
సాక్షి, గుంటూరు : రాష్ట్రవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు దౌర్జన్యాలతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. యధేచ్ఛగా ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తూ... రిగ్గింగ్లు, వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్లను బెదరించడమే కాకుండా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓటు వేసేందుకు క్యూ లైన్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేశారు. మరోవైపు పెదకూరపాడులోనే ఇదే పరిస్థితి నెలకొంది.
కోడ్ ఉల్లంఘించిన నారా లోకేష్
ఏపీ ఐటీ శాఖ మంత్రి, మంగళగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారు. కాజా పోలింగ్ కేంద్రం వద్ద ఆయన క్యూలైన్లో నిలబడ్డ ఉన్న ఓటర్లతో మాట్లాడారు. అంతేకాకుండా పదిమంది అనుచరులతో కలిసి పోలింగ్ బూత్లోకి వెళ్లారు. అయితే పోలీసులు మాత్రం ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
పోలీసుల సమక్షంలో టీడీపీ రిగ్గింగ్
చిలకలూరిపేటలోనూ టీడీపీ శ్రేణులు రిగ్గింగ్కు పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే పోలింగ్ బూత్ వద్ద రిగ్గింగ్ చేస్తున్న వీడియో దృశ్యాలను వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బయటపెట్టారు. బూత్ బయట పోలీసులు కాపలాగా ఉండి మరీ రిగ్గింగ్ చేసుకునేందుకు సాయం చేయడాన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నిలదీశారు. దీంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అక్కడ నుంచి పంపించేశారు.
Comments
Please login to add a commentAdd a comment