోగుల భృతి అర్హతలపై నియమావళి రూపకల్పన కోసం కమిటీని నియమిస్తాం. కమిటీ ప్రతిపాదనల ప్రకారం పథకాన్ని అమలు చేస్తాం. మా అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి నిరుద్యోగభృతి చెల్లింపు జరుగుతుంది’ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ‘అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేశారో అందరికీ తెలుసు. కుంభకోణాలు చేసినోళ్లను, దొంగలను ఎప్పుడైనా బయటకి తీసుకురావచ్చు అని ఊరుకున్నా. వాటిని బయటికి తీస్తే.. సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇదేం పద్ధతి అంటరని ఊరుకున్నా. ఈ నాలుగున్నరేళ్లలో ఎవరినీ ముట్టుకోలేదు. ఈసారి మాత్రం వదలిపెట్టే ప్రసక్తే లేదు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. కుక్కలు మొరిగినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. కచ్చితంగా చికిత్స చేస్తాం. ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోంది’ కోఠి చౌరాస్తాలో అమ్ముతరు ‘ప్రభుత్వాధినేత గట్టిగా ఉండాలి. మన ప్రజాస్వామిక వ్యవస్థ అలాగే ఉంది. అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి ప్రత్యేకమే. నేను కొంచెం ఎక్కువ కట్టిక ఉంటా. అట్ల లేకపోతే.. సర్కారు కాదు సర్కస్ అయితది. గట్టిగా ఉండకపోతే నన్ను కోఠి చౌరస్తాలో రూపాయి పావలకు అమ్ముతరు. నేను గట్టిగ ఉండడం వల్లనే.. మా పాలనలో అవినీతికి తావులేదు. నేనెవర్నీ కలవడం లేదనేది సరికాదు. రాజ్దీప్ సర్దేశాయ్, ప్రణయ్రాయ్ వంటి మీడియా ఎడిటర్లు ఫోన్లు చేసి కలుస్తామని అడుగుతారు. వారిని పిలిచి ఊరికే ముచ్చట చెప్పి పంపేంత సమయం నాకు లేదని చెప్పా. ప్రజల కోసం ఏం చేయాలనే దానికే ప్రాధాన్యత ఇస్తా. కంటివెలుగు వంటి పథకాలు అమలు చేస్తుంటే ప్రతికూల మీడియాకు అవేవి కనిపించవు. సమాచార శాఖ నా దగ్గరే ఉంటది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తప్పకుండా ఇస్తాం. రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛను విధానంపై అధ్యయనం చేయిస్తాం. కమిటీ ప్రతిపాదనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం’ 106 సీట్లు వస్తాయనుకున్నా! అసెంబ్లీ ఎన్నికలలో తాను ఆశించిన ఫలితాలు రాలేదని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలతో భోజనం చేస్తూ ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘అసెంబ్లీ ఎన్నికలలో 96 నుంచి 106 సీట్లు వస్తాయని అనుకున్నా. ఆశించిన ఫలితాలు రాలేదు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు టీఆర్ఎస్లోకి వస్తామని ఫోన్లు చేస్తున్నారు. ఓడిపోయిన మంత్రులను కేబినెట్లోకి తీసుకుంటే విమర్శలొస్తాయి. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుంది.’అని ఆయన వెల్లడించారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీని కుటుంబంతో వెళ్లి కలిశా. కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనంపై చర్చించాం. దిగ్విజయ్సింగ్తో ఆ విషయం మాట్లాడాలని సోనియా అన్నారు. ఆ తర్వాత దిగ్విజయ్సింగ్ను కలిశా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం మీకిస్తే ఎలా అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఈ విషయంపై కనీసం మాట్లాడలేదు. వెంటనే హైదరాబాద్కు వచ్చి పార్టీ నేతలతో చర్చించాం. ఏదైనా సరే ఒంటరిగా పోటీ చేద్దామని అందరు అన్నారు. అదే నిర్ణయించుకున్నాం. మొండిగా ఎన్నికల్లో పోరాడాం. ప్రజలకు మాకు అధికారం ఇచ్చారు. వారు ఇచ్చిన బాధ్యతను నిర్వహిస్తున్న తీరుపై సంతృప్తితో మళ్లీ గెలిపించారు’కేసీఆర్ అన్నారు. -
సెంటిమెంట్ ముందు నిలవలేకపోయాం
సాక్షి,హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు సెంటిమెంట్ రాజకీయాల ముందు ప్రజా కూటమి నిలవలేకపోయిందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విశ్లేషించారు. కూటమి ఎజెండా బాగా ఉన్నా, వాటిలోని అంశాలను కేసీఆర్ మొదట విమర్శించినా ఆ తర్వాత పెన్షన్లు, నిరుద్యోగ భృతికి మరో రూ.16 కలిపి టీఆర్ఎస్ తమ వాగ్దానాలనే కాపీ కొట్టిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ ప్రచారంతో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను టీఆర్ఎస్ తెరమీదకు తీసుకొచ్చిందని, దీంతో సెటిలర్లంతా టీఆర్ఎస్ పక్షానే నిలిచారన్నారు. మఖ్దూంభవన్లో బుధవారం ఆ పార్టీ నాయకులకు అజీజ్ పాషా, పల్లా వెంకటరెడ్డి లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాలకు వామపక్షాలకు ఓ గుణపాఠమని వ్యాఖ్యానించారు. సీట్ల సర్దుబాటులో జాప్యమే ముంచింది కూటమి సరైన సమయంలో ఏర్పడినా, సీట్ల సర్దుబాటులో జాప్యం, సమన్వయలోపాల కారణంగా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఖమ్మం జిల్లా మాత్రమే ప్రజాకూటమికి అండగా నిలిచిందని, మిగతా జిల్లాల్లో భాగస్వామ్యపక్షాల మధ్య సమన్వయం కుదరలేదన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్కు సగానికి సగం సీట్లు తగ్గుతాయని తాము అంచనా వేసినా సెంటిమెంట్ రాజకీయాలతోనే కేసీఆర్ విజయం సాధించారన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా అన్న సందేహాలు కూడా ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ జరిగిందని, వీటి నియంత్రణలో ఈసీ విఫలమైందన్నారు. త్వరలోనే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు ఉన్నందున, ప్రజాకూటమి మరింత సమన్వయంతో బలోపేతం కావడం ద్వారా కేసీఆర్ ఏకపక్ష విధానాలకు చెక్ పెట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. వామపక్షాలు కలిసి పోటీచేసే ప్రయత్నాలు విఫలమయ్యాయని, తాము కాంగ్రెస్ కూట మిలో, బీఎల్ఎఫ్ కూటమిలో సీపీఎం పోటీచేశాయన్నారు. సీపీఐకు ఇచ్చిన 3 సీట్లలో మిత్రధర్మాన్ని పాటించడంలో కాంగ్రెస్ విఫలమైందని సహాయకార్యదర్శి పల్లా వెంకటరెడ్డి విమర్శించారు. -
‘చక్రం’ తిప్పి చతికిలపడ్డారు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తొలి ప్రభుత్వంలో ‘చక్రం’తిప్పిన ఆ ముగ్గురు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రోడ్డు, రవాణా, ఆర్టీసీ బాస్లుగా పనిచేసిన వారు ఈ ఎన్నికల్లో పరాజయం చవిచూశారు. ఓడిన ఈ ముగ్గురు శాఖల పరంగా పరస్పరం సంబంధం కలిగి ఉండటం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. రవాణా మంత్రి మహేందర్రెడ్డి.. తెలంగాణలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పట్నం మహేందర్రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికలకు ముందే టీఆర్ఎస్లో చేరిన ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మహేందర్రెడ్డి 1994, 1999, 2009లలో టీడీపీ నుంచి, 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మహేందర్రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన రోహిత్రెడ్డి విజయం సాధించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల.. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్కు తుమ్మల నాగేశ్వరరావు అత్యంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యంతోనే 2014 డిసెంబర్లో కేబినెట్లో స్థానం కల్పించి రోడ్లు, భవనాల శాఖ మంత్రిని చేశారు. 2016 మార్చిలో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్రెడ్డి చేతిలో ఓడిపోవడంతో పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆర్టీసీ బాస్ విజయానికి పంచర్.. సోమారపు సత్యనారాయణ 2010 నుంచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. రామగుండం నియోజకవర్గం నుంచి 2009లో స్వతంత్రంగా, 2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ రెండు సార్లు ఆయనకు రాజకీయ ప్రత్యర్థి కోరుకంటి చందర్ కావడం విశేషం. ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు వరకు ఆయన టీఎస్ఆర్టీసీకి చైర్మన్గా సేవలందించారు. ఈ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున కోరుకంటి చందర్, టీఆర్ఎస్ నుంచి సోమారపు సత్యనారాయణ రామగుండం బరిలో నిలిచారు. కానీ 27 వేల పైచిలుకు ఓట్ల తేడాతో సోమారపు అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. -
నెక్ట్స్ ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఘోర పరాభవం తర్వాత ఏం చేద్దామన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ ఎన్నికల్లో 19 స్థానాలకే పరిమితం కావడం, హేమాహేమీలంతా ఓటమిపాలు కావడంతో రానున్న ఐదేళ్ల పాటు పార్టీని కాపాడుకోవడం క్లిష్టతరంగా భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అడుగులు వేయాలన్న దానిపై పార్టీలో చర్చోపచర్చలు జరుపుతున్నారు. ఎన్నికల్లో పరాజయం అనంతరం టీపీసీసీ ముఖ్యనేతలు ఎవరూ మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు. ఇప్పటి పరిస్థితుల్లో కొన్నాళ్లు మౌనంగా ఉండటమే మేలని, ఆ తర్వాతే ప్రజాసంక్షేమం, ప్రభుత్వ పనితీరుపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నారు. రాజకీయంగా ఒంటరిగానే ఉండాలని, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం కన్నా కాంగ్రెస్ పార్టీగానే ప్రజల్లోకి వెళ్లాలని, ముఖ్యంగా టీడీపీతో ఈ ఎన్నికలతోనే సెలవు తీసుకోవాలనే వాదన కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలో రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.. పంచాయతీ ఎన్నికల్లో బలమైన అధికార పక్షాన్ని ఎలా ఢీకొట్టాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. బాబు దోస్తీనే పుట్టి ముంచింది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పెట్టుకున్న పొత్తు వికటించిందని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రవేశంతో తమకు అనుకూలంగా ఉన్న వాతావరణం టీఆర్ఎస్ పార్టీ వైపు మళ్లిందనే అభిప్రాయం మెజారిటీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై విశ్లేషణ జరుపుతున్న ప్రతి నాయకుడూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రీతిలో జరగాల్సిన ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అనే స్థితికి వెళ్లాయని, ఇదే తీవ్ర నష్టాన్ని కలగజేసిందని అంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా చంద్రబాబు విపరీత జోక్యాన్ని నివారించి ఉండాల్సిందని, టీజేఎస్ అధినేత కోదండరాంను ముందుపెట్టి ఎన్నికలకు వెళ్లి ఉంటే మరో రకమైన ఫలితాలొచ్చేవని, అసలు టీడీపీనే పక్కనపెట్టి టీజేఎస్, సీపీఐలతో ముందుకు వెళితే మెరుగైన ఫలితాలు వచ్చేవనే చర్చ జరుగుతోంది. ఇంకా నష్టం జరగకుండా ఉండాలంటే టీడీపీతో సెలవు తీసుకోవడమే మేలని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే జరగనున్న రాష్ట్ర పంచాయతీ ఎన్నికల నుంచే ఇది ప్రారంభం కావాలని, ఈ విషయంలో అధిష్టానం అడిగినా ఒప్పుకోకూడదని, టీడీపీ మైత్రిలేని కాంగ్రెస్కే తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని అధిష్టానం వద్ద గట్టిగా చెప్పాలని భావిస్తున్నారు. ఎన్నికలు అయిన వెంటనే మిత్రపక్షాలను దూరం చేసుకోవడం మంచిది కాదని, అవసరం, సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
కారుకు ఓటెందుకేశానంటే..
నేను సమైక్యతావాదిని. 70ఏళ్ల తెలంగాణ వెనుకబాటుతనానికి, రాజకీయ పార్టీల దుష్పరిపాలనే ప్రధానమైన కారణమని, రాష్ట్ర విభజన దీనికి సరైన పరిష్కారం కాదని నమ్మాను. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న, నాయకత్వం వహించిన వారందరూ నాకు సన్నిహితులే. వారి అనుభవాలు, వీరగాధలువింటూనే పెరిగాను. అయినా, నా శాయశక్తులా విభజనను వ్యతిరేకించాను. సమైక్యత కోసం ఒక రాజకీయ జేఏసీ నిర్మించడానికి అన్ని పార్టీల నాయకత్వంతో, అప్పటి సీఎంతో సహా అందరినీ కలిసి ఒక విఫలయత్నం చేశాను. రాష్ట్ర విభజన తరువాత అన్నిరకాల రాజకీయాలకు దూరంగా ఉండిపోయాను. ఈ దూరం రాజకీయ చిత్రపటాన్ని కొంత స్పష్టతతో చూసే అవకాశమిచ్చింది. తరువాత జరిగిన ఎన్నికలలో ఓటు వేయలేదు. క్రమేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన అనేక పథకాలను, వాటి ప్రచారాలను చూశాను. అంతకుముందు చూసిన అనేక పబ్లిసిటీ ఫ్లెక్సీల్లాగే ఉన్నాయి. ఇంత డబ్బు ఫ్లెక్సీల మీద పెట్టే బదులు, ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలకు వాడొచ్చుకదా అనుకున్నాను. క్రమేపీ కొన్ని కార్యక్రమాలు–మొట్టమొదట గ్రామాలలో పాత చెరువుల పూడిక తీయడం, కొత్త చెరువులు తవ్వడం–చూసి, ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో స్పష్టత ఉందని అర్థమయ్యింది. ఆ తరువాత ఒక్కొక్కటే కార్యరూపం దాల్చడంతో.. నిజాయితీతో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయనే అభిప్రాయం కలిగింది. అన్ని సమస్యలు ఒక్కసారే పరిష్కారం అయిపోవు. తప్పులు, ఒడిదుడుకులు లేకుండా కూడా జరగవు. అసలు జరుగుతున్నాయా? లేదా? ఈ ప్రభుత్వం సరైన మార్గంలో వెళుతోందా లేదా అనేది ప్రశ్న. ఈ మాత్రం పనులు జరిగిన దాఖలాలు దేశంలో చాలా కొద్దిగానే ఉన్నాయి. రాజకీయం న్యాయమైనదైనప్పుడు ఒప్పులను అభినందించాలి. తప్పులను ఎలా సరిచేసుకోవాలో చెప్పి, సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఎన్నికలలో గెలి పించడమో, ఓడించడమో ఒక్కటే గమ్యం కాదు. ఇంకా గ్రామీణాభివృద్ధి, నిరుద్యోగం వంటి సమస్యలున్నాయి. వీటిని పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చింది. 70 ఏళ్ల పాటు పేరుకుపోయిన సమస్యల మురుగునీటిని ఒక్కసారిగా తొలగించడం సాధ్యం కాదు. అలా అనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ ప్రభుత్వం గత నాలుగేళ్లలో గ్రామ సీమలకు ఇచ్చిన నీరు, బీడువారిన నేలలో పైరులు చూసిన చిన్న రైతుల ఆనందం, తాగు నీరు, ఆరోగ్య కార్యక్రమాలు, ఆర్థిక సహాయాలు, విద్యావిధానంలో మార్పుల కోసం ప్రయత్నాలు, ఐటీ రంగం, కరెంట్.. ఇలా ఇచ్చిన హామీల వైపు చిన్నచిన్న అడుగులు వేయడం నా అనుభవంలో మొదటిసారి చూశా. రెండడుగులు వెనక్కు వెళ్లి, రాజకీయ పార్టీ కోణం నుండి కాకుండా.. అభివృద్ధిని ఆశించే సాధారణ వ్యక్తిగా చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. సాధారణ ప్రజలు ఊహా లోకాల్లో, దీర్ఘకాలిక ప్రణాళికలలో, ఉన్నతమైన రాబోవు యుగాలను చూడరు. అవన్నీ ఉపన్యాసాలకే పరిమితం. ఈరోజు తమ వాస్తవ పరిస్థితులు ఎలా మెరుగవుతున్నాయి, ఆ మెరుగుదలకు దారితీసే పథకాలను ఎవరు అమలు చేస్తారనే ఉత్కంఠతో, ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. Politics are about hope. Elections are about hope. ఈ నమ్మకాన్ని ఎవరు కలిగిస్తారో, వారిని ప్రజలు ఆదరిస్తారు, గెలిపిస్తారు. ప్రాణాలుపెట్టి రక్షించుకుంటారు. దీనికి సిద్ధాంతపరమైన రాజకీయ వాదనలు అవసరం లేదు. నమ్మకం ఒక్కటే చాలు. సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అధికార పార్టీ జాతీయస్థాయి అధ్యక్షుడు అమిత్ షా, మరో జాతీయ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీలకు తోడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కట్టకట్టుకుని తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగగానే.. తాము ఇష్టపడిన ప్రభుత్వానికి ముప్పు కలుగుతోందనే భయం, ఆందోళన తెలంగాణ ప్రజల్లో కలిగింది. తమ ప్రభుత్వాన్ని రక్షించుకోవడం కోసమే ఇక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. ఇలా పెరిగిన పోలింగ్ శాతానికి కొందరు రాజకీయ పండితులు భిన్నమైన విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చేశారు. ఈ ప్రభుత్వానికి రైతులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని కులాలవారు, మతాల వాళ్లు వ్యతిరేకులని భాష్యం చెప్పారు. నాకు ఈ ప్రభుత్వంతో వ్యక్తిగత అవసరాలేమీ లేవు. మా నియోజకవర్గం అభ్యర్థులెవరో తెలీదు. వారెవరితో పరిచయం లేదు. నన్నెవరూ తమకే ఓటు వేయమని అడగలేదు. ఎస్సెమ్మెస్లు కూడా రాలేదు. అయినా, పొద్దున్నే పోలింగ్ బూత్కు వెళ్లా. ఈవీఎంను చూస్తే అన్నీ తెలియని పేర్లే ఉన్నాయి. ఓ నిరక్షరాస్యుడిలా పేర్లతో సంబంధం లేకుండా కారు గుర్తు దగ్గర ఉన్న బటన్ నొక్కా... పేపర్ స్లిప్ మీద కారు బొమ్మ వచ్చింది. ఎన్నికల ఫలితాలు ఎలా వున్నా, ఒక మంచి పని చేశానన్న తృప్తితో పోలింగ్ బూత్ బైటికి వచ్చా. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలకు ఒక ముఖ్యమైన సందేశాన్నిచ్చాయి. అదేమిటంటే.. ఉపన్యాసాలు, ప్రలోభాలు, నినాదాలు కాదు; ప్రజాహిత కార్యాచరణే గెలిపిస్తుందని. Anti-incumbency అనే మాటకు అర్థమేమీ లేదు. బాగా పనిచేసే చేతిని ఎవరూ విరగ్గొట్టుకోరు. వ్యాసకర్త : డా‘‘ పుచ్చలపల్లి మిత్ర ,రాజకీయ విశ్లేషకుడు mitrapuchalapalli@gmail.com -
ఇక రైతు కేంద్రంగా రాజకీయం
బలమైన, వ్యూహాత్మకంగా అడుగేసే ప్రతిపక్ష కూటమి బీజేపీని ప్రకంపింప చేస్తుందని, చివరకు ఓడించగలుగుతుందని కూడా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవలసిన పాఠం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైతును నిర్లక్ష్యం చేస్తే, మీ పతనం తప్పదు. దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభంలో చిక్కుకున్న రైతులు తమ సమస్యలను ఏదోమేరకు గుర్తించి, పరిష్కరించిన చోట ప్రభుత్వాలను అందలమెక్కిస్తున్నారు. దీనికి అసలు సిసలు ఉదాహరణ తెలంగాణ. రైతులకు నగదు నేరుగా బదలాయించి ఈ ఎన్నికల్లో వారి మద్దతును కేసీఆర్ ప్రభుత్వం గణనీయంగా సాధించింది. మూడు హిందీ ప్రాబల్య రాష్ట్రాల్లో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం తర్వాత వచ్చే కొద్ది నెలల్లో రాజకీయ పరిదృశ్యానికి సంబంధించిన రూపురేఖలు పదునెక్కనున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ఆరునెలల్లోపే జరుగనుండటంతో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఓటింగ్ సరళి నుంచి పాలక బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది. రానున్న కొద్దిరోజుల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర వివరాలతో చర్చలు జరుగుతాయి. విశ్లేషణలు జరుగుతాయి. కానీ ఈ ఎన్నికలు ప్రధానంగా మూడు ముఖ్యమైన విషయాలను రంగంమీదికి తీసుకొచ్చినట్లు స్పష్టమైపోయింది. అవేమిటంటే, గ్రామీణభారతంలో అశాంతి అనేది వాస్తవం. ఓటింగుపై దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. రెండోది, మతపరమైన విభజన లేదా సమీకరణ అనేది విశ్వాసాలను పటిష్టం చేస్తుందేమో కానీ అది భారీ ఎత్తున ఓట్లను సంపాదించలేదు. ఇక మూడో అంశం.. బలమైన, వ్యూహాత్మకమైన ప్రతి పక్ష కూటమి బీజేíపీని కదిలించివేస్తుంది, ఓడిస్తుంది కూడా. రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యత దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా బాధపడుతున్నారు. తమ సమస్యలను ఏదోమేరకు గుర్తించి, పరిష్కరించిన చోట వారు ప్రభుత్వాలను అందలమెక్కిస్తున్నారు. దీనికి అసలు సిసలు ఉదాహరణ తెలంగాణ. పాలకపార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి రైతులకు నగదు నేరుగా బదలాయించి ఈ ఎన్నికల్లో వారి మద్దతును గణనీయంగా కొల్లగొట్టింది. తెలంగాణ భావనపట్ల గతంలో ప్రజల్లో ఉన్న తీవ్రమైన అత్యుత్సాహం ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. అలాగే 2014 ఎన్నికల్లోలాగా ఉప జాతీ యవాదం కూడా ఇప్పుడు అంత బలంగా లేదు. సమస్యల ప్రాతిపదికన స్పందించే చైతన్యం తెలంగాణ ఓటర్లలో పెరిగిందనడానికి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు స్పష్టంగా రుజువు చేశాయి. మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ 2017 జూన్లో ఆ రాష్ట్రంలో మండసార్లో రైతులపై కాల్పులు జరగడం ఆయన పాలనకు మచ్చగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన వ్యక్తిగత ప్రజాదరణ కొనసాగింది. కానీ గ్రామీణ ఓటర్లలో కొన్ని విభాగాల మద్దతును ఆయన తప్పకుండా పొంది ఉండాల్సింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవలసిన పాఠం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైతును నిర్లక్ష్యం చేస్తే, మీ పతనం తప్పదు. ఈ గుణపాఠంతో రానున్న నెలల్లో రైతులను మరిన్ని ప్రలోభాలకు గురిచేస్తారని ఊహించవచ్చు కానీ ఇది వాస్తవ పరిస్థితిలో మార్పును తీసుకొస్తుందా అనేది చూడాల్సి ఉంది. విద్వేష రాజకీయాలకు భంగపాటు చిత్రవధ చేసి చంపడం కరడు గట్టిన హిందుత్వ వాదులను సంతోషపెట్టవచ్చునేమో కానీ, ప్రభుత్వాలపై ఓటరు తీవ్ర ఆగ్రహాన్ని అది ఏమాత్రం మార్చలేదు. రాజస్తాన్లో ఇది స్పష్టంగా కనబడింది. ఈ రాష్ట్రం లోని నియోజకవర్గాల్లోని పలు విభాగాల ప్రజలను వసుంధర రాజే పరాయీకరణ పాలు చేశారు. అందుకే ఓటర్లు ఆమెకు తగిన గుణపాఠం నేర్పారు. ఇక యోగి ఆదిత్యనాథ్ బ్రాండ్ విద్వేష ప్రచారం వ్యతిరేక ఫలితాలనే తీసుకువస్తోంది. హైదరాబాద్ పేరు మార్చేస్తానని, నిజాంని పారదోలినట్లే మజ్లిస్ పార్టీ నేతలను రాష్ట్రం నుంచి తరిమేస్తామని యోగి చేసిన వాగ్దానాలను తెలంగాణ ఓటర్లు అసలు పట్టించుకోలేదంటే సందేహపడాల్సిన పనిలేదు. పైగా నిజాం తెలంగాణ నుంచి పారిపోయాడని చెప్పడమే ఒక చారిత్రక అసత్యం. ఇలాంటి విద్వేష ప్రచారాలను తిప్పికొట్టడంలో భాగంగానే కావచ్చు. బీజేపీకి తెలంగాణ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే దక్కి మహామహులు ఓడిపోయారు. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ను ప్రచారానికి ఎక్కడికి పంపాలి అనే విషయంపై బీజేపీ మళ్లీ ఆలోచించుకోవాల్సి ఉంది. పరాజయం నేర్పుతున్న గుణపాఠాలు ఈ పరిణామాలను ప్రతిపక్షాలు తప్పక పరిగణనలోకి తీసుకుని 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ తమ వ్యూహాలను, ఎత్తుగడలను తప్పకుండా మార్చుకోవలసి ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి రెండు రోజుల ముందు ఢిల్లీలో ప్రతిపక్షాలు తమ ఐక్యతను ప్రదర్శించాయి. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్తో సహా దాదాపు ప్రతిపక్ష నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు కానీ అఖిలేష్ యాదవ్, మాయావతి గైర్హాజర్ కావడం ద్వారా తమ భవిష్యత్ పయనాన్ని సూచించారు. ఉదాహరణకు మాయావతి ఎక్కడికి వెళతారు? ఆమె మధ్యప్రదేశ్లో కీలక పాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్తో కలిసి వెళ్లకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం పేలవంగా కనబడుతోంది. పైగా వారు ఐక్యంగా ఉంటే మరిన్ని సీట్లను గెలిచి ఉండేవారు. కానీ తన సొంత బలాన్ని పరీక్షించుకోవాలని భావించి ఉండవచ్చు లేదా ఏవైనా ఒత్తిళ్లకు గురయి ఉండవచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆమె సమాజ్వాదీ పార్టీతో చేతులు కలపవచ్చు, లేదా కాంగ్రెస్తోనూ చేతులు కలపవచ్చు. ఇప్పటికే సంకీర్ణంలో ఉన్న రాష్ట్రీయ లోక్ దళ్తో ఇలాంటి ఐక్యత సాధ్యపడితే ఉత్తర భారతదేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రంలో బీజేపీ మరింత నిస్సహాయ స్థితిలో కూరుకుపోక తప్పదు. బుజ్జగింపులు, ప్రలోభాలు తప్పవా? ఇక మమతా బెనర్జీ కూడా ప్రతిపక్ష మహాకూటమితో పొత్తు కుదుర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలువరిస్తున్నారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఫ్రంట్లో ప్రముఖపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మమత తన స్థానాన్ని వదిలేసుకుంటారా? ఇక శరద్ పవార్ ఇప్పటికే మహారాష్ట్రలో కాంగ్రెస్తో లాంఛనప్రాయమైన ఒడంబడికను కూడా చేసుకుంది. జాతీయ కూట మికి ఇది మరింత దన్ను కలిగిస్తుంది. మహారాష్ట్రలో దూకుడుమీదున్న శివసేనతో బీజేపీ తీవ్రంగా తలపడనుంది. ఈ రాష్ట్రంలో వీలైనన్ని స్థానాలు గెల్చుకోవాలంటే శివసేనకు తలొగ్గి దాని డిమాండ్లను కాషాయదళం అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. భాగస్వాములతో సర్దుబాట్లు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో భాగమైన చిన్న పార్టీలు నరేంద్రమోదీ–అమిత్షా తరహా పనివిధానంతో, వ్యవహార శైలితో ఉక్కిరిబిక్కిరవుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. వీటిలో రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ లేక రామ్దాస్ అతవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ మరెక్కడికైనా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయా? తమ ప్రయోజనాలు ఉత్తమంగా ఎక్కడ నెరవేరుతాయో అక్కడే పనిచేయాలని ఈ పార్టీలు స్పష్టంగా కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన భాగస్వామ్య పార్టీలను చేజారకుండా చూసుకోవడానికి ఎన్నో సర్దుబాట్లు, మరెన్నో రాజీలు చేసుకోవలసి ఉంటుంది. 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరం ఉన్నట్లుండి మరింత ఆసక్తికరంగా మారింది. రాజకీయ బేరసారాలు కూడా దీనికి తగినట్లుగానే పరాకాష్టకు చేరుకోనున్నాయి. ఇతర రాజకీయ పార్టీలను బుజ్జగించడం, ప్రభావితం చేయడం, ప్రలోభపెట్టడం వంటి చర్యలకు బీజేపీ తలొగ్గుతుందా లేదా అని ఇప్పుడిప్పుడే ఊహించడం కష్టం. అయితే పొత్తు పార్టీలన్నింటినీ కూడదీసుకుని ఎన్నికల యుద్ధంలోకి దిగాలంటే అది తన ఆకర్షణా శక్తిని, ఎత్తుగడల రాజకీయాలను ప్రయోగంచడమే కాకుండా డబ్బు, భుజబలాన్ని కూడా పెద్ద ఎత్తున ఉపయోగించవలసి రావచ్చు. సంక్షేమ మంత్రంతోటే ఓట్ల సునామీ రైతు సంక్షేమానికి, విస్తృత ప్రజానీకం ప్రయోజనాలకు కాస్త పట్టం కడితే కోట్లాది జన హృదయాలు ఎలా స్పందిస్తాయో తెలంగాణ రాష్ట్ర పాలకులు యావద్దేశం ముందు ప్రదర్శించి చూపారు. కేసీఆర్ జపించిన సంక్షేమమంత్రానికి పులకరించిన తెలంగాణ పల్లెలు పోలింగ్ బూత్లకు వరుకకట్టాయంటే అతిశయోక్తి కాదు. దానికి తోడు ఆయన మరోసారి సంధించిన ఆత్మగౌరవ నినాదం తెలంగాణ పట్టణాల్లో కూడా పెను ప్రభంజనం సృష్టించింది. ప్రజా సంక్షేమం పట్ల ప్రత్యేకించి గ్రామీణ ప్రజల అభివృద్ధి పట్ల కేసీఆర్ తొలినుంచి ప్రదర్శిస్తూ వచ్చిన నిబద్ధత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సునామీని సృష్టించింది. ప్రజాకూటమిలో భాగమైన పెద్ద చిన్న పార్టీలను సానుకూల ఓట్ల సునామీ తుడిచి పెట్టేసింది. జిల్లాలకు జిల్లాల్లో గులాబీ రథానికి ఎదురు లేకుండా పోయింది. పాజిటివ్ ఓటు ఎంత ప్రభావం వేస్తుందో చెప్పడానికి, చూపడానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పథకాలకు, దార్శనికతకు లభించిన ఘనవిజయం ఒక లిట్మస్ టెస్టుగా దేశం ముందు నిలుస్తోంది. రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పథకాలు దేశంపై దండెత్తుతున్న మనకాలంలో ఇకనైనా రైతు సంక్షేమం తప్పనిసరిగా పట్టించుకోవలిసిన ఎజెండాగా రాజకీయ యవనికపై నిలుస్తుందేమో చూడాలి. వ్యాసకర్త : సిద్ధార్థ్ బాటియా, సీనియర్ పాత్రికేయుడు (ది వైర్ సౌజన్యంతో) -
జనం ఒప్పుకోలేదు
-
కొంపముంచిన ‘హిందూత్వ ఎజెండా’
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రానున్న లోక్సభ ఎన్నికలకు ఘంటారావంగా భావిస్తారు. ఈ మూడు రాష్ట్రాలను కలుపుకొని మొత్తం 65 లోక్సభ సీట్లు ఉండగా, గత లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 62 సీట్లను సాధించింది. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. అయినప్పటికీ రానున్న లోక్సభ ఎన్నికలకు ఘంటారావంగాగానీ, రాజకీయ పండితులు వర్ణించినట్లు సెమీ ఫైనల్స్గాగానీ పరిగణించలేం. కాకపోతే ఓ హెచ్చరికగా చూడవచ్చు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటుచేసేంతగా మెజారిటీలు వచ్చి ఉన్నట్లయితే సెమీ ఫైనల్గా చూసే అవకాశం ఉండేది. కానీ ఒక్క చత్తీస్గఢ్లో తప్పించి, మిగతా రెండు రాష్ట్రాల్లో మిత్రపక్షాల సహాయంతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వరుసగా మూడు పర్యాయాలు బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. కనుక ప్రభుత్వం వ్యతిరేకత ఉండడం సహజం. అయినప్పటికీ మధ్యప్రదేశ్లో అది ప్రతిఫలించలేదంటే ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్కున్న మంచిపేరు కావచ్చు. ఇక తెలంగాణలో గత ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుపొంది.. ప్రస్తుతం వందకుపైగా సీట్లకు పోటీ చేసిన బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. మిజోరంలో రెండు సీట్లను ఆశించి రంగంలోకి దిగి ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది. ప్రధానంగా ఎన్నికలు జరిగిన ఈ మూడు రాష్ట్రాలు హిందీ బెల్టులో ఉండడం, ప్రచారం చేసుకునే స్థాయిలో చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలు కూడా పెద్దగా లేకపోవడంతో అక్కడ ప్రభుత్వాలను నిలబెట్టుకునేందుకు.. తెలంగాణలో విస్తరించేందుకు బీజేపీ హిందూత్వ ఎజెండాను ఎత్తుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అంతటి ప్రచారకుడిగా భావించి.. బీజేపీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కూడా రంగంలోకి దింపింది. మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో విస్తతంగా పర్యటించిన ఆయన ‘రామ్, రామ్ మందిర్, రామ్ రాజ్యం’ గురించే ఎక్కువ మాట్లాడారు. తెలంగాణ దండకారణ్యంలో రాముడు పర్యటించారని చెప్పినా ఆయన మిగతా మూడు రాష్ట్రాలకు కూడా రాముడితో ఏదో ఒక లింకు పెట్టారు. తెలంగాణలో బీజేపీకి అధికారమిస్తే రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తానని చెప్పారు. రాష్ట్ర వనరులన్నీ ముస్లింలకే దోచిపెడుతున్నారంటూ ప్రజల మధ్య విధ్వేషాలను సృష్టించేందుకు ప్రయత్నించారు. ‘రాముడు గీముడు జాన్తా నహీ’ అంటూ తెలంగాణ సెంటిమెంట్ ముందు ఆయన ప్రచారం నిలబడలేకపోయింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ‘అభివృద్ధి’ నినాదం ద్వారానే విజయం సాధించిన విషయాన్ని పార్టీ పక్కన పెట్టి కేవలం హిందూత్వ ఎజెండానే ఎత్తుకోవడం వల్ల బాగా నష్టం జరిగిందని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సంజయ్ కాక్డే అభిప్రాయపడడం గమనార్హం. 2020 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోదీ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేసినా పట్టించుకోకపోవడం, ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని గాలికొదిలేసిన నేపథ్యంలో అభివృద్ధి ఎజెండాను ప్రచార అస్త్రంగా బీజేపీ చేసుకోలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికైనా హిందూత్వ ఎజెండాను పక్కనపెట్టకపోతే మంగళవారం నాటి ఫలితాలు పునరావృతం కాక తప్పవని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. -
భావోద్వేగానికి లోనైన కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. నల్గొండ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన.. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోమటిరెడ్డిని కలిసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన నివాసానికి వచ్చారు. దీంతో భావోద్వేగానికి గురైన ఆయన.. ప్రజాతీర్పును గౌరవిస్తానని పేర్కొన్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవే తనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఉద్వేగానికి లోనయ్యారు. నల్లగొండను దత్తత తీసుకోండి... ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు కోమటిరెడ్డి అభినందనలు తెలిపారు. తన పదవీకాలంలో జిల్లాలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఏర్పాటుకు, తాగు- సాగునీటి సమస్యల నివారణకు కృషి చేశాననని.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ అధినేత, కాబోయే సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి.. కాంగ్రెస్ అధిష్టానం ఎంపీగా టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
'అపవిత్ర కూటమిని తెలంగాణలో తిరస్కరించారు'
సాక్షి, నెల్లూరు : అపవిత్రమైన కూటమిని ప్రజలు తెలంగాణలో తిరస్కరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దేశంలో చక్రం తిప్పుతానన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి అడుగులోనే బోల్తా పడ్డారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కోట్ల రూపాయల డబ్బును చంద్రబాబు తెలంగాణలో ప్రచారానికి ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రెండు సీట్లు గెలిచి ప్రధాని మోదీతో పోరాటం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు చంద్రబాబుకి బుద్ది చెప్పాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని గడిచిన 3 దశాబ్దాలుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని నిప్పులు చెరిగారు. హరికృష్ణ కూతురు సుహాసినిని ఎన్నికల్లో పోటీ చేయమన్నప్పుడే ఎన్టీఆర్ కుటుంబానికి అనుమానం వచ్చిందని ఆనం అన్నారు. నందమూరి కుటుంబాలను రాజకీయంగా నాశనం చేయడమే చంద్రబాబు ధ్యేయమన్నారు. -
అందుకే గవర్నర్ను కలిశాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్ : తాజా ఎన్నికల్లో బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్భవన్లో గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం స్వీకరించనున్నారని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసి.. పార్టీ శాసనసభాపక్షం తీర్మానం ప్రతులను అందజేశారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయాన్ని ఆయనకు తెలియజేశారు. గవర్నర్ను కలిసిన వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్రెడ్డి, వినయ్ భాస్కర్, పద్మాదేవేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, కాలె యాదయ్య, రవీంద్ర నాయక్ తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్షం తీర్మానం ప్రతులను గవర్నర్కు అందజేశామని తెలిపిన ఎమ్మెల్యేలు.. పరిచయం కోసం మాత్రమే గవర్నర్ను కలిశామంటూ.. తాము గవర్నర్ను కలువడంలో ఎలాంటి ప్రాధాన్యం లేదని చెప్పారు. మరోవైపు కొత్తగా కొలువుదీరనున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా బాధ్యతలు చేపడతారన్నది ఆసక్తిగా మారింది. కొత్త మంత్రులుగా పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో.. వీరు గవర్నర్ను కలువడం కూడా ఊహాగానాలకు తావిస్తోంది. -
బీజేపీ, కాంగ్రెస్ సైకాలజీ బాలేదు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సైకాలజీ బాగాలేదని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు విమర్శించారు. జాతీయ పార్టీలు దొందూ దొందేనని, అధికారం కోసం చిల్లమల్లర రాజకీయాలు చేయడం వాటికి పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఓట్లకోసం జాతీయ నాయకులు సైతం అబద్ధాలు ఆడుతున్నారని ఆయన ఎండగట్టారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేసీఆర్ ఆ పార్టీ శాసభసభా పక్షనేతగా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం పూర్తి గెజిట్ విడుదలైన తర్వాతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని తెలిపారు. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగ భృతి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 70 వేల కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. జర్నలిస్టు సంక్షేమానికి ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేశామని, మరిన్ని నిధులు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామన్నారు. రాష్ట్రం అప్పులు పాలైందన్న విమర్శలను తిప్పికొట్టిన కేసీఆర్... అన్ని అంశాలపై తమకు పూర్తి అవగాహన ఉందని, ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. అందుకే మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా తాము అమలు చేశామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ... ‘పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం మా ముందున్న సవాల్. హైకోర్టు ఆర్డర్ను అమలు చేయాలి. వచ్చే వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రెండు దఫాలుగా ఎన్నికలు జరుగుతాయి’ అని వ్యాఖ్యానించారు. కంటి వెలుగు, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలే తమ పార్టీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టాయని కేసీఆర్ అన్నారు. జాతీయ పార్టీలు దేశంలో ఒక పాలసీ, రాష్ట్రానికో పాలసీ ప్రకటిస్తూ ప్రజలని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. రైతు బంధు దేశవ్యాప్తంగా అమలు చేస్తాం ప్రజాస్వామ్యంలో కేంద్ర- రాష్ట్రాల మధ్య అధికార వికేంద్రీకరణ జరిగినపుడే సమాఖ్య విధానానికి నిజమైన స్ఫూర్తి ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం తన పని తాను చేయకుండా రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తోందని విమర్శించారు. అందుకే దేశ రాజకీయాల్లో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అనేక దేశాలు అంతర్జాతీయంగా తమ పంటను అమ్ముకునేందుకు రైతులకు అవకాశం కల్పిస్తుంటే మనకు మాత్రం అలాంటి అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర దేశవ్యాప్తంగా ప్రకటించాల్సి ఉంటుంది అలా జరిగినపుడే అన్ని రాష్ట్రాల రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. దేశానికి కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానం వచ్చినపుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రైతు, వివిధ వర్గాల సంక్షేమం కోసం జాతీయ స్థాయి రాజకీయాల్లో కొత్త ప్రయోగాలకు తాను సిద్ధమవుతున్నానని.. ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రాగానే రైతు బంధు వంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని, అందుకు సంబంధించిన బడ్జెట్పై కూడా అవగాహన ఉందని కేసీఆర్ తెలిపారు. ఇక పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి తప్పకుండా వెళ్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘కచ్చితంగా ఏపీకి వెళ్తా. అక్కడికి రావాలని నాకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్కేక హోదా అవసరం లేదని ఆ రాష్ట్ర సీఎం చెప్పారు. హోదా సంజీవని కాదు. మూర్ఖులే హోదా అడుగుతారని అన్నారు. మరి ఇప్పుడేమో ఆయనే హోదా కోసం పోరాడుతున్నారు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బతింది
-
టీఆర్ఎస్కు శుభాకాంక్షలు తెలిపిన టీసీఎస్ఎస్
సింగపూర్ : తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ విజయం తెలంగాణ ప్రజల గుండె చప్పుడని పేర్కొన్నారు. గత 4 సంవత్సరాలుగా టీఆర్ఎస్ చేసిన ఎన్నో ప్రజా ఉపయోగ, సంక్షేమ కార్యక్రమాల ఫలితమే ఈ ఘనవిజయం అని తెలిపారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకృషిని కొనియాడారు. దీంతో పాటు అత్యధిక మెజారిటీ సాధించిన హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి, కల్వ రాజు, దిలీప్, కరుణాకర్ రావు మొదలగు వారు ఉన్నారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్: స్పందించిన రజత్కుమార్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్కు అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు కోరడంతో.. పలు నియోజకవర్గాల్లో కొన్ని వీవీప్యాట్లను కూడా లెక్కించినట్టు వెల్లడించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కానే కాదని, ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్లడం కూడా సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఓట్ల ట్యాలీలో తేడా రాలేదన్నారు. మాక్ పోల్ తర్వాత.. సీఆర్సీ బటన్ నొక్కితే మాక్ పోల్ ఓట్లు వెళ్లిపోతాయని, రిజల్ట్ బటన్ నొక్కితే ఎర్రర్ వచ్చిందని తెలిపారు. అప్పుడు ఏజెంట్స్ అందరి ముందూ క్లోసర్ బటన్ కొట్టి.. 17 సీ లిస్ట్ ప్రకారం ఓట్లు ట్యాలీ అయ్యాక ఫలితాలు లెక్కపెట్టామన్నారు. 100 శాతం వీవీప్యాట్లను లెక్కపెట్టాలంటే.. బ్యాలెట్ పేపర్ తరహా అవుతుందని, అది సాధ్యం కాదని తెలిపారు. గవర్నర్కు గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఎస్కే రుడోలా బుధవారం గవర్నర్ నరసింహన్కు అందజేశారు. -
బాబు ప్రచారం.. టీఆర్ఎస్కు భారీ మెజారిటీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు వచ్చి ప్రచారం చేస్తే తమపై ఓట్ల వర్షం కురుస్తుందని, బంపర్ మెజారిటీలు వచ్చేస్తాయని మురిసిపోయిన తెలంగాణ ప్రజా కూటమి అభ్యర్థులకు గట్టి షాక్ తగిలింది. బాబు ప్రచారం చేసిన చోట కూటమి గల్లంతైంది. ఆయన 15 నియోజకవర్గాల్లో రోడ్షోలు, సభలు నిర్వహించగా, 12 చోట్ల కూటమి అభ్యర్థులు భారీ ఓట్ల తేడాతో పరాజయం రుచిచూశారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు వారం రోజులపాటు హైదరాబాద్లో మకాం వేసి వ్యూహరచన చేశారు. ఖమ్మం, కోదాడ, హైదరాబాద్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. హైదరాబాద్తోపాటు శివార్ల పరిధిలోని ముషీరాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, మలక్పేట, ఎల్బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సనత్నగర్, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో రోడ్షోలు, సభలు నిర్వహించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తానేనని, కేసీఆర్ చేసిందేమీ లేదని చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. కూటమి గెలిచేస్తుందంటూ హడావుడి చేశారు. అయితే ఎక్కడా ఆయన పాచికలు పారలేదు. బాబు ప్రచారం చేసిన చోట టీఆర్ఎస్కు భారీ మెజారిటీ హైదరాబాద్ నగరం, శివార్లలో చంద్రబాబు ప్రచారం చేసిన 12 నియోజకవర్గాల్లో 11 చోట్ల టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్న కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో అవమానకర ఓటమిని సొంతం చేసుకోవాల్సి వచ్చింది. కూకట్పల్లిలో 41 వేల ఓట్ల తేడాతో, శేరిలింగంపల్లిలో 44 వేల ఓట్లతో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. చంద్రబాబు ప్రచారం చేసిన రాజేంద్రనగర్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 58 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. బాబు ప్రచారం నిర్వహించిన సికింద్రాబాద్, ముషీరాబాద్, ఉప్పల్, సనత్నగర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఊహించని మెజారిటీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్, మలక్పేటలో కూటమి అభ్యర్థులను చంద్రబాబు గెలిపించలేకపోయారు. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఒక్క ఎల్బీ నగర్లోనే కూటమి అభ్యర్థి గెలిచారు. నల్గొండ జిల్లా కోదాడలో రాహుల్గాంధీతో కలిసి ప్రచారం చేసినా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి భార్య పద్మావతిని గెలుపు తీరం చేర్చలేకపోయారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రాహుల్గాంధీతో కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రచారం చేసినా టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించలేక చంద్రబాబు చతికిలబడ్డారు. అదే జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినా అది టీఆర్ఎస్లోని అంతర్గత విభేదాల వల్లే సాధ్యమైందని చెబుతున్నారు. -
రేపు మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రమాణస్వీకారం!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు (గురువారం) మధ్యాహ్నం రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా.. అతి సాధారణంగా ప్రమాణ స్వీకారం చేయాలనే కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. రాజ్భవన్లో రేపు మధ్యాహ్నం 1.25 గంటలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం స్వీకరించనున్నారని, ఆయనతోపాటు ఒక మంత్రి కూడా ప్రమాణం చేస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎన్నికల అనంతరం దేశరాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానన్న కేసీఆర్.. ప్రమాణస్వీకారంతోనే ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించాలని తొలుత భావించారు. కానీ పలు రాష్ట్రాల్లో కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటు కానుండటం.. జాతీయ పార్టీలకు చెందిన సన్నిహిత నేతలు వారి పనుల్లో బిజీగా ఉండటంతో ఆయన తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఈ విషయాలపై గులాబీ బాస్ కూలంకషంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేసి... అనంతరం మరో భారీ వేదికపై కాంగ్రెస్, బీజేపీయేతర శక్తులను కూడగట్టాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం రాజ్భవన్లో కేసీఆర్ ప్రమాణస్వీకారానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారని, ఈమేరకు గవర్నర్ కార్యాలయానికి అనధికార సమాచారం అందిందని తెలుస్తోంది. తెలంగాణ భవన్లో జరుగుతున్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో టీఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఈ సమావేశం అనంతరం కేసీఆర్, పలువురు సీనియర్ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. కేసీఆర్తో పాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. -
గులాబీ గుభాళింపు
సాక్షి ప్రతినిధి, వరంగల్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఓటర్లు కేసీఆర్ మీద నమ్మకంతోనే ‘కారు’ గుర్తుకు ఓటేసి భారీ విజయాన్ని అందించారు. ఓటమి పాలవుతారని భావించిన టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అభివృద్ధి, రైతు ఎజెండా, జనాకర్షక పథకాలకు తోడు చంద్రబాబు నాయుడు.. కూటమితో జట్టు కట్టటం టీఆర్ఎస్కు కలిసొచ్చింది. పేదలు, పల్లెలు ‘కారుకు’ అండగా నిలబడ్డాయి. తొలి ఓటు వేసిన నవ యువత, మలి ఓటు వేసిన వృద్ధులు, రైతులు పూర్తిగా కేసీఆర్పై విశ్వాసం ప్రకటించారు. దాదాపు అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు (టీఆర్ఎస్), వరంగల్ తూర్పులో నన్నపునేని నరేందర్ (టీఆర్ఎస్), వరంగల్ పశ్చిమలో వినయ్భాస్కర్ (టీఆర్ఎ??స్), వర్ధన్నపేటలో అరూరి రమేష్ (టీఆర్ఎస్), నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డి (టీఆర్ఎస్) పరకాలలో చల్లా ధర్మారెడ్డి (టీఆర్ఎస్), జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (టీఆర్ఎస్), స్టేషన్ ఘన్పూర్లో తాటికొండ రాజయ్య (టీఆర్ఎస్), డోర్నకల్లో రెడ్యానాయక్ (టీఆర్ఎస్), మహబూబాబాద్లో శంకర్నాయక్ (టీఆర్ఎస్ ) విజయం సాధించారు. భూపాపల్లిలో స్వతంత్య్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగులో మంత్రి చందూలాల్పై కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఘన విజయం సాధించారు. మంథనిలో దుద్దిళ్ల శ్రీధర్బాబు,(కాంగ్రెస్).. భద్రాచలంలో పొదెం వీరయ్య (కాంగ్రెస్) విజయం సాధించారు. రెడ్యానాయక్ ఆరోసారి.. డోర్నకల్ టీఆర్ఎస్ అభ్యర్థి డీఎస్.రెడ్యానాయక్ ఆరో సారి విజయం సాధించారు. మరిపెడ మండలం ఉగ్గంపల్లికి చెందిన రెడ్యానాయక్ 1989లో కాంగ్రెస్ నుంచి తొలిసారి గెలిచారు. 1994, 1999, 2004 వరకు వరుసగా గెలుస్తూ వచ్చారు. 2004లో జరిగిన ఎన్నికల్లో రెడ్యా.. టీడీపీ అభ్యర్థి జయంత్నాథ్నాయక్పై 19140 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి వైఎస్.రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో గిరిజన శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2009లో సత్యవతి రాథోడ్ చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014 కాంగ్రెస్ నుంచే గెలుపొందిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో తొలిసారి కారు గుర్తుతో పోటీ చేసిన రెడ్యా.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రామచంద్రునాయక్పై 17,381 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పరకాలలో ఫైర్ బ్రాండ్ ఓటమి కేటీఆర్తో విభేదించి సొంత గూడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి.. ఆమెను అత్యంత సునాయాసంగా ఓడించారు. కూటమి పొత్తుల్లో భాగంగా పరకాల నుంచి పోటీ చేసిన కొండాసురేఖ ఆది నుంచి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గట్టి పోటీదారుగా ఉన్న సురేఖ ఏ రౌండ్లోనూప్రభావం చూపలేకపోయారు. కొండా సురేఖపై చల్లా ధర్మారెడ్డి 46,519 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాజయ్య, వినయ్ నాలుగోసారి.. స్టేషన్ ఘన్పూర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య రాజకీయ పరిశీలకుల అంచనాలకు తలకిందులు చేస్తూ భారీ మెజార్టీతో గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాజయ్య, టీఆర్ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిరపై 35,790 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వరంగల్ పశ్చిమ నుంచి దాస్యం వినయ్ భాస్కర్ వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. 2004లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయన ఆయన ఆ తర్వాత 2009, 2010 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. తాజాగా తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాష్రెడ్డిపై 39,059 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. ఆ ఇద్దరికి ‘సన్’స్ట్రోకే.. భూపాలపల్లి అభ్యర్థి, స్పీకర్ మధుసూదనాచారికి , ములుగు అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి అజ్మీరా చందూలాల్కు సన్స్ట్రోక్ తాకినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. మధుసూదనాచారి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. సన్స్ట్రోక్ను ముందుగానే పసిగట్టిన ఆయన ఆరు నెలలుగా కుమారులను నియోజకవర్గానికి దూరంపెట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి 15,635 ఓట్ల తేడాతో గెలుపొందారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన స్పీకర్ మధుసూదనాచారి మూడో స్థానంలో నిలిచారు. ఇక ములుగు నుంచి చందూలాల్కు ఇదే పరిస్థితి ఎదురైంది. కూమారుడి అనుమతి లేకుండా సాధారణ ప్రజలు నేరుగా చందూలాల్ను కలిసే అవకాశం లేకపోవడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి చందూలాల్పై 22,671 ఓట్ల తేడాతో విజయకేతనం ఎగురవేశారు. అరూరి రమేష్ రికార్డు మెజార్టీ వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలో హరీశ్రావు తర్వాత అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్మేగా అరూరి రికార్డు సృష్టించారు. ఆయన టీజేఏస్ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యపై 99,240 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందారు. దేవయ్యకు 32,012 ఓట్లు మాత్రమే వచ్చాయి. గత ఎన్నికల్లోనూ రమేష్కు 86 వేల మెజార్టీ వచ్చింది. ఈఎన్నికల్లో ఆయన రికార్డును ఆయనే బద్దలుకొట్టడం విశేషం. ఎర్రబెల్లి డబుల్ హ్యాట్రిక్ ఎర్రబెల్లి దయాకర్రావు వరుసగా ఆరు విజయాలను నమోదు చేసుకుని డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1952 నుంచి 2018 వరకు కొనసాగిన శాసనసభ సభ్యుల ఎన్నికల్లో వరుసగా ఓటమి లేకుండా గెలిచిన నేతగా ఎర్రబెల్లి దయాకర్రావు రికార్డు సాధించారు. 1994లో వర్ధన్నపేట నుంచి టీడీపీ తరఫున తొలిసారి బరిలోకి దిగిన ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వరదరాజేశ్వర్రావు మీద 22,175 ఓట్ల మెజార్టీతో గెలుపొంది శాసన సభలోకి ప్రవేశించారు. ఆ తర్వాత వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009లో వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో పాలకుర్తి నుంచి పోటీ చేసి అప్పటి పాత చెన్నూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావును వరుసగా రెండు సార్లు ఓడించారు. 2008 ఉప ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 4386 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పి.రామేశ్వర్రెడ్డిని ఓడించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డిపై 53,053 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకున్నారు. -
గులాబీ గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే
సాక్షి, కరీంనగర్ : రామగుండం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కోరకంటి చందర్ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన చందర్ సీటు దక్కకపోవడంతో ఫార్వర్డు బ్లాక్ నుంచి పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి సోమవరపు సత్యనారయణపై విజయం సాధించిన విషయం తెలిసిందే. రేపు (గురువారం) మధ్యాహ్నం కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తనకు మాతృసంస్థ అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చందర్ తెలిపారు. కాగా ఎన్నికల వరకు కూడా ఆయన టీఆర్ఎస్లోనే కొనసాగిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం కేసీఆర్ను ఆయన కలిసి మద్దతు తెలిపారు. దీంతో టీఆర్ఎస్ బలం 88 స్థానాల నుంచి 89కి చేరింది. గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ రెబల్గా పోటీచేసిన చందర్ సత్యనారాయణపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం, వైరా స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. -
తెలంగాణ ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పారు
-
గులాబీ సునామీ..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘గులాబీ’ సునామీ సృష్టించింది. ముందస్తు సమరంలో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించింది. ఊహకందని ఫలితాలను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లకు పరిమితమైన ఆ పార్టీ ఈసారి ఏకంగా 11 స్థానాలు గెలిచి ఆజేయశక్తిగా ఆవతరించింది. టీడీపీ నామరూపాల్లేకుండా కొట్టుకుపోగా.. కాంగ్రెస్ మాత్రం ముచ్చటగా మూడు సీట్లను దక్కించుకొని ‘సమ్ తృప్తి’ చెందింది. జిల్లా వ్యాప్తంగా సంచలనాలు నమోదైన ఈ ఎన్నికల్లో తాజా మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ఓటమి మూటగట్టుకున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి పైలెట్ రోహిత్రెడ్డి చేతిలో ఓడిపోయారు. వికారాబాద్ జిల్లాలోని నాలుగింటిలో మూడు స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ.. తాండూరులో మాత్రం చతికిలపడింది. ఆది నుంచి తుది వరకు ఉత్కంఠను రేకెత్తించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆఖరికి ఫలితం కూడా దోబుచులాడింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి, బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిపై విజయం సాధించారు. నలుగురు కొత్తవారే.. తాండూరు సహా వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో పోటీ చేసిన కొత్త నేతలకు ఓటర్లు పట్టం కట్టారు. వికారాబాద్లో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న డాక్టర్ మెతుకు అనంద్ను అదృష్టం వరించింది. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్కుమార్పై ఆయన గెలిచారు. పరిగిలో సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్రెడ్డి తనయుడు మహేశ్రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డిపై భారీ ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. చేవెళ్లలోను టీఆర్ఎస్ హవా.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా చెప్పుకునే చేవెళ్లలో టీఆర్ఎస్ గాలి వీచింది. ఈ హవాలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది. ఆ పార్టీ తరఫున పోటీచేసిన కేఎస్ రత్నం భారీ ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. శివార్లలోనూ గుబాళింపే.. పట్టణ ఓటర్లు కూడా టీఆర్ఎస్ను ఆదరించారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఆ పార్టీకి మద్దతు పలికారు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఈసారి ఆ పార్టీ అభ్యర్థులపైనే గెలుపొందడం విశేషం. ఈ రెండు సీట్లతో పాటు ఇబ్రహీంపట్నం బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీకి శృంగభంగమే ఎదురైంది. హస్తవాసి రెండింటికే.. టీఆర్ఎస్ ప్రభంజనంలోనూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. మహేశ్వరం నుంచి బరిలో దిగిన ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిపై గెలుపొందారు. తొలుత ఆధిక్యతను కనబరిచిన తీగలకు సొంత మండలంలోనే చుక్కెదురైంది. మీర్పేట, జల్పల్లి, జిల్లెలగూడ మున్సిపాలిటీల్లో ఆయన ఆశించిన స్థాయిలో ఓట్లను రాబట్టలేకపోయారు. దీంతో పదో రౌండ్ నుంచి ఆధిక్యతలోకి వచ్చిన సబిత చివరి వరకు అదే ఒరవడిని కొనసాగించారు. ఓటమెరుగని ఆమె నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎల్బీనగర్లో సుధీర్రెడ్డి మరోసారి విజయబావుటా ఎగువేశారు. ఆది నుంచి ఆధిక్యతను కనబరుస్తూ వచ్చిన ఆయన దాదాపు 17వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టెన్షన్..టెన్షన్ ఇబ్రహీంపట్నం రాష్ట్ర రాజకీయాల్లోనే తరుచూ పతాక శీర్షికలకెక్కుతోంది. తాజాగా ఎన్నికల ఫలితాల్లోనే అదే ఉత్కంఠ కొనసాగింది. పొత్తులో టీడీపీకి ఈ సీటు కేటాయించడంతో బీఎస్పీ తరఫున బరిలో దిగిన అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ప్రకటించింది. టీఆర్ఎస్ నుంచి మంచిరెడ్డి కిషన్రెడ్డి బరిలో నిలిచారు. వీరిద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులోనూ మొదట ‘ఏనుగు’ ముందంజలో సాగగా.. ఆ తర్వాత కారు జోరు కొనసాగించింది. ఇలా 16 రౌండ్ల వరకు వెనుకబడ్డ మల్రెడ్డి అనూహ్యంగా పుంజుకొని మంచిరెడ్డిని వెనక్కి నెట్టారు. ఆ తర్వాత క్రమేణా స్వల్ప ఆధిక్యతను దక్కించుకుంటూ వచ్చిన టీఆర్ఎస్ 21 రౌండ్లు పూర్తయ్యే సరికి 104 ఓట్ల మెజార్టీతో నిలిచింది. అయితే, అప్పటికే ఆరు ఈవీఎంలకు సాంకేతిక సమస్య రావడంతో పక్కనపెట్టిన ఎన్నికల అధికారులు వాటిని బాగుచేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. ఒకవైపు పోటీ ఉత్కంఠగా మారడం.. ప్రతి ఓటు కీలకమే కావడంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికితోడు మరోసారి పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలనే డిమాండ్కు చేయడంతో ఆ మేరకు మరోసారి లెక్కించారు. ఈ ఈవీఎంలు బాగుచేయకపోవడం తో వీవీ ప్యాట్లలోని ఓట్ల లెక్కించారు. ఈ ఓట్లను కూడిన లెక్కించిన అనంతరం 376 ఓట్ల అధిక్యత సాధించిన మంచిరెడ్డి విజేతగా నిలిచారు. రేవంత్కు భంగపాటు! కాంగ్రెస్ ఫైర్బ్రాండ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డికి తొలిసారి ఓటమి ఎదురైంది. సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. టీడీపీని వీడిన మరుక్షణమే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుందని భావించిన టీఆర్ఎస్ అధినాయకత్వం వ్యూహాత్మకంగా పావు లు కదిపింది. అభివృద్ధి మంత్రమే నినాదంగా..రేవంత్రెడ్డి ఎత్తులకు చెక్ పెట్టింది. తొలిసారి కొడం గల్ కోటలో టీఆర్ఎస్ జెండాను ఎగురవేసింది. -
‘పప్పు’ చాలా హ్యాపీగా ఉంటారు: రోజా
సాక్షి, అమరావతి : నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు సమాధి చేయాలనుకున్నారని, ఆయన కుట్రలను జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు గమనించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఫలితాలను చూసి ఏపీ ప్రజలు ఆనందించారని, మనీ, మ్యానిపులేషన్, మీడియా చంద్రబాబును కాపాడలేకపోయాయని ఎద్దేవా చేశారు. కోట్టు ఖర్చు పెట్టి చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని.. ఏపీలో చంద్రబాబు చేసిన అభివృద్ది ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ నేరగాడు.. తప్పుచేసిన వారికి శిక్ష తప్పదన్నారు. అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ను వైఎస్ రాజశేఖరరెడ్డి రెండుసార్లు అధికారంలోకి తెచ్చారని గుర్తుచేశారు. వైఎస్సార్ లేని కాంగ్రెస్ తల లేని మొండెం లాంటిదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓడటానికి ‘చంద్ర’ గ్రహణమే కారణమన్నారు. చంద్రబాబును పట్టుకుని నడవటం.. కుక్క తోక పట్టుకుని నడవటమే అంటూ విరుచుకపడ్డారు. కుట్రలు చేసి కట్టలతో చంద్రబాబు గెలవాలనుకున్నారని కానీ, తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే శకుని వేసిన పాచికలాంటిదని విమర్శించారు. లగడపాటి మరో మాల్యా అని.. అప్పులు ఎగ్గొట్టడానికి పథకం రచించారని ఆరోపించారు. రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి.. సర్వే సన్యాసం చేస్తే మంచిదంటూ సూచించారు. కాంగ్రెస్తో టీడీపీ కలిస్తే బట్టలూడదీసి కొడతారని మంత్రి అయ్యన్న పాత్రుడు ఎప్పుడో చెప్పారంటూ గుర్తు చేశారు. తాను ఒక్క సీటైనా గెలిపించానని.. తన నాన్న (చంద్రబాబు) ఒక్క సీటు కూడా గెలిపించలేకపోయాడని పప్పు చాలా హ్యాపీగా ఉంటారని మంత్రి లోకేష్కు చురకలంటించారు. చంద్రబాబు ఇక పప్పును ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మాల్సిందేనని, పప్పుకు కిరీటం పెట్టాలనుకున్న పథకాలు తారుమారయ్యాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు విజ్ఞతగా వ్యవహరించాలని కోరారు. వైఎస్ జగన్ను ఆదరిస్తే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్గా ఏమిస్తారోనని తాము కూడా ఆసక్తిగా గమనిస్తున్నామన్నారు. -
జాడలేని చిలక జోస్యం
సాక్షి, అమరావతి: తెలంగాణలో కూటమి కుయుక్తల్లో లగడపాటి సర్వే ఓ భాగమా? తెలుగుదేశం పార్టీ సాగించిన మైండ్గేమ్కు అనుగుణంగానే సర్వే పేరుతో డ్రామా నడిపారా? రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోతుందంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజ్గోపాల్ చెప్పిన చిలకజోస్యం తలకిందులైంది. కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని జాతీయ ఛానళ్లన్నీ ఒకవైపు చెబుతున్నా... లగడపాటి మాత్రం భిన్నమైన సర్వే రిపోర్టును తీసుకొచ్చి గందరగోళానికి తెర లేపారు. అయితే, మంగళవారం వెలువడిన ఫలితాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. లగడపాటి చెప్పిన మాటలకు, వెలువడిన ఫలితాలకు ఏమాత్రం పొంతన లేకపోవడం విశేషం. (వికటించిన రాజకీయ కుట్ర!) ఎవరి కోసమో రూపొందించినట్టు, ఒక పార్టీ ప్రయోజనం కోసమే అన్నట్టుగా ఏమాత్రం శాస్త్రీయత లేని సర్వే ఫలితాలను లగడపాటి వెల్లడించినట్టు స్పష్టమవుతోంది. తెలంగాణలో ఫలితాలు అంచనాలకే అందడం లేదని తొలుత చెప్పిన లగడపాటి, ఆ తర్వాత ప్రజానాడి కూటమి వైపే ఉందన్నారు. ఆయన చెప్పిన సర్వే వివరాలన్నీ రాజకీయంగా ప్రజా కూటమిని గట్టెక్కిండానికి, టీఆర్ఎస్ను దెబ్బతీయడానికే అన్నట్టు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పది మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తున్నారనే భ్రమలు కల్పించడం, బీజేపీ బలం పెరుగుతోందని చెప్పడం... ఇలా ప్రతీ అంశంలోనూ లగడపాటి ఎవరి ప్రయోజనం కోసమే సర్వే చేసినట్టుగా సుస్పష్టమైంది. ఎక్కడైనా పోలికుందా? ఎన్నికల్లో ప్రజాకూటమి 65 నుంచి 75 స్థానాల్లో విజయం సాధించి, అధికారం దిశగా పరుగులు పెడుతుందనేది లగడపాటి సర్వే సారాంశం. టీఆర్ఎస్ 35 నుంచి 45 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పారు. కానీ, ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మీడియా ముందుకు మొదటిసారి వచ్చిన లగడపాటి స్వతంత్ర అభ్యర్థులు 8 నుంచి 10 మంది గెలుస్తారని అన్నారు. వీరిలో ఇద్దరి పేర్లను కూడా వెల్లడించాడు. అయితే, ఈ ఇద్దరూ గెలవకపోవడం గమనార్హం. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పడమే లగడపాటి మాటల ఉద్దేశమని తెలుస్తోంది. బెల్లంపల్లి, బోథ్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, వికారాబాద్, నారాయణపేట, మక్తల్, వైరా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లు గెలుస్తారనే భ్రమ కల్పించి, అంతిమంగా టీఆర్ఎస్ను దెబ్బకొట్టేలా సర్వే పేరిట పక్కా స్కెచ్ వేసినట్టు తేటతెల్లమవుతోంది. మొత్తం మీద 8 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అవకాశాలను దెబ్బతీయడానికి కుట్ర జరిగినట్లు అర్థమవుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పరోక్షంగా కూటమికి మేలు చేయడానికే లగడపాటి సర్వే నాటకాలు ఆడినట్లు స్పష్టమతోంది. బీజేపీ బలపడిందట! ఈ ఎన్నికల్లో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధానమైన పోటీ ఉంది. ఈ పరిస్థితిని మార్చడానికి బీజేపీ బలపడిందని, కొన్నిచోట్ల టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి ఉందని లగడపాటి చెప్పుకొచ్చారు. బీజేపీ పోటీలో ఉన్న ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, అంబర్పేటను ఆయన లక్ష్యంగా ఎంచుకున్నారు. ముస్లింల ఓట్లను వ్యూహాత్మకంగా టీఆర్ఎస్కు దూరం చేసే ఎత్తుగడ సర్వేలో కన్పించింది. ముస్లింల ఓట్లు తెరాస కంటే కాంగ్రెస్కు ఎక్కువగా పడతాయని చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఎప్పుడైనా మాట మీద నిలబడ్డారా? కీలకమైన సమయాల్లో ప్రజలను గందరగోళంలోకి నెట్టడం లగడపాటి రాజగోపాల్కు వెన్నతో పెట్టిన విద్యని రాజకీయ వర్గాల్లో ఓ విమర్శ ఉంది. దీనికి పలు కారణాలు చూపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ లగడపాటి ఇదే తరహాలో వ్యవహరించారు. అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్లోనే ఉన్న ఆయన తెలంగాణ ఏర్పాటు అసాధ్యమని చెప్పారు. అది నిజమని నమ్మించడానికి తెలంగాణ ఏర్పడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రావతరణ తర్వాత లగడపాటి ముఖం చాటేశారు. ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆయన సర్వే ఫలితాలు నిక్కచ్చిగా ఉంటాయని నమ్మించే ప్రయత్నం చేశారు. తీరా ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కాసేపు ప్రీపోల్... ఇంకాసేపు ఎగ్జిట్ పోల్ లగడపాటి సర్వే ఫలితాలను ప్రజా కూటమి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించింది. అయితే, ఎన్నికల ముందు, తర్వాత ఆయన వెల్లడించిన ఫలితాల సందర్భంగా ఆయనే కొంత గందరగోళానికి గురయ్యారు. అవన్నీ ప్రీపోల్ సర్వే అని కొన్నిసార్లు, ఎగ్జిట్పోల్ అని మరికొన్ని సార్లు చెప్పారు. ప్రీపోల్ నిజమైతే పెరిగిన ఓటింగ్ను అంచనా వేసే అవకాశం లేదు. ఎగ్జిట్పోల్ నిజమైతే పెరిగిన ఓటింగ్ ఎటువైపు అని చెప్పడంలో లగడపాటి జోస్యంలో స్పష్టత కన్పించలేదు. మొత్తం మీద చంద్రబాబు గుప్పిట్లో చిక్కిన చిలుకలా లగడపాటి ఆయనకు అనుకూలంగా సర్వే జోస్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తన విశ్వసనీయతను పోగొట్టుకున్నారు. లగడపాటి అమ్ముడుపోయారనే ముద్ర వేసుకున్నారని ఓ రాజకీయ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. భ్రమ కల్పించే ఎత్తుగడ తెలంగాణ ఓటర్ స్పీడుగా మారుతున్నాడని భ్రమ కల్పించేందుకు లగడపాటి చాకచక్యంగా వ్యవహరించారు. నిన్న ఆలోచన ఈ రోజు లేదు, ఈ రోజుది రేపు ఉండదంటూ చెప్పారు. ఓటరును మార్చే మైండ్గేమ్ అందులో కన్పిస్తోంది. ఎక్కువ ఓటింగ్ జరిగితే అది కూటమికి అనుకూలమని చెప్పడం వెనుక కుట్ర తెలుస్తోంది. మొత్తం మీద ఓటర్లను ప్రభావితం చేసేలా చంద్రబాబుకు అనుకూలంగా లగడపాటి వ్యవహరించినట్టు వెల్లడవుతోంది. లగడపాటి సర్వేతో బెట్టింగ్ రాయుళ్ల కుదేలు ఆంధ్ర ఆక్టోపస్గా చెప్పుకునే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మీద ఉన్న నమ్మకం వందలాది మంది నిండా మునిగారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన చెప్పిన జోస్యం కారణంగా మహాకూటమిపై వందల కోట్ల రూపాయల బెట్టింగ్ కట్టిన వేలాది మంది చేతులు కాల్చుకుని లబోదిబోమంటున్నారు. మహాకూటమికే విజయావకాశాలు ఉన్నాయంటూ ఎన్నికల ముందు ఆయనతో సర్వే వివరాలు పలికిస్తే తటస్థ ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపుతారన్న తెలుగు తమ్ముళ్ల వ్యూహం బెడిసికొట్టడంతో ఆయన సామాజికవర్గమంతా గగ్గోలు పెడుతోంది. నమ్ముకుంటే నట్టేట ముంచాడంటూ వారంతా లోలోన రగిలిపోతున్నారు. ఇలా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో సుమారు రూ.1,200 కోట్లకు పైగా వారు నష్టపోయినట్లు అంచనా. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్ఎస్కు అనుకూల వాతావరణం ఏర్పడుతుండడంతో టీడీపీ నేతలు వెనకుండి లగడపాటితో సర్వే పేరుతో పాచికలు వేశారని వారంతా అనుమానిస్తున్నారు. మహాకూటమి గెలుస్తుందని పందాలు కట్టిన వారంతా చివరి నిమిషంలో టీఆర్ఎస్వైపు మారేందుకు ప్రయత్నాలు చేసినా, అప్పటికే సమయం మించిపోవడంతో వారికి పందాలు దొరకని పరిస్థితి నెలకొంది. సర్వే తుస్మందని ఓ వైపు అందరు అంటుంటే ఆయన మాత్రం మరోవిధంగా లబ్ధిపొందారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. -
కారు హోరు.. యమజోరు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉత్కంఠభరితంగా సాగిన శాసనసభ ఓట్ల లెక్కింపులో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. సంగారెడ్డి మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. పటాన్చెరు నుంచి గూడెం మహిపాల్రెడ్డి, నారాయణఖేడ్ నుంచి ఎం.భూపాల్రెడ్డి వరుసగా రెండో పర్యాయం శాసనసభకు ఎన్నికయ్యారు. జహీరాబాద్ నుంచి కోనింటి మాణిక్రావు, అందోలు నుంచి చంటి క్రాంతి కిరణ్ తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నియ్యారు. సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్రెడ్డి ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో విజయం సాధించారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగిన బీజేపీ, బీఎల్ఎఫ్ అభ్యర్థులు ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఉత్కంఠ భరితంగా ఓట్ల లెక్కింపు .. పటాన్చెరు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఓట్ల లెక్కింపు మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్రెడ్డి గెలుపొందారు. పటాన్చెరు నుంచి గూడెం మహిపాల్రెడ్డి, నారాయణఖేడ్ నుంచి ఎం.భూపాల్రెడ్డి వరుసగా రెండో పర్యాయం టీఆర్ఎస్ పక్షాన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు జహీరాబాద్ నుంచి కోనింటి మాణిక్రావు, అందోలు నుంచి పాత్రికేయుడు క్రాంతి కిరణ్ టీఆర్ఎస్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన దిగ్గజ నేతలు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (అందోలు), గీతారెడ్డి (జహీరాబాద్) ఓటమి పాలయ్యారు. పటాన్చెరు నియోజకవర్గంలో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న కాటా శ్రీనివాస్ గౌడ్ పరాజయం పాలయ్యారు. నారాయణఖేడ్లో జరిగిన ముక్కోణపు పోరులో టీఆర్ఎస్ గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ గెలుపొందిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు, అందోలులో భారీ మెజారిటీతో తమ సమీప ప్రత్యర్థిపై పైచేయి సాధించారు. బీఎల్ఎఫ్, ఇతరులు నామమాత్రమే జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించిన బీఎల్ఎఫ్ కూటమి, ఇతర పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. బీఎల్ఎఫ్ అభ్యర్థులు ఎక్కడా మూడంకెల సంఖ్యకు మించి ఓట్లు సాధించలేదు. 25 ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరూ ఓటర్లపై ప్రభావం చూపలేక పోయినట్లు ఓట్ల లెక్కింపులో బయట పడింది. ప్రభావం చూపని బీజేపీ అభ్యర్థులు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను నిలిపినా, నారాయణఖేడ్ మినహా మిగతా నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితంపై పెద్దగా ప్రభావం చూపిన దాఖలా కనిపించలేదు. నారాయణఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశించిన సంజీవరెడ్డి నామినేషన్ల చివరి రోజున బీజేపీలో చేరి టికెట్ను దక్కించుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో సంజీవరెడ్డి మూడో స్థానంలో నిలిచినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేశ్ షెట్కార్కు దీటుగా ఓట్లు సాధించారు. అందోలు నుంచి బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్, చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న పటాన్చెరు అభ్యర్థి కరుణాకర్రెడ్డి పెద్దగా ఓట్లు సాధించిన పరిస్థితి కనిపించలేదు. జహీరాబాద్ నుంచి చివరి నిమిషంలో టికెట్ సాధించిన జంగం గోపి 15వేలకు పైగా ఓట్లను సాధించారు. కారు.. జోరు సాక్షి, సిద్దిపేట: శాసనసభ ఎన్నికల ఫలితాల్లో సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాలతోపాటు, మానకొండూరు, జనగామ నియోజకవర్గాల్లో కూడా కారు జోరు కొనసాగింది. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో ప్రత్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా పోయింది. పోలైన ఓట్లలో అన్ని నియోజవర్గాల్లో కలిపి మొత్తం 65శాతం ఓట్లు టీఆర్ఎస్కే వేసి మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై విశ్వాసాన్ని రుజువు చేశారు. జిల్లాలో నాలుగు స్థానాల్లో పోటీ చేసిన కమలనాథులు కనీసం రెండవ స్థానంలో కూడా రాలేకపోవడం గమనార్హం. కూటమి అభ్యర్థులు పోటీ చేసిన దుబ్బాక, సిద్దిపేటల్లో దుబ్బాక అభ్యర్థి.. స్వతంత్ర అభ్యర్థుల కన్నా వెనకబడి ఉండటం.. సిద్దిపేట అభ్యర్థి మాత్రం రెండవ స్థానంలో నిలబడటం గమనార్హం. కారు స్పీడ్ను అందుకోలేని ప్రత్యర్థులు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం సునాయాసంగా సాగింది. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు టీఆర్ఎస్ అభ్యర్థుల మెజార్టీ కొనసాగుతూ వచ్చింది. చివరి వరకు ఇదే తంతు కొనసాగడంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులకు టీఆర్ఎస్ అభ్యర్థులు దరిదాపుల్లో కూడా లేకపోవడం కారు స్పీడుకు నిదర్శనం. సిద్దిపేట నియోజవర్గంలో మొత్తం 2,09,345 ఓట్లకు గాను 1,65,075 ఓట్లు పోల్ కాగా ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి తన్నీరు హరీశ్రావుకు 1,31, 295 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి మహాకూటమి బలపరిచిన టీజేఏఎస్ అభ్యర్థి మరికంటి భవానీరెడ్డికి 12,596 ఓట్లు వచ్చాయి. దీంతో హరీశ్రావు 1,18,699 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి నరోత్తం రెడ్డి 11,266 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గజ్వేల్ నియోకవర్గంలో మొత్తం 2,33,205 ఓట్లకు గాను 2,05,222 ఓట్లు పోలయ్యాయి. వీటిల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు 1,25,444 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్రెడ్డికి 67,154 వచ్చాయి. దీంతో కేసీఆర్ 58,290 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1,90,482 ఓట్లకు గాను 1,63,658 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డికి 89,299 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుండి రెబల్ అభ్యర్థిగా బరిలో దిగిన మద్దుల నాగేశ్వర్రెడ్డికి 26,799 ఓట్లు వచ్చాయి. దీంతో సోలిపేట రామలింగారెడ్డి 62,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మూడవ స్థానంలో భారతీయ జనతా పార్టీకి చెందిన రఘునందన్రావు 22,595 ఓట్లు వచ్చాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,22,431 ఓట్లకు గాను 1,85,003 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి ఒడితెల సతీష్కుమార్కు 1,17083 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి కూటమిలో భాగంగా సీపీఐ నుండి పోటీలో దిగిన చాడ వెంకట్రెడ్డికి 46,553 ఓట్లు వచ్చాయి. జిల్లాలోని కొమురవెల్లి, మద్దూరు, చేర్యాల మండలాల్లో ప్రాతినిథ్యం వహించే జనగామ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్యపై 29,568 ఓట్ల మెజార్టీతో ముత్తిరెడ్డి విజయం సాధించారు. 65 శాతం ఓట్లు టీఆర్ఎస్కే జిల్లాలో పోలైన ఓట్లలో అత్యధికంగా 65శాతం ఓట్లు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకే పడటం గమనార్హం. జిల్లాలో మొత్తం 8,55,453 ఓట్లకు గాను 7,18,958 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలుపు సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఉత్కంఠ పోరులో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్పై 2,638 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి జగ్గారెడ్డి తన సమీప ప్రత్యర్థిపై అతి తక్కువ ఓట్ల తేడాతో ఆధిక్యత చూపుతూ రావడం ఉత్కంఠను రేపింది. కేవలం తొలి ఒకటి రెండు రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థి కొంత ఆధిక్యతను కనబరిచినా, చివరి వరకు ఏ ఒక్క రౌండులోనూ కాంగ్రెస్పై పైచేయి సాధించలేకపోయారు. సంగారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థిగా ట్రక్కు గుర్తుపై పోటీ చేసిన పోలీసు రామచంద్రయ్య ఏకంగా నాలుగు వేలకు పైగా ఓట్లు సాధించడం.. టీఆర్ఎస్ అభ్యర్థి ఫలితాన్ని ప్రభావితం చేసింది. -
భువనగిరి జిల్లాపై గులాబీజెండా మరోమారు..
సాక్షి, యాదాద్రి : యాదాద్రిభువనగిరి జిల్లాపై గులాబీజెండా మరోమారు ఎగిరింది. ఉద్యమ కాలం నుంచి గులాబీ జెండాకు వందనం చేస్తున్న భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు మరోసారి జెండాను రెపరెపలాడించారు. ప్రజాకూటమికి ప్రజల అంగీకారం లభించలేదు. నిశ్శబ్ద విప్లవంలా అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ప్రభుత్వ పథకాలకు ఆమోదం తెలుపుతూ కారు గుర్తుకు ఓట్లు వేశారు. దీంతో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో ఆపార్టీ అభ్యర్థులు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీతామహేందర్రెడ్డి విజయం సాధించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదముద్ర వేస్తూ ప్రజలు తీర్పు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. సాగు, తాగునీటితోపాటు రైతుబంధు, ఆసరా పింఛన్లు, 24గంటల విద్యుత్, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, గొర్రెల, చేపల పంపిణీ వంటి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒక దిశలో తీవ్ర పోటీ ఇస్తుందనుకున్న ప్రజాకూటమి భారీ ఓటమి మూటగట్టుకుంది. తొలిరౌండ్ నుంచే ఆధిక్యత భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో తొలిరౌండ్ నుంచే టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోయారు. భువనగిరిలో 18రౌండ్లు, ఆలేరులో 22రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. భువనగిరి లో టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్రెడ్డి సమీప ప్రత్యర్థి కుంభం అనిల్కుమార్రెడ్డిపై 24,063ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే లెక్కింపులో భువనగిరి, భువనగిరిపట్టణం, బీబీ నగర్, పోచంపల్లి మండలాల్లో టీఆర్ఎస్కు సం పూర్ణ ఆధిక్యత లభించింది. పోచంపల్లి మండలం లో 16రౌండ్లలో ఆధిక్యత నిలుపుకోగా 17, 18 రౌండ్లలో వలిగొండ మండలంలో కాంగ్రెస్కు ఆధిక్యత లభించింది. ప్రజాకూటమి అభ్యర్థిగా పో టీ చేసిన కుంభం అనిల్కుమార్రెడ్డికి 61413 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పోతంశెట్టి వెంకటేశ్వర్లుకు 33,560 ఓట్లు వచ్చాయి. ఈసారి కాంగ్రెస్కు టీడీపీ, సీపీ ఐ, టీజేఎస్ పొత్తుతో పోటీలో నిలిచింది. అయితే ఆపార్టీకి గణనీయంగా 27, 853 ఓట్లు పెరిగాయి. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన యువతెలంగాణ అభ్యర్థి జిట్టా బాలకృష్ణారెడ్డికి 13,427ఓట్లు లభిం చాయి.గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 39,179ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలి చిన ఆయన ఈఎన్నికల్లో మూడోస్థానంతో సరిపె ట్టుకున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేసిన పోచంపల్లి రమణరావుకు 3,613 ఓట్లు రాగా, సీపీఎం తరపున పోటీ చేసిన కల్లూరి మల్లేశంకు 1856 ఓట్లు వచ్చాయి. ఆతర్వాత స్థానాల్లో ఆలకుంట్ల ఎల్లయ్య 1758, దేవరకొండ హన్మంతు 1305 ఓట్లు లభించాయి. నోటాకు 1347 వచ్చాయి. ఇం డిపెండెంట్ అభ్యర్థులు 1000లోపు ఓట్లు సాధించారు. ‘గొంగిడి’ రెండోసారి ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గొం గిడి సునీతామహేందర్రెడ్డి రెండోసారి విజయాన్ని సాధించారు. ఆమెకు 94, 870ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్కు 61,784 ఓట్లు రావడంతో గొంగిడి సునీత కాంగ్రెస్ అభ్యర్థిపై 33, 086 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో 31,389ఓట్లతో గొంగిడి సునీత కాంగ్రెస్ అభ్యర్థి భిక్షమయ్యగౌడ్పై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో భిక్షమయ్యగౌడ్కు 60,150ఓట్లు వచ్చాయి. గొంగిడి సునీతకు 91,539ఓట్లు వచ్చాయి. 31389మెజార్టీతో గెలి చారు. అయితే ఈఎన్నికల్లో బీఎల్ఎఫ్ తరఫున పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు 10,473ఓట్లతో తృతీయ స్థానంలో నిలి చారు. బీఎస్పీ తరఫున పోటీ చేసిన కల్లూరి రామచంద్రారెడ్డి 11,921ఓట్లను, బీజేపీ అభ్యర్థి దొంతిరి శ్రీధర్రెడ్డి 4,967ఓట్లను సాధించారు. పోటీలో ఉన్న మరో 9మంది ఇండిపెండెంట్లకు 5999 ఓట్లు లభించాయి. కాగా నోటాకు 1465మంది ఓటు వేసి పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరినీ అంగీకరించలేదు. ఫలించని కూటమి ప్రయత్నాలు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో కూటమి ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీజేఎస్ల కూటమిలో కాంగ్రెస్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయింది. అయితే కూటమి ఓటు బదిలీ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోవడంతో అధికార పార్టీకి లబ్ధి చేకూరగా, కూటమికి ఓటమి తప్పలేదు. ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్కు 2014 ఎన్నికల్లో 60,150 ఓట్లు రాగా ఇప్పుడు కూటమి అభ్యర్థిగా 61,784 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 1634 ఓట్లు మాత్రమే అదనంగా వచ్చాయి. కచ్చితమైన ఓటు బ్యాంకు కలిగిన కూట మిలోని పక్షాలైన టీడీపీ, సీపీఐల ఓట్లు ఏమైయ్యాయన్నది చర్చనీయాంశంగా మారింది. టీడీపీకీ చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీఎల్ఎఫ్ తరఫున ఇండిపెండెంట్గా రంగంలోకి దిగడంతో టీడీపీకి చెందిన ఓట్లు ఆయనకు బదిలీ అయ్యాయని ఆ పార్టీ నేతలు అంతర్మథనంలో ఉన్నారు. మోత్కుపల్లితో పాటు బీఎస్పీ అభ్యర్థి కల్లూరి రామచంద్రారెడ్డి, బీజేపీ అభ్యర్థి దొంతిరి శ్రీధర్రెడ్డి 27,361 ఓట్లను, ఇండిపెండెంట్లు 5999 ఓట్లు పొందారు. దీంతో వీరందరికీ 33,360 ఓట్లు వచ్చాయి. కూటమి అభ్యర్థి, ఇతర పార్టీల అభ్యర్థుల ఓట్లన్ని కలిపితే టీఆర్ఎస్ మెజార్టీ కంటే ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గం : ఆలేరు 2018లో విజేత : గొంగిడి సునీత (టీఆర్ఎస్) వచ్చిన ఓట్లు: 94870 ప్రత్యర్థి: బూడిద భిక్షమయ్యగౌడ్ (కాంగ్రెస్) వచ్చిన ఓట్లు: 61784 మెజార్టీ: 33086 2014 ఎన్నికల్లో : విజేత గొంగిడి సునీతకు వచ్చిన ఓట్లు : 91,539 ప్రత్యర్థి: బూడిద భిక్షమయ్యగౌడ్కు వచ్చిన ఓట్లు : 60150 మెజార్టీ : 31389 నియోజకవర్గం: భువనగిరి 2018లో విజేత: పైళ్ల శేఖర్రెడ్డి(టీఆర్ఎస్) వచ్చిన ఓట్లు: 85,476 ప్రత్యర్థి: కుంభం అనిల్కుమార్రెడ్డికి వచ్చిన ఓట్లు:61413 మెజార్టీ: 24,063 2014 ఎన్నికల్లో విజేత :పైళ్ల శేఖర్రెడ్డికి వచ్చిన ఓట్లు: 54,347 ప్రత్యర్థి :జిట్టా బాలకృష్ణారెడ్డి(స్వతంత్ర) వచ్చిన ఓట్లు: 39,179 మెజార్టీ: 15,168 -
కులపిచ్చితో కాదు.. కేసీఆర్ను చూసి ఓట్లేశారు : పోసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు కులపిచ్చితో కాకుండా సీఎం కేసీఆర్ సంక్షేమాన్ని చూసి ఓట్లేశారని సినీనటుడు పోసాని కృష్ణమురళి అభిప్రాయపడ్డారు. ఇదే విధంగా ఆంధ్రాలో ఉన్న కమ్మవారు.. మంచి నిజాయితీ ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం పోసాని తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సైంధవుడిగా వచ్చారు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టారు. సైంధవుడు-2గా లగడపాటి రాజగోపాల్ వచ్చారు. అయినా కేసీఆర్ చేసిన సంక్షేమమే ఆయనను గెలిపించింది. ప్రజాస్వామ్యం వైపు ఉండే గద్దర్.. ఈ ఎన్నికల్లో కూటమి తరఫున రావడం చూసి షాకయ్యాను. కేసీఆర్ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. కేసీఆర్ ఏం చెప్పాడో ఆ మంచి పనులను చేశారు. కాళేశ్వరం పూర్తైతే సగం తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి, మూడేళ్లలో ప్రజలకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆరే. ఆయనపై చేసిన విమర్శలను ప్రజలు తిప్పికొట్టారు. ఏపీలో తహసీల్దార్పై దాడి జరిగితే చంద్రబాబు పట్టించుకోలేదు. అదే కేసీఆర్ అనాథ బాలికకు అన్యాయం జరిగితే న్యాయం చేశారు. జగన్పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు పరామర్శించలేదు. కనీసం పలకరించలేదు కదా.. జగన్ కుటుంబంపై ఎదురు దాడి చేశారు. బాలకృష్ణ అంత పవర్ ఫుల్ అయితే సుహాసిని గెలిచి ఉండేది. లగడపాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం. కేసీఆర్, కేటీఆర్ల్లో సీఎం ఎవరైనా మంచి పాలన అందిస్తారు. ఏపీలో కేసీఆర్ పోటీ చేసినా.. నేను జగన్కు మద్దతిస్తా.. ఏపీలో జరిగే ఎన్నికల్లో వంద శాతం వైఎస్ జగన్ గెలుస్తారు. ఆయన చేపట్టిన పాదయాత్రకు భారీ ఆదరణ లభిస్తోంది. ఇంత ప్రజాదరణ దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్లకు కూడా రాలేదు. జగన్ పరిపక్వత గల నాయకుడు. ఆయన గెలిస్తే కుల పిచ్చి, రౌడీయిజం, దోపిడీలుండవు. రాష్ట్రం బాగుపడుతుంది. ఒకవేళ కేసీఆర్ ఏపీలో పోటీ చేసినా.. నా మద్దతు జగన్కే ఉంటుంది. ఆయన అవినీతి చేయలేదు. అన్యాయంగా ఇరికించారు. ఎంత మంది పోటీలో ఉన్నా ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగనే. ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్ ఎవరిదీ? ఓటుకు నోటు కేసులో ఉన్నది చంద్రబాబు వాయిస్ కాదా? రూ.50 లక్షలు రేవంత్ పట్టుకొచ్చి రెడ్హ్యాండేడ్గా దొరకలేదా? చంద్రబాబు కూడా ఆ వాయిస్ నాది కాదని చెప్పలేదు. అది ఆయన వాయిస్ అని జనాలు అంతా నమ్మారు కాబట్టే తెలంగాణ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారు. వైఎస్సార్సీపీకి మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేస్తే.. అద్భుతం. అఖండ విజయం వరిస్తోంది. కేసీఆర్ అంటే ఆంధ్రలో చాలా మందికి అభిమానం. చాలా ఓట్లు పడతాయి. రాష్ట్రాన్ని విడగొడుతున్నారని, కేసీఆర్పై కోపం పెంచుకున్నారు కానీ.. కేసీఆర్ సీఎంగా చేసిన పనులు చూసి అభిమానిస్తున్నారు. ఆయన రాజకీయ నాయుకుడే కాదు.. ప్రజల్లోకి వచ్చి జనాల్లో మాట్లాడి గెలిస్తేనే నేను రాజకీయ నాయకుడిగా పరిగణిస్తా. అడ్డదారిలో మంత్రి అయిన నారాలోకేశ్ నా దృష్టిలో రాజకీయ నాయకుడే కాదు. ఆయన తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు కాబట్టే టీడీపీ ఆ రెండు సీట్లన్న గెలుచుకుంది. వైఎస్ జగన్ను పదేపదే రెచ్చగొడితేనే ఆయన పవన్ కల్యాణ్ను విమర్శిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల మధ్యకు వెళ్లారు. ఆయనను ఊరికే పవన్ కల్యాన్ విమర్శించడం ఎందుకు?’ అని పోసాని ప్రశ్నించారు. -
సత్తుపల్లిలో విచిత్రమైన పరిస్థితి
సాక్షి, ఖమ్మం : ఈసారి సత్తుపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితి నెలకొంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కొలికపోగు స్వామికి 7,345 ఓట్లు వచ్చాయి. ఇవన్నీ టీఆర్ఎస్ కారు గుర్తుకు పడాల్సిన ఓట్లేనని.. ఓటర్లు తికమకపడటంతో ట్రక్కు గుర్తుకు పడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రతి రౌండ్లోనూ కనీసం 300లకు తగ్గకుండా 500 లోపు ఓట్లు రావటం ఆశ్చర్యానికి గురి చేసింది. 9వ రౌండ్లో కారు గుర్తుకు 638 మెజార్టీ రాగా ట్రక్కు గుర్తుకు 454 ఓట్లు, 10వ రౌండ్లో కారుకు 624 ఓట్లు మెజార్టీ, ట్రక్కుకు 614 ఓట్లు, 11వ రౌండ్లో కారుకు 1,029 ఓట్లు మెజార్టీ రాగా ట్రక్కుకు 462 ఓట్లు రావటం విశేషం. 9 మందికి డిపాజిట్ దక్కలేదు.. సత్తుపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 2,22,711 ఓట్లకు గాను 1,96,740 ఓట్లు పోల్ అయ్యాయి. 1,450 మంది పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్నారు. వీటిలో 96 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు చెల్లలేదు. సండ్ర వెంకటవీరయ్యకు 1,00,044 ఓట్లు, పిడమర్తి రవికి 81,042 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి కొలికపోగు స్వామికి 7,345 ఓట్లు, బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావు 1,380 ఓట్లు, బీఎల్ఎఫ్ అభ్యర్థి మాచర్ల భారతికి 2,670 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులు తక్కువ ఓట్లతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. -
టీఆర్ఎస్ జయకేతనం
ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. మొత్తం తొమ్మిది స్థానాల్లో ఎనిమిది టీఆర్ఎస్ కైవసం కాగా, ఒక్క ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ కేవలం టీఆర్ఎస్ అభ్యర్థిపై వ్యతిరేకతతోనే ఓటమి చెందినట్లు తెలుస్తోంది. బీజేపీ ఈ ఎన్నికల్లో ఖాతానే తెరవలేకపోయింది. బాన్సువాడ నుంచి బరిలోకి దిగిన మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. జుక్కల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే జిల్లాలో భారీ మెజారిటీ సాధించారు. కామారెడ్డి నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి గంపగోవర్ధన్ మండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీపై అతితక్కువ మెజారిటీతో గెలుపొందారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : గులాబీ గుబాళించింది. టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగింది. నువ్వా.. నేనా.. అన్న రీతిలో కొనసాగిన పోరులో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులను మట్టి కరిపించారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాను క్లీన్స్వీప్ చేసిన టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో కూడా దాదాపు అదే ఫలితాలు పునరావృతమయ్యాయి. ఎనిమిది చోట్ల పరాజయం పాలైన కాంగ్రెస్ ఒక్క ఎల్లారెడ్డి స్థానంతో సరిపెట్టుకోగలిగింది. బాల్కొండలో ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. బీజేపీ ఈ ఎన్నికల్లో జిల్లాలో ఖాతానే తెరవలేకపోయింది. దాదాపు ఎనిమిది చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. బాల్కొండలో బీ ఎస్పీ కొంత పోటీని ఇవ్వగలిగింది. ఉమ్మడి జిల్లా వాసులు ఈ ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి పట్టం గట్టారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా ముం దుకెళుతున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు తిరుగులేని విజయాన్ని అందించారు. గులాబీ పార్టీకి ఇందూ రు కంచుకోట అని మరోమారు రుజువైంది. మంత్రి పోచారం నాలుగోసారి.. బాన్సువాడ నుంచి బరిలోకి దిగిన మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్రాజ్పై భారీ మెజారిటీతో గెలుపొందారు. బాల్కొండలో మిషన్భగీరథ మాజీ వైస్ చైర్మన్, టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన ముత్యాల సునీల్రెడ్డి రెండో స్థానంలో నిలువగలిగారు. ఆర్మూర్లో విజయం సాధించిన ఆశన్నగారి జీవన్రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్సీ ఆకుల లలిత రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ అభ్యర్థి, డీసీసీ మాజీ అధ్యక్షులు తాహెర్బిన్ హందాన్పై టీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్గుప్త జయకేతనం ఎగురవేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విజయం సాధించారు. జుక్కల్ (ఎస్సీ) నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్షిండే కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాంపై గెలుపొందారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ విజయం.. ఉమ్మడి జిల్లా పరిధిలో కాంగ్రెస్పార్టీ ఒక్క ఎల్లారెడ్డి స్థానంలో సరిపెట్టుకుంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి జాజాల సురేందర్ ఘన విజయం సాధించారు. ఎల్లారెడ్డిలో టీఆర్ఎస్ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత.., సురేందర్పై సానుభూతి కాంగ్రెస్ విజయానికి దోహదం చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరాజయం పాలైన అగ్రనేతలు.. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు సైతం ఈ ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కామారెడ్డిలో పరాజయం పాలయ్యారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ హ్యాట్రిక్ విజయం సాధించారు. బోధన్లో మాజీ మంత్రి పి సుదర్శన్రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన షకీల్ అమేర్ గెలుపొందారు. కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్గాంధీ ప్రచార సభలు కామారెడ్డి, ఆర్మూర్లలో నిర్వహించారు. ఈ స్థానాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. కమల దళానికి డిపాజిట్లు గల్లంతు.. కమల దళం జిల్లాలో ఖాతా తెరవలేదు. జిల్లాలో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన బీజేపీ బాల్కొండ, బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి వంటి స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. ఈ స్థానాల్లో వారికి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. కాస్త పట్టున్న నిజామాబాద్ అర్బన్లో కూడా మూడో స్థానంతో సరిపెట్టుకోగలిగారు. జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రధాని నరేంద్రమోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్షా వంటి అగ్రనేతల ప్రచార సభలు నిర్వహించినా కనీసం ఫలితం లేకుండా పోయింది. పలువురు కేంద్ర మంత్రులు, ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, జుక్కల్లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడనవీస్, ఛత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్ తదితరులు కూడా ప్రచార సభలు కొనసాగినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. బాల్కొండలో రెండో స్థానంలో బీఎస్పీ.. బాల్కొండ స్థానంలో బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన ముత్యాల సునీల్రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. గతంలో టీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన సునీల్రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ ఈ స్థానం నుంచి ఈరవత్రి బరిలోకి దిగడంతో ఆ యన బీఎస్పీ నుంచి పోటీ చేసిన విషయం విదితమే. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఈరవత్రి అనీల్ మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం. -
మంత్రి ఓటమితో టీఆర్ఎస్లో అంతర్మథనం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా రాజకీయాలతో సుదీర్ఘ అనుబంధాన్ని పెనవేసుకుని అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలుపొందడంతోపాటు జిల్లాలో టీడీపీ, టీఆర్ఎస్ హయాంలో రాజకీయ చక్రం తిప్పిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఎన్నికల్లో అనూహ్య రీతిలో ఓటమి చెందారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్రెడ్డిపై ఏడువేల పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం చెందడం జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 1983లో టీడీపీలో చేరడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తుమ్మల.. గెలుపోటములను అనేకసార్లు చవిచూశారు. సత్తుపల్లి, ఖమ్మం వంటి నియోజకవర్గాల్లో పలుసార్లు గెలిచారు... ఓడారు. 2016 ఉప ఎన్నికల నుంచి పాలేరు నియోజకవర్గంతో ముడిపడిన రాజకీయ అనుబంధం.. అభివృద్ధిపై తన ముద్ర ఉండాలన్న తపన పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగిరపరిచిన పరిస్థితులు దృష్ట్యా ఆయన విజయం సాధిస్తారని పార్టీ వర్గాలు విశ్వసించాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గల సంప్రదాయ ఓటు బ్యాంకు, అభ్యర్థి స్థానికత వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపించాయని, దానికి తోడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ పోరు పార్టీని బలహీనపరిచేలా చేసి ఓటమి అంచుకు చేర్చిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. మంత్రిగా తుమ్మల చేసిన అభివృద్ధిని వేనోళ్ల కీర్తించిన పార్టీ నేతలు, తమ మండలాల్లో ఆ స్థాయిలో ఓట్ల రూపంలో ప్రభావాన్ని చూపలేకపోవడానికి గల కారణాలపై పార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది. మంత్రి తుమ్మల అత్యంత ప్రీతిపాత్రంగా భావించి వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన తిరుమలాయపాలెం మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఆశించిన మెజార్టీ రాకపోవడం సైతం పార్టీ శ్రేణులను నిస్తేజానికి గురిచేసింది. కనీసం పదివేల మెజార్టీ ఈ మండలంలో లభిస్తే.. ప్రతికూల మండలాల్లో కొంత మెజార్టీ తగ్గినా గెలుపునకు ఢోకా ఉండదని రాజకీయ అంచనాలు వేశారు. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండడాన్ని తుమ్మల సహా పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. మంత్రి తుమ్మల కొంత కలుపుగోలుగా, కార్యకర్తలకు సన్నిహితంగా ఉండాలని నియోజకవర్గం కోరుకున్నదని, దాని ప్రభావం సైతం ఈ ఎన్నికలపై పడిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను పాలేరు నియోజకవర్గానికి చేయగలిగిన అభివృద్ధి చేశానని, తిరుమలాయపాలెం వంటి మండలంలో కరువు ఛాయలు రూపుమాపడానికి నిరంతరం శ్రమించానని ఫలితాల అనంతరం సన్నిహితులతో జరిగిన సమీక్షలో తుమ్మల అభిప్రాయపడినట్లు సమాచారం. తుమ్మల నాగేశ్వరరావు 1983లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మొదటి సారి పోటీచేసి ఓటమి చెందారు. 1985లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి, ఎన్టీ రామారావు మంత్రివర్గంలో చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో టీడీపీ అభ్యర్థిగా సత్తుపల్లి నుంచి ఓడిపోయారు. 1994లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1996 నుంచి 99 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో భారీ, మధ్య తరహా నీటి పారుదల శాఖ మంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో తిరిగి సత్తుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై ఓడిపోయారు. 2009లో నియోజకవర్గ పునర్విభజన కారణంగా సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో ఆయన ఖమ్మం నియోజకవర్గంలో టీడీపీ నుంచి విజయం సాధించారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్పై ఓడిపోయారు. ఆ సమయంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా తుమ్మలకు పేరుండటంతో తుమ్మ ల 2014 సెప్టెంబర్ 5వ తేదీన టీడీపీకి రాజీనా మా చేసి టీఆర్ఎస్లో చేరారు. చేరిన కొద్ది కాలానికే కేసీఆర్ మంత్రివర్గంలో అవకాశం లభించింది. రహదారులు, భవనాలు శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పి.. తుమ్మలకు ఎమ్మెల్సీ అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు. 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అదే నియోజకవర్గాన్ని రాజకీయ సుస్థిర స్థానంగా పెంపొందిం చుకోవడం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి దృష్టి సారించవచ్చునని భావించిన తుమ్మల, ప్రధాన సమస్యలపై దృష్టి సారించి భక్త రామదాసు ప్రాజె క్టు వంటి పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయిం చారు. తుమ్మల ఓటమికి కారణాలపై మాత్రం ఎవరి రీతిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు. -
గులాబీ రెపరెప..!
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనం గులాబీ జెండా ఎత్తారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదిన ఈ జిల్లా మళ్లీ టీఆర్ఎస్కే జైకొట్టింది. రాజకీయ ఉద్ధండుల కోటగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కారుజోరును కొనసాగించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 శాసనసభ నియోజకవర్గాలుండగా.. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ 11 చోట్ల విజయఢంకా మోగించింది. గత ఎన్నికల్లో జగిత్యాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే.. ఈసారి అక్కడ ఓడి మంథనిలో గెలిచి తిరిగి ఒక్క స్థానానికే పరి మితం అయ్యింది. రామగుండంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మిగి లిన 11 స్థానాల్లో గులాబీ గుబాళించింది. 2014 ఎన్నికల్లో ఈ జి ల్లాలో టీఆర్ఎస్ 12 స్థానాలు దక్కించుకుని ఒకే ఒక్క నియోజకవర్గాన్ని కోల్పోగా.. ఈసారి రెండుస్థానాలను చేజార్చుకుంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరుమంత్రులు ఈసారీ భారీ ఆధిక్యతతో విజయ విహారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి ఆ పార్టీలో కొసాగుతున్న మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో విజయం సాధించారు. ఈటలకు పోటీగా ప్రజాకూటమి నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి బంధువు కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ తరఫున బరిలోకి దించారు. ఆదినుంచి ఆధిక్యంలో దూసుకెళ్లిన ఈటల రాజేందర్ 43,401 ఓట్లకు పైచిలుకు మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందడం ఇది ఆరోసారి. సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో మరోసారి విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కేకే. మహేందర్రెడ్డిపై కేటీఆర్ జయకేతనం ఎగురవేశారు. 2009 నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతున్న కేటీఆర్ 2010 ఉప ఎన్నికతోపాటు 2014 ఎన్నికల్లోనూ సిరిసిల్ల నుంచే గెలుపొందారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ విజయం సాధించారు. ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా హుస్నాబాద్ స్థానం సీపీఐకి కేటాయించగా.. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి చాడ వెంకటరెడ్డి ఓటమి చెందారు. కోరుట్ల నియోజకవర్గంలో తాజామాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్రావు విజయం సాధించారు. ఇక్కడ ప్రజాకూటమి నుంచి కాంగ్రెస్ తరఫున జువ్వాడి నర్సింగారావుపై గెలపొందారు. ధర్మపురి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీచేసిన టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనూ తలపడ్డాయి. ఈసారి 441 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో లక్ష్మణ్కుమార్పై కొప్పుల ఈశ్వర్ మరోసారి గెలుపొందారు. పెద్దపల్లి నియోజకవర్గంలో తాజామాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ మహాకూటమి తరఫున కాంగ్రెస్ నుంచి చింతకుంట విజయ రమణారావు, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పోటీ చేయగా ముక్కోణపు పోటీలో దాసరి గెలుపొందారు. వేములవాడలో టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్బాబు గెలుపొందారు. తొలుత రమేశ్బాబుకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వచ్చినా.. చివరకు ప్రజాకూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఆది శ్రీనివాస్పై విజయం సాధించారు. ఓటమి చెందిన రాజకీయ దిగ్గజాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్దండులు, సీనియర్లు పలువురు ఈసారి ఓటమి చెందారు. ఇందులో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ నేతలూ ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నియోజకవర్గంగా ఉన్న జగిత్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్కుమార్ విజయబావుటా ఎగురవేశారు. గత ఎన్నికల్లో కరీంనగర్ మొత్తంలో ఈ ఒక్క స్థానంలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా టి.జీవన్రెడ్డి గెలిచారు. ఆ సీటును ఈసారి టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముమ్మరంగా ప్రచారం సాగించింది. ఫలితంగా జగిత్యాలలో ఆరుసార్లు గెలిచిన జీవన్రెడ్డి ఈసారి ఓటమిపాలయ్యారు. కరీంనగర్ నియోజకర్గంలో ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ప్రజాకూటమి తరఫున బరిలోకి దిగిన కాంగ్రెస్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఓటమి చెందారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన బండి సంజయ్ తాజా ఎన్నికల్లోనూ రెండోస్థానంలోనే ఉన్నారు. హుస్నాబాద్ నుంచి ప్రజాకూటమి తరఫున పోటీ చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీష్కుమార్ చేతిలో ఓడిపోయారు. మానకొండూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ విప్ ఆరెపల్లి మోహన్ ఓటమి చెందారు. రసమయి, ఆరెపల్లి మధ్య పోరు రసవత్తరంగా సాగింది. చొప్పదండి నుంచి టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్ను వీడి బీజేపీ నుంచి పోటీ చేసిన బొడిగ శోభ.. ఒకసారి టీడీపీ, రెండోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మేడిపల్లి సత్యం కూడా ఓటమి చెందారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డికి ఫలితాల్లో చేదు అనుభవం ఎదురైంది. మంథనిలో మాజీమంత్రి.. అసెంబ్లీకి జిల్లానుంచి కొత్తగా ముగ్గురు మాజీమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్బాబు మంథనిలో విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి తాజామాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బరిలోకి దిగగా.. ప్రజాకూటమి తరఫున శ్రీధర్బాబు పోటీ చేశారు. మంథని నియోజకవర్గంలో ఈసారి కూడా పాత ప్రత్యర్థుల మధ్యే పోరుజరగ్గా.. గత ఎన్నికల్లో మధుకర్పై ఓటమి చవిచూసిన శ్రీధర్ బాబు ఈసారి విజయం సాధించారు. అలాగే రామగుండంలో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్పటేల్ 20వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. చందర్ గతంలో టీఆర్ఎస్లో ఉన్నారు. తాజా ఎన్నికల్లో చందర్కు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన ఆయన ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి జిల్లా నుంచి కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ లో అడుగుపెట్టనున్నారు. రామగుండం నుంచి ఫార్వర్డ్బ్లాక్ పార్టీ టికెట్పై గెలుపొందిన కోరుకం టి చందర్, చొప్పదండి, జగిత్యాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలుపొందిన సుంకె రవిశంకర్, సంజయ్కుమార్ అసెంబ్లీకి వెళ్తున్నారు. వరుస విజయాలతో ఈటల డబుల్ హ్యాట్రిక్ ఈ ఎన్నికల్లో అరుదైన రికార్డులను టీఆర్ఎస్ నేతలు తమ ఖాతాలో వేసుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్లో విజయబావుటా ఎగురవేసి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అలుపెరుగని గెలుపుతో వరుస విజయాలను తన సొంతం చేసుకున్నారు. 2004లో కమలాపూర్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత అక్కడి నుంచి 2008 ఉప ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఆ తర్వాత అనూహ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గానికి రాజకీయ మకాం మార్చిన ఈయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో వరుస విజయాలతో సత్తా చాటారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజా మాజీ చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ ఏడోసారి పోటీ చేశారు. ఒకేసారి ఓడిన ఈయన వరుస విజయాలు సాధించారు. రద్దైన మేడారం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ తరఫున 1994లో తొలిసారి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత 2004లో రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థిగా మారి ఎమ్మెల్యేగా తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 2008 ఉప ఎన్నికల్లో విజేతగా నిలిచారు. తరువాత ధర్మపురి నియోజకవర్గానికి మారిన ఆయన 2009, 2010(ఉప ఎన్నిక), 2014లో వరుస విజయాలతో దూసుకెళ్లారు. ఈ ఎన్నికల్లో ధర్మపురి నుంచి ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. నాలుగోసారి గెలిచిన కేటీఆర్, రమేష్బాబు, కేవీఆర్.. హ్యాట్రిక్ వీరుడు గంగుల ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిచిన కేటీఆర్ సిరిసిల్ల ఖిల్లాను పదిలం చేసుకున్నారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కేకే.మహేందర్రెడ్డిపై జయకేతనం ఎగురవేశారు. 2009 నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతున్న కేటీఆర్.. 2010 ఉప ఎన్నికతోపాటు 2014 ఎన్నికల్లోనూ సిరిసిల్ల నుంచే గెలుపొందారు. తాజాగా మరోసారి గెలుపొందిన కేటీఆర్ నాలుగోసారి విజయదుందుభి మోగించారు. వేములవాడ తాజామాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుతోపాటు మంత్రి కేటీఆర్ 2009, 2010 (ఉప ఎన్నిక), 2014 ఎన్నికల్లో వరుస గెలిచి హ్యాట్రిక్ సాధించారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల విద్యాసాగర్రావు 2009లో కోరుట్ల నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో గెలిచిన ఈయన రద్దైన మెట్పల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈ సారి ఐదో ప్రయత్నంగా పోటీకి సై అన్నారు. దుద్దిళ్ల శ్రీధర్బాబు 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2014లో ఓటమి చెందిన ఆయన ఈ ఎన్నికల్లో ఐదోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ నాలుగోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 2009లో టీడీపీ నుంచి కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన గంగుల కమలాకర్ 2014లో టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి పోటీచేసి హాట్రిక్ కొట్టారు. కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా ఓటమి ఎరగని నేతగా రికార్డు సొంతం చేసుకున్నారు. రసమయి బాలకిషన్, దాసరి మనోహర్రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. మేడారం నుంచి ఒకసారి.. ధర్మపురి నుంచి గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందిన అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ఈ ఎన్నికల్లో ఆఖరి నిముషంలో దురదృష్టం వెంటాడింది. ఫలితంగా 441 ఓట్ల స్వల్ప తేడాతో మళ్లీ ఓటమి పాలయ్యారు. -
మహబూబ్నగర్ క్లీన్ స్వీప్ !
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : జిల్లాలో కారు జోరు సాగింది. జిల్లాలోని మొత్తం ఐదు స్థానాలను టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసింది. గులాబీ సృష్టించిన సునామీకి ప్రతిపక్ష పార్టీలు చెల్లాచెదురయ్యాయి. ఎక్కడ కూడా ప్రతిపక్షాలు ఎదురొడ్డి నిలిచిన దాఖలాలు కనిపించలేదు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతీ రౌండ్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్లారు. టీఆర్ఎస్ ధాటికి కాంగ్రెస్, టీడీపీ ఎక్కడా పోటీలో నిలవలేక చేతులెత్తేశాయి. ఇదిలా ఉంటే.. ఈసారి ఓట్లే కాదు సీట్లు సైతం గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ సైతం బేల మొహం వేసింది. పోటీ చేసిన చోటల్లా బీజేపీ నేతలకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం గమనార్హం. మరోవైపు టీఆర్ఎస్ నేతలు మాత్రం రికార్డు స్థాయిలో మెజార్టీలు సాధించారు. కారు.. టాప్ గేరు మహబూబ్నగర్ జిల్లాలోని అయిదు స్థానాల్లో ‘కారు’ టాప్గేర్లో దూసుకెళ్లింది. అన్ని చోట్ల కూడా రికార్డు స్థాయిలో మెజార్టీతో గెలుపొందింది. పోలైన ఓట్లలో మూడో వంతు శాతం టీఆర్ఎస్ నేతలకే దాఖలయ్యాయి. ఫలితంగా మిగతా పార్టీలకు చెందిన అభ్యర్థులు ఘోరమైన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే వి.శ్రీనివాస్గౌడ్ రికార్డు స్థాయిలో 57,775 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి బరిలో ఉన్న ఎర్ర శేఖర్ కేవలం 28,047 ఓట్లు మాత్రమే లభించాయి. అలాగే మక్తల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రాంమోహన్రెడ్డికి మొదట్లో అసంతృప్త జ్వాలలు ఎదురైనా భారీ మెజార్టీతో గెలుపొందారు. మక్తల్లో ఆయన 47వేల పైచిలుకు మెజారిటీతో జిల్లాలో రెండో అత్యధిక మెజారిటీ సాధించారు. వీరితో పాటు జడ్చర్ల నుంచి బరిలో ఉన్న మంత్రి లక్ష్మారెడ్డికి 45వేల మెజార్టీ దక్కగా, దేవరకద్ర నుంచి పోటీ చేసిన ఆల వెంకటేశ్వర్రెడ్డికి 34వేలు, నారాయణపేట నుంచి పోటీ చేసిన ఎస్.రాజేందర్రెడ్డికి 15వేల మెజార్టీతో గెలుపొందారు. రెండు చోట్ల వారే పోటీ టీఆర్ఎస్ ధాటికి ఎదురొడ్డి రెండు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులే గట్టి పోటీ ఇవ్వడం గమనార్హం. నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో స్వతంత్య్ర అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. నారాయణపేటలో కాంగ్రెస్ అభ్యర్థి పూర్తిగా చేతులెత్తేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సరాఫ్ కృష్ణ కేవలం 6,322 ఓట్లతో డిపాజిట్ సైతం కోల్పోయారు. పేటలో టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థిగా బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేసిన కుంభం శివకుమార్రెడ్డి 53,307 ఓట్లు సాధించి గట్టి సవాల్ విసిరారు. అలాగే మక్తల్లో కూడా టీఆర్ఎస్కు ప్రధాన పార్టీలు ఎదురు నిలవలేకపోయాయి. స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసిన ఎం.జలేందర్రెడ్డి గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఇక జలేందర్రెడ్డి 29,841 ఓట్లు తెచ్చుకొని రెండో స్థానంలో నిలవగా.. మక్తల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం 26,141 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. పోటీ ఇవ్వలేకపోయిన బీజేపీ ఈసారి జిల్లాలో ఓట్లతో పాటు సీట్లు సైతం గెలుపొందాలని గంపెడాశలు పెట్టుకున్న బీజే పీకి తీవ్ర నిరాశే ఎదురైంది. పోటీ చేసిన ఐదు స్థానాల్లో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కేవలం నారాయణపేట, మక్తల్లో మాత్ర మే డిపాజిట్లు తెచ్చుకుంది. మిగతా మూడు చోట్ల మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్రలో డిపాజిట్లు సైతం కోల్పోయింది. మహబూబ్నగర్లో పోటీ చేసిన అభ్యర్థి కేవలం 5,704 ఓట్లు మాత్రమే దక్కాయి. అలాగే జడ్చర్ల నుంచి బరిలో ఉన్న అభ్యర్థికి 3,574, దేవరకద్ర నుంచి బరిలో ఉన్న అభ్యర్థికి 4,972 మాత్రమే ఓట్లు పడ్డాయి. కాస్త నయంగా నారాయణపేట నుంచి బరిలో ఉన్న రతంగ్పాండు రెడ్డికి 19,969 ఓట్లు పోలయ్యాయి. అలాగే మక్తల్ నుంచి పోటీ చేసిన కొండయ్యకు 19,801 ఓట్లు వచ్చాయి. ఇలా వీరిద్దరు మాత్రమే జిల్లాలో డిపాజిట్లు దక్కించుకున్నారు. మిగతా ముగ్గు రు డిపాజిట్లు సైతం కోల్పోయారు. -
సినీ హీరోలకన్నా కేసీఆర్ అందగాడు : వర్మ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్పై వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రశంసల జల్లు కురిపించారు. ‘సినీ హీరోయిన్ల కన్నా కేసీఆరే అందంగా ఉంటారని నేను ఎప్పుడు నమ్మేవాడిని, కానీ తాజా ఫలితాలు చూస్తే కేసీఆర్ సినీ హీరోల కన్నా అందగాడని, హిమాలయాలకన్నా ఆకర్షనీయుడనిపిస్తోందనని ట్వీట్ చేశారు. I always maintained that KCR was more beautiful than all heroines but now I think he’s more handsome than all heroes and more attractive than all the Himalayas. — Ram Gopal Varma (@RGVzoomin) December 12, 2018 గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహం పెడితే మాత్రం తెలంగాణలో దానికి రెండు రెట్లు కేసీఆర్ విగ్రహం పెట్టాలని మరో ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే ఒక స్పూఫ్ వీడియోను కేటీఆర్కు ట్యాగ్ చేస్తూ.. ‘ హే కేటీఆర్ మీ డాడీ.. 2.0 కాదు.. రజనీకాంత్ కన్నా 20 రెట్లు.. మహేశ్ బాబు కన్నా 200 రెట్లు.. చంద్రబాబు నాయుడు కన్నా 2వేల రెట్లు ఎక్కువ.’ అని ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ఈ విషయం నాకప్పుడే తెలుసని బదులిచ్చారు. If Modi put the tallest statue in Gujarat, Telangana should put 2.0 times higher statue of KCR — Ram Gopal Varma (@RGVzoomin) December 12, 2018 Hey @KTRTRS ,ur father KCR is not 2.0 but he is 20.0 times @rajinikanth 200.0 times @urstrulyMahesh and 2000.0 times bigger than @ncbn pic.twitter.com/D7YWWLDhlz — Ram Gopal Varma (@RGVzoomin) December 11, 2018 తెలంగాణ ఎన్నికల్లో 88 సీట్లతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్, ఆ పార్టీ అధినేతపై సాధారణ ప్రజలు, రాజకీయా,సినీ, క్రీడా ప్రముఖులు ట్విటర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్టార్ హీరో మహేశ్ బాబు, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, డీఎంకే అధినేత స్టాలిన్, తదితరులు కేసీఆర్ను ప్రశంసిస్తూ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేయగా.. మంత్రి కేటీఆర్ వాటన్నిటికి స్పందింస్తూ ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: బండ్ల గణేశా.. ఎక్కడా?) -
పని చేయని గులాబీ ప్రభంజనం
సాక్షి, ఖమ్మం : శాసనసభ ఎన్నికల్లో ప్రజలు అంతిమ తీర్పునిచ్చారు. గెలుస్తామని ధీమాగా ఉన్న దిగ్గజాలను ఓటమిబాట పట్టించారు.. కొత్త నేతలను అక్కున చేర్చుకుని అసెంబ్లీ బాట చూపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కొనసాగిన ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఎనిమిది స్థానాలను ప్రజాకూటమి కైవసం చేసుకోగా.. ఖమ్మంలో టీఆర్ఎస్.. వైరాలో స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టారు. ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠగా కౌంటింగ్ కేంద్రం ఎదుట ఎదురుచూసిన ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు.. తమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు గెలుపొందడంతో ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. పరస్పరం ఆలింగనం చేసుకుంటూ.. రంగులు చల్లుకుంటూ.. బాణసంచా కాలుస్తూ.. స్వీట్లు పంచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు విశిష్ట.. విలక్షణ తీర్పునిచ్చారు. టీఆర్ఎస్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రభంజనాల పర్వంలో టీఆర్ఎస్ సత్తా చాటుకుంటుందని భావించినా.. జిల్లా ఓటర్లు మాత్రం ఆ పార్టీని అనూహ్యంగా ఒక్క సీటుకే పరిమితం చేశారు. పార్టీలో నెలకొన్న ఇంటిపోరే కొంపముంచిందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనికి నిదర్శనమే స్వల్ప తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలు అని విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో అనేక రాజకీయ పక్షాలకు అసెంబ్లీకి వెళ్లే అవకాశం లభించగా.. ఈసారి మూడే మూడు పక్షాలకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఒకే ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోవడం.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ.. కాంగ్రెస్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పువ్వాడ అజయ్కుమార్.. తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 10,991 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి టీఆర్ఎస్ తరఫున జిల్లాలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసిన కందాళ ఉపేందర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి.. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 7,669 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక హోరాహోరీ పోరు సాగిన మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క.. వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఆయన 3,567 ఓట్ల మెజార్టీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన లింగాల కమల్రాజ్ ప్రతిరౌండ్లో గట్టి పోటీ ఇవ్వడం.. ఏ రౌండ్లో ఎవరు వెనుకబడతారో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతో క్షణ క్షణం ఉత్కంఠ రేపింది. సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సండ్ర వెంకటవీరయ్య 19,002 ఓట్ల ఆధిక్యంతో వరుసగా మూడోసారి గెలిచారు. ఆయన సమీప ప్రత్యర్థి.. టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవికి 81,210 ఓట్లు లభించాయి. ఒకటి, రెండు రౌండ్లలో పిడమర్తి రవి కొంత ఆధిక్యత చూపినా.. మిగతా అన్ని రౌండ్లలో సండ్ర వెంకటవీరయ్య ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. ఇక అత్యంత ఉత్కంఠ భరితంగా కొనసాగిన వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి లకావత్ రాములునాయక్.. 2,013 ఓట్ల మోజార్టీతో తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్లాల్పై గెలుపొందారు. ఖమ్మం జిల్లాలో గెలుపొందిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో సత్తుపల్లి, ఖమ్మం, మధిర నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గత శాసనసభలోనూ సభ్యులుగా ఉండగా.. వారు మరోసారి అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించే అవకాశం ప్రజలు కల్పించారు. ఇక పువ్వాడ అజయ్కుమార్ రెండోసారి ఖమ్మం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తొలిసారిగా.. పాలేరు నుంచి గెలుపొందిన కందాళ ఉపేందర్రెడ్డి, వైరా నుంచి గెలుపొందిన లావుడ్యా రాములునాయక్ శాసనసభలో తొలిసారి ప్రవేశించనున్నారు. ఇదే రీతిలో ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఓటర్ల తీర్పు విశిష్టతను చాటిచెప్పింది. కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాల్లో ఏకపక్ష తీర్పు ఇవ్వడం.. ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడంతో.. ఆ జిల్లాలో అధికార పక్షమైన టీఆర్ఎస్కు ఒక్కసీటు లభించని విచిత్రమైన పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన కొత్తగూడెంలో ఈసారి కాంగ్రెస్ పాగా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి జలగం వెంకటరావుపై విజయం సాధించగా.. భద్రాచలంలో కాంగ్రెస్ అభ్యర్థిగా 20 రోజుల క్రితమే అడుగిడిన పార్టీ సీనియర్ నేత పొదెం వీరయ్య అనూహ్య రీతిలో విజయం సాధించారు. ఇక ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థిగా బాణోతు హరిప్రియ, పినపాకలో రేగా కాంతారావు విజయం సాధించడంతో ఆ జిల్లాలో టీఆర్ఎస్కు శాసనసభ స్థానమే లేని పరిస్థితి నెలకొనడం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో ఈ పరిస్థితి రావడంపై గులాబీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ‘పువ్వాడ’పైనే.. జిల్లాలో గత ఎన్నికల అనంతరం ఎటువంటి పరిస్థితి ఉందో.. ఈసారి సైతం అదే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్న రాజకీయ వర్గాలు ఈసారి జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన పువ్వాడ అజయ్కుమార్కు రాజకీయ చక్రం తిప్పే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఆయనకు కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉందనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. మంత్రి తుమ్మల ఓటమి భారంతో ఉన్న క్షణంలో సీఎం కేసీఆర్ ఫోన్ చేసి హైదరాబాద్కు పిలిపించుకోవడం రాజకీయంగా కొంత చర్చనీయాంశంగా మారినా.. పువ్వాడ అజయ్కుమార్కు పార్టీలోని యువ నేతతో ఉన్న సన్నిహిత సంబంధాలు రాజకీయ అందలానికి అవకాశం కల్పిస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ దాదాపు పది రౌండ్ల వరకు ఎన్నికల ఫలితాలపై ఊపిరి బిగబట్టాల్సిన పరిస్థితే నెలకొంది. గెలుపు తీర్పు జిల్లా ఓటర్లు ఏకపక్షంగానే ఇచ్చినా.. మెజార్టీ విషయాన్ని మాత్రం ప్రతి రౌండ్లో పలువురు అభ్యర్థులకు చుక్కలు చూపించాయి. మెజార్టీ విషయంలో ఆయా పార్టీల అభిమానుల అంచనాలు దాదాపు తలకిందులయ్యాయి. తమ పార్టీ నేతలకు భారీ మెజార్టీ వస్తుందని ఊహించినా.. ఫలితాల సరళి మాత్రం అందుకు భిన్నంగా ఉండడంతో నేతలందరూ ఖిన్నులయ్యారు. ఇక చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో ఈసారి టీఆర్ఎస్, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలు మినహా ఇతర రాజకీయ పక్షాలేవీ ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో కనీసం డిపాజిట్లను సైతం సాధించలేకపోయాయి. ఇక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఉప్పల శారద, సీపీఎం బలపరిచిన బీఎల్పీ అభ్యర్థి పాల్వంచ రామారావు డిపాజిట్లు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం వీచినా.. జిల్లాలో మాత్రం ప్రజాకూటమి సానుకూల పవనాలే మెజార్టీ నియోజకవర్గాల్లో కనిపించాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ప్రజాకూటమిగా ఏర్పడి పోటీ చేయగా.. జిల్లాలో సీపీఐ పోటీ చేసిన ఒక్క స్థానంలో ఓడిపోగా.. టీడీపీ మూడు స్థానాల్లో పోటీ చేసి ఒక స్థానంలో ఓటమి చెందగా.. కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరు స్థానాలను గెలుపొందింది. ఇక సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఈ ఎన్నికల్లో తమ గత ప్రాభవాన్ని కాపాడుకోలేకపోయాయనే భావన ఈ ఎన్నికల ఫలితాలు కల్పించాయి. తుమ్మలకు స్వల్ప అస్వస్థత కాగా.. ఎన్నికల ఫలితాల అనంతరం పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇంతలోనే సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. -
కారుకు జై
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కారుకు జై కొట్టింది. కారు జోరును హస్తం అందుకోలేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా వీచిన టీఆర్ఎస్ గాలి ఆదిలాబాద్ పాత జిల్లాలోనూ కొనసాగింది. కాంగ్రెస్కు తిరుగులేదని భావించిన స్థానాల్లో సైతం గులాబీ జెండా ఎగిరింది. ఆదివాసీలు, సింగరేణీయులు, రైతులు, వృద్ధులు, యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్నే ఆదరించారు. ఉమ్మడి ఆదిలాబాద్లోని పది నియోజకవర్గాల్లో ఆసిఫాబాద్ మినహా తొమ్మిది చోట్ల టీఆర్ఎస్ జయకేతనం ఎగరేసింది. మంత్రులతో పాటు మరో ఆరుగురు తాజా మాజీలు మరోసారి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును తప్పించి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ను పోటీకి నిలిపిన చెన్నూరులో సైతం తొలి నుంచే గులాబీ రెపరెపలాడింది. ఆసిఫాబాద్లో మాత్రం కేవలం 171 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు విజయం సాధించారు. పాత ఆదిలాబాద్లోని పది చోట్ల పోటీ చేసిన బీజేపీ కేవలం ఆదిలాబాద్, ముధోల్లలో రెండోస్థానంలో నిలవగా, ఖానాపూర్, నిర్మల్లలో మెరుగైన ఓట్లు సాధించి ఉనికి చాటుకొంది. మిగతా చోట్ల డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: తొలి రౌండ్ నుంచే గులాబీ ఆధిక్యత శాసనసభ ఎన్నికల కౌంటింగ్ మొదలైన పది ని యోజకవర్గాల్లో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో తొలి రౌండ్ నుంచే ఆధిక్యత సాధిస్తూ వచ్చింది. ఖానాపూర్లో బీజేపీ, మంచిర్యాల, నిర్మల్, బోథ్లో కాంగ్రెస్ తొలుత ఆధిక్యత కనబరిచినా, తరువాత టీఆర్ఎస్ హవానే కొనసాగింది. మంచిర్యాలలో తొలి మూడు రౌండ్ల వరకు కాంగ్రెస్ ఆధిక్యతలో కొనసాగినా, నాలుగో రౌండ్ నుంచి టీఆర్ఎస్ పుంజుకొంది. మధ్యమధ్యలో ఒక్కో రౌండ్లో కాంగ్రెస్ స్వల్పంగా ఆధిక్యత ప్రదర్శించినా, టీఆ ర్ఎస్ను అందుకోలేకపోయింది. ఆసిఫాబాద్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. తొలుత టీఆర్ఎస్కు లభించిన ఆధిక్యత తరువాత తగ్గి కాంగ్రెస్ వైపు సాగింది. చివరికి కాంగ్రెస్ విజయం సాధిం చింది. ఆదిలాబాద్, ముథోల్, సిర్పూరు, చెన్నూ రు, బెల్లంపల్లిలో తొలి రౌండ్ నుంచి మొదలైన కా రు జోరు చివరి వరకు సాగింది. రికార్డు స్థాయిలో పదింట తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగిరింది. సత్తా చాటిన ఇద్దరు మంత్రులు.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి గత ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన జోగు రామన్న (ఆదిలాబాద్), అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి (నిర్మల్) ఘన విజయం సాధించారు. ఆదిలాబాద్లో జోగు రామన్న మొదటి రౌండ్ నుంచే బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్పై 26,606 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ టీఆర్ఎస్కు 74,050 ఓట్లు రాగా, బీజేపీకి 47,444 , కాంగ్రెస్ అభ్యర్థి గండ్రత్ సుజాతకు 32,200 ఓట్లు మాత్రమే లభించాయి. నిర్మల్లో హోరాహోరీగా సాగిన పోరులో మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి 79,985 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్రెడ్డికి 70,714 ఓట్లు లభించాయి. 9,271 ఓట్ల మెజారిటీతో ఐకే రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ తొలి రౌండ్లో కాంగ్రెస్కు మెజారిటీ లభించినా, రెండో రౌండ్ నుంచే టీఆర్ఎస్ విజయం దిశగా సాగిపోయింది. ఇక్కడ బీజేపీ 16,900 ఓట్లు మాత్రమే సాధించగలిగింది. మళ్లీ గెలిచి... నిలిచారు మంచిర్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్రావు మూ డేళ్లుగా మంచిర్యాల నియోజకవర్గంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు కేసీఆర్ హవా ముందు ఉపయోగపడలేదు. 4వేల పైచిలుకు ఓట్లతో దివాకర్రావు నాలుగోసారి విజయం సాధించారు. ఆదిలా బాద్లో ప్రస్తుత తరంలో సీనియర్ రాజకీయవేత్త అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి మరోసారి విజయం సాధించి, తన సత్తా చాటారు. ఆదిలాబాద్ చరిత్రలో వరుసగా మూడుసార్లు గెలిచి రికార్డు సృష్టించిన జోగు రామన్న నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. సెటిలర్ అయినప్పటికీ, నిత్యం ప్రజలతో మమేకమవుతారనే పేరున్న కోనేరు కోనప్ప సిర్పూరు నుంచి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, ముథోల్లో జి.విఠల్రెడ్డి, బోథ్లో రాథోడ్ బాపూరావు స్థానికంగా ఉన్న అవరోధాలను అధిగమించి రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వివాదాస్పద నియోజకవర్గంగా రాష్ట్రంలోనే అందరి నోళ్లలో నానిన చెన్నూరు నుంచి పోటీచేసిన యువ నాయకుడు, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆసిఫాబాద్లో గెలిచిన ఆత్రం సక్కు కూడా మాజీ ఎమ్మెల్యే కావడం విశేషం. ఆదివాసీ ప్రాబల్యం ఉన్నప్రాంతాల్లో సైతం.. ఐదు నియోజకవరాలలో ప్రభావం చూపే ఆదివాసీలు, ఇతర గిరిజనులు కేసీఆర్నే నమ్మినట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. ఆదివాసీ ఆందోళనలతో ఏడాదిన్నర కాలం అట్టుడికిన ఆదిలాబాద్లో ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని చేసిన అంచనాలు తలకిందులయ్యాయి. ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ఆసిఫాబాద్ మినహా మిగతా చోట్ల టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆసిఫాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు మాత్రమే కేవలం 170 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. సిర్పూరులో ఆదివాసీలు సైతం టీఆర్ఎస్కే పట్టం కట్టారు. బోథ్లో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపూరావు చేతిలో 6,639 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న కాంగ్రెస్ రెబల్ జాదవ్ అనిల్కుమార్ భారీగా ఓట్లు సాధించడం సోయం బాబూరావుకు నష్టం కలిగించింది. అనిల్కు 27,988 ఓట్లు రావడంతో చీలిన ఓట్ల కారణంగా సోయం బాపూరావు పరాజయం పొందారు. ఖానాపూర్లో టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా నాయక్ 20,722 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్పై విజయం సాధించారు. ఇక్కడ ఆదివాసీలు బీజేపీ అభ్యర్థి సట్ల అశోక్కు అండగా నిలిచారు. అశోక్కు 23,770 ఓట్లు పోలు కావడం గమనార్హం. అడవుల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు రావడం, రైతుబంధు కింద ఎకరానికి రూ.4వేలు వస్తుండడంతో గిరిజనులు మళ్లీ కారుకే తమ ఓటు వేసినట్లు తెలుస్తోంది. రాత్రి వరకు క్యూలైన్లలో నిలబడి పడిన ఓట్లన్నీ టీఆర్ఎస్కేనని స్పష్టమైంది. సిర్పూరు, బోథ్, ముథోల్, బెల్లంపల్లిలోని గిరిజన గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపించింది. సింగరేణీయులు కారుకే.. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్, కుమురం భీం జిల్లా గోలేటి, రెబ్బెన ప్రాంతాల్లోని సింగరేణి కుటుంబాలన్నీ గంపగుత్తగా టీఆర్ఎస్కే ఓటేసినట్లు సరళిని బట్టి తెలుస్తోంది. మంచిర్యాలలో టీఆర్ఎస్ గెలుపు సింగరేణి ప్రాంతం ఓట్లతోనే సాధ్యమైందని స్పష్టమవుతోంది. దీంతో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు మూడింట టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. పట్టణ ఓటర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారు కూడా టీఆర్ఎస్కే ఓట్ల పట్టం కట్టారని స్పష్టమవుతోంది. మంచిర్యాలలో తొలి రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, తరువాత టీఆర్ఎస్కు అధిక ఓట్లు పోలవడంతో ఆ పార్టీ మెజారిటీ కొనసాగింది. స్వల్ప మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావునే విజయం వరించింది. చెన్నూరులో టీఆర్ఎస్ అభ్యర్థి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తొలి రౌండ్ నుంచే ఆధిక్యత ప్రదర్శించారు. ఆయన సమీప ప్రత్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేతపై 24,286 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీఆర్ఎస్కు 56,280 ఓట్లు రాగా, కాంగ్రెస్కు 31,994 ఓట్లు లభించాయి. మాజీ మంత్రి గడ్డం వినోద్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన బెల్లంపల్లి రాష్ట్రంలో చర్చనీయాం శం కాగా, ఇక్కడ కూడా టీఆర్ఎస్ తొలి రౌండ్ నుంచే ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. బెల్లంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య 10, 107 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ బొక్కబోర్లా! 2014 ఎన్నికల్లో ఆదిలాబాద్, ముథోల్లలో రెం డో స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి కూడా ఆ ని యోజకవర్గాల్లో అవే స్థానాలకు పరిమితమైంది. ఆదిలాబాద్లో పాయల్ శంకర్, ముథోల్లో రమాదేవి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, ఏ రౌండ్లోనూ టీఆర్ఎస్ కన్నా అధిక ఓట్లు రాబట్టలేకపోయారు. ఆదిలాబాద్లో 47,444 ఓట్లు సాధించిన బీజేపీ, ముథోల్లో 40,339 ఓట్లు పొందింది. ఖానాపూర్లో ఆదివాసీ వర్గం నుంచి పోటీలో నిలిచిన సట్ల అశోక్ ఐదు రౌండ్ల వరకు ఆధిక్యతలో కొనసాగినప్పటికీ, తరువాత టీఆర్ఎస్, కాం గ్రెస్ మొదటి రెండు స్థానాల్లోకి ఎగబాకాయి. నిర్మల్లో పోటీ చేసిన సువర్ణరెడ్డి కేవలం 16,900 ఓట్ల కే పరిమితమయ్యారు. పట్టణ ఓటర్లు కూడా బీజేపీని ఆదరించలేదని తెలుస్తోంది. మిగతా నియోజ కవర్గాల్లో ఎక్కడా కనీసం పోటీ ఇవ్వలేకపోయిం ది. మంచిర్యాల బరిలోకి దిగిన వెరబెల్లి రఘునాథరావు గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్ల లోసగం కూడా తెచ్చుకోలేక డిపాజిట్ కోల్పోయారు. ప్రభావం చూపని బీఎస్పీ, బీఎల్ఎఫ్ బెల్లంపల్లిలో గెలుపు గుర్రంగా చివరి నిమిషంలో బీఎస్పీ గుర్తు మీద బరిలోకి దిగిన గడ్డం వినోద్ ఒక్కరే టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు గట్టిపోటీ ఇచ్చారు. ఇక్కడ పదివేల ఓట్ల తేడాతో వినోద్ పరాజయం పాలయ్యారు. మిగతా ఏ నియోజకవర్గంలో కూడా బీఎస్పీ అభ్యర్థులు గానీ బీఎల్ఎఫ్ అభ్యర్థులు గానీ ప్రభావం చూపలేదు. చెన్నూరులో కాంగ్రెస్ టికెట్టు రాక బీఎల్ఎఫ్ నుంచి పోటీపడ్డ మాజీ మంత్రి బోడ జనార్ధన్ కేవలం 926 ఓట్లకే పరిమితమయ్యారు. ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీచేసిన సోగాల సంజయ్కు 6,274 ఓట్లు సాధించడం గమనార్హం. అదే తరహాలో మరికొన్ని నియోజకవర్గాల్లో బీఎస్పీ, బీఎల్ఎఫ్ అభ్యర్థుల కన్నా స్వతంత్రులకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. సోదిలో లేని మహాకూటమి పక్షాలు కాంగ్రెస్తో కలిసి మహాకూటమిగా ఏర్పాటైన టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ఉమ్మడి జిల్లాలో ప్రభావం చూపలేదు. బెల్లంపల్లిలో పోటీ చేసిన సీపీఐ కేవలం 3,600 ఓట్లకే పరిమితం అయింది. ఆసిఫా బాద్, ఖానాపూర్లో కాంగ్రెస్ ఉన్నప్పటికీ, ఫ్రెండ్లీ ఫైట్ పేరుతో బరిలో నిలిచిన టీజేఎస్ కనీస ఓట్లు కూడా సాధించలేదు. ఆసిఫాబాద్లో కోదండరాం వచ్చి ప్రచారం చేసినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి విజయ్కు 6,183 ఓట్లు మాత్రమే లభించాయి. ఖానాపూర్లో భీంరావు 2,412 ఓట్లు సాధించారు. టీడీపీ నుంచి మంచిర్యాలలో మినహా పెద్ద గాకూటమి అభ్యర్థులకు సహకారం అందలేదు. -
జానా ఇలాకాలో టీఆర్ఎస్ తొలిసారిగా..
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిం చింది. ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. మరో రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. జిల్లాలో టీఆర్ఎస్ తొలిసారిగా నాలుగు నియోజకవర్గాల్లో ఖాతా తెరిచింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐనుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన మిర్యాలగూడ అభ్యర్థి ఎ¯.భాస్కర్రావు, దేవరకొండ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్, నాగార్జునసాగర్లో నోముల నర్సింహయ్య, నల్లగొండలో కంచర్ల భూపాల్రెడ్డి గెలుపొందారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిగా కంచర్ల రికార్డుకెక్కారు. గత ఎన్నికల్లో కంచర్ల ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఇక ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించిన కాంగ్రెస్ సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి పరాజయం పాలు కాగా, ఆయన ఇలాకాలో తొలిసారిగా టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో జానా మీద పోటీచేసి ఓడిన నోముల నర్సింహయ్య ఈ ఎన్నికల్లో గెలుపొంది ఆయన జమానాకు తెరదించారు. జానా కోటలో గెలిచిన రెండో నేత నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి తొలిసారిగా 1978 ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రెండోసారి 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తి యాదవ్పైన ఓడిపోయారు. 1994 ఓటమి తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో నాలుగు సార్లు జానా గెలుపొందారు. తిరిగి ఇరవై ఏళ్ల విరామం తర్వాతా అదే యాదవ సామాజిక వర్గానికి చెందిన నోమల నర్సింహయ్య చేతిలో జానా ఓడిపోవడం గమనార్హం. రెండు స్థానాలు కోల్పోయిన టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ గెలిచిన రెం డు స్థానాలను ఈ ఎన్నికల్లో కోల్పోయింది. కమ్యూనిస్టులకు అడ్డగా అప్పటి దాకా నిలబడిన నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవగా, ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. గతంలో ఇవే నియోజకవర్గాల నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేలుగా అరంగ్రేటం చేసిన వేములవీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి రెండోసారి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో నకిరేకల్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య ఈ ఎన్నికల్లో రెండో సారి గెలుపొందారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా తొలిసారిగా విజయం సాధించా రు. కాగా, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్పార్టీ 1967, 1972, 1978, 1983, 1999 ఎన్నికల్లో నాలుగు సార్లు విజయం సాధించింది. 2009లో మహాకూటమి పొత్తులో భాగంగా మునుగోడులో సీపీఐ గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్రెడ్డి ఓడిపోయారు. మళ్లీ మూడు ఎన్నికల విరామం తర్వాత రాజగోపాల్రెడ్డి రూపంలో కాంగ్రెస్ను విజయం వరించింది. జానా, కోమటిరెడ్డి పరాజయం... మహాకూటమి అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉన్నామని చెప్పుకున్న సీఎల్పీ మాజీ నేత కుం దూరు జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న నల్లగొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో తొలిసారి టీఆర్ఎస్ఖా తా లో పడ్డాయి. 1983 నుంచి ఒక్క టర్మ్ మినహా సుధీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్న ఘనత జానారెడ్డిదే. 1994 నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు గెలుస్తూ వస్తోన్న మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తొలిసారి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కంచర్ల భూపాల్రెడ్డి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొం దారు. దివగంత సీఎం వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేసిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో తన పదవికి రాజీనామా చేశారు. అయిదో సారి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినా ఓటమి పాలయ్యారు. మిర్యాలగూడలో కారు హవా ! కాంగ్రెస్ కంచుకోటల్లో ఒకటైన మిర్యాలగూడ ని యోజకవర్గంలో సైతం కారు జోరు సాగింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలి చిన ఎన్.భాస్కర్రావు ఈసారి టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు. ఈయన పైన బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ నియోజకవర్గంలో 13సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, ఏడు సార్లు గెలుపొందింది. సీపీఎం ఐ దు సార్లు విజ యం సాధిం చిం ది. అయితే ఈ ఎన్నికల్లో బీఎల్ఎఫ్పేరుతో సీపీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన జూలకంటిరంగారెడ్డి పదివేల ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేవరకొండలో మూడోసారి రవీంద్ర గెలుపు దేవరకొండ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన రవీంద్రకుమార్ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా గెలిచిన ఆయన టీఆర్ఎస్లో చేరారు. పార్టీ మారాక, ఈ సారి టీఆర్ఎస్ అభ్యర్థిగా రవీంద్రకుమార్ దేవరకొండలో గులాబీ ఖాతా తెరిచారు. 2004, 2014 ఎన్నికల్లో రవీంద్రకుమార్ కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా సీపీఐ నుంచి గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా సీపీఐ నుంచి పోటీ చేసిన రవీంద్ర కుమార్ ఓడిపోగా, కాంగ్రెస్ అభ్యర్థిగా బాలునాయక్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి ఈ ఎన్నికల్లో వారిద్దరే ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు.కాంగ్రెస్ నుంచి జెడ్పీ చైర్మ¯గా ఎన్నికైన బాలునాయక్ టీఆర్ఎస్లో చేరినప్పటికీ పార్టీ టికెట్ ఇవ్వకపోడంతో ఆయన సొంతగూటికి వెళ్లి టికెట్ తెచ్చుకుని పోటీ పడినా పరాజయం పాలయ్యారు. నల్లగొండ : కౌంటింగ్ కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న అధికారులు -
నోటా ఓట్లు @ 38974
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్లు నోటాకూ భారీగా ఓటు వేశారు. బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చక పోవడంతో వార ంతా నోటా మీట నొక్కారు. గ్రేటర్ పరిధి లో 24 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 38,974 మంది నోటాకు ఓటు వేయడం గమనార్హం. నోటా ఓట్లు అత్యధికంగా నమోదైన నియోజక వర్గాల్లో మేడ్చల్ 3402 ఓట్లతో మొదటిస్థానంలో నిలువగా, కుత్బుల్లాపూర్ 2976 ఓట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఎల్బీనగర్ 2858, ఉప్పల్ 2712ఓట్లు, శేర్లింగంపల్లి 24444 ఓట్లతో వరుస స్థానాల్లో నిలిచాయి. ముషీరాబాద్ 1545, అంబర్పేట్ 1462, మహేశ్వరం 2171, మలక్పేట్ 498, మల్కజ్గిరి 1630, కంటోన్మెంట్ 1571, సికింద్రాబాద్ 1582, సనత్నగర్ 1464, కూకట్పల్లి 2134, జూబ్లిహిల్స్ 1491, ఖైరతాబాద్ 1371, రాజేంద్రనగర్ 1664, బహదుర్ పురా1210, యాకుత్పుర 777, చాంద్రాయణగుట్ట 1009, నాంపల్లి 793, గోషామహల్ 709, కార్వాన్ 887, చార్మినార్ 614 ఓట్లు నోటాకు నమోదు కావడం గమ నార్హం. మేడ్చల్లో అత్యధికంగా నమోదు కాగా...చార్మినార్లో అత్యల్పంగా నమోదు కావడం కొసమెరుపు. -
అగ్రనేతలొచ్చినా..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అగ్రనేతలు, జాతీయ స్థాయి నాయకులు ప్రచారం చేసినా.. ఆయా పార్టీల అభ్యర్థులు నెగ్గలేకపోయారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్, పరిపూర్ణాన ంద్ స్వామి, సీఎం కేసీఆర్ తదితరులు తమ పార్టీ ల అభ్యర్థులకు మద్ధతుగా పలుచోట్ల బహిరంగ స భలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో రోడ్ షో లు సైతం చేశారు. వీటికి ప్రభావితంకాని ఓటర్లు.. చి వరకు తమకు నచ్చిన వారికే ఓటేసి గెలిపించారు. వికసించని కమలం.. ఆది నుంచి కల్వకుర్తిపై ఆశలు పెట్టుకున్న బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి ఈ సారికూడా ఓటమి పా లయ్యారు. ఆయనకు మద్ధతుగా ఈ సె గ్మెంట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి సదానందగౌడ, స్టార్ క్యాంపెయినర్ పరిపూర్ణానంద స్వామి ప్రచారం చేశారు. బహిరంగ సభల వేదికలపై ప్రసంగించి ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి కూడా రోడ్ షో చేశారు. ఇలా విస్తృత స్థాయిలో పార్టీ అగ్రనేత లు రంగంలోకి దిగినా బీజేపీకి గెలుపు సాధ్యపడలేదు. పనిచేయని ‘జాతీయ’తంత్రం.. మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన తీగల కృష్ణారెడ్డి, బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. బీజేపీ తరఫున ఈ సెగ్మెంట్లో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డాలు ప్రచారం నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఇక టీఆర్ఎస్ తరఫున స్టార్ క్యాంపెయినర్గా ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పలుచోట్ల రోడ్షోలు నిర్వహించి.. కారుకు ఓటేయాలని అభ్యర్థించినా విజయం వరించలేదు. రాహుల్ ప్రభావం అంతంతే.. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలు సెగ్మెంట్లను చుట్టేసినా.. అక్కడ ఆ పార్టీ అభ్యర్థులకు పరాభవమే ఎదురైంది. కొడంగల్, పరిగి, తాండూర్ సెగ్మెంట్లలో బహిరంగ సభలకు హాజరై ప్రసంగించారు. వీటిలో తాండూరు మినహా.. మిగిలిన రెండు చోట్ల కాంగ్రెస్ ఓటమి పాలైంది. తా ం డూరులో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రచారం చే సినా... టీఆర్ఎస్ అభ్యర్థి గెలువలేదు. ఇక బీజేపీ తరఫున యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రచారం నిర్వహించినా.. బీజేపీకి ఇక్కడ సాధ్యం కాలేదు. -
ఓడితే కుంగిపోవాలా.. బ్రదర్?
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనూహ్య పరాజయంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. నల్గొండ నియోజకవర్గం నుంచి గతంలో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన కోమటిరెడ్డి ఈ సారి ఓటమి చవిచూశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన వెంకట్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని కూడా ధీమా వ్యక్తం చేశారు. అయితే నల్గొండ ప్రజలు మాత్రం ఈ సారి వెంకట్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా మార్పును కోరుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాలరెడ్డిని 23,698 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఓడితే కుంగిపోవాలా.. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం.. విజయం ఒక్కోసారి ఒక్కొక్కరిని వరిస్తుంది... గత 20 ఏళ్లుగా తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారని భావించిన వెంకట్ రెడ్డి.. ఏ మాత్రం కుంగిపోకుండా రోజువారిలాగే తన దినచర్యను కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం హైదారాబాద్లోని జిమ్కి వెళ్లి ఉల్లాసంగా అందరితో కలిసి వ్యాయామం చేశారు. ఇక ఫలితాలపై ఈ రోజు నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. మరోవైపు అధిష్టానం ముందు పట్టుబట్టి సాధించుకున్న మునుగోడు, నకిరేకల్ సీట్లలో ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి, ప్రధాన అనచరుడు చిరుమర్తి లింగయ్యలు గెలుపొందారు. -
ప్రకాష్.. హ్యాట్రిక్
రాజేంద్రనగర్: హ్యాట్రిక్ విజయం అందించిన రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజల రుణాన్ని ఎన్ని జన్మలేత్తిన తీర్చుకోలేనని టి.ప్రకాష్గౌడ్ వెల్లడించారు. మంగళవారం నిర్వహించిన కౌంటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ప్రజా సేవ చేసేందుకు ప్రజల్లోకి వచ్చానని అందుకు వారు తనను ఆహ్వానించారన్నారు.ప్రతిసారి నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నారని వారి సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నారు. మహిళలు, యువతీయువకులు అందరు కలిసి తనను గెలిపించారన్నారు. గత రెండుసార్లు ప్రతిపక్షంలో ఉండి విజయం సాధించానని ఇప్పుడు అధికార పక్షంగా మరోసారి గెలిపించారన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ప్రజా సమస్యలన్చు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానన్నారు. తనవెంట నిలిచిన నాయకులు, కార్యకర్తలందరికి న్యాయం చేస్తానన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. గత నాలుగు సంవత్సరాలలో అభివృద్ధి పూర్తిస్థాయిలో నిర్వహించలేదన్నారు. మరోసారి అవకాశం ఇచ్చారని ఈ ఐదు సంవత్సరాలలో పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఈ సందర్భంగా తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పతంగికి నియోజకవర్గంలో స్థానం లేదు.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీకి స్థానం లేదు. మూడు సార్లు పోటీ చేసి కనిపించకుండా పోయింది. ప్రత్యర్థులు ఎన్నో కుట్రలు పన్నిన ప్రజలు మాత్రం ఆదర్శించారన్నారు. మైనార్టీలు మరోసారి నావెంటే ఉన్నారని స్పష్టమైందన్నారు. వారికి అందుబాటులో ఉండి అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానన్నారు. -
కార్.. టాప్గేర్ జోర్దార్
గ్రేటర్లో కారు టాప్గేర్లో దూసుకెళ్లింది..పాతబస్తీలో పతంగులు మళ్లీ రెపరెపలాడాయి..కమలం వాడి పోగా.. హస్తం అంతంత ప్రభావమే చూపింది.ముందస్తు ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని మెజారిటీ నియోజకవర్గాల్లో సిటీజనం తీర్పు ఏకపక్షంగా ఉంది. 16 చోట్ల టీఆర్ఎస్ విజయఢంకా మోగించగా, మజ్లిస్ పార్టీ పట్టు ఎక్కడా సడలలేదు. బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. సిట్టింగ్ అయిదు స్థానాల్లో కేవలం గోషామహల్లోనే ఆ పార్టీ అభ్యర్థి గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లపై ఆశ పెట్టుకున్నా ఎల్బీనగర్, మహేశ్వరం స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి గ్రేటర్ నుంచి కొత్తగా ముగ్గురు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. మరో విశేషమేమిటంటే ఎంపీ మల్లారెడ్డి మేడ్చల్ నుంచి, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ముంతాజ్ అహ్మద్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, తలసాని, దానం, అక్బరుద్దీన్, సాయన్నలు ఐదుసార్లు గెలిచారు. సాక్షి, హైదరాబాద్: మహానగరంలో కారు వేగానికి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ల కూటమి కుప్పకూలింది. బీజేపీ చతికిలపడింది. ‘అభివృద్ధి, సంక్షేమం, భద్రత’ నినాదంతో నగర ప్రజలను ఓట్లడిగిన టీఆర్ఎస్కు ఓటేసి ‘కేసీఆరే మా హీరో’ అని చాటిచెప్పారు. మంగళవారం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నగర ప్రజలు ఏకపక్షంగా తీర్పునిస్తూ 14 మంది టీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ మెజారిటీతో విజయం కట్టబెట్టారు. ఎంఐఎం పాతబస్తీలో మళ్లీ 7 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ ఎల్బీనగర్, మహేశ్వరం, బీజేపీ ఒక్క గోషామహల్తో సరిపెట్టుకున్నాయి. గోషామహల్ బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్గౌడ్ మూడో స్థానంతోనే సరిపెట్టుకోగా, కంటోన్మెంట్ నుంచి పోటీచేసిన మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఎల్బీనగర్లో సుధీర్రెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి సొంత వ్యూహం, ప్రత్యర్థులపై భారీ వ్యతిరేకత వల్లే విజయం సాధించారు. ఇక ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్ స్థానాల్లోను దారుణంగా ఓడిపోయింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు సుహాసిని, ఆనంద్ ప్రసాద్లు కనీస పోటీ సైతం ఇవ్వలేకపోయారు. తెలంగాణ జనసమితి మల్కాజిగిరి, అంబర్పేటలలో డిపాజిట్లు కోల్పోయారు. టాప్గేర్లో ‘కారు’ పరుగు గత అసెంబ్లీ (2014) ఎన్నికల్లో కేవలం సికింద్రాబాద్, మల్కాజిగిరి, పటాన్చెరు స్థానాల్లో మాత్రమే గెలిచిన టీఆర్ఎస్.. ఈసారి నగరమంతా చుట్టేసింది. మేడ్చల్ నియోజకవర్గంలో ఎంపీ మల్లారెడ్డి ఏకంగా 87,990 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించగా, సికింద్రాబాద్లో పద్మారావు, సనత్నగర్లో తలసాని శ్రీనివాసయాదవ్, ఖైరతాబాద్లో దానం నాగేందర్, జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్, ముషీరాబాద్లో ముఠా గోపాల్, అంబర్పేటలో కాలేరు వెంకటేష్, కంటోన్మెంట్లో సాయన్న, మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావు, పటాన్చెరులో మహిపాల్రెడ్డి, కూకట్పల్లిలో మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్లో ప్రకాష్గౌడ్, ఉప్పల్లో భేతి సుభాష్రెడ్డి విజయం సాధించారు. పాతబస్తీలో ‘పతంగ్’ రెపరెపలు చారిత్రక పాతబస్తీలో మళ్లీ ‘పతంగ్’ రివ్వున దూసుకుపోయింది. ఎంఐఎం అభ్యర్థులు తమతమ స్థానాల్లో మళ్లీ సునాయస విజయం సాధించించారు. చాంద్రాయణగుట్టలో పార్టీ ముఖ్య నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ భారీ మెజారిటీతో విజయం సాధించగా, చార్మినార్, మలక్పేట, యాకుత్పురా, బహుదూర్పురా, కార్వాన్లను తిరిగి సొంతం చేసుకుంది. ఒక్క నాంపల్లి స్థానంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ఖాన్తో గట్టిపోటీ ఎదుర్కొని చివరకు 9,675 మెజారిటీతో జాఫర్ హుస్సేన్ గెలుపొందారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పోటీ చేసినా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. చతికిలబడ్డ బీజేపీ.. ఎన్నికల ప్రచారాన్ని భారీ ఎత్తున హోరెత్తించిన బీజేపీ.. ఫలితాల్లో మాత్రం చతికిలబడింది. గోషామహల్లో 17,734 ఓట్ల మెజారిటీతో తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా ఒక్కరే విజయం సాధించగా, ముషీరాబాద్లో బీజేపీ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ 30,769 ఓట్లు పొంది మూడో స్థానంలో నిలిచారు. బీజేఎల్పీ నాయకుడిగా పనిచేసిన కిషన్రెడ్డి అంబర్పేటలో చివరి వరకు పోరాడి కేవలం 1,016 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఖైరతాబాద్లోనూ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి 28,402 ఓట్ల తేడాతో ఓడిపోగా, మల్కాజిగిరిలో ఎమ్మెల్సీ రాంచందర్రావు, రాజేంద్రనగర్లో బద్దం బాల్రెడ్డి వంటి ముఖ్యనేతలుఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఆ ముగ్గురు చివరి నిమిషం హీరోలు నామినేషన్ల గడువుకు కొన్ని గంటల ముందు టికెట్లు దక్కించుకున్న ముగ్గురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఖైరతాబాద్లో దానం నాగేందర్, ముషీరాబాద్లో ముఠా గోపాల్, అంబర్పేటలో కాలేరు వెంకటేష్కు టికెట్లు ఇచ్చే అంశంపై చివరి వరకు తర్జనభర్జనలు జరిగాయి. నామినేషన్ల చివరిరోజు వారి అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. అయినా ఆ ముగ్గురూ విజయం సాధించడం విశేషం. పాతబస్తీపై మజ్లిస్ పట్టు పాతబస్తీపై మజ్లిస్ తన పట్టు నిలుపుకుంది. సిట్టింగ్ స్థానాలను పదిలపర్చుకుంది. ఒక స్థానంలో మాత్రం గట్టి పోటీ కొనసాగడంతో ఫలితం దోబుచులాడింది. శివారులోని మరో స్థానంలో పాగ వేసేందుకు ప్రయత్నించినా టీఆర్ఎస్ చేతుల్లో పరాజయం పాలైంది. చాంద్రాయణగుట్ట, మలక్పేట, కార్వాన్, బహదూర్పురా, యాకుత్పురా, చార్మినార్, నాంపల్లి నియోజకవర్గాల్లో తిరిగి పాతవారే విజయం దుందుభి మేగించారు. ఎన్నికల బరిలో ఏడు స్థానాల్లో బీజేపీ, ఆరు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో టీడీపీ తలపడినప్పటికీ మజ్లిస్కు పోటీ ఇవ్వలేకపోయాయి. నాంపల్లి నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ గట్టి పోటి ఇచ్చింది. ఐదోసారి అక్బరుద్దీన్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం మజ్లిస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ నుంచి పార్టీ అగ్రనేత, సిట్టింగ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి షాహజాదిపై 80,264 ఓట్ల మెజార్టీతో విజయం సొంతం చేసుకున్నారు. అక్బరుద్దీన్ 95,339 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి 15,075 ఓట్లకు పరిమితమయ్యారు. గతం కంటే ఈసారి భారీగా మెజార్టీ వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచే అక్బర్ తన హవా కొనసాగించారు. నాలుగోసారి మౌజంఖాన్ బహదూర్పురాలో మజ్లిస్ అభ్యర్థి మహ్మద్ మౌజంఖాన్ వరసగా నాలుగోసారి విజయకేతనం ఎగురవేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి మీర్ ఇనాయత్ అలీ బాక్రీపై 82,518 ఓట్ల మెజార్టీ మౌజం గెలుపొందారు. మౌజంకు 96,993 ఓట్లు లభించగా, టీఆర్ఎస్ అభ్యర్థి 14,475 ఓట్లకు పరిమితమయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఉనికి చాటుకున్నాయి. ముంతాజ్ ఖాన్కు ‘డబుల్’ హ్యాట్రిక్ ఈ నియోజకవర్గం మజ్లిస్కు కంచుకోట. ఇక్కడ నుంచి మహ్మద్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ విజయం సాధించారు. ఆయన ఇప్పటి దాకా యాకుత్పురా నుంచి ఐదుసార్లు గెలుపొందగా.. ఈసారి చార్మినార్ నుంచి ఎన్నికల బరిలోకి దిగి 32,586 మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఉమామహేందర్పై విజయం సాధించడమేగాక.. డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ముంతాజ్ ఖాన్కు 53,808 ఓట్లు లభించగా, బీజేపీకి 21,222 ఓట్లు, కాంగ్రెస్కు 16,899 ఓట్లు లభించాయి. మలక్పేటలో బలాలా హ్యాట్రిక్ ఈ నియోజకవర్గంలో మజ్లిస్ అభ్యర్థి అహ్మద్ బిన్ అబ్దుల్ బలాలా హ్యట్రిక్ సాధించారు. 12,506 ఓట్లతో టీడీపీ అభ్యర్థి ముజఫర్పై గెలుపొందారు. బలాలాకు 32,020 ఓట్లు పోలవగా, ముజఫర్కు 19,514 ఓట్లు వచ్చాయి. ఆలె జితేంద్ర (బీజేపీ) 11,662 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. యాకుత్పురాలో పాషా.. ఈ సెగ్మెంట్ నుంచి సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (మజ్లిస్)విజయం సాధించారు. ఇప్పటిదాకా చార్మినార్ నుంచి హ్యాట్రిక్ కొట్టిన ఖాద్రీ.. ఈసారి యాకుత్పురా నుంచి బరిలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి సామ సుందర్రెడ్డిపై 46,978 ఓట్ల మెజార్టీ తో విజయం సాధించారు. ఖాద్రీకి 69,595 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి 22,617 ఓట్లతో రెండో స్థానంలోను, ఎంబీటీ అభ్యర్థి ఫర్హతుల్లా ఖాన్ 21,222 ఓట్లతో మూడో స్ధానంలో నిలిచారు. కార్వాన్లో కౌసర్ కార్వాన్ నియోజకవర్గంలో వరుసగా మజ్లిస్ విజయ దుందుభి మోగించింది. ఇక్కడి నుంచి కౌసర్ మొయినుద్దీన్(మజ్లిస్) రెండోసారి ఎన్నికయ్యారు. 49,692 ఓట్ల అధిక్యతతో బీజేపీ అభ్యర్థి అమర్సింగ్పై గెలుపొందారు. కౌసర్కు 85,401 ఓట్లు రాగా, అమర్సింగ్కు 35,709 ఓట్లు పోలయ్యాయి. అధికార టీఆర్ఎస్కు మూడో స్థానం, కాంగ్రెస్ నాలుగో స్థానంలోను చిలిచింది. నాంపల్లిలో మళ్లీ జాఫర్ ఈ నియోజకవర్గం నుంచి జాఫర్ హుస్సేన్ రెండోసారి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ఖాన్ గట్టి పోటీ ఇవ్వడంతో చివరి రౌండ్ వరకు విజయం దోబూచులాడింది. చివరకు మజ్లిస్ అభ్యర్థి జాఫర్ హుస్సేనే 9,675 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జాఫర్కు 57,940, కాంగ్రెస్కు 48,265 ఓట్లు పోలయ్యాయి. ఇక టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు మూడు,నాలుగు స్థానాలకు పరిమితమయ్యారు. టాప్లో ఆ ఐదుగురు.. హిమాయత్నగర్: ప్రతిష్టాత్మకంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు పోలయ్యాయి. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా టాప్–5 స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి, మజ్లిస్ నుంచి మహ్మద్ మోజాంఖాన్, అక్బరుద్దీన్ ఓవైసీ, మైనంపల్లి హన్మంతరావు, ప్రకాష్గౌడ్ నిలిచారు. అత్యల్పంగా కేవలం 376 ఓట్లతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపొందడం విశేషం. అత్యధిక మెజార్టీ స్థానాలు ఇవే.. 1. మేడ్చల్ అభ్యర్థి సీహెచ్ మల్లారెడ్డి (టీఆర్ఎస్)కి 1,65,324 ఓట్లు పోలవగా, ప్రత్యర్థి కేఎల్ఆర్(కాంగ్రెస్)పై 87,990 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి మొదటి స్థానంలో నిలిచారు. 2. బహుదూర్పురా నుంచి మహ్మద్ మోజాంఖాన్(మజ్లిస్)కి 96,993 ఓట్లు పోలవగా.. ప్రత్యర్థి మీర్ ఇనాయత్ అలీ బాక్రీ(టీఆర్ఎస్)పై 82,580 ఓట్ల మెజారిటీతో సాధించి రెండో స్థానంలో నిలిచారు. 3. చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ(మజ్లిస్)కి 95,311 ఓట్లు పోలవగా.. ప్రత్యర్థి షహజాదీ(బీజేపీ)పై 80,263 ఓట్ల ఆధిక్యంతో గ్రేటర్లో 3వ స్థానం సొంతం చేసుకున్నారు. 4. మల్కాజగిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు(టీఆర్ఎస్)కు 1,14,149 ఓట్లు నమోదవగా.. ప్రత్యర్థి ఎన్.రామచందర్రావు(బీజేపీ)పై 73,698 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచారు. 5. రాజేంద్రనగర్ నుంచి టి.ప్రకాష్గౌడ్(టీఆర్ఎస్)కు 1,16,676 ఓట్లు పోలయ్యాయి. ఈయన ప్రత్యర్థి గణేష్గుప్తా(టీడీపీ)పై 57,331 ఓట్లతో విజయం సాధించి ఐదవ స్థానంలో నిలిచారు. అత్యల్ప మెజార్టీ విజయాలు వీరివే.. 1. ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్రెడ్డి(టీఆర్ఎస్)కి 72,581 ఓట్లు నమోదు కాగా.. ప్రత్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి(బీఎస్పీ)పై కేవలం 376 అత్యల్ప ఓట్లతో గెలుపొందారు. 2. అంబర్పేటలో కాలేరు వెంకటేష్(టీఆర్ఎస్)కు 61,558 ఓట్లు పోలవగా.. ప్రత్యర్థి కిషన్రెడ్డి(బీజేపీ)పై 1,016 ఓట్లతో విజయం సొంతం చేసుకున్నారు. 3. మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి(కాంగ్రెస్)కి 94,631 ఓట్లు రాగా.. ప్రత్యర్థి తీగల కృష్ణారెడ్డి(టీఆర్ఎస్)పై 9,227 ఓట్లతో గెలుపొందారు. 4. నాంపల్లిలో జాఫర్ హుస్సేన్ మెరాజ్(మజ్లిస్)కు 57,940 ఓట్లు రాగా.. ప్రత్యర్థి మహ్మద్ ఫెరోజ్ఖాన్(కాంగ్రెస్)పై 9,675ఓట్లతో విజయం సొంతం చేసుకున్నారు. 5. జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్(టీఆర్ఎస్)కు 67,213 ఓట్లు నమోదు కాగా.. ప్రత్యర్థి విష్ణువర్ధన్రెడ్డి(కాంగ్రెస్)పై 16,011 ఓట్లతో విజయం సొంతం చేసుకున్నారు. గ్రేటర్లో ఆచూకీ లేని టీజేఎస్ సాక్షి,సిటీబ్యూరో: మహాకూటమిలో భాగంగా గ్రేటర్ పరిధిలోని రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసిన తెలంగాణ జనసమితి(టీజేఎస్) అభ్యర్థులు కనీసం రెండో స్థానంలోనూ నిలవలేకపోయారు. అంబర్పేటలో నిజ్జన రమేశ్, మల్కాజిగిరి నుంచి పోటీచేసిన మాజీ ఎమ్మెల్సీ దిలీప్కుమార్ ఓటమి పాలయ్యారు. రమేశ్కు కేవలం 4,261 ఓట్లు మాత్రమే లభించాయి. కూటమిలో భాగంగా చివరిదాకా ఎవరికి ఏ నియోజకవర్గం టికెట్ లభిస్తుందో తెలియకపోవడం, కూటమిలో ని భాగస్వామ్య పక్షాల నుంచి ఆశించిన సహకారం లభించకపోవడం, టీజేఎస్ అభ్యర్థులు ఖర్చు పెట్టే పరిస్థితి లేకపోవడం వంటి కారణాలతో టీజేఎస్ పోటీని తట్టుకోలేకపోయింది. దీనికితోడు పోటీలో ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులు మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావు(టీఆర్ఎస్), రామచంద్రరావు(బీజేపీ).. అంబర్పేటలో కిషన్రెడ్డి(బీజేపీ), కాలేరు వెంకటేశ్ (టీఆర్ఎస్) ముందు వీరి బలం ఏమూలకూ చాలలేదు. కూటమిలోని మిత్రపక్షాల నుంచి ఆశించిన సహకారం లభించకపోవడంతో టీజేఎస్ పోటీ నామమాత్రమైంది. ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా మల్లారెడ్డి సాక్షి,సిటీబ్యూరో: నగరంలో ఎంపీగా ఉంటూ.. ఎమ్మెల్యేగా గెలిచి చామకూర మల్లారెడ్డి సరికొత్త రికార్డు నెలకొల్పారు. మల్కాజిగిరి ఎంపీగా కొనసాగుతున్న ఉన్న ఆయన తాజాగా మేడ్చల్ నియోకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి భారీ మెజారిటీతో విజయం దుందుభి మోగించారు. అయితే, ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. ఇక అంబర్పేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన కాలేరు వెంకటేష్ సతీమణి పద్మ గోల్నాక కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. నగరం నుంచి తొలిసారి శాసనసభలో అడుగుపెడుతున్న వారిలో భేతి సుభాష్రెడ్డి(ఉప్పల్), ముఠా గోపాల్(ముషీరాబాద్), కాలేరు వెంకటేష్ (అంబర్పేట్) ఉన్నారు. -
వీఐపీలకు షాక్..
