
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి కేబినెట్లోనే మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవి ఇవ్వడం పట్ల వైఎస్సార్సీపీ నేత మహ్మద్ ఇక్బాల్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఓట్ల కోసం చివరలో మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో దొంగలు, బ్యాంక్ లూటీ చేసిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే.. జగన్ మాత్రం ఓడిపోయిన తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వలనే మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. వైఎస్ హయాంలో మైనార్టీలకు ఎలాంటి సంక్షేమం జరిగిందో సీఎం జగన్ సారథ్యంలో కూడా అలానే జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.