
ఈ సారి అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో యువత కీలకపాత్ర పోషించనుంది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారి శాతం ఈ సారి గణనీయంగా పెరిగింది. యువ ఓటర్లు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. అందువల్ల ప్రధానరాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి బీజేపీ, కాంగ్రెస్తో పాటు అన్ని పార్టీలు సోషల్ మీడియాను ఉధృతంగా వాడుకుంటున్నాయి. పోస్టింగ్లు, కామెంట్లు, స్పూఫ్లతో ఎన్నికల హీట్ పెంచుతున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియా ప్రచారంతోనే ఎక్కువగా లబ్ధి పొందింది. ఇది గమనించిన కాంగ్రెస్ అప్పటినుంచి తాను కూడా సామాజిక మాధ్యమాల్లో దూకుడు పెంచింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా సోషల్ మీడియాలో జోరు ప్రదర్శిస్తున్నాయి. ఇరు పార్టీలు బూతుస్థాయి, డివిజన్ స్థాయి, నియోజకవర్గాల స్థాయి ఇన్చార్జ్లను నియమించి సైబర్ వార్ సెగలు రేపుతున్నారు. మరోపక్క సోషల్ వార్ శ్రుతిమించితే చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తోంది.
రాజస్థాన్..సైబర్ రణక్షేత్రం..
ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీ సోషల్ మీడియా వేదికగా గత అయిదేళ్లలో తామేం చేసామో చెప్పుకుంటోంది. ముఖ్యమంత్రి వసుంధర రాజె సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధిదారుల ఫోటోలు విస్తృతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలో వర్గపోరుని హైలైట్ చేస్తూ స్పూఫ్ వీడియోలతో దుమ్ములేపుతున్నారు. మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్ కూడా సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ప్రీ రికార్డెడ్ మెసేజ్లను సర్క్యులేట్ చేస్తున్నారు. ఇరు పార్టీలు యువ ఓటర్లను ఆకర్షించడానికి ఫాస్ట్ బీట్లో పాటలను కట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వసుంధరా రాజె, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్పైలెట్లను స్తుతిస్తూ ఈ పాటలు సాగుతున్నాయి. జై జై రాజె, జైజై రాజస్థాన్ అన్న పాట ఇప్పుడు హోరెత్తిపోతోంది. కొందరు కాంగ్రెస్ అభిమానులు సచిన్ పైలెట్ పాటలు కట్టి ప్రచారం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్లో సోషల్ వార్
మధ్యప్రదేశ్లో దాదాపుగా 1.5 కోట్ల మంది యువ ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 30శాతం మంది యువతే. వీరిని ఆకర్షించడానికి పార్టీలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను బాహుబలిగా చిత్రీకరిస్తూ ఒక స్ఫూఫ్ను బీజేపీ సైబర్ సైన్యం వదిలితే, కాంగ్రెస్ తానేం తక్కువ తినలేదంటూ దానికి కౌంటర్గా రాహుల్ను శివభక్తుడిగా చూపించే వీడియోను మర్నాడే పోస్టు చేసింది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ కావాలంటే సోషల్ మీడియాను ప్రభావం చేసే శక్తి అ«భ్యర్థులకు ఉండాలని మెలిక పెట్టింది. టిక్కెట్ కావాలనుకునే ఆశావహుల ఫేస్బుక్ ఫ్యాన్ పేజీలకు కనీసం 15 వేల లైకులు ఉండాలని , ట్విట్టర్లో 5 వేల మంది ఫాలోవర్లు ఉండాలని షరతులు విధించింది.
సైబర్ యోధులు ఏం చేస్తారు ?
సోషల్ మీడియా పోస్టులు రాజకీయంగా చూపే ప్రభావాన్ని విశ్లేషించడం, ప్రత్యర్థుల పోస్టులకు కౌంటర్లు ఇవ్వడం, ఫేక్ న్యూస్ని గుర్తించి వాస్తవాలను వెల్లడించే పోస్టులు సర్క్యులేట్ చేయడం, అధికార పక్షమైతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విçస్తృతంగా ప్రచారం చేయడం, సృజనాత్మక స్పూఫ్ వీడియోలు తయారు చేయడం, పోస్టులు, వీడియోలు వైరల్ అయ్యేలా చూడడం చేస్తుంటారు.
కరపత్రాలతో పనిలేదు.. కాక రేపే ఒక్క కామెంట్ చాలు. ఫ్లెక్సీలు పెట్టాల్సిన అవసరం లేదు.. ఫేస్బుక్లో ఒక్క పోస్టు చాలు. డజన్ర్యాలీలు, అరడజన్ సభల కన్నా సోషల్ మీడియాలో ప్రచారం లాభసాటిగా మారింది. అందుకే ప్రతి పార్టీ ప్రస్తుతం సోషల్ మీడియాకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
అమిత్ మాలవీయ,బీజేపీ ఐటీ సెల్ చీఫ్
అయిదు రాష్ట్రాల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని సమన్వయం చేస్తూ ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏయే అంశాలపై ట్వీట్లు చేయాలో, రాజకీయంగా సోషల్ మీడియాను ఎలా వినియోగించుకోవాలో వ్యూహాలు రచిస్తారు.
దివ్య స్పందన, కాంగ్రెస్ ఐటీ సెల్ ఇన్చార్జ్
రమ్యగా సుపరిచితురాలైన కన్నడ నటి దివ్యస్పందన కాంగ్రెస్ సోషల్ మీడియాకి నేతృత్వం వహించాక సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీ దూకుడు పెరిగింది. కాక రేపే కామెంట్స్, పోస్టులతో వార్తల్లో నిలిచారు. అయితే మోదీని దొంగగా అభివర్ణిస్తూ ఆమె చేసిన ట్వీట్ వివాదం రేపింది. ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. మరో నేత నిఖిల్ అల్వా రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ను చూస్తూ ప్రభుత్వ వైఫల్యాలపై ట్వీట్లు పెడతారు. నిఖిల్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ ఆల్వా కుమారుడు.