
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో ప్రగతి భవన్ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎక్కడి అక్కడ అదుపులోకి తీసుకుంటారు. మరికొందరు నేతలను హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాత్రం పోలీసులను బురిడి కొట్టించారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ వారిని తోసుకుంటూ ఇంటి బయటకు వచ్చారు. అక్కడి నుంచి వేగంగా ముందుకు సాగిన రేవంత్.. అక్కడి నుంచి బైక్పై వెళ్లిపోయాడు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నారు. బైక్పై దూసుకొచ్చిన రేవంత్ను ప్రగతి భవన్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ప్రగతిభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పరిస్థితులు కొనసాగితే.. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు. ప్రగతి భవన్ గేట్లను తాకుతామని అన్నామని.. తాకి చూపించామని చెప్పారు.