
సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. లేని సెలెక్ట్ కమిటీకి తాము పేర్లు పంపడం ఏంటని ప్రశ్నించారు. మంగళవారం ఆయన విజయవాడలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థి యువజన జేఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలంటే సభ్యుల అభిప్రాయం తీసుకొని ఓటింగ్ పెట్టాలని.. అవేవి లేకుండా ప్రతిపక్ష పార్టీలు పేర్లు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు.
సభలో టీడీపీకి నలుగురు సభ్యులు ఎక్కువ ఉన్నారని ప్రభుత్వ బిల్లులను అడ్డుకోవడం సరికాదన్నారు. శాసన మండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తల వ్యవహరించారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, లేదంటే ప్రజలే బుద్ది చెబుతారన్నారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను తాత్కాలిక అడ్డుకోగలరు కానీ శాశ్వతంగా అడ్డుకోలేరని సజ్జల అన్నారు.