
బెంగళూరు తీరుమారలే
ప్లే ఆఫ్ అవకాశాన్ని కోల్పోయి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న బెంగళూరు జట్టు పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది.
బెంగళూరు: ప్లే ఆఫ్ అవకాశాన్ని కోల్పోయి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న బెంగళూరు జట్టు పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. శుక్రవారం కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 139 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో ఆ జట్టు విఫలమైంది. ఓపెనర్ మన్దీప్ సింగ్(40 బంతుల్లో 45) శుభారంభం అందించినా.. మిగిలిన వారు విఫలం కావడంతో 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. ఆర్సీబీ జట్టులో మన్దీప్తో పాటు డీవిలియర్స్(10 పరుగులు), నెగి(21 పరుగులు) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ, ఏఆర్ పాటిల్ చెరో మూడు వికెట్లు సాధించగా.. మ్యాక్స్వెల్, ఎమ్ఎమ్ శర్మలకు రెండేసి వికెట్లు దక్కాయి.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కింగ్స్ పంజాబ్ ఆది నుంచి తడబడింది. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(1), మార్టిన్ గప్టిల్(9)లు తీవ్రంగా నిరాశపరిచారు. వీరిద్దరూ 18 పరుగులకే పెవిలియన్ కు చేరడంతో కింగ్స్ పంజాబ్ కష్టాల్లో పడింది. అయితే షాన్ మార్ష్(20;17 బంతుల్లో 3 ఫోర్లు),మనన్ వోహ్రా(25;28 బంతుల్లో 1ఫోర్,1సిక్స్), వృద్ధిమాన్ సాహా(21;25 బంతుల్లో 1 ఫోర్) ఫర్వాలేదనిపించడంతో తిరిగి తేరుకుంది. ఇక చివర్లో అక్షర్ పటేల్(38 నాటౌట్;17 బంతుల్లో3 ఫోర్లు,2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో అంకిత్ చౌదరి, చాహల్లు చెరో రెండు వికెట్లు సాధించగా, ఎస్ అరవింద్,షేన్ వాట్సన్, పవన్ నేగీలు తలో వికెట్ తీశారు.