-
ఓట్ల పంట
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు తెలంగాణ రైతాంగం పూర్తి అండగా నిలిచింది. రైతుబంధు పథకం లబ్దిదారులు ఆ గులాబీ పార్టీకే మళ్లీ పట్టం గట్టారు. ఖరీఫ్, రబీలలో ఎకరాకు రూ.8 వేల చొప్పున ఇవ్వడంతో తమకు అన్నదాతల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని ఆశించిన టీఆర్ఎస్ వర్గాలకు ఓటు రూపంలో ఆశీర్వాదం లభించింది. సీజన్ ప్రారంభానికి ముందే సాగు ఖర్చు సహా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి పెట్టుబడి సాయం ఎంతో అక్కరకు వచ్చిందన్న భావన రైతు వర్గాల్లో నెలకొంది. పైగా చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ రైతుకు వారికున్న భూమిని బట్టి ఎకరాకు రూ. 4వేల చొప్పున ఇవ్వడంతో అది ఓటు రూపంలోకి మారింది. రైతు బీమాతోనూ లబ్ది పొందుతున్నారు. రైతు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ఇస్తున్న తీరు కూడా ఓటుగా మారిందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రూ.10 వేల కోట్లు.. కోటి ఓట్లు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. 58.33 లక్షల మంది రైతులకు రూ.5,730 కోట్లు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకోసం ఏకంగా 58.98 లక్షల చెక్కులను ముద్రించింది. చివరకు ఖరీఫ్లో 50.91 లక్షల మంది రైతులకు చెక్కులు ఇచ్చారు. వారికి రూ. 5,256 కోట్లు అందజేశారు. అంటే ఒక్కో రైతుకు సరాసరి రూ.10,322 అందాయి. 50.91 లక్షల మంది రైతులకు ఇచ్చారంటే, ఆ కుటుంబంలో భార్య, 18 ఏళ్లకు పైబడిన వయసున్న కొడుకును కలిపినా దాదాపు 1.25 కోట్ల మంది రైతులు, వారి కుటుంబ సభ్యులు రైతుబంధుతో ప్రయోజనం పొందారు. ఒకవేళ కుమారులు విడిగా రైతుబంధు పథకం కింద లబ్ధిపొందారని అనుకున్నా రైతు, ఆయన భార్యతో కలిపినా కోటి మందికిపైగా నేరుగా లబ్దిపొందినట్లే. అంటే రాష్ట్రంలో 2.70 కోట్లకు పైగా ఓటర్లుంటే, అందులో హైదరాబాద్ ఓటర్లను మినహాయిస్తే 30 జిల్లాల ఓటర్ల సంఖ్య 2.33 కోట్ల మంది. అందులో రైతుబంధు ద్వారా లబ్దిపొందిన వారు కోటి మంది. అంటే ఏకంగా 42% మంది గ్రామీణ ఓటర్లు రైతుబంధు లబ్ధిదారులని తేలింది. ఇక ప్రస్తుత రబీ సీజన్లో ఇప్పటివరకు 44 లక్షల మంది రైతులకు రూ.4,725 కోట్లు రైతుబంధు సొమ్మును సర్కారు పంపిణీ చేసింది. అంటే సరాసరి ప్రతీ రైతుకు రూ.10,738 ఇచ్చారు. ఇలా రెండు సీజన్లకు కలిపి ఒక్కో రైతుకు దాదాపు రూ.21 వేలు ఇచ్చినట్లయింది. మొత్తంగా రెండు సీజన్ల కు కలిపి ఇప్పటివరకు దాదాపు రూ.10 వేల కోట్ల రైతు జేబుల్లోకి వెళ్లాయి. పైగా వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.10 వేలు ఇస్తా మని టీఆర్ఎస్ హామీ ఇవ్వడంతో రైతులు వారి వైపు మొగ్గుచూపారు. ఇటు రైతుబంధు లబ్ధిదారుల్లో ఐదెకరాల్లోపు రైతులే 68% మంది ఉన్నారు. అంటే వారంతా కూడా సన్న, చిన్నకారు రైతులేనని స్పష్టమవుతోంది. అందులో ఎకరాలోపున్న రైతులు 7.39%, 1–2 ఎకరాల మధ్య రైతులు 15.62%, 2–3 ఎకరాల మధ్య ఉన్న రైతులు 16.67%, 3–4 ఎకరాల మధ్య ఉన్న రైతులు 14.78%, 4–5 ఎకరాల మధ్య ఉన్నవారు 13.59% మంది ఉ న్నారు. ఐదెకరాల్లోపున్న రైతుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే కావడంతో వారంతా టీఆర్ఎస్కే గంపగుత్తగా ఓట్లేశారు. -
టీడీపీ 'ఔట్'..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి టీడీపీ నిష్క్ర మించినట్టేనా? పార్టీ నేతలు వెళ్లిపోయినా కేడర్ మిగిలి ఉందంటూ ప్రగల్భాలకు పోయిన చంద్రబాబు అండ్ కో ఖేల్ ఖతం అయినట్లేనా? అంటే తాజా ఎన్నికల ఫలితాలు దాన్ని చెప్పకనే చెబుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేసి 15 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ.. ఈసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని కేవలం 2 స్థానాలకే పరిమి తమైంది. బాబు సహా ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు 40 మంది ఆర్థిక, అంగబలంతో రంగంలోకి దిగినా కేవలం ఖమ్మంలో 2 స్థానాలను గెలుచుకోవడం గమనార్హం. ఇకపై మిత్రులూ కష్టమే... ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసే అలవాటున్న టీడీపీకి తెలంగాణలో రానున్న కాలంలో రాజకీయ మిత్రుడు కూడా దొరికే అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కలసి పోటీ చేసిన బీజేపీతో పూర్తిస్థాయిలో తెగతెంపులైన నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదనేది రాజకీయ విశ్లేషకుల అంచ నా. దేశవ్యాప్తంగా సమీకరణలు ఎలా ఉన్నా.. ఈ ఫలితాలనుబట్టి తెలంగాణ వరకు కాంగ్రెస్–టీడీపీల మైత్రి కష్టమేననే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. టీడీపీ, చంద్రబాబు కారణంగానే కాంగ్రెస్ ఓటమి పాలయిందనే బలమైన వాదన కారణంగా కాంగ్రెస్, టీడీపీల మిత్రుత్వం ఈ ఎన్నికలతోనే ముగిసినట్లేనని, భవిష్యత్తులో ఈ పొత్తును కొనసాగించే సాహసం కాంగ్రెస్ చేయబోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమ్యూనిస్టులు, టీజేఎస్ లాంటి పార్టీలు కూడా టీడీపీతో కలసి వెళ్లేందుకు ముందుకు రావని, 2 అసెంబ్లీ స్థానాల బలంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుండటం గమనార్హం. తెలుగు తమ్ముళ్ల నైరాశ్యం.. ఎన్నికల ఫలితాలు తెలుగు తమ్ముళ్లను పూర్తి నైరాశ్యంలో పడేశాయి. 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 2 స్థానాల్లోనే గెలవడం, ఎక్కడా చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు రాకపోవడం ఆ పార్టీ కేడర్ను కకావికలం చేసింది. కాంగ్రెస్ జెండాలు మెడలో ఉన్నాయని, గౌరవప్రదమైన స్థానాలు, ఓట్లు దక్కుతాయనే ఆశతో ఉన్న వారంతా ఫలితాలను చూసి డీలాపడిపోయారు. కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ల మద్దతుతో పోటీ చేస్తేనే గెలవలేకపోయిన తమ పార్టీ ఇక ఒంటరిగా మనుగడ సాధించలేదని తెలుగు తమ్ముళ్లే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
ఓడిన కాంగ్రెస్ హేమాహేమీలు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హేమాహేమీలంతా ఓటమిపాలయ్యారు. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో కారు హవా ముందు కాంగ్రెస్ సీనియర్లు నిల వలేకపోయారు. కుందూరు జానారెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, డి.కె.అరుణ, టి.జీవన్రెడ్డి, రేవంత్రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, కొండా సురేఖ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ, చిన్నారెడ్డి, బలరాంనాయక్, సుదర్శన్రెడ్డిలకు ప్రత్యర్థుల చేతిలో భంగపాటు ఎదురైంది. జానారెడ్డిపై రెండోసారి పోటీ పడిన నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్) విజయం సాధిం చగలిగారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై కూడా తన ప్రత్యర్థి భూపాల్రెడ్డి రెండోసారి పోటీలోనే గెలుపొందారు. దీంతో ఈసారి శాసనసభలో ఉత్తమ్ కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, వనమా వెంకటేశ్వర రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి లాంటి మాజీ ఎమ్మెల్యేలతోనే ఆ పార్టీ సరిపెట్టు కోవాల్సి వచ్చింది. వీరితోపాటు కాంగ్రెస్ పక్షాన ఆరుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), కందాల ఉపేందర్రెడ్డి (పాలేరు), హర్షవర్దన్రెడ్డి (కొల్లాపూర్), హరి ప్రియానాయక్ (ఇల్లెందు), పైలట్ రోహిత్రెడ్డి (తాండూరు) తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు) కూడా తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలోకి ప్రవేశించనున్నారు. పదవులున్న వాళ్లంతా...! టీపీసీసీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మినహా కాంగ్రెస్లో కీలక పదవుల్లో నేతలంతా ఓటమి పాలయ్యారు. ఏఐసీసీ కార్యదర్శులుగా ఉన్న వంశీచంద్రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న రేవంత్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, కో చైర్మన్లు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీనియర్ నేత డి.కె.అరుణ తదితరులు ఓటమి పాలైన జాబితాలో ఉన్నారు. కేంద్రమంత్రులుగా పనిచేసి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్లకు కూడా ఓటమి తప్పలేదు. -
ఖాతా తెరవని టీజేఎస్!
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ ఆకాంక్షల సాధన లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఈ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలువలేకపోయింది. ఉద్యమ ఆకాంక్షల నినాదం పెద్దగా పని చేయలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణపై ఒక కుటుంబం పెత్తనం చేస్తూ, ఇష్టానుసారం వనరులను దోచుకుంటూ, హక్కులను హరిస్తూ, నిరంకుశంగా పాలిస్తూ, ప్రజలధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే మౌనంగా ఉండకూడదన్న సంకల్పంతోనే పార్టీ పెడుతున్నాం అంటూ ప్రజల ముందుకు వచ్చిన టీజేఎస్ ఈ ఎన్నికల్లో తన ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. 2018 మార్చి 31న ఏర్పడిన టీజేఎస్.. ఏప్రిల్ 29న భారీ బహిరంగ సభతో ప్రజల ముందుకు వచ్చింది. ఈ ఎన్నికల్లో 4 స్థానాల్లో సొంతంగా, మరో 4 స్థానాల్లో ప్రజా కూటమిలో స్నేహపూర్వక పోటీ చేసినా ఒక్కచోట కూడా గెలువలేకపోయింది. కూటమిలో టీడీపీ భాగస్వామి కావడం, సభల్లో ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేయడంతో ప్రజలు కూటమిని కూడా తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్తో పాటు టీజేఎస్ కూడా తన ఉనికిని కో ల్పోయింది. టీజేఎస్ తరఫున మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన కపిలవాయి దిలీప్కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. అంబర్పేటలో నిజ్జన రమేశ్ది అదే పరిస్థితి. వర్ధన్నపేటలో పి.దేవయ్య, సిద్దిపేటలో ఎం.భవాని రెండో స్థానంలో నిలిచారు. స్నేహపూర్వక పోటీ కింద వరంగల్ ఈస్ట్లో గాదె ఇన్నయ్య, దుబ్బాకలో రాజ్కుమార్, ఆసిఫాబాద్లో విజయ్కుమార్, ఖానాపూర్లో భీంరావును పోటీలో దింపినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. భవిష్యత్తు ఏంటి? టీజేఎస్కు ఒక్క సీటు కూడా రాకపోవడంతో పార్టీ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. కూటమి అధికారం లోకి వస్తే కొన్ని ఎమ్మెల్సీ స్థానాలను తీసుకొని పార్టీ ని బలోపేతం చేసుకోవాలన్న ఆలోచనల్లో ఉన్న టీజేఎస్కు ఆ అవకాశమూ లేకుండాపోయింది. ఈ నేప థ్యంలో పార్టీ భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది. -
కాంగ్రెస్ ఖల్లాస్!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు, ఆ తర్వాత ప్రచారంలోనూ బలంగానే కనిపించిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఫలితాల్లో మాత్రం దారుణంగా చతికిలపడింది. మంగళవారం వెల్లడయిన ఎన్నికల ఫలితాల్లో ఒక్క ఖమ్మం జిల్లా మినహా ఎక్కడా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో, జీహెచ్ఎంసీ పరిధిలో (ఖమ్మం తప్ప) ఎక్కడా పట్టుమని నాలుగు సీట్లు సాధించలేని దుస్థితికి చేరుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5, నల్ల గొండలో 4, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్, జీహెచ్ఎంసీ పరిధిలో రెండు స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. కొత్త జిల్లాల వారిగా చూస్తే.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో మెరుగైన ఫలితాలను సాధించగలిగింది. దక్షిణ తెలంగాణలో.. ఎన్నికల ప్రచారంలో వచ్చిన ఊపును చూసి.. దక్షిణ తెలంగాణలో మంచి ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ ఆశించింది. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలపై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ, గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ ఈ మూడు జిల్లాల్లో చావు దెబ్బ తింది. నల్లగొండలో గత ఎన్నికలలో ఐదు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరో స్థానంలో మిత్రపక్షమయిన సీపీఐ గెలుపొందింది. కానీ, ఈ ఎన్నికల్లో హుజూర్నగర్, మునుగోడు, నకిరేకల్ స్థానాల్లో మాత్రమే గెలిచింది. మహబూబ్నగర్లో 2014లో ఏడు చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జీహెచ్ఎంసీలో హుష్కాకి.. కీలకంగా భావించిన జీహెచ్ఎంసీ పరిధిలోనూ కాంగ్రెస్ ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. మొత్తం 23 స్థానాల్లో కేవలం మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీతో పొత్తు కలసివస్తుందని, తాము ఈసారి అనూహ్య ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పినప్పటికీ ఫలితం వేరోలా కనిపించింది. ఇక, పాతబస్తీలో ఎంఐఎంకు గట్టిపోటీ ఇస్తామని గొప్పలు చెప్పుకున్నా.. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఒక్క నాంపల్లి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు సాధించగలిగారు. ఒక్కమాటలో చెప్పాలంటే 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలే మళ్లీ పునరావృతమయ్యాయి. ఈ దెబ్బతో.. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కోలుకోవడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ 3 జిల్లాలోనే! కాంగ్రెస్ గెలిచిన స్థానాలను పరిశీలిస్తే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలో మంచి ఫలితాలు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో 2014 ఎన్నికలలో గెలిచిన పాలేరు, మధిర స్థానాలను మళ్లీ నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఇప్పుడు కూడా ఆ స్థానాలను నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన ఖమ్మం స్థానాన్ని ఈసారి పొత్తులో టీడీపీకి ఇచ్చి చతికిలపడింది. మహూబూబాబాద్ జిల్లా ఇల్లెందు స్థానాన్ని గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా నిలబెట్టుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయినప్పటికీ ఈసారి కొత్తగూడెం, భద్రాచలం, పినపాక స్థానాలను ఈసారి గెల్చుకుంది. ఇదే జిల్లాలోని అశ్వారావుపేటను టీడీపీకి ఇచ్చింది. అక్కడ టీడీపీ గెలిచింది. భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, మంథని స్థానాల్లో గత ఎన్నికల్లో ఓడిపోయినా ఈసారి అనూహ్య గెలుపు సాధించింది. ములుగులో మంత్రి చందూలాల్ను కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఓడించారు. పాలేరులో కూడా మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్రెడ్డి ఓడించగలిగారు. మంథనిలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు.. టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై విజయం సాధించారు. -
రాహుల్.. ప్చ్!
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఎన్నికల ప్రచారం ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు కలసిరాలేదు. మొత్తం 17 చోట్ల జరిగిన సభల్లో 27 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ముథోల్, కామారెడ్డి, చార్మినార్, కొడంగల్, ఖమ్మం, పాలేరు, మధిర, సనత్నగర్, నాంపల్లి, భూపాలపల్లి, పరకాల, మంథని, ములుగు, హుజూరాబాద్, ఆర్మూరు, బాల్కొండ, జుక్కల్, నిజామాబాద్ రూరల్, పరిగి, గద్వాల, ఆలంపూర్, తాండూరు, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కూకట్పల్లి, కోదాడల్లో రాహుల్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ స్థానాల్లో కేవలం పాలేరు, భూపాలపల్లి, మంథని, తాండూరు, ములుగు నియోజకవర్గాల అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. మేడ్చల్లో నిర్వహించిన భారీ బహిరంగసభకు రాహుల్తోపాటు సోనియాగాంధీ కూడా హాజరయ్యారు. అయినా ఇక్కడా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటమి తప్పలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేసిన 8 నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా కూటమి అభ్యర్థులు గెలుపొందలేదు. ఖమ్మం, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సనత్నగర్, నాంపల్లి, కోదాడల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. మెరుగైన ఫలితం ఆశించా! తెలంగాణలో కాంగ్రెస్ మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆశించాను. ఛత్తీస్గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. తెలంగాణ, మిజోరంలోనూ ఇలాగే సత్ఫలితాలుంటాయని భావించాను.ఒక్కో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది. డిమాండ్లు కూడా వేర్వేరుగా ఉంటాయి. వాటికి అనుగుణంగా మేం నడుచుకుంటాం. ఈ విషయంపై ఆయా రాష్ట్రాల నేతలతో మాట్లాడి వారి స్పందనను బట్టి ముందుకెళ్తాం – రాహుల్ గాంధీ (ఢిల్లీలో మీడియా సమావేశంలో ) -
అధికారంపై ధిక్కారం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో గెలిచి ఢిల్లీ పీఠాన్ని మరోసారి అధిరోహించాలన్న బీజేపీ విశ్వప్రయత్నాలకు ఈ ఎన్నికలు భారీగా గండికొట్టాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, 2019లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్న రాహుల్గాంధీల సత్తాకు పరీక్షగా మారిన ఈ ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది. మరోవైపు కాంగ్రెస్ ముచ్చటగా మూడు రాష్ట్రాల్లోనూ విజయకేతనం ఎగురవేసి సెమీఫైనల్స్లో సత్తా చాటింది. 2019 లోక్సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ రాహుల్గాంధీని ప్రధాని రేసులోకి తీసుకొచ్చింది. మరోసారి అదే పంథా.. గత 2 దశాబ్దాలుగా ప్రతీ ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే అలవాటున్న రాజస్తాన్ ఓటర్లు ఈసారి అదే పంథాను కొనసాగించారు. 2013లో వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీకి 161 అసెంబ్లీ సీట్లు కట్టబెట్టి అధికారాన్ని అప్పగించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 21 స్థానాల్లోనే విజయం సాధించింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్ల సంఖ్య కంటే ఎక్కువగానే అక్కడి ప్రజలు కట్టబెట్టారు. ఎట్టకేలకు ఛత్తీస్గఢ్లో మార్పు.. గత మూడు ఎన్నికల్లో గెలిచి.. రాష్ట్రంలో 15 ఏళ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీని ఛత్తీస్గఢ్ ప్రజలు ఈసారి ఇంటికి సాగనంపారు. 15 ఏళ్ల రమణ్సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనబడింది. దీని ఫలితంగా చాలా స్థానాల్లో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు మిజోరంలో కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణను ఇచ్చిన పార్టీగా ఈసారి ఎన్నికల బరిలోకి దిగినా కాంగ్రెస్ పరాభవం తప్పలేదు. గతంతో పోల్చుకుంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుంది. రైతులే నిర్ణయించారా..! సెమీఫైనల్స్లో అధికార మార్పిడికి రైతుల్లో ఉన్న అసంతృప్తి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల రైతులు తమ కోపాన్ని అక్కడి పాలక పక్షంపై ఓట్ల రూపంలో చూపించారు.2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే రైతుల అంశమే పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలిచిన 3రాష్ట్రాల్లో రుణమాఫీ అంశం బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. అక్కడ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాహుల్గాంధీ విస్త్రతంగా చేసిన ప్రచారం రైతుల ఓట్లు కాంగ్రెస్కు పడేలా చేసింది. రైతులే ప్రధాన ఎజెండా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్పై రైతులు పూర్తి విశ్వాసాన్ని కనబరిచారు. ఆ పార్టీ రైతులు కోసం అమలు చేస్తున్న పథకాలు, ఉచిత వ్యవసాయ కరెంటు వంటివి తిరిగి అధికారాన్ని పొందేందుకు సహకరించాయి. రాఫేల్ ఒప్పందాన్ని టార్గెట్ చేస్తూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందగా.. బీజేపీ హిందుత్వ విధానం అంతగా పనిచేసినట్లు కనిపించలేదు. మోదీ ఆలోచనలు సరిగా పనిచేయకపోవడం, యోగి ఆదిత్యనాథ్ చేసిన హనుమాన్ దళిత్ వ్యాఖ్యలు, మైనార్టీలను దేశం వదిలి వెళ్లి పోవాలనడం, నగరాలకు పేర్లు మార్చడం వంటివి కూడా ఓటమికి కారణాలని బీజేపీ సీనియర్ ఎంపీ ఒకరు తెలిపారు. తాజా ప్రతికూల ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. -
అసెంబ్లీలో రెడ్లదే రాజ్యం
కొత్త అసెంబ్లీకి ఎన్నికైన వారిలో అగ్రకులంలోని రెడ్ల హవా కొనసాగింది.ప్రధాన పార్టీలు కూడా వారికే ప్రాధాన్యం ఇవ్వడంతో అత్యధికంగా ఆ సామాజిక వర్గానికి చెందిన వారు 39 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరి తర్వాత అధికంగా 10 మంది వెలమలు గెలిచారు. బ్రాహ్మణ, వైశ్య వంటి వారిని కలిపి మొత్తం అగ్రకులాలకు చెందిన ఎమ్మెల్యేలు 52 మంది ఉన్నారు. బీసీలు అందరూ కలిపి 23 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఎక్కువగా మున్నూరు కాపులు తొమ్మిది మంది ఉండగా, యాదవులు ఐదుగురు, గౌడలు నలుగురు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో మాల, మాదిగలు చెరో తొమ్మిది స్థానాలు గెలువగా, నేతకాని వర్గం నుంచి ఒకరు గెలుపొందారు. ముస్లింలు ఎనిమిది స్థానాల్లో గెలవగా, ఇందులో ఏడుగురు ఎంఐఎం తరఫున గెలిచిన వారే ఉండగా, బోధన్ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన షకీల్ విజయం సాధించారు. – సాక్షి, హైదరాబాద్ -
వికటించిన రాజకీయ కుట్ర!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పెద్ద కుట్ర పూర్తిగా వికటించింది. నలభయ్యేళ్ల ఇండస్ట్రీ అనికాలర్ ఎగరేసే ఓ నేత, ఏ ఎండకా గొడుగు పట్టే ఒక మీడియా సంస్థ అధినేత రాజకీయం–ఇండస్ట్రీల అవకాశవాద కలబోత ముసుగులో ఆడిన నాటకం రక్తికట్టకపోగా అసలుకే ఎసరు తెచ్చింది. ఆశించిన ఫలితమేదీ నెరవేర్చకపోగా మిణుకుమిణుకుమంటున్న వారి విశ్వసనీయతకూ పెద్ద గండికొట్టింది. తామొకటి తలిస్తే జనమొకటి తలచె అన్నట్లు ప్రజాతీర్పు వారి కుయుక్తులను చిత్తు చేసింది. బెట్టింగ్ ప్రపంచంలో ఎందరినో బోల్తా కొట్టించిన వారి ‘ఎత్తుగడ పార్ట్–2’ చివరకు చీకట్లో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారడం వరకే పరిమితమైంది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ‘ఫలానా సర్వే ఏమైంది?, ఫలితం ఎందుకిలా భిన్నంగా వచ్చింది?, విపక్షాలు మరీ ఇంత ఘోరమా?’ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాన్యుల్లో ఎన్నో ప్రశ్నలు, ఎడతెగని సందేహాలు! దీనికి సమాధానం తెలియాలంటే వెనక్కి తిరిగి కాస్త లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలే వెలుగుచూస్తాయి. ఎగ్జిట్ పోల్ భ్రమ కల్పిస్తూ, సర్వే అని బుకాయిస్తూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన ఎన్నికల ఫలితాలపై అంచనాలొక పెద్ద రాజకీయ వ్యూహం! నాన్చి నాన్చి నాడు ఈ అంచనాలను వెల్లడించడం వెనుక రాజకీయ ‘ఒత్తిళ్లు’ పనిచేసినట్లు ప్రచారం జరిగింది. ఆ గణాంకాలకు, ఇప్పు డు వెల్లడైన ఫలితాలకు పొంతన లేకపోవడాన్ని అన్వయించినప్పుడు నాటి ప్రచారం నిజమేనేమో అనిపిస్తుంది! ఇక రాబోయే ఎన్నికల్లో జనం ఇటువంటి ఎత్తుగడల్ని ముందే ‘ఛీ’కొట్టనున్నారు. అది రేపు జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలైనా, లోక్సభకు జరిగే సాధారణ ఎన్నికలైనా వారిది ఇదే పరిస్థితి! ‘ఇక ఆక్టోపస్ పని ఔట్!’ అన్నది ప్రస్తుత జనవాణి. గెలుపును చిన్నబుచ్చే యత్నం... రెండోసారి అంచనాలు వెల్లడించినప్పుడు ప్రజాకూటమికి 65 స్థానాలు వస్తాయని, పాలక టీఆర్ఎస్కు 35 స్థానాలు వస్తాయని ‘సర్వే’క్షకుడు వెల్లడించారు. దానికితోడు ఓ అశాస్త్రీయమైన ఎర్రర్ మార్జిన్ ప్రకటించారు. పనిలో పనిగా ముందే ఓ రాయి వేసి ప్రత్యర్థి గెలిస్తే ఆ గెలుపును చిన్నది చేసి చూపే ప్రయ త్నం ప్రారంభించారు. తాము ఆశిస్తున్నట్టు పాలకపక్షం ఓడిపోయి, కూటమి గెలిస్తే సరేసరి! ‘ఆక్టోపస్ మళ్లీ సక్సెస్!’ అని బాకా ఊదుకోవచ్చు! కూటమే ఓడి, పాలకపక్షం తిరిగి గెలిస్తే.. ఏదో ఒక సాకు ముం దే సిద్ధం చేసుకున్నట్టు, ‘ఈసారి పోలింగ్ను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి, డబ్బు–మద్యం–ఇంకా ఇంకా... ఏవేవో ప్రభావలుండటం వల్ల పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతోంది, అంచనా వేయడం మాకు కష్టమవుతోంది’ అని చెప్పడం వెను క ఉద్దేశం ఇదే! ఏ సర్వే అయినా, ఏ ఎగ్జిట్ పోల్ అయినా, ఎవరు ఎటు వేస్తున్నారు/వేయనున్నారు/వేశారు అన్నదే చూస్తారు తప్ప కారణాలు వెతికి, అంచనా తమకు చాలా కష్టంగా ఉందని ‘దీనాలాప న’ చేయరు! కానీ ఇక్కడ అదే చేశారు. ‘వీరు గెలిచే మరికొందరు స్వతంత్రుల’ని కొన్ని పేర్లు చెప్పి, ‘ఇంకొన్నిటి సమాచారం కూడా ఉంది కానీ అక్కడ నా మిత్రులు పోటీ చేస్తున్నారు కనుక అవి చాలా సున్నితమైనవి, నేను పేర్లు వెల్లడించను’ అని తన పక్షపాత ధోరణిని ఆయనే బయటపెట్టారు. ఇవి కల్లబొల్లి కబుర్లని తెలిసీ పతాక శీర్షికలు చేసి/బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి సాను‘కుల’ మీడియా తరించిం దని ప్రత్యర్థి రాజకీయపక్షాల వారు విమర్శించింది కూడా ఇందుకే! ఇదంతా ఓ విశాల కుట్రలో భాగమ ని సాధారణ పరిశీలకులకు కూడా స్పష్టమైంది. ఎందుకీ తెగింపు? ఏది చేసినా నిర్దిష్ట ప్రయోజనాలు ఆశించే చేస్తారని ఎప్పట్నుంచో ఈ సర్వేల పెద్దమనిషికి పేరు. కాకతా ళీయంగానో, యాదృచ్ఛికంగానో 4 సార్లు నంబర్లు కలవగానే.... ఓ గొప్ప సెఫాలజిస్టని, రాజకీయ/ఎన్నికల ఫలితాల విశ్లేషకుడనే పేరు ప్రచారంలోకి వచ్చింది. తుది ఫలితాలకు దగ్గరగా ఉన్నపుడు ‘అబ్బో! అచ్చుగుద్దినట్టొచ్చింద’ని విస్తృత ప్రచారం చేసే సాను‘కుల’ మీడియా, నంబర్లు తేడా వచ్చినప్పుడు మాత్రం కిమ్మనదు. తప్పుడు విశ్వసనీయతను ముసుగు కప్పి మరీ కాపాడుతుంది. ఎప్పుడో మళ్లీ అవసరానికి పనికొస్తారు కదా అన్నది ఉమ్మడి ప్రయోజనం కావొ చ్చు! ఈ ఎన్నికల్లో కుట్రదారులు రెండంచెల నాటకమాడారు. ప్రజాక్షేత్రంలో అయోమయం సృష్టించి కూటమికి జవసత్వాలివ్వడం ఒకటైతే... బెట్టింగ్లకు ఆస్కారం పెంచడం రెండోది. సోదిలో కూడా లేని కూటమి దూసుకొస్తోందని, గెలుపు దిశగా పరుగెడుతోందని తప్పుడు రాతలు రాసిన అదే సాను‘కుల’ మీడియా ఈ చిలక జోస్యాలకు విస్తృత ప్రచారం కల్పించి వేదిక సిద్ధం చేస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది. ‘ఈ ఎన్నికల్లో 10 మంది వరకు స్వ తంత్రులు గెలుస్తారు, ఇదుగో ఈ ఇద్దరివి పేర్లు...’ అని తిరుపతిలో ఆ పెద్దమనిషి వెల్లడించినది టీజర్! ఆ ఇద్దరూ అడ్రస్ లేకుండా పోయారు. నారాయణపేటలో కె.శివకుమార్రెడ్డి 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోగా బోథ్లో అనిల్జాదవ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక మిగతా ఇండిపెండెంట్ల పరిస్థితి అంతే సంగతి! అంచనాల పేరిట కూటమికి సత్తువ తెచ్చే ఈ కుట్రకు తెరలేచింది మాత్రం మీడియా పెద్ద మనిషి, రాజకీయ నేతతో సదరు ‘సర్వే’క్షకుడి భోజన భేటీలో అన్నది ప్రచారం. ఇక తమ అంచనాల పార్ట్–2 నాటకం, తెలంగాణలో పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రం 7 గంటలకు జరిగింది. ఆ సమయంలో విలేకరుల సమావేశమనగానే ఎవరైనా ‘ఎగ్జిట్ పోల్’ వివరాలు వెల్లడిస్తారేమో అనుకుంటారు. ఎగ్జిట్ పోల్ కాదని స్పష్టం చేసిన ఆయన... తాము సర్వే కూడా ఏమీ నిర్వహించలేదనీ ప్రకటించారు. ఎందుకిలా అంకెలు తరచూ మారుతున్నాయి? అని అడిగితే ‘మా వాళ్లు ఫీల్డులో ఉన్నారు, ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇస్తున్నారు...’ అని చెప్పుకొచ్చారు. -
ఖాతా తెరవని లెఫ్ట్..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం–బీఎల్ఎఫ్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయాయి. ఈ పక్షాలు విడివిడిగా పోటీచేసినా ఒక్క సీటు అయినా గెలవలేకపోయాయి. గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం చెరో సీటు సాధించగా, ఈసారి ఈ రెండు పార్టీలతో పాటు బీఎల్ఎఫ్కు కూడా శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1999లో సీపీఐకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఆ పార్టీ మరోసారి అదే స్థితికి లోనైంది. సీపీఎం తొలిసారిగా శాసనసభలో ప్రాతినిధ్యం లేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. మూడుచోట్లా సీపీఐ ఓటమి... కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ కూటమిలో భాగంగా కేటాయించిన 3 సీట్లలో సీపీఐ ఓటమి పాలైంది. ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు కారణంగా ఆశించిన ప్రయోజనం నెరవేరకపోగా కనీసం ఒక్కస్థానంలో కూడా గెలవకపోవడం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనుంది. సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాలు కలసి పోటీచేసి ఉంటే కనీసం వామపక్ష ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా ఉండేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హుస్నాబాద్ నుంచి పోటీచేసిన ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి 46,553 ఓట్లు సాధించి, టీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ చేతిలో 70,530 ఓట్లతేడాతో పరాజయం చవిచూశారు. ఆ పార్టీ రెండో సీటు వైరా (ఎస్టీ)లో సీపీఐ అభ్యర్థి బానోతు విజయ 32,757 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బెల్లంపల్లి (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేసిన సీనియర్ నేత గుండా మల్లేశ్ కేవలం 3,600 ఓట్లతో నాలుగోస్థానానికి పరిమితమయ్యారు. బీఎల్ఎఫ్ విఫలం.. ఈ ఎన్నికల్లో సీపీఎం–బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) కలసి మొత్తం 107 సీట్లలో పోటీచేశాయి. సీపీఎం 26 స్థానాల్లో పోటీచేయగా, పార్టీ బలంగా ఉందని భావిస్తున్న భద్రాచలంలో మూడోస్థానానికి, మిర్యాలగూడలో నాలుగోస్థానానికి పరిమితమైంది. భద్రాచలం మినహా మిగతా చోట్ల డిపాజిట్లు గల్లంత య్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ విధానాలు–సామాజికన్యాయం పేరిట ప్రస్తుత ఎన్నికల్లో సీట్లు కాకపోయినా గణనీయంగా ఓట్లు అయినా సాధించవచ్చుననే కోరిక కూడా సీపీఎం–బీఎల్ఎఫ్లకు నెరవేరలేదు. బీఎల్ఎఫ్ అభ్యర్థి కె.శివకుమార్రెడ్డి 53,580 ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచా రు. మధిరలో కోటా రాంబాబు 23,030 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఈచోట్ల మినహా మిగతా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. గోషామహల్ నుంచి తొలిసారిగా ట్రాన్స్జెండర్ అభ్యర్థి చంద్రముఖిని బీఎల్ఎఫ్ బరిలో నిలిపినా కేవలం 120 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. -
కూటమికి చంద్ర'గ్రహణమే'!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి తేరుకోలేకపోతోంది. ‘అంతా బాగుందన్న పరి స్థితుల్లో.. ఎక్కడ దెబ్బతిన్నాం?’ అన్న ప్రశ్నే వారికి తొలిచివేస్తోంది. ‘ఎవరైనా ఓడించారా? ఒక తప్పుడు నిర్ణయంతో మనల్ని మనమే ఓడించుకున్నామా?’ అనే అంతర్మథనం సాగుతోంది. గట్టి పోటీ ఇవ్వడం నుంచి.. ఒక దశలో గెలుస్తామని భావించిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతినడమే వారి షాక్కి ప్రధాన కారణం. అయిదో వంతు కూడా రాని సీట్లతో.. సంఖ్యా పరంగానే కాకుండా ఎలా చూసినా ఇది మింగుడు పడని ఓటమే! ప్రాంతాలుగా గమ నించినా, జిల్లాలుగా విశ్లేషించుకున్నా, సామాజిక వర్గాలుగా లెక్కేసుకున్నా... ప్రజా కూటమిది మహాఓటమి. పాలకపక్షం టీఆర్ఎస్ జోరుకు విపక్ష కూటమి కకావికలైంది. ఇంతటి ఘోర పరాజయానికి కారణాల అన్వేషణ మొదలైంది. కూటమిని బలోపేతం చేస్తుందనుకున్న తెలుగుదేశంతో పొత్తు, ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర తమను నిలువునా ముంచిందనే భావన పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది. ఫలితాల సరళి కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. టీడీపీకి తెలంగాణలో ఇంకా బలముందని, ఆంధ్ర ఓటర్లు ఆదరిస్తారను కున్నా.. వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ కూటమికి పెద్ద దెబ్బే తగిలింది. శివారు రంగారెడ్డి నియోజకవర్గాల్ని కలుపుకొని ఉండే హైదరాబాద్ మహానగర్ ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఖమ్మం టు శేరిలింగంపల్లి ఆయన కట్టానని చెప్పుకున్న ‘సైబరాబాద్’ లోని సైబర్టవర్స్ ఉన్న శేరిలింగంపల్లితో సహా.. బాబు రోడ్షోలు, సభలు పెట్టిన చోటల్లా కూటమికి ఓటమి తప్పలేదు. ఖమ్మం పట్టణం నుంచి కుత్బుల్లాపూర్ వరకు ఆయన సాగించిన ప్రచార ప్రస్థానంలో అంతటా ఓటమే. ఇలాం టిదేదో జరుగుతుందనే అభిప్రాయం కాంగ్రెస్లోనూ కొందరికి ముందు నుంచే ఉంది. కానీ, బహిరంగంగా చెప్పలేక పోయారు. ఆర్థికవనరులు సమకూర్చే కారణం చూపి, రాహుల్గాంధీనే చంద్రబాబు బుట్టలో పడేయ డంతో.. కింది స్థాయిలో వ్యతిరే కత ఉన్నా బయ టకు చెప్పలేకపోయారు. టీడీపీతో మనం జట్టు కట్టడం వల్ల లాభపడకపోగా నష్టపోతా మనే బల మైన అభిప్రాయముండి కూడా తామేమీ చేయలేక పోయామని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితం అనుభవిస్తున్నామనే బాధ ఎక్కువ మంది కాంగ్రెస్ వాదుల్లో వ్యక్తమౌతోంది. ముఖ్య నేతలు ఓడిపోవడం పార్టీ శ్రేణులనూ నిరాశలోకి నెట్టింది. బాబొక చెల్లని రూపాయి సమకాలీన రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోయిన నాయకుడిగా చంద్రబాబుకున్న పేరు.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు వచ్చిన సానుకూలతను, కూటమి విజయావకాశాల్ని దెబ్బతీసింది. ‘ఇంకా బాబు పెత్తనమా? ఇక రాష్ట్రం ముందుకెళ్లనట్లే’ అనే నిర్లిప్తత తెలంగాణ సగటు పౌరుల్లో ఈ పొత్తుతోనే మొదలైంది. బలమైన కారణాలు లేకుండా అసెంబ్లీని రద్దుచేసి కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం, ఒకే విడతలో 105 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఖరారు చేయడం తమకు అనుకూలిస్తోందని కాంగ్రెస్ ఉత్సా హంతో ఉన్న సమయంలో.. టీడీపీ వారితో జట్టు కట్టింది. ఈ అంశాన్ని తెలంగాణ సమాజం జీర్ణించు కోలేకపోయింది. ప్రసార మాధ్యమాల్లో ప్రచారం, బద్ధ వ్యతిరేకులతో కలవడం ద్వారా కూటమికి ప్రచారం వచ్చినా.. ప్రతి కూలించిన అంశాలే ఎక్కువ. నిర్దిష్టంగా కాంగ్రెస్ను తిట్ట డానికి ఏమీ లేని స్థితిలో కేసీఆర్కు చంద్రబాబు ఒక గొప్ప అవకాశంలా దొరి కారు. తన ప్రసంగాల్లోనూ సంక్షేమ, అభివృద్ది అంశాలతోపాటు.. చంద్రబాబుపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ‘బాబు ఎక్కడ కాలు పెట్టినా అంతే సంగతులు’, ‘కాళేశ్వరం కావాలా? శనేశ్వరం కావాలా? మీరే తేల్చుకొండ’ంటూ కేసిఆర్ వేసిన ప్రశ్న జనంలో ఆలోచనల్ని రేకెత్తించింది. పరాకాష్టకు చేరింది.. దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడుగా విమర్శల నెదుర్కొంటున్న బాబుతో చేతులు కలపడం వల్లే కాంగ్రెస్ అవకాశాలు మరింత సన్నగిల్లాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇక, హైదరాబాద్ను తానే ప్రపంచ పటంలోకి తెచ్చానని, సైబర్సిటీ కట్టానని, చివరకు దివంగత సీఎం వైఎస్సార్ ఆలోచన అయిన ఔటర్ రింగు రోడ్డు అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్హైవే వంటివీ తానే తెచ్చానని చంద్రబాబు రాహుల్ గాంధీ సమక్షంలోనే చెప్పుకోవడం పరాకాష్ట. ఏపీలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల్ని పార్టీ మార్పించి, అందులో కొందరికి మంత్రిపదవులిచ్చి ఎన్ని విమర్శలొచ్చినా కిమ్మనని బాబు, ఇక్కడ అలా పార్టీ మారినవారందరినీ ఓడించమని పిలుపునివ్వడం చూసి ప్రజలు కేసీఆర్ ఆరోపణల్ని గట్టిగా నమ్మి కూటమిని తిరస్కరించారు. ఒకటొకటిగా బయటపడ్డ కుట్రలు.. ‘ఏపీలో వ్యవస్థల్ని కుప్పకూల్చి, ప్రజల్ని వంచించి దోచుకొచ్చిన రూ. వందల కోట్ల ధనాన్ని ఇక్కడ కుమ్మరిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త’ అంటూ ఇక్కడి అధికార పార్టీ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అది నిజమే అనిపించేలా, ప్రచారంతో సహా ఎన్నికల ఖర్చంతా తామే భరిస్తున్నట్టు, ప్రచారానికి హెలికాప్టర్లనూ తమ నేతే సమకూరుస్తున్నట్టు, కాంగ్రెస్లో కొందరు అభ్యర్థుల్నీ.. బాబే ఖరారు చేస్తు న్నట్టు ఆయన వర్గీయులు, అనుకూల మీడియా సంకేతాలు ఇచ్చింది. తెలంగాణలో ప్రభుత్వపు ఒంటెత్తుపోకడ నచ్చక, కాంగ్రెస్ వైపు ఏకీకృతం కావాలని భావించిన ఒకట్రెండు బలమైన సామాజిక వర్గాలు కూడా బాబు ‘ఆధిపత్యం’ కారణంగా.. కూటమికి దూరమయ్యారు. సర్వేల పేరుతో కొందరు చేసిన నానా యాగీ, బాబుకు అనుకూలంగా పనిచేసే కొన్ని ప్రసారమాధ్యమాలు ఉన్నవీ లేనివీ కల్పించి ప్రజాక్షేత్రంలో సృష్టించిన ‘అయోమయం’ కాంగ్రెస్ వర్గీయుల్లో లేని భ్రమల్ని కల్పించింది. నందమూరి వంశీయుల్ని తన ఎదుగుదలకు వాడుకునే తత్వంతో చంద్రబాబు వేసిన ఓ చౌకబారు ఎత్తుగడ కూడా ఫలించలేదు. -
సార్వత్రికానికి సంకేతమా?
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో మూడు రాష్ట్రాలు హిందీ బెల్ట్లో ఉండగా, ఒకటి ఈశాన్య రాష్ట్రం మిజోరం. మరొకటి తెలంగాణ. తెలంగాణ, మిజోరంలలో బీజేపీ అధికారంలో లేదు. కాబట్టి ఈ ఫలితాల ప్రభావం ఆ పార్టీపై పెద్దగా ఉండబోదు. మిగిలిన మూడు రాష్ట్రాల్లో–రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్–బీజేపీ అధికారంలో ఉంది. తాజా ఎన్నికల్లో రాజస్తాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ మెజారిటీ సాధించి అధికారం కైవసం చేసుకుంది. రాజకీయ పండితులు ఈ ఎన్నికలను 2019 సార్వత్రిక ఎన్నికలకు సూచికగా పరిగణించారు. హిందీ బెల్ట్లో మళ్లీ బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటే మోదీ హవాకు తిరుగులేదని తేలుతుందని, అదే కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ పునరుజ్జీవానికి అవకాశం లభిస్తుందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేశారు. తాజా ఫలితాలను బట్టి దేశంలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి మార్గం సుగమం అవుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని సమర్థంగా నడిపించే నైతిక బలాన్ని ఈ ఫలితాలు రాహుల్కు అందిస్తాయని వారు చెబుతున్నారు. పడిలేచిన కాంగ్రెస్ శతాబ్దాల చరిత్రగల కాంగ్రెస్ ఒకప్పుడు దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారం చెలాయించింది. 2014 నాటికి దేశంలోని 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో కాంగ్రెసే అధికారంలో ఉంది. బీజేపీ కేవలం ఏడు రాష్ట్రాల్లోనే అధికార పార్టీగా ఉంది. 2017 నాటికి కాంగ్రెస్ కేవలం నాలుగు రాష్ట్రాలకే పరిమితం కాగా, బీజేపీ బలం 21 రాష్ట్రాలకు పెరిగింది. గత రెండేళ్లుగా పలు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఎదురవుతుండటం, కర్ణాటకలో కాంగ్రెస్ కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ ఇమేజ్ పని చేస్తుందా? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేదని బీజేపీ అంటోంది.అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రుల పనితీరు ప్రభావం ఉంటుందని, లోక్సభ విషయంలో ప్రధాని ప్రతిష్ట ప్రభావం చూపుతుందని పార్టీ చెబుతోంది. యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడేలు నిర్వహించిన సర్వేలో ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే మోదీకే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్టు తేలింది. కాంగ్రెస్కు నల్లేరుపై నడక కాదు రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల విజయం ఇచ్చిన స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణులు వచ్చే ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. ఒక పక్క అంతర్గత కుమ్ములాటలను నియంత్రించడంతో పాటు బలమైన శత్రువు(బీజేపీ)ను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలను కాంగ్రెస్ రూపొందించుకోవాల్సి ఉంటుంది. పప్పూ పాస్ హోగయా... గత సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో బాటు కాంగ్రెస్ అధీనంలో ఉన్న పలు రాష్ట్రాలను కైవసం చేసుకోవడంతో కమలనాథులు ఇక దేశంలో తమకు తిరుగులేదన్న ధోరణిలో ఉన్నారు. కాంగ్రెస్ తమకు పోటీయే కాదని, రాహుల్ గాంధీ ‘పప్పు’ అని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.అయితే, తాజా ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీ సత్తాను బీజేపీకి చూపించాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోదీకి రాహుల్ గాంధీయే పోటీ అని నిరూపించాయి. పప్పూ పాస్ హోగయా అని బీజేపీ మద్దతుదారులే అంగీకరిస్తున్నారు. తాజా ఫలితాలు కొన్ని ముఖ్య విషయాలను స్పష్టం చేస్తున్నాయి. వాటిలో మొదటిది బీజేపీకి కంచుకోటగా భావించిన రాష్ట్రాలు ఇప్పుడు విపక్షాల వశమయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్లలో దాదాపు పదిహేనేళ్లుగా బీజేపీయే అధికారంలో ఉంది. ఇప్పుడవి చేజారాయంటే బీజేపీ తన తీరును సమీక్షించుకోవాల్సి ఉంటుంది. మోదీ వ్యక్తిగత ప్రతిష్ట రెండో అంశం. ఎంపీ, రాజస్తాన్లలో బీజేపీ ఈ మాత్రమైనా నిలబడటానికి మోదీ చరిష్మానే కారణమన్న వాదన లేకపోలేదు. ఎన్నికల వ్యూహ రచనలో కూడా జాగరూకత అవసరమన్నది మూడో విషయం. తాజా ఫలితాలు రాహుల్ గాంధీ బాధ్యతల్ని పెంచుతాయన్నది మరో కీలక విషయం.ఇప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్ మరింత బాధ్యతాయుతంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే, కాంగ్రెస్ నాయకత్వంలో మహాకూటమిగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీల తీరు తెన్నులు ఇంకో ముఖ్య విషయం. బీజేపీ బలం తగ్గుతోందా? తాజా ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చాయి. దీని ప్రభావం వచ్చే లోక్సభ ఎన్నికలపై ఉంటుందని యాక్సిస్ మై ఇండియా సంస్థ సర్వేలో తేలింది. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి ఈ సంస్థ రాజస్తాన్, మధ్య ప్రదేశ్ , ఛత్తీస్గఢ్లలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వే చేసింది. దాని ప్రకారం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇప్పుడున్న సీట్లకంటే 35 సీట్ల వరకు పెరగొచ్చని తేలింది. బీజేపీ బలం 30కి తగ్గవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్కు 3, బీజేపీకి 62 లోక్సభ సీట్లున్నాయి. రాజస్తాన్ నుంచి ప్రస్తుతం బీజేపీకి 25 మంది ఎంపీలున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరి సంఖ్య 9కి పడిపోవచ్చని, ఆ పదహారు సీట్లు కాంగ్రెస్కు రావచ్చని ఆ సర్వే పేర్కొంది. -
పాపం పెద్దాయన..!
పెక్కు శాఖల మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందిన కాంగ్రెస్ కురువృద్ధుడు కుందూరు జానారెడ్డి తన సుదీర్ఘ రాజకీయజీవితంలో రెండోసారి ఓడిపోయారు.తాజా ఎన్నికల్లో జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య విజయం సాధించారు. 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన వరుసగా 1983, 85, 89 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1994లో వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తియాదవ్ చేతిలో 2 వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. తాను ప్రచారం చేయాల్సిన పనిలేదని, ప్రచారం చేయకుండానే గెలుస్తానని చెప్పిన జానా ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం కొత్తగా ఏర్పడే ప్రభుత్వం సుపరిపాలన అందించాలి. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలి. అవి అమలు కాని పక్షంలో ఆందోళనలు జరిగే ప్రమాదం ఉంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్న విషయాన్ని ఎన్నికల సంఘానికి చెప్పినా పట్టించుకోలేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నాం. పోలైన ఓట్లకు వీవీ ప్యాట్లలో ఉన్న ఓట్లకు పొంతన లేదు. నా విజయం కోసం పార్టీ కార్యకర్తలు, నేతలు కష్టపడి పనిచేశారు. వారి కష్టాన్ని వృథాగా పోనివ్వను. నమ్మిన వారిని ఆదుకునేందుకు ఎప్పుడూ వెనుకాడబోను. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నది నా ఆకాంక్ష. పదవిరానందుకు, గెలవనందుకు బాధ లేదు. నాపై గెలిపొందిన నోముల నర్సింహయ్యకు శుభాకాంక్షలు. – జానారెడ్డి తన జీవితంలో తీరని కోరిక ఒకటి మిగిలిపోయిందని,మీరు సహకరిస్తే అది కూడా పూర్తవుతుందని నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు జానా గతంలో చెప్పారు. సీఎం కావాలన్న ఆయన కోరిక తీరకపోగా, సాగర్ ప్రజానీకం ఆయనను ఓటమిపాలు చేయడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ -
హరీశ్ అదుర్స్...
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, ఆ పార్టీ సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్రావు రికార్డుల మోత మోగించారు. తెలంగాణ జన సమితి అభ్యర్థి భవానీ మరికంటిపై ఏకంగా 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా హరీశ్ అరుదైన ఘనత సాధించారు. తెలంగాణతోపాటు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా హరీశ్రావు నిలిచారు. అలాగే అతిపిన్న వయసులో వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై డబుల్ హ్యాట్రిక్ సాధించిన ప్రజాప్రతినిధిగా కూడా మరో రికార్డు సొంతం చేసుకున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కె.ఎం. మణి (49 ఏళ్ల వయసులో) గతంలో అసెంబ్లీకి ఆరుసార్లు ఎన్నికవగా ప్రస్తుతం హరీశ్రావు 47 ఏళ్ల వయసులోనే ఈ రికార్డు సాధించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో సిద్దిపేట నియోజకవర్గం నుంచి వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఆయన వయసు 50 ఏళ్లు. అలాగే ఇప్పటివరకు ఐదుసార్లు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు చేసి హరీశ్ మరో రికార్డు నమోదు చేశారు. దీనికితోడు పోటీ చేసిన ప్రతిసారీ తన మెజారిటీని మరింత పెంచుకుంటూ విజయం సాధించారు. పోటీ చేసిన ఐదు వరుస ఎన్నికల్లోనూ పోలైన ఓట్లలో 80 శాతానికిపైగా ఓట్లు సాధించి ఇంకో రికార్డును సొంతం చేసుకున్నారు. గొప్ప గౌరవం ప్రజాజీవితంలో ఇంతకన్నా గొప్ప గౌరవం, ఇంతకన్నా అద్భుతమైన అనుభవం మరొకటి ఉండదు. సిద్దిపేటకు నేను ఇచ్చింది గోరంత. అది నాకు తిరిగి ఇచ్చింది కొండంత. జనం తిరగరాసినవి కేవలం ఎన్నికల రికార్డులనే కాదు... వారు ప్రతిసారీ తెలంగాణ చరిత్రనే తిరగరాస్తున్నారు. – టి.హరీశ్రావు -
కేసీఆర్ 2.0.. బ్లాక్ బస్టర్
మందలు, మందలుగా ‘స్టార్ క్యాంపెయినర్లు’ దండెత్తి వచ్చినా.. ‘సింహం సింగిల్గా’నే పోరాడింది. కేసీఆర్ జపించిన సంక్షేమ మంత్రానికి పల్లెలన్నీ పోలింగ్ బూత్లకు వరుసకట్టాయి. ఆయన మరోసారి సంధించిన ఆత్మగౌరవ బాణం పట్టణాల్లో ప్రభంజనాన్ని సృష్టించింది. బాబుతో పొత్తు కాంగ్రెస్ పుట్టి ముంచింది. బాబు అండ్ బావ మరిదిల ఓవర్ యాక్షన్ను జనం ఛీకొట్టారు. మరోసారి కేసీఆర్కు జైకొట్టారు. ఒక్క ఖమ్మం జిల్లా మినహా గులాబీ రథానికి ఎక్కడా ఎదురేలేకుండా పోయింది. హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటా. ఇక్కడి నుంచి దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా పెద్ద సమస్య కాదు. రాష్ట్రాల్లో ఢిల్లీ పెత్తనం ఎందుకుండాలి? విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలను రాష్ట్రాలకు వదిలేయకుండా కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటోంది. పాకిస్తాన్ సమస్యను పరిష్కరించే తెలివి లేదు గానీ.. రాష్ట్రాలపై పెత్తనమా?. తెలంగాణ వేదికగా దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరముంది. చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. లేకపోతే తెలంగాణ ప్రజలు సంస్కార హీనులు అనుకుంటారు. నేను ఇవ్వబోయే బహుమతి ప్రభావం ఎలా ఉంటుందో మీరే చూస్తారు. ఏపీలో బాబు పరిస్థితి సరిగా లేదు. ఆయనకు పైత్యం ఎక్కువైంది. ప్రధాని మోదీని చంద్రబాబు గతంలో హద్దులు లేకుండా పొగిడారు. అతిగా పొగిడే క్రమంలో ఆయన బోల్తా పడ్డారు. – మీడియాతో కేసీఆర్ తెలంగాణ గడ్డపై మళ్లీ టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు జై కొట్టిన ప్రజలు ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వానికి అఖండ మెజార్టీతో ఆమోదం తెలిపారు. ధైర్యంగా ముందస్తు ఎన్నికలకు నిర్ణయం తీసుకోవడం, మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచిన కేసీఆర్.. ఫలితాల్లోనూ అదే జోరుకు కొనసాగించారు. ప్రచారంలో అన్నీ తానై పార్టీని ఒంటిచేత్తో నడిపించిన రాజకీయ యోధుడు మరోసారి తెలంగాణ ప్రజల ఆశీర్వాదాన్ని అందుకున్నాడు. కాంగ్రెస్కు ఊహించని దెబ్బకొట్టిన కేసీఆర్.. బీజేపీని దాదాపుగా గల్లంతు చేసినంత పనిచేశారు. తెలంగాణలో కారు జోరుకు ప్రొఫెసర్ కోదండరాం సార్ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఈ అఖండ విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో తనకు తిరుగులేదని గులాబీ దళపతి నిరూపించుకున్నారు. పదిహేను రోజుల్లో రాష్ట్రం మొత్తాన్ని చుట్టివచ్చిన ఒకే ఒక్కడుగా, టీఆర్ఎస్ ఏకైక స్టార్ క్యాంపెయినర్గా వాహ్వా అనిపించారు. సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటినుంచి ప్రజా సంక్షేమంపైనే దృష్టిపెట్టి.. ఆ దిశగానే పథకాలు రూపొందించారు. అందుకే.. రైతుబంధు ఆయన్ను రారాజుగా నిలిపింది. కల్యాణæలక్ష్మి ఓట్ల వర్షం కురిపించింది. పింఛను పొందిన వారంతా బాసటగా నిలవడంతో టీఆర్ఎస్కు ఓట్ల పంట పండింది. మైనారిటీలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలు మూకుమ్మడిగా అండగా నిలవడంతో గులాబీసేన తిరుగులేని ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్లు కూడబలుక్కుని కూటమిగా వచ్చినా కారు జోరు ముందు నిలవలేకపోయాయి. తెలంగాణను తామే అభివృద్ధి చేశానంటూ ప్రగల్భాలు పలికిన పచ్చపార్టీని 15 నుంచి 2 స్థానాలకే పరిమితం చేశారు. కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పాల్గొన్న తెలంగాణ జనసమితిని.. అయ్యా మీ కో‘దండం’ అంటూ ఇంటికి పంపించేశారు. రాహుల్ ‘షో’ లతో ఓట్లు రాలుతాయని భావించిన కాంగ్రెస్ పార్టీకి చివరకు ఘోర పరాభవమే మిగిలింది. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 88 స్థానాల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం సృష్టించింది. రైతులు, పేద ప్రజల సంక్షేమ పథకాలు, పాలన సంస్కరణలతో తెలంగాణ ఉద్యమ రథ సారధి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చరిత్ర సృష్టించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయఢంకా మోగించి వరుసగా రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. రైతన్నలకు ఎకరాకు 4 వేల రూపాయలు ఇవ్వడం ద్వారా యావత్ తెలంగాణను ఫిదా చేసిన కేసీఆర్.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, రుణ మాఫీ, సామాజిక పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు, కంటి వెలుగు వంటి పథకాలతో ప్రజల గుండెల్లో ఇంకా తానే ఉన్నానని నిరూపించారు. గత శాసనసభ ఎన్నికల్లో కేవలం తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా 63 స్థానాలను నెగ్గిన టీఆర్ఎస్ ఈ సారి అభివృద్ధి, సంక్షేమం మంత్రంతో దూకుడు ప్రదర్శించి సంఖ్యా బలాన్ని 88కు పెంచుకుంది. సీఎం కేసీఆర్ గజ్వెల్లో 58,290 ఓట్ల భారీ మెజారిటీతో గెలవగా.. సిద్దిపేటలో మంత్రి తన్నీరు హరీశ్ రావు 1,18,699 ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించి.. సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కూడా 89,009 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. పార్టీ నుంచి మరో 15 మంది 50 వేలకు పైగా మెజారిటీని సాధించడం గమనార్హం. అంతటా టీఆర్ఎస్ గాలి వీచినా స్పీకర్ మధుసూదనాచారితో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, చందులాల్ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ప్రజాకూటమికి పగటికలే! కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీల కలయికతో ఏర్పడిన ప్రజాకూటమి ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూసింది. కేసీఆర్ను గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నికలకు ముందు పురుడుపోసుకున్న ఈ కూటమి కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లో గెలుపుతో సరిపెట్టుకుంది. కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా 99 (నాలుగు సీట్లలో టీజేఎస్, కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీ) చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో గెలుపొందగా, 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 2 స్థానాలకే పరిమితమైంది. 8 స్థానాల్లో పోటీ చేసిన టీజేఎస్, మూడు స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ పార్టీలు కనీసం ఒక్క సీటునూ గెలవలేకపోయాయి. కేసీఆర్ హవా కారణంగా.. కాంగ్రెస్ సీనియర్ నేతలైన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, జీవన్రెడ్డి, రేవంత్రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్అలీ, కొండాసురేఖ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ, చిన్నారెడ్డి, బలరాం నాయక్, సుదర్శన్రెడ్డిలకు ఓటమి తప్పలేదు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన ఏడు శాసనసభ స్థానాలను నిలబెట్టుకుని హైదరాబాద్ పాతబస్తీపై తన పట్టును నిలబెట్టుకుంది. రాజేంద్రనగర్లో పోటీ చేయడం ద్వారా పార్టీని నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేసేందుకు మజ్లిస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టబోయింది. పార్టీ పోటీ చేసిన 118 స్థానాల్లో కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. గోషామహల్ నుంచి రాజాసింగ్ గెలిచారు. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచారం నిర్వహించినా బీజేపీకి ఓట్లు రాలేదు. బీజేపీ ఎల్పీ నేత కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్లకు ఓటమి తప్పలేదు. ఆలిండియా ఫార్వర్డ్బ్లాక్ పార్టీ రామగుండంలో, ఇండిపెండెంట్ అభ్యర్థి రాములు వైరాలో గెలుపొందారు. టీజేఎస్ ఎక్కడా కనీస పోటీని ఇవ్వలేకపోయింది. టీజేఎస్ పోటీ చేసిన చోట్లలో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ దక్కింది. సీపీఎం, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కూటమి ప్రయోగం దారుణంగా విఫలమైంది. గత ఎన్నికల్లో ఒక సీటును గెలిచిన సీపీఎం ఈ సారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మెజారిటీ రికార్డుల మోత 50,000+ టీఆర్ఎస్ నుంచి ఏకంగా 15 మంది సభ్యులు,ఎంఐఎం నుంచి ముగ్గురు ఈ ఘనతను అందుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఏకంగా 15 మంది సభ్యులు 50 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలుపొందగా, ఎంఐఎం నుంచి ముగ్గురు ఈ ఘనతను అందుకున్నారు. వర్ధన్నపేట నుంచి ఆలూరి రమేశ్ (టీఆర్ఎస్) 99,240 ఓట్లు, మేడ్చల్ నుంచి జీహెచ్ మల్లారెడ్డి,(టీఆర్ఎస్) 87,990, బహదూర్పుర నుంచి మౌజం ఖాన్ (మజ్లిస్) 82,518 ఓట్లు, చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ (మజ్లిస్)80,264, మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు (టీఆర్ఎస్) 73,698, హుస్నాబాద్ నుంచి సతీష్కుమార్ (టీఆర్ఎస్) 70,530 ఓట్లు, దుబ్బాక నుంచి సోలిపేట రామలింగారెడ్డి (టీఆర్ఎస్) 62,500, జగిత్యాల నుంచి ఎం.సంజయ్కుమార్(టీఆర్ఎస్) 61,185 ఓట్లు, నారాయణ్ఖేడ్ నుంచి మహారెడ్డి గోపాల్ రెడ్డి (టీఆర్ఎస్) 58,508, రాజేంద్రనగర్ నుంచి ప్రకాశ్గౌడ్ (టీఆర్ఎస్) 58373, మహబూబ్నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్ (టీఆర్ఎస్) 57,775, నాగర్కర్నూల్ నుంచి మర్రి జనార్ధన్రెడ్డి (టీఆర్ఎస్) 54,354, పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్రావు (టీఆర్ఎస్) 53,053, వనపర్తి నుంచి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (టీఆర్ఎస్) 51,586, కార్వాన్ నుంచి కౌసర్ మొహియుద్దీన్ (మజ్లిస్) 50,602 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. బొటాబొటిగా గట్టెక్కారు ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు (కాంగ్రెస్) తన సమీప ప్రత్యర్థి కోవ లక్ష్మీ (టీఆర్ఎస్)పై కేవలం 171 ఓట్ల తేడాతో గెలుపొందగా, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్(టీఆర్ఎస్) తన సమీప ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (కాంగ్రెస్)పై 441 ఓట్ల తేడాతో గెలిచారు. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్రెడ్డి (టీఆర్ఎస్) ప్రత్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి (బీఎస్పీ)పై 376 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. 37మంది తాజా మాజీల ఓటమి తెలంగాణ తొలి శాసనసభకు ఎన్నికైన 119 మంది తాజా మాజీ శాసనసభ్యుల్లో 82 మంది మళ్లీ శాసనసభకు తిరిగి ఎన్నిక కాగా, 37 మంది ఓడిపోయారు. 26 మంది తొలిసారిగా శాసనసభకు ఎంపికయ్యారు. వీరిలో టీఆర్ఎస్ నుంచి బాల్కసుమన్, సంజయ్కుమార్, సుంకె రవిశంకర్, మాణిక్రావు, చంటి క్రాంతి కిరణ్, నన్నపనేని నరేందర్, సీహెచ్ మల్లారెడ్డి, బేతి సుభాష్రెడ్డి, కొప్పుల మహేష్రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, పట్నం నరేందర్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, కంచర్ల భూపాల్ రెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జాజుల సురేందర్, కందాల ఉపేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, హరిప్రియా నాయక్, పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ నుంచి మెచ్చ నాగేశ్వర్రావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కోరుకంటి చందర్, స్వతంత్ర అభ్యర్థి లావుడ్య రాములనాయక్ ఉన్నారు. ఫలించిన కేసీఆర్ వ్యూహం 87సభలు 88సీట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచార వ్యూహం ఫలించింది.2014 ఎన్నికల తరహాలోనే ముందస్తు ఎన్నికల్లోనూ ప్రచార ప్రణాళికను అమలు చేశారు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 87 నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. వీటిలో 88 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీల కంటే ఉధృతంగా ప్రచారం చేశారు. ప్రజల దగ్గరికి నేరుగా వెళ్లి చేసిన పనులు, కొనసాగాల్సిన పనులను వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. కళ్ల ముందు అంతా కనిపిస్తోందని.. ప్రజలే అన్నీ పరిశీలించి ఓటు వేయాలని కోరారు. కేసీఆర్ ప్రచారంలో చెప్పిన అంశాలను ప్రజలు ఆమోదించారు. అన్నలు ఇంటికి.. తమ్ముళ్లు అసెంబ్లీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు మండలికి ఎన్నికైన కొందరు మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే మరో ఆసక్తికర విషయమేంటంటే ఒకే కుటుంబంలో ఇద్దరు పోటీ చేయడం, వారిలో అన్నలు ఓడి పోయి ఇంటి దారిపడితే, తమ్ముళ్లు గెలిచి అసెంబ్లీ దారిపట్టారు. వికారాబాద్ జిల్లాలో తాండూరు నుంచి బరిలో ఉన్న మాజీ మంత్రి మహేందర్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయి ఇంటి బాట పట్టగా, మహేందర్రెడ్డి సోదరుడు నరేందర్రెడ్డి మాత్రం కొడంగల్లో రేవంత్రెడ్డిపై గెలిచి మండలి నుంచి అసెంబ్లీకి రాబోతున్నారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి సోదరుల్లో అన్న వెంకట్రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి చేతిలో ఓడిపోగా, తమ్ముడు రాజగోపాల్రెడ్డి మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి మండలి నుంచి అసెంబ్లీకి వెళ్లనున్నారు. మాజీ ఎంపీ మల్లు రవి జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మల్లు రవి సోదరుడు మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నుంచి గెలుపొందారు. ఇక్కడ కూడా అన్న ఓటిమి పాలవ్వడం.. తమ్ముడు అసెంబ్లీకి వెళ్లనున్నారు. అయితే ఈ ముగ్గురిలో రాజగోపాల్రెడ్డి, నరేందర్రెడ్డి ఇద్దరూ మండలి సభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉంటూ అసెంబ్లీకి పోటీచేసిన మల్కాజిగిరి టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు కూడా అసెంబ్లీకి ఎన్నికవడం విశేషం. మొత్తం ముగ్గురు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. -
నోటాకు వచ్చినన్ని కూడా రాలేదు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ, సమాజ్వాదీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కనీస ప్రభావం కూడా చూపలేకపోయాయి. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ పార్టీలకు రాలేదు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ మంగళవారం పేర్కొన్న సమాచారం ప్రకారం ఛత్తీస్గడ్లో 2.1 శాతం (2,46,918) ఓట్లు నోటాకు రాగా..అక్కడ 85 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తంగా 0.9 శాతం (1,04,362) ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎస్పీ, ఎన్సీపీలకు (20,233) 0.2 శాతం ఓట్లు లభించగా, సీపీఐకు 0.3శాతం (38,811)ఓట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్లో నోటాకు మొత్తంగా 1.5 శాతం (5,11,785) ఓట్లు రాగా, ఎస్పీకి 1 శాతం(3,88,485), ఆప్కి 0.7 శాతం (2,37,897) ఓట్లు లభించాయి. రాజస్థాన్లో నోటాకు 1.3 శాతం (4,64,838) ఓట్లు రాగా సీపీఐ(మార్క్సిస్ట్)కు 1.3 శాతం(4,32,666), ఎస్పీలకు 0.2 శాతం (65,160) ఓట్లు లభించాయి. మిజోరాంలో నోటాకు 0.5 శాతం (2,917) ఓట్లు లభించగా, ప్రిజమ్కు 0.2 శాతం (1,262) ఓట్లు వచ్చాయి. నిర్మానుష్యంగా బీజేపీ ఆఫీసు న్యూఢిల్లీ: తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం మంగళవారం నిర్మానుష్యంగా మారింది. తెలంగాణ, మిజోరాం మినహా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉండటంతో ఢిల్లీ అక్బర్ రోడ్ లోని ఆ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు మిన్నంటాయి. ఇప్పటివరకూ వెలువడిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా రావడంతో దీన్దయాళ్ మార్గ్లోని బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. -
బీజేపీ ఓట్ల శాతం తగ్గింది!
న్యూఢిల్లీ: బీజేపీ జోరుకు బ్రేకులు పడుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు మూడు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గతంకన్నా భారీగా ఓట్ల శాతం కోల్పోయింది. ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్లలో 2013 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం ఒక్కసారిగా తగ్గింది. అయితే ఆ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్ వైపే మళ్లలేదు. ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీ ఓట్లను పంచుకున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో అత్యధిక ఓట్లశాతంతో మొత్తం 65 స్థానాలకుగాను 62 స్థానాల్లో విజయం సాధించినా ఇప్పుడు అది తగ్గుముఖం పట్టింది. మరోవైపు తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే విజయం ఢంకా మోగించాయి. 2014 తర్వాత చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపేతర పార్టీలకు ఆదరణ పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఫలితాలను చూస్తుంటే 2019 సాధారణ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పోషిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా బీజేపేతర పార్టీలు కూటమి ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో దిగజారిన బీజేపీ.. ఛత్తీస్గఢ్ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా, 2014లో అది 49 శాతానికి పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అది 32.2 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్కు 2013లో 40.3శాతం రాగా, 2014లో 38.37 శాతానికి తగ్గింది. ఈ ఎన్నికల్లో 43.2 శాతానికి పెరిగింది. 2013లో బీఎస్పీకి 4.3 శాతం ఓట్లు రాగా.. ఈ సారి ఆ పార్టీ మాజీ సీఎం అజిత్ జోగి పార్టీతో కూటమిగా ఏర్పడి 10.7 శాతం ఓట్లు దక్కించుకుంది. మరోవైపు స్వతంత్రులు 2013లో 5.3 శాతం కొల్లగొట్టగా తాజాగా 6.3 శాతానికి మెరుగయ్యారు. రాజస్తాన్లోనూ అదే పరిస్థితి.. రాజస్తాన్లోనూ బీజేపీ పరిస్థితి అలాగే ఉంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 45.2 శాతం ఓట్లు బీజేపీకి రాగా, ఇప్పుడది 38.8కి పడిపోయింది. 2014లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ రికార్డ్ స్థాయిలో 55శాతం ఓట్లను కొల్లగొట్టి మొత్తం 25 స్థానాలూ గెలిచింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ మెరుగైంది. 2013లో 33.1 శాతం వస్తే, ఇప్పుడది 39.2కు చేరింది. 2014లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి 30 శాతం ఓట్లతో సరిపెట్టుకుని అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. ఇక ఇక్కడ స్వంతత్రుల ఓటు షేర్ 8.2 శాతం నుంచి 9.5కి పెరిగింది. మిజోలో కాంగ్రెస్ చతికిల.. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించిన 5 రాష్ట్రాల్లో కేవలం మిజోరాంలోనే బీజేపీకి ఓట్ల శాతం పెరగడం, కాంగ్రెస్ తగ్గడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ను ఓడించిన ప్రాంతీయ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్)దే అత్యధిక ఓట్లు సాధించింది. 2013లో ఇక్కడ కాంగ్రెస్కు 45 శాతం ఓట్లు రాగా, తాజాగా అది 30 శాతానికి పడిపోయింది. ఇక బీజేపీ 0.4 నుంచి 8 శాతానికి పెంచుకోగలిగింది. ఇక ఎంఎన్ఎఫ్ ఓట్ల శాతం 28.8 శాతం నుంచి ఈసారి 37.6 పెరిగింది. హోరాహోరీగా మధ్యప్రదేశ్.. కాంగ్రెస్, బీజేపీకి మధ్య పోటీ హోరా హోరాగా ఉండటంతో మధ్యప్రదేశ్లో బీజేపీ ఓట్ల శాతం ఆసక్తిగా మారింది. 2013తో పోలిస్తే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్కు 36.4 శాతం ఓట్ల నుంచి 41.4కి పెరిగింది. ఇక బీజేపీ 44.9శాతం నుంచి 41.3కు పడిపోగా, బీఎస్పీ 4.6 శాతానికి పడిపోయింది. ఇక స్వతంత్రులు అదే 5 శాతం వద్ద ఆగిపోగా..చిన్న పార్టీలు తమ ఓటు షేర్ పెంచుకున్నాయి. కాగా, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రెండూ పతనమయ్యాయి. -
కేసీఆర్... ఎనిమిది సార్లు
సాక్షి, హైదరాబాద్ : ఈ మారు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కొందరు కొత్త రికార్డులు నమోదు చేశారు. పలువురు ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సీఎం కేసీఆర్ వరుసగా ఎనిమిదో సారి ఎమ్మెల్యేగా గెలిచి అందరి కంటే సీనియర్గా ఉన్నారు. సాధారణ, ఉప ఎన్నికలు కలిపి పలువురు పలుసార్లు విజయం సాధించారు. ఆరుమార్లు గెలిచిన వారు: ఎర్రబెల్లి దయాకర్రావు, డి.ఎస్.రెడ్యానాయక్, ముంతాజ్ఖాన్, పోచారం శ్రీనివాస్రెడ్డి, టి.హరీశ్రావు, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ముంతాజ్ఖాన్. ఐదుసార్లు : ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ, గంప గోవర్ధన్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జి.సాయన్న, నాలుగుసార్లు : ఎన్.దివాకర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, చెన్నమనేని రమేశ్, సోలిపేట రామలింగారెడ్డి, పాషాఖాద్రి, వనమా వెంకటేశ్వర్రావు, బాజిరెడ్డి గోవర్దన్, కె.తారకరామారావు, తాటికొండ రాజయ్య, జోగు రామన్న, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, దాస్యం వినయ్భాస్కర్. మూడుసార్లు: హన్మంత్ షిండే, గంగుల కమలాకర్, తూర్పు జయప్రకాశ్రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, టి.ప్రకాశ్గౌడ్, మహ్మద్ బలాల, మౌజంఖాన్, టి.పద్మారావు, సి.లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, భట్టి విక్రమార్క, సండ్ర వెంకటవీరయ్య. -
రుజువైన గజ్వేల్ సెంటిమెంట్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత నియోజకవర్గం సెంటిమెంట్ మరోసారి పునరావృతమైంది. గజ్వేల్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ ప్రభుత్వం ఏర్పడుతోంది. ఈసారీ ఇదే జరిగింది. 2014లో కేసీఆర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రచార గడువు ముగిసే రోజున గజ్వేల్లో నిర్వహించిన సభలో ‘గజ్వేల్లో ఏ పార్టీ గెలిస్తే అధికారం వారిదే. గజ్వేల్నుంచి నన్ను మీరు గెలిపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు టీఆర్ఎస్ను అధికారంలోకి తెస్తున్నారు’అని కేసీఆర్ అన్నారు. ఓటర్ల తీర్పు ఇలాగే వచ్చింది. కేసీఆర్కు ఇక్కడ ఈసారి భారీగా మెజారిటీ పెరిగింది. టీఆర్ఎస్కు సైతం సీట్లు అధికంగా పెరిగాయి. దేశం నలుమూలల నుంచీ... అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రికార్డు స్థాయిలో స్థానాలు పొంది గెలుపొందడంతో కేసీఆర్కు దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖుులు మంగళవారం అభినందనలు తెలిపారు. దేశం నలుమూలల నుంచి ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్కు అభినందనలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, డీఎంకే కార్యదర్శి స్టాలిన్ ఫోన్లో సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు తెలి పారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతి ఫోన్లో సీఎంకు అభినందనలు తెలిపారు. కేసీఆర్ను వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్ మంగళవారం కేసీఆర్కు ఫోన్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఘన విజయం వైపు నడిపించినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. కేసీఆర్కు జనసేన అధినేత పవన్కల్యాణ్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. -
పనిచేయని ‘నమో’ మంత్రం!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ప్రజాకర్షణ శక్తి మంత్రం రాష్ట్రంలో పని చేయలేదు. అమిత్షా రాజకీయ చతురతకూ ఇక్కడ స్థానం లేకుండా పోయింది. భారతీయ జనతాపార్టీ జాతీయ స్థాయి రాజకీయ వ్యూహం తెలంగాణలో చతికిల పడిపోయింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లను సాధించకపోగా, పార్టీకి ఉన్న స్థానాలను సైతం పోగొట్టుకుంది. గతంలో 5 స్థానాలు ఉంటే ఇప్పుడు ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొత్తంగా 40 మందికి పైగా స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రంలో 20 రోజుల పాటు దాదాపు 180 బహిరంగ సభల ద్వారా ప్రచారం చేశారు. అయినా పార్టీ అభ్యర్థులు గెలువలేకపోవడం బీజేపీని తీవ్ర ఆందోళనలో పడేసింది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే 118 స్థానాల్లో బీజేపీ తొలిసారిగా పోటీ చేసింది. అందులో కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకోవడం.. 117 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం ఆ పార్టీని విస్మయ పరుస్తోంది. గత అసెంబ్లీలో పార్టీకి ప్రాతినిధ్యం వహించినవారిలో కూడా నలుగురు ఓడిపోవడంతో శ్రేణులు తీవ్ర నిరాశలో పడ్డాయి. కీలక భూమిక అనుకున్నా.. దేశంలో 19 రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తెచ్చింది మోదీ, అమిత్షా జోడి అని, తెలంగాణలో ఆ దిశగా కృషి చేస్తామని చెప్పిన పార్టీ నేతల మాటలను ప్రజలు పక్కన పెట్టేశారు. కాంగ్రెస్, టీడీపీల క్రియాత్మక పాత్రతో ఏర్పాటైన ‘ప్రజాకూటమి’ని సైతం ప్రజలు పెద్దగా నమ్మలేదు. మోదీ, అమిత్షా, ఇతర బీజేపీ పెద్దలు సుమారు 20 రోజుల పాటు రాష్ట్రాన్ని చుట్టేసినా ఓటర్లు పట్టించుకోలేదు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని చెప్పిన బీజేపీ కనీసం కొత్త ప్రభుత్వంలో కీలక భూమిక పోషించాలన్న ఆలోచనతో భారీ ఎత్తున ప్రచారం చేపట్టింది. అయితే అది నిష్ప్రయోజనంగా మారింది. అతిరథుల ప్రచారం..ఆశ్చర్యకర ఫలితం.. గత నెల మొదటి వారం నుంచే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్చౌహాన్, మహరాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఛత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, నితిన్గడ్కరీ, సాధ్వి నిరంజన్ జ్యోతి, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, సంతోష్ గంగ్వార్, జేపీ నడ్డా, పురుషోత్తం రూపాల, జోయల్ ఓరమ్, స్వామి పరిపూర్ణానంద ప్రచారం చేసినా బీజేపీ అభ్యర్థులు గెలుపుబాట పట్టక పోవ డం ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్య చకితులను చేస్తోంది. ఓటర్లు ఈ ప్రచారానికి ప్రాధాన్యమివ్వలేదని రుజు వు చేశారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
కమలానికి దెబ్బ మీద దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: భారీ ఆశలు, అంచనాలతో ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి దారుణమైన దెబ్బ తగిలింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఊహించని రీతిలో పార్టీ చతికిలపడిపోవడం పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనలో పడేసింది. ప్రధాని నరేంద్రమోదీ సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బీజేపీ తన ప్రచారాన్ని హోరెత్తించినా రాష్ట్ర ఓటర్లను ప్రసన్నం చేసుకోలేకపోయింది. ఫలితంగా ఒక్కటి మినహా గతంలో ఉన్న స్థానాలను కూడా ఈసారి తిరిగి దక్కించుకోలేకపోయింది. పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, గతంలో పార్టీ అధ్యక్షుడిగా, శాసనసభలో పార్టీ పక్ష నేతగా ఉన్న కిషన్రెడ్డి కూడా ఓడిపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్, మిజోరం, రాజస్తాన్లో ఆ పార్టీ పరాజయం పాలుకావడం, మధ్యప్రదేశ్లో పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో పడ్డాయి. వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత మేర ఓటుబ్యాంకును పెంచుకొని ఎక్కువ స్థానాలు గెలుపొంది సత్తా చాటాలనుకున్న పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో డీలా పడిపోయింది. లోక్సభ ఎన్నికల్లో పోటీకి దిగవచ్చని ఆశలు పెట్టుకున్న కొంతమంది నేతలు ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నారు. 60కి పైగా స్థానాల్లో డిపాజిట్ గల్లంతు 118 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను పోటీలో నిలిపినా 60కి పైగా స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు దిపాజిట్ దక్కలేదు. 2014 ఎన్నికల్లో ఐదు స్థానాలను గెలుచుకున్న బీజేపీ మరో 10 స్థానాల్లో అప్పుడు రెండోస్థానంలో ఉంది. ఈసారి అంతకంటే దారుణమైన స్థితిలో పడిపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధికంగా 15 స్థానాలను మహిళలకు కేటాయించినా ఒక్క మహిళా అభ్యర్థి కూడా గెలవలేకపోయారు. ముగ్గురు తాజామాజీలైన కుంజ సత్యవతి(భద్రాచలం), బొడిగె శోభ (చొప్ప దండి), అరుణతార (జుక్కల్)లకూ ఓటమి తప్ప లేదు. గజ్వేల్లో పోటీ చేసిన మహిళామోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ కూడా ఓడిపోయారు. బీజేపీలో ఏక్ నిరంజన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు సిట్టింగుల్లో గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ మాత్రమే గెలుపొంది ఏక్ నిరంజన్గా నిలిచారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తాజాగా అదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందారు. దీంతో ఆ పార్టీకి అంసెబ్లీలో ఒక్కస్థానంతో ప్రాతినిథ్యం దక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్సహా తాజా మాజీలైన కిషన్రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తోపాటు సీనియర్ నేతలు ఎన్.రాంచందర్రావు, బద్దం బాల్రెడ్డి, యెండల లక్ష్మినారాయణ, తల్లోజు ఆచారి ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ కోలుకోలేని పరిస్థితిలో పడింది. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ పేర్కొన్నారు. తనను ఓడించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టారని, అయినా ప్రజలు తన పక్షానే ఉన్నారని అన్నారు. -
కూటమి ఓటమికి కారణాలెన్నో!
సాక్షి, హైదరాబాద్: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి ఓటమికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. భాగస్వామ్యపక్షాల మధ్య పొత్తు సర్దుబాట్ల నుంచి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన వరకు అన్నీ ఆలస్యం కావడమే కూటమి కొంపముంచినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఎత్తుగడలను అమలు చేయడంలో జాప్యం జరిగితే ఎంత నష్టం జరుగుతుందో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు చవిచూశాయి. లోపభూయిష్టంగా సీట్ల సర్దుబాటు, పొత్తు సర్దుబాట్లలో ఆలస్యం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నామినేషన్ల గడువు ముగిసే రోజు వరకు తేలకపోవడం, స్నేహపూర్వక పోటీల పేరుతో గందరగోళం ఏర్పడటం, పార్టీ మేనిఫెస్టోలను ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోవడంతో కారు జోరు ముందు కూటమి కునారిల్లింది. అడుగడుగునా సాగదీత : కూటమిని తుదిరూపు వరకు తీసుకురావడంలో ప్రతిపక్షాలు విఫలమైనందునే ఇంతటి ఘోరపరాభవాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సెప్టెంబర్ 6న కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత 6 రోజులకే.. అంటే సెప్టెంబర్ 12న కూటమి పక్షాల తొలి సమావేశం జరిగింది. అక్కడి నుంచి నెమ్మదిగా అడుగులు వేస్తూ.. చర్చోపచర్చలు జరుపుతూ కూటమి ఏర్పాటును సాగదీశారు. చివరకు నామినేషన్ల గడువు ముగిసే నవంబర్ 19 ముందు రాత్రి వరకు అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నారు. నామినేషన్ల గడువు చివరి రోజున కూడా ఏ పార్టీ ఎక్కడ పోటీచేస్తుందనే దానిపై స్పష్టత లేకుండానే ఇష్టారాజ్యంగా నామినేషన్లు వేశారు. మొత్తం 90–95 స్థానాల్లో పోటీచేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఏకంగా 99 చోట్ల నామినేషన్లు దాఖలు చేసింది. టీజేఎస్కు కేటాయిస్తామని చెప్పిన చోట్ల కాంగ్రెస్ నామినేషన్లు వేయడంతో టీజేఎస్ కూడా కాంగ్రెస్ పోటీకి దిగిన చోట్ల నామినేషన్లు వేసింది. మహబూబ్నగర్లో టీడీపీ పోటీచేసిన స్థానంలోనూ టీజేఎస్ నామినేషన్ దాఖలు చేసింది. సీపీఐకిచ్చిన 3 స్థానాల్లో రెండు చోట్ల (హుస్నాబాద్, వైరా)లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు బరిలో దిగారు. హుస్నాబాద్లో ఆ తర్వాత విరమించుకున్నా వైరాలో మాత్రం నామినేషన్ను ఉపసంహరించుకోలేదు. టీఆర్ఎస్కు కలిసొచ్చిన గందరగోళం సెప్టెంబర్ 12 నుంచి నవంబర్ 22 వరకు.. అంటే 72 రోజుల కసరత్తు తర్వాత కూడా సీట్ల సర్దుబాటులో స్పష్టత రాక స్నేహపూర్వక పోటీలతో గందరగోళం నెలకొంది. దీంతో కూటమి పక్షాల సర్దుబాటు సరిగా జరగలేదని, సీట్ల కోసం అన్ని పార్టీలు కొట్లాడుకుంటున్నాయనే భావన ప్రజలకు వచ్చింది. ఇదే గందరగోళం ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతుందనే ప్రచారం చేయడంలో టీఆర్ఎస్ సఫలీకృతమైంది. కూటమి సీట్లు పంచుకునేలోపు తాము స్వీట్లు పంచుకుంటామన్న టీఆర్ఎస్ నేతలు హేళన చేసే స్థితిలో సీట్ల సర్దుబాటు జాప్యం కావడం, గందరగోళం నెలకొనడం ప్రజల్లో కూటమి పట్ల సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచలేకపోయింది. ప్రజలకు చేరని మేనిఫెస్టోలు ఇక, ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తామనే విషయాన్ని కూడా కూటమి విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పదేపదే వల్లెవేయడానికి పరిమితం అయ్యారే తప్ప ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆ పార్టీ నేతలు విఫలమయ్యారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, పింఛన్లు రెట్టింపు, మహిళా సంఘాలకు గ్రాంట్లు, రుణాలు, పేద కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా ఆరు ఎల్పీజీ సిలిండర్లు, ఉచిత రేషన్ తదితర ముఖ్య హామీలు ప్రజలను ఆకర్షితులను చేసే స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రచారం కాలేదు. దీనికి తోడు టీడీపీ మేనిఫెస్టోలో అమలు సాధ్యం కాని హామీలు, టీజేఎస్ మేనిఫెస్టోలోనూ ప్రజాకర్షక పథకాలు లేకపోవడం కూటమిని దెబ్బతీశాయి. అలాగే అమరుల ఎజెండా పేరుతో కూటమి పక్షాన ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ప్రజలను ఆలోచింపజేసే హామీలను ఇవ్వలేదు. ఈ వైఫల్యాలన్నింటి నేపథ్యంలో ఓటరన్న కూటమిని కనికరించకుండానే కారుకు పట్టం కట్టాడని రాజకీయ విశ్లేషకులంటున్నారు. -
నోటాకు 2.24 లక్షల ఓట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నోటా (నన్ ఆఫ్ ద అబై వ్)కు గణనీయ సం ఖ్యలో ఓట్లు పడ్డాయి. 2,24,709 మంది ఓటర్లు (1.1 శాతం ఓట్లు) నోటాకు ఓటేశారు. రెండు చోట్లలో గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీ కన్నా నోటాకు పడిన ఓట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేసిన మల్రెడ్డి రంగారెడ్డి కేవలం 376 ఓట్లతో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చేతుల్లో ఓటమి పాలు కాగా, ఇక్కడ నోటాకు 1,119 ఓట్లు పడ్డా యి. బీజేఎల్పీ మాజీ నేత జి.కిషన్రెడ్డి అంబర్పేటలో 1,016 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ చేతుల్లో ఓటమి పాలుకాగా, ఆ నియో జకవర్గంలో నోటాకు 1,462 ఓట్లు వచ్చాయి. ఖమ్మం, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నోటా మూడోస్థానంలో నిలవడం విశేషం. ఇక 16 సీట్లలో నాలుగో స్థానంలో, 51 స్థానాల్లో ఐదోస్థానంలో నోటా నిలిచింది. ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థులపై తమ అసంతృప్తిని నోటాకు ఓటు వేయడం ద్వారా వ్యక్తం చేశారు. ఖమ్మంలో 3,513, శేరిలింగంపల్లిలో 3,637, హుజూరాబాద్లో 2,867 ఓట్లు నోటాకు పడ్డాయి. అలాగే అలంపూర్ (3,492), ములుగు (3,249), ఉప్ప ల్ (2,712), నర్సంపేట (2,436) అందోల్ (2,4 06), జగిత్యాల (2,203), చెన్నూర్(2,135), మంథని (2,083), నిజామాబాద్ –రూరల్ (2,2 03), సికింద్రాబాద్ (1,582), ముషీరాబాద్ (1,664), అచ్చంపేట (1,485), సనత్నగర్ (1,464), గోషామహల్లో 709 ఓట్లు వచ్చాయి. -
టీఆర్ఎస్లో ఫుల్ జోష్
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఫలితాల వెల్లడి మొదలైన నుంచి కారు జోరు చూపించడంతో మంగళవారం ఉదయం నుంచే తెలంగాణ భవన్లో కార్యకర్తలు ఫుల్జోష్లో కనిపించారు. టపాసులు కాలుస్తూ, నృత్యాలు చేస్తూ గులాల్ చల్లుకుంటూ ఆనందోత్సవాల్లో తేలిపోయారు. ‘జయహో కేసీఆర్’అంటూ ప్లకార్డులు పట్టుకొని జైతెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్, సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి కార్యకర్తలతో కలసి సంబరాల్లో పాల్గొన్నారు. ‘కేటీఆర్ జిందాబాద్, కాబోయే సీఎం’ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ టీఆర్ఎస్ భవన్కు వచ్చిన సమయంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మిగతా పార్టీల్లో నిస్తేజం.. టీఆర్ఎస్ జోరుతో మిగతాపార్టీల్లో పూర్తిగా నిస్తేజం అలముకుంది. గాంధీభవన్లో నేతల సందడి లేక వెలవెలబోయింది. సీనియర్ నేతలు జానారెడ్డి, రేవంత్, గీతారెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, డీకే అరుణ, జీవన్రెడ్డి ఓటమి పాలవడంతో పార్టీ శ్రేణులు డీలాపడ్డాయి. మధ్యాహ్నం మూడు గంటలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి గాంధీభవన్కు వచ్చినా సందడి లేదు కనబడలేదు. టీడీపీ, బీజేపీ, సీపీఐ కార్యాల యాలు పూర్తిగా కళతప్పాయి. నేతలెవరూ ఆ వైపు రాలేదు. టీజేఎస్ ఆఫీస్కు కోదండరాం ఒక్కరే వచ్చి మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. -
నాలుగంటే 'నాలుగే'
2014 ఎన్నికల్లో గెలిచిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి నాలుగు చోట్ల మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది.హుజూర్నగర్, పాలేరు, ఇల్లందు, మధిర నియోజకవర్గాలను మళ్లీ నిలబెట్టుకుంది. 2014లో గెలిచిన ముథోల్, జగిత్యాల, జహీరాబాద్, వనపర్తి, అలంపూర్, గద్వాల, నల్లగొండ, నాగార్జునసాగర్, కోదాడ, డోర్నకల్, ఖమ్మం, కల్వకుర్తి, చేవెళ్ల, నారాయణ్ఖేడ్, మిర్యాలగూడ, పరిగి, మక్తల్ స్థానాల్లో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అయితే, గత ఎన్నికలలో ఓడిపోయిన 15 స్థానాల్లో కాంగ్రెస్ ఈసారి గెలిచింది. ఎల్లారెడ్డి, కొల్లాపూర్, సంగారెడ్డి, మంథని, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మునుగోడు, నకిరేకల్, మహేశ్వరం, భద్రాచలం, పినపాక, వైరా, తాండూరు, ఎల్బీ నగర్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ‘ఏజెన్సీలు’ హస్తగతం గిరిపుత్రులు హస్తానికే మొగ్గు చూపారు. తాజా ఎన్నికల ఫలితాల్లో కారు జోరు మీద ఉన్నా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఓటర్లు మాత్రం కాంగ్రెస్వైపే ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో మూడు, ఏటూరు–నాగారం పరిధిలో రెండు, భద్రాచలం పరిధిలో 5 రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి. పది నియోజకవర్గాల్లో ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో కూటమి తరపున కాంగ్రెస్ బలపర్చిన టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో లంబాడాలు, ఆదివాసీలకు మధ్య నెలకొన్న వివాదంలో ప్రభుత్వం సైతం పెద్దగా జోక్యం చేసుకోకపోవడంతో ఆదివాసీలు కాంగ్రెస్ వెపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్ -
మంత్రివర్గంలో కొత్త ముఖాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరనున్న టీఆర్ఎస్ కొత్త మంత్రివర్గంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. స్పీకర్ మధుసూదనాచారి, మంత్రు లు తుమ్మల నాగేశ్వర్రావు, ఆజ్మీరా చందూలాల్, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో వారి స్థానాల్లో తీసుకోవాల్సిన కొత్త వారి జాబితాను సీఎం కేసీఆర్ ఇప్పటికే సిద్ధం చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ముఖ్యమంత్రితోపాటు 17 మందికి మంత్రివర్గంలో చోటు ఉండగా సామాజిక లెక్కల ప్రకారం చూస్తే సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, డి.ఎస్. రెడ్యానాయక్, పువ్వాడ అజయ్కుమార్లకు కొత్తగా అవకాశం లభించొచ్చని తెలుస్తోంది. జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్) స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్రావు (పాలకుర్తి) కు కేసీఆర్ అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. అలాగే పట్నం మహేందర్రెడ్డి (తాండూరు) స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (వనపర్తి)కి బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి అజ్మీరా చందూ లాల్ (ములుగు) స్థానంలో ఇదే జిల్లా నుంచి ఇదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి డి. ఎస్. రెడ్యానాయక్ (డోర్నకల్)ను కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం) మాత్రమే విజయం సాధించడం, ఈ జిల్లాకు చెందిన తుమ్మల ఓటమి పాలవడం, ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడంతో తుమ్మల స్థానంలో పువ్వాడకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. భారీ మార్పులు ఉంటే... ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో మార్పులు చేయాలని భావిస్తే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టి. పద్మారావుగౌడ్, జోగు రామన్న స్థానంలో అరూరి రమేశ్, కె.పి. వివేకానందగౌడ్, దానం నాగేందర్ పేర్లను పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ తన జట్టును పూర్తిస్థాయిలో మార్చాలని భావిస్తే అనూహ్యంగా కొత్త వారి పేర్లు జాబితాలో ఉండనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారీ రెండు ఉప ముఖ్యమంత్రి పదవులను కొనసాగించే యోచనలోనే ఉన్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డిలను మారిస్తే వారి స్థానంలో అరూరి రమేశ్ (వర్ధన్నపేట)కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. హైదరాబాద్కు చెందిన టి. పద్మారావుగౌడ్ను మారిస్తే కె.పి. వివేకానందగౌడ్ (కుత్బుల్లాపూర్)కు చోటు కల్పించే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంత్రి జోగు రామన్నను మార్చాల్సి వస్తే అదే సామాజిక వర్గానికి చెందిన దానం నాగేందర్ (ఖైరతాబాద్)కు బెర్త్ ఖాయం కానుంది. కాగా, సాధారణ ఎన్నికల్లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్రావు, డి.ఎస్. రెడ్యానాయక్, ముంతాజ్ఖాన్ (యాకుత్పుర)లలో ఒకరిని ప్రొటెం స్పీకర్గా నియమించే అవకాశం ఉంది. అలాగే స్పీకర్గా ఈటల రాజేందర్ (హుజూరాబాద్) పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. నేడు టీఆర్ఎస్ఎల్పీ భేటీ కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల టీఆర్ఎస్ఎల్పీ సమావేశం బుధవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో జరగనుంది. ఈ భేటీలో టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. బుధవారం నుంచి ఆదివారం వరకు మంచి రోజులు ఉండటంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు వాటిలో ఏదో ఒక తేదీని కేసీఆర్ ఎంచుకోనున్నారు. తెలంగాణ తల్లికి వందనం... ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ భవన్ చేరుకున్న కేసీఆర్... తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి నివాళర్పించారు. ఆపై మీడియా సమావేశంలో పాల్గొని అక్కడి నుంచి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్ను కలిశారు. -
పరాభవమే మిగిలింది
సాక్షి, హైదరాబాద్: సామాజిక వర్గాల అభ్యున్నతే ఎజెండాగా ఉద్యమించిన నేతలకు ఈ ఎన్నికల్లో పరాభవమే ఎదురైంది. బీసీ సంఘం నేతగా జాతీయస్థాయి ఖ్యాతి ఉన్న ఆర్.కృష్ణయ్య గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎల్బీనగర్లో పోటీ చేసి గెలుపొందగా ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్తో మిర్యాలగూడలో పోటీ చేసి పరాజయం పొందారు. బీసీ కులాల ఐక్యవేదిక పేరుతో మనపార్టీని స్థాపించిన కాసాని జ్ఞానేశ్వర్ ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి మంత్రి పద్మారావు చేతిలో ఓటమిపాలయ్యారు. మరోవైపు ఆదివాసీల ఉద్యమాన్ని ఉదృతంగా నడిపించిన సోయం బాబురావు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. బాబురావు మినహా కాసాని జ్ఞానేశ్వర్, ఆర్.కృష్ణయ్యలు స్థానికేతర నేతలు కావడం, నామినేషన్లకు చివరి రోజున కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా వీరి పేర్లను ప్రకటించడంతో వారికి క్షేత్రస్థాయిలో ప్రచారం కత్తిమీదసాములా మారింది. ఊహించని విధంగా టికెట్లు ఇవ్వడమే వీరి ఓటమికి కారణాలని చెప్పొచ్చు. -
రెండు ఏనుగుల మధ్య నలిగిపోయాం: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్–కాంగ్రెస్ కూటమి అనే రెండు ఏనుగుల మధ్య నలిగిపోయామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయ విధానాలు–సామాజికన్యాయం నినాదంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకొచ్చేందుకు సీపీఎం–బీఎల్ఎఫ్ ప్రయత్నం చేసినా ఫలించలేదన్నారు. సామాజిక న్యాయ సాధనకు ప్రత్యామ్నాయ విధానాలు కావాలంటూ సిద్ధాంతాలు మాట్లాడిన సీపీఐ, టీజేఎస్, ప్రజాగాయకుడు గద్దర్, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ చివరకు కాంగ్రెస్ చంకలో చేరడంతో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆ పార్టీకి సానుకూల ఫలితాలకు కారణమయ్యాయని తెలిపారు. -
‘ఫిరాయింపులకు’ ఓటమి
సాక్షి, హైదరాబాద్: గత సార్వత్రిక ఎన్నికల అనంతరం వేర్వేరు పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన ఐదుగురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గతంలో 25 మంది వేర్వేరు పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరగా అందులో 20 మంది విజయం సాధించారు. ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మాత్రం భంగపాటు ఎదురైంది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీఆర్ఎస్లో చేరిన పాయం వెంకటేశ్వర్లు పినపాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు చేతిలో ఓడగా, అశ్వరావుపేట నుంచి పోటీ చేసిన తాటి వెంకటేశ్వర్లు కూటమి అభ్యర్థి మచ్చా నాగేశ్వరరావు చేతిలో, వైరాలో బానోతు మదన్లాల్ ఇండిపెండెంట్ అభ్యర్థి రాముల్నాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. గతంలో ఇల్లందులో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన కోరం కనకయ్య ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియ చేతిలో ఓడారు. మహేశ్వరంలో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు గత ఎన్నికల్లో నర్సంపేట నుంచి ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్లో చేరిన దొంతి మాధవరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి చేతిలో ఓడిపోయారు. -
వీవీ ప్యాట్లపై హైకోర్టుకు!
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తారుమారు చేశారనే అనుమానంతో వీవీ ప్యాట్లతో అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజాకూటమి.. ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి కాంగ్రెస్ పార్టీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, కూటమి పక్షాన కలిసి కోర్టును ఆశ్రయించాలని కూటమి నేతలు యోచిస్తున్నారు. దీనిపై బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఓటర్ల జాబితా అవకతవకల నుంచి ఈవీఎం యంత్రాల నిర్వహణ వరకు ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనుమానాలున్నాయని మొదటి నుంచి చెబుతున్నామని, దీనిపై ఈసీ స్పందన కూడా అనేక అనుమానాలకు తావిస్తోందని టీపీసీసీకి చెందిన ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే సరైన మార్గమని భావిస్తున్నామని చెప్పారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఇప్పటికే న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ ప్రక్రియ వీవీ ప్యాట్ల ద్వారా కొనసాగేంత వరకు కోర్టులో పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. కోర్టుకు ఎప్పుడు వెళ్లాలన్నది కూటమి నేతలంతా కలిసి నిర్ణయిస్తారని తెలిపారు. 15 లేదా 16న సీఎల్పీ సమావేశం.. కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ఈ నెల 15 లేదా 16 తేదీల్లో జరగనుంది. తెలంగాణతోపాటు ఎన్నికలు జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. దీంతోపాటు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నందున పార్లమెంటుకు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో కాంగ్రెస్ అధిష్టానం నుంచి నేతలు వచ్చి సీఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. సీఎల్పీ నేతగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి లేదా ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కలలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ పదవీ కాలం ఈ నెలలోనే నాలుగేళ్లు అవుతున్నందున ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలనుకుంటే సీఎల్పీ నేతగా అవకాశమివ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. లేదంటే ప్రచార కమిటీ చైర్మన్ హోదాలో ఎన్నికలను ఎదుర్కొన్న భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం మీద ఉత్తమ్, భట్టిలలో ఒకరు టీపీసీసీ అధ్యక్షుడు, మరొకరు సీఎల్పీ నేతగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఈసీ స్పందించకపోతే కోర్టుకు: కుంతియా వీవీ ప్యాట్లపై కోర్టుకు వెళ్లే విషయమై ఉత్తమ్తోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా స్పందించారు. ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారుల సహకారం, డబ్బు బలంతోనే కేసీఆర్ విజయం సాధించారని, ఈవీఎంలను తారుమారు చేశారని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, సీఈసీ తమ ఫిర్యాదుపై స్పందించని పక్షంలో కోర్టుకు వెళతామని చెప్పారు. -
హైదరాబాద్ నుంచే..ఢిల్లీలో చక్రం తిప్పుతా!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వేదికగా దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ముక్త భారత్ను నిర్మించేందుకు ప్రాంతీయ పార్టీల సహకారంతో త్వరలోనే జాతీయ పార్టీ నెలకొల్పనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి ఈ నవశక్తి రూపుదిద్దుకుంటుందని తెలిపారు. తెలంగాణలో తీసుకొచ్చిన పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా వ్యూహరచన చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో నూతన పార్టీ ఉంటుందని.. ఇందుకు సరిపోయే ఎజెండా తన వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలో జాతీయ పార్టీకి సంబంధించిన విధివిధానాలను వెల్లడిస్తానన్నారు. వివిధ రంగాల ప్రముఖులు, నిపుణులతో చర్చించి విధానాలను ఖరారు చేయనున్నట్లు కేసీఆర్ చెప్పారు. నాలుగు పార్టీలను కలిసి సమావేశం పెట్టడం ద్వారా ఏదో చేస్తున్నట్లు హడావుడి చేయడం కాదని.. పరోక్షంగా చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశవ్యాప్తంగా ఏకం చేయాల్సింది పార్టీలను కాదనీ ప్రజలను ఒకే తాటిపైకి తేవాలన్నారు. ‘దేశ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. నెల రోజుల్లో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును మీరే చూస్తారు. తెలంగాణలో ఏది అనుసరిస్తున్నామో దేశంలోనూ అదే జరగాలి. దేశంలో ఇప్పటికీ చాలాచోట్ల తాగునీటిని అందించడం లేదం టే అంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా? మూ డు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిందంటే అక్కడ మరో గత్యంతరం లేకనే. ఆ పార్టీ కాకుంటే ఈ పార్టీ.. ఈ పార్టీ కాకుంటే ఆ పార్టీయే అన్న పరిస్థితి నెలకొంది. ఒకరు రాఫెల్ అంటే మరొకరు భోఫోర్స్ అంటారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది’అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘దేశానికి కొత్త ఆర్థిక విధానం, కొత్త వ్యవసాయ విధానం అవసరం. కేవలం ఉత్పత్తిపైన మాత్రమే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇజ్రాయెల్, చైనాలతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నామో తేల్చుకోవాలి. విశ్లేషకులు అశోక్ గులాటి రైతులకు ఏం చేయాలన్న అంశాన్ని అద్భుతంగా రాశారు. టీఆర్ఎస్ తెలంగాణలో ఏం చేసిందో రాసి చూపారు. రైతు పెట్టుబడితో రైతు లకు స్వేచ్ఛనిచ్చాం. వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కూడా తెలంగాణ పథకాలను మెచ్చుకున్నారు’అని కేసీఆర్ తెలిపారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీంకోర్టు బాధ్యతారహితంగా తీర్పు ఇచ్చిందన్నారు. బీసీ, ఎస్సీలు అమాయకులు కావడంతో అడగలేకపోయారన్నారు. సుప్రీంతీర్పును పార్లమెంటు అడ్డుకోదా అని ప్రశ్నిం చారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా పరిస్థితి ఉంటుందని.. 50 శాతం రిజర్వేష న్లు దాటొద్దంటే ఎలాగని కేసీఆర్ ప్రశ్నించారు. దేశానికి ఒకే సుప్రీంకోర్టు ఉంటే ఎలా అని ప్రశ్నించారు. అమెరికాలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సుప్రీంకోర్టు ఉందన్నారు. ప్రపంచంలో అనేక దేశాల్లో రైతులకు గౌరవం ఇస్తారు. అనేక పథకాలు ఉంటాయి. కానీ ఇక్కడ రైతుకు గౌరవమే లేదన్నారు. ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి.. శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనానికి తెలం గాణ ప్రజలు ఎంతగానో సహకరించారని, ఈ ఎన్నికల్లో తమకు లభించిన ఘన విజయం ప్రజలదేనని కేసీఆర్ అన్నారు. రైతులు, మహిళలు, నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, దళితు లు, మైనార్టీలు.. కులమతాలకతీతంగా దీవించి తమకు ఈ విజ యాన్ని అందించారన్నారు. తమకు ఘనవిజయాన్ని కట్టబెట్టిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఎన్నికలు యావత్ దేశానికి ఓ మార్గాన్ని చూపాయని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల బహిరంగ సభల్లో చెప్పినట్టుగానే కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు తమ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతుందని వెల్లడించారు. ‘టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులందరూ అహోరాత్రులు కష్టపడి పనిచేయడం వల్లే గొప్ప విజయం సాధించాం. తొలి నుంచి అనుకున్నట్టుగానే అణకువ, వినయం, విధేయత అవసరం. విజయంతో గర్వం, అహంకారం రావాల్సిన అవసరం లేదు. కర్తవ్యనిష్ఠతో బాధ్యతల్ని నిర్వహించడం పైనే మనం దృష్టి పెట్టాలి. రాష్ట్రం లో చాలా సమస్యలు ఉన్నాయి. కొత్త రాష్ట్రాన్ని ఓ బాటలో పెట్టాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. కోటి ఎకరాలు పచ్చబడాలనే లక్ష్యంలో ఏమాత్రం రాజీలేదు. అది జరిగి తీరాల్సిందే. టీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం.. కూట మిని గెలిపిస్తే శనేశ్వరం అని ఎన్నికల ప్రచార సభల్లో అన్నాను. ఏది కావాలో తేల్చుకోవాలని ప్రజలకు చెప్పాను. తమకు కాళేశ్వరమే కావాలని ప్రజలు తీర్పునిచ్చారు. దాంతో పాటు మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరు తెచ్చి తీరుతాం. ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాం.’అని కేసీఆర్ అన్నారు. ఆరోగ్య తెలంగాణ దిశగా.. ‘రైతుల కోసం పనిచేస్తాం. వారికి ఏ బాధ లేకుండా చేస్తాం. గిరిజనులు, గిరిజనేతరుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపేలా పనిచేస్తాం. నేనే చొరవ తీసుకుంటా. బీడీ కార్మికులు, గీత కార్మికులు, కుల వృత్తులన్నీ కుదుటపడాలి. వారికి ఆధునిక యంత్రాలను ఇచ్చి ఆదుకుంటాం. యువత కు ఉపాధి, ఉద్యోగాలు లభించేలా పని చేస్తాం. తమకు అవకాశాలు రావడంలేదనే బాధ వారిలో ఉంది. నిరు ద్యోగం దేశవ్యాప్త సమస్య. ఉద్యోగ ఖాళీలను కచ్చితంగా భర్తీ చేస్తాం. అలాగే ప్రభుత్వేతర రంగాల్లో ఉపాధి విరివిగా లభించేలా చర్యలు తీసుకుంటాం. విజయం ఎంత ఘనంగా ఉంటుందో.. బాధ్యత కూడా అంతే బరువుగా ఉంటుంది. సస్యశ్యామలమైన, శాంతియుతమైన, సంపూర్ణ ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం దిశగా మేం పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. దళితులు దశాబ్దాలుగా పేదరికంలో కూరుకుపోవడం రాచపుండులా క్షోభపెడుతోంది. దానికి చరమగీతం పాడాలి. కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ వేశాం. దానిపై పనిచేస్తున్నాం’అని పేర్కొన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. ఏడాదికి రెండు, మూడు లక్షల నాణ్యతతో కూడిన ఇళ్లను కట్టిస్తామన్నారు. కంటి వెలుగు తర్వాత ఈఎన్టీ, డెంటల్ డాక్టర్లు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అలాగే పూర్తి స్థాయి హెల్త్ డేటా రికార్డు చేస్తాం అది పెనుమార్పులకు దారితీస్తుందన్నారు. దరిద్రం ఏదో ఒక కులానికి కాదు అన్ని కులాల్లో ఉందన్నారు. దాన్ని నిర్మూలించాలన్నారు. ఖమ్మంలో మా కత్తి మాకే తగిలింది రాష్ట్రం వ్యాప్తంగా మాకు రావాల్సిన మరో 17, 18 సీట్లు పోయాయి. ‘ఖమ్మంలో మమ్మల్ని ఎవరూ చం పలే, మా వాళ్లే వాళ్లకు వాళ్లు చంపుకున్నారు. చెప్పినా మా కొలీగ్స్ కొంత మంది వినలేదు, వినే ఉంటే మరికొన్ని సీట్లు గెలిచేవాళ్లం. మంత్రులు, స్పీకర్ కూడా ఓడిపోయారు. బాధాకరం. వారితో ఫోన్లో మాట్లాడి ఓదార్చాను’అని కేసీఆర్ అన్నారు. ‘సింగిల్ బూత్లో కూడా రీపోల్ లేకుండా, ఎలాంటి దొమ్మీలు లేకుండా యావత్ దేశానికే ఓ మార్గం చూపే విధంగా ఎన్నిక లు నిర్వహించుకోగలగడం అందరం గర్వపడాల్సిన విషయం. శాంతిభద్రతల నిర్వహణ అంశంలో ఎక్క డా రాజీ లేకుండా పోలీసులు, ఈసీ అధికారులు పనిచేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రజత్కుమార్కు ధన్యవాదాలు. మీడియా కూడా మంచి పాత్ర పోషించింది. రాష్ట్రం లో మీడియా గౌరవప్రదంగా ప్రవర్తించిం ది’అని కేసీఆర్ ప్రశంసించారు. ‘అంతిమ తీర్పు ప్రజలు అప్పగించారు కాబట్టి.. ఆ సమయాన్ని ప్రజా సేవచేయడానికి కేటాయించాలి. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎన్ని ఎదురుదాడులకు దిగినప్పటికీ అవన్నీ గతమే’అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అన్నారు. థ్యాంక్యూ ఒవైసీ ‘మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ధన్యవాదాలు చెబుతున్నా. సోమవారం ఆయనతో కలిసి భోజనం చేశా. అసదుద్దీన్ అసలు సిసలు లౌకికవాది, మేధావి. చాలా అంశాలపై ఆయన చాలా అవగాహన ఉంది. దేశవ్యాప్తంగా మైనారిటీలను ఏకం చేసేలా మేమిద్దరం పర్యటిస్తాం. అందుకోసం రెండు విమానాలు బుక్ చేసుకున్నాం. త్వరలో దేశనిర్మాణంలో మేం భాగస్వాములం అవుతాం. ఇక్కడ అన్ని చక్కదిద్ది.. ఆ తర్వాత ఢిల్లీవైపు అడుగులు వేస్తా. బీజేపీ ముక్త్ భారత్, కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో ముందుకువెళ్తాను’అని కేసీఆర్ వెల్లడించారు. డీఎంకే అధినేత స్టాలిన్ రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని అడిగారని ఓ ప్రశ్న కు సమాధానంగా చెప్పారు. దేశానికి తెలంగాణ ఓ దిక్సూచి ‘ఈ దేశానికి తెలంగాణ ఓ దిక్సూచి అందుకే తెలంగాణ వేదికగా జాతీయ రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇస్తాం. దేశంలో గందరగోళం నెలకొంది. నూరు శాతం బీజేపీయేతర, కాంగ్రెసేతర పరిపాలన రావాలి. మాకు ఎవరూ బాస్లు లేరు. మేం ఎవరికీ ఏజెంట్లం కాము. ప్రజలకే ఏజెంట్లం. వారి కోసమే మేం పనిచేస్తాం. ఎవరికీ గులాంగిరీ చేయం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ.. జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాం’అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘దేశంలో పరిపక్వత రావాలి. ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు వచ్చి మాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కానీ ప్రజలు అంతిమ నిర్ణయం ఇచ్చారు. మమతా బెనర్జీ, సీఎం నితీశ్ కుమార్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తా’అని ముఖ్యమంత్రి వెల్లడించారు. కొన్ని పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డ కేసీఆర్.. ఈ దేశానికి 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని, కానీ 30 వేల టీఎంసీలను మాత్రమే వినియోగిస్తున్నారన్నారు. విభజన రాజకీయాల నుంచి దేశం బయటపడాలని సూచించారు. ఏపీలో అడుగుపెడతాం తెలుగు ప్రజలు బాగుండాలని తాము కోరుకుంటున్నామని కేసీఆర్ అన్నారు. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలంటూ తమకు లక్షల సంఖ్యలో ఫోన్లు, మెసేజ్లు వచ్చాయన్నారు. దేశ రాజకీయాలను బాగుచేసుకొనే క్రమంలో.. తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే తప్పకుండా తాము ఏపీలో కూడా అడుగు పెడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారని, అలాంటిది తాను అక్కడికి వెళ్లి పనిచేయొద్దా? అని వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. లేకపోతే తెలంగాణ ప్రజలు సంస్కార హీనులు అనుకుంటారు’అని బాబుకు చురకలంటించారు. తాను ఇవ్వబోయే బహుమతి ప్రభావం ఎలా ఉంటుందో మీరే చూస్తారు అంటూ భవిష్యత్ లక్ష్యాలను చెప్పకనే చెప్పారు. ఏపీలో బాబు పరిస్థితి సరిగా లేదని.. ఆయనకు పైత్యం ఎక్కువని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు గతంలో హద్దులు లేకుండా పొగిడారని, అతిగా పొగిడే క్రమంలో ఆయన బోల్తా పడ్డారన్నారు. ‘నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు, ఇతర సీఎంలతోపాటు నేను పాల్గొన్నాను. ఆ సమావేశంలో మోదీని ఎక్కువగా పొగిడే ప్రయత్నంలో.. ఏదేదో మాట్లాడి చంద్రబాబు పరువుపోగొట్టుకున్నారు. ఒక సీఎం ప్రధానమంత్రి అయ్యారంటూ బాబు వ్యాఖ్యానించారు. ఈ మాటలకు అప్పుడు అఖిలేష్ యాదవ్ వంటి వారు కూడా నవ్వుకున్నారు’అని కేసీఆర్ చెప్పారు. సీఎం ఎక్కడ కూర్చుంటే అదే సచివాలయమని.. ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైదరాబాద్ నుంచే.. కుల, మత గొడవలతోనే దేశంలో రాజకీయాలు జరుగుతున్నాయని.. ఈ పరిస్థితి కారణంగానే ప్రపంచంలోని ఇతర దేశాలకు మనం చులకనైపోతున్నామన్నారు. ‘భారతదేశ జనాభా 130 కోట్లు ఉన్నందున.. తమకేమైనా ఇబ్బంది ఉంటుందేమోనన్న అనుమానంతో చైనా ఓ అధ్యయనం చేయించింది. ఓ బృందం మూడు నెలల్లో సర్వే చేసి.. చైనా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. భారత్లో కులాలు మతాలతో కొట్టుకు చస్తున్నారని, ఇక వాళ్లు మనల్ని ఏం చేయగలరని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇదీ మన దేశ దుస్థితి’అని కేసీఆర్ వెల్లడించారు. ‘హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటా. ఇక్కడి నుంచి దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా పెద్ద సమస్య కాదు. రాష్ట్రాల్లో ఢిల్లీ పెత్తనం ఎందుకుండాలి? విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలను రాష్ట్రాలకు వదిలేయకుండా కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటోంది. పాకిస్తాన్ సమస్యను పరిష్కరించే తెలివి లేదు గానీ.. రాష్ట్రాలపై పెత్తనమా? ఎన్నికలు దగ్గర పడుతున్నందున సర్జికల్ స్రైక్లు, రామమందిర నిర్మాణం వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. అలా ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ వేదికగా దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరముంది’అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘ఆర్బీఐ వద్ద 8, 9 లక్షల కోట్ల రూపాయలున్నాయి. నిల్వగా రెండు, మూడు లక్షల కోట్లు సరిపోతుంది. కానీ అంతంత నిల్వ ఉంచుకొని దేశాభివృద్ధికి ఏమీ చేయడంలేదు. వనరులను చేతిలో ఉంచుకొని పట్టించుకోవడంలేదు’అని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
ప్రభుత్వంతో ఈసీ కుమ్మక్కు
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎన్నికల సంఘం (ఈసీ) కుమ్మక్కు అయిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు అయినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై తాము అనుమానాలు వ్యక్తం చేసినా ఈసీ మాత్రం దురదృష్టవశాత్తు ప్రజానీకానికి అనేక అనుమానాలు మిగిలిపోయేలా వివాదాస్పదంగా ఎన్నికలు నిర్వహించిందని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితా సవరణను పూర్తి చేయకుండా రాష్ట్ర సీఈఓ, ఈసీ కుదించిందని, ఎన్నికల జాబితా సరిచేయకుండానే ఎన్నికలు నిర్వహించారన్నారు. శాసనసభను రద్దు చేశాక కేసీఆర్ ఒక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని, ముందుగా దానితో ఈసీ విభేదించినా చివరకు అదే షెడ్యూల్ను విడుదల చేసిందని ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్లో పార్టీ నాయకులు నిరంజన్, వంశీచంద్రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, బొల్లు కిషన్లతో కలసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంలలో నమోదైన ఓట్లకు బదులు పూర్తిగా ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)లలో రిజిస్టర్ అయిన ఓట్లను లెక్కించాలని తాము కోరుతున్నా ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ప్రజల్లో ఏర్పడిన అనుమానాలు దూరం చేయకపోతే వారిలో అవి శాశ్వతంగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. వందకు వంద శాతం వీవీప్యాట్లలో పడిన ఓట్లను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాగితాలపై రికార్డ్ అయిన ఓట్లను లెక్కించకపోతే ఇక వీవీప్యాట్ల వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వీవీప్యాట్లను లెక్కించకపోతే ప్రజాస్వామ్యానికే ఇది చీకటిరోజుగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్తో కలసి ఈసీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించాల్సి వస్తుందన్నారు. ఎక్కడో ఏదో జరిగింది... అనేక పోలింగ్ బూత్లలో నమోదైన ఓట్లకు, ఈవీఎంలలో చూపిన ఓట్లకు తేడా ఉందని, చాలా పోలింగ్ బూత్లలో ఒరిజనల్ ఓటింగ్ సరళికి... ఈవీఎంలలో పడిన ఓట్లు, ఓట్ల లెక్కింపునకు మధ్య తేడాలున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. ఈసీ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా వీవీప్యాట్లను లెక్కించడంలో అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామని ఉత్తమ్ చెప్పారు. ఎవరికి ప్రయోజనం చేకూర్చాలని ఈసీ ఈ విధంగా చేస్తోందని నిలదీశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, తాము కూడా దీనిపై చట్టపరంగా ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. స్వల్ప మెజారిటీతో అధికార పార్టీ అభ్యర్థి గెలిచిన చోట ప్రత్యర్థి అభ్యర్థి కోరినా వీవీప్యాట్లను ఎందుకు లెక్కించడం లేదని ప్రశ్నించారు. ‘ఎక్కడో ఏదో జరిగింది, జరుగుతోంది’అన్నారు. ఈవీఎంలలో పడిన ఓట్లతో సంబంధం లేకుండా మెజారిటీలు వస్తున్నాయన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే వారే ఎన్నికల్లో అక్రమాలేవీ జరగలేదని మాట్లాడతారని ఈ అంశంపై ఓ ప్రశ్నకు ఉత్తమ్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. -
తగ్గిన మహిళా ప్రాతినిధ్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం తగ్గింది. 2014 ఎన్నికల్లో మొత్తం తొమ్మిది మంది విజయం సాధించగా ఈసారి ఆ సంఖ్య ఐదుకి పడిపోయింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్లో ఆరుగురు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఈసారి టీఆర్ఎస్ పార్టీ కొండా సురేఖ, బొడిగె శోభలకు టికెట్ నిరాకరించింది. దీంతో కోవా లక్ష్మి (ఆసిఫాబాద్), పద్మా దేవేందర్రెడ్డి (మెదక్), రేఖానాయక్ (ఖానాపూర్), గొంగిడి సునీత (ఆలేరు) ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో కోవా లక్ష్మి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), హరిప్రియా నాయక్ (ఇల్లందు) గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థులు డీకే అరుణ (గద్వాల), గీతారెడ్డి (జహీరాబాద్), పద్మావతిరెడ్డి (కోదాడ), కొండా సురేఖ (పరకాల) కూడా పరాజయం పాలయ్యారు. ఇక బీజేపీ నుంచి పోటీ చేసిన బొడిగె శోభ (చొప్పదండి)కు కూడా ఓటమి తప్పలేదు. -
మోదీకి ఖేదం– కేసీఆర్కు మోదం
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్గా జరిగిన అయిదు రాష్ట్రాలు–మధ్యప్రదేశ్, రాజ స్తాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మిజో రాం ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ హవాకు అడ్డుకట్ట వేశాయని చెప్పవచ్చు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ ఏక పక్షంగా సాధించిన విజయాలు చరిత్రాత్మకమైనవి. ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీకి ఖేదం, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మోదాన్ని కలిగించాయి. అలాగే దేశంలో ఇప్పటి వరకూ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ రాజ కీయ పార్టీ విజయం సాధించిన దాఖలాలు లేవు. కాబట్టి ఆ రికార్డును టీఆర్ఎస్ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా టీఆర్ఎస్ కారు వేగానికి కాంగ్రెస్లోని హేమాహేమీలు అడ్డుకట్ట వేయలేక ఓడిపోవడం గమనార్హం. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ పథకాలే టీఆర్ఎస్ భారీ విజయానికి దోహదపడ్డాయి. ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలన్న బీజేపీ కలలు కల్లలైనాయి. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఈ ఎన్నికలు మంచి గుణపాఠం నేర్పిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మైనారిటీ వ్యతిరేక రాజకీయాలు, మతం పేరిట ఓటర్లలో విభజన తెచ్చే వ్యూహాలు బీజేపీకి బెడిసికొడుతున్నాయని గ్రహించాలి. కేంద్రంలో అధికారంలోకొస్తే నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, ప్రతీ నిరుపేద కుటుంబానికి పదిహేను లక్షలు వారి ఖాతాలలో జమ చేస్తామన్న హామీలు నీటి మూటలయ్యాయి. నోట్ల రద్దుతో సామాన్యులకు నరకం చూపించారు. బ్యాంకుల దివాలాకు కారణమయ్యారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ, ఆర్థిక విధానాల వల్ల నిత్యావసరాల ధరలు, పెట్రోలు డీజిల్ రేట్లు అమాంతం పెరిగిపోయి సామాన్యుడు బతకలేని దుస్థితి దాపురించింది. మరోవైపు సంఘ్ పరివార్ వివాదాలు, విధ్వం సక పోకడలు బీజేపీ ప్రతిష్ఠను, మోదీ హవాను lతగ్గించివేస్తున్నాయి.అందువల్ల ఎన్నికలకు ముందు దేశ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కేంద్రం ఇకనైనా చిత్తశుద్ధితో కృషిచేయాలి. బట్టా రామకృష్ణ దేవాంగ, సౌత్ మోపూరు, నెల్లూరుజిల్లా -
అజేయుడు.. అద్వితీయుడు
ప్రజాకూటమి పేరిట కాంగ్రెస్, టీడీపీలు మూకుమ్మడిగా దాడి చేసినా.. ఓ వర్గం మీడియా చంద్రబాబుకు దన్నుగా తనపై తీవ్ర ప్రచారానికి దిగినా... మొక్కవోని దీక్షతో టీఆర్ఎస్ని అధికార పథంలో నిలబెట్టిన అద్వితీయ నాయకుడు కె. చంద్రశేఖర్రావు. ప్రజల నాడిని పసిగట్టడంలో, గెలుపు ఓటములను అంచనా వేయడంలో తన అనుభవాన్ని మొత్తంగా రంగరించిపోసిన కేసీఆర్ అటు కాంగ్రెస్ను, ఇటు చంద్రబాబును కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. తెలంగాణలో కూటమి గెలిస్తే ఆంధ్రప్రదేశ్లోనూ మరొక్కసారి కాలర్ ఎగరేసుకోవాలనుకున్న చంద్రబాబు ప్రయత్నం ఘోరంగా బెడిసికొట్టింది. తెలంగాణ ఆత్మను తట్టిలేపిన కేసీఆర్కే ఈ ఘన విజయం దక్కుతుంది. తెలంగాణ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అద్భుత విజయం సాధించింది. ఈ వార్తావ్యాఖ్య పూర్తి చేసే సమయానికి టీఆర్ఎస్ 88 స్థానాలు సాధించి ప్రజల్లో తన బలాన్ని చాటుకున్నది. టీఆర్ఎస్కు, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుకు అభినందనలు. అద్భుత విజయం అనడానికి కారణం ఆ పార్టీ గెలుచుకున్న స్థానాల సంఖ్యను బట్టి కాదు, ప్రత్యర్ధి కూటమిలో హేమాహేమీలు అందరినీ దాదాపుగా మట్టి కరిపిం చినందువల్ల. కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి రేసులో ఉన్న ప్రముఖులు జానారెడ్డి, జీవన్ రెడ్డి, డీకే అరుణ, దామోదర రాజనరసింహ, పొన్నాల లక్ష్మయ్య, రేవంత్రెడ్డి మొదలైన వారంతా ఓటమి పాలయ్యారు. కేసీఆర్ వ్యవహార శైలి, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఆయనకు ఉన్న వైముఖ్యం, అప్రజాస్వామిక ధోరణి వెరసి టీఆర్ఎస్ ఓటమి ఖాయం అనుకున్న వారందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ గులాబీ జెండా తెలంగాణ శిఖరాగ్రాన మరొక్కసారి రెపరెపలాడింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని మేధావులూ, మీడియా కచ్చితంగా టీఆర్ఎస్ ఓటమి పాలు కావడం ఖాయంగా భావించారు. వాళ్ళకు ప్రజల నాడి తెలుసుకునే అవకాశం తక్కువ అనుకుందాం. ప్రజాక్షేత్రంలో నిత్యం తిరుగుతూ తమ విజయావకాశాలను పరీక్షించుకుంటున్న రాజకీయ నాయకులకు, క్రియాశీల కార్యకర్తలకూ ఎందుకు అర్థం కాలేదు? టీఆర్ఎస్ అనుకూలత చాపకింద నీరులా ప్రవహించిం దనుకోవాలా? దానికి కారణం ఉంది. ప్రజల నాడి తెలుసుకునే పని మానేసి ప్రతిపక్ష రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం పని చేస్తున్న మీడియాను నమ్ముకోవడమే. నిన్న మొన్నటి దాకా కేసీఆర్, ఆయన ప్రభుత్వ కనుసన్నల్లో మెలుగుతూ తమ పత్రికలనూ, చానళ్లనూ అధికార పక్షం కరపత్రికలుగా, బాకాలుగా మార్చేసి హఠాత్తుగా యూటర్న్ తీసుకోవడం, తెలంగాణలో అధికార పక్షం ఓడిపోబోతున్నదని ప్రచారం మొదలుపెట్టడం వెనక దాగిన ఒక కుట్రను ప్రతిపక్ష రాజకీయ పార్టీలు గుర్తించలేక పోవడం అందుకు కారణం. మీడియా ఎత్తులూ, జిత్తులూ ప్రజలకు బాగా తెలుసు కాబట్టి తాము ఇవ్వదలచిన తీర్పు స్పష్టంగా ఇచ్చారు. తన స్వప్రయోజనాలను ఆశించి ‘‘పార్టీలు ఫిరాయించే’’ మీడియాను నమ్ముకున్న ప్రతిపక్షం తెలంగాణలో తగిన ఫలితాన్నే అనుభవించింది. నాలుగేళ్ళ మూడు నెలలు అధికారంలో ఉండి టీఆర్ఎస్ మూటగట్టుకున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక పెద్ద తప్పిదం ఇవాళ మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి గల కారణాల్లో ఒకటి అయింది. ఓటింగ్ సరళి, ఫలితాల సరళీ చూసినప్పుడు ముఖ్యంగా టీఆర్ఎస్ గెలుపునకు వివిధ రకాల పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలు కారణంగా చెప్పుకోవాలి. టీఆర్ఎస్ అనుకూల ఓట్లన్నీ నిశ్శబ్దంగా ఉంటే, కేసీఆర్ వ్యవహార శైలిని వ్యతిరేకించిన వర్గాలు బలమైన గొంతు కలిగి ఉండటం వల్ల టీఆర్ఎస్ వోటమి తప్పదనే అభిప్రాయం కలిగింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని పార్టీలతో కలిసి కూటమి కట్టాలన్న ఆలోచన చేసేసరికి టీఆర్ఎస్ తన గెలుపు పట్ల సందేహంలో పడిపోయింది. తెలంగాణ జనసమితి, భారత కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కూట మిగా ఎన్నికలకు పోవాలనుకున్నంతవరకూ కాంగ్రెస్ ఆలోచన బాగానే ఉంది. తెలంగాణలో అంతవరకూ టీఆర్ఎస్ ్రçపభుత్వానికి కరపత్రాలుగా ఉన్న మీడియా సంస్థలు, చంద్రబాబు రాకతోనే ప్లేట్ ఫిరాయించి టీఆర్ఎస్ వ్యతిరేక వైఖరి తీసుకున్నాయి. అప్పుడే కాంగ్రెస్ బలహీనపడటం మొదలైంది. చంద్రబాబు తన పార్టీ టీడీపీని కూటమిలో చేర్చేవరకూ నిజానికి టీఆర్ఎస్కు ప్రతిపక్షాలను విమర్శించడానికి సరైన ఆయుధం లేదు. బాబు కూటమిలో చేరడమే కాకుండా ఆ కూటమి అంతటినీ తానే నడిపిస్తున్నాననే అభిప్రాయం జనంలో కలిగించే దాకా కూడా టీఆర్ఎస్ ఆయుధం కోసం వెతుక్కుంటూనే ఉంది. బాబు ఆలోచన వేరు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆ ఘనత తనదే అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా కూటమిలో చేరడానికి ముందు జాతీయ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే రెండు బ్రహ్మ పదార్థాలను తీసుకుని రాహుల్ని మచ్చిక చేసుకున్నాడు. దీని వెనక ఎన్నికల కోసం బాబు అందించబోయే నిధులు ఆర్థికంగా దివాలా తీసిన కాంగ్రెస్ అధ్యక్షుడిని మరింత ఆకట్టుకున్నాయి. ప్రత్యేక విమానం వేసుకుని ఢిల్లీ వెళ్లి పత్రికా గోష్టి నిర్వహించి తిరిగి అమరావతి వెళ్ళిపోయే చంద్రబాబు నిజంగానే ఆకర్షణీయంగా కనిపించి ఉంటాడు రాహుల్ గాంధీకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన ఈ నాలుగున్నర ఏళ్ళ కాలంలో భ్రష్టు పట్టించిన తీరు రాహుల్ గాంధీ దృష్టికి రాలేదో లేక ఆ పార్టీ రాష్ట్ర బాధ్యులు ఆయనకు చెప్పలేదో కానీ బీజేపీయేతర పక్షాలన్నిటినీ కాంగ్రెస్ గూటికి చేర్చే పని తానే చేస్తానని నమ్మించిన బాబు ఉచ్చులో పడిపోయింది కాంగ్రెస్. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు తెలంగాణ ప్రజల్లో భయాలు తొలగించి భరోసా కల్పించే విధంగా కాకుండా ప్రసంగాలన్నీ తన గొప్పలు చెప్పుకోడానికి, తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకుని తద్వారా అధికారంలోకి వచ్చిన పార్టీని నిందించడానికే వెచ్చించారు. చంద్రబాబు ఆలోచన ఏమిటంటే తెలంగాణలో తాను పొత్తు కూడిన కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో చక్రం తానే తిప్పాననీ, జాతీయ స్థాయిలో కూడా తిప్పుతాననీ చెప్పుకుని ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న దుష్పరిపాలన నుంచి, ప్రజావ్యతిరేకత నుంచి అందరి దృష్టి మళ్ళించాలి. ఆయన ఆలోచనకు కొందరు మీడియా యజమానులు, మాజీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి వారు తోడయ్యారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ ముఠా ఒక్క దగ్గర చేరి టీఆర్ఎస్ను ఓడించడానికి అవసరం అయిన ప్రణాళికలు కూడా వేసుకుందని వార్తలు వచ్చాయి. ఇదంతా బెడిసి కొట్టింది. బాబు కంటే రెండాకులు ఎక్కువే చదువుకున్న కేసిఆర్ దాన్నే ఆయుధంగా మలుచుకుని జనంలోకి వెళ్ళారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతికి తాకట్టు పెడదామా, ఢిల్లీ వీధుల్లో అమ్ముదామా అని ప్రశ్నించే సరికి ఆయనను, ఆయన పరిపాలనను వ్యతిరేకిస్తున్న వర్గాలు కూడా చంద్రబాబునాయుడును నిలువరించేందుకు టీఆర్ఎస్కు ఓటేసే పరిస్థితి ఏర్పడింది. దాని పర్యవసానమే ఇవ్వాల్టి తెలంగాణ శాసన సభ ఎన్నికల ఫలితం. తన పార్టీ తరఫున కూటమి అభ్యర్థులుగా నిలబెట్టిన కొద్ది మందిని కూడా గెలిపించుకునే పరిస్థితి చంద్రబాబుకు లేకుండా పోయింది. నందమూరి కుటుం బాన్ని మచ్చిక చేసుకోడానికన్నట్టు దివంగత హరికృష్ణ కుమార్తెను కూకట్ పల్లిలో పోటీ చేయించి ఘోర పరాజయం పాలుచేశారు చంద్రబాబు. చంద్రబాబు పేరు కూడా తెలియని మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడం, అదే సమయంలో బాబు వేలు పెట్టిన తెలంగాణలో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూడటం కాంగ్రెస్ పెద్దలకు, ముఖ్యంగా రాహుల్ గాంధీకి కనువిప్పు కావాలి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలను కళ్ళప్పగించి చూస్తూ, చెవులు అప్పగించి వింటూ కూర్చున్న కాంగ్రెస్ పెద్దలు తప్పకుండా పునరాలోచనలో పడతారని ఆశిద్దాం. బీజేపీకి దూరం అయ్యాక జాతీయ రాజకీయాల్లో దూరి తన అస్తిత్వాన్ని చాటుకోవాలనుకున్న చంద్రబాబుకు తెలంగాణ ఫలితాలు పెద్ద దెబ్బ. తెలంగాణాలో కూటమి గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా మరొక్కసారి కాలర్ ఎగరేసుకోవాలన్న ఆయన ప్రయత్నం బెడిసి కొట్టింది. కూటమిలో చంద్రబాబు చేరిక కారణంగా తెలంగాణ ఉద్యమ పెద్దగా ఇంతకాలం గౌరవం పొందిన ప్రొఫెసర్ కోదండరాం, ప్రజాయుద్ధ నౌకగా పేరుపొందిన గద్దర్ వంటి వారి ప్రతిష్ట కూడా మసకబారిందనడంలో సందేహం లేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా తమ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ను, ఓటర్ల జాబితాలో అవకతవకలను కారణాలుగా చూపించే ప్రయత్నం చేయడం, కుంటిసాకులు వెతుక్కోవడం సరికాదు. దానికి బదులుగా స్థిమితంగా కూర్చుని ప్రజాకూటమి ఓటమికి కారణాలను విశ్లేషించి, ఆత్మ విమర్శ చేసుకుని, అధిష్టానవర్గానికి ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ చేస్తే, వాళ్ళు దాన్ని నిజాయితీగా అమలు పరిచి చంద్రబాబు వంటి వారిని దూరం పెడితే ముందు ముందు కాంగ్రెస్ కొంచెం అయినా బాగుపడటానికి, బలపడటానికీ ఉపయోగపడుతుంది. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచిన సీట్లు 63, కాగా సుస్థిరత సాకుతో ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్న వారితో కలిపి మొన్న ఎన్నికలకు పోయేనాటికి 90 సీట్లు అయ్యాయి. ఈసారి ఆ అవసరం లేకుండానే జనం సుస్థిర పాలన చెయ్యడానికి అవసరం అయిన సంఖ్యాబలం ఇచ్చారు కాబట్టి కేసీఆర్ ఇక అవతలి పార్టీల వారికి కండువాలు కప్పే అనైతిక కార్యక్రమానికి స్వస్తి చెపితే మంచిది. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ఎన్నికల ఫలితాన్ని గౌరవించడంతో బాటు, ప్రజలనూ, ప్రజాస్వామిక విలువలనూ, పౌర హక్కులనూ గౌరవించే వాళ్లకు అందుబాటులో ఉండే ప్రయత్నం ఈ రెండో పదవీ కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అలవరుచుకుంటే కూడా బాగుంటుంది. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
తెలంగాణ ప్రజలకు జేజేలు!
తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు నవంబర్ 12తో మొదలై ఈనెల 7వరకూ వివిధ దశల్లో జరిగిన ఎన్నికల్లో మంగళవారం ప్రజాభిప్రాయం వెల్లడైంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ గెలుపు ఖాయమవుతుండగా... మిజోరంలో మిజోరం నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) గెలుపొందింది. హోరాహోరీగా జరిగిన తెలంగాణ పోరులో జనం టీఆర్ఎస్కు పట్టంగట్టారు. అయిదేళ్లకోసారి పాలకుల్ని మార్చే అలవాటున్న రాజస్తాన్లో నైనా... మూడు దఫాలనుంచి వరసగా బీజేపీవైపే మొగ్గుచూపుతూ వస్తున్న మధ్యప్రదేశ్లోనైనా విజేతలకూ, పరాజితులకూ మధ్య సీట్ల సంఖ్యలో పెద్దగా వ్యత్యాసం లేకపోవడం గమనించదగ్గది. బీజేపీకి గత మూడు దఫాలు పట్టంగట్టిన ఛత్తీస్గఢ్లో మాత్రం కాంగ్రెస్ మంచి మెజారిటీ దిశగా సాగిపోతోంది. మరో ఆర్నెల్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా అభివర్ణిస్తున్న ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉందో అర్ధమైంది గనుక జాతీయ పార్టీలూ, ప్రాంతీయ పార్టీలూ కూడా తమ తమ ఆచరణలనూ, ఎత్తుగడలనూ సవరించుకుంటాయి. భవి ష్యత్తు వ్యూహాలకు పదును పెట్టుకుంటాయి. ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని సిద్ధాంతాలు వల్లించినా ప్రజాప్రయోజనాలు ఇరుసుగా చేసుకుని పనిచేయని పార్టీలకు–అవి అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా జనం గట్టిగా గుణపాఠం చెప్పారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, అవకాశవాద పొత్తులతో అందలం ఎక్కుదామనుకున్నవారిని చాచికొట్టారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు అక్షరాలా ఒంటరి పోరాటం చేశారు. పొలోమంటూ తరలివచ్చిన జాతీయపార్టీల అతిరథమహారథులను ఎదుర్కొన్నారు. ‘నే తగుదు నమ్మా...’ అంటూ పొరుగు రాష్ట్రమన్న స్పృహ కూడా లేకుండా తెలంగాణలో కాళ్లూ చేతులూ పెట్ట బోయిన ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరిచిపోలేని గుణపాఠం నేర్పారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, పలువురు బీజేపీ సీఎంలు, కేంద్రమంత్రులు ఇక్కడ ప్రచారం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో ఏనాడూ, ఎక్కడా బహిరంగసభల్లో పాల్గొనని కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ హైదరాబాద్ నగరంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. తెలంగాణ స్థితిని చూసి తల్లిగా తల్లడిల్లుతున్నానని జనంలో సెంటిమెంటు పండించేందుకు ప్రయ త్నించారు. ప్రచారం ముగిసేరోజు సైతం వీడియో సందేశమిచ్చారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటించారు. చంద్రబాబుతో కలిసి సభల్లో, విలేకరుల సమావేశాల్లో పాల్గొ న్నారు. కానీ విషాదమేమంటే సోనియాగాంధీ అయినా, రాహుల్ అయినా చంద్రబాబు స్క్రిప్టును మించి మరేమీ చెప్పలేకపోయారు. సొంత రాష్ట్రంలో అన్నిటా విఫలమైన బాబు ఇక్కడికొచ్చి కేసీ ఆర్ను విమర్శించడాన్ని చూసి జనం నవ్వుకున్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని అంటారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎవరూ హత్య చేయలేదు. అదే ఆత్మహత్య చేసుకుంది. తన మరణశాసనాన్ని తానే లిఖించుకుంది. ఒంటరిగా పోటీ చేస్తే మెజారిటీ రాకపోయినా, ఆ పార్టీకి గౌరవనీయమైన సంఖ్యలో సీట్లు లభిం చేవి. దురాశకు పోకుండా టీజేఎస్, సీపీఐలతోపాటు సీపీఎంని కూడా ఒప్పించి వాటితో కూటమికి సిద్ధపడితే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది. కానీ కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా ‘టీఆర్ఎస్ పొమ్మన్నది గనుక మీతో చెలిమి చేస్తాన’ంటూ వచ్చిన చంద్రబాబును వెనకా ముందూ చూడ కుండా వాటేసుకుంది. వచ్చింది మనవాడా... మనకు పరాయివాడా అన్న సోయి లేకుండా పోయింది. కూటమి కట్టేముందు ఏ పార్టీ అయినా దానికి అర్ధం, పరమార్ధం ఏమిటో గ్రహించగల గాలి. తమ సిద్ధాంతాలేమిటో, లక్ష్యాలేమిటో, ప్రయోజనాలేమిటో... వాటిని సాధించడానికి కూటమి దోహదపడుతుందో, గండికొడుతుందో చూసుకోవాలి. చంద్రబాబుకు ఈ బాదరబందీ ఉండదు. అవకాశవాదమే ఆయన వేదం. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి నిరంత రాయంగా సాగిస్తున్న ఉద్యమ ఫలితంగా ‘ప్రత్యేకహోదా’ అంశం ఆంధ్రప్రదేశ్లో సజీవంగా ఉన్న దని, అది వచ్చే ఎన్నికల్లో తనకు శరాఘాతం కాబోతున్నదని బాబు గ్రహించారు. అందువల్ల ఏదో ఒకసాకు చూపించి ఎన్డీఏ గోడ దూకి బయటికొచ్చారు. జాతీయ స్థాయిలో హడావుడి చేసి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టాలంటే అర్జెంటుగా ఒక వేదిక అవసరమని భావించారు. అందుకోసం ఆయన తొలుత టీఆర్ఎస్ను కదిపి చూశారు. ‘తెలుగువాళ్లం ఏకమవుదాం’ అని కబురంపారు. కానీ టీఆర్ఎస్ తిరస్కరించడంతో గత్యంతరం లేక కాంగ్రెస్ తలుపుతట్టారు. తన అవకాశవాదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ‘జాతీయప్రయోజనాలు, ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ’ వంటి అమూ ర్తమైన పడికట్టు పదాలను అరువు తెచ్చుకున్నారు. ఆయన వందలకోట్లు నిధులు పారిస్తానని చెప్పి ఉండొచ్చు. కొమ్ములు తిరిగిన మీడియా సంస్థలతో హోరెత్తిస్తానని హామీ ఇచ్చి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ విజ్ఞత ఏమైంది? ఎంత చెడ్డా బాబు సీనియారిటీతో పోలిస్తే ఆ పార్టీ అనుభవం ఎంతో ఎక్కువ. కానీ అదంతా బూడిదలో పోసినట్టయింది. తొమ్మిదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో ఒంటరిగా బరిలోకి దిగి సునాయాసంగా గెలిచిన ప్రముఖులంతా ఇప్పుడు బోర్లాపడ్డారు. తమ చరిత్రను తామే మరిచి పోయి, అలవాటులేని రాజకీయాల్లో తలదూర్చి టీజేఎస్ అధినేత కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్ చేతులు కాల్చుకున్నారు. తెలంగాణ ప్రజలు డబ్బుకూ, ఇతర వ్యామోహాలకూ లొంగలేదు. తమకు మేలు చేసేదెవరో, ఆషాఢభూతులెవరో సులభంగా గ్రహించారు. అనైతిక రాజకీయాలనూ, అవకాశవాదాన్నీ తిరస్కరించారు. దొంగ సర్వేలతో మభ్యపెట్టబోయినవారిని బేఖాతరు చేశారు. తమ ఓటుతో జాతీయ రాజకీయాలకు ఎగబాకాలనుకున్నవారికి గుణపాఠం నేర్పిన తెలంగాణ ప్రజలు శతథా అభినందనీయులు! -
లోక్సభ టు అసెంబ్లీ బాట..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. మొత్తం 119 స్థానాలకుగాను 88 చోట్ల విజయదుందుభి మోగించింది. అయితే, ఈ ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్లు పలువురు తాజా, మాజీ లోక్సభ సభ్యులను అసెంబ్లీ బరిలోకి దింపాయి. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించినవారు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తారనే నమ్మకం ఒకవైపూ.. సదరు ఎంపీల అంగబలం, అర్ధబలం ఉపయోగించి మరికొందరి ఎమ్మెల్యేలను సైతం గెలుపించుకోవచ్చనే వ్యూహం మరోవైపు ఆయా పార్టీలు ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. అయితే, ప్రజామోదం పొందిన ఎంపీలు గెలుపొందగా.. మరికొందరికి పరాజయం తప్పలేదు. పోటీచేసిన ఎంపీలు.. బాల్కసుమన్ (టీఆర్ఎస్-చెన్నూర్)-గెలుపు, చామకూర మల్లారెడ్డి (టీఆర్ఎస్-మేడ్చల్)-గెలుపు. పోటీచేసిన మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్-కరీంనగర్)-ఓటమి, సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్-సికింద్రాబాద్ కంటోన్మెంట్)-ఓటమి, నాగం జనార్థన్రెడ్డి (కాంగ్రెస్-నాగర్కర్నూలు)-ఓటమి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (కాంగ్రెస్ మునుగోడు)-గెలుపు, సురేష్ షెట్కార్ (కాంగ్రెస్-నారాయణఖేడ్)-ఓటమి, నామా నాగేశ్వర్ రావు (టీడీపీ-ఖమ్మం)-ఓటమి, మల్లు రవి (కాంగ్రెస్-జడ్చర్ల)-ఓటమి, పోరిక బలరాం నాయక్ (కాంగ్రెస్-మహబూబాబాద్)-ఓటమి, రమేష్ రాథోడ్ (కాంగ్రెస్-ఖానాపూర్)-ఓటమి,. -
‘టీఆర్ఎస్ విజయం ఉద్యమ విజయమే’
సాక్షి, చెన్నై : తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన విజయం ప్రజాస్వామ్య విజయమని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన త్యాగాన్ని ప్రజలు మరవలేదన్న విషయం ఈ ఫలితాలలో రుజువైందన్నారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎవరెన్ని మాటలు చెప్పిన ప్రజలు నమ్మలేదని, అభివృద్ధికే పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో విజయం సాధించాలని కలలు కన్న పార్టీలకు ప్రజల తగిన విధంగా బుద్ధి చెప్పారన్నారు. ఎన్నికల్లో కుల, మతాలను ప్రోత్సహించిన పార్టీలతో ప్రజల తమ ఓటు అస్త్రంతో తగిన శాస్తి చెప్పారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన చివరని ఉద్యమ వీరుడికే విజయ దక్కిందని, ఇది కచ్చితంగా ఉద్యమ విజయమేనని వ్యాఖ్యానించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గుణాత్మకమైన మార్పు దిశగా అడుగులు వేసి ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
‘తెలంగాణలో ఓటమిని మా ఖాతాలో వేయొద్దు’
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజాకూటమి ఘోర ఓటమికి తామే కారణమంటూ ప్రచారం చేయడాన్ని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తప్పుబట్టారు. ప్రజాకూటమి ఓటమిని తమ ఖాతాలో వేయొద్దంటూ విన్నవించారు. తెలంగాణలో ప్రచారానికి కట్టుబట్టలతో వచ్చిన తాము రాష్ట సమస్యలతోనే తీరిక లేకుండా ఉన్నామన్నారు. కేసీఆర్ మాటకారి.. ఆయన ఏదైనా మాట్లాడగలడని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘స్పీకర్ సుమిత్రా మహాజన్ తో జరిగిన సమావేశంలో రాష్ట్ర సమస్యలపై మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని కోరాం. సమస్యలపై కేంద్రం స్పందించే తీరునుబట్టి నిరసన కార్యక్రమాలు చేస్తాం.రాష్ట్ర విభజన హామీలను అమాలు చెయ్యాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ లు చేస్తున్న చేస్తున్న దాడులపై కేంద్రం సమాధానం చెప్పాలి. నాయకులను డీమోరలైజ్ చెయ్యడానికి దాడులు చేయిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మమ్మల్ని మోసం చేసింది. కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం సహకరిస్తామని చెప్పడంతో వారితో కలిసాం. తెలంగాణలో ప్రజాఫ్రంట్ ఓటమిని మా ఖాతాలో వేయొద్దు’ అని కొనకళ్ల పేర్కొన్నారు. -
సీట్లూ తక్కువే... గెలిచిన స్థానాలూ తక్కువే
సాక్షి, హైదరాబాద్ : ఆకాశంలో సగం అంటూ ‘ఆమె’ను ఆకాశానికి ఎత్తేసే ప్రభృతులు రాజకీయంగా మాత్రం మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సైతం మహిళలకు ఈసారి తక్కువ సీట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనం. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మహిళలకు వివిధ పార్టీలు కేటాయించిన సీట్లు తక్కువగా ఉండగా, గెలుపొందిన స్థానాలు కూడా తక్కువే. 2014లో టీఆర్ఎస్ 11 మంది మహిళా అభ్యర్థులకు అవకాశం ఇవ్వగా, బీజేపీ- టీడీపీ కూటమి 14 మందికి, కాంగ్రెస్ పార్టీ 9 మంది మహిళలను ఎన్నికల బరిలో నిలిపాయి. అయితే ఈ అభ్యర్థుల్లో కేవలం 9 మంది మాత్రమే గెలుపొందగా.. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో చోటివ్వకపోవడంతో మహిళా ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. అయితే ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ అత్యధికంగా 13 మంది మహిళా అభ్యర్థులకు సీట్లు కేటాయించగా.. ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు. కాంగ్రెస్ తరఫున మొత్తంగా 11 మంది టికెట్లు దక్కించుకున్నారు. వీరిలో ముగ్గురు అభ్యర్థులు(మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియ నాయక్, సీతక్క) మాత్రమే గెలుపొందారు. తెలంగాణలో ఉనికి కోల్పోయిన టీడీపీ కూకట్పల్లి నియోజకవర్గంలో నందమూరి సుహాసినికి అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె ఓటమి పాలయ్యారు. ఇక మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ టీఆర్ఎస్ ఈ దఫా కేవలం నలుగురు మహిళలకు మాత్రమే సీట్లు కేటాయించింది. కాగా వీరిలో ముగ్గురు అభ్యర్థులు గెలుపొందడం విశేషం. టీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి పోటీచేసిన మహిళలు పద్మాదేవేందర్ రెడ్డి (మెదక్), రేఖా శ్యాం నాయక్(ఖానాపూర్), కోవా లక్ష్మి (అసిఫాబాద్), గొంగిడి సునీతా మహేందర్రెడ్డి(ఆలేరు) కాంగ్రెస్ నుంచి టిక్కెట్లు దక్కించుకున్న మహిళా అభ్యర్థులు గండ్రత్ సుజాత (ఆదిలాబాద్), ఆకుల లలిత(ఆర్మూర్), సునీతాలక్ష్మారెడ్డి (నర్సాపూర్), జె.గీతారెడ్డి (జహీరాబాద్), సబితాఇంద్రారెడ్డి (మహేశ్వరం), డీకే అరుణ (గద్వాల), పద్మావతీరెడ్డి (కోదాడ), కొండా సురేఖ (పరకాల), సీతక్క (ములుగు), హరిప్రియ (ఇల్లందు), సింగాపురం ఇందిర (స్టేషన్ ఘన్పూర్) ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీ నుంచి బరిలో దిగిన మహిళా అభ్యర్థులు స్వర్ణారెడ్డి(నిర్మల్), అరుణతార(జుక్కల్ ), బొడిగె శోభ(చొప్పదండి), ఆకుల విజయ(గజ్వేల్), సయ్యద్షెహజాది(చాంద్రాయణగుట్ట), పద్మజారెడ్డి(మహబూబ్నగర్), రజనీ మాధవరెడ్డి(ఆలంపూర్), కంకణాల నివేదిత(నాగార్జునసాగర్), నాగ స్రవంతి(), రేష్మారాథోడ్(వైరా), కుంజా సత్యవతి(భద్రాచలం), పుప్పాల శారద(ఖమ్మం), చందుపట్ల కీర్తిరెడ్డి (భూపాలపల్లి). కాగా 2014 ఎన్నికల్లో మొత్తంగా 85 మంది మహిళా అభ్యర్థులు బరిలో దిగగా(ఏడీఆర్ నివేదిక ప్రకారం)... 9 మంది విజయం సాధించారు. ఈసారి 135 మంది పోటీ చేయగా కేవలం ఆరుగురు మాత్రమే శాసనసభలో అడుగుపెట్టనున్నారు. 2018 ఎన్నికల్లో గెలిచిన మహిళా అభ్యర్థులు అభ్యర్థి పేరు నియోజకవర్గం పార్టీ ప్రత్యర్థి పార్టీ మెజారిటీ పద్మాదేవేందర్ రెడ్డి మెదక్ టీఆర్ఎస్ ఉపేందర్రెడ్డి కాంగ్రెస్ 47983 గొంగిడి సునీతామహేందర్ రెడ్డి ఆలేరు టీఆర్ఎస్ బూడిద భిక్షమయ్య కాంగ్రెస్ 33086 సీతక్క ములుగు కాంగ్రెస్ అజ్మీరా చందూలాల్ టీఆర్ఎస్ 22671 రేఖా శ్యాం నాయక్ ఖానాపూర్ టీఆర్ఎస్ రమేష్ రాథోడ్ కాంగ్రెస్ 20710 సబితాఇంద్రారెడ్డి మహేశ్వరం కాంగ్రెస్ తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్ 7607 హరిప్రియ ఇల్లందు కాంగ్రెస్ కనకయ్య కోరం టీఆర్ఎస్ 2907 2014 ఎన్నికల్లో విజయం సాధించిన మహిళలు అభ్యర్థి పేరు నియోజక వర్గం పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి పార్టీ మెజారిటీ రేఖా శ్యాం నాయక్ ఖానాపూర్ టీఆర్ఎస్ రాథోడ్ రమేష్ టీడీపీ 38,551 బొడిగె శోభ చొప్పదండి టీఆర్ఎస్ సుద్దాల దేవయ్య కాంగ్రెస్ 54,981 డికె అరుణ గద్వాల్ కాంగ్రెస్ బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి టీఆర్ఎస్ 8,260 గొంగిడి సునీత ఆలేరు టీఆర్ఎస్ బూడిద భిక్షమయ్య కాంగ్రెస్ 31,477 జెట్టి గీత జహీరాబాద్ కాంగ్రెస్ కొనింటీ మానిక్ రావ్ టీఆర్ఎస్ 814 కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ టీఆర్ఎస్ బసవరాజు సారయ్య కాంగ్రెస్ 55,085 కోవా లక్ష్మి అసిఫాబాద్ టీఆర్ఎస్ ఆత్రం సక్కు కాంగ్రెస్ 19,052 పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ టీఆర్ఎస్ విజయశాంతి కాంగ్రెస్ 39,660 నలమాద పద్మావతి రెడ్డి కోదాడ కాంగ్రెస్ బొల్లం మల్లయ్య యాదవ్ టీడీపీ 13,090 -
ఫలితాలపై భిన్నంగా స్పందించిన కమల్, రజనీ
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్గా పరిగణిస్తున్న అయిదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమిళ సూపర్స్టార్లు కమల్ హాసన్, రజనీకాంత్లు పరస్పరం భిన్నంగా స్పందించారు. బీజేపీని వ్యతిరేకించే కమల్ హాసన్ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ ‘నూతన ఆరంభానికి ఇది తొలి సంకేతం..ఇది ప్రజల తీర్ప’ ని ట్వీట్ చేశారు. ఇక బీజేపీకి సన్నిహితంగా వ్యవహరిస్తారని భావించే రజనీకాంత్ అయిదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎదురుదెబ్బ వంటివని పేర్కొనడం గమనార్హం. రజనీ బీజేపీ వైపు మొగ్గుచూపుతారని గతంలోనూ పలుమార్లు వార్తలు వచ్చినా ఆయన వాటిని తోసిపుచ్చారు. తన వెనుక బీజేపీ ఉంటుందని చెబుతున్నారు కానీ తన వెనుక ప్రజలున్నారని, భగవంతుడున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. -
టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
-
ఇది సౌండ్ మాత్రమే.. ఏపీలో బాబు రీసౌండ్ వింటారు..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించటంతో త్వరలో ఆంధ్ర ప్రదేశ్లో జరగబోయే ఎన్నికలపై చర్చ మొదలైంది. పలువురు ప్రముఖులు తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్స్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో విశ్లేషిస్తున్నారు. ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ ఈ విషయంపై స్పందిస్తూ ఓ వీడియో మెసేజ్ను విడుదల చేశారు. ‘తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు గారు టీఆర్ఎస్ పార్టీ సౌండ్ మాత్రమే విన్నారు.. 2019లో జరగబోయే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే జనరల్ ఎలక్షన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినిపించబోయే రీ సౌండ్ వినబోతున్నారు. కేవలం రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం వినపడే రీ సౌండ్ వినబోతున్నారు’ అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చెప్పారు. -
కరీంనగర్లో దూసుకుపోయిన కారు
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఆసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ 11 స్థానాలను గెల్చుకొని జిల్లాపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో 12 స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధించగా, జగిత్యాలలో మాత్రమే ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ చేతిలో ఈఎన్నికల్లో అనూహ్యంగా ఘోర పరాజయం పాలయ్యారు. ఈసారి 11 స్థానాలను సొంతం చేసుకుని ఉత్తర తెలంగాణలో తనకు ఎదురులేదని చాటింది. మంథనిలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు విజయం సాధించారు. రామగుండంలో అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి కోరుగంటి చందర్ విజయం సాధించారు. ఎవరూ ఉహించని విధంగా కేసీఆర్ 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ప్రతి పక్షాలను కొలుకొని దెబ్బ తీశారు. అసెంబ్లీ రద్దుతోనే కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించగా ప్రతిపక్షాలు దిక్కులు చుడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్లు కూటమిగా ఏర్పడి టీఆర్ఎస్ను ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు. టీఆర్ఎస్ అమలు చేసీన సంక్షేమ పథకాలు, ప్రజల్లో కేసీఆర్ పట్ల ఉన్న నమ్మకం ముందు కూటమి ఎత్తులు నిలువలేకపోయాయి. నియోజకవర్గం పేరు పార్టీ అభ్యర్థి పేరు కరీంనగర్ టీఆర్ఎస్ గంగుల కమలాకర్ ధర్మపురి టీఆర్ఎస్ కొప్పల ఈశ్వర్ జగిత్వాల టీఆర్ఎస్ డా సంజయ్ కుమార్ కోరుట్ల టీఆర్ఎస్ కల్వకుంట్ట విద్యాసాగర్ రావు రామగుండం ఇతరులు కే చందర్ మంథని కాంగ్రెస్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి టీఆర్ఎస్ దాసరి మనోహర్ రెడ్డి చొప్పదండి టీఆర్ఎస్ సుంకే రవిశంకర్ వేములవాడ టీఆర్ఎస్ చేన్నమనేని రమేష్ సరిసిల్ల టీఆర్ఎస్ కే తారకరామారవు మానకొండూరు టీఆర్ఎస్ రసమయి బాలకీషన్ హూజురాబాద్ టీఆర్ఎస్ ఈటల రాజేందర్ హుస్నాబాద్ టీఆర్ఎస్ వడితెల సతీష్బాబు -
ఇందూరులో ఎగిరిన గులాబీ జెండా
సాక్షి,ఇందూరు: నిజామాబాద్ జిల్లాలో 2014 ఎన్నికల టీఆర్ఎస్ అనుకూల ఫలితాలు మళ్లీ రిపీట్ అయ్యాయి. కానీ అనూహ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాజుల సురెందర్ గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో గతంలో ఆయన నాలుగు సార్లు ఓటమి పాలయ్యారు. వరుసగా నాలుగు సార్లు ఒటమి పొందడం వల్ల ప్రజల్లో ఈసారి సానుభూతితో గెలుపొంది నిజామాబాద్లో కాంగ్రెస్ ఉనికిని కాపాడారు.టీఆర్ఎస్ కీలక నేత ఏనుగు రవీందర్ రెడ్డి ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ శాసన మండలి పక్షనేత షబ్బీర్ అలీ ఎన్నో ఆశలతో బరిలోకి దిగినా ఓటమి తప్పలేదు. మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి బోధన్లో వరుసగా రెండోసారి ఓటమి చెందారు.బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి విజయం సాధించి తన పట్టు నిలుపుకున్నారు. మిగతా 8 స్థానాల్లో నిజామాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మెజార్టీ ఇచ్చి గెలిపించారు. నిజామాబాద్లో టీఆర్ఎస్ పార్టీ అమలుపరిచిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వల్ల ప్రజల తీర్పును పదిలపరుచుకుంది.ఎంపీ కవిత ప్రచారం కూడా టీఆర్ఎస్ పార్టీకి, అభ్యర్థులకు కలిసి వచ్చింది.టీఆర్ఎస్ పార్టీ మరోసారి ప్రజాధారణ నిలబెట్టుకుంది.పలు నియోజకవర్గల్లో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలమైన కేడర్ గెలుపులో కీలక పాత్ర పోషించింది.కాంగ్రెస్పార్టీ కూటమిగా మారి గెలుపు కోసం ప్రయత్నించినా ప్రజల మద్దతును ఒక్క స్థానంలో మాత్రమే పొందగలిగింది. నిజమాబాద్ జిల్టా మోత్తం నియోజకవర్గాలు నియోజకవర్గం పేరు అభ్యర్థి పేరు పార్టీ నిజమబాద్ (అర్బన్ ) బిగాల గణేష్ గుప్తా టీఆర్ఎస్ నిజమబాద్ (రూరల్) బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్ఎస్ బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్ బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ ఎల్లారెడ్డి జాజుల సురెందర్ కాంగ్రెస్ ఆర్మూర్ ఆశన్నగారి జీవన్రెడ్డి టీఆర్ఎస్ బోధన్ షకీల్ అహ్మద్ టీఆర్ఎస్ కామారెడ్డి గంప గోవర్థన్ టీఆర్ఎస్ జుక్కల్ హనుమంత్ సింధే టీఆర్ఎస్ పోల్ గ్రాఫ్ -
ఖమ్మంలో టీఆర్ఎస్ కు ఝలక్..!
సాక్షి,ఖమ్మం : ఎన్నికల్లో వినూత్న ఫలితాలను ఇచ్చే ఖమ్మం జిల్లా ఈ సారి తన పరంపరను కొనసాగించింది. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్కు మద్దతుగా ఉండగా ఖమ్మం జిల్లా మాత్రం కాంగ్రెస్కు అవకాశం ఇచ్చింది. జిల్లాలోని పది స్థానాలకుగాను 6 స్థానాలలో కాంగ్రెస్ విజయం సాదించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకుపోగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం భంగపడింది. జిల్లాలోని పాలేరులో టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, కేసీఆర్కు ఆప్తుడైన తుమ్మల నాగేశ్వర రావు ఓడిపోయారు. 1950 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు.సీనియర్ నాయకుడు , జిల్లాలో పలుకుబడి ఉన్న నాయకుడు అయిన తుమ్మల ఓటమి టీఆర్ఎస్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఆ స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాదించారు. 2014లో గెలిచిన కొత్తగూడెం స్థానాన్ని కూడా టీఆర్ఎస్ కోల్సోయింది. మదిర (మల్లుభట్టివిక్రమార్క), పినపాక (రేగకాంతారావు), ఇల్లందు శ్రీమతి బానోతు హరిప్రియా నాయక్), పాలేరు (కె ఉపేందర్ రెడ్డి), కొత్తగూడెం (వనమా వెంకటేశ్వరరావు), భధ్రాచలం (పోడెం వీరయ్య) లలో తన సత్తా చాటింది. ఆశ్వారావ్పేట (మచ్చా నాగేశ్వరరావు), సత్తుపల్లి (సండ్రవెంకట వీరయ్య) లలో టీడీపీ గెలవగా, ఖమ్మం (పువ్వాడ అజయ్)లో టీఆర్ఎస్ అభ్యర్ధి , వైరా (రాముల్నాయక్)లో స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. నియోజకవర్గాలు అభ్యర్ధిపేరు పార్టీ పేరు పినపాక (ఎస్టీ) రేగ కాంతారావు కాంగ్రెస్ ఇల్లందు (ఎస్టీ) బానోతు హరిప్రియా నాయక్ కాంగ్రెస్ ఖమ్మం పువ్వాడ అజయ్ టీఆర్ఎస్ పాలేరు కె ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ మధిర (ఎస్సీ) మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ వైరా (ఎస్సీ) రాముల నాయక్ స్వతంత్ర అభ్యర్ధి సత్తుపల్లి (ఎస్సీ) సండ్రవెంకట వీరయ్య టీడీపీ కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ ఆశ్వారావ్పేట (ఎస్టీ) మచ్చా నాగేశ్వరరావు టీడీపీ భధ్రాచలం (ఎస్టీ) పోడెం వీరయ్య కాంగ్రెస్ -
ప్రజల మనిషిగా కొనసాగండి : మహేష్ బాబు
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో సంచలన విజయం నమోదు చేసిన తెలంగాణ రాష్ట్రసమితి నాయకులపై శుంభాకాంక్షల జల్లు కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ తారలు సోషల్ మీడియా ద్వారా విజేతలకు అభినందనలు తెలుపగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన స్నేహితుడు కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపాడు. ‘ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. మీరు అన్ని రకాలుగా ఈ విజయానికి అర్హులు. ఇక ముందు కూడా ప్రజల మనిషిగా కొనసాగండి’ అంటూ ట్వీట్ చేశాడు మహేష్. చాలా కాలంగా మహేష్తో సన్నిహిత సంబంధాలు ఉన్న కేటీఆర్.. భరత్ అనే నేను సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. A big congratulations on the win @KTRTRS... A very well deserved one 👏🏻👏🏻 Continue to be the man of the people... Wishing you all the very best👍🏻👍🏻 — Mahesh Babu (@urstrulyMahesh) December 11, 2018 -
రంగారెడ్డిలో పట్టు కోల్పోయిన టీడీపీ
సాక్షి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న మొత్తం 14 నియోజకవర్గాల్లో 11 స్థానాలను అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో ఏడు స్థానాల్లో విజయం సాధించిన టీడీపీ ఈసారి ఖాతా కూడా తెరవలేకపోయింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రచారం చేసినా పలితం లేకపోయింది. కేసీఆర్ సంక్షేమ పధకాల ముందు కూటమి ఎత్తుగడలు పనిచేయలేదు. గత ఎన్నికల్లో 4 స్ధానాలతో సరిపెట్టుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు ఏకంగా 11 స్థానాలలో విజయకేతనం ఎగరవేసింది. గతంలో రెండు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 3స్థానాలతో సరిపెట్టుకుంది. 2014 ఎన్నికల్లో ఒక స్ధానం గెలుపొందిన బీజేపీ ఈ సారి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. సంక్షేమ పథకాలతోనే విజయం గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు టీఆర్ఎస్ విజయంలో ఎంతో కీలకపాత్ర పోషించాయి. ప్రజాకర్ష పథకాలతో లబ్దిపొందిన తెలంగాణ ప్రజలు ఓట్లతో టీఆర్ఎస్ను ఆదరించారు. జిల్లాల విభజన, నగరంలో జరిగిన అభివృద్ది టీఆర్ఎస్ విజయానికి ఎంతగానో ఉపయెగపడ్డాయి. పట్టునిలుపుకోలేకపోయిన హస్త.. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఈసారి ఒక స్థానం పెంచుకొని మూడు స్థానాల్లో గెలిచింది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిందని పలువురు రాజకీయ విశ్లేశకులు అంటున్నారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవడం టీఆర్ఎస్కు కలసివచ్చింది. కూకట్పల్లిలో ఓడిన సుహాసిని కూకట్పల్లి నుంచి పోటీ చేసిన నందమూరి సుహాసిని టీఆర్ఎస్ అభ్యర్ధి మాదవరం కృష్ణారావు చేతిలో ఓటమి పాలయ్యారు. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సినీ హీరో ఎపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం చేసిన లాభం లేకపోయింది. బీజేపీ గతంలో ఒక్క స్ధానం గెలుచుకోగా ప్రస్తుత ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది. నియోజకవర్గం అభ్యర్ధి పార్టీ మేడ్చల్ సీ హెచ్ మల్లారెడ్డి టీఆర్ఎస్ మల్కాజ్గిరి మైనంపల్లి హన్మంతరావు టీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ కేపీ వివేకానంద టీఆర్ఎస్ కూకట్పల్లి మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్ ఉప్పల్ భేతి సుభాష్ రెడ్డి టీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ఎల్ బీ నగర్ దేవిరెడ్డి సుదీర్ రెడ్డి కాంగ్రెస్ మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ రాజేంద్రనగర్ టీ ప్రకాశ్ గౌడ్ టీఆర్ఎస్ శేర్లింగంపల్లి ఆరెకెపూడి గాంధీ టీఆర్ఎస్ చేవేళ్ల (ఎస్పీ) కాలె యాదయ్య టీఆర్ఎస్ పరిగి కొప్పుల మహేశ్ రెడ్డి టీఆర్ఎస్ వికారాబాద్ (ఎస్సీ) డాక్టర్ మెతుకు ఆనంద్ టీఆర్ఎస్ తాండూర్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ -
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో టీఆర్ఎస్ విజయదుంధుభి
సాక్షి, మహబూబ్ నగర్ : దక్షిణ తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోటలా ఉండేది. 2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్వాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచిన జిల్లాలో మాత్రం కాంగ్రెస్, టీడీపీలు తమ ఉనికిని చాటుకున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్(7) స్థానాలలో, కాంగ్రెస్(5) స్థానాల్లో, మిగిలిన రెండు స్థానాలను టీడీపీ గెల్చుకుంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ నుంచి గెల్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోగా, అదే పార్టీ నుంచి గెలిచిన ఎస్. రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మేల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కారెక్కారు. అసెంబ్లీ రద్దయ్యే నాటికి జిల్లాలో టీఆర్ఎస్ బలం 9 కి చేరుకోగా, కాంగ్రెస్ బలం ఐదు(5) గా ఉంది. అయితే కేసీఆర్ అత్యంత ఆత్మవిశ్వాసంతో 9 నెలల ముందుగానే అసెంబ్లీ రద్దు చేసి, ముందస్తుకు సిద్దమయ్యారు. జిల్లాలో ఉన్న మొత్తం 14 స్థానాలకుగాను 13 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. 2001 లో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి గెలవనీ స్ధానాలైన వనపర్తి, గద్వాల, మక్తల్,ఆలంపూర్, కల్వకుర్తి, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో సైతం టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసింది. అయితే జిల్లాలో వరుసగా ఎమ్మేల్యేగా గెలుస్తూ వస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం కొల్లాపూర్ కాంగ్రెస్ ఈభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై ఓడిపొయారు. జిల్లాలో కాంగ్రెస్కు దక్కిన ఏకైక స్థానం కూడా ఈ మంత్రి ఇలాకానే కావడం విశేషం. నియోజకవర్గం పేరు అభ్యర్థి పార్టీ కొడంగల్ పట్నం నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ నారాయణపేట ఎస్ రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ దేవరకద్ర ఆల వేంకటేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ మక్తల్ చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ మహబూబ్నగర్ శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ వనపర్తి సంగిరెడ్డి నిరంజన్ రెడ్డి టీఆర్ఎస్ నాగర్ కర్నూల్ మర్రి జనార్థన్ రెడ్డి టీఆర్ఎస్ జడ్చర్ల సీ లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ షాద్నగర్ వై అంజయ్య యాదవ్ టీఆర్ఎస్ అలంపూర్ ఆబ్రాహాం టీఆర్ఎస్ అచ్చంపేట్ గువ్వల బాల్రాజ్ టీఆర్ఎస్ కల్వకుర్తి జీ జైపాల్ యాదవ్ టీఆర్ఎస్ కోల్లాపూర్ బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టీఆర్ఎస్ -
కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపిన ‘మా’
రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో విజయ పతాకాన్ని ఎగురవేసిన టి.ఆర్.ఎస్. అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావును మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అభినందించింది. అందరి అంచనాలను మించి అఖండ విజయాన్ని రెండోసారి కూడా సాధించిన ఘనత కె.సి.ఆర్.కు దక్కిందని 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. టి.ఆర్.ఎస్. ప్రభుత్వం చిత్రసీమ అభివృద్ధి కోసం ఎంతో కట్టుబడి ఉందని, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారిని, ఎఫ్.డి.సి. ఛైర్మన్ రామ్మోహనరావు గారిని ఎప్పుడు ఏ పని నిమిత్తం కలిసినా ఎంతో సహకరించారని ఆయన చెప్పారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా తమ ముందు ఓ పెద్ద బాధ్యత ఉందని, గోల్డేజ్ హోమ్ నిర్మాణాన్ని ఈ కార్యవర్గం ఉండగానే ప్రారంభించాలను కుంటున్నామని శివాజీరాజా తెలిపారు. అందుకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు, కె.టి.ఆర్., హరీశ్ రావు, కవిత, తలసాని శ్రీనివాస యాదవ్ గార్ల సహకారం లభిస్తుందని భావిస్తున్నామని అన్నారు. తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'గోల్డ్ ఏజ్ హోమ్'ను కేసీఆర్ సహకారంతో ప్రారంభిస్తామన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పిన ఫిగర్ ను రీచ్ కావడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, చెప్పి మరీ కేసీఆర్ మ్యాజిక్ ఫిగర్ ను దాటి భారీ మెజారిటీ సాధించారని 'మా' కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. సినీ ప్రముఖుల సహకారంతో, ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ లో గోల్డ్ ఏజ్ హోమ్ ను ప్రారంభించాలను కుంటున్నామని, తెలంగాణ ప్రభుత్వం సైతం తమ వంతు సహకారం అందిస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.