
ఔరంగబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్సీపీ అధినేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూల్వామా తరహా ఉగ్రవాద దాడి జరిగితే తప్ప బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో గట్టెక్కలేదని, రాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంపై ప్రజలు ప్రతీకారంతో రగిలిపోతున్నారని అన్నారు.
‘లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత ఉన్నాయి. కానీ, పూల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరగడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’ అని ఆయన విలేకరులతో పేర్కొన్నారు. అదే తరహాలో మరో పూల్వామా దాడి జరిగితే తప్ప బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో గట్టెక్కబోదని పేర్కొన్నారు. బీజేపీ-శివసేన కూటమి నుంచి అధికారాన్ని తాము చేజిక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫడ్నవీస్ సర్కారు గత ఐదేళ్లలో ప్రజలకోసం చేసిందేమీ లేదని అన్నారు. ఎన్సీపీపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతోపాటు బహుజన్ వికాస్ అగాథి, సమాజ్వాదీ పార్టీ వంటి చిన్న పార్టీలతో జత కలిసి కాషాయ కూటమిని ఎదుర్కోబోతున్నామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment