
సాక్షి, హైదరాబాద్: ‘వాక్ విత్ జగన్’ కార్యక్రమాన్ని ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరగకుండా నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఈ నెల 29న నెల్లూరు జిల్లాలో 1,000 కి.మీ. మైలురాయి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టాలని కోరారు.
ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుతూ 29న పార్టీ నేతలు కొండా రాఘవ రెడ్డి యాదాద్రి జిల్లా యాదగిరి గుట్ట వద్ద, మతీన్ ముజాద్దీన్ నాంపల్లి దర్గా వద్ద, జి. రాంభూపాల్ రెడ్డి గద్వాల్ జిల్లా జోగుళాంబ దేవాలయం వద్ద, జి. మహేందర్ రెడ్డి వరంగల్ జిల్లా భద్రకాళి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేస్తారని ఆయన తెలిపారు. కె.శివకుమార్ రంగారెడ్డి జిల్లాలో జరిగే కార్యక్రమాల్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు ముందుండి నడిపించాలని శ్రీకాంత్రెడ్డి కోరారు.
నగరంలో లోటస్పాండ్ నుంచి: హైదరాబాద్లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం లోటస్పాండ్ నుంచి పెద్దమ్మ గుడి వరకు నిర్వహించే వాక్ విత్ జగన్ కార్యక్రమాన్ని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారని వైఎస్సార్సీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్రెడ్డి చెప్పారు. ఈ పాదయాత్రలో గ్రేటర్ హైదరాబాద్ అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